29, డిసెంబర్ 2019, ఆదివారం

చిత్తూరు నాగయ్య - Chittoor V Nagaiah

చిత్తూరు నాగయ్య - నా pencil sketch

(ఈ చిత్రం 'తెలుగుతల్లి కెనడా' లో 'మూర్తిమంతమాయె శీర్షికలో ప్రచురించబడింది)


నాగయ్య గారి (28-03-1904 & 30-12-1973) 45 వ వర్ధంతి సందర్భంగా నివాళులు.
అది తిరువాన్కూరు మహారాజావారి దర్బార్ హాలు. మహాపండితులు, సంగీత, నాట్య, నటన కళాకోవిదులతో సభా భవనం క్రిక్కిరిసి పోయింది. మేళతాళాలతో సకల రాజ మర్యాదలతో రాజదర్బారు ప్రవేశించాడొక తెలుగు నటుడు. మహా రాజు గద్దె దిగి ఎదురేగి ఆ నటశ్రేష్టుని సాదరంగా కౌగలించు కొన్నారు. తన గద్దె ప్రక్కను ఏర్పాటు చేసిన సమున్నతమైన ఆసనంపై కుర్చుండజేసి, వేదమంత్ర పఠనం మధ్య, నటునికి పాదపూజ చేసి అమూల్యమైన కానుకలను అందచేయటంతోపాటు ' అభినవ త్యాగరాజ ' బిరుదంతో సత్కరించారు.
మైసురు సంస్థానాధీశ్వరుడు తన రాజ ప్రాసాదంలో ఆ నటరాజుకు సకల రాజ లాంఛనాలతో స్వాగతంపలికి పెద్ద వెండి పళ్ళెంలో 101 బంగారు కాసులు పోసి బహూకరించారు.
ఇలా రాజాస్థానాలలో అపూర్వమైన సత్కారాలను అందుకొన్న తెలుగు నటశిరోమణి చిత్తూరు నాగయ్య గారు.
భారతదేశంలో భక్తి రస ప్రధానమైన పాత్రలు ధరించి ఆయనవలె ప్రజల మన్నన లందుకున్న వారెవరూ లేరు.
నాగయ్య గారు 1904 మార్చి 28 వ తేదీన గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. తండ్రి ఉప్పల ధడియం రామలింగేశ్వర శర్మ గారు అక్కడ రెవిన్యు శాఖలో ఉద్యోగిగా వుండేవారు. చిన్నప్పటినుండి భాగవత, భారతాల పట్ల అమితమైన ఆసక్తి నాగయ్యకు, తండ్రి చక్కని సంగీత విద్వాంసుడు, పండితుడు. తండ్రి సంగీత కళాభిజ్ఞత తనయుడిని బాల్యంలోనే ఆకర్షించింది.
తండ్రి శిక్షణలో సంగీత సాధన ప్రారంభించారు. పాఠశాలకు వెళ్ళడం కంటే సంగీత కచ్చేరీలకు వెళ్ళటం ఎంతో సరదాగా వుండేది బాల నాగయ్యకు. దూరంగా వున్న ఒక వూళ్ళో సంగీత కచ్చేరి జరుగనున్న విషయం విన్నారు. ఇంట్లో మాట మాత్రం చెప్పక తన చెవి పోగుల్ని అమ్మి ఆ డబ్బుతో రైలు టిక్కెట్ కొని సంగీత కచ్చేరి విని ఇంటికి తిరిగి వచ్చారు. కొడుకు సంగీతాభిరుచిని గుర్తించిన తండ్రి, కుమారుణ్ణి సంగీత విద్యాభ్యాసం కొరకు సంగీత విద్వాన్ చిత్తూరు పేరయ్య పిళ్ళె వద్దకు పంపారు.
ఒకమారు మహా విద్వాంసులైన పుష్పవనం అయ్యర్, గోవిందస్వామి పిళ్ళె గార్ల సంగీత కచ్చేరీకి నాగయ్య హాజరయ్యారు. కచ్చేరి పూర్తి అయ్యింది. శ్రోతలందరు వెళ్ళి పోయారు. నాగయ్య మాత్రం అలాగే నిల్చుని పుష్పవనం అయ్యర్ వంక అదే పనిగా చూడసాగారు. అయ్యర్, " ఏం అబ్బాయ్, ఏం కావాలి? నీ పేరేమి?" అని ప్రశ్నించారు. నా పేరు 'ప్రహ్లాదుడు' అని జవాబిచ్చాడు బాలుడు. 'సరే కాని, నీకేమైనా సంగీతం వచ్చా' అని అడిగారు. 'ఓ-వినండి' అంటూ భాగవతంలోని ప్రహ్లాదుని పద్యాలను మధురంగా భావయుక్తంగా పాడాడు. గోవింద స్వామి పిళ్ళె ఆనందంగా వయోలిన్ వాయించారు. రెండు గంటలసేపు పద్యాలు పాడాడు. అయ్యర్ ఆనంద పరవశుడై 'బాబు, నీవు గొప్ప కళాకారుడవుతావు' అని ఆశీర్వదించారు. ఈ సంఘటనను పలుమార్లు మిత్రులకు చెప్పేవారు నాగయ్య.
కంచిలో నయన పిళ్ళే వద్ద, కుంభ కోణంలో సంగీత కళానిధి మహారాజపురం విశ్వనాధ అయ్యర్ వద్ద సంగీత విద్యాభ్యాసం సాగించారు నాగయ్య. చిత్తూరులో మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీలో అతని చదువు కొంతవరకు సాగింది. మనసంతా సంగీతంపై వున్నపుడు కాలేజీలో చదవటం ఎలా సాగుతుంది? కాలేజీ చదువు అర్ధాంతరంగా ముగిసింది. విద్యార్థిగా నాటకాల్లో వేషాలు వేసి ప్రశంసలందుకొన్నారు.
మద్రాసులో చదువుకు 'గుడ్ బై' చెప్పిన నాగయ్య చిత్తూరు జిల్లా బోర్డు ఆఫీసులో గుమస్తాగా చేరారు. స్థానిక రామ విలాస సభ నాటక సంఘం వారితో పరిచయం లభించింది.
చిత్తూరులో రామ విలాస సభ, లక్ష్మీ విలాస సభ, మద్రాసులో సుగుణ విలాస సభ, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ మున్నగు నాటక సంస్థలు ప్రదర్శించిన నాటకాలలో, మొదట సావిత్రి, దమయంతి, చిత్రాంగి వేషాలు ధరించి ప్రశంసలందు కొన్నారు.
నాటకరంగ ప్రవేశంతో మహానటులైన బళ్ళారి రాఘవ, పర్వతనేని రామచంద్రా రెడ్డి మొదలగు వారితో కలిసి పలు నాటకాలలో అభినయించారు. రామదాసులో కబీరు వేషధారిగా కహో రామ్ నామ్ అంటూ పాడుతూ రంగ ప్రవేశం చేయటంతోనే ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో నాటక మందిరం మార్మోగింది. దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు గారు నాగయ్య నటనా కౌశలాన్ని మెచ్చుకొని బంగారు పతకంతో పాటు 'రంగ భూషణ' బిరుదంతో సత్కరించారు.
కర్ణాటక సంగీతంలోనే కాక, హిందుస్తానీ సంగీతంలో కూడా దిట్ట నాగయ్య. కాని జీవితంలో కష్టాలెదురైనాయి. తండ్రి మరణించారు. మొదటి భార్య ప్రసవించిన తర్వాత తల్లి, బిడ్డ చనిపోయారు. రెండవ భార్య ఆయనకు దూరమైంది. మనశ్శాంతిలేని నాగయ్య రమణ మహర్షి ఆశ్రమంలో కొంతకాలం గడిపారు. పుణ్యక్షేత్రాలు చూశారు. 'నీ కార్యక్షేత్రం కళారంగం, వెళ్ళు మరళా కళాకారుడవై ఆత్మ శాంతిని సాధించు' అని అంతరాత్మ బోధించింది. మరలా చిత్తూరు చేరారు.
1932 లో జాతీయ కాంగ్రెస్ లో స్వయం సేవకుడుగా చేరి మద్రాసు వెళ్ళారు. ప్రకాశం పంతులు, సత్యమూర్తి, రాజాజీ మున్నగు నాయకుల పరిచయం కలిగింది. గుమస్తా ఉద్యోగానికి రాజీనామా యిచ్చారు. లాఠీ చార్జీలు, లాకప్ లు చవిచూశారు. వార్దాకు వెళ్ళి గాంధీజీని దర్శించారు. తిరిగి మద్రాసు వచ్చారు. రాజకీయరంగం వదలి మరలా కళారంగంలో అడుగు పెట్టారు. ఫిల్ము కంపెనీలు పెడతామని కొందరు ప్రలోభపెట్టి నాగయ్యను వంచించారు.
చేత చిల్లిగవ్వలేక మద్రాసు వీధుల్లో తిరుగుతూ, ఆకలి బాధతో నుంగంబాకంలో క్రింద పడిపోయారు. దారిన పోతున్న హచ్చిన్స్ కంపెనీ యజమాని, నాగయ్య పాత మిత్రుడు అయిన అచ్యుతనాయుడు నాగయ్యను గుర్తుపట్టి భోజన వసతులు కల్పించారు.
నాయుడుగారి ప్రోత్సాహంతొ నాగయ్య ఎన్నో గ్రాంఫోను రికార్డులిచ్చారు. "హిజ్ మాస్టర్స్ వాయిస్" కంపెనీ వారు నాగయ్య కంఠ మాధుర్యానికి ముగ్ధులై తమ కంపెనీలో మ్యూజిక్ డైరెక్టర్ గా నియమించుకొన్నారు. నాగయ్య పాడిన రికార్డులు విపరీతంగా అమ్ముడుపోయాయి.
1935 లో బి. ఎన్. రెడ్డి గారిని నాగయ్య కలుసుకొన్నారు. వెంటనే రెడ్డిగారు తమ మిత్రులైన హెచ్. ఎం. రెడ్డిగారికి నాగయ్య గారిని పరిచయం చేశారు. హెచ్. ఎం. రెడ్డి నాగయ్య కంఠ మాధుర్యానికి పరవశుడయ్యారు. తాను తీసే "గృహలక్ష్మి" చిత్రంలో సంఘ సేవకుని పాత్ర యిచ్చారు. ఆ వేషంలో నాగయ్య పాడిన, "కల్లు మానండోయ్ బాబూ, కళ్ళు తెరవండోయ్" అన్న పాట ఆంధ్రదేశమంతటా ప్రతిధ్వనించింది. అప్పట్లో మద్యపాన నిషేధం అమలులో వుండేది కాన ఆ పాటకు జనాదరణ అమితంగా లభించింది.
బి. యన్. రెడ్డిగారు మూలానారాయణ స్వామితో కలిసి వాహినీ పిక్చర్స్ అనే సంస్థను ప్రారంభించారు. వందేమాతరం, సుమంగళి, దేవత, మున్నగు చిత్రాల్లో నటించిన నాగయ్యకు అశేష పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.
"ఫిల్మ్ ఇండియా" సంపాదకుడు నాగయ్య నటనా వైదుష్యాన్ని వేనోళ్ళ కొనియాడుతూ, నాగయ్యను 'ఆంధ్రా పాల్ముని' గా కీర్తించారు.
కె. వి. రెడ్డిగారు, 'భక్త పోతన' చిత్రంలో, పోతన పాత్ర ధారణకు నాగయ్యను ఎన్నుకొన్నారు. పోతనగా, నాగయ్య చూపిన హావభావాలు, భక్తుడుగా ఆయన అభినయం చిరస్మరణీయం. 'పావన గుణ రామా' అను పాట ఈనాటికీ చిత్రం చూచిన వారిని మైమరిపిస్తుంది. అసమాన నటుడుగా ప్రశంసలందుకొన్నారు.

(వ్యాసం courtesy శ్రీ Anappindi Suryalakshmi Kameswara Rao - తెలుగు మధురగీతాలు, Facebook)

కామెంట్‌లు లేవు:

మా తరం కా లేజీ అమ్మాయి

 సీ. వాలుజడ నొకింత వదులుగాఁ నల్లియు      సన్నజాజుల మాల జడను దాల్చి ఒంటిపేట గొలుసు నొద్దికఁ నమరించి       దిద్దియున్ తిలకంబుఁ దీరు గాను శ్రోత...