పొన్నాడ మూర్తిగారి చిత్రానికి నా స్వగతం.
ఎందాకా... ఎందాకా... ఎందాక!
రచన: కమల పరచ
పుస్తకాలు సద్దుకుంటూ, భాను వైపు చూసాను. అప్పటి కి తనూ లేచింది. పుస్తకాల బాగ్ భుజానికి తగిలించుకొని కూ అని కూత పెడుతూ పరుగు తీసాము. అవును మరి అప్పటికే కొంచం ఆలశ్యం అయ్యింది. సోషల్ సారు బెల్ల్ మోగిన వెంటనే వదల్లే. అడ్డం వచ్చిన రాళ్ళను తన్నుకుంటూ పరుగులు పెట్టాము. అప్పటి కే గూడ్స్ వచ్చేస్తోంది. దాని వెంట ఒక్కో పెట్టే తో పాటు పరిగెడుతూ చివరి పెట్టే దగ్గర కోచ్చాము. అందులో నుంచి గార్డ్ మామయ్య దిగుతున్నాడు. మమ్మలిని చూసి నవ్వుతూ ఈ రోజు ఆలశ్యం అయ్యిందెందుకు అమ్మాయిలూ అని పలకరించాడు. మామయ్యా ఆ జెండా ఇవ్వవా అని ఆశ గా చూస్తూ అడిగాను. తప్పమ్మా మీకు ఇవ్వకూడదు అని పక్కకు వెళ్ళాడు. అక్కడి నుంచి వెనకకు కూ... అని కూతేసుకుంటూ పరిగేట్టాము. డ్రైవర్ మామయ్య దగ్గరకు వెళ్ళాము. డ్రైవర్ మామయ్యా ఇద్దరికీ చెరొక గాజు గొట్టం ఇస్తూ, ఇక వెళ్ళండమ్మా అన్నాడు. అప్పుడేనా అనుకుంటూ ఆ చివరనుంచి ఈ చివర దాకా పెట్టలు లెక్కపెడుతూ పరుగెత్తి, పట్టాలు దాటి అవతలి ప్లాట్ ఫాం కు వెళ్ళాము. అక్కడ ఫ్లాట్ ఫాం చివర ఉన్న పసుపచ్చని బోర్డ్ మీద నల్లటి అక్షరాల తో రాసి ఉన్న “ మహుబూబాబాద్ “ అక్షరాలను ఆరాధనగా చూసి, అవి అందుకుందామని ఎగిరాము. కాని ఊమ్హూ అందలే! కాసేపు బెంచ్ మీద కూర్చున్నాము. అక్కడున్న గానుగ చెట్టు చుట్టు పరిగెత్తాము. ఇంకా అలిసిపోయి ఇంటికి బయలు దేరాము. ఇంతలో ఎక్కడి నుంచో “..... పోవు పాసెంజర్ కొద్దిసేపట్లో... “ అని వినిపించింది. నా కాళ్ళు అప్రయత్నం గా ఆగిపోయాయి. చెవులు నిక్కబొడుచుకొని పూర్తిగా విన్నాను. అబ్బ ఆ అమ్మాయి ఎంత బాగా చెపుతుందో. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. కాని నాకు అలా వినటం భలే ఇష్టం! అది పూర్తయ్యే దాకా అక్కడి నుంచి కదిలేదానిని కాదు. నేనూ ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పుడు మానుకోట లో ఇంటి కి వెళ్ళటానికి రైల్వే స్టేషన్ దాటి వెళ్ళాల్సి వచ్చేది. అదో అప్పుడు అక్కడ నేనూ, నాఫ్రెండ్ భాను ఇలా అలిసిపోయే దాకా ఆడుకునేవాళ్ళం! ఆ వెళుతున్న పాసెంజర్ ఎప్పుడు ఎక్కుతామా అనుకునే వాళ్ళం. అలా అనుకుంటూ అనుకుంటూ మా నాన్నగారికి మానుకోట నుంచి వరంగల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు వరంగల్ వెళ్ళటానికి ఎక్కాము. ఆ డబ్బా లో అమ్మ, నాన్నగారు, నేనూ. అంతే ఇంకెవరూ లేరు. అది ఫస్ట్ క్లాస్ డబ్బా అని అప్పుడు నాకు తెలీదు. అందులో అద్దం కూడా ఉంది. ఆ అద్దం లో ఎన్ని సార్లు చుసుకున్నానో! అలా ఆ మానుకోట రైల్వే స్టేషన్ నా మనసులో ఉండిపోయింది. చిన్నపుడే రైలంటే ఏర్పడిన ఇష్టం మనసులో ఉండిపోయింది. చాలా ఏళ్ళవరకు ఎనౌన్సర్ గా జాబ్ చేయాలని కోరికగా ఉండేది. ఇప్పటికీ రైల్వే స్టేషన్ లొ ఎనౌన్స్మెంట్ వినగానే నా కాళ్ళు ఒక్క క్షణం ఆగిపోతాయి. చెవులు దోర విచ్చుకుంటాయి.
ఆ తరువాత చాలా ఏళ్లకు, పెళ్ళయ్యాక పాటియాలా వెళ్లేందుకు సదరన్ ఎక్స్ ప్రెస్ ఎక్కాను. మూడు రోజుల ప్రయాణం. అందులోనే స్నానం, భోజనం అన్నీ అంటే ఎంత వింతగా అనిపించిందో. ఫస్ట్ క్లాస్ కూపే, కిటికీ దగ్గర కూర్చొని వెనక్కి పరిగెడుతున్న స్తంబాలు, ఇళ్ళు, పచ్చని పొలాలు, కరెంట్ స్తంబాలు, ఈత చెట్లు, కొన్ని చోట్ల ట్రాక్ పక్కనుంచి వెళుతున్న రోడ్, ఒకటేమిటి అన్నీ తెగ నచ్చేసాయి. మూడు రోజులు రైలులో ఉన్నా విసుగనిపించలేదు. ఆ తరువాత దేశం నలుమూలలా, కలకత్తా, డిల్లీ, మద్రాస్, పూనా, బొంబాయ్ మొత్తం తిరిగాము. అప్పట్లో మొదటగా వచ్చిందిట భోగీల మధ్య బోగీల మధ్య నుంచి ఒక దానిలోకి వెళ్ళే దారి ఉన్న రైలు, ఆగ్రా నుంచి డిల్లీ. దాని లో సరదాగా ఈ చివర నుంచి ఆ చివరకు తిరిగాము. కొత్తగా వచ్చిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ గంగాకావేరి, బాంబే లో లోకల్ ట్రేన్స్, లాస్ వేగాస్ లో, కాలిఫోర్నియాలో లోకల్ రైళ్ళు అబ్బో తనివితీరా ఎన్నిరైళ్ళల్లోప్రయాణం చేసానో! కాకపోతే డార్జ్ లింగ్ లో టాయ్ ట్రేన్ ఎక్కటమే పడలేదు! ఎప్పటికైనా “ పాలస్ ఆన్ వీల్స్” ఎక్కాలి అని కోరిక :)
ప్రయాణాలలో ఎన్ని అనుభవాలు! ఎక్కడికెళ్ళినా మూడు రోజుల ప్రయాణం తప్పనిసరి. అన్ని రోజులూ నేను వదలకుండా కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తూ ఊహలల్లో ఉంటే పాపం ఏమండీనే పిల్లలను ఎంగేజ్ చేసేవారు. సిలిగురి వెళ్ళేటప్పుడు ఆ రోజులల్లో ఏ. సి భొగీ లు లేవు. మా అబ్బాయి మూడు నెలల వాడు. అమ్మాయి మూడేళ్ళది. మంచి ఎండాకాలం. వడగాలులు. కూపే కిటికీ కి పలచటి గ్లాస్కో దోతీ కట్టి, ప్రయాణం అంతా దానిని తడుపుతూ ఉన్నాము. ప్రతి రైల్ స్టేషన్ లో అక్కడ దొరికే స్పెషల్స్ తినటం సరదాగా ఉండేది. కలకత్తా లో చిన్న చిన్న మట్టి ముంతలల్లో చాయ్, రసగుల్లాలు, ఇటార్సీ స్టేషన్ లో స్టీల్ గ్లాస్ లో గరమాగరం చాయ్, నాగ్ పూర్ లొ ఆరెంజెస్, లోనావలాలో చిక్కీ, బటాకా వడా, రాజమండ్రి లో ఆకుపచ్చని బత్తాయిలు, వైజాగ్ లో ముసలతని బండి మీది కందిపొడి, జాల్నా లో జామకాయలు ఇలా అన్నీ బాగుండేవి. అన్నిటిలోకి బాంబే వి. టి స్తేషన్ దగ్గర పావ్ భాజి, చాట్, పానీ పూరీ, భేల్ పూరీ నాకు భలే నచ్చేవి. అంతేనా బరోడా నుంచి బాంబే వెళ్ళేటప్పుడు ఆ కాస్త ప్రయాణానికీ గుజరాతీ లు పెద్ద పెద్ద డబ్బాల నిండా స్నాక్స్ తెచ్చుకునేవారు. మాకూ తినమని పెట్టే ఆ చుడువా, ఘమండ్, స్వీట్స్ అన్నీ చాలా టేస్టీ గా ఉండేవి. కేరళ, ఉత్తరప్రదేశ్ తప్ప దాదాపు భారతదేశం లోని అన్ని రాష్ట్రాల నుంచీ మా కూ... చుక్... చుక్ ప్రయాణించింది. ఈ రాష్ట్రం దాటాము, ఈ రాష్ట్రం లోకి వచ్చాము, రాత్రి పడుకున్నప్పుడు ఒక రాష్ట్రం లో, తెల్లారి లేచేటప్పటికి ఇంకో రాష్ట్రం లో, ష్టేషన్ లల్లో వివిధ భాషలు మాటలు గల గలా వినిపించటం అంతా తమాషా గా ఉండేది.
అలాగే రైలు ప్రయాణం లో ఎంతో మంది ప్రయాణికులు పరిచయము అవుతారు. అందులోనూ మా ఏమండీ అందరినీ పలకరిస్తారు. కాకపోతే రైలు దిగగానే వాళ్ళను మర్చిపోతాము అది వేరే సంగతి. కాని ఒక్క జంటను మాత్రము నేను ఇప్పటికీ మర్చిపోలేను. మాకు ఆగ్రా హోటల్ లో పరిచయం అయ్యారు. వాళ్ళూ మాలాగే కొత్త గా పెళ్ళైనవాళ్ళు. నలుగురమూ కలిసి టాక్సీ మాట్లాడుకొని ఆగ్రా అంతా తిరిగాము. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, తాజ్ మహల్ దగ్గర నేను ఫొటో గ్రాఫర్ తో ఫొటో తీయించుకుందామనుకున్నాను. నై నై భాభీ మై కీంచూంగా అని అటు తిప్పి, ఇటు తిప్పి బోలెడు ఫొజులల్లో మా ఇద్దరి ఫొటోలు తీసాడు. ఆ తరువాత డిల్లీ దాకా కబుర్లు చెప్పుకుంటూ, రైలంతా కలియ తిరుగుతూ కలిసి ప్రయాణించాము. మా ఎడ్రెస్ కూడా తీసుకున్నాడు. పాటియాలా లో ఉన్నన్ని రోజులూ ఎదురు చూసాను ఆ ఫొటోల కోసం. రాలేదు. పక్కింటి మిసెస్. జగన్నాథం కు వస్తాయేమో, వస్తే పంపించమని చెప్పాను. ఇప్పటికీ ఎదురుచూస్తున్నాను ఆ ఫొటోల కోసం. ఆ తరువాత డిల్లీ ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ ఆగ్రా వెళ్ళటం పడలేదు. సన్నగా పొడుగ్గా ఉన్న ఆయన మటుకు గుర్తుండిపోయాడు!
చాలా సంవత్సరాల తరువాత ట్రేన్ ఎక్కాను. ఏ.సీ కంపార్ట్మెంట్. చీకటి పడింది . అందరూ కబుర్లు ఆపేసి, పెద్ద లైట్ తీసి , చిన్న బ్లూ లైట్ వేసారు. అంతటా నిశబ్ధం! నేనూ పడుకున్నాను కాని నిద్ర రావటం లేదు. లేచి కూర్చున్నాను. బయటకు చూసాను. ఆ నిశబ్ధ నిశీధిలో… ఏ.సీ నల్లటి అద్దాలల్లో నుంచి, అక్కడక్కడ దీపాలు మిణుకు మిణుక్కుమంటున్నాయి. రైలు చక్రాలు లయబద్ధంగా కదులుతున్నాయి. వాటి తో పాటే సాగిపోతున్నాయి నా మదిలోని ఎడతెగని ఆలోచనలు...
ఈ ప్రయాణం ఎందాకా?
ఎప్పటి వరకూ...
గమ్యం ఎటు?
ఎమో!






