27, డిసెంబర్ 2017, బుధవారం

ముగ్ధమందారం - కవిత



నా చిత్రానికి Anu Sree కవిత

ముగ్థమందారపు అందాలమోము
ముంగురుల అలల తేలే వేళ......
ముసినవ్వుల సింగారం మెత్తగా
మురిపించే పెదవుల రువ్వు వేళ...
ముసురుకున్న కలలన్నీ కన్నుల్లో చేరి
మూసి ఉన్న రెప్పల్లో మెదులు వేళ...
ముడిపడిన జడను ఒదగలేని విరులన్నీ
ముంచుకొచ్చే సిగ్గులల్లే బుగ్గల్లో చేరువేళ..
ముసుగు విడని మనసు బిడియాల ఒడిచేరి
ముచ్చటైన కాంతిలా మెరిసేటి వేళ...
మూగబోయిన రాగ మాలిక తీరు
ముత్యాల జల్లు మదిని కురిసేను ఈవేళ..
అనూశ్రీ...

26, డిసెంబర్ 2017, మంగళవారం

చిరునవ్వుకు సిగ్గేసి - కవిత రచన : అనుశ్రీ


'@[100002637341011:2048:Pvr Murty] గారి చిత్రం..

చిరునవ్వుకు సిగ్గేసి
అరచేతుల దాగింది...

బుగ్గల్లో కెంపురంగు
కన్నుల్లో మెరిసింది....

ఓపలేని బిడియాలు
చీరచెంగు ముడిని చేరి..

చిటికెడంత చిలిపితనం
చక్కదనమై నవ్వుతోంది...

సంతోషాల సమయాన
నేనెదురుచూచు తరుణాన..

యదలోని నీరూపం
ఎదురుగా నిలవగా...

ఆనందాల వెల్లువై
మురిసిపోతోంది మానసం...!!

     అనూశ్రీ...'
Pvr Murty గారి చిత్రం..

చిరునవ్వుకు సిగ్గేసి
అరచేతుల దాగింది...

బుగ్గల్లో కెంపురంగు
కన్నుల్లో మెరిసింది....

ఓపలేని బిడియాలు
చీరచెంగు ముడిని చేరి..

చిటికెడంత చిలిపితనం
చక్కదనమై నవ్వుతోంది...

సంతోషాల సమయాన
నేనెదురుచూచు తరుణాన..

యదలోని నీరూపం
ఎదురుగా నిలవగా...

ఆనందాల వెల్లువై
మురిసిపోతోంది మానసం...!!

అనూశ్రీ...

20, డిసెంబర్ 2017, బుధవారం

ప్రియతమా .....నీ నవ్వు .- కవిత




సోదరి Velamuri Luxmi నైరాశ్యపు కవితకి నా పెన్సిల్ చిత్రం.

ప్రియతమా .....నీ నవ్వు .

" అంతే లేని ఆలోచన సాగి పోయింది ......
ఏదో రహస్యం నన్నావరించుకుంది .....
ఏమీ తోచక భయంతో కళ్లు మూసుకున్నాను .....
అపుడు ...నీ నవ్వు ....నా గుండె క్రింద వినపడింది .....
రెప్ప రెప్పనీ తడిపింది .....కన్నీటి చుక్క... 
నాకే ఎరుగని నా మనస్సు నాలోనే చెదిరింది ....
ఆకాశపు అంచులో ...వొంపులో ....ఆర్ద్రత వెనుక ....
క్షితిజ రేఖపై నీ నవ్వు వినిపించింది .....
పాతాళ లోకాల్లో ...ప్రతిధ్వనించ సాగింది ......
అంధకారపు సంద్రానికి ఆవలి వొడ్దున నీ రూపం .....
అస్పష్టంగా అగుపించింది ....అగుపించింది .....
అందుకో లేని నిన్ను నా చూపు ఆశగా ..ఆశగా చూసింది ....
తరతరాల నిస్ప్రుహ నన్నావహించింది .....
నాకే తెలియని రహస్యం నన్ను తన వశం చేసుకుంది ......
నిదురలో ..కంటికొస నుంచి కన్నీటి చుక్క రాలినట్టుగా .....
నా.....కలం లోంచి ....శిరా జాలువారుతోంది .....
ఏవో సవ్వడులు నాలో నాకే వినిపిస్తున్నాయి .....
మ్రుత్యువనే .....మైదానం ...పిలుస్తోంది .....
నిన్ను విడచి మనస్సు రానని మొరాయిస్థొంది .....
ఒక వెన్నెల బిందువు కొబ్బరి మొవ్వలోకి జారింది .....
ఆ నాటి తీపి గురుతులు ....గురుతొస్తున్నాయి ..మేమున్నామంటూ ....
ఆ నాటి స్వప్న వంశీ రవమ్ములు వినిపిస్తున్నాయి .....
మనం నడచిన దారికీ తెలుసు ...
మనం చెప్పుకున్న రహస్యాలు .....
విచ్చుకుంటున్న మల్లెలకూ తెలుసు....
మన గుస గుసలు .....
వూరి చివరనున్న మామిడి తోపుకూ తెలుసు..... 
మనం దాని క్రింద కూచుని కన్న కలలు .....
మన ఇంటివెనుక నున్న గన్నేరు చెట్టుకూ తెలుసు .....
సంజె కెంజాయల ముసురులలో .....
కలిసిన మన పెదవుల నిశ్వాసాలు .....
ఎక్కడ ప్రియతమా ....వుమర్ ఖయ్యాం రుబాయీలు .....
ఎక్కడ గాలిబ్ గీతాల్లాంటి ....ప్రేమ పలుకులు ......
ఎవరు హరియించారు ప్రియతమా ......
నాటి హేమంత శైత్యానికి .....కాదు ...
నీ నిరాకరణ పైత్యానికి ....గడ్డ కట్టిన నా మనస్సు .....
కేవలం ......నాటి వసంత విహారాలు ....
తలచుకుంటూ .......అవైనా మిగిలాయని ....
ఒక్క జీవ కణం రగిలి త్రుప్తి పడుతోంది .....నా మనస్సు.... 
పగిలిన నా హ్రుదయం.... 
కానీ నీ నవ్వు ....నా గుండెని చీలుస్తోంది ....
ప్రియతమా ....ఎంత నిర్దయ....."

4, డిసెంబర్ 2017, సోమవారం

శశికపూర్ - Sashi Kapoor



శశికపూర్ - నా పెన్సిల్ చిత్రం

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు శశికపూర్‌(79) కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన కోకిలాబెన్‌ ధీరూభాయి అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం చనిపోయారని కుటుంబసభ్యులు తెలిపారు. పాతతరం కథా నాయకుడు పృథ్వీరాజ్‌ కపూర్‌ మూడో కుమారుడే శశికపూర్‌. 1938 మార్చి 18న జన్మించిన శశికపూర్‌ నాలుగేళ్ల వయసులోనే నటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. 1961లో ధర్మపుత్ర సినిమాలో హీరోగా ప్రస్థానం ప్రారంభించిన శశికపూర్‌ 116 చిత్రాల్లో నటించారు. బాలీవుడ్‌ లవర్‌బాయ్‌గా70, 80వ దశకాల్లో ఆయన పేరు మారుమోగిపోయింది. దీవార్, కభీకభీ, నమక్‌హలాల్, కాలాపత్తర్‌వంటి సినిమాలు చిత్ర సీమలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చేశాయి. 2015లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్న ఆయనను కేంద్ర ప్రభుత్వం 2011లో పద్మభూషణ్‌తో గౌరవించింది. కపూర్ వంశంలో పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్‌ తర్వాత దేశంలోని అత్యుత్తమ సినీ పురస్కారాన్ని పొందిన వ్యక్తిగా ఓ ఖ్యాతిని సంపాదించుకొన్నారు.బాలీవుడ్‌లో ఎదురులేని సినిమా సామ్యాజ్యాన్ని స్థాపించిన కపూర్ల వంశంలో పుట్టినప్పటికీ.. శశికపూర్‌కు హీరోగా నిలదొక్కుకునేందుకు నానా కష్టాలు పడ్డారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. ఓ దశలో ఫ్లాప్ హీరో‌గా ముద్ర పడ్డారు. హీరోయిన్ నందాతో కలిసి నటించిన జబ్ జబ్ పూల్ ఖిలే చిత్రంతో బ్లాక్‌బస్టర్‌గా కావడంతో శశికపూర్ వెనుదిరిగి చూసుకోలేదు.

అమితాబ్‌తో కలిసి.. బిగ్ బీ అమితాబ్‌తో శశికపూర్ కలిసి నటించిన చిత్రాలు బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దీవార్‌లో ఆయన పోషించిన ఇన్స్‌పెక్టర్ పాత్రకు అనూహ్యమైన గుర్తింపు లభించింది. నమక్ హలాల్ చిత్రంలో కూడా మంచి ఘన విజయం సాధించింది. ఓ సందర్భంలో అమితాబ్‌కు ధీటుగా ‘మేరే పాస్ మా హై' అని దీవార్‌లో చెప్పిన డైలాగ్ దేశవ్యాప్తంగా మారు మోగింది. ఇప్పటికి ఆ డైలాగ్ ప్రేక్షకుల నోట వినిపిస్తూనే ఉంటుంది. దీవార్ చిత్రంలో అద్భుతమైన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు అవార్డును అందుకొన్నారు.
* అమితాబ్‌ బచ్చన్‌కు సోదరుడి పాత్రలో శశికపూర్‌ ఎక్కువ చిత్రాల్లో నటించారు. ‘దివార్‌’, ‘సుహాగ్‌’, ‘దో ఔర్‌ దో పాంచ్‌’, ‘నమక్‌ హలాల్‌’ వంటి సిల్వర్‌ జూబ్లీ సినిమాల్లో శశికపూర్‌ తనదైన నటన కనబరిచారు. ఆ సినిమాల్లో అమితాబ్‌తో సమానమైన పేరును తెచ్చుకున్నారు. అయితే 1981లో వచ్చిన ‘సిల్‌సిలా’ చిత్రంలో మాత్రం శశికపూర్‌కు తమ్ముడిగా అమితాబ్‌ నటించడం విశేషం.
* ‘దీవార్‌’లో ‘తుమ్హారే పాస్‌ క్యా హై’ అని అమితాబ్‌ వేసిన ప్రశ్నకు‘మేరే పాస్‌ మా హై’ అని శశికపూర్‌ చెప్పిన చిన్న డైలాగ్‌ దేశ వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించింది.

* తండ్రి స్థాపించిన ‘పృథ్వీ థియేటర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌గా, నటుడిగా పనిచేస్తున్న రోజుల్లో జెన్నిఫర్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. జెన్నిఫర్‌ తండ్రికి ఇష్టం లేకపోయినా 1958లో ఇరువురు ఒక్కటయ్యారు.

* తాను నటించే ప్రతీ పాత్ర ఎంతో విభిన్నం చేయాలని తపన పడేవారు శశికపూర్‌లో ‘అభినేత్రి’లో ఆయన పాత్రను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు.

* నటుడిగా తన కెరీర్‌ను కొనసాగిస్తూనే శ్యామ్‌బెనగల్‌తో కలిసి కలియుగ్‌, జునూన్‌ చిత్రాలు, అపర్ణాసేన్‌తో కలిసి ‘36 చౌరంఘీలేన్‌’ సినిమాలను నిర్మించారు. గిరీష్‌ కర్నాడ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఉత్సవ్‌’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

* కేవలం జాతీయ నటుడిగానే కాకుండా అంతర్జాతీయ నటుడిగానూ శశికపూర్‌ పేరు గడించారు. మొత్తం 12 హాలీవుడ్‌ చిత్రాల్లో ఆయన నటించారు. 1998లో ఆయన నటించిన చివరి చిత్రం, హాలీవుడ్‌ చిత్రం ‘సైడ్‌ స్ట్రీట్స్‌’.



మౌనాలెన్నో భాషిస్తున్నాయి మదిలో - కవిత





నా చిత్రానికి అనుశ్రీ (facebook) అల్లిన కవిత.


మౌనాలెన్నో భాషిస్తున్నాయి మదిలో
కవనాలెన్నో స్పురిస్తున్నాయి యదలో

నును సిగ్గుల వాలుతున్న కనురెప్పలు
ముసినవ్వులు రువ్వుతున్న పెదవంచులు
సింధూరమై అద్దుకున్న మధురోహలు
అందమైన అనుభూతుల తేలుతుంటే....

ఆలోచనల ఆనవాళ్ళుగా రూపుదిద్దుతూ
ఎదుట నిలుపలేని హావభావాల కథనాలు
మధురాక్షరాలతో అందంగా జోడించుతున్నా
తొణికే ప్రతీ ఊసునీ నీ ముందు నిలపాలని..

మనసులోని మంతనాలతో మురిపించగా
నీ పెదవులపై చిరునవ్వుల పూయించుతూ
పదిలంగా నీ మనోఫలకంపై ప్రచురించగా
పదికాలాలు నీస్మృతినై నేను నిలిచి ఉండగా

28, నవంబర్ 2017, మంగళవారం

వృధ్ధాప్యం

ఓ వృధ్ధుని ఆవేదనకి నా పెన్సిల్ చిత్రం.
చిన్నా,
అలసిపోయాను. నీరసపడిపోయాను. ముసిలివాణ్ణి, దయచేసి అర్ధం చేసుకో. బట్టలు వేసుకోవడం కష్టం. తువ్వాలేదో చుట్టపెట్టుకుంటాను. గట్టిగా కట్టుకోలేను. అందుకే అది తొలగిపోతుంటుంది. కసురుకోకు. అన్నంతింటున్నప్పుడు చప్పుడు అవుతుంది. చప్పుడుకాకుండా తినలేను. అసహ్యించుకోకు. నీ చిన్నతనంలో నువ్వుకూడా ఇంతే. గుర్తు తెచ్చుకోరా ! బట్టలు సరిగ్గా వేసుకునేవాడివి కాదు. అన్నం కూడా అంతే. పెద్దగా శబ్దం చేస్తూ క్రిందామీదా పోసుకుంటూ తినేవాడివి. ఒకే విషయాన్ని పదేపదే చెప్తుంటాను. విసుక్కోకు. స్నానం చెయ్యడానికి ఓపిక ఉండదు. చెయ్యలేను. తిట్టకు. నువ్వుకూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్పించేవాడివో గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేను. విసుక్కోకు.
కీళ్ళ నొప్పులు. నడవలేను. ఊత కర్ర నాతోనే ఉండాలి. లేనప్పుడు నీ చేయి అందించి నడిపించు. నీకు నడక వచ్చేంతవరకూ అలాగే నేను నిన్ను వేలుపట్టుకుని నడిపించాను. అందుకేనేమో ముసిలివాళ్ళు పసిపిల్లలతో సమానమంటారు. ఏదో ఒకరోజు "నాకు బతకాలని లేదు చనిపోవాలని ఉంది" అని అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకు. అర్ధం చేసుకో. ఈ వయస్సులో ఇంక బతకాలని ఉండదు. అయినా బతకక తప్పదు. ముసిలి కంపు కొడుతున్నానని అసహ్యంగా చూడకు. దగ్గరగా తీసుకుని కూర్చో. చిన్నప్పుడు నువ్వు ఎలాగున్నా నేను అలాగే దగ్గరకి తీసుకునేవాణ్ణి. నువ్వు అలా తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతానురా!

17, నవంబర్ 2017, శుక్రవారం

అలనాటి ప్రయాణాలు.

అలనాటి ప్రయాణ దృశ్యం - 
మగని చేతిలో ట్రంకుపెట్టె, చంకలో 'బెడ్డింగు' (హోల్డాల్ అని కూడా అని అనేవారు), మగనాలి చేతిలో 'మరచెంబు' తప్పని సరి. ( 'శంకరాభరణం' చిత్రంలో ప్రేమికుల ప్రేమ చిహ్నం ఈ 'మరచెంబు') . ఆదరాబాదరాగా ఏ చేతి రిక్షాలోనో స్టేషను వరకూ వస్తే ఆ పాసెంజరు బండి కాస్తా గంటలతరబడి ఆలస్యంగా నడిచే రోజులు ఇప్పటికీ నాకు గుర్తు. భానుమతి గారు రాసిన అత్తగారికథల్లో మొత్తం కనిపించేది మరచెంబే. 'బాపు' గారు వేసిన అలనాటి ఓ illustration లో బొమ్మని re-create చేసి రంగులద్ది మా చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నాను.

కూటికొరకు కోటి విద్యలు


కూటికొరకు కోటి విద్యలంటారు. ఇదొక 'rural marketing' అని చెప్పుకోవచ్చునేమో. రోజూ ఓ మోపెడ్ మీద వీటిని కట్టి ఇంటింటికీ తిరిగి, (ముఖ్యంగా గ్రామాల్లో) , ఈ రతహా గృహోపకర వస్తువులు వ్యాపారం చేస్తుంటారు. వీటిల్లో మిక్సీలు, ప్రెషర్ కుక్కర్లు, fans, ప్లాస్టిక్ బిందెలు, స్టీలు బిందెలు, plastic చాపలు, వగైరా వగైరా వస్తువులన్నీ ఉంటాయి. show-rooms లో లభించే branded products వీరు అమ్మరు. వీటిని సులభ వాయిదా పధ్ధతిల్లో గ్రామీణ గృహిణులకు అమ్ముతుంటారు. ఈ తరహా వ్యాపారస్థులకు అధిక వడ్డీకి finance చేసే వ్యక్తులుంటారు. దీనిని ఈ వ్యాపారస్థులు 'daily finance' అని వ్యవహరిస్తుంటారు. వీరిని చూస్తే 'జీవనోపాధి' కి ఎన్ని మార్గాలో అనిపిస్తుంది.

8, నవంబర్ 2017, బుధవారం

ద్వారం వేంకటస్వామి నాయుడు


కళాతపస్వి, పద్మశ్రీ వాయులీన విద్వాంసుడు ద్వారం వేంకటస్వామి జయంతి నేడు. "ఉజ్వల సువర్ణ సంకలితోన్నత శబ్దద్వారము/తెరచి పరబ్రహ్మమును ప్రత్యక్షము చేయింపగా/భూలోకమునకు వచ్చిన పుంభావసరస్వతి/గాంధర్వయోగి'' అని పలువురిచే కొనియాడబడిన 'ఫిడేలు నాయుడు' గారికి నా నివాళి (My pencil sketch)

6, నవంబర్ 2017, సోమవారం

సంజీవ్ కుమార్ - Sanjeev Kumar



తనదైన శైలిలో హిందీ చిత్రసీమని అలరించిన అద్భుత నటుడు. తన స్వల్ప జీవితకాలంలో ఎన్నొ పురస్కారలు సొంతం చేసుకుని అగ్ర తారల స్థాయిని చేరుకున్న నటుడు.

24, అక్టోబర్ 2017, మంగళవారం

S. Rajeswara Rao - సాలూరు రాజేశ్వరరావు

Tribute to S. Rajeswara Rao, the doyen of Telugu film music world on his death anniversary today. (My pencil sketch).
స్మృత్యంజలి
సాలూరు మండలం శివరామపురం (విజయనగరం జిల్లా) లో జన్మించిన సాలూరు రాజేశ్వరరావు తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించి, తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకులలో ఒకడు గా నిలిచారు. ఎన్నో అజరామరమైన వెండితెర వెలుగులకు సంగీతపు మధురిమలు అందించినవారిలో ఆయనకు ప్రత్యేక స్థానముంది.
సాలూరి కిరీటంలో కలికితురాయి మల్లీశ్వరి (1951). సినిమా సంగీతంలోను, సినిమా తీసే పద్ధతిలోను గణనీయమైన మార్పులు చెందినా, అర్ధ శతాబ్దం తర్వాతకూడా నేటికీ గల గలా ప్రవహించే నదిలా వీనులవిందు గొలుపుతున్న సాహిత్య సంగీతాల మేళవింపు “మల్లీశ్వరి”. బి.ఎన్‌.రెడ్డి కార్యదక్షతతో, దేవులపల్లి మల్లెపూరేకు బరువుతో వ్రాసిన సాహిత్యంతో, పసుమర్తి కృష్ణమూర్తి నృత్య సారధ్యంతో, ఘంటసాల భానుమతిల గళ మధురిమతో యీ చిత్రంలోని సంగీతం తక్కిన అన్ని హంగుల మాదిరిగానే నభూతో నభవిష్యతి. దీనిని మించిన సంగీతభరితమైన చిత్రం ఇంతవరకు రాలేదు, ఇక ముందు కూడా రాబోదని దృఢంగా విశ్వసించే చాలామంది వున్నారు. సాలూరే “మల్లీశ్వరి” పై వ్యాఖ్యానిస్తూ "చంద్రలేఖ" కథకు ఒక కాలం అంటూ లేదు కనుక అన్నిరకాల సంగీతం వినిపించడానికి అవకాశం కలిగింది. కాని, “మల్లీశ్వరి” చరిత్రకు సంబంధించిన చిత్రం. అటు కథాకాలానికి, ఇటు కాస్త ఆధునికంగానూ వుండేలా సంగీతం కూర్చవలసి వచ్చింది. శాస్త్రీయ రాగాలను తీసుకొని, సెమిక్లాసికల్‌ గా స్వరపరిచాను. అలాగే అందులోని ఏ పాటా కూడా ట్యూన్‌కి రాసింది కాదు! బి.ఎన్‌.గారికి సంగీతాభిరుచి ఎక్కువ కావడంతో ఒక్కో పాటకు ఐదారు వరసలు కల్పించవలసి వచ్చింది. ఆ చిత్రానికి మొత్తం ఆరునెలలపాటు మ్యూజిక్‌ కంపోజింగ్‌ జరిగింది" అన్నాడు.

24, సెప్టెంబర్ 2017, ఆదివారం

మధురవాణి - కన్యాశుల్కం

నా రేఖలు రంగుల్లో గురజాడ వారి అపూర్వ సృష్టి 'కన్యాశుల్కం' లో మధురవాణి. రంగులు లేని బాపు గారి రేఖా చిత్రం నా రేఖలు రంగుల్లో ఇలా రూపు దిద్దుకుంది.

16, సెప్టెంబర్ 2017, శనివారం

విప్రనారాయణ - Akkineni Nageswara Rao


నా పెన్సిల్ చిత్రం - 'విప్రనారాయణ' గా అద్భుత నటన ప్రదర్శించిన అక్కినేని చిత్రం వేయాలనిపించింది. ప్రయత్నించాను. facebook లో మంచి స్పందన లభించింది. నా చిత్రాలను చూసి అభినందిస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు.

8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

ఆలోచనలు...ఆలోచనలు



కవిత courtesy : శ్రీమతి పొన్నాడ లక్ష్మి
ఆలోచనలు...ఆలోచనలు
అంతూ దరీ లేని ఆలోచనలు.

కన్నపిల్లల వ్యధలను తీర్చలేక
చేయూతనివ్వలేని అసహాయపు ఆలోచనలు..

ప్రమాదాలకు బలిఅయి, వందలాది ప్రయాణీకుల
హా..హా..కారాల తలపులతో ఆలోచనలు..

బోరుబావిలో పడి ఉక్కిరిబిక్కిరై, అయోమయావస్థలో
తుది శ్వాస విడిచిన చిన్నారుల గురించి ఆలోచనలు..

చెత్తకుండీలలో, మురుగు కాల్వలలో విసరివేయబడిన
పురిటికందుల ఆక్రందనలపై ముసురుకొనే ఆలోచనలు..

క్రూర రాక్షసుల కబంధ హస్తాలలో చిక్కుకొని, తమ
మాన ప్రాణాలను అర్పించుకున్న అబలల ఆర్తిపై ఆలోచనలు..

మందుమైకంలో దారితప్పి ప్రమాదాలకు గురై
తమని తామే ఆహుతి చేసుకుంటున్న యువతపై ఆలోచనలు..

వరద భీభత్సంలో సర్వం కోల్పోయి, నిలువనీడలేక
నిరాశ్రయులైన బడుగుజీవుల బతుకులపై ఆలోచనలు..

ఎవరినీ ఆదుకోలేక, ఆపన్న హస్తం అందించలేక.
జోరీగల్లా ముసిరే ఆలోచనలతో,
నిదుర లేని రాత్రులు ఎన్నో? ఎన్నెన్నో??

- పొన్నాడ లక్ష్మి

3, సెప్టెంబర్ 2017, ఆదివారం

బాపు బొమ్మ - నా రేఖలు రంగుల్లో చిత్రీకరణ

బాపు గారికి స్త్రీలు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం కాబోలు. నిజానికి స్త్రీలే పుస్తకాలు పఠించేవారు.  బాపు గారు అటువంటి చిత్రాలు వేసారు. నా సేకరణ లో కొన్ని ఉన్నాయి. అవి పాతపడడం వల్ల పాడయిపోయి. వాటిని మళ్ళీ చిత్రీకరించి రంగులు అద్దే ప్రయత్నంలో ఉన్నాను. ఈ చిత్రం కూడా అటువంటిదే.

30, ఆగస్టు 2017, బుధవారం

'బాపు' కి శ్రధ్ధాంజలి



నా కుంచెనుండి 'బాపు' గారి చిత్రం. వారికి నా శ్రధ్ధాంజలి.
బాపు గారు వేసిన చాలా చిత్రాలు చూసాను. ఆడపిల్లలు పుస్తక పఠనం లో ఆసక్తి చూపాలన్నట్లుగా చాలా బొమ్మలు నాకు కనిపించాయి. ఆడపిల్లలకి కూడా చదువు ముఖ్యం అన్న భావన వారి చిత్రాల్లో కనిపిస్తుంది.

28, ఆగస్టు 2017, సోమవారం

గిడుగు వెంకట రామ్మూర్తి - పెన్సిల్ చిత్రం



గిడుగు వెంకట రామ్మూర్తి - పెన్సిల్ చిత్రం
మిత్రులందరికీ 'తెలుగు భాషా దినోత్సవ' శుభాకాంక్షలు.
తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి (ఆగష్టు 29, 1863 - జనవరి 22, 1940) . గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాము. (వికీపీడియా నుండి సేకరణ)

21, ఆగస్టు 2017, సోమవారం

పునీతమైనదమ్మ పురుష జన్మా...





మగాడు మృగాడా .. ? (Courtesy : భరణి చిత్రలేఖ)
భరణి చిత్రలేఖ గారి ఆలోచన కి నా బొమ్మ. ఇంత మంచి రచన అందించినందుకు ఆమెకి నా అభినందనలు. శుభాశీస్సులు
"పునీతమైనదమ్మ పురుష జన్మా.....
ఆ జన్మకు పరిపూర్ణత ఇంటాయనమ్మా....!
ఔనూ......నాకర్థం కాక అడుగుతాను.. ఎందుకూ ఊరికే తప్పు చేసిన మగాళ్లను "మృగాళ్లు"...."క్రూర మృగాలు" అని ఆడిపోసుకుంటారు???
దీన్ని నేను ఆకురాయి మీద అరగంట సానబెట్టిన చురకత్తితో ఖండిస్తున్నా!!
జంతువులు జంతువులే! అవెలా కృూరమైనవి చెప్పండి.మనం దేవుని సృష్టిని నమ్మితే అవి శాకాహారులుగా కొన్ని..మాంసాహారులుగా కొన్ని సృష్టించబడినాయి.వేట వాటికి ప్రకృతి నిర్దేశించిన ధర్మం...అదీ ఆకలేసినపుడు మాత్రమే !
ఏ జంతువు మరొక
జంతువును "ఈవ్ టీజింగ్" చేసి కామెంట్లు చేసి ఏడిపించింది?
ఏ మృగం మరొక మృగంపై యాసిడ్ పోసి చావుకీ బతుక్కూ కాకుండా చేసింది?
ఏ మృగం కట్నకానుకల కోసం కిరసనాయిలు మీద పోసి తగలెట్టింది?
ఏ జంతువు మిగతా జంతువులను బలహీనమని ఎంచి వాటి మీద ఆధిపత్యానికి ఆరాట పడింది?
ఏ మృగం చూపులతో మాటలతో చేతలతో మరో జాతిని హింసించి పైశాచికానందం పొందుతుంది?
లేదే..మరెందుకు మృగాడూ అని పోలిక ...అవమానం కాకపోతే!!
వాళ్లని మృగాడూ అనే ముందు మరో యాంగిల్
ఏ జంతువు పక్కింటావిడ పచ్చని కాపురం చూసి కుళ్లి కుళ్లి ఏడ్చేది?
ఏ జంతువు దాని జాతికి అసూయే అలంకారమనే బిరుదు తెచ్చుకుంది?
ఏ జంతువు సూటిపోటి మాటలనాయుధాలుగా మలచి సాటి జంతువును హింసిస్తుంది?
ఏ జంతువు కూతురికి కోడలికి అల్లుడికి కొడుక్కి సెపరేట్ రూల్స్ పెట్టేస్తుంది?
ద్యావుడా!!? ఇన్ని లక్షణాలు మనలో పెట్టేసుకుని వాటి పేర్లతో తిట్టుకోడమేమీ??
కాబట్టి భరణీ..
క్రూర జంతువులూ మృగాలూ లేవు..కృూర మనుషులే ఉంటారు..
ఈ క్షణం నుండీ జీవితంలో ఎవరిని తిట్టాలనిపించినా లింగభేదంతో నిమిత్తం లేకుండా జంతువులతో పోలిక వాడనని...
సామాన్య జంతువులైన వాటిని అవమానించనని
సాంఘిక జంతువుగా....ఎదుటనున్న జిరాఫీ సాక్షిగా ప్రతిన బూనుతున్నాను !"

26, జులై 2017, బుధవారం

చిత్ర కందాలు

Pvr Murty గారి చిత్రానికి
చిత్ర కందాలు
*************
ఆరు గజాలున్న జరీ
చీరట ముచ్చటగ కట్టి చెంగున దోపెన్
జీరాడే కుచ్చీళ్ళే
పారాడే నేలపైన పడతికి సొబగై!! (!)
జుట్టును కొప్పుగ ముడిచెన్
గట్టున కూర్చొని దిగులుగ గడియను జూసెన్
తట్టిన మగని స్పర్శకు
గట్టిగ యేడ్చెను వలవల కళ్ళొత్తుకునెన్!! (2)
పంచు కొనిరంట పేగును
తెంచుకు పుట్టిన కొడుకులు తెలివగ యకటా!
కొంచెము కూడ మరి కనిక
రించక వేరు పరిచిరి రిమ్మ తెగులుతో !! (3)
పెద్దతనమందు పెట్టిరి
హద్దు యొకరినొకరు జూడ హయ్యో సుతులే
ముద్దన్నారట విడిగా
బుద్ధిగ నుండమని జెప్పె పోషణ కొరకై !!(4)
మగని తలచె ముత్తైదువ
దిగులు పడుచు నింగికేసి దిక్కులు జూసెన్
నగవులు లేవే మోమున
పగలు గడవదాయె రాత్రి వంటరి తనమే!! (5)
బ్రతుకు తమకు భారంగా
చితిమాత్రందూరమేల చింతలు పడగన్
కతికిన మెతుకులు గొంతున
గతకాల జ్ఞాపకాలు కలలై నిలిచెన్ !! (6)
వచ్చిన పెనిమిటి భార్యకి
నచ్చిన సీతా ఫలమును నౌజును పెట్టెన్
తెచ్చినది సగం చేసిన
నొచ్చుకునె మగడు తిననని నోరు తెరవకన్ !! (7)
మురిపెముతో లాలనగా
మరిమరి బతిమాలి పెట్టె మగనికి సతియే
యరమరికలు లేక వగచి
దరిచేరెను వృద్ధ జంట దైన్య స్థితిలో!! (8)
దావానలమును మింగుతు
చీవాట్లకు బెదరకుండ సేవలు చేయన్
చావైనా బ్రతుకైనా
యేవైనా యొక్క చోట యిద్దరు చేరెన్ !! (9)
హంసగీతి
20.7.17

15, జులై 2017, శనివారం

మదిభావం॥చిగురు సాక్ష్యం॥ - కవిత



నా పెన్ sketch కి శ్రీమతి Jyothi Kanchi కవిత.
మదిభావం॥చిగురు సాక్ష్యం॥
~~~~~~~~~~~~~~~~
ఎన్ని వసంతాలను చూసిందో
ఎన్ని హేమంతాల చలి కాచిందో
ఎన్ని వర్ణాలు దాల్చిందో
ఎన్ని వేదనలు తనలో దాచిందో
ఎన్ని ఆనందాలు మోసిందో
ఎన్ని అపస్వరాలను మరుగేసిందో
ఎన్ని భవబంధాల బీటలు పూడ్చిందో
ఎన్ని రాగద్వేషాలను కావడికుండలచేసిందో
ఎన్ని విత్తులను ఫలవంతం చేసిందో
ఎన్ని కత్తులమాటల మూటలు చూసిందో
రాలడానికి సిద్దంగా ఉందని అలుసుచేయక
పండుటాకే కదా అని పలుచన చేయక
"పండుటాకుకు అనుభవం ఎక్కువ"
కావాలంటే అడుగు
పక్కన మొలిచే చిరుచిగురే సాక్ష్యం.....!!
J K
(చిత్రం Pvr Murty బాబాయ్ గారు ...ధన్యవాదాలు బాబాయ్ )

14, జులై 2017, శుక్రవారం

నీ కోసం - కవిత

నీ కోసం - కవిత, courtesy : Sudha Rani

గుప్పెడంత గుండెను తడిమావు నువ్వనీ...
కనుల తడి వచ్చిందే నీకోసం
మౌనవీణ మధురంగా మీటావు నువ్వనీ....
హృదయ గీతం పాడుతున్నదీ నీకోసం
కనురెప్పల కౌగిలి అయ్యావు నువ్వనీ...
కనుపాపగా మార్చుకున్నదీ నీకోసం
ఆశల పల్లకి ఎక్కించావు నువ్వనీ....
దరహాసపూలు విరబూసాయి నీకోసం
వెన్నెలంత గుమ్మరించి అభిషేకించావు నువ్వనీ....
నా మనసు అర్పణ చేసాను నీకోసం
నేనున్నది నీకోసం....నువ్వున్నది నాకోసమని
నీ ఊసులకు నా చూపులనే ముడివేసా
విడిపోని బంధంగా....ప్రణయ రాగ మధురిమగా
అందమైన నా అంతరంగమా.....
పాడవే ఇక ఎప్పటికీ
'అతని' భావ గీతాన్నీ.......

11, జులై 2017, మంగళవారం

సి. యస్. ఆర్ ఆంజనేయులు - CSR Anjaneyulu


అలనాటి రంగస్థల,చిత్రసీమ నటులు శ్రీ Csr ఆంజనేయులు గారి జయంతి సందర్భంగా
శ్రీ Pvr Murty గారి అద్భుతమైన చార్ కోల్ స్కెచ్ నివాళి
నేను వ్రాసికొన్న పద్య నివాళి
అద్భుతంగా చిత్రించారు సార్👌🙏👌
ఆ.వె
శకుని పాత్రయందు చక్కగానిమిడియు
హావ భావ ములను హత్తి జూపి
చిరముగా నిలచిన 'సీయసారూ'నీకు
ప్రేక్షక హృదయాన పెద్ద పీట!!

(మిత్రులు, కవి శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారు రచించిన పద్యం. వారికి నా ధన్యవాదాలు)



నివాళి - అలనాటి అద్భుత నటుడు సీయస్సార్ (CSR Anjaneyulu) జయంతి నేడు - నా charcoal చిత్రం.
సి.యస్.ఆర్. ఆంజనేయులు (జూలై 11, 1907 - అక్టోబరు 8, 1963) తెలుగు సినిమా నటుడు.
గొప్ప నటులకి ఉండవలసిన లక్షణాలు మూడు: ఆంగికం (అందమైన రూపం), వాచకం (మంచి కంఠస్వరం), అభినయం (హావ భావాలతో ప్రేక్షకులని ఆకర్షించుకోగల సామర్థ్యం). ఈ మూడు లక్షణాలు మూర్తీభవించిన వ్యక్తి సి.యస్.ఆర్. ఆంజనేయులు. పూర్తి పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు. స్థానం నరసింహారావుతో సమ ఉజ్జీ అన్న ప్రశంశలు అందుకున్న నటుడు - ఇటు రంగస్థలం మీదా, అటు వెండి తెర మీదా. పదకొండేళ్ళ వయస్సులోనే ఆయన రంగస్థలం మీద రాణించాడు. ఆయన జీవించిన ఐదున్నర దశాబ్దాలలో చలనచిత్ర సీమని తన అపూర్వ వైదుష్యంతో ప్రభావితం చేసేడు. పదాలను అర్థవంతంగా విరిచి, అవసరమైనంత మెల్లగా, స్పష్టంగా పలకడంలో ఆయన దిట్ట. హీరోగా, విలన్‌గా, హాస్యనటుడి్‌గా విభిన్న పాత్రలకు జీవం పోసిన వాడు సీయస్సార్
జీవితం చిత్రంలో ఆయన నోట పలికించిన ఆ కాలంలో నేను కాలేజి చదువుకునే రోజుల్లో అనే డైలాగ్‌ అప్పట్లో అందరి నోట్లో తారకమంత్రలా నానుతుండేది. మధ్యవయస్సుల నుండి వృద్ధుల వరకూ ఎవరిని కదిపినా ఆ కాలంలో నేను కాలేజీ చదువుకునే రోజుల్లో అంటుండే వారు. జగదేకవీరుని కథలో హే రాజన్‌ శృంగార వీరన్‌ అంటూ సీఎస్స్‌ఆర్‌ చెప్పిన డైలాగ్‌లు, రాజనాలతో కలిసి ఆయన పండించిన కామెడీ మరచిపోవడం సాధ్యం కాదు. విజయావారి నవ్వుల హరివిల్లు అప్పుచేసి పప్పుకూడులో సీఎస్సార్‌ అప్పు అనే పదానికి కొత్త అర్థాన్ని నిర్వచించారు. వెయ్యి రూపాయిలు కావాలంటే పది మంది దగ్గరా పది వందలు తీసుకోవడం కంటే ఒక్కరి దగ్గిరే అప్పుతీసుకో. వడ్డీ తీరిస్తే సరి. అసలు చెల్లించినప్పటి మాట కదా అంటూ ఆయన చెప్పే డైలాగ్‌లు పడీపడీ నవ్విస్తాయి.
Source : Wikipedia

10, జులై 2017, సోమవారం

పీసపాటి నరసింహమూర్తి, ప్రముఖ రంగస్థల నటులు


నివాళి - కీ.శే. పీసపాటి నరసింహమూర్తి, ప్రముఖ రంగస్థల నటులు జయంతి సందర్భంగా నా పెన్సిల్ చిత్రం.
పీసపాటి నరసింహమూర్తి (జూలై 10, 1920 - సెప్టెంబర్ 28, 2007). తెలుగు నాటక రంగంపై శ్రీకృష్ణుడుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న నటుడు. పద్యగానంలో తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్న నటుడు.
పీసపాటి నరసింహమూర్తి, విజయనగరం జిల్లా బలిజిపేట మండలం, వంతరాం గ్రామంలో 1920, జూలై 10 న జన్మించాడు. ప్రారంభంలో వారు ఆకాశవాణిలో పనిచేశారు.
1938లో రంగూన్‌రౌడీ నాటకంలో కృష్ణమూర్తి పాత్ర ద్వారా పీసపాటి నాటకరంగంలోకి అడుగుపెట్టాడు. 1946లో పాండవోద్యోగ విజయాలు నాటకంలో మొదటిసారిగా శ్రీకృష్ణుడి పాత్ర వేశాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు రెండు పర్యాయాలు సంగీత నాటక అకాడమీలో సభ్యత్వం ఇచ్చి గౌరవించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1993లో ఆయనను కళాప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది. దాదాపు ఏడు దశాబ్దాలపాటు వేలాది ప్రదర్శనలు ఇచ్చిన పీసపాటి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. తిరుపతి వేంకటకవులు, విశ్వనాథ సత్యనారాయణ వంటివారు వీరిని ఎంతగానో అభినందించారు. ఎన్.టి.రామారావు గారు వీరి నటనను (కృష్ణ పాత్రను)చూసేవారు. (source : Wikipedia)

7, జులై 2017, శుక్రవారం

లతా మంగేష్కర్ - మధుర గాయని


నాలుగు సంవత్సరాల క్రిందట నేను వేసిన 'లత' బొమ్మ, ఆ చిత్రానికి మిత్రులు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ Vanam Venkata Varaprasadarao గారి చక్కని కవిత. fb వారు గుర్తు చేసారు.
మకరందములో మధురత మృదు మలయానిల కీలిత
మందాకిని గంభీరత మధుమాస మనోజ్ఞత
గమకములో గంగానది గమనపు శృంగారిత
గాఢముగా గుండెలలో ఊరించే ఆర్ద్రత
గాంధర్వ వేద నందనమున కుసుమించిన పూ లత
అచ్చముగా కచ్ఛపి పై ధ్వనియించు ధురీణత
కోకిల తను నాకిల తనకేనిల సరియను లత!
నా మది పలికేనది ప్రతిబింబము నువు బింబము !!! ..
Pvr Murty గారి 'లత'ను చూసినదగ్గరినుండీ పొద్దటి నుండీ మధురమైన కలత! ఏతత్ఫలితముగా మొలకెత్తిన కవితాలత!

4, జులై 2017, మంగళవారం

అల్లూరి సీతారామరాజు


స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుని పెన్సిల్ చిత్రం.

3, జులై 2017, సోమవారం

ఎస్వీ రంగారావు - SV Rangarao



కం.
రంగైన విగ్రహంబున్,
బొంగుదు రెవరైన గనిన పూర్తిగ వశమై
ఖంగున మ్రోగెడి కంఠము
రంగా రావునకు సాటి రారెవ్వరిలన్ (పద్య రచన శ్రీ వెంకటేశ్వర ప్రసాద్)

ఎస్వీ రంగారావు జయంతి నేడు. ఆ మహానటునికి నివాళి అర్పిస్తూ నా పెన్సిల్ చిత్రం.

సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు (జులై 31918 - జులై 181974). నట యశస్విగా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగాకీచకుడిగారావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. ఆయా పాత్రలలో ఆయన ఎంత మమేకమై పొయ్యరంటే, వేరెవరు కూడా ఆ పాత్రలలో ఇప్పటివరకు ఇమడ లేకపొయ్యారు.
బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు. తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను రూ.750 పారితోషికంగా అందుకున్నారు.
ఆ తర్వాత మనదేశంపల్లెటూరి పిల్లషావుకారుపాతాళభైరవిపెళ్ళి చేసి చూడుబంగారుపాపబాలనాగమ్మగృహలక్ష్మిబాల భారతంతాతా మనవడు ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు.
నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తాలో ఆఫ్రో-ఆసియాఅంతర్జాతీయ చిత్రోత్సవము‍లో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకు గాను ఎస్వీయార్ అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందాడు. కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ బహుమతి, నగదు పారితోషికం లభించాయి.
అద్భుత నటనకు ప్రతీకగా నిల్చిన ఎస్వీ రంగారావు 1974 జూలై 18వ తేదీన మద్రాసులో శాశ్వతంగా కన్నుమూశాడు.
క్లిష్టపాత్రల్లో చతురంగారావు
దుష్టపాత్రల్లో క్రూరంగారావు
హడలగొట్టే భయంకరంగారావు
హాయిగొలిపే టింగురంగారావు
రొమాన్సులో పూలరంగారావు
నిర్మాతల కొంగుబంగారావు
స్వభావానికి 'ఉంగారంగారావు
కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు
కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి యశ్వీరంగారావు
ఆయన శైలీ ఠీవీ అన్యులకు సులభంగారావు
ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు
  • 2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళ సందర్భంగా విడుదలయిన తపాళాబిళ్ళలలో ఒకటి ఎస్వీ రంగారావు మీద విడుదలయింది.
  • (వికీపీడియా నుండి సేకరణ)

27, జూన్ 2017, మంగళవారం

పీ.వీ. నరసింహారావు

 తెలుగు బిడ్డ, భారత దేశపు 9వ ప్రధాన మంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి, 'Father of Indian Economic Reforms',  ఈ మహనీయుని జయంతి సందర్భంగా నా పెన్సిల్ చిత్రం ద్వార నివాళి.

26, జూన్ 2017, సోమవారం

నీతో నేను - అనునిత్యం - నా చిత్రానికి కవితలు




!!..నీతో నేను...!! (Anu Sree కవిత)

దేవుడు నాకొక పాత్రనిచ్చాడు
విజయవంతంగా,అర్థవంతంగా
పోషించమని.
అది నీ భార్యగా నా పాత్ర
నువ్వు నేను కలిసిన మన జీవితంలో
నా పాత్రని నేను ఆలోచిస్తున్నా..
నాలా ఉండడాన్ని హరించిన
నీభార్య పాత్రలో
నేనెలా విజయవంతం కావాలో తెలియట్లేదు...!!
మూడుముళ్ళ బంధంతో ఏడడుగుల చేరువలో , నీ పరిధి దాటని నాలో నేనెప్పుడో మాయమైపోయాను...!!

కనిపించని చెరసాలలో యావజ్జీవశిక్ష అనుభవించేవాళ్ళకు తప్ప అర్థం కాదు..!!
నువ్వు మంచి వాడివైతే నేను చాలా అదృష్టవంతురాలినట...!!
లేదంటే అంతా నాతలరాతేనట
నాతలరాత రాసేది బ్రహ్మ కాదు నువ్వేగా..!!

నువ్వేలాంటి వాడివైనా, నాతో నీ ప్రవర్తన ఎలా ఉన్నా, నేను సహనంగా మౌనంగా ఉంటే ఉత్తమ ఇల్లాలినేనట,
ఎదురుతిరిగితేనే వింతనట..!!

నీకు వ్యసనాలతోనో ,నీ నిర్లక్ష్యంతోనో
జరగకూడనిది ఏదైనా జరిగాతే..
నా మాంగళ్య బలం సరిగ్గా లేకేనట,
వైధవ్యం నా నుదుటిపై రాసిపెట్టుంటే నువ్వు కూడా ఏము చేయలేవట...!!

చేయాల్సిన తప్పులన్నీ చేసేస్తున్నా
ఏదో ఒకరోజు నువ్వు మారుతావని
ప్రతిరోజూ ఎదురుచూడాలట
నేను మాత్రం మారకూడదట..!!

ఏదైనా ఒకరోజు నువ్వు మారితే అదృష్టం అనుకుని వెంటనే ఖచ్చితంగా నీ సేవమొదలుపెట్టాలట..
నా జ్ఞాపకాల్లో నువ్వు చేసిన గాయాల మంటలు నన్ను కాలుస్తున్నా సరే..!!

కష్టాల కడలిని ఈదలేక మునిగిపోతుంటే
రక్షించే చేయి నీదే కావాలట
అందులో తోసింది నువ్వైనా సరే,
అదే చేయి పరాయిదైతే ఊరంతా
నాదే చర్చట...!!

నా గురించి మాట్లాడే వాళ్ళు వేరెవరో కాదు, నాదగ్గరి వాళ్ళే, నా కష్టం, నష్టం, కన్నీళ్ళు చూసిన నావాళ్ళే, రోజూ నన్ను గమనించే నా సొంతవాళ్ళే..!!
వాళ్ళందరికీ నువ్వు పెట్టిన పేరు "సమాజం"
ఆ సమాజానికి నువ్వేందుకు విలువిస్తావో కూడా తెలుసు, తప్పెవరిదైనా శిక్ష నాకేవేస్తుంది కదా మరి..!!
ఆ శిక్షకు భయపడే కదా
అందరూ నీ వశమయ్యేది..!!

అంతఃపురంలో బంగారు సీతకు కన్నీటి నీరాజనాలు పట్టినా,
అడవుల్లో సీతకి కష్టాలు తప్పలేదు కదా..
అదే సమాజం అదే భార్య పాత్ర..
బహిరంగంగా బంగారు సీతను కాను
కానీ నా అంతరంగంలో అరణ్యరోదనే
అది నువ్వు వినకున్నా,
నేను మునుగుతున్నా
నిన్ను మాత్రం సరైన తీరానికి చేర్చడమే
నా కర్తవ్యం, పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చే ఉత్తమ ఇల్లాలిని కావాలిగా మరి..!!

పుట్టింటి నుండి ఇంటి పేరుని కూడా తెచ్చుకోని నా పాత్రకి న్యాయం...!!!!!

అను-----4



అనునిత్యం ।। ( అనిత్యం) (శ్రీమతి ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారి కవిత)
-------------------------------


అంతులేని ఆవేదన మోస్తున్నా అనునిత్యం!
ఎందరినో నాలాగే చూస్తున్నా అనునిత్యం!

ఎండిపోదు ఈ గాయం కాలమెంత కదిలినా
ఓపికగా లేపనాన్ని పూస్తున్నా అనునిత్యం!

మ్రోడులు చిగురించాయే బీడులు చమరించాయే
రసహీనపు కావ్యాన్నే రాస్తున్నా అనునిత్యం !

ఎంతదూరమో గమ్యం ? అగోచరం - అనిశ్చితం!
అయినావడివడి అడుగులు వేస్తున్నా అనునిత్యం!

ఆగడులే ఆసూర్యుడు ఆగదు ఈభూగోళం
భగవంతుని బొమ్మలాట చూస్తున్నా అనునిత్యం!

వెతకటమే కళ్ళకుపని ఎపుడోనువు వస్తావని 
శూన్యమైన తోటలోకి వెళుతున్నా అనునిత్యం!

--------------
(చిత్రం --పొన్నాడ మూర్తి గారు)పై చిత్రానికి నాగజల్


మదిభావం॥అనామిక॥
~~~~~~~~~~~~~
నాలో నాకే తెలియని అనామిక
నన్ను లాలిస్తూ బుజ్జగిస్తూ
నన్ను శూన్యంవైపు లాగేస్తూ....
పరదాల మేఘాలలో ఒరవడులు సృష్టిస్తూ
దాన్నే వయస్సన్నది
వృత్తాలనేగీస్తూ పరిధన్నది
దాటలేను దాగనివ్వదు

నాలో నాకేతెలియని అనామిక
తలొంచితాళికట్టించుకోమనంది
ఆశల పందిరికింద తలంబ్రాలఊసేలేదు
రెక్కలగుర్రం ఏదిక్కుకేగిందో ఊహేలేదు
జీవితంమాత్రం పాతాళాంలో బాటరాళ్ళు వెతుక్కుంటోంది
నాలో నాకే తెలియని అనామిక
రక్తం పంచిన బిడ్డలను
అడ్డాలుగాచూపిస్తూ ఇంకా బతకమంటుంది
ఛస్తూ బతకమంటుంది
తనకేంపోయింది
నలిగిపోతోంది నేనుకదా....
త్యాగాన్ని పెనవేసుకొని ఎదగడం నాకలవాటేకదా
నవ్వుతూ ఎదురెళ్ళమంటుంది .....
నాలో నాకేతెలియని అనామిక
రెక్కలొచ్చి బిడ్డలు,
రుణంతీరి బంధాలన్నీ దూరమైనా
నను వీడదూ,వసి వాడదూ
పసి తనపు జ్ఞాపకాలను నెమరేయమంటూ ...
నన్ను బలవంతపెట్టి
తనుమాత్రం కన్నీటి చుక్కైజారుతూ
గుండెతలపు తడుతూ,తడుపుతూనేఉంటుంది
నాలో నాకే తెలియని అనామిక
నాలో నేనే చూడని సాలభంజిక......J K
(చిత్రం Pvr Murtyబాబాయ్ గారు!!ధన్యవాదాలు బాబాయ్ )

నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...