10, జూన్ 2023, శనివారం

ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు - అన్నమయ్య కీర్తన


 ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు  - అన్నమయ్య కీర్తన


ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు

బూడిదిలో హోమమై పోయఁ గాలము ॥ఏడ॥


ఇదె మేలయ్యెడి నా కదె మేలయ్యెడినని

కదిసిన యాసచేఁ గడవలేక

యెదురు చూచి చూచి యెలయించి యెలయించి

పొదచాటుమృగమై పోయఁ గాలము ॥ఏడ॥


ఇంతటఁ దీరెడి దుఃఖ మంతటఁ దీరెడినని

వింతవింత వగలచే వేఁగి వేఁగి

చింతయు వేదనలఁ జిక్కువడుచు నగ్ని

పొంతనున్న వెన్నయై పోయఁ గాలము ॥ఏడ॥


యిక్కడ సుఖము నా కక్కడ సుఖంబని

యెక్కడికైనా నూర కేఁగియేఁగి

గక్కన శ్రీతిరువేంకటపతిఁ గానక

పుక్కిటి పురాణమయి పోయఁ గాలము ॥ఏడ॥


జీవితంలో ఎండవుమాలు, భ్రమల వెంట పరుగెత్తుతూ కాలాన్ని వృధా చేశానని వాపోతాడు అన్నమయ్య ఈ కీర్తనలో . అప్పటి రోజుల్లోనే  అన్నమయ్య కాలం విలువ గుర్తించి చక్కగా కీర్తన రూపంలో మన కందించాడు.


ఇది మేలు జరుగుతుందని అది మేలు జరుగుతుందని ఆశతో గడుపుతాము. ఎదురు చూసి చూసి ఇటూ అటూ పోయి పొదచాటు మృగంలా మాయమైపోతుంది కాలము. 


ఇదిగొ తీరుతుంది అదిగో తీరుతుంది అని వింత వింత కారణాలతో చూసి చూసి వేదనతో చిక్కుపడుచూ అగ్నిచెంత వెన్నలా కరిగిపోతుంది కాలము.


ఇక్కడ సుఖం దొరుకుతుందని, అక్కడ సుఖం దొరుకుతుందని ఎక్కడెక్కడో వెతుకుతాము. కాని  శ్రీ తిరువేంకటపతిని  కానక పుక్కుటి పురాణమైపోతుంది కాలము.


సహకారం : శ్రీమతి పొన్నాడ లక్ష్మి

చిత్రం : Pvr Murty

4, జూన్ 2023, ఆదివారం

కాలమెలా గడిచిపోయె..తెలియకనే పోయెనే. - గజల్


 Pvr Murty గారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్సుమాలతో 🌹🙏🌹🙏🌹😊😊🥀💌🥀🦜


నా చిత్రానికి.మిత్రులు శ్రీ మాధవరావు కొరుప్రోలు గారు రచించిన తెలుగు గజల్. వారికి నా ధన్యవాదాలు 


కాలమెలా గడిచిపోయె..తెలియకనే పోయెనే..! 

కలలనావ తీరానికి..చేరకనే మునిగెనే..! 


ఆశపూల చెట్టుచూడ..గంధాలకు బానిసే.. 

గుండెసడికి ఒకసాక్షిగ..మిగలకనే ఒరిగెనే..! 


నీకోసం పరితపించు..మేఘంలా ఈ మనసు.. 

తననుతాను ఒకసమిధగ..తలచకనే రగిలెనే..! 


ఎడారిలో పూవులేవొ..ఎవరికొరకొ ఈవేళ.. 

భావరాగ మధురిమలను..పంచకనే రాలెనే..! 


ఈ రెప్పల వాడలోని..జాతరెంత దివ్యమో.. 

నీ మౌనమె దీపాలుగ..పెట్టకనే వెలిగెనే..! 


చాలించగ కుదరని ఈ..వ్యవహారమె ఓ మాయ.. 

వెతుకులాట లోలోపల..జరగకనే ఆగెనే..! 


మరిమాధవ గజలింటికి..ఆహ్వానం ఎల్లరకు.. 

పాడుకునే హృదిహృదినే..మీటకనే పొంగెనే..!

1, జూన్ 2023, గురువారం

జె. వి. రమణమూర్తి - అభినయకళామూర్తి

  • My pencil sketch

అభినయకళామూర్తి జె.వి.రమణముార్తి  (whatsapp నుండి సేకరణ)

గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకాన్ని భుజానికెత్తుకొని, దేశవిదేశాల్లో కొన్ని పదుల ఏళ్ళు, కొన్ని వందల ప్రదర్శన లిచ్చిన ఘనత జె.వి. రమణమూర్తిదే. ఆయన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించినా, నడిచొచ్చిన దారిని మర్చిపోని  మధ్యతరగతి మనిషి. ‘శంకరాభరణం’ శంకరశాస్త్రి’ పాత్రతో తోడబుట్టిన అన్నయ్య తన కన్నా ముందుకు దూసుకుపోయినా, అన్న చాటు తమ్ముడిగా ఆనందించిన మమతానురాగాల మూర్తి.

 ఒక తరానికి ఆయన రంగస్థల నటుడు. బ్లాక్ అండ్ వైట్ సినిమా తరానికి ఆయన హీరో... సెకండ్ హీరో పాత్రల ఫేమ్. కలర్ సినిమాల యుగానికి వచ్చేసరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్. నిన్న మొన్నటి దాకా - టీవీ, రేడియో ఆర్టిస్ట్. అందుకే, జె.వి. రమణమూర్తిగా సుప్రసిద్ధుడైన అభినయమూర్తి జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి గురించి ఒక్క మాటలో, ఒక్క ముక్కలో చెప్పడం, నిర్వచించడం కష్టం. శ్రీకాకుళం జిల్లా లుకులామ్ అగ్రహారంలో మొదలై మద్రాస్ మీదుగా హైదరాబాద్ దాకా వివిధ ప్రాంతాల మీదుగా విభిన్న రంగాల్లో విస్తృత ప్రయాణం, కాలంతో పాటు మారుతూ బహుపాత్ర పోషణ చేయడం ఆయన ప్రత్యేకత. 

చిన్నప్పటి నుంచి... నాటకమే జీవితం

ఎక్సైజ్ ఇన్‌స్పెక్టరైన జె.వి. శివరామమూర్తి ఆరుగురు సంతానంలో రెండోవారు జె.వి. సోమయాజులైతే, నాలుగోవారు రమణమూర్తి. గమ్మత్తే మిటంటే, సోమయాజులు, రమణమూర్తి, రమణమూర్తి తరువాతి వాడైన జె.వి. శ్రీరామ్మూర్తి - ముగ్గురూ రంగస్థల నటులే. చిన్నప్పటి నుంచి రమణమూర్తికి నాటకాలంటే అభిమానం. విజయనగరంలో పెరగడం అందుకు దోహదం చేసింది. శ్మశానమైన గురాచారి తోటలో ప్రాక్టీస్ చేసి, మహారాజా వారి ఒకప్పటి ఏనుగులశాలైన ‘హస్తబల్ హాలు’లో తొలిసారి నాటకం వేయడంతో ఆయన అభినయ ప్రస్థానం మొదలైంది. పదిహేనో ఏట 1948లో ‘కవిరాజు మెమోరియల్ క్లబ్’ పెట్టి నాటకాలు వేశారు. ఆ సమాజం విజయనగరంలో ఇప్పటికీ నడుస్తుండడం విశేషం. 

అన్నయ్య సోమయాజులుతో కలసి ఆత్రేయ ‘ఎన్జీవో’, కవిరాజు ‘దొంగాటకం’, డి.వి. నరసరాజు ‘నాటకం’, ప్రఖ్య శ్రీరామ్మూర్తి ‘కాళరాత్రి’ లాంటివన్నీ ప్రదర్శించారు. బి.ఎస్సీ చదివిన రమణమూర్తి ఆ రోజుల్లోనే ప్రదర్శనకు కావాల్సినవన్నీ సమకూర్చి, అన్నీ అందరికీ చెబుతూ తెలియ కుండానే ‘డెరైక్టర్’ అయ్యారు. హైదరాబాద్‌లో 1955లో జరిగిన ‘ఆంధ్ర నాటక కళాపరిషత్’ పోటీల్లో ‘కాళరాత్రి’ ప్రదర్శనతో ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం అనుకోకుండా ఆయన సినీరంగానికి బాట వేసింది. 

హీరోగా 20 సినిమాలు...

ఆ ప్రదర్శన చూసిన రచయిత డి.వి. నరసరాజు, దర్శకుడు తాతినేని ప్రకాశరావుల పరిచయం రమణమూర్తి పేరును దర్శక - నిర్మాత ఎల్వీ ప్రసాద్ దాకా తీసుకెళ్ళింది. ఎల్వీ దగ్గర అవకాశం రావాల్సింది, చివరకు ఆయన మేనల్లుడు కె.బి. తిలక్ దర్శకత్వంలోని ‘ఎం.ఎల్.ఎ’ దగ్గర వచ్చింది. ఆ సినిమా హిట్టవడంతో వచ్చిన గుర్తింపు... ఆ తర్వాత ‘అత్తా ఒకింటి కోడలే’, ‘బావామర దళ్ళు’, ‘పెళ్ళి మీద పెళ్ళి’ ఇలా 20 సినిమాల్లో హీరో వేషాలొచ్చేలా చేసింది. 

ఎన్టీఆర్‌తో కలసి ‘మంచి మనసుకు మంచి రోజులు’, ‘శభాష్ రాముడు’ లాంటి చిత్రాల్లో నటించారు. ‘శభాష్ రాముడు’లో తమ్ముడి పాత్ర వేయడంతో ఆ తరువాత నుంచి ఎన్టీఆర్ తనను ఆప్యాయంగా ‘తమ్ముడూ’ అని పిలిచేవారని రమణమూర్తి గుర్తుచేసుకొనేవారు. అలాగే, ఏయన్నార్ సైతం అవకాశాలివ్వమంటూ అందరికీ చెప్పడమే కాక, ‘మాంగల్యబలం’, ‘అమాయకురాలు’ లాంటి చిత్రాల్లో మంచి వేషాలిచ్చారు. 

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ‘మరో చరిత్ర’:-

కుడికాలికి యాక్సిడెంటై కొన్నేళ్ళు మంచం మీద ఉండాల్సి రావడం ఆయన కెరీర్‌ను ఇబ్బంది పెట్టింది. ఆ తరువాత ‘అనురాగాలు’ చిత్రంతో క్యారెక్టర్ యాక్టర్‌గా రెండో దశ మొదలుపెట్టారు. కె.విశ్వనాథ్ ‘సిరిసిరి మువ్వ’ నుంచి మళ్ళీ ఒక ఊపందుకొని, ‘మన ఊరి పాండవులు’, ‘మరో చరిత్ర’, ‘ఆకలిరాజ్యం’, ‘గుప్పెడు మనసు’, ‘సిరివెన్నెల’, ‘వంశగౌరవం’, ‘శ్రీదత్తదర్శనం’ లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్నారు. 

1933 మే 20న జన్మించిన రమణమూర్తి, అన్నయ్య జె.వి. సోమ యాజులు కన్నా అయిదేళ్ళు చిన్న. రమణమూర్తి ముందుగా సినిమాల్లోకి వచ్చి, పేరు గడించినా, ఆలస్యంగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన అన్నయ్యకు ‘శంకరాభరణం’ సినిమా పుణ్యమా అని మరింత ఎక్కువ పాపులారిటీ వచ్చింది. ఆ క్రమంలో అన్నదమ్ములిద్దరూ రంగస్థలం మీద లానే సినిమాల్లోనూ ‘సప్తపది’ లాంటి పలు చిత్రాల్లో కలసి నటించారు. అప్పుడిక పాపులారిటీలో అన్న చాటు తమ్ముడిగానే తెరపై మిగిలిపోయినా, తన మార్కు అభినయంతో అలరిస్తూనే వచ్చారు. 

కన్యాశుల్కంతో చిరకీర్తి :-

ఎన్ని సినిమాలు, సీరి యల్స్‌లో చేసినా, ‘కన్యాశుల్కం’ నాటకాన్ని మూడు గంటలకు కుదించి, 1953 నుంచి 1995 దాకా 42 ఏళ్ళపాటు ‘నటరాజ కళాసమితి’గా ఏక ధాటిగా ప్రదర్శనలివ్వడం రమణమూర్తిని చిరస్మరణీయుణ్ణి చేసింది. సోమయాజులు రామప్ప పంతులైతే, రమణమూర్తి గిరిశం. టీవీకి తగ్గట్లు స్క్రీన్‌ప్లే రాసుకొని, 1990లలో దూరదర్శన్‌కు 19 భాగాల సీరియల్‌గా కూడా ‘కన్యాశుల్కా’న్ని అందించారు.

ఆఖరుదాకా రంగస్థలాన్ని ఊపిరిగా శ్వాసించి, ఒకానొక దశలో అన్నయ్యతోనే ఆ విషయంలో తేడా వచ్చినా అంకితభావం వీడని ఈ అభినయ కళామూర్తికి  నివాళి......


-------------------------------------------------------------------------------------------------------------------------


కన్యాశుల్కం సినిమాలో  NTR  గిరీశం పాత్ర పోషించి మెప్పించారు. అయినా "ఆ పాత్రకు మీకు మీరే సాటి. ఈ సినిమా  తీసినప్పటికి మీరు సినీరంగ ప్రవేశం చెయ్యలేదు. లేకపోతే ఆ పాత్ర మిమ్మల్నే వరించి ఉండేది  అని రమణమూర్తి ని ప్రశంచించారు.


29, మే 2023, సోమవారం

వద్దు వద్దు సటలింక వామనా నీ వద్దనే వున్నార మిదె వామనా || - అన్నమయ్య కీర్తన


 

శ్రీహరి ప్రత్యక్ష వ్యాఖ్యానమే శ్రీనివాసుని దివ్యమంగళ మూర్తి. అతడు వామనుడై యాచించినాడు. త్రివిక్రముడై ఉగ్రహించినాడు. అందరినీ వలచినాడు, వలపించినాడు. భక్తుల మానస వీధులలో చిందులు వేసినాడు. 

వద్దు వద్దు సట లింక వామనా
వద్దనే వున్నార మిదె వామనా। IIపల్లవిII

వరుసలు వెదకేవు వామనా నీవు
వరుఁడ విందరికిని వామనా
వరవాత వలపించి వామనా దే
వరవలె నున్నాఁడవు వామనా . IIవద్దుII

వనము కోగిల వైతి వామనా నీకు
వనితలు బాఁతి వామనా
వనరేరు గొల్లెతలు వామనా కా
వను వేళ చూచూకోమీ వామనా . IIవద్దుII

వాడవారు మొక్కేరు వామనా నీకు
వాదుదేరె కెమ్మోవి వామనా
వాదికె శ్రీవేంకటాద్రి వామనా
వాడేచెలమవు నీవు వామనా . IIవద్దుII

8, మే 2023, సోమవారం

దాశరథి రంగాచార్యులు

 


Charcoal pencil sketch 


దాశరధరంగాచార్యులు -- మార్క్సిస్టు దృక్పథం కలిగిన రచయిత. సమాజ గమనాన్ని సునిశితంగా పరిశీలించిన వ్యక్తి. దాశరథి రంగాచార్య అనగానే ‘చిల్లరదేవుళ్లు’ నవల గుర్తుకు వస్తుంది.


తెలంగాణా జనజీవితాలు, ఉద్యమాలు, రాజకీయ, సామాజిక అంశాలు తెలుసుకోవాలంటే రంగాచార్య నవలలు చదవాలి. ఆయన సాహితీ సృజన అనన్య అనన్యసామాన్యం. నభూతో నభవిష్యతి. తన రచనల ద్వారా విశ్వమానవ శ్రేయస్సును కాంక్షించాడు. సంప్రదాయం పునాదులమీద ఎదిగిన అభ్యుదయ సాహిత్య గోపురం దాశరథి రంగాచార్య.




3, మే 2023, బుధవారం

అమ్రుతా ప్రీతమ్ - రచయిత్రి


 అమ్రుతా ప్రీతమ్ - ప్రముఖ పంజాబీ రచయిత్రి - charcoal pencil చిత్రం.


పద్మశ్రీ, పద్మవిభూషణ్, సాహిత్య అకాడమీ, జ్ఞ్నానపీఠ  తదితర పురస్కార గ్రహీత.

28, ఏప్రిల్ 2023, శుక్రవారం

అబ్బూరి ఛాయాదేవి - రచయిత్రి




అబ్బూరి ఛాయాదేవి (జననం1933 - మరణం 2019) పలు పురస్కారాలు పొందిన ప్రముఖ రచయిత్రి

(Pencil sketch)
మధ్య తరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యల గురించి, పురుషాధిక్యతకు లోబడిన స్త్రీల గురించి చాలా కథలు రాసారు. వీరి కథల్లో బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు చాలా ప్రసిద్ధిపొందాయి. ఆడపిల్లల పెంపకంలోను, మగపిల్లల పెంపకంలోను వివక్ష చూపిస్తూ ఆడవాళ్ళ బ్రతుకుల్ని బోన్ సాయ్ చెట్టులా ఎదగనివ్వటం లేదని చెప్పే కథ బోన్ సాయ్ బ్రతుకు. ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. (సౌజన్యం: వికీపీడియా)
(ఈ చిత్రం ఈ నెల "తెలుగుతల్లి కెనడా" పత్రికలో మూర్తిమంతమాయే శీర్షికలో ప్రచురిచబడింది. పత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు)

ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు - అన్నమయ్య కీర్తన

 ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు  - అన్నమయ్య కీర్తన ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు బూడిదిలో హోమమై పోయఁ గాలము ॥ఏడ॥ ఇదె మేలయ్యెడి నా కదె మేలయ్యెడినని క...