24, జూన్ 2015, బుధవారం

తాతాచార్ల కధలు


ఈ పుస్తకంపై Facebook లో నా post కి స్పందించి వివరాలందించిన శ్రీ గోపాలకృష్నరావు పంతులగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ  ..

ఎవరీ తాతాచార్లు? ఏమా కథ?.................
.
ఈ తాతాచార్లనే పెద్ద మనిషి ,( నిజంగా పెద్దమనిషే- ఈయన గురించి బ్రౌన్ దొరగారు- He was a tall stout man about 50 years of age, a humorist thoroughly versed in sanscrit learning, very learned and eloquent, most modest and humble; He died in my employ అంటారు.) తెలుగు భాషకు మహోపకారం చేసిన సర్.సి.పి,బ్రౌన్ వద్ద ఉద్యోగి గా ఉండే వాడు. యోగ్యుడూ సరసుడూ ఐన ఈయన సంభాషణల్లో సమయోచితమైన చిత్ర విచిత్ర కథలు చెబుతూ వచ్చేవాడట. అలాంటి వాటిల్లో కొన్నిటిని బ్రౌన్ దొరగారు సేకరించి సంకలనంగా 1855 లో మొదటి సారి ముద్రింపించేరు. దరిమిలా 1916 లో వావిళ్ళ శాస్త్రుల వారు గురజాడ అప్పారావుగారి పరిష్కరణతో అచ్చువేయింపించారట. ఇవన్నీ నేను పుట్టక పూర్వం జరిగిన సంగతులు.
అయితే 1974 లో ( 1974లో అని ఇప్పటి ప్రచురణ కర్తలు అంటున్నారు కానీ నా జ్ఞాపకం 1964 అనే) బంగోరె (అవును. కన్యాశుల్కం మొదటి కూర్పుని వెలుగులోకి తెచ్చి అలక్ నందా నదిలో అకాల మృత్యువు పాలైన ఆ బంగోరే నే) తన ముందు మాటతో వ్యాఖ్యలతో ఎమెస్కో ద్వారా వెలువరించారు. ఇదిగో ఈ విలువైన పుస్తకాన్నే నేను పోగొట్టుకున్నదీ ,మళ్లా నాకు దొరికినదిన్నీ.
ఇంతకీ ఏమిటయ్యా ఈ పుస్తకం గొప్పతనం? ఎందుకు చదవాలది?
సుమారు నూట యాభై ఏళ్ల క్రితం సామాన్య జనం మాట్లాడుకునే వాడుక భాషలో వ్రాయబడ్డదీ గ్రంథం. ఇవి తాతాచారిగారు కూర్చుని వ్రాసిన కథలు కావు. తాను విని లేక చూసిన విషయాల్నే ఆసక్తిదాయకంగా ఆయన బ్రౌన్ దొరగారికి చెప్పినట్టు కనబడుతుంది. అందుచేత ఆనాటి జన జీవన సరళి గురించి మనకు కొంత తెలుస్తుంది. ముఖ్యంగా మనని ఆకట్టుకునేది. ఆనాటి జీవద్భాష. అది మనకు మెకంజీ కైఫీయతుల ద్వారా తెలిసినట్లుగానే ఈ కథల వల్ల కూడా తెలుస్తుంది. అప్పుడు వాడుక లో ఉండి ఇప్పుడు లేకుండా పోయిన లేక రూపు మార్చుకున్న ఎన్నో పదాలు మనకి కనిపిస్తాయి. ఆనాటికే మన భాషలో వచ్చి చేరి సామాన్యులు సైతం వాడుతున్న అనేక ఉర్దూ, పార్శీ పదాలు మనకు దర్శనమిస్తాయి. అందుకే భాషాభిమానులందరూ కొని చదివి దాచుకో వలసిన పుస్తకమిది.
పుస్తకం మీరే కొనుక్కుని చదువుకోండి. చిన్న ఝలక్ లాగా దీని లోని ఒక చిన్ని వృత్తాంతాన్ని మాత్రం నా మాటల్లో మీకు ఇక్కడ పరిచయం చేస్తాను. అదేమిటంటే—
ఒక వూళ్లో ఒక బోగము దానింట్లో ఒక పండితుడు ఉంటూ ఉండగా ఆ వీధి లో ఒక పీనుగని తీసుకెళ్తుంటారు. ఆ బోగముది తన బోనకత్తె (భోజనం వండి పెట్టే దాసి) ని పిలిచి ఆ పీనుగ స్వర్గానికి పొయ్యేదా నరకానికి పొయ్యేదా తెలుసుకుని రమ్మంటుంది. ఆమె వీధిలోనికి పోయి వచ్చి ఆ పీనుగ స్వర్గానికి పోయేదే అని చెబుతుంది. మహా పండితుడైన తనకే ఆ పీనుగ గతి యేమిటో తెలియదే? ఈ దాసి వీధి లోకి పోయి వచ్చినంత మాత్రాన ఆ విషయం ఎలా కనుక్కుందో నని మధన పడి, తెలియజాలక, ఉండబట్టలేక ఆ బోగము దానినే ఆ విషయం అడుగుతాడు. దానికామె, అయ్యో ఇదేమంత పెద్ద విషయం- ఏ పీనుగని చూచి నలుగురూ అయ్యో పుణ్యాత్ముడు పోయేడే అంటారో ఆ పీనుగు నిశ్చయముగ స్వర్గానికే పోతుంది. యే పీనుగును చూచి నలుగురూ పాపిష్టి ముండా కొడుకు పోయేడని అంటారో అతడు తప్పకుండా నరకానికే పోతాడు అన్నదట.
దీని కిందనే - In a jest Book అని చెప్పి ఈ కింది English పంక్తిని ఉదహరించారు.
When death puts out our flame, the snuff will tell if we were wax or tallow by the smell !!!

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

మొత్తానికి మీ గాలానికి చేప పడిందన్న మాట. ఆ చిన్న కథే బుర్రకి పదును పెడుతుంది. పుస్తకము కొని ఎపుడు చదవాలా అని కోరిక బలీయమవుతున్నది.

"మహామహోపాధ్యాయ" తాతా సుబ్బరాయశాస్త్రి

తాతా సుబ్బరాయశాస్త్రి - charcoal pencil sketch  ఈనాడు నా పెన్సిల్ తో చిత్రీకరించుకున్న చిత్రం. ఈ మహానీయుని గురించి వివరాలు క్రింది లింకు క్ల...