25, ఏప్రిల్ 2024, గురువారం

రాగ మాలిక - కథ


 మీ చిత్రం - నా కథ.


రాగమాలిక

రచన: మాలా కుమార్


మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడావిడిగా ఉంది.

వంటింట్లో నుంచి " మల్లీ ఇటురా తల్లీ" పిలిచింది పంకజం. తల్లి దగ్గరకు వెళ్ళి "ఏంటమ్మా ఇదంతా ?" అడిగింది మాలిక.


మాలిక ముంగురులు సద్దుతూ "మొన్న మనం వెళ్ళిన పెళ్ళిలో మీ నాన్నగారి స్నేహితుడి కొడుకు నిన్ను చూసి ఇష్టపడ్డాడట. ఈ రోజు మంచిదని, నిన్ను చూసేందుకు రావచ్చా? అని ఇందాక కబురు చేసారు. ఆరింటికి వస్తారు. ఇంకా సమయం ఉంది కదా కంగారేమీ లేదు. చిన్నగా తయారవ్వు" అంది.


"ఆ అబ్బాయి పేరు అనురాగ్. ఈ మధ్యనే యంటెక్  పాసయ్యాడు. నాగార్జున సాగర్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉద్యోగం లో చేరాడు. పిల్లవాడు బాగుంటాడు. బుద్దిమంతుడు. నేను చాలా సార్లు చూసాను. నువ్వు కూడా చూడు. నీకు నచ్చితేనే పెళ్ళి చేస్తాము. బలవంతం లేదు" అనునయంగా అన్నాడు అప్పుడే అటుగా వచ్చిన విశ్వనాథం.


పెళ్ళిచూపులల్లో అనురాగ్ ను చూసిన మాలికకి అభ్యంతరం ఏమీ కనిపించలేదు. తండ్రి చెప్పినట్లే అందంగా ఉన్నాడు. మర్యాదగా మాట్లాడాడు. అందరి ఆమోదంతో నెలలోపలే పెళ్ళి చేసుకొని మాలికని సాగర్ తీసుకెళ్ళాడు అనురాగ్.


"కొత్త పెళ్ళికుతురా రారా... నీ కుడికాలూ ముందు పెట్టిరారా" సరదాగా పాడుతూ భార్యను ఆహ్వానించాడు అనురాగ్.


భర్త ఆహ్వానికి మురిసిపోతూ, కొద్దిగా సిగ్గుపడుతూ లోపలికి అడుగుపెట్టింది. "సీతమ్మా వచ్చిందీ మొగుడింటికీ... సిగ్గంతా చేరిందీ కడకంటికీ..." మేలమాడాడు.


టూ బెడ్ రూంస్, కిచెన్, హాల్, చుట్టూ పూలమొక్కలున్న చిన్న తోట, లోపలంతా చక్కని ఫర్నీచర్, వంటగదిలో గాస్ స్టవ్, కొద్దిపాటి గిన్నెలు, సామానులు అన్నీ పొందికగా అమర్చి ఉన్న చిన్న క్వాటర్ ను ముచ్చటగా చూస్తున్న మాలికతో "ఇదే మన ప్రేమసౌధం. ఎలా ఉంది?" మార్ధవంగా అడిగాడు.


"చాలా బాగుంది.  అండీ... " ఏదో అనబోతున్న కస్తూరితో, "నో అండీ, బండీ. కాల్ మి రాగ్" అన్నాడు.


అమ్మో పేరు పెట్టి పిలవలా?  బామ్మ విన్నదంటే మొగుడిని పేరుపెట్టి పిలవటమేమిటే పిదపకాలం, పిదప బుద్దులు అని మొట్టికాయ వేస్తుంది అనుకుంటూ అప్రయత్నంగా తల తడుముకుంది మాలిక.


రాత్రి వంట చేసి డైనింగ్ టేబుల్ మీద సద్దుతున్న కస్తూరితో "ఇక్కడ కాదు. పద” కంచాలు, గ్లాస్ లు, కొన్ని గిన్నెలు ట్రే లో పెట్టి తీసుకుంటూ అన్నాడు. మిగిలినవి తను తీసుకొని ఎక్కడికబ్బా అంటూ రాగ్ ను అనుసరించింది. ఎప్పుడు అమర్చాడో డాబా మీద చాప వేసి ఉంది. ఇంకో వైపు తెల్లని పక్క పరచి ఉంది. మధ్యలో కొద్దిగా ఎత్తున్న చిన్న రౌండ్ టేబుల్ ఉంది. దాని మీద గిన్నెలు పెడుతూ కూర్చోమన్నట్లు చాప చూపించాడు. పౌర్ణమి రోజులేమో ఆకాశం లో చంద్రుడు తెల్లగా మెరిసిపోతున్నాడు. వెన్నెల కాంతిలో, డాబా మీదకు పరుచుకున్న సన్నజాజీ, చంబేలీ తీగల నిండుగా పూసిన పూవులు చుక్కలతో పోటీ పడుతూ, సువాసనలను వెదజల్లుతున్నాయి. పవనుడు చల్లగా, మృదువుగా మాలిక బుగ్గను తట్టాడు. ఒక్కసారిగా వళ్ళు జల్లుమంది మాలికకి.


"అండీ... ఎంత బాగుంది ఇక్కడ" పరవశంగా అంది.


వెన్నెలలో విందు పసందు అంటూ మాలిక వడిలో తలవాల్చి "తల నిండా పూదండ దాల్చిన నారాణి" అని పాడుతున్న అనురాగ్ జుట్టు నిమురుతూ, కొత్తకాపురం ఎంత మధురంగా మొదలయ్యింది అనుకుంది, చెప్పలేని, వర్ణించలేని భావనతో! వెన్నెల రోజులల్లో డాబా మీద కూర్చొని, సన్నజాజీ, చంబేలీల సువాసన ఆస్వాదిస్తూ, పాటలు పాడుకుంటూ, భోజనం చేయటం అందమైన అనుభవం మాలికకి. పెళ్ళవుతే జీవితం ఇంత బాగుంటుందా? చదివింది చాలులే ఇంక హాయిగా పెళ్ళి చేసుకోండి అని తన స్నేహితులకు చెప్పాలి అనుకుంది. అదే మాట రాగ్ తో అంది. ఆహా అంటూ పెద్దగా నవ్వేసాడు రాగ్. నవ్వుతున్న రాగ్ ను ప్రేమగా చూస్తూ, రాగ్ జుట్టును సుతారంగా కదిలించిన చిరుగాలితో "సడి చేయకో గాలి సడి చేయబోకే" అని హెచ్చరించింది. కాసేపు ఇద్దరూ ఓ మధురమైన భావనలో ఉండిపోయారు.


రాగ్ చాలా మృదుస్వభావి, భావకుడు. చక్కని గాయకుడు కూడా. పాటలంటే చాలా ఇష్టం. అందుకే అనురాగ్ ను రాగ్ చేసాడు. ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చాక "పదపద కృష్ణమ్మ ఇంకా నిన్ను చూపించలేదేమని కోపం చేస్తోంది పద" హడావిడి చేసాడు.


డాం దగర పరిసరాలు ఆహ్లాదంగా ఉన్నాయి. చిన్నగా నడుచుకుంటూ డాం దగ్గరగా వెళ్ళారు. తెరిచిన గేట్ ల నుండి పొగలు చిమ్ముతూ, గంతులు వేస్తూ దూకుతోంది కృష్ణమ్మ. గాలికి కదులుతున్న చీరను ఓ చేత్తో పట్టుకొని, వెంట్రుకలను మరో చేత్తో సవరించుకుంటూ కృష్ణమ్మ పరవళ్ళను చూస్తోంది మాలిక. చిరుజల్లులను అక్షింతల్లా చల్లుతూ నవవధువును ఆప్యాయంగా పలకరించింది కృష్ణమ్మ. చిన్నచిన్న గులాబీరంగుపూలున్న తెల్లచీర, వదులుగా వేసుకున్న పొడవాటి జడలో సన్నజాజులమాల, కృష్ణమ్మ చల్లిన అక్షింతలతో కొద్దిగా తడిసిన చీరలో ముగ్ధమనోహరంగా ఉన్న మాలికను పరవశంగా చూస్తూ...


"వీణ వేణువైన సరిగమ విన్నావా

ఓ, తీగ రాగమైన మధురిమ కన్నావా"


అని పాడుతున్న రాగ్ వైపు చిరుసిగ్గుతో నవ్వుతూ చూసింది మాలిక.


వడ్డున ఉన్న శివాలయంలో శివుని అర్ధభాగం లో ఉన్న గౌరి వారిని ముచ్చటగా చూస్తోంది. అది చూసిన గంగ "నీకేం తల్లీ హాయిగా విభుని ఆక్రమించుకొని ఎన్ని రాగాలైనా తీస్తావు" అంటూ కోపంగా కాస్త ధారను పెంచింది.


"నీకు మాత్రం ఏమయ్యింది? మొగుడి నెత్తినెక్కి తాండవమాడుతున్నావుగా!" అని తడిసిన కొంగును గంగ మీదకు దులపరించింది గౌరి చిరాగ్గా!


పెళ్ళాల గొడవకు తపోభంగమయి "హూం" అని హుంకరిస్తూ కళ్ళు తెరిచాడు శివయ్య. అంతే ఇద్దరూ గప్ చుప్...


సవతులపోరు తెలియని రాగమాలికలు పాటలపల్లకీ ఎక్కి కృష్ణమ్మ అనురాగంలో తడిసి ముద్ద అవుతున్నారు.


(నిన్ననే ఈ చిత్రం చూసాను. నేను కవితలు రాయలేను. నిన్న ఈ చిత్రం చూడగానే ఇలా అనిపించి ఈ మినీ కథ రాసాను. ఇది కథా? కథకు కళ్ళు లేవు, ముంతకు చెవులు లేవు అనకండి. ఇలా అనిపించింది, అలా రాసేసాను. ఇక చదివేవాళ్ళ కంటిసిరి :))

24, ఏప్రిల్ 2024, బుధవారం

బి. గోపాలం - సంగీత దర్శకుడు, , నటుడు




బి గోపాలం - సంగీత దర్శకుడు గాయకుడు నటుడు 

(my charcoal pencil sketch) 


Facebook మిత్రులు వీర నరసింహారాజు గారి వాల్ నుండి సేకరణ యధాతధంగా. వారికి నా ధన్యవాదాలు. 

గాయకుడు బి (బొడ్డు) గోపాలం గూర్చి కొందరికి అయినా తెలుసనుకుంటా!


"అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ" అని కె వి రెడ్డి గారి శ్రీకృష్ణార్జున యుద్ధములో అల్లు, సురభి బాల సరస్వతి మీద  తీసిన హాస్య గీతం గుర్తుందా?. ఆ గీతాన్ని పాడింది గోపాలం, స్వర్ణలతలు.


శ్రీరామాంజనేయ యుద్ధము 1974 లో అర్జా జనార్దన్ రావు గారికి పాటలు అయితే గాయక నటుడు రఘురామయ్య పాడారు గానీ పద్యాలు వచ్చేసరికి మరో గాయకుణ్ణి వెదుక్కోక తప్పలేదు. అవి అద్భుతంగా నాటక ఫక్కీలో బాలుతో పాడింది బి గోపాలమే. 


శాస్త్రీయ సంగీతము క్షుణ్ణంగా అభ్యసించి వాయులీనం కూడా నేర్చుకున్న  గోపాలం చిత్ర రంగానికి వచ్చి ఘంటసాల మాష్టారు వద్ద సహాయకునిగా ఉన్నారు తొలినాళ్లలో. 


తరువాత  కన్నడ నటుడు , దర్శక నిర్మాత  కెంపరాజ్  మన భానుమతి గారితో నటించాలన్న కోరికతో తీసిన నలదమయంతి 1957 చిత్రం ద్వారా పూర్తి సంగీతం చేసి, అందులో నారద పాత్ర వేసి మెప్పించినా ఆ చిత్ర పరాజయం తో మళ్లీ సంగీత సహాయకునిగా ఉండి పోయారు. 


1961లో రచయిత పాలగుమ్మి పద్మరాజు దర్శకుడు గా వచ్చిన బికారి రాముడు లో మళ్లీ తన అద్భుత ప్రతిభ చూపారు. అందులో శ్రీరంగం గోపాల రత్నం గారు పాడిన "నిదురమ్మా నిదురమ్మా కదలీ రావే మాయమ్మా" పెద్ద హిట్. ఆ చిత్రం సంగీతం వినగానే అప్పగింతలు 1962 అనే మరో చిత్రం వచ్చింది. రెండింటి సంగీతం బాగున్నా ఆ చిత్రాల పరాజయం తో మళ్లీ అవకాశాలు దొరక్క గాయకుడు గా కూడా అవతార మెత్తారు. అలా పెండ్యాల గారు ఆయన్ని పాడించారు. తర్వాత రాజేశ్వరరావు వద్ద సహాయకునిగా ఉన్నారు.


రేడియో గాయని రేణుక  బి గోపాలం భార్యయే.


ఎందుకో వాళ్ళ ప్రతిభ బాగున్నా పెద్దగా అవకాశాలు రాకపోవడం తో తిరిగి నాటకాలకు వెళ్లి పోదాం అని అనేకమార్లు వెళ్ళిపోయి తిరిగి అవకాశాలు రావడం తో చివరగా పెద్దలు మారాలి, కరుణామయుడు చిత్రాలకు సంగీతం చేశారు. 


అవి హిట్ అయినా ఆయనకు పేరు రాలేదు. చూడండి వింత . మంచి సంగీతం చేసినా చిత్రాలు విజయవంతం కాకపోవడం తో అవకాశాలు రాలేదు, చిత్రాలు హిట్ అయినా ఆ తర్వాత అవకాశం రాలేదు. పూర్తిగా ఇది దురదృష్టమే కదూ.  


శ్రీరంగం గోపాల రత్నం గారు శాస్త్రీయ సంగీతకారిణిగా బాగా పేరు వచ్చాక ఆయనతో అన్నమయ్య గీతాలు ఆల్బమ్ ఒకటి " అన్నమయ్య పద సౌందర్యము" చేయించి HMV కోసం పాడారు. ఆ రికార్డ్ కూడా పెద్దగా హిట్ అయింది. 


తర్వాత గోపాలం గారు స్వంత ఊరు గుంటూరు వెళ్ళిపోయి అక్కడే నివసిస్తూ 2004 లో  తనువు చాలించారు.

23, ఏప్రిల్ 2024, మంగళవారం

కళాప్రపూర్ణ ద్వారం భావనారాయణ రావు charcoal pencil sketch

ఈ చిత్రంలో వ్యక్తి కీర్తిశేషులు ద్వారం భావనారాయణ రావు.  ఇతడు ద్వారం వెంకటస్వామి, జగ్గయ్యమ్మ దంపతులకు 1924 జూన్ 15 తేదీన బాపట్లలో జన్మించారు. చెన్నైలో విద్యాభ్యాసం చేసిన తర్వాత తండ్రి వద్ద, ప్రొ.పి.సాంబమూర్తి వద్ద సంగీతంలో శిక్షణ పొందారు. 

ఇతడు విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ గా 1962 నుండి 1973 వరకు, తర్వాత విజయవాడ లోని ప్రభుత్వ సంగీత కళాశాలలోను పనిచేశాడు.

ఇతడు మాతంగముని రచించిన బృహద్దేశి, పండిత వెంకటమఖి రచించిన చతుర్దండి ప్రకాశిక, దత్తిలముని రచించిన దత్తిళమును  తెలుగులోకి అనువదించి ప్రచురించారు.

ఇతడు విశాఖపట్నంలో 2000 జూలై 24 తేదీన గుండెనొప్పితో అకస్మాత్తుగా పరమపదించాడు. ఈయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.


మార

  • ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ పురస్కారం.
  • ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సంగీత కళాప్రపూర్ణ.

22, ఏప్రిల్ 2024, సోమవారం

ఇందులోనే కానవద్దా యితడు దైవమని విందువలె నొంటిమెట్టవీరరఘరాముని - అన్నమయ్య కీర్తన



 

నిండు పున్నమి వెన్నెలలో పౌర్ణమి నాడు సంప్రదాయబద్ధంగా ఒంటిమిట్ట రామాలయంలో కోదండరాముని కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుందిట. ఈ సందర్భంగా ఒంటిమిట్ట రాములవారిని స్తుతిస్తూ అన్నమయ్య రచించిన ఓ కీర్తన.

ఇందులోనే కానవద్దా యితడు దైవమని విందువలె నొంటిమెట్టవీరరఘరాముని
యెందు చొచ్చె బ్రహ్మవర మిల రావణుతలలు కందువ రాఘవుడు ఖండించినాడు
ముందట జలధి యేమూల చొచ్చె గొండలచే గొందిబడ గట్టివేసి కోపగించేనాడు
యేడనుండె మహిమలు యిందరి కితడు వచ్చి వేడుకతో హరివిల్లు విఱిచేనాడు
వోడక యింద్రాదు లెందు నొదిగి రీతనిబంటు కూడబట్టి సంజీవికొండ దెచ్చేనాడు
జము డెక్కడికి బోయ సరయవులో మోక్ష మమర జీవుల కిచ్చె నల్లనాడు
తెమలి వానరులై యీదేవతలే బంట్లైరి తిమిరి శ్రీవేంకటపతికి నేడు నాడు



20, ఏప్రిల్ 2024, శనివారం

కొమ్మూరి పద్మావతీదేవి - రంగస్థల/సినీ నటి - charcoal pencil sketch




my charcoal pencil sketch


వికీపీడియా సౌజన్యంతో సేకరించిన వివరాలు ఈ క్రింద పొందుపరుస్తున్నాను.


కొమ్మూరి పద్మావతీదేవి - తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి.

పద్మావతీదేవి చెన్నై లో 1908 జూలై 7 న సంఘసంస్కర్తల కుటుంబంలో జన్మించింది. ఈమె తల్లితండ్రులు సంఘసంస్కరణోద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తూ సంస్కరణ వివాహాం చేసుకున్నారు. వారి వివాహన్ని స్వయంగా కందుకూరి వీరేశలింగం పంతులు నిర్వహించారు. తల్లితండ్రులు పద్మావతిదేవికి చదువుతో పాటూ సంగీతం కూడా నేర్పించారు. పద్మావతిదేవికి 14 యేళ్ల వయసులో గుడిపాటి వెంకట చలం తమ్ముడు కొమ్మూరి వెంకటరామయ్యతో వివాహం జరిగింది. ఈమె కూమార్తె ఉషారాణి భాటియా కూడా రచయిత్రి.

తెలుగు నాటకరంగంలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టిన బళ్ళారి రాఘవ రంగస్థలం పైకి సంసార స్త్రీలను ఆహ్వానించినప్పుడు ఈమె సంప్రదాయపు సంకెళ్ళను త్రెంచుకుని నాటకరంగం మీద కాలుపెట్టారు. ఈమె ప్రహ్లాద నాటకంలో లీలావతి పాత్ర పోషించేవారు. ఆమె రామదాసు , తప్పెవరిది, సరిపడని సంగతులు, చంద్రగుప్త, ఆ లోకం నుండి ఆహ్వానం మొదలైన నాటకాలలో రాఘవతో కలిసి సముచిత పాత్రలలో నటించారు. మహాత్మా గాంధీ డాక్యుమెంటరీ చిత్రంలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

సినిమాల ప్రవేశంతో ద్రౌపదీ మానసంరక్షణంరైతు బిడ్డసుమతిపెద్ద మనుషులు చిత్రాలలో నటించారు. వీరు స్త్రీల సమస్యల మీద ఎన్నో రేడియో ప్రసంగాలు చేశారు.


మరిన్ని వివరాలు ప్రతిలిపి ఈ క్రింది లింకు క్లిక్ చేసి చూడండి.

https://telugu.pratilipi.com/read/%E0%B0%95%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95%E0%B0%A8%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A4%E0%B1%86%E0%B0%B0%E0%B0%95%E0%B1%81-%E0%B0%95%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95%E0%B0%A8%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A4%E0%B1%86%E0%B0%B0%E0%B0%95%E0%B1%81-3oatbsvcqreh-0702z08qb514681 


ధన్యవాదాలు 

19, ఏప్రిల్ 2024, శుక్రవారం

"మహామహోపాధ్యాయ" తాతా సుబ్బరాయశాస్త్రి



తాతా సుబ్బరాయశాస్త్రి - charcoal pencil sketch 

ఈనాడు నా పెన్సిల్ తో చిత్రీకరించుకున్న చిత్రం. ఈ మహానీయుని గురించి వివరాలు క్రింది లింకు క్లిక్ చేసి చదవండి.


తాతా సుబ్బరాయశాస్త్రి (1867-1944) విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు. సంఘ సంస్కర్త. వితంతు పునర్వివాహాలను సమర్థించాడు. అంటరానితనాన్ని వ్యతిరేకించాడు. మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు. 

మరిన్ని వివరాలు ఈ క్రింది లింకు క్లిక్ చేసి చదవండి. ధన్యవాదాలు.

https://www.wikiwand.com/te/%E0%B0%A4%E0%B0%BE%E0%B0%A4%E0%B0%BE_%E0%B0%B8%E0%B1%81%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF

18, ఏప్రిల్ 2024, గురువారం

వావిలకొలను సుబ్బారావు - పండితకవులు - charcoal pencil sketch

పండితకవులు కీ. శే.    వావిలకొలను సుబ్బారావు -  నా charcoal పెన్సిల్ తో చిత్రీకరిణకుకున్న చిత్రం 


వికీపీడియా సౌజన్యంతో ఈ క్రింది వివరాలు సేకరించడమైనది.


ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు (జనవరి 231863 - ఆగష్టు 11936) ప్రముఖ రచయిత, గ్రాంథికవాది. కందుకూరి వీరేశలింగం పంతులు తర్వాత, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా 1904-1920 మధ్యకాలంలో పనిచేశారు. భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు. ధర్మసమాజాన్ని స్థాపించారు. రామ భక్తుడు. రామాయణము ఆంధ్రీకరించి "ఆంధ్ర వాల్మీకి" బిరుదు పోందారు. ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని పునరుద్ధరించడానికి ఒక కొబ్బరి చిప్పను బిక్షా పాత్రగా విరాళాలను పోగు చేశారు, టెంకాయ చిప్ప శతకాన్ని రచించారు.

ఆంధ్ర వాల్మీకి హస్తంబు నందు నిలిచి రూప్యములు
వేన వేలుగా ప్రోగు చేసి దమ్మిడైనను వాని లో
దాచుకొనక ధరణి జాపతి కర్పించి ధన్యవైతి
కర్మ గుణపణిముల కుప్ప ! టెంకాయ చిప్ప! "



మరిన్ని వివరాలు ఈ క్రింది లింకు క్లిక్ చేసి తెలుసుకొనగలరు.

https://te.wikisource.org/wiki/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF%E0%B0%95%E0%B1%8A%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81_%E0%B0%B8%E0%B1%81%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF


రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...