29, మార్చి 2023, బుధవారం

దేవ దేవం భజే దివ్యప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామమ్ - అన్నమయ్య కీర్తన


 

దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రణపుంగవం రామమ్
రాజవర శేఖరం రవికుల సుధాకరం |
ఆజాను బాహుం నీలాభ్ర కాయం |
రాజారి కోదండ రాజదీక్షాగురుం |
రాజీవ లోచనం రామచంద్రం ||
నీలజీమూత సన్నిభ శరీర ఘన వి- |
శాల వక్షసం విమల జలజనాభం |
కాలాహి నగ హరం ధర్మ సంస్థాపనం |
భూ లలనధిపం భోగశయనం ||
పంకజాసన వినుత పరమ నారాయణం |
సంకరార్జిత చాప దళనం |
లంకా విశోషణం లాలిత విభీషణం |
వేంకటేశం సాధు విబుధ వినతం |
భావం :
ఈ కీర్తనలో పదకవితాపితామహుడు దేవభాషలో దశరథనందనుడిని ప్రస్తుతించాడు. పద్మావతీప్రియుడైన శ్రీనివాసుడిలో శ్రీరామచంద్రుడిని దర్శించుకున్నాడు.
అన్నమయ్య దాశరధిని భజిస్తూ ఆయన దివ్యప్రభావాన్ని స్మరిస్తూ, అసురుడైన రావణుడుకి శత్రువై రఘువంశాన్నే శోభింపజేసాడంటూ ఈ సంకీర్తనకు శ్రీకారం చుడుతున్నాడు.
సూర్యవంశంలో జనించిన రఘురాముడిని రాజవరశేఖరుడని, సూర్యవంశ సుధాకరుడని, ఆజానుబాహుడని, నీలమేఘశ్యాముడని, కోదండాన్నిధరించిన దీక్షాగురుడని, రాజీవలోచనుడని కొనియాడాడు.
నీలమేఘమువంటి శరీరము కలవాడు, విశాలమైన వక్షంతో విరాజిల్లువాడని, కమలనాభుడైన విష్ణుమూర్తియని, సర్పసంహాకురుడైన గరుడుడినే వాహనం చేసుకున్నవాడని, ధర్మసంస్థాపకుడని, ఆదిశేషుణిపై పవళించే పరమపురుషుడని, భూమిజ అయిన సీతాదేవికి పతిదేవుడని కొనియాడాడు.

పంకజాశనుడైన బ్రహ్మదేవుడు వినుతించే పరమనారాయాణుడు, జనకుడి శివధనుస్సును అవలీలగా విరిచినవాడు, లంకను జయించి విభీషణుడిని లాలించి పట్టం కట్టినవాడు, కలియుగంలో వేంకటాద్రిపై వెలసి పూజలందుకుంటున్నాడని పులకించిపోతున్నాడు.

చిత్రం : Ponnada Murty
సహకారం : శ్రీమతి పొన్నాడ లక్ష్మి

22, మార్చి 2023, బుధవారం

అమ్మే దొకటియును అసిమలోని దొకటి ఇమ్ముల మా గుణములు ఎంచ చోటేదయ్యా ॥ - అన్నమయ్య కీర్తన


 


అమ్మే దొకటియును అసిమలోని దొకటి

ఇమ్ముల మా గుణములు ఎంచ చోటేదయ్యా ॥

 

ఎప్పుడు నేము చూచిన నింద్రియ కింకరులము

ఇప్పుడు నీ కింకరుల మెట్టెయ్యామో

తప్పక ధనమునకు దాస్యము నేము సేసేము

చెప్పి నీ దాసుల మన సిగ్గుగాదా మాకు

 

పడతుల కెప్పుడును పరతంత్రులము నేము

పడి నీ పరతంత్రభావము మాకేది

నడుమ రుచులకే నాలుక అమ్ముడువోయ

ఎడయేది నిన్ను నుతియించే టందుకును

 

తనువు లంపటాలకు తగ మీదెత్తిత్తి మిదె

ఒనరి నీ ఊడిగాన కొదిగేటెట్టు

ననిచి శ్రీవేంకటేశ నాడే నీకు శరణంటి

వెనక ముందెంచక నీవే కావవయ్యా

 

భావం :

 

వెంకటేశ్వరా,  మా గుణాలను విశ్లేషించే ప్రయత్నం చేయకయ్యా ! మేము మూటలో ఉన్నవి ఒకరకమైతే ముందు మరో రకం వస్తువులు పెట్టి ఆకర్షిస్తున్న కపట వ్యాపారుల్లాంటి వాళ్ళము. ఇది నీకు తెలియంది కాదు.

ఇంద్రియాలకు యజమానులుగా ఉండాల్సిన మనం వాటికి కింకరులుగా మారిపోతున్నాం. అవి మన అధీనంలో ఉండాల్సిందిపోయి వాటి అధీనంలో మనముంటున్నాము. ధనమునకు దాస్యమైన మేము నీదాసులమని చెప్పుకొనుటకు సిగ్గు కాదా మాకు.

పడతులకు పరతంత్రులమై పరంధాముడివైన నీకు పరతంత్రులము అవలేకపోతున్నాము. నానా రుచులకు అమ్ముడుపోయిన నాలుకతో నిన్ను నొతియించలేక పోతున్నాము. 

తనువు లంపటాలలో చిక్కుకున్న మేము నీ ఊడిగము చేస్తూ ఎప్పుడు తరించాలి? అందుకే నిన్నే శరణన్న మమ్మల్ని నీవే కాచుకోవాలని ఆర్ద్రతతో అడుగుతున్నాము.


చిత్రం : Ponnada Murty

 

 

 


17, మార్చి 2023, శుక్రవారం

హరి అవతారమే అతఁ డితడు పరము సంకీర్తన ఫలములో నిలిపె !! - అన్నమయ్య కీర్తన


 

ఫాల్గుణ బహుళ ద్వాదశి  పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి వర్ధంతి. ఈ సందర్భంగా  వారిని సంస్మరించుకుంటూ వారి తనయుడు పెద తిరుమలాచార్యులు  తన తండ్రిపై రచించిన కీర్తన.


చిత్ర రచన : పొన్నాడ మూర్తి

 

హరి అవతారమే అతఁ డితడు

పరము సంకీర్తన ఫలములో నిలిపె !!

 

ఉన్నాడు వైకుంఠమున నున్నాడు ఆచార్యునొద్ద

ఉన్నతోన్నత మహిమ నన్నమయ్య

ఉన్నవి సంకీర్తనలు ఒట్టుక లోకములందు

పన్నిన నారదాదులు పై పై పాడగను 

 

చరియించు నొకవేళ శనకాది మునులలో

హరిబాడు దాళ్ళపాక అన్నమయ్య

తిరమై యాళువారుల తేజము తానై యుండు

గరుడానంత ముఖ్య ఘనుల సంగడిని ॥

 

శ్రీవేంకటాద్రి మీద శ్రీపతి కొలువునందు

ఆవహించె దాళ్ళపాక అన్నమయ్య

దేవతలు మునులును దేవుడని జయవెట్ట

గోవిదుడై తిరుగాడి గోనేటి దండను

 

భావం సౌజన్యం : సాహిత్యశిరోమణి, మహామహోపాధ్యాయ కీ. శే.  సముద్రల లక్ష్మణయ్య, M.A.

 

అన్నమయ్య శ్రీహరి అవతారమే. ఇతడు మోక్షమును సంకీర్తనఫలముగా స్థాపించినాడు.

 

అన్నమయ్య వైకుంఠములో మహోన్నతమైన మహిమతో నొప్పారుచు ఆచార్యుని చెంతనే ఉన్నాడు. నారదుడు మున్నగువారు మాటిమాటికీ పాడగా అన్నమయ్య పాటలు లోకములం దెల్లెడల వ్యాపించి ఉన్నవి.

 

శ్రీహరిని కీర్తించు అన్నమయ్య ఒక్కొక్క వేళ సనకాది మునీంద్రులతో కూడి సంచరించుచుండును. గరుడుడు, శేషుడు మున్నగు నిత్యశూరుల చెంత తాను స్థిరమైన ఆళ్వారుల తేజోరూపముతో ప్రకాశించుచుండును.

 

తాళ్ళపాక అన్నమయ్య శ్రీవేంకటాచలముపై శ్రీకాంతుని కొలువుకూటమునందు నెలకొని యున్నాడు. దేవతలు, మునులు ఈయన దేవుడే అని జయజయధ్వానములు కావించుచుండగా ఆయన కోనేటిచెంత భగత్తత్త్వజ్ఞుడై సంచరించుచుండును.

 

9, మార్చి 2023, గురువారం

ప్రఖ్యాత సంగీత దర్శకుడు రవి


 

సినిమా title తో పాట స్వరపరచడం ఒకప్పటి trend. గురుదత్ Choudvi ka Chand సినిమాలో అప్పటికే   సంగీత దర్శకుడుగా establish అయిన రవిని నియమించుకున్నాడు. సినిమా title తోనే ఓ పాట స్వరపరచాలని రవి తన అభిమతం తెలియబరిస్తే గురుదత్ ఓకే అన్నాడు. కవి షకీల్ బదయూని కి కబురు పంపించాడు. చౌద్వీ కా చాంద్ హో ..  తర్వాత ఏం రాయాలి...'యా ఆఫ్తాబ్ హో' అన్నాడు షకీల్ .. ఓ అయిదు నిమిషాల్లో పాట lyric రెడీ. మహమ్మద్ రఫీ తొ rehearsel చేయించడం, పాట record చెయ్యడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ పాట భారతీయ సినిమా సంగీతంలోనే ఇదొక సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ పాట తెలియని సంగీత అభిమాని ఉండడంటె ఆశ్చర్యంలేదు.

సంగీత దర్శకుడు రవి, మహమ్మద్ రఫీ వీరాభిమాని. ఓసారి మహమ్మద్ రఫీ stage performance చూసి మాట్లాడే అవకాశం లభించింది. రఫీ playback singer అవాలంటే ఎలా సాధన చేయాలో చిన చిన్న tips ఇచ్చి ప్రోత్సహించాడు. కాని రవికి సంగీతంపట్ల ఉన్న ఆసక్తి గమనించిన హేమంత్ కుమార్ ఓ chorus లో పాడే అవకాశం ఇచ్చాడు. తర్వాత నాగిన్ చిత్రంలో తన aassistant గా పెట్టుకున్నాడు. తర్వాత స్వతంత్రంగా చాలా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. 


భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో  'నాగిన్' ఓ పెద్ద సంచలనం. ఈ చిత్రంలో గ్రామఫోన్ రికార్డులు రెండు సంవత్సరాల పాటు ఏకధాటిగా అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. నిజానికి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు హేమంత్ కుమార్. రవి ఆయనకు Assistant గా పనిచేసారు. ఈ చిత్రంలో  రవి స్వతంత్రంగా  been  music తో స్వరపరచిన  'మన్ డోలే మెర తన్ డోలే' యావద్భారతదేశంలో ఓ ఊపు ఊపేసింది. ఊరూ వాడా  నాగిన్ పాటలే.  

రవి ఎవరి దగ్గరా సంగీతం నేర్చుకోలేదు. Posts & Telegraphs department లొ electrician గా పనిచేసేవాడు.  తన career ని ప్రారంభించాడు.  చిన్న చిన్న electric పరికరాలు బాగుచేసి పొట్టగడుపుకునేవాడు..  కానీ సంగీతమంటే ప్రాణం. All India Radio లో అప్పుడప్పుడూ పాటలు పాడేవాడు. 


ఇప్పటికీ పెళ్ళిళ్ళలో 'మెరా యార్ బనా హై దుల్హా' 'ఆజ్ మెరి యార్ కి షాదీ హై' పాటలు band party వాళ్ళు వాయిస్తూనే ఉంటారు.   రవి స్వరపరిచిన పాటలే.. 



అప్పులేని సంసార మైనపాటే చాలు తప్పులేని జీతమొక్క తారమైన జాలు - అన్నమయ్య కీర్తన

అప్పులేని సంసార మైనపాటే చాలు  తప్పులేని జీతమొక్క తారమైన జాలు // పల్లవి // కంతలేని గుడిసొక్క గంపంతైన జాలు  చింతలేని యంబలొక్క చేరెడే చాలు జంతగాని తరుణి యేజాతైన నాదె చాలు  వింతలేని సంపదొక్క వీసమే చాలు // అప్పులేని // తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదే చాలు  ముట్టులేని కూడొక్క ముద్దడే చాలు  గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైన చాలు  వట్టిజాలి బడుకంటే వచ్చినంతే చాలు // అప్పులేని // లంపటపడని మేలు లవలేసమే చాలు  రొంపికంబమౌకంటె రోయుటే చాలు  రంపపు గోరికకంటే రతి వేంకటపతి  పంపున నాతని జేరే భవమే చాలు // అప్పులేని //

చిత్రం : పొన్నడ మూర్తి

భావము : సౌజన్యం : 'సాహిత్య శిరోమణి' సముద్రాల లక్ష్మణయ్య, ఎం. ఏ. 

అప్పుచేసి ఆటోపముగా సంసారము జరుపుటకంటె అప్పులేని కాపురము జరిగినంతవరకే చాలును. అదే సుఖప్రదము. అట్లే తప్పు తోవలో ఆర్జించిన అధిక ధనముకంటె తప్పులేని జీతము నాలుగు కాసులైనను చాలును.

ఎండవానలవలని బాధ తప్పని పెద్ద గృహముకంటె చక్కగా కప్పబడిన ఇల్లు చిన్నదైనను మేలు. నానా చింతలకు లోనై తిను పంచభక్ష్య పరమాన్నములకంటే చీకుచింత లేని యంబలి చేరెడైనను సుఖకరమే. ధూర్తురాలైన కులస్రీకంటె గుణవతి యయిన వనిత తక్కువ జాతిదైనను మేలు. “స్త్రీరత్నం దుష్కులాదపి” అని పెద్దల వచనము. అన్యాయంగా క్షణములో ఆర్జింపబడి పదిమందికి వింతగొలుపు దొడ్డ సంపదకంటె న్యాయార్చితమైన విత్తము మిక్కిలి కొద్దిదైనను చాలు.

ఇతరుల దూషణకు లోనై శత సంవత్సరములు జీవించుటకంటె ఎట్టి దూషణలేక ఒక్కదినము జీవించినను మేలే. ఆపరిశుధ్ధమైన అన్నము కడుపునిండా తినుటకంటె పరిశుధ్ధమైన అన్నము ఒక్క కబళమైనను సుఖావహము. పెద్ద పెద్ద ఆశలతో ప్రాకులాడి పదిమందిలో గుట్టుచెడి బతుకుటకంటె ఏ కొంచెపు మేలుకలిగినను దానితో తృప్తినొందుట మేలు. లేనిపోని ప్రయాసలకు గురియై జాలిపడుటకంటె వచ్చినదానితో తనివిపొందుట మేలు.

పలు తగులములకు గురియై బాధపడుటకంటె ఏ లంపటములులేక వచ్చు మేలు కొదిదిపాటిదైనను చాలు. బురదలోని స్తంభమువలె నిలకడలేని జీవితముకంటె ఐహికసుఖములపై రోతపడి నిశ్చలముగా నుండుట మేలు. రంపమువలె బాధావహమైన కోరికలకు లోనగుటకంటె “మామేకం శరణం వ్రజ” అను భగవదాదేశము ననుసరించి ఆదేవుని సన్నిధి జేరుటకు ప్రయత్నించు మానవుని పుట్టుకే శ్రేష్ట,మైనది.




 

1, మార్చి 2023, బుధవారం

అన్నమయ్య కీర్తన : మాయామానుష మహిమ ఇది ఏ యెడ నీతని ఈశ్వరుడు

 అన్నమయ్య కీర్తన : మాయామానుష మహిమ ఇది ఏ యెడ నీతని ఈశ్వరుడు



మాయామానుషమహిమ ఇది
ఏయెడ నీతని ఈశ్వరుడు !!
మొదట యశోదకు ముద్దులబాలుడు
అదె మునులకు బరమాత్ముడు
మది గోపికలకు మన్మధమన్మధు
డెదుటనె తిరిగీ నీశ్వరుడు !!
గోపబాలుడు గొల్లడు నాడే
చేపట్టెను లక్ష్మికి మగడు
కోపపుటసురులకు మృత్యు వీతడు
ఏపున మెరసీ నీశ్వరుడు !!
పాండవులకు దా బావయు మరదియు
వొండొకవసుదేవునికొడుకు
అండనె శ్రీవేంకటాద్రికి గృష్ణుడు
ఇందుల ముంగిళ్ళ నీశ్వరుడు
భావమాధుర్యం: సౌజన్యం : శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు
పెదతిరుమలయ్య వినిపిస్తున్న శ్రీకృష్ణామృతాన్ని తనివితీర గ్రోలండి. ఈ అవతారము మాయామానిష మహిమను చూపిన అవతారం. ఏ విధంగా చూచినా ఈతడు ఈశ్వరుడు కాక మరెవ్వరు?
యశోద దృష్టిలో ఈయన ముద్దులొలికే బాలుడు. అదే మునీశ్వరులపాలిట పరబ్రహ్మమూ ఈతడే. మరులుగొన్న గోపికలకు మన్మధుని మించిన మన్మధుడు. మరి భక్తకోటికి ఎదుటనే తిరుగాడిన ఈశ్వరుడు. రేపల్లెలోని గోపబాలురకు తమతో ఆటలాడిన గొల్లపిల్లవాడు. లక్ష్మీదేవి అవతారమైన రుక్మిణిని చేపట్టిన వుద్ధుండుడు. కోపముతో తననే చంపవచ్చిన తృణావర్తునివంటి అసురులపాలిటి మృత్యువు ఇతడే.
అదృష్టవంతులైన పుణ్యాత్ములకు మ్ముక్తినొసగిన ఈశ్వరుడు ఇతడే. పాండవులలో తనకంటె చిన్నవారికి బావ, తనకంటే పెద్దవారికి మరిది ఇతడే. అదృష్టవంతులైన పుణ్యాత్ములకు ముక్తినొసగిన ఈశ్వరుడు ఇతడే. పాండవులలో తనకంటే చిన్నవారికి బావ. తనకంటే పెద్దవారికి మరిది ఈతడే. వసుదేవుని కన్నకొడుకు. ఈ శ్రీవేంకటాద్రి వెలసిన కృష్ణుడు ఈ దేవదేవుడే. భక్తకోటి ఇండ్లముందు తిరుగాడే ఈశ్వరుదు ఇతగాడే.
చిత్రం : Pvr Murty

28, ఫిబ్రవరి 2023, మంగళవారం

మెరుగు వంటిది అలమేలుమంగ - అన్నమయ్య కీర్తన





ఈ వారం అన్నమయ్య కీర్తన
పల్లవి:
మెరుగు వంటిది యలమేలుమంగ |
అరిమురి నవ్వీని అలమేలుమంగ ||
చరణం:
పలుచని యెలుగున బాడీ నీ మీది పాట |
మెలుపు గూరిమి నలమేలుమంగ |
చెలులతో నీ సుద్ది చెప్పిచెప్పి కరగీని |
అలయుచు సొలయుచు నలమేలుమంగ ||
చరణం:
ఈడుగా నీ రాకకు నెదురెదురుచూచీ |
మేడ మీద నుండి యలమేలుమంగ |
వాడు మోముతో నీపై వలపు చల్లి చల్లి |
ఆడీ నాట్యము సారె నలమేలుమంగ ||
చరణం:
పేరుకొని పిలిచీని ప్రియములు చెప్పి చెప్పి |
మేరమీర నిన్ను నలమేలుమంగ |


యీరీతి శ్రీవేంకటేశ నిన్ను గూడె నేడు |
ఆరితేరి నన్నిటాను అలమేలుమంగ ||
మెరుపులాంటి అలమేలు మంగమ్మ శ్రీనివాసుడిని చూడగానే ముగ్ధయై నవ్వుతోందని తన పదపల్లవిలో ప్రస్ఫుటం చేస్తున్నాడు. మెరుగు అంటే ఆకాశంలోని మెరుపు. ‘అరిమురి’ అంటే సంభ్రమంతో అని అర్ధాలు.
‘పలుచని యెలుగున’ అంటే సన్నని గొంతుతో అని, ‘మెలుపు కూరిమి’ అంటే గాఢమైన ప్రేమ అని అర్ధాలు. ఆ ప్రేమస్వరూపిణి పతిదేవుడిపై పలుచని స్వరంతో పాటలు పాడుతోందిట. ఆయన గురించి తన చెలికత్తెలతో కబుర్లు చెప్పి , చెప్పి పరవశించిపోతొందిట! అలా పాటలు పాడి, మాటలు చెప్పి అలిసిపోయిందిట!
అలమేలుమంగ ఆ అర్తత్రాణ పరాయణుడు కోసం మేడపై ఎదురుచూస్తూ ఉండేదట! కొన్నిసార్లు ఆ స్వామిపై ప్రేమతో ఆ శ్రీదేవి నాట్యమూ చేసేదట! అలా ఎదురుచూసి, నృత్యం చేసి ఎంతో అలసిపోయిన ఆమె ముఖాన్ని ఒక్కసారి పరికించవయ్యా! అని అన్నమయ్య ఆ పురాణపురుషుడిని ప్రార్ధిస్తూ..
ఈడుగా నీ రాకకు నెదురెదురు చూచీ
మేడమేద నుండి యలమేలు మంగ
వాడు మోముతో నీపై వలపు చల్లి చల్లి
అదే నాట్యము సారె నలమేలు మంగ … అంటున్నాడు.
‘ఎదురెదురు’ అంటే ఎదురుతెన్నులు. ‘సారెకు’ అంటే మాటిమాటికి, ‘వాడు మోముతో’ అంటే వాడిపోయిన ముఖంతో అని అర్ధం.
ప్రియములు చెప్పి చెప్పి ..
స్వామి పేరుని స్మరించడమే అమ్మకు సార్ధకత. అందుకే పలుమార్లు ఆయన నామాన్ని నెమరువేసుకునేవారట! అలా ఏడుకొండలవాడి పేరుని స్మరించి, స్మరించి ఆ పద్మావతి ఆయనలోని తన అర్ధభాగానికి న్యాయం చేసింది. ఆ సన్నివేశాన్నే స్ఫురింపజేస్తూ ‘నీ సాన్నిధ్యంతో ఆమె అన్నింటిలోనూ ఆరితేరిపోయింది స్వామీ!” అంటూ ఈ సంకీర్తనాచార్యులు ..
పేరుకొని పిలిచీని ప్రియములు చెప్పిచెప్పి
మేరమీర నిన్ను నలమేలు మంగ …
అంటూ పదామృతాన్ని ముగిస్తున్నారు. ‘మేరమీర” అంటే అమితంగా అని భావం. అయితే అన్నమయ్యలా ఆ పద్మావతిని ప్రస్తుతించాలంటే ముందు మనస్సు పసిపిల్లడిలా పవిత్రం కావాలి. ఆ మనోస్వచ్ఛత ఆ మనొజ్ఞను ఆరాధించడానికి ప్రధాన అర్హత్.
సౌజన్యం : శ్రీమతి బి. కృష్ణకుమారి గారి వ్యాసం ఆధారంగా. వారికి నా ధన్యవాదాలు.
చిత్రం ' Pvr Murty


27, ఫిబ్రవరి 2023, సోమవారం

నీ నవ్వుల కిలకిలలే నా మనసుని తాకినవి. - కవిత




 

నా చిత్రానికీ శ్రీమతి పుచ్చా గాయత్రీ దేవి గారు అల్లిన కవిత.


నీ నవ్వుల కిల కిలలే నా మనసుని తాకినవి 

నీ శ్వాసల నిట్టూర్పులు నా తనువును తాకినవి.


సరాగములు,  సయ్యాటలు, శ్రుతిమించని తరంగాలు 

నీవలపుల ప్రేమాటలు మధురిమలను పంచినవి

సురగంగల కదలి వచ్చే నా ప్రేమ ఝురి నీవే కదా !

నీ ఊసులు, ఊహలతో నా దినము గడచినది.


నీ నవ్వుల కిల కిలలే నా మనసుని తాకినవి 

నీ శ్వాసల నిట్టూర్పులు నా తనువును తాకినవి.


నా ఊహల నందనమా,  కదలి వచ్చే వయ్యారమా ! 

వెన్నెలంటి చిరునవ్వుతో మెరిసే మణి హారమా ! 

వాదనలు, శోధనలు విధి రాసిన వింత రచన 

ఈ నాటక రూపములో నా జీవన భాగ్యమా !


నీ నవ్వుల కిల కిలలే నా మనసుని తాకినవి 

నీ శ్వాసల నిట్టూర్పులు నా తనువును తాకినవి.


కరుణ పంచు నీ రూపే కరువు తీర కాంచిన,

సుధలు పంచు నీ పలుకే మదినిండుగా వినినా 

సమ్మెహన పదానికే నీవే తాత్పర్యమా !!

కదలాడే చంద్రవంక నా ఊహా చిత్రమా !


పి. గాయత్రిదేవి.

Ponnada VR Murty గారి చిత్రము

22, ఫిబ్రవరి 2023, బుధవారం

నార్ల వేంకటేశ్వర రావు - తెలుగు పత్రికా సంపాదక దిగ్గజం

 

Pencil sketch by me


తెలుగు పత్రికా శిఖరం నార్ల వేంకటేశ్వర రావు గారు గురించి సేకరించిన వివరాలు.


తెలుగు పత్రికా రచనను కొత్త పుంతలు తొక్కించిన బహుముఖ ప్రతిభాశీలి మరియు మేధావి ఆయన. మూడు దశాబ్దాల పాటు తెలుగు పాఠకులకు సుపరిచితుడైన ఆయన శతక పద్యాల 
ద్వారా బాలలకూ చేరువయ్యాడు. రచయితగా, నాటకకర్తగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా బహుముఖ పాత్రలు పోషించిన ఆయన ఛాందస విశ్వాసాలపై రాజీలేని పోరు సాగించి హేతుబద్ధమైన ఆలోచనలను ప్రజలకు చేరువ చేయడానికి ప్రయత్నించారు. జబల్ పూర్‌లో పుట్టిన ఈ తెలుగు తేజం, రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేయడం విశేషం. తెలుగు సాహితీ లోకంలో సామాజిక సంస్కరణకు పెద్దపీట వేసిన  ఆ మేటి రచయితే "నార్ల వెంకటేశ్వరరావు".

మరిన్ని వివరాలు క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి.


https://www.sakalam.in/veteran-journalist-narla-venkateswara-rao-death-anniversary/

కాటూరి వేంకటేశ్వర రావు - తెలుగు కవి, రచయిత, నాటక కర్త


సాహితీ హాలికుడు 'కాటూరి వేంకటేశ్వర రావు' (1895-1962) -

(pencil sketch - clarity బాగా తక్కువగా ఉన్న ఆనాటి reference ఫోటో నుండి సాధ్యమైనంత వరకూ పునరుధ్ధరణ)

సౌందర్య సస్యాన్ని సమృద్ధిగా పండించిన వెనుకటి తరం సాహితీ హాలికులలో శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు ఒకరు.

చెళ్ళపిళ్ళ వారి వద్ద చేసిన శుశ్రూషా ప్రభావం వల్ల కావచ్చు, కాటూరివారి కవితలో ప్రాచీనార్వాచీనతలు రెండూ సమ్మిళితమైనవి. వస్తువు కొత్తదైతే, పద్ధతి పాతది; పద్ధతి కొత్తదైతే, వస్తువు పాతది. కొత్త పాతల మేలుకలయికకు ఒక ఉదాహరణగా వారి కవిత్వం సాగింది. తెలుగులో ‘రొమాంటిక్’ కవిత్వంపై ఆకర్షణ ప్రబలంగా వున్న రోజులలో రచన ప్రారంభించినా, ఆయన దృష్టి ఎక్కువగా జాతీయవాదం వైపు, ధార్మిక ప్రబోధం వైపు ప్రసరించింది. గాంధీ సిద్ధాంతాలతో ఆయన ఎక్కువగా ప్రభావితులయ్యారు.

గురువులైన తిరుపతి వెంకట కవుల వలె కాటూరి, పింగళి జంటకవులుగా కవితావ్యాసంగం ప్రారంభించారు. వారుభయులు రచించిన తొలకరి, సౌందర్యనందం ఆంధ్ర భాషకు అమూల్యాలంకారాలు. ఆ తరువాత కాటూరివారు విడిగా రచించిన ఖండకావ్యాల సంఖ్యలోనే స్వల్పమైనవి కాని, గుణంలో అస్వల్పమైనవి. అస్పృశ్యతా నిర్మూలనాన్ని ప్రబోధించే ‘గుడి గంటలు’ భక్తితత్వాన్ని ఆవిష్కరించే ‘పౌలస్త్య హృదయం’ మొదలైన ఖండ కావ్యాలు కాక భాస నాటకాలకు, కొన్ని సంస్కృతాంగ్ల కృతులకు అనువాదాలు, ఇతర నాటికలు, సంగీత రూపకాలు వారి ప్రతిభకు నిదర్శనాలు.

కాటూరివారి వ్యాపకాలు బహుముఖమైనవి. కొన్నాళ్ళు కవిత్వం, కొన్నాళ్ళు కృష్ణాపత్రిక సంపాదకత్వం, మరి కొన్నాళ్ళు బందరు జాతీయ కళాశాల ప్రధానాచార్యత్వం, హిందీ ప్రచారం, సాహిత్య సమావేశాలు, గోష్ఠులు, ఇటువంటివి మరెన్నో! ఏ వ్యాపకంలో వున్నా తమంతటి సహృదయులు, రసజ్ఞులు, స్నేహపాత్రులు మరి లేరనిపించుకొన్న ఉదాత్త వ్యక్తిత్వం ఆయనది.

సౌజన్యం : (1962 డిసెంబర్ 27 ‘ఆంధ్రజ్యోతి’
సంపాదకీయం ‘శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు’ అంతర్జాలం నుండి సేకరణ)

21, ఫిబ్రవరి 2023, మంగళవారం

పల్లెల్లో చాకలి..


 పల్లెల్లో చాకలిది చాల ప్రధానమైన వృత్తి. ఈ చాకలి వృత్తి, వారి వారసత్వ హక్కు. రెండు, మూడు పల్లెలు కలిపి ఒక చాకలి కుటుంబం వుంటుంది. వారు తప్ప వేరే చాకలి ఆవూరి వారి బట్టలను వుతక రాదు. పల్లె వాసులకు కూడా వేరొక చాకలిని పెట్టు కోడానికి హక్కు లేదు. ఒక చాకలికి ఇద్దరు మగ పిల్లలుంటే వారు వేరు పోదలచు కుంటే, వారి అధీనంలో వున్న ఊర్లను పంచు కుంటారు. చాకలి లేనిదే పల్లెల్లో సాంప్రదాయమైన పనులు చాల జరగవు. వారి ముఖ్యమైన పని అందరి బట్టలను ఉతికి తేవడం. మధ్యాహ్నం ఒకరు వచ్చి ప్రతి ఇంటి వద్ద కొంత అన్నం కూర తీసుకుని వెళ్లి తింటారు. అలాగే రాత్రికి కూడా కొంత అన్నం పెట్టాలి. ఊరి వారి బట్టలి అన్ని కలిపి వున్నా సాయంత్రానికి ఎవరి ఇంటి బట్టలు వారివి వేరు చేసి వారి వారికిస్తారు. బట్టలను వారు అంత బాగా గుర్తు పట్టగలరు. అందుకే చదివిన వాడికన్న చాకలి మిన్న అన్న నానుడి పుట్టింది . వారు బట్టలను ఉతికే ముందు కొన్ని బట్టలను ఉబ్బకేస్తారుఉబ్బ అంటే మూడు పెద్ద మట్టి కుండలను త్రికోణాకారంలో పెద్ద పొయ్యి మీద పెట్టి వాతి చుట్టూ మట్టితో దిమ్మ కడ్తారు. ఆ కుండల మూతులు మాత్రమే కనిపిస్తుంటాయి. వాటిల్లో సగం వరకు నీళ్లు పోసి, ఆమూడు కుండల మీద ఉబ్బకు వేయాల్సిన బట్టలను సౌడు నీళ్లతో తడిపి చుట్టలు చుట్టలుగా రెండు మూడు అడుగులఎత్తు వరకు అమర్చుతారు. తర్వాత అ బట్టల కుప్పకు ఒక పెద్ద బట్టను కప్పుతారు. ఇప్పుడు కుండల క్రింద మంట పెడ్తారు. కుండలలోని నీరు ఆవిరై అది పైనున్న బట్టలన్నింటికి వ్యాపిస్తుంది. అలా ఒక గంట ఆవిరి పట్టాక వాటిని తీసి నీళ్లలో వుతుకుతారు. అప్పుడు ఆ బట్టలు చాల తెల్లగా వస్తాయి. వీటిలో రంగు బట్టలు వేయరు. ఎందుకంటే ఒకదాని రంగు మరొక దానికి అంటు తుంది. సౌడు అనగా సౌడు భూములలో పైకి తేలిన ఉప్పటి నున్నటి మట్టి. బట్టలు ఉతికినందుకు చాకలికి ఫలితానికి ఒక సారి మేర ఇవ్వాలి, మేర అంటే ఐదు బళ్ళ వడ్లు. అలాగే వరి కోతలప్పుడు అందరి పని వాళ్లతో బాటు చాకలికి కూడా ఒక మోపు వరిని కూడా వదిలి పెట్టాలి. దాన్ని చాకలి ఇంటికి తీసు కెళ్లతాడు. అలా అందరి రైతుల వద్దనుండి వచ్చిన వరి మోపులను ఒక్క రోజున నూర్చి వడ్లను తీసుకుంటాడు. పెళ్ళి పత్రికలు రాకముందు పెళ్ళి పిలుపులకు చాకలినే పంపే వారు. తమలపాకులువక్కలు ఇచ్చి ప్రతి ఇంటికి, వేరే వూర్లో వున్న బంధువులకు చెప్పిరమ్మని చాకలిని పంపేవారు. స్వంత గాళ్లు పిలిచిన పిలిపు కంటే చాకలి పిలుపుకే గౌరవం.... మర్యాద.... సాంప్రదాయం కూడ. ఏశుభ కార్యానికైనా వక్క ఆకు ఇచ్చి పిలిస్తేనె అది మర్యాద. లేకుంటే అయిష్టంగా పిలిచినట్లే భావించే వారు. ఆ సందర్భంగా పుట్టినదే ఈ నానుడి: నాకేమైనా ,వక్క ఆకు ఇచ్చి పిలిచారా నేను రావడానికి? అదేవిధంగా పిల్లలు పుట్టినపుడు పురుడుకు వూరివారి నందరిని చాకలే పిలవాలి నీళ్లు పోయడానికి. చాకలే ముందు నీళ్లు పోయాలి. ఆడ పిల్లలు సమర్తాడినప్పుడు (పుష్పవతి) విషయాన్ని ఊరి వారందరికి చాకలితో చెప్పి పంపుతారు. ఆడ పిల్లలు సమర్థాడి (పుష్పవతి) నప్పుడు వారి వంటి పైనున్న బట్టలు చాకలికే చెందుతాయి. దీనిని బట్టే ఒక సామెత పుట్టింది. అదేమంటే.... సరదాకి సమర్థాడితె చాకలి వచ్చి చీరపట్టు కెళ్లిందట. ఈ సామెతలో.. సరదాకి కూడా అబద్ధం ఆడ కూడదనే సందేశం ఉంది. ఎవరైనా ప్రయాణమై వెళుతున్నప్పుడు చాకలి ఎదురు పడితే శుభ చూచకంగా బావించేవారు. పెళ్ళిల్లలో చాకలి చేయాల్సిన సాంప్రదాయ పనులు చాల వుంటాయి. దీవిటి పట్టడం, చాకలి సాంగెం అనే ఒక కార్యక్రమం వుండేది. అది లేక పోతే చాల లోటు. పంతులు గారు కూడా కొన్ని సందర్భాలలో చాకలి ఎక్కడ అని పిలుస్తుంటాడు. పెళ్ళి సందర్భంగా చాకలికి ప్రత్యేకించి డబ్బులు ఇవ్వరు. కాని అక్కడ తలంబ్రాలు పోసిన బియ్యం చాకలికే చెందుతాయి. అలాగే మంగళ స్నానం తర్వాత విడిచిన బట్టలు కూడా చాకలికే చెందు తాయి. శోభనము నాడు కూడా చాకలికి ప్రధాన పాత్ర ఉంది. జాతరలు, గ్రామ దేవతల పూజలందు చాకలే పూజారి. ప్రతి పండక్కి ఊరి వారందరు ప్రతి రోజు అన్నం పెట్టినట్టే పిండి వంటలు ఇస్తారు. సమాజంలో ముఖ్యమైన పాత్ర వహించిన ఈ చాకలి వృత్తి ప్రస్తుతం పూర్తిగా కనుమరుగైనది. అప్పట్లో వంకల్లో వాగుల్లో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు లభించేవి.బట్టలుతికే వారి పని సులువయ్యేది. రాను రాను నీటి లబ్యత తక్కువయ్యే కొద్ది నీటి కొరకు పొలాలలోని బావుల వద్దకు పరుగులు తీసి, అవికూడ అడుగంటగా వారికి దిక్కు తోచ లేదు. పైగా రైతులు వరి పండించడం మానేయగా.. వారికి రావలసిన మేర సరిగా రాక, ఇలా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని క్రమంగా ఆ వ్వవస్థ కనుమరుగైనది. చాల తక్కువగా వుండే చాకలి కులం సామాజిక మార్పులతో చెల్లా చెదురై అంతరించి పోయింది. తరతరాలుగా బట్టలుతికిన చాకిరేవులలో చాకి బండలు నునుపు దేలి చాకలి వృత్తికి సాక్షిభూతంగా నేటికి అక్కడక్కడా పడి ఉన్నాయి. పల్లె ప్రజలు ఎవరి బట్టలు వారే వుతుక్కుంటూ కాలం వెళ్ల దీస్తున్నారు. చాకలి, మంగలి లేకుండా శుభ, అశుభ కార్యక్రమాలు జరిగే అవకాశమే లేదు ఒకపుడు. కాని విధి లేని పరిస్థితిలో ప్రస్తుతం వారు లేకుండానే ఆ కార్యక్రమాలు జరిగి పోతున్నాయి. పట్టణాలలో కళ్యాణ మండ పాలలో జరిగే పెళ్ళిల్లలో వారి అవసరమే లేకుండా జరిగిపోతున్నాయి. కాక పోతే బట్టల మురికి అతి సులభంబా వదల గొట్ట డానికి అనాడు లేని డిటర్జెంటులు, పౌడర్లూ, సబ్బులు, బట్టలు ఉతికే యంత్రాలు ఇప్పుడొచ్చాయి. పైగా మురికి అంతగా అంటని, అంటినా సులభంగా వదిలిపోయే టెర్లిన్, టెరికాట్, పోలిస్టర్ వంటి బట్టలు ఎక్కువైనాయి. రాబోవు తరాల వారికి చాకలి అంటే పుస్తకాలలో చదువు కోవలసిందే.

చిత్రం: పొన్నాడ మూర్తి 


 సౌజన్యం:  Wikipedia 

8, ఫిబ్రవరి 2023, బుధవారం

సురభి కమలాబాయి - చందాల కేశవదాసు

తొలి పూర్తి తెలుగు సినిమా కథానాయిక సురభి కమలాబాయి, తొలి సినిమా గీత రచయిత చందాల కేశవదాసు. తొలి పూర్తి సినిమా 'భక్త ప్రహ్లాద' విడుదలై 91 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వీరిని స్మరించుకుందాం. (పెన్సిల్ చిత్రాలు.. ఈ రెండు చిత్రాలు 'తెలుగుతల్లి కెనడా' పత్రికలో ప్రచురించిన పత్రిక యాజమాన్యానికి నా ధన్యవాదాలు)

 

దేవ దేవం భజే దివ్యప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామమ్ - అన్నమయ్య కీర్తన

  దేవ దేవం భజే దివ్యప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామమ్ రాజవర శేఖరం రవికుల సుధాకరం | ఆజాను బాహుం నీలాభ్ర కాయం | రాజారి కోదండ రాజదీక్షాగురుం ...