30, మే 2018, బుధవారం

తెలుగు తేజం - NTR



తెలుగు తేజం - NTR
 నా పెన్సిల్ చిత్రాలు



విషయాలు సేకరణ whatsapp నుండి.

అటు సినీవినీలాకాశంలో పోలీసు కాన్సెబుల్ వేషం నుండి రారాజుగా ఎదిగి భారతీయ సినీ చరిత్రలో ఓ చక్రవర్తిగా గుర్తింపబడిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడతడు.

ఇటు రాజకీయరంగంలో ప్రపంచం అబ్బురపడేంత ప్రణతిగాంచి చరిత్ర నెలకొల్పిన ఘనుడతడు.

1981లో ఊటీలో సర్దార్‌ పాపారాయుడు చిత్రం షూటింగు విరామసమయంలో ఒక విలేఖరి, మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా? ఆని అడిగారట.
దానికి జవాబుగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టిన రోజునుంచి నా వంతుగా ప్రతీనెలలో 15రోజులు తెలుగుప్రజల సేవకోసం కేటాయిస్తాను అని బదులు చెప్పారట. అదే ఆయన చేసిన రాజకీయ ప్రవేశ ప్రసహనానికి మొదటి సంకేతం.

అయితే అప్పటికి మూడేళ్ల క్రితం 1978 నుండీ ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారానికి వచ్చిన కాంగ్రేసు పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలయ్యింది. అధిష్టానం అధికారం వికటించింది. తరచూ ముఖ్యమంత్రులు మారుస్తూ ఉండేవారు. ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి, రాష్ట్రంలో శాసనసభ్యులచేత నామకార్థం ఎన్నిక చేయించేవారు.
ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అభాసు పాలయింది.

మన మంత్రులపైన కేంద్రం చులకనభావం చూపడం మన ఆత్మగౌరవాన్ని కించపరచడం ప్రజలకి బాధకల్గించింది. రాజీవ్ గాంధీ హైదరాబాద్ ఏయిర్ పోర్ట్ లో మన అంజయ్యగారితో ప్రవర్తించిన తీరు ప్రజలలో తీవ్ర ఆగ్రహం కలిగించింది. దానికి ఆజ్యంపోసినట్టు ఎమర్జన్సీ పాలనలో ప్రభుత్వ దుందుడుకు వైఖరి. మీడియా మీద ఆంక్షలు, ఇదేమని ప్రశ్నించిన ప్రతీవారినీ జైలుపాలు చేయడం... రోడ్డుమీద నలుగురు కలసి నడవలేని నిరంకుశ నిబంధనల మధ్య ఊపిరి తీసుకోలేక విలవిలలాడిపోయారు ప్రజలు.

ఆ పరిస్ధితుల ప్రభావంతో రామారావుగారు రాజకీయాలలోకి రంగప్రవేశం చేయాలనుకోవడం... అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వరత్వరగా పూర్తి చేసుకుని తన సినీ సామ్రాజ్య వైభవ సింహాసనం విడనాడి తన అష్టైశ్వర్యాల మహలులను వీడి, తన మందీమార్బలాలను వదలి ప్రజలకోసం ప్రజల ఆత్మగౌరవం పెంపొందించే నిమిత్తం తన కుటుంబాన్ని కులాశాలనీ దూరంపెట్టి 1982 మార్చి 21 న హైదరాబాదు వచ్చినప్పుడు అభిమానులు ఆయనకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు.

1982 మార్చి 29 సాయంత్రము 2:30లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పారు.
ఆసమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి, ప్రకటించారు.
పార్టీ ప్రచారానికై తన వ్యానును  ఒక కదిలే వేదికగా తయారు చేయించి, దానిపై నుండే ఆయన తన ప్రసంగాలు చేసేవారు.దానిని ఆయన "చైతన్యరథం" అని అన్నారు.
ఆ రథంపై "తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!" అనే నినాదం రాయించారు.
ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్యరథమే స్ఫూర్తి.

ఒక శ్రామికుడివలె ఖాకీ దుస్తులు ధరించి, నిరంతరం ప్రయాణిస్తూ, ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నాడు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసాడు. కాంగ్రెసు అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించివేసిన ప్రచార ప్రభంజనమది.

ఎన్టీఆర్ ప్రసంగాలు ఉద్వేగభరితంగా, ఉద్రేకపూరితంగా ఉండి, ప్రజలను ఎంతో ఆకట్టుకునేవి. ముఖ్యమంత్రులను తరచూ మార్చడం.., అదీ ఢిల్లీ పెద్దల నిర్ణయం ప్రకారమే తప్ప, శాసనసభ్యుల మాటకు విలువ లేకపోవడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని తన ప్రసంగాలను మలచుకున్నాడు. కాంగ్రెసు నాయకులు కుక్కమూతి పిందెలనీ, కొజ్జాలనీ, దగాకోరులనీ, దగుల్బాజీలని, అధిష్టానం చేతిలో కీలుబొమ్మలనీ తీవ్రపదజాలంతో విమర్శించాడు. కాంగ్రెసు పార్టీ కారణంగా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదనీ, దాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారనీ విమర్శిస్తూ, ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పాడు. కాంగ్రెసు నిర్వాకానికి అప్పటికే విసుగు చెందిన, ప్రజలు ఆయన నినాదం పట్ల ఆకర్షితులయ్యారు.
కుల -మత -ప్రాంతీయ -భాష-పార్టీలకు అతీతంగా ప్రజలు అతనివెంట నడిచారు. అది స్వతంత్ర భారతీయ చరిత్రలోన అబ్బురపడే సంఘటన. చరిత్ర సృష్టించారు.

1983 జనవరి 7 న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం 199, కాంగ్రెసు 60, సిపిఐ 4, సిపిఎం 5, బిజెపి 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఎళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది. ఆయన విజయానికి అప్పటి దినపత్రికలు - ఎంతో తోడ్పడ్డాయి.

అటు నటనారంగంలో జేజేలు అందుకుని,
ఇటు రాజకీయరంగంలోతన  కీర్తి ప్రజ్వలించిన కధానాయకుడికి ఘన నివాళి !!!

కామెంట్‌లు లేవు:

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...