4, ఏప్రిల్ 2026, శనివారం

ఎందాక ఎందాకా... కధ



ఎందాకా ఎందాకా... కధ
 పొన్నాడ మూర్తిగారి చిత్రానికి నా స్వగతం.


 


ఎందాకా... ఎందాకా... ఎందాక!


రచన: కమల పరచ


 


పుస్తకాలు సద్దుకుంటూ, భాను వైపు చూసాను. అప్పటి కి తనూ లేచింది. పుస్తకాల బాగ్ భుజానికి తగిలించుకొని కూ అని కూత పెడుతూ పరుగు తీసాము. అవును మరి అప్పటికే కొంచం ఆలశ్యం అయ్యింది. సోషల్ సారు బెల్ల్ మోగిన వెంటనే వదల్లే. అడ్డం వచ్చిన రాళ్ళను తన్నుకుంటూ పరుగులు పెట్టాము. అప్పటి కే గూడ్స్ వచ్చేస్తోంది. దాని వెంట ఒక్కో పెట్టే తో పాటు పరిగెడుతూ చివరి పెట్టే దగ్గర కోచ్చాము. అందులో నుంచి గార్డ్ మామయ్య దిగుతున్నాడు. మమ్మలిని చూసి నవ్వుతూ ఈ రోజు ఆలశ్యం అయ్యిందెందుకు అమ్మాయిలూ అని పలకరించాడు. మామయ్యా ఆ జెండా ఇవ్వవా అని ఆశ గా చూస్తూ అడిగాను. తప్పమ్మా మీకు ఇవ్వకూడదు అని పక్కకు వెళ్ళాడు. అక్కడి నుంచి వెనకకు కూ... అని కూతేసుకుంటూ పరిగేట్టాము. డ్రైవర్ మామయ్య దగ్గరకు వెళ్ళాము. డ్రైవర్ మామయ్యా ఇద్దరికీ చెరొక గాజు గొట్టం ఇస్తూ, ఇక వెళ్ళండమ్మా అన్నాడు. అప్పుడేనా అనుకుంటూ ఆ చివరనుంచి ఈ చివర దాకా పెట్టలు లెక్కపెడుతూ పరుగెత్తి, పట్టాలు దాటి అవతలి ప్లాట్ ఫాం కు వెళ్ళాము. అక్కడ ఫ్లాట్ ఫాం చివర ఉన్న పసుపచ్చని బోర్డ్ మీద నల్లటి అక్షరాల తో రాసి ఉన్న “ మహుబూబాబాద్ “ అక్షరాలను ఆరాధనగా చూసి, అవి అందుకుందామని ఎగిరాము. కాని ఊమ్హూ అందలే! కాసేపు బెంచ్ మీద కూర్చున్నాము. అక్కడున్న గానుగ చెట్టు చుట్టు పరిగెత్తాము. ఇంకా అలిసిపోయి ఇంటికి బయలు దేరాము. ఇంతలో ఎక్కడి నుంచో “..... పోవు పాసెంజర్ కొద్దిసేపట్లో... “ అని వినిపించింది. నా కాళ్ళు అప్రయత్నం గా ఆగిపోయాయి. చెవులు నిక్కబొడుచుకొని పూర్తిగా విన్నాను. అబ్బ ఆ అమ్మాయి ఎంత బాగా చెపుతుందో. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. కాని నాకు అలా వినటం భలే ఇష్టం! అది పూర్తయ్యే దాకా అక్కడి నుంచి కదిలేదానిని కాదు. నేనూ ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పుడు మానుకోట లో ఇంటి కి వెళ్ళటానికి రైల్వే స్టేషన్ దాటి వెళ్ళాల్సి వచ్చేది. అదో అప్పుడు అక్కడ నేనూ, నాఫ్రెండ్ భాను ఇలా అలిసిపోయే దాకా ఆడుకునేవాళ్ళం! ఆ వెళుతున్న పాసెంజర్ ఎప్పుడు ఎక్కుతామా అనుకునే వాళ్ళం. అలా అనుకుంటూ అనుకుంటూ మా నాన్నగారికి మానుకోట నుంచి వరంగల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు వరంగల్ వెళ్ళటానికి ఎక్కాము. ఆ డబ్బా లో అమ్మ, నాన్నగారు, నేనూ. అంతే ఇంకెవరూ లేరు. అది ఫస్ట్ క్లాస్ డబ్బా అని అప్పుడు నాకు తెలీదు. అందులో అద్దం కూడా ఉంది. ఆ అద్దం లో ఎన్ని సార్లు చుసుకున్నానో! అలా ఆ మానుకోట రైల్వే స్టేషన్ నా మనసులో ఉండిపోయింది. చిన్నపుడే రైలంటే ఏర్పడిన ఇష్టం మనసులో ఉండిపోయింది. చాలా ఏళ్ళవరకు ఎనౌన్సర్ గా జాబ్ చేయాలని కోరికగా ఉండేది. ఇప్పటికీ రైల్వే స్టేషన్ లొ ఎనౌన్స్మెంట్ వినగానే నా కాళ్ళు ఒక్క క్షణం ఆగిపోతాయి. చెవులు దోర విచ్చుకుంటాయి.


 


 


ఆ తరువాత చాలా ఏళ్లకు, పెళ్ళయ్యాక పాటియాలా వెళ్లేందుకు సదరన్ ఎక్స్ ప్రెస్ ఎక్కాను. మూడు రోజుల ప్రయాణం. అందులోనే స్నానం, భోజనం అన్నీ అంటే ఎంత వింతగా అనిపించిందో. ఫస్ట్ క్లాస్ కూపే, కిటికీ దగ్గర కూర్చొని వెనక్కి పరిగెడుతున్న స్తంబాలు, ఇళ్ళు, పచ్చని పొలాలు, కరెంట్ స్తంబాలు, ఈత చెట్లు, కొన్ని చోట్ల ట్రాక్ పక్కనుంచి వెళుతున్న రోడ్, ఒకటేమిటి అన్నీ తెగ నచ్చేసాయి. మూడు రోజులు రైలులో ఉన్నా విసుగనిపించలేదు. ఆ తరువాత దేశం నలుమూలలా, కలకత్తా, డిల్లీ, మద్రాస్, పూనా, బొంబాయ్ మొత్తం తిరిగాము. అప్పట్లో మొదటగా వచ్చిందిట భోగీల మధ్య బోగీల మధ్య నుంచి ఒక దానిలోకి వెళ్ళే దారి ఉన్న రైలు, ఆగ్రా నుంచి డిల్లీ. దాని లో సరదాగా ఈ చివర నుంచి ఆ చివరకు తిరిగాము. కొత్తగా వచ్చిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ గంగాకావేరి, బాంబే లో లోకల్ ట్రేన్స్, లాస్ వేగాస్ లో, కాలిఫోర్నియాలో లోకల్ రైళ్ళు అబ్బో తనివితీరా ఎన్నిరైళ్ళల్లోప్రయాణం చేసానో! కాకపోతే డార్జ్ లింగ్ లో టాయ్ ట్రేన్ ఎక్కటమే పడలేదు! ఎప్పటికైనా “ పాలస్ ఆన్ వీల్స్” ఎక్కాలి అని కోరిక  :)


 


ప్రయాణాలలో ఎన్ని అనుభవాలు! ఎక్కడికెళ్ళినా మూడు రోజుల ప్రయాణం తప్పనిసరి. అన్ని రోజులూ నేను వదలకుండా కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తూ ఊహలల్లో ఉంటే పాపం ఏమండీనే పిల్లలను ఎంగేజ్ చేసేవారు. సిలిగురి వెళ్ళేటప్పుడు ఆ రోజులల్లో ఏ. సి భొగీ లు లేవు. మా అబ్బాయి మూడు నెలల వాడు. అమ్మాయి మూడేళ్ళది. మంచి ఎండాకాలం. వడగాలులు. కూపే కిటికీ కి పలచటి గ్లాస్కో దోతీ కట్టి, ప్రయాణం అంతా దానిని తడుపుతూ ఉన్నాము. ప్రతి రైల్ స్టేషన్ లో అక్కడ దొరికే స్పెషల్స్ తినటం సరదాగా ఉండేది. కలకత్తా లో చిన్న చిన్న మట్టి ముంతలల్లో చాయ్, రసగుల్లాలు, ఇటార్సీ స్టేషన్ లో స్టీల్ గ్లాస్ లో గరమాగరం చాయ్, నాగ్ పూర్ లొ ఆరెంజెస్, లోనావలాలో చిక్కీ, బటాకా వడా, రాజమండ్రి లో ఆకుపచ్చని బత్తాయిలు, వైజాగ్ లో ముసలతని బండి మీది కందిపొడి, జాల్నా లో జామకాయలు ఇలా అన్నీ బాగుండేవి. అన్నిటిలోకి బాంబే వి. టి స్తేషన్ దగ్గర పావ్ భాజి, చాట్, పానీ పూరీ, భేల్ పూరీ నాకు భలే నచ్చేవి. అంతేనా బరోడా నుంచి బాంబే వెళ్ళేటప్పుడు ఆ కాస్త ప్రయాణానికీ గుజరాతీ లు పెద్ద పెద్ద డబ్బాల నిండా స్నాక్స్ తెచ్చుకునేవారు. మాకూ తినమని పెట్టే ఆ చుడువా, ఘమండ్, స్వీట్స్ అన్నీ చాలా టేస్టీ గా ఉండేవి. కేరళ, ఉత్తరప్రదేశ్ తప్ప దాదాపు భారతదేశం లోని అన్ని రాష్ట్రాల నుంచీ మా కూ... చుక్... చుక్ ప్రయాణించింది. ఈ రాష్ట్రం దాటాము, ఈ రాష్ట్రం లోకి వచ్చాము, రాత్రి పడుకున్నప్పుడు ఒక రాష్ట్రం లో, తెల్లారి లేచేటప్పటికి ఇంకో రాష్ట్రం లో, ష్టేషన్ లల్లో వివిధ భాషలు మాటలు గల గలా వినిపించటం అంతా తమాషా గా ఉండేది.


 


అలాగే రైలు ప్రయాణం లో ఎంతో మంది ప్రయాణికులు పరిచయము అవుతారు. అందులోనూ మా ఏమండీ అందరినీ పలకరిస్తారు. కాకపోతే రైలు దిగగానే వాళ్ళను మర్చిపోతాము అది వేరే సంగతి. కాని ఒక్క జంటను మాత్రము నేను ఇప్పటికీ మర్చిపోలేను. మాకు ఆగ్రా హోటల్ లో పరిచయం అయ్యారు. వాళ్ళూ మాలాగే కొత్త గా పెళ్ళైనవాళ్ళు. నలుగురమూ కలిసి టాక్సీ మాట్లాడుకొని ఆగ్రా అంతా తిరిగాము. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, తాజ్ మహల్ దగ్గర నేను ఫొటో గ్రాఫర్ తో ఫొటో తీయించుకుందామనుకున్నాను. నై నై భాభీ మై కీంచూంగా అని అటు తిప్పి, ఇటు తిప్పి బోలెడు ఫొజులల్లో మా ఇద్దరి ఫొటోలు తీసాడు. ఆ తరువాత డిల్లీ దాకా కబుర్లు చెప్పుకుంటూ, రైలంతా కలియ తిరుగుతూ కలిసి ప్రయాణించాము. మా ఎడ్రెస్ కూడా తీసుకున్నాడు. పాటియాలా లో ఉన్నన్ని రోజులూ ఎదురు చూసాను ఆ ఫొటోల కోసం. రాలేదు. పక్కింటి మిసెస్. జగన్నాథం కు వస్తాయేమో, వస్తే పంపించమని చెప్పాను. ఇప్పటికీ ఎదురుచూస్తున్నాను ఆ ఫొటోల కోసం. ఆ తరువాత డిల్లీ ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ ఆగ్రా వెళ్ళటం పడలేదు. సన్నగా పొడుగ్గా ఉన్న ఆయన మటుకు గుర్తుండిపోయాడు!


 


చాలా సంవత్సరాల తరువాత ట్రేన్ ఎక్కాను. ఏ.సీ కంపార్ట్మెంట్. చీకటి పడింది . అందరూ కబుర్లు ఆపేసి, పెద్ద లైట్  తీసి , చిన్న బ్లూ లైట్ వేసారు. అంతటా నిశబ్ధం! నేనూ పడుకున్నాను కాని నిద్ర రావటం లేదు. లేచి కూర్చున్నాను. బయటకు చూసాను. ఆ నిశబ్ధ నిశీధిలో… ఏ.సీ నల్లటి అద్దాలల్లో నుంచి, అక్కడక్కడ దీపాలు మిణుకు మిణుక్కుమంటున్నాయి.  రైలు చక్రాలు లయబద్ధంగా కదులుతున్నాయి. వాటి తో పాటే సాగిపోతున్నాయి నా మదిలోని ఎడతెగని ఆలోచనలు...


ఈ ప్రయాణం ఎందాకా?


ఎప్పటి వరకూ...


గమ్యం ఎటు?


ఎమో!

28, మార్చి 2026, శనివారం

క్షన్నులు కన్నులు కలుపుతూ - గజల్


 గజల్

 ✍️గుడిపూడి రాధికారాణి


కన్నులకన్నులు కలుపుతు కానుకలందుకోవడం పండగే కదా!

నేనే బహుమతినంటూ వస్తే నవ్వుకోవడం పండగే కదా!  


నవ్వులపువ్వులు రాలని వేళన సందడుండునా?

బావా రావా అంటూనే బతిమాలుకోవడం పండగేకదా!  


రవ్వలహారం కొంటానంటే మురిపెము చూపే భామను కానోయ్

నామెడచుట్టూ చేతులువేస్తే మురుసుకోవడం పండగే కదా!


అరిసెలు బూరెలు గారెలు జంతిక విస్తరినున్నా విందు ముగియదోయ్ 

చిలకలు చుట్టిన నాచేతులనే చేరుకోవడం పండగే కదా!


మల్లెలు జాజులు పరిమళభరితపు కుసుమాలంటే నమ్మను బావా 

చూపులతూపులు తాకగ తావిని నింపుకోవడం పండగే కదా!


సాగరతీరపు సరదాషికారు చాలనిపించదు ఎందుకు బావా?

కలిపిన అడుగులు కెరటము దాచగ ఆడుకోవడం పండగే కదా!


బావను మించిన ఇంద్రజాలికుడు లేడని చెప్పగ సంశయమేలోయ్

తెల్లని బుగ్గలు ఎర్రని కెంపులనద్దుకోవడం పండగే కదా!


నా చిత్రానికి ప్రముఖ రచయిత్రి శ్రీమతి గుడుపూడి రాధికా రాణి రచన )

27, మార్చి 2026, శుక్రవారం

​నిశ్శబ్దపు మేఘం


 ​నిశ్శబ్దపు మేఘం 


​ అప్పుడప్పుడు ఆకాశం నిండా

 మబ్బులు పట్టినట్టు,

 మనసంతా ఏదో దిగులు కమ్మేస్తుంది..


నొప్పించే ఏ చిన్న భావన

మదిలో మెదిలినా...

ఆలోచనలు చుట్టూముట్టి 

అచేతనంగా మార్చేస్తాయి...


 ఆవహించిన దిగులు మేఘం వెనకాల 

 ఓ చిన్న యుద్ధమే జరుగుతుంది..

 అందుకే చిరునవ్వులు చిందాల్సిన పెదవులు

మౌనాన్ని కట్టబెట్టుకుంటాయి ..


కాసింత సమయమే...

నిశ్శబ్దపు మేఘం కరిగి.. 

చిరుజల్లు కురిపించగానే

మళ్ళీ విరిసిన మందారమై 

 దరహాసాలు విరబూయదా..!!


అనూశ్రీ 


(నా చిత్రానికి ఆత్మీయ మిత్రురాలు రచించిన కవిత)


25, మార్చి 2026, బుధవారం

ఉదయరాగం

వేకువజామున మెత్తని బంగారు వర్ణపు కాంతిలో, కమల తన భుజంపై బరువైన లోహపు బిందెను సమతుల్యం చేసుకుంటూ ఆ దుమ్ము దారిలో నడుస్తోంది. గ్రామం ఇంకా నిద్రలేస్తోంది, ఇళ్లన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. కొన్ని ఇళ్ల పొయ్యిల నుండి పొగ వస్తోంది, తాజా  మట్టి వాసన గాలిలో పరచుకుని ఉంది.
​ఆమె గ్రామంలోని ఎండిన మట్టి గోడల రంగులో ఉన్న కమల చీర, ఆమె నడుస్తుంటే గాలిలో కదులుతోంది. ప్రతి అడుగులోనూ దైనందిన జీవితపు లయ కనిపిస్తోంది. ఏళ్ల తరబడి వాడటం వల్ల మెరిసిపోతున్న ఆ లోహపు బిందె, ఈ ప్రయాణంలో ఆమెకు తోడుగా ఉంది; అది ఆమె శక్తికి, పట్టుదలకు ఒక నిదర్శనం.
​ముంగిట ఊడుస్తున్న తన పొరుగున ఉండే లక్ష్మిని చూసి ఆమె మృదువుగా నవ్వింది. "రామ్ రామ్, కమల! కుటుంబం కోసం తాజా నీళ్లు తెస్తున్నావా?" అని అడిగింది లక్ష్మి.
​"రామ్ రామ్, లక్ష్మి. అవును, ఈ ఉదయం బావిలో నీళ్లు బాగా వస్తున్నాయి."
​భుజం మీద బరువు ఉన్నప్పటికీ కమల మనసు తేలికగా అనిపించింది. ప్రతిరోజూ చేసే ఈ పని, ఆ నీటి వనరుతో ఉన్న అనుబంధం కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు. అది ఒక జీవనాధారం, తన సమాజంతో పెనవేసుకున్న ఒక ఉద్దేశ్యం. ఆమె తన ఇంటి గుమ్మం చేరుకోగానే, పిల్లలు ఎంతో ఆతృతగా బయటకు వచ్చారు. బిందెలోని ఆ చల్లని నీరు ఒక సాధారణ ఆనందానికి, ఒక కొత్త రోజు శుభారంభానికి సంకేతం.
​చివరగా ఆ బిందెను మెత్తగా తడుముతూ, తను కేవలం నీళ్లు మోసే మహిళ మాత్రమే కాదని కమల గ్రహించింది. ఆమె తన గ్రామానికి గుండెకాయ వంటిది, దాని జీవనాధారానికి సంరక్షకురాలు, మరియు అపారమైన అంతర్గత సౌందర్యం, శక్తి కలిగిన మహిళ. 






 

20, మార్చి 2026, శుక్రవారం

మార్పు

 




ఆమెలో మార్పు ఒక్క రోజులో రాలేదు. ఆ ..... ఒక్క రోజు ఆమె జీవితాన్ని మార్చేసింది ....
తన మనస్సులో మాటలని  పంచుకోవాలనుకుంది ….
వినేవారు  లేనప్పుడు తన మాటలకి   విలువ లేదనిపించింది. 
........ఆమె మౌనాన్ని ఆశ్రయించింది  
 ........మనసు మూగబోయింది ....
               ...ఒకరోజు…
         ఆమె మౌనం మాటలయ్యింది…
          ఆ మాటలు స్వరమయ్యాయి…
       ఆమెని  గుర్తించమని అడగదు…
గుర్తించక తప్పని స్థాయిలో నిలబడుతుంది… ఆమె !!!
✍️లక్ష్మీ అయ్యగారి (అల )

రచన : శ్రీమతి లక్ష్మి అయ్యగారి 
చిత్రం : పొన్నాడ మూర్తి

16, మార్చి 2026, సోమవారం

నిందాస్తుతి - కథానిక


 కథా  శీర్షిక: "  నిందా స్తుతి" 


స్వీయ రచన, ప్రముఖ పెన్సిల్ స్కెచ్ ఆర్టిస్ట్ Pvr MurtyMoorthy గారి బొమ్మకు కథ- భవాని కుమారి బెల్లంకొండ కథానిక.  


""ఎందుకో ఆ నవ్వు"


అటు తిరిగి ఉన్న సుహాసిని పెదవులపై ఒక సన్నని  హాసరేఖ కదలాడింది ఆ ప్రశ్నకి.


రవిచంద్ర అదే ప్రశ్న మళ్ళీ రెట్టించాడు 


"పేరు సుహాసిని  అయినందుకా ఆ నవ్వు "భార్య భుజం మీద చేయి వేస్తూ అన్నాడు రవిచంద్ర 


జవాబు చెప్పలేదు సుహాసిని మళ్ళీ అటు తిరిగి  అదే సన్నని నవ్వు నవ్వింది.


" నాకు తెలుసు నీకు నవ్వెందుకొస్తుందో , అందగత్తెవి కదా అందుకు, అలనాటి నటి బి. సరోజా దేవి మించిన అందం కదా నీది,  పైగా ఈ తెలి పూల నీలం రంగు చీరలో పివిఆర్ మూర్తి చిత్రానికి ప్రాణం పోసినట్టుగా ఉన్నావు కదా! అదీ నీ గర్వం   అనుకుంటా" అన్నాడు రవిచంద్ర.


జవాబు చెప్పకుండా మళ్లీ నవ్వింది సుహాసిని.


" సరే! నా సంగతేమిటి? అందంగా లేనా ఈ పంచ కట్టులో, అసలేం బాలేనా ఈ మీస కట్టులో "అన్నాడు గమ్మత్తుగా రవిచంద్ర.


 అప్పటికి నోరు విప్పింది సుహాసిని,  "నేనన్నానా పంచ కట్టలో బాగా లేరని" అన్నది.


 "అయినా నీకు చాలా గర్వంలే, గంధర్వకన్య లా  ఏ ఆభరణాలు ధరించకపోయినా, ఏ ఫంక్షన్ కి వెళ్ళినా  అందరి కళ్ళు నీ మీదే అన్న గర్వం నీకు" అన్నాడు రవిచంద్ర.


 "ఎందుకు నవ్వానో  చెప్పకపోతే ఇవాళ ఫంక్షన్ కి బయలుదేరరా" అన్నది సుహాసిని కనుబొమ్మలు ముడిచి." అయినా "సిసిఎంబి" (CCMB) లో సైంటిస్ట్ కదా మీరు , ఇలా పంచ కట్టులో ఫంక్షన్ కి వస్తారని ఎవరు ఊహిస్తారు?" అన్నది నవ్వుతూ సుహాసిని.


" ఓహో!  సైంటిస్ట్ అయితే, ఇంక వాడు  పిచిక గూడుగా అయిపోయిన తెల్లని జుట్టుతో, గాంధీ గారి కళ్ళజోడుతో, పిచ్చి చూపులు చూస్తూ కనిపించాలన్నమాట! లేకపోతే రంగు రంగుల పిచ్చి పూల  బుష్ షర్ట్ వేసుకొని ఉండాలన్నమాట అంతేనా" అన్నాడు.


 "మహాప్రభో! నేను అలా ఏమీ అనలేదు ఈ పంచ కట్టులో  పెళ్లిరోజు ఎంత అందంగా ఉన్నారో,  ఈరోజు అంతే వున్నారు  మహానుభావా, అయినా మన జంటని అంతా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు గా" అన్నది.


 "అయినా నువ్వు పెద్ద మోసగత్తెవిలే" ఆనాడు రవిచంద్ర కవ్విస్తునట్టుగా.


"నేనా, నేనేం మోసం చేశాను మిమ్మల్ని?" అన్నది చిరుకోపంగా. 


"పెళ్లి చూపుల్లో  ' నా చదువుకు తగ్గ జాబ్ తప్పకుండా చేస్తాను అన్నావు, ఇప్పుడేమో హాయిగా ఇంట్లోనే కూర్చుని, నా కళ్ళు బైర్లు కమ్మేలా తళుకు లీనుతూ , నా మతి పోగొడుతున్నావు, అసూర్య పశ్యవై" రోజు, రోజుకీ మెరిసిపోతున్నావు" అన్నాడు గొప్ప పారవశ్యం తో.


"అవును, పెళ్లికి ముందు అవసరమైతే చేద్దామనుకున్నా, కానీ పెళ్లయ్యాక అయ్యగారు ఎంత పెద్ద సైంటిస్ట్    అని తెలిసి, ఇంకెందుకు నేను కష్టపడటం అనుకొని జాబ్ గురించే ఆలోచించటం మానేశా, అయ్యగారు ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిన దగ్గర నుండి ఆ మైక్రోస్కోప్లో కళ్ళు పెట్టి, ఏం పరిశోధనలు చేసి అలసిపోయి వస్తారోనని ని ఇంటికి రాగానే అలసట పోయేలా స్వాగతిస్తుంటే, మోసం చేశా నని నా మీద నింద వేస్తారా"  కినుకగా అన్నది సుహాసిని.


రవిచంద్ర నవ్వేశాడు, " అయితే నీకు దీటుగావున్నానంటావు, ఈ పంచ కట్టులో  నేను చాలా బాగున్నాను అంటావు, అంతేనా"


" అంత లేదులెండి, దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి పంచ కట్టులో వున్న అందం ఇంకెవరికి రాదు లెండి" అన్నది నవ్వు దాచుకుంటూ.


" అంటే నేను ఆయన అంత అందగాడిని కాదంటావ్, అంటే నీ ఉద్దేశం సైంటిస్టులు గడ్డం పెంచి, పిచ్చిపిచ్చిగా ఉండాలం టావు, నాలా రొమాంటిక్ గా ఉండకూడదా" కొంటెగా ప్రశ్నించాడు. 


 సుహాసిని నవ్వుతూ, " ఇంక ఆపండి మహానుభావా, పెళ్లిరోజు ఎంత అందంగా ఉన్నారో,  ఇద్దరు బిడ్డల తండ్రయినా, ఈరోజు కూడా అంతే బాగున్నారు. మీరెంత  రొమాంటిక్ మనిషో  నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది? మీ  మాటలు ఎవరైనా వింటే నన్ను మాటలతో ఏడిపిస్తున్నారనుకొంటారు,  ఇంక బయలుదేరండి   మహాప్రభో, ఫంక్షన్ కి లేటవుతోంది" అన్నది సుహాసిని ముందుకు అడుగేసి. 


(సమాప్తం )"

6, మార్చి 2026, శుక్రవారం

పూజలు చేయ...

 




చిత్రం :  పూజ (1975)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  దాశరథి6
నేపధ్య గానం : వాణీ జయరాం


పల్లవి :


పూజలు చేయ పూలు తెచ్చాను
పూజలు చేయ పూలు తెచ్చాను
నీ గుడి ముందే నిలిచాను
తియ్యరా తలుపులను... రామా
ఇయ్యరా దరిశనము...  రామా 


పూజలు చేయ పూలు తెచ్చాను 


చరణం 1 :

తూరుపులోన తెలతెలవారే
బంగరు వెలుగు నింగిని చేరే 


తొలి కిరణాల... ఆ... ఆ... ఆ... ఆ...
తొలి కిరణాల హారతి వెలిగే...  ఇంకా జాగేలా స్వామీ
ఇయ్యరా దరిశనము రామా


ఇయ్యరా దరిశనము...  రామా
పూజలు చేయ పూలు తెచ్చాను


చరణం 2 :


దీవించేవో కోపించేవో...  చెంతకు చేర్చి లాలించేవో
దీవించేవో కోపించేవో...  చెంతకు చేర్చి లాలించేవో 


నీ పద సన్నిధి...  నా పాలిటి పెన్నిధి
నీ పద సన్నిధి...  నా పాలిటి పెన్నిధి
నిన్నే నమ్మితిరా స్వామీ
ఇయ్యరా దరిశనము రామా 


పూజలు చేయ పూలు తెచ్చాను
నీ గుడి ముందే నిలిచాను
ఇయ్యరా దరిశనము...  రామా 

పూజలు చేయ....  పూలు తెచ్చాను 


ఎందాక ఎందాకా... కధ

ఎందాకా ఎందాకా... కధ  పొన్నాడ మూర్తిగారి చిత్రానికి నా స్వగతం.   ఎందాకా... ఎందాకా... ఎందాక! రచన: కమల పరచ   పుస్తకాలు సద్దుకుంటూ, భాను వైపు చూ...