24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

విరహపు రాజదె విడిదికి రాగా | సిరుల జేసెనిదె సింగారములు - అన్నమయ్య కీర్తన


వారం వారం అన్నమయ్య -

"విరహపు రాజదే విడిదికి రాగా సిరులు చేసెనదే సింగారములు"
భావం సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala
చిత్రం : Pvr Murty

ప|| విరహపు రాజదె విడిదికి రాగా | సిరుల జేసెనిదె సింగారములు || చ|| నెలత నుదుటిపై నీలపు కురులనె | తొలుతనె గట్టెను తోరణము | మొలక చెమటలనె ముత్యపు (మ్రుగ్గులు) | అలరిచె మదనుండిదె చెలిమేన || చ|| దట్టముగ చింతా లతనే వడి | బెట్టె చప్పరము పెనుగొనగా | పట్టిన మై తావులు పరిమళములు | కట్టించెను చెంగట వలరాజు || చ|| విందగు వేంకట విభుని ప్రేమచే | పొందగ బెట్టెను బోనాలు ఇందు వదనికి ఇందిరా విభుని | కందుదేర నలుకలు చవిజేసె ||

ఓం నమో వేంకటేశాయ

ఉ॥
పల్లవపాణి విశ్వగురుభామిని యిట్టిప్రపంచమంతకున్
తల్లి! సమస్తజీవుల నిధానమ శ్రీయలమేలు మంగ! నీ
చల్లని చూపు చిల్కి వెదజల్లగ బుణ్యులమైతి మండ్రు భూ
మెల్లను నీవధూమణి, ననేక విధంబుల వెంకటేశ్వరా!

అన్నమాచార్యుల వారు తన శతకంలో అలమేలుమంగమ్మను స్తుతిస్తూ వ్రాసినది పైపద్యం.
ఇప్పుడు ఈ వారం అన్నమయ్య కీర్తన ‘విరహపు రాజిదె విడిదికి రాగా
సిరుల గూర్చెనిదె సింగారములు!’గురించి ముచ్చటించుకుందాం!
అమ్మవారి దగ్గరకు ఆ వేంకటపతి వెళ్ళినప్పుడు ఏంజరిగి ఉంటుందో ఊహించుకుంటూ వ్రాసిన కీర్తన ఇది!
అమ్మవారి విడిది అంటే మంగాపురం ! అమ్మవారు మంగాపుర లో విడిది చేయడానికి వెనక కథేమిటి?
వక్షస్థలం మీద కాలితో తన్నిన భృగు మహర్షిని శ్రీహరి దండించలేదన్న కోపంతో లక్ష్మీ దేవి వైకుంఠం విడిచి కొల్హాపురం వెళ్ళిందికదా! లక్ష్మీ దేవి కోసం శ్రీనివాసుడు వేంకటాచలం ప్రాంతంలోని పద్మసరోవరం ముందు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు.
కార్తీక శుద్ధ పంచమినాడు ఆ సరోవరంలో అమ్మవారు పద్మంనుంచి ఉద్భవించింది. వ్యూహలక్ష్మిగా ఆమెను హృదయంలో నిలుపుకున్నా
అమ్మవారిని చూడటానికి శ్రీపతి తిరుచానూరు రావసిందే. తిరు అంటే శ్రీ. చాన అంటే స్త్రీ. పద్మంలో జన్మించడం వలన పద్మావతి అయింది. అలమేల్ మంగ అనే తమిళ పదం అర్థంకూడ పద్మనివాసిని అనే!
ఆ విధంగా తిరుచానూరులోని పద్మసరోవరంలో ఉన్న అలమేలుమంగమ్మ అంతః పురానికి శ్రీవారు విరహం నిండిన మనసుతో విచ్చేస్తుంటారు. అమ్మవారు శ్రీ వారు ఎప్పుడు వస్తారా అని విరహంతో వేగిపోతోంది!
తన హృదయాధినాధుడు తనసదనానికి విచ్చేస్తున్నాడని తెలిసి స్వయంగా యింటి అలంకరణను పర్యవేక్షించింది. స్వహస్తాలతో ద్వారాల తోరణాలను సరిదిద్దిఉంటుంది. ఆమె మేని సిరులే ఆయనకు వైభవం ! ఈ భావమే చిత్రకారుని చేతిలో అద్భుత చిత్రమైంది. ఆహా! స్వామి వస్తున్నారని తెలిసి అమ్మవారు అలంకరించుకునే పనిలేకుండా సహజసిద్ధంగానే ఆమె శరీరం ఎంతశోభాయమానంగా తయారయిందో వర్ణించాడు అన్నమయ్య!
సిరుల తల్లికి అలంకారానికి కొరవేముంది? పద్మావతీ దేవి అణువణువూ సింగారాలకునెలవు!
సతి సింగారమే కదా పతికి నిజమైన వైభవోపేతమైన దృశ్యం .ఆ సహజసౌందర్యం ఏవిధంగా ఉందంటే……
ఆమె నీలి కురులే తోరణంగా స్వాగతం పలికాయి !
మదనుడు వేసిన ముగ్గులా ఉన్నాయి ఆమె తనువుపై ముత్యాల వంటి స్వేదబిందువులు!
ఆలోచనల లతలు దట్టంగా అల్లుకొని ప్రేమపందిరి వేసాయి।తనుగంధ పరిమళం పతికి శ్రీగంధ సేవకు సిద్ధమైంది!
ఇవన్నీ ఆ వలరాజు పనులే!
ఆ పద్మావతి ప్రేమే స్వామికి విందు భోజనం!
అలమేలు మంగ అలగడం, స్వామివారు తీర్చడం లేకపోతే ఆకలయికలో మాధుర్యం తగ్గదూ!అందుకే ప్రణయకలహపు రుచినీ చవిచూసారా జంట!
కలహం తీరి కలయిక మరింత మధురమై సుఖాంతమైంది!
ఈ జగత్తుకే మాతాపితలైన వారి అచ్చట ముచ్చటలను అక్షర చిత్రంగా చూపి మనల్ని ముగ్థులను చేసాడు అన్నమయ్య!
కీర్తన సారాంశం ఉత్పల మాలగా వ్రాసాను.
ఉ॥
అంగన మంగమాంబ విర హంబును దీర్పగ వచ్చుస్వామికిన్
ముంగురు లాయెతోరణము ముగ్థకు నాథుని స్వాగతింపగన్
పొంగిన స్వేదబిందువుల ముగ్గుగ మార్చెను మారుడంతలో!
చెంగట చేరగంధమగు చేడియ దేహపరీమళంబులున్
సంగడమాయెనల్కలును చక్కగ దీరగ వారికప్పుడున్!
~~~~~~~
స్వస్తి !
ఉమాదేవి జంధ్యాల

 

20, సెప్టెంబర్ 2021, సోమవారం

గణపతి నవరాత్రులు - వాణీ గణపతి / లక్ష్మీ గణపతి / శక్తి గణపతి


గణపతి నవరాత్రులు సందర్భంగా నా చిత్రం. పద్యాలు/భావం సౌజన్యం డా. Umadevi Prasadarao Jandhyala గారు
~~~~~~~~~~
వాణీ గణపతి/ లక్ష్మీ గణపతి/ శక్తి గణపతి
~~~~~~~~~~~~
చం॥పంచపాది
చదువుల తల్లిశారదకు సంపదలిచ్చెడి మాత లక్ష్మికిన్
సదమలయైన గౌరికిని చక్కగ నర్చన జేయభాద్రమున్
కొదువను మాట యుండదిక కోరిన వన్నియు కూడు నింటిలో
ముదముగనమ్మలందరును మోదక హస్తుని ముద్దులాడుచున్
మృదువుగనిత్తురన్నిటిని మీకిక చింతలులేవు లేవనన్!
భావము-
————
భాద్రపద చతుర్ధి నాడు వినాయకుని పూజతో బాటు చదువులతల్లి శారదను, సంపదలిచ్చే జనని లక్ష్మీదేవిని, శక్తినిచ్చే వినాయకుని కన్నతల్లి గౌరిని పూజిస్తే ముద్దులొలికే బాలుని ముద్దాడే ముగ్గురమ్మలూ మనకు చదువు, సంపద, శక్తి ప్రసాదిస్తారు.
2)ఉ. మా॥
వాదము లందుగెల్వగను వాక్కున నిల్చును వాణి రూపుడై
పేదల బాధతీర్చగను పెన్నిధి తానగు లక్ష్మి రూపుడై
వేదిని యష్టపత్రముల వేయగ గన్పడు శక్తి రూపుడై!
భేదము లేకనిచ్చునివి పెంపుగ నీశ్వర బుత్రుడీవిధిన్ !
*భావము
~~~~~~
విద్య సంబంధమైన చర్చలలో వాణీ గణపతిగా వాక్కున నిలుచును.
పేదలు పూజిస్తే లక్ష్మీగణపతిగా సంపదలిచ్చి బాధలు పోగొట్టగలడు.
పీఠము మీద అష్టదళ పద్మము వేస్తే
గౌరీ పుత్రుడు గనక శక్తి గణపతై శక్తి నిస్తాడు।
ఈ విధంగా మనకోరికలన్నీ భేదము చూపక తీర్చే దైవము గణపతి .

 

19, సెప్టెంబర్ 2021, ఆదివారం

నీవు జగన్నాధుడవు నేనొక జీవుడనింతే - అన్నమయ్య కీర్తన


 


వారం వారం అన్నమయ్య


నీవు జగన్నాధుడవు నేనొక జీవుడనింతే
నీవలె అనుభవించ నేనెంత వాడను

వైకుంఠ పద మేడ వడి గోర నెంతవాడ
ఈకడ నీదాసుడనౌటది చాలదా
చేకొని నీ సాకార చింతయేడ నేనేడ
పైకొని నీ డాగు మోచి బ్రతికి చాలదా

సొంపుల నీయానంద సుఖమేడ నేనేడ
పంపు శ్రీవైష్ణవ సల్లాపన చాలదా
నింపుల విజ్ఞాన మేడ నేదెలియనెంతవాడ
ఇంపుగా నీకధ వినుటిదియే చాలదా

కైవల్య మందు నీతో కాణాచియాడ నాకు
శ్రీ వేంకటాద్రి మీది సేవ చాలదా
ఈవల శ్రీవేంకటేశ నీవిచ్చిన విజ్ఞ్నానమున
భావించి నిన్ను పొగడే భాగ్యమే చాలదా

‘నీవుజగన్నాథుడవు నేనొక జీవుడనింతే’ అన్నమయ్య కీర్తనకు విశ్లేషణ : సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala

శా॥
గోవిందాయని పాట పాడుటయె వైకుంఠంబుతో తుల్యమౌ!
గోవిందా! యిరు ప్రక్కలన్ వెలయునీ గుర్తులే జ్ఞానమౌ !
గోవిందా యనినిన్నుగొల్చుటగదా కొండంత యైశ్వర్యమౌ!
గోవిందాయని విష్ణుగాథవిన చేకూరున్ చిదానందమే!
(ఉమాదేవి జంధ్యాల)

కీర్తన భావాన్ని పద్యంగా, ప్రార్థనగా మీకందిస్తూ సరళమైన వ్యాఖ్యానం దిగువ వ్రాసాను.

ఓ వేంకటాచలాధీశా! నారాయణా! నీవు ఈ జగత్తుకే ప్రభువువు! నేను జీవుడను. కష్టసుఖాలకు, మంచి చెడ్డలకు, రాగద్వేషాలకూ లోబడి పోయిన వాడిని. నీవు వీటన్నిటికీ చలించని అప్రమేయుడవు. నీవు దేనినైనా చేయగలవనీ, అనుభవింపగలవనీ నీ అవతారాలన్నీ మాకు తెలియజేసాయి. కానీ జీవుడనైన నేను ఏదొచ్చినా తట్టుకోలేను. పొంగిపోవడం, కుంగి పోవడం, ఉద్రేకపడిపోవడం జయించలేని వీడిని. అరిషడ్వార్గలకు లోబడినవాడిని. నీవలే నేను స్థిత ప్రజ్ఞుడను గాను.

నీ వైకుంఠమెక్కడ? అది త్వరగా పొందాలనుకునే అజ్ఞానినైన నేనెక్కడ?
వైకుంఠానికి … అదే స్వామీ నీ పదసన్నిధికి రావాలని కోరిక! ఇన్ని అవకతవకలున్న నేనెలా రాగలను?
అందుకే నీ సేవచేసుకుంటూ, నీ దాసుడిగా ఉంటే చాలనిపిస్తున్నది.
నీ అర్చామూర్తిని చూస్తూనే ఉన్నా. కానీ నాకళ్ళముందు ప్రత్యక్షంగా నిన్ను చూడాలని కోరిక! దానికి నేనర్హుడనా? నీ గుర్తులైన శంఖుచక్రాలను నా బుజాలపై మోస్తూ తిరిగితే చాలు.
అన్నిటికన్నా గొప్పదైన బ్రహ్మానంద సుఖం నీ సన్నిధిలోనే లభ్యమౌతుంది. కానీ నేనది పొందడం సాధ్యమా!వైష్ణవ ప్రవచనం చేస్తే చాలదా!
భగవంతుని గురించిన విజ్ఞానమెక్కడ నేనెక్కడ?
విష్ణు కథలను వింటూ బ్రతికితే చాలు.

కైవల్యానికి కాణాచి అయిన స్థానమెక్కడ …. నేనెక్కడ! అది నీ వేంకటాద్రి మీదనే నే పొందనా!
నీవు నాకిచ్చిన నిన్ను కీర్తింపగల తెలివితో నిన్ను భావించి పొగిడే అదృష్టము చాలదా!
అని అన్నమయ్య ఈ కీర్తనలో సప్తగిరి వాసుని సన్నిధే తనకు వైకుంఠంతో సమానమనీ, శ్రీనివాసుని కీర్తించడమే విజ్ఞానమనీ అదే తనకు బ్రహ్మానందతుల్యమనీ భావించాడు।
స్వస్తి🙏
~~~~~~
డా. ఉమాదేవి జంధ్యాల

(picture digitally colored by me)

17, సెప్టెంబర్ 2021, శుక్రవారం

అనిల్ బిశ్వాస్ - చలనచిత్ర సంగీత రధసారధి


సంగీత దర్శకులకే సంగీత దర్శకుడు, ఎందరో గాయకులకు మార్గదర్శి అనిల్ బిశ్వాస్. (1914-2003) (Pencil sketch)

ముకేష్, తలత్ మహమ్మద్ వంటి అగ్రశ్రేణి గాయకులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత వీరిది. నటుడు కావాలని అనుకున్న తలత్ మహమ్మద్ కి "నువ్వు నటుడుగా కంటే గాయకుడుగానే రాణిస్తావని" చెప్పి తన సంగీత దర్శకత్వంలో తొలి అవకాశం ఇచ్చాడు. తర్వాత రోజుల్లో తలత్ "King of Gajals" గా ఎంత పేరు ప్రఖ్యాతులు గడించాడో జగద్విదితం. "కె. ఎల్. సైగల్ ని అనుసరించవద్దని నీ style లోనే నువ్వు పాడమని" ముకేష్ కి సలహా ఇచ్చింది కూడా ఈయనే.
లతా మంగేష్కర్ వంటి గాయనీ మణులకు పాట పాడుతున్నప్పుడు పాటించ వలసిన breathing technics నేర్పింది కూడా ఈయనే .

అనిల్ బిశ్వాస్, గులాం హైదర్ మరియు ఖేమ్‌చంద్ ప్రకాష్ లతా మంగేష్కర్ చిత్ర పరిశ్రమలో ఆమె భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్న సమయంలో ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆమె "సన్నని" వాయిస్ మరియు ఆమె సరిగ్గా లేని  ఉర్దూ ఉచ్చారణ పై పలు విమర్శలు వచ్చాయట. కానీ ఈ ముగ్గురి సహకారంతో  తన గానంపై ప్రత్యేక శ్రధ్ధ పెట్టి, విశేషమైన కృషి చేసి కొన్ని  దశాబ్దాలుపాటు హిందీ చిత్రాలలో తిరుగులేని  ప్రముఖ మహిళా గాయనిగా ఎదిగింది. లతా మంగేష్కర్ "ఇన్ హర్ ఓన్ వాయిస్" (నస్రీన్ మున్నీ కబీర్) పుస్తకంలో అనిల్ బిశ్వాస్ నుండి ఆమె నేర్చుకున్న విషయాలు కొన్ని ప్రస్తావించారు.. 
 
అనిల్ బిశ్వాస్ సంగీత దర్శకత్వంలో లతా మంగేష్కర్ "లాడ్లీ" చిత్రంలో "tumhare bulane ko jee chaahta hai' పాడిన ఈ క్రిందపాట వింటుంటే అప్పటి ఆమె గొంతు ఎలాగుండేదో తెలుస్తుంది.  
https://www.youtube.com/watch?v=YFHIrQF996s  
1943 సంవత్సరంలో విడుదలైన "కిస్మత్" భారతీయ చలనచిత్ర చరిత్రలోనే first super block buster గా పేరొందింది.(ఈ చిత్రాన్ని "భలేరాముడు" గా తర్వాత తెలుగులో "ప్రేమపాశం" అని తమిళ్ లో నిర్మించారు) 1975 లో విడుదలైన 'షోలే' చిత్రం వరకూ దీనిని అధిగమించిన hit చిత్రం మరొకటి రాలేదు. 'కిస్మత్' చిత్రానికి సంగీతం సమకూర్చినది అనిల్ బిశ్వాస్.
అనిల్ బిశ్వాస్ ఒక్క సంగీత దర్శకుడే కాదు, విద్యార్ధి దశలోనే స్వాతంత్ర్య సమర యుధ్ధంలో పాల్గొని జైల్ శిక్ష కూడా అనుభవించాడు.
నౌషాద్ వంటి అగ్రశ్రేణి సంగీత దర్శకులు కూడా వీరు కనిపించినప్పుడు వీరికి పాదాభివందనం చేసేవారు.
ఈ మహానుభావునికి నా చిత్ర నివాళి.

16, సెప్టెంబర్ 2021, గురువారం

హేరంబా!నినుబూజసేయుటగనన్ హ్రీంకారి మేల్గూర్పదే!


 

గణపతి నవరాత్రులు సందర్భంగా నేను వేసిన pencil చిత్రం.
పద్యాలు సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala గారు.
శా॥
హేరంబా!నినుబూజసేయుటగనన్ హ్రీంకారి మేల్గూర్పదే!
నేరంబుల్ మదినెంచకే దయగనన్ నిర్విఘ్నమౌ కార్యముల్
భారంబుల్ దొలగన్ జనంబులకు, మాప్రారబ్థముల్ దీరగా
రారమ్మంచునుబిల్చి యూర్జితముగా లంబోదరున్ గొల్వమే!
భావము=హేరంబుడవైన గౌరీ సుతా!నీపూజ చేయడంచూసి ఆ పార్వతీ దేవి మేలు కలగజేస్తుంది.
మా తప్పులు మన్నించి దయతో నీవు చూడగా మాకార్యములు నిర్విఘ్నముగా పూర్తవుతాయి.జనుల సమస్యలు పోయి ప్రారబ్థములు తీరగలవు. అందుకే ఆ లంబోదరుని స్వాగతించి
ఘనంగా ఉత్సవాలు చేస్తాము.
2)
ఉ.మా॥
సూర్యుని తోసమానమగు శుష్మము గల్గిన వక్రతుండనీ
తూర్యపు మ్రోతమాత్రమున దూలగ జేతువు శత్రుసైన్యమున్
శౌర్యము నెంచమాదరమె,
సాయుధరూపము జూడసాధ్యమే!
ధైర్యము గల్గునిన్ దలపఁద్రస్నువు కైనను విఘ్ననాయకా!
భావము-
సూర్యునితో సమానమైన తేజస్సు గల వక్రతుండా! నీ వాద్య ఘోష వినబడినంత మాత్రాన శత్రుసైన్యాలు తూలిపోతాయి.నీ పరాక్రమమెంచడం మా తరమా! నీవు ఆయుధాలను ధరించిన రూపం చూడగలమా! (త్రస్నువు)పిరికి వాడికి కూడ నిన్ను తలుచుకుంటే ధైర్యం వస్తుంది .

15, సెప్టెంబర్ 2021, బుధవారం

గణపతి - చిత్రాలు, పద్యాలు


 


గణపతి నవరాత్రులు సందర్బంగా వేసిన చిత్రం.

పద్యాలు/భావం సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala గారు.
యుక్తి గణపతి/ శక్తి గణపతి
1)
కం॥
వెనకయ్య షణ్ముఖుని వలె
జని, దా విశ్వములజుట్ట సందేహింపన్
గనపడె నొకమార్గంబన
జననీ జనకులకుమ్రొక్కి జయమును బొందెన్ !
*భావము=
వెనకయ్య= వినాయకుడు
గణాధిపతి పదవికి ఎవరు ముందు విశ్వాన్ని చుట్టి వస్తారో వారు అర్హులు అని పరమేశ్వరుడు అనగా , వినాయకుడు కుమారస్వామివలె వేగంగా విశ్వప్రదక్షిణము చేయలేక తన జననీ జనకులే తనకు విశ్వంతో సమానులని వారి చుట్టూ ప్రదక్షిణం చేసి తల్లిదండ్రులను మెప్పించి గణాధిపతి అయినాడు. అన్ని చోట్ల కుమారస్వామికి తనకన్నా ముందు తన సోదరుడు వెళ్ళడం కూడ కనబడటం వినాయకుని భక్తి తత్పరతకు నిదర్శనం.
2)
మత్తకోకిల ॥పంచపాది
దోషకారగు వేల్పునొక్కని దూఱియింద్రుడుఁబొమ్మనన్
మూషికాసురుడై జనించెను భూమియందున నీచుడై
శేష ధాన్యము లన్నిమ్రింగగ జేరె నాశ్రమ వాటికల్
భీషణుండు గణేశుడంతట వేసి పాశము బట్టగన్
శోషబొందిన మూషికమ్మయె శూర్పకర్ణుని బండిగన్!
*భావము-
స్త్రీలపట్ల దోషపూరితమైన స్వభావం చూపిన , సభకు ఆటంకం కలిగించిన ఒక గంధర్వునికి ఇంద్రుడు ఎలుకగా పుట్టమని శాపమిచ్చాడు. వాడు మూషికమై ఆశ్రమాలలో ఋషులకు శాంతిలేకుండా చేస్తుంటే విఘ్నేశ్వరుడు తన పాశంతో బంధించి వాహనంగా చేసుకున్నాడు.
చంచలమైన మనస్సును మన చెప్పుచేతలలో ఉంచుకోవాలని అంతరార్థం.
~~~~~~~
డా. ఉమాదేవి జంధ్యాల

13, సెప్టెంబర్ 2021, సోమవారం

గణపతి నవరాత్రులు - పద్యసుమాలు

 

గణపతి నవరాత్రులు సందర్భంగా నా చిత్రానికి డా. ఉమాదేవి జంధ్యాల గారు అందించిన పద్య సుమాలు.

1)ఉ॥
శ్రీయని సింధురాననుని చిత్తమునందున నిల్పికార్యముల్
జేయ జయంబుగల్గునని సిద్ధివినాయక!యెల్లరీభువిన్
నీయరుదైనరూపమును నెమ్మిభజింపగ భాద్రమందునన్
శ్రేయమొసంగి స్వామి! గుణ శీలము లిత్తువు భక్తకోటికిన్ !
 

2)
మ ॥
సరినీకెవ్వరొసంగగా వరములన్ సామాన్య సంసారికిన్
గరికన్ బెట్టిన సంతసించి మిగులన్ గైకొందు వుండ్రాళ్ళు నీ
గరుణాపూరిత మైనదృక్కులు వినా కల్మేది లోకంబులో !
వరదా! భారము నీదియంచు దల నీ పాదంబుపైనుంచితిన్ !

 

12, సెప్టెంబర్ 2021, ఆదివారం

గోత్రం అంటే ఏమిటి...? (సేకరణ)

 *గోత్రం అంటే ఏమిటి?* 

సైన్సు ప్రకారము 

మన పూర్వీకులు

గోత్ర విధానాన్ని ఎలా 

ఏర్పాటు చేశారో గమనించండి.


మీరు పూజలో కూర్చున్న 

ప్రతిసారీ, పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? 

మీకు తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు??


గోత్రం  వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు- 

*జీన్-మ్యాపింగ్* అని ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యం 

పొందిన అధునాతన శాస్త్రమే!


గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి ?


మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది? 


వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనము ఎందుకు భావిస్తాము? 


కొడుకులకు ఈ గోత్రం  ఎందుకు వారసత్వంగా వస్తుంది మరి కుమార్తెలు ఎందుకు రాదు?


వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా / ఎందుకు మారాలి? 

తర్కం ఏమిటి?


ఇది మనము అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం.  

మన గోత్ర వ్యవస్థ వెనుక 

జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం!


గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది.  

మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం


గోత్రం అంటే 'గోశాల' అని అర్ధం.


జీవశాస్త్రపరంగా, మానవ శరీరంలో  23 జతల క్రోమోజోములు ఉన్నాయి, 

వీటిల్లో సెక్స్ క్రోమోజోములు

 (తండ్రి నుండి ఒకటి మరియు తల్లి నుండి ఒకటి) అని పిలువబడే ఒక జత ఉంది. 

ఇది వ్యక్తి(ఫలిత కణం) యొక్క లింగాన్ని ( gender) నిర్ణయిస్తుంది.


గర్భధారణ సమయంలో ఫలిత కణం XX క్రోమోజోములు అయితే  అమ్మాయి అవుతుంది, అదే XY అయితే  అబ్బాయి అవుతాడు.


XY లో - X తల్లి నుండి 

మరియు Y తండ్రి నుండి తీసుకుంటుంది.


ఈ Y ప్రత్యేకమైనది మరియు 

అది X లో కలవదు. 

కాబట్టి XY లో, Y X ని అణచివేస్తుంది , అందుకే కొడుకు Y క్రోమోజోమ్‌లను పొందుతాడు. 

ఇది మగ వంశం మధ్య మాత్రమే వెళుతుంది. (తండ్రి నుండి కొడుకు మరియు మనవడు ముని మనవడు ... అలా..).


మహిళలు ఎప్పటికీ Y ను పొందరు. అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో Y కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ Y ను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినది అవుతుంది. అలా తన కూతురి గోత్రం వివాహం తరువాత మార్పు చెందుతుంది. 


ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి...

గోత్రం ప్రకారం సంక్రమించిన Y క్రోమోజోమ్‌లు ఒకటిగా  ఉండకూడదు 

ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాలను సక్రియం చేస్తుంది.....


ఇదే కొనసాగితే, ఇది పురుషుల సృష్టికి కీలకమైన Y క్రోమోజోమ్  పరిమాణం మరియు బలాన్ని తగ్గిస్తుంది..... కొన్ని సందర్భాలలో నశింపజేస్తాయి.


ఈ ప్రపంచంలో Y క్రోమోజోమ్ లేనట్లయితే, మగజాతే అంతరించిపోయేలా చేస్తుంది.


కాబట్టి గోత్రవ్యవస్థ జన్యుపరమైన 

లోపాలను నివారించడానికి మరియు Y క్రోమోజోమ్‌ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే స్వగోత్రం. అందుకనే స్వగోత్రీకుల మధ్య వివాహం నిషేధించారు...


మన మహాఋషులచే సృష్టించబడ్డ అద్భుతమైన బయో సైన్స్ గోత్రం. ఇది

మన భారతీయ వారసత్వ సంపద అని నిస్సందేహంగా చెప్పవచ్చు..


మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే _ "GENE MAPPING" _ క్రమబద్ధీకరించారు.


అందుకనే ఈసారి ఎవరైనా గోత్రమని అంటే చాదస్తం అని కొట్టి పడేయకండి ...... ప్రవర తో సహా చెప్పండి.


11, సెప్టెంబర్ 2021, శనివారం

అరుణవర్ణముగలఁ దరుణగణపతిని బూజింపఁగార్యముల్ బూర్తి యగును


 

 
 
తరుణ గణపతి
 
1)సీ॥
అరుణవర్ణముగలఁ దరుణగణపతిని
బూజింపఁగార్యముల్ బూర్తి యగును
చెరకుగడనుబట్టి చెరుపునుఁబోగొట్టి
సరిజేయు మార్గంబు సవ్యముగను!
పాశాంకుశాదులన్ బట్టిహస్తములందు
పాపాత్ములబనిని బట్టునితడు!
అగజాననుండిచ్చు యౌవనోత్సాహముల్
గొల్వగ యువకులు గూర్మితోడ!
ఆపదలదీర్చు నర్థింప నార్తితోడ
వృత్తి వ్యాపారములయందు వృద్ధినిచ్చు!
పారద్రోలును నిస్పృహ భయము బాపు!
తరుణ గణపతి గొల్వుడిత్తరుణ మందు!
కం॥
వెలగలు కదళీ జామల
నెలుకకు పైనెక్కి జనెడి యీశుసుతునకున్
కొలుచుచు బెట్టెడి వారికి
కలిగించునువిజయములను కరివదనుండున్!
~~~~~~~~
నా చిత్రానికి పద్య రచన సౌజన్యం : డా. ఉమాదేవి జంధ్యాల

10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

గజముఖ! వక్ర తుండ!యుమ కల్పన జేసిన ముద్దురూపమా!


 

మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
 
చం॥
గజముఖ! వక్ర తుండ!యుమ కల్పన జేసిన ముద్దురూపమా!
భుజములు నాల్గు గల్గిన విభూతి దలంపగమాకు శక్యమే!
వ్రజమును గానమయ్య పదపద్మము బట్టక నాఖువాహనా!
విజయము నిమ్ముకార్యముల విఘ్నములై నెరవేర దేవరా!
వ్రజము= దారి 
 
కం॥
కదళిని దక్షిణ కరమున
పదిలంబుగ చెఱకుగడను వామము నందున్
కుదురుగ బట్టిన గణపతి
ముదమును గలిగించె బర్వి మోదకములకై ! 
 
ఉ॥
బాలుడు ముద్దుగూనయని ఫాలుడు దల్పక వ్రేటువేయగన్
గోలుమనేడ్చునా యగజ కోరిక దీర్పనేన్గుశీర్షమా
బాలుకమర్పనా శిశువు ప్రాణము బొందెను శంభుశక్తితోన్
బాలగణాధిపున్ గొలువ బల్కుల తల్లియొసంగు విద్యలన్ !
——————-
 
డా. ఉమాదేవి జంధ్యాల
(నా చిత్రానికి పద్య రచన చేసిన డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారికి నా ధన్యవాదాలు)

9, సెప్టెంబర్ 2021, గురువారం

బహుముఖ ప్రజ్ఞకు గీటురాయి భానుమతి!

 

 


నా చిత్రీకరణలో 'భానుమతి' 

వ్యాసం సౌజన్యం : కీ. శే. రావు కొండలరావు (whatsapp నుండి సేకరణ)

 

బహుముఖ ప్రజ్ఞకు గీటురాయి భానుమతి!

సి.పుల్లయ్యగారువరవిక్రయం’ (1939) సినిమా నిర్మాణాన్ని తలపెట్టిన రోజులవి. అందులో కాళింది అనే పెళ్లి కూతురు పాత్రకి నటిని వెతుకుతున్నారు. ఎవరో చెప్పగా విని, రామబ్రహ్మంగారిని అడిగారు- ‘‘మీ దగ్గరకి ఎవరో అమ్మాయి వేషం కోసం వచ్చిందిటగా? బాగా పాడిందని విన్నాను. అమ్మాయిని మీరు తీసుకున్నారా?’’ అని అడిగారు.

‘‘అబ్బేబ్బే... పాట బాగానే పాడిందిగాని, ఏమిటో చూడ్డానికి ఏడుపు మొహం. అంత ఆహ్లాదకరంగా కనిపించలేదు’’ అన్నారు రామబ్రహ్మం. భానుమతి జయంతి(సెప్టెంబర్‌ 7, 1925) సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు..

‘‘ఏడుపు మొహమా? నా సినిమాలో ఏడుపు పాత్రే ఉంది. మీరు ఆమె చిరునామా ఇస్తే నేను చూస్తాను’’ అని, చిరునామా తెలుసుకుని, ఒంగోలు దగ్గర వున్న ఒక వూరు నుంచి పిలిపించుకున్నారు పుల్లయ్య. చూశారు, పాట విన్నారు. అమ్మాయికి ఉత్సాహం వుందని తండ్రి చెప్పారు. పుల్లయ్య కాళింది వేషం ఇచ్చారు. పాట పాడమని అడిగినప్పుడు, భానుమతి అనే అమ్మాయి ‘‘పలుకవేమి నా దైవమూ’’ అన్న త్యాగరాజకీర్తన పాడింది. బాగా పాడిందని అదే పాటని సినిమాలోని పెళ్లి చూపులు దృశ్యంలో పాడించారు. తండ్రి కట్నం ఇచ్చుకోలేక, పిల్లకి పెళ్లి చెయ్యలేకపోతాడు. సినిమాలో భానుమతి ‘‘స్వాతంత్య్రమేలేదా స్త్రీ జాతికి’’ అన్నపాట, ‘‘జాతికి సూత్రంబె’’ అన్న పాట పాడారు. పాటల రికార్డులు సినిమా విడుదలయాక రోజుల్లో ఇంటింటా మార్మోగాయి. సినిమా విజయం సాధించింది. సి.పుల్లయ్య తర్వాత తీసినమాలతి మాధవమ్‌’ (1940)లో నాయిక పాత్ర ధరింపజేశారు భానుమతితో. సినిమా పరాజయం పొందినా, భానుమతి నటన పరాజయం పొందలేదు. ‘ధర్మపత్ని’, ‘భక్తిమాలసినిమాలు వచ్చాక, ‘కృష్ణప్రేమ’ (1943) వచ్చింది. కృష్ణప్రేమరామకృష్ణ ప్రేమగా మారింది. అంటే సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేసిన రామకృష్ణారావుని భానుమతి ఇష్టపడింది. ఆయన సద్గుణం, ప్రవర్తన, తెలివితేటలు ఆమెను ఆకర్షించాయి. అతని కోసం పరితపించి, ప్రణయగానం చేసి పరిణయం చేసుకున్నది.

శుద్ధంగా తమిళభాష నేర్చుకోడంతో, తమిళ చిత్రాల్లోనూ వేషాలు వచ్చాయి. ప్రతిభగల నటిగా నిలబడిందామె. సినిమాలకి రాకముందు భానుమతి, కాంచనమాల అభిమాని. ఆమెను చూడాలని కుతూహలపడి, ఒక షూటింగ్లో చూసి పరిచయం చేసుకుంది. భానుమతిని నటిగా చూసిన తర్వాత, కాంచనమాల ఆమెను కలిసి, ‘‘నటిగా నీ ముందు నేనెంత?’’ అని అభినందించింది. బి.ఎన్‌.రెడ్డిస్వర్గసీమ’ (1946)తో భానుమతి, గొప్పనటిగా ప్రశంసలు పొంది, ‘స్టార్‌’గా మారింది. దక్షిణ రాష్ట్రాల్లోస్వర్గసీమవిజయశంఖం మ్రోగించడంతో, భానుమతి కీర్తిపతాకం మీంటికెగసింది! ‘‘భానుమతి నటన కోసమే నేనుస్వర్గసీమ’ 30 సార్లుకు పైగా చూశాను’’ అని చెప్పారు శివాజి గణేశన్‌. తర్వాత, ఇద్దరూ కలిసి నటించడం - గొప్ప విశేషం! ‘స్వర్గసీమలోని ఆమె పాత్ర అమాయకురాలైన కూచిపూడి నాట్యకత్తె. రానురాను ఆధునికంగా తయారై, హీరోని వలలో వేసుకుని, తర్వాత ఇంకొకరిని వలలో పేసే పాత్ర. పాత్రలోని దశలు భానుమతి నటనా శక్తికి గీటురాళ్లు. సహజంగా సంభాషణలు చెప్పడంతో, పాడడంలో ఆమెకి ఆమే సాటి అని పించుకుంది. ‘ హోహో పావురమాపాట, ఎదురుగా వున్న హీరోనే కాకుండా, ప్రేక్షకుల్ని కూడా రెచ్చగొట్టింది.

రామకృష్ణలాంటి భర్త దొరకడంతో, కొడుకు భరణిపేరుతో రామకృష్ణ దర్శకత్వంలో చిత్రనిర్మాణం ఆరంభించిరత్నమాల’, ‘లైలామజ్ను’, ‘ప్రేమ’, ‘చండీరాణి’, ‘చక్రపాణి’, ‘విప్రనారాయణ’, ‘చింతామణి’, ‘వరుడుకావాలి’, ‘బాటసారి’, ‘వివాహబంధం’, ‘గృహలక్ష్మి’, ‘అంతా మనమంచికే’, ‘విచిత్ర వివాహం’, ‘అమ్మాయిపెళ్లి’, ‘మనవడికోసం’ ‘రచయిత్రి’, ‘ఒకనాటి రాత్రి’ ‘భక్త ధ్రువ-మార్కండేయమొదలైన చిత్రాలు నిర్మించారు. విశేషం ఏమిటంటే, ‘చండీరాణిని మూడు భాషల్లో నిర్మించారు. భానుమతే డైరెక్టు చేశారు. అలా తెలుగులో మొదటి దర్శకురాలుగా పేరు తెచ్చుకున్నారు. ‘వరుడు కావాలి’, ‘అమ్మాయిపెళ్లి’, ‘మనవడి కోసం’, ‘రచయిత్రి’, ‘ఒకనాటి రాత్రి’, ‘భక్తధ్రువ-మార్కండేయచిత్రాల్ని భానుమతి డైరక్టు చేశాడు. ఇందులోని విశేషం ఏమిటంటేరచయిత్రి’ ‘ఒకనాటిరాత్రిచిత్రాలు సెన్సార్అయినాయి గాని విడుదల కాలేదు. ‘రచయిత్రివిడుదల కాకుండానే ఆమె ప్రభుత్వ సబ్సిడీ తీసుకున్నారని, నరసరాజుగారు చెప్పారు. అది, ఆమె మీద వున్న గౌరవం కాబోలు!

అక్కినేని నాగేశ్వరరావుకి, భానుమతి, రామకృష్ణలమీద ఎనలేని గౌరవం, భక్తీ. ‘‘నేనింకా పరిణతి పొందక ముందే నాకులైలామజ్నుసినిమా ఇచ్చారు. ‘విప్రనారాయణ’, ‘బాటసారివంటి గొప్పపాత్రలు ఇచ్చారు’’ అని చెప్పేవారు.

భానుమతి మధురమైన గాయని. ఆమె కంఠం సుడులు, చక్రాలూ తిరిగినట్టు పలుకుతుంది. సంగీత కచేరీలలో పాడేవాళ్లు తక్కిన వాళ్లు పాటలు పాడతారు గానీ, భానుమతి పాటలు పాడడం తక్కువ. ఆమెని అనుసరిస్తూ పాడడం తేలికైన విషయం కాదు. భానుమతి వేరెవరికీ ప్లేబాక్పాడలేదు. తనకెవరూ పాడలేదు. అయితేచండీరాణిహిందీలో మాత్రం సంధ్యకి భానుమతి గాత్రం వినిపిస్తుంది.

‘‘దర్శకత్వం వహించడానికి కల్పనాశక్తి కావాలి. నేను రచయిత్రిని గనక, దర్శకత్వం చేపట్టడానికి అవకాశాలు ఎక్కువ. అయితే నా చిత్రాలకు నేనే మాటలు రాసుకోలేదు. కానీ, రాసిన వాటిని చూసి, నాకు కావలసినట్టుగా దిద్దుకుంటాను’’ అని చెప్పారు భానుమతి ఒక సందర్భంలో. ఆమెలో మంచిహాస్యం, వ్యంగ్యం, చమత్కారం వున్నాయి. అవన్నీ కలగలిపి ఆమెఅత్తగారి కథలురాశారు. బహుళ ప్రసిద్ధి పొందాయి. రచనకు ఆంధ్రప్రదేశ్సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ‘అత్తగారి కథలుటీవీ సీరియల్గా తియాలని ప్రారంభించారు. ఆమే నిర్మాత, దర్శకురాలు. కొన్ని భాగాలు తీశారుగానీ, ముందంజ వెయ్యలేదు. కొన్ని చిత్రాలకు ఆమె సంగీతం చేశారు. ‘విప్రనారాయణకు సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకుడయినా, భానుమతి- ‘సంగీత పర్యవేక్షణఅంటూ తనపేరు వేసుకున్నారు. తాను పాటలకి స్వర కల్పన చేసినా, రికార్డింగ్మాత్రం సత్యం చేతా, వేణు చేతా చేయించారు. ఆమె నటనా ప్రతిభకు గుర్తింపుగా పద్మశ్రీ (1966) పద్మభూషణ్‌ (2000) ప్రశంసలు అందజేసింది కేంద్రం. 1975లో ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్తో గౌరవించింది.

అయితే ఆమెకుఅహంకారంవుందని అంటారు. మాటే నేను అడిగితే ‘‘అవును. నాకు కాక ఇంకెవరికి అహంకారం?’’ అని అడిగారు ఆమె. షూటింగ్స్కి వెళ్లడంలోతన మనభేదం లేదు. ఇతరుల చిత్రాలకి ఆలస్యంగా వెళ్లినట్టు తన సినిమాలకీ అలాగే వచ్చేవారు. ఇబ్బందులు పెట్టే నటిగా ఆమెకు పేరుంది.‘‘స్వర్గసీమలోనే నేను ఆమెతో ఇబ్బందులు పడ్డాను. ‘మల్లీశ్వరిలో మరీ పడ్డాను. ప్రతిభావంతురాలైన నటి, అంచేత భరించాను’’ అని బి.ఎన్‌.రెడ్డి చెప్పేవారు. ఆమె ఆలస్యాలు భరించలేకనే విజయవారుమిస్సమ్మలో ఆమెను తొలగించవలసి వచ్చింది.

విజయచిత్రపత్రికలో నేను ఉన్నప్పుడు ఆమెను చాలాసార్లు కలిసి, జీవితకథను చెప్పమని అడిగితే, కొన్నాళ్లు చెప్పారు. తర్వాత ఏవో వివాదాలు లేవడంతో, ఆపేయవలసి వచ్చింది. కథపేరునాలో నేను’. తర్వాత ఆమె పూర్తి చేసుకున్నారు. రచనకు కేంద్రంస్వర్ణకమలంపురస్కారం ఇచ్చింది. మ్యూజింగ్స్పేరుతో, ‘నాలో నేనుఆంగ్లంలోకి అనువదితమైంది. భానుమతి గొప్పగాయని, గొప్పనటి. చిత్రం చూసినా ఆమె ముద్ర ప్రస్ఫుటంగా కన్పిస్తుంది.

-రావి కొండలరావు

 


ఇందులోనే కానవద్దా యితడు దైవమని విందువలె నొంటిమెట్టవీరరఘరాముని - అన్నమయ్య కీర్తన

  నిండు పున్నమి వెన్నెలలో పౌర్ణమి నాడు సంప్రదాయబద్ధంగా ఒంటిమిట్ట రామాలయంలో కోదండరాముని కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుందిట. ఈ సందర్భంగా ఒంటి...