30, జూన్ 2023, శుక్రవారం

తెలియ చీకటికి దీపమెత్తక, పెద్ద |వెలుగు లోపలికి వెలుగేలా - అన్నమయ్య కీర్తన



|| తెలియ చీకటికి దీపమెత్తక, పెద్ద | వెలుగు లోపలికి వెలుగేలా ||

|| అరయ నాపన్నుని కభయ మీవలెగాక | ఇరవైన సుఖి గావనేలా |
వరుత బోయెడువానివడి దీయవలె గాక | దరివాని తివియ( దానేలా ||

|| ఘనకర్మారంభుని కట్లు విడవలె గాక | యెనసి ముక్తుని గావనేలా |
అనయము దుర్బలుని కన్న మిడవలెగాక | తనిసిన వానికి దానేలా ||

|| మితిలేని పాపకర్మికి దావలె గాక | హిత మెరుగు పుణ్యునికి నేలా |
ధౄతిహీను గౄపజూచి తిరువేంకటేశ్వరుడు | తతి గావకుండిన తానేలా ||


- అన్నమయ్య కీర్తన


భావం : సౌజన్యం కీ.శే. సముద్రాల లక్ష్మణయ్య,  చిత్రం : పొన్నాడ మూర్తి

చీకటి నలుదెసల క్రమ్ముకొన్నప్పుడు వస్తుపరిజ్ఞానమునకై దీపము చేబూనవలెను. అంతే కాని గొప్ప ప్రకాశములోనికి దీపము జూపవలసిన పనిలేదు కదా!

ఆపదపాలై దుఖించువానికి అభయమిచ్చి రక్షింపవలెను. గాని ఎట్టు చీకు చింతలు లేక హాయిగా సుఖించువానిని కాపాడవలసిన పనిలేదు. వెల్లువలో కొట్టుకుని పోవువానిని వడిగా గట్టుకు దీయవలెను గాని గట్టుననే ఉన్నవానిని తీయవలసిన పని తనకు లేదుగదా!

పెద్ద పెద్ద కర్మలలో పూనిక వహించి అందు తగులుకొన్నవాని బంధనములు ఊడదీయవలెను గాని ఏ బంధము లేక ముక్తుడైయున్నవానిని రక్షింప అవసరము లేదు. స్వయముగా అన్నము సంపాదించుకొన జాలని దుర్బలునికి ఎల్లవేళల అన్నమ్ము పెట్టి పోషింపవలెను గాని తృప్తిగా తిని త్రేపినవానికి తాను పెట్టవలసినిది ఏమియు లేదు కదా !

అంతులేని పాపములాచరించి హీనుడైనవానిని ఉద్ధరించుటకు తాను కావలెని గాని హితము తెలిసి పుణ్య కర్మములు ఒనర్చు  సుకృతాత్మునికి తనతో (భగవంతునితో) పనిలేదు. ధైర్యము కోల్పోయిన దీనునిపై కృపబూని సమయమునకు రక్షింపకుండినచో శ్ఈవేంకటేశ్వరుడు ఉండి ప్రయోజనమేమి?

26, జూన్ 2023, సోమవారం

పెన్సిల్ వుంటే చాలు..బొమ్మ పడిందన్న మాటే..!! - Abdul Rajahussein

 

నా గురించి, నా చిత్రకళ గురించి మిత్రులు, పాత్రికేయులు రాజా హుస్సేన్ గారు రచించిన వ్యాసం.  వారికి నా ధన్యవాదాలు.

*పెన్సిల్ వుంటే చాలు..బొమ్మ పడిందన్న మాటే..!!

"పొన్నాడ " వారి పెన్సిలే వేరు…!! “పొన్నాడ మూర్తి“ పేరుతో కార్టూన్లు,చిత్రాలు వేసే శ్రీ పొన్నాడ వెంకట రమణ మూర్తిగారు గత 30 యేళ్ళ నుంచి చిత్రకారులుగా, కార్టూనిస్ట్ గా కొనసాగుతు న్నారు.ఆయన గ్రీవ్స్ కాటన్ కంపెనీలో పనిచేసి పద వీ విరమణ చేసి ప్రస్తుతం విశాఖపట్నంలో నివాసం వుంటున్నారు. *కార్టూన్ మూర్తి..!! బొమ్మలు వేసే అలవాటు బాల్యం నుంచేఅలవడింది. బాపు గారి కార్టూన్లు చూశాక కార్టూన్లు వేయాలనే కోరిక కలిగింది.కార్టూన్లు వేయటం ప్రారంభించారు. 1991లో ఆంధ్ర ప్రభ వారుశ్ బాపు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్టూన్ పోటీలలో కన్సోలేషన్ బహు మతి లభించింది. మొదటి కార్టూన్ కే బహుమతి రావటంతో ఆయన ఆనందానికి హద్దులేదు..ఈ స్ఫూర్తి తో మరిన్ని కార్టూన్లు వేశారు. స్వాతి వార పత్రికనిర్వహించిన కార్టూన్ పోటీలలో రెండుసార్లు బహుమతులు అందుకున్నారు. నది పత్రిక నిర్వహించిన కార్టూన్ పోటీలలో కన్సోలేషన్ బహుమతి వచ్చింది. ఈ బహుమతిని ప్రముఖ కార్టూనిస్టు శ్రీ జయదేవ్ గారి చేతులమీదుగా అందుకోవటం మరపురాని స్మృతి అంటారు మూర్తి గారు. తెలుగు తల్లి కెనడా పత్రిక నిర్వహించిన కార్టూన్ పోటీలలో రెండు సార్లు బహుమతులు అందుకున్నారు.ప్రియదత్త,64కళలు, తెలుగుతల్లి కెనడా,గోతెలుగు. కామ్ లాంటి అనేక పత్రికలలో ఆయన కార్టూన్లు ప్రచురించబడినాయి. *బొమ్మల మూర్తి..!! కార్టూన్ల కన్నా బొమ్మలంటేనే..మూర్తి గారికి ఇష్టం. వివిధ రంగాలలో ప్రముఖులైన వారి చిత్రాలను వేయటమేకాక వారి గురించి క్లుప్తంగా,సమగ్రంగా రాస్తుండటం విశేషం. అలా ప్రతిరోజూ ఒక చిత్రం ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం ఆయన హాబీ. "మూర్తి మంతమాయే…!! తెలుగు తల్లి కెనడాలో గత రెండేళ్లుగా శ్రీకొందరు ప్రముఖుల చిత్రాలు “మూర్తిమంతమాయే” శీర్షికన నిర్వహిస్తున్నారు. అది బహుళ జనాదరణ పొందిం ది. ఇప్పటికీ కొనసాగుతోంది. *మూర్తి గారి "తెలుగు వెలుగు " బ్లాగ్..,!! “తెలుగు వెలుగు” పేరున వీరు 2007 నుంచి బ్లాగ్ నిర్వహిస్తున్నారు. లక్షమంది పైగా ఆ బ్లాగుని చూశా రు. *చిత్రప్రదర్శనలు.. విజయనగరంలో విజయభావన సంస్థ ఆధ్వర్యంలో వీరి చిత్రాల ప్రదర్శన జరిగింది.హైదరాబాదులో కూడా వీరి చిత్రాలతో ప్రదర్శన నిర్వహించారు. అప్పుడే వీరి చిత్రాలతో “మై పెన్సిల్ ఫీట్” పేరున ఒక పుస్తకం కూడా విడుదల చేశారు. 2012లో హైదరాబాదు పబ్లిక్ గార్డెన్స్ లోనిర్వహించి న కార్టూనిస్టుల సదస్సులో పాల్గొనటమే కాక వీరి కార్టూన్లు కూడా ప్రదర్శించబడినాయి.ఉత్తరాంధ్ర కార్టూనిస్టుల ఫోరం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన అనేక కార్టూన్ ప్రదర్శనలలో కూడా వీరి కార్టూన్లు ప్రదర్శించబడినాయి. *చిత్రాల బహూకరణ..!! ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారి చిత్రం, ఎం ఎస్ సుబ్బలక్ష్మి గారి చిత్రం వేసి హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం గారికి బహూ కరించారు. వీరు వేసిన రేలంగి, గిరీశంగా ఎన్టీఆర్, సావిత్రి,ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,కృష్ణ కుమారి లాంటి అనేక మంది ప్రముఖుల చిత్రాలను అనేక టీవీ ఛానళ్ల వారు వారి కార్యక్రమాలలో సందర్భానుసారంగా వాడుకున్నారు. “లైఫ్ అఫ్ పై” చిత్రంలో నటించిన నటి స్రవంతి గారి చిత్రం వేసి ఆమెకే పంపారు. ఆమె ఆ చిత్రాన్ని తన ప్రొఫైల్ గా వుంచారు. అలాగే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారి చిత్రం వేసి ఆమెకే పంపారు. ఆమె కూడా ఆ చిత్రాన్ని ప్రొఫైల్ చిత్రంగా వుంచుకున్నారు. ప్రముఖ గజల్ రచయిత కోరుప్రోలు మాధవరావు గారు వీరిపై ఒక గజల్ రాశారు. దాన్ని శ్రీమతి లక్ష్మీ రాయప్రోలు గారు గానం చేశారు. ఇంకొక ముఖ్య విశేషం ఏమంటే.. వీరి శ్రీమతి లక్ష్మి గారు చక్కటి గాయని. ఫేస్ బుక్ లో ఆవిడ పాటలు వినచ్చు. *బంగ్లా కు చేరిన బొమ్మ..! మూర్తిగారి ఓ బొమ్మని.బంగ్లాదేశ్ online library వారి కవర్ పేజీ మీద వాడుకున్నారు.అలొగే… లాలా లాజపత్ రాయ్ చిత్రాన్ని కూడా ఓ పంజాబీ సంస్థ వారు వాడుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం The Golden Heritage of Vizianagaram గ్రూప్ వారి వార్షిక సమావేశం లో మూర్తిగారివిజయనగరం మహనీయుల చిత్రాల ను ప్రదర్శించారు. శ్రీ పి.వి ఆర్ మూర్తి గారి కుంచెనుంచి జాలువారిన అనేక చిత్రాలకు చాలామంది కవులు కవితలల్లారు అలాంటి ఓ కవితా ఇది. *చీర జాలువార చేటి నడుము జుట్టి వోంపు సొంపులన్ని యొలకబోసి యద్దమందు మోము నతిరమ్యముగ జూపు కళను జూడ మాకు కనులకింపు(ఆ.వె) *ఎంకి నాయుడు బావల ముగ్ధ ప్రణయాన్ని చిత్రించిన "ఎంకి పాటలు" తో తెలుగు సాహి త్యంలో గాలి దుమారం సృష్టించారు నండూరి సుబ్బారావు గారు. అచ్చంగా తెలుగు గడ్డలో నుంచి పుట్టిన గ్రామీణ దంపతులు ప్రణయం గాలికైనా కౌగిలి ఇవ్వనంతటి చిక్కనిది. కృత్రిమ నాగరికత బలిసిన ఈ రోజుల్లో మన పల్లెల్లో ఇంకా అంతటి సుకుమార ముగ్ధ ప్రణయ భావనకు ఆస్కారం మిగిలిందా అని అను మానం, ఆవేదనా కలుగుతాయి.కానీ…. మూర్తి గారు తన కుంచెతో ఎంకి నాయుడు బావలను కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు.!! *పెన్సిల్ చిత్రాలకు పెట్టింది పేరు..!! మూర్తిగారు పెన్సిల్ చిత్రాలకు పెట్టింది పేరు.. పెన్సిల్ తో ఆయనిచ్చే స్ట్రోక్స్ తో హావభావా లను పండించడం ఆయనకే చెల్లుతుంది. మూర్తి గారు రంగుల బొమ్మలు కూడా వేస్తారు. బాపు గారికొన్ని బొమ్మలకు రంగుల్ని కూడా అద్దారు. గీతా ఏదైనా..అది మూర్తి గారి పెన్సిల్/ కుంచెలో జీవం పోసుకోవాల్సిందే..!! *ఎ.రజాహుస్సేన్..!!

నా బొమ్మలతో రాజా హుస్సెన్ గారు facebook లో పెట్టిన టపా ఈ క్రింది లింక్ లో ...


24, జూన్ 2023, శనివారం

ఎన్టీఆర్ మాటల్లో రావణబ్రహ్మ పాత్ర


 ఎన్టీఆర్ మాటల్లో రావణబ్రహ్మ పాత్ర


నా అభిమాన పాత్ర  రావణ !!

ఎన్టీఆర్ స్వయంగా రాసిన వ్యాసం

(ఆంధ్ర సచిత్ర వార పత్రిక, జనవరి 18, 1961)


"నేను పుష్కరంగా నటుడుగా ఉన్నాను. మీ అభిమానం చూరగొన్నాను. వెండితెరమీద నేను ఇలా నిలిచి ఉండడానికి, మీ అభిమానం సంపాదించగలగడానికి కారణం నేను ధరించిన పాత్రలేనని నా విశ్వాసం.


అభిమాన పాత్ర ధరించి అభిలాష తీర్చుకొనడటం కన్నా ఏ నటుడూ ఆశించేది మరొకటి లేదు. నటనకు చోటు దొరికే బలమైన పాత్రలంటే నాకు చాలా అభిమానం. కాలేజి రోజుల్లో నాటకాలు వేసేటప్పుడు కూడ అంతే. ఆడ వేషం వేయమంటే ఎక్కడలేని పౌరషమూ వచ్చేది. వేడి, వాడిగల పాత్రలు నాకు చాలా ఇష్టం. బెజవాడ కాలేజీలో మా మాస్టారు కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణగారు నా చేత ఆడవేషం వేయించాలని పట్టుపట్టడం.. అదో గమ్మత్తు కథ. రాచమల్లుని యుద్ధశాసనంలో నాగమ్మ పాత్ర నాకు ఇచ్చారు. పౌరుషానికి కావాలంటే మీసం తీయకుండా ఆ పాత్ర ధరిస్తానని నేను భీష్మించాను.


అలా భీష్మించుకునే అలవాటు అప్పటికి, ఇప్పటికీ నాలో ఉంది. భీష్మునివంటి గంభీర పాత్రలన్నా, వీరగాంభీర్యాలు, ఔదార్యం ఉట్టిపడే పాత్రలన్నా నాటికీ నేటికీ నాకు మక్కువ.


తొలిసారి ‘భూకైలాస్‌’ చిత్రంలో రావణ పాత్ర ధరించినప్పటి నుండీ నాకు అదో విశిష్ట పాత్రగా గోచరించింది.

‘రావణ’ అనగానే స్ఫురించేది వికృతమైన ఏదో భయంకర స్వరూపం, స్వభావం. సామాన్య దృష్టికి ‘రావణుడు’ ఉగ్రకోపి, క్రూరుడు అయిన రాక్షసుడుగా కనిపిస్తాడు. కానీ రామాయణం తరచి చూసినా, పూర్తిగా అర్థం చేసుకున్నా మనకు తోచే, కనిపించే ఆకృతి వేరు! శ్రీ మహావిష్ణువే అతని అంతానికి అవతారమెత్తవలసి వచ్చిందంటే ఆ పాత్రలో ఎంతో అసామాన్యమైన ఔన్నత్యం ఉండి ఉండాలి. దానికి తోడు అతని వంశం సాక్షాత్తూ బ్రహ్మవంశం. పులస్త్య బ్రహ్మ పౌత్రుడు. విశ్వవసువు పుత్రుడు. పుట్టుకచేత ఈతడు పుణ్యాత్ముడు. అంతే అని కొట్టివేయడం సాధ్యం కాదు. సద్బ్రాహ్మణవంశ సంజాతుడైన దశకంధరుడు పునీతమైన జీవితం గడిపినవాడు.


సూర్యోదయాత్పూర్వమే నవకోటి శివలింగాలను స్వకల్ప మంత్రోచ్ఛారణతో పూజించే శివపూజా దురంధురుడు రావణుడు. తలచినదే తడవుగా కైలాసవాసిని ప్రత్యక్షం చేసుకొనగల్గిన మహా తపస్వి. ఇందుకు తగిన పురాణ కావ్య నిదర్శనాలు, జనశ్రుతులు ఎన్నో ఉన్నాయి.


దశకంఠ రావణ చిరచితమైన ‘మహాన్యాసం’ వల్లించనిదే మహాదేవుని ఆర్చన పూర్తికాదు. అతడెంత సంస్కృతీ పరిజ్ఞానం కలవాడో చూడండి. అతడి పాండితిలో పారలౌకిక శిఖరాలు మహోన్నతమైనవి. ఆధ్యాత్మిక చింతన, తనకు అతీతమైన దైవత్వం పట్ల భక్తి విశ్వాసాలు అతనిలో ఉన్నాయి. రసజ్ఞుడుగా, కళాప్రపూర్ణుడుగా రావణుడు అద్వితీయుడు. త్రిలోకాలలోనే సాటిలేని వైణికుడు. సామవేదకర్త. తనపై అలిగిన శంకరుని ప్రీతికి పొట్టచీల్చి ప్రేగులతో రుద్రవీణ కట్టి జీవనాదంతో పార్వతీపతిని తన ముందుకు రప్పించుకొనగల్గిన సంగీత కళాతపస్వి.


ఇక శాస్త్రజ్ఞుడుగా మాత్రం రావణుడు సామాన్యుడా? ఈనాడు మన శాస్త్రజ్ఞులు చేరాలని కలలుకనే నభో మండలాన్ని ఏనాడో చూచిన శాస్త్ర పరిజ్ఞాని. వాతావరణాన్నీ, ఋతుక్రమాన్నీ హస్తగతం చేసుకుని తన రాజ్యాన్ని సుభిక్షం చేసుకున్న స్థితప్రజ్ఞుడు. అనేక మారణాయుధాలను, మంత్ర తంత్రాలను, క్రియాకల్ప విద్యలను ఆకళించుకున్న శాస్త్రవేత్త. పుష్పక విమానంలో వాయుగమనం చేశాడని, దివిజ లోకాల మీద దండెత్తి అష్ట దిక్పాలకులను తన పాదాక్రాంతులుగా చేసుకున్నాడని వర్ణించారు. మేఘనాథుని జనన కాలంలో వక్రించిన శనిపై కినిసి గదాఘాతంగతో కుంటివానిని చేయడమే అతని జ్యోతిషశాస్త్ర ప్రజ్ఞకు నిదర్శనం. ఆవేశంలో ముక్కోటి ఆంధ్రులను తలపించే ఈ రావణబ్రహ్మ ఐరావతాన్నే ఢీకొనడం, అలిగినవేళ కైలాసాన్నే కంఠంపై మోయడం అతని భుజబల దర్పానికి గుర్తులు. రావణుడు కారణజన్ముడైన మహనీయుడు. పట్టినపట్టు విడువని కార్యసాధకుడు. అభిమానాన్ని ఆరాధించే ఆత్మాభిమాని. ఏ పరిస్థితులకు తలఒగ్గని ధీరుడు. అతన్ని ఈ రూపేణా తలచుకొనడం పుణ్య సంస్మరణమే!


ఈ రామాయణస్థమైన నిదర్శనాల వల్ల మనకు కనిపించే వ్యక్తి యెవరు? ఆ కనిపించే రావణుడు ఎటువంటి వాడు? బ్రహ్మ తేజస్సుతో నిర్వక్ర పరాక్రమ బలదర్పతుడై, మహాపండిత ప్రకాండడై, శివపూజా దురంధరుడై, శాస్త్రవేత్త అయిన మహా తపస్వి. కానీ .. ఇంతటి మహోదాత్తుడు రాక్షసుడుగా, శకుడుగా పరిగణింపబడటానికి గల కారణమేమిటి?

అతని వైష్ణవ ద్వేషం ముఖ్యంగా ఒక కారణం. తాను శైవుడు కావడంలో తప్పు లేదు. ఇష్ట దైవాన్ని నమ్మి కొలవడంలో అపకారమూ లేదు. కాని తన మతాన్ని ఇతరుల మీద రుద్ది పరమత ద్వేషంతో వైష్ణవ పూజలాటంకపరచి విష్ణుద్వేషిగా హింసాకాండకు ఉపక్రమించడమే అతడంటే మనం భయభ్రాంతుల మయ్యేటట్లు చేసినది. పరనారీ వ్యామోహమే నలకూబరుని శాపానికి దారితీసింది. అతని పతనానికి కారణమైనది. ఈ రెండూ అతనిపై దెబ్బ తీసినట్లు మరేవీ తీయలేదు. అహంభావంలో కూడా అతనికతనే సాటి. తనలో తనకు ఎంత నమ్మకమున్నా ఇతరులంటే నిర్లక్ష్యం, చులకన చేయడం, నందీశ్వరుని శాపానికి దారితీసింది. అతని వంశమంతా వానరబలంతో హతమైనది.


లక్ష్మీ అవతారమూర్తి అయిన మాతులుంగిని చెరపట్టబోయినప్పుడు పరాజయం పొందడం, వేదవతిగా ఉన్న ఆమెను తాను దక్కించుకొన లేకపోవడం, సీతగా జన్మించిన ఆమెను స్వయంవరంలో సాధించబూని పరాధూతుడు కావడం కడకు సీతను లంకలో చెరపెట్టేవరకు అతడు మూర్ఖించడం- ఇవన్నీ పై మహత్తరగుణాలతో జోడించి చూస్తే రావణుడు ఎలాంటివాడుగా మనకు కనిపిస్తాడు? నాకు అతడు దుర్మార్గుడుగా కనిపించడు. పట్టుదలగలవాడుగా కనిపిస్తాడు. అతనిలో లేని రసం లేదు. కావలసినంత సరసం, ఉండరానంత విరసం ఉన్నాయి. జీవన్నటులలో మేటి. అటువంటిపాత్ర అపురూపమైనదని నా నమ్మకం. అలాంటి పాత్ర ధరించాలని నా అభిలాష. అదే నన్ను ఈ పాత్రధారణకు ప్రోత్సహించింది.


రావణుడు వికృతాకారుడు కాదు. పెద్దపొట్టతో, బుర్రమీసాలతో, అనవసర ఘీంకారాలతో వికట ప్రవృత్తిగలిగిన మదోన్మత్తుడు, అలక్షణుడు కాదు. మనవాతీతుడైన ఒక మహత్తర వ్యక్తి, శక్తి. కుండెడు పాలలోనయినా ఒక విషం బొట్టు పడితే పాలన్నీ విషం అయినట్లు ఇన్ని సద్గుణాలు కలిగినా, సద్బ్రాహ్మణ వంశ సంజాతుడయిన రావణునిలో ఒక్క దుర్గుణమే అతని నాశనానికి దారి తీసింది. రావణపాత్ర సర్వావేశ సంకలితం. ఆనందం, అవేశం; అనుగ్రహం, ఆగ్రహం ; సహనం, అసూయ; భక్తి, ధిక్కారం- ఇన్ని ఆవేశాలు కావేషాలు రావణుని తీర్చి దిద్దాయి. ఈ పాత్ర సజీవం కావడం వల్లనే నన్నింతగా ఆకర్షించింది.


ఈ మహాపాత్ర ధరించగలిగినందుకు ధన్యుడననుకుంటాను. రావణుని పరస్పర విరుద్ధ ప్రవృత్తులన్నీ వ్యక్తీకరించడానికి ప్రయత్నించాను. ఎంతవరకు సఫలుడనైందీ అభిమానులు, పాఠకులు నాకు తెలియజేస్తే సంతోషిస్తాను.

పౌరాణిక గాథలలో కనిపించే అద్భుతమైన సజీవపాత్రలలో రావణపాత్ర ముఖ్యమైనది. అది నా అభిమానపాత్ర.


(ఆంధ్ర సచిత్ర వార పత్రిక, జనవరి 18, 1961)

( Copied from FB wall of a friend)

19, జూన్ 2023, సోమవారం

జంధ్యాల - pencil sketch



'హాస్యబ్రహ్మ' జంధ్యాల (జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి) వర్ధంతి సందర్భంగా నా స్మృతంజలి. (Pencil sketch)

అటు నాటకరంగంలోనూ, ఇటు వెండితెరమీద దర్శకుడు, రచయిత, నటుడుగా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. పలు పురస్కారాలు పొందిన విశిష్ట వ్యక్తి జంధ్యాల.

జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. జంధ్యాల అని ఇంటిపేరుతోటే సుప్రసిద్ధుడైన ఇతని అసలుపేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. ప్రత్యేకించి హాస్యకథా చిత్రాలు తీయటంలో ఇతనిది అందె వేసిన చెయ్యి. జంధ్యాల చెప్పిన ప్రసిద్ధ వాక్యం - నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం

10, జూన్ 2023, శనివారం

ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు - అన్నమయ్య కీర్తన


 ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు  - అన్నమయ్య కీర్తన


ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు

బూడిదిలో హోమమై పోయఁ గాలము ॥ఏడ॥


ఇదె మేలయ్యెడి నా కదె మేలయ్యెడినని

కదిసిన యాసచేఁ గడవలేక

యెదురు చూచి చూచి యెలయించి యెలయించి

పొదచాటుమృగమై పోయఁ గాలము ॥ఏడ॥


ఇంతటఁ దీరెడి దుఃఖ మంతటఁ దీరెడినని

వింతవింత వగలచే వేఁగి వేఁగి

చింతయు వేదనలఁ జిక్కువడుచు నగ్ని

పొంతనున్న వెన్నయై పోయఁ గాలము ॥ఏడ॥


యిక్కడ సుఖము నా కక్కడ సుఖంబని

యెక్కడికైనా నూర కేఁగియేఁగి

గక్కన శ్రీతిరువేంకటపతిఁ గానక

పుక్కిటి పురాణమయి పోయఁ గాలము ॥ఏడ॥


జీవితంలో ఎండవుమాలు, భ్రమల వెంట పరుగెత్తుతూ కాలాన్ని వృధా చేశానని వాపోతాడు అన్నమయ్య ఈ కీర్తనలో . అప్పటి రోజుల్లోనే  అన్నమయ్య కాలం విలువ గుర్తించి చక్కగా కీర్తన రూపంలో మన కందించాడు.


ఇది మేలు జరుగుతుందని అది మేలు జరుగుతుందని ఆశతో గడుపుతాము. ఎదురు చూసి చూసి ఇటూ అటూ పోయి పొదచాటు మృగంలా మాయమైపోతుంది కాలము. 


ఇదిగొ తీరుతుంది అదిగో తీరుతుంది అని వింత వింత కారణాలతో చూసి చూసి వేదనతో చిక్కుపడుచూ అగ్నిచెంత వెన్నలా కరిగిపోతుంది కాలము.


ఇక్కడ సుఖం దొరుకుతుందని, అక్కడ సుఖం దొరుకుతుందని ఎక్కడెక్కడో వెతుకుతాము. కాని  శ్రీ తిరువేంకటపతిని  కానక పుక్కుటి పురాణమైపోతుంది కాలము.


సహకారం : శ్రీమతి పొన్నాడ లక్ష్మి

చిత్రం : Pvr Murty

4, జూన్ 2023, ఆదివారం

కాలమెలా గడిచిపోయె..తెలియకనే పోయెనే. - గజల్


 Pvr Murty గారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్సుమాలతో 🌹🙏🌹🙏🌹😊😊🥀💌🥀🦜


నా చిత్రానికి.మిత్రులు శ్రీ మాధవరావు కొరుప్రోలు గారు రచించిన తెలుగు గజల్. వారికి నా ధన్యవాదాలు 


కాలమెలా గడిచిపోయె..తెలియకనే పోయెనే..! 

కలలనావ తీరానికి..చేరకనే మునిగెనే..! 


ఆశపూల చెట్టుచూడ..గంధాలకు బానిసే.. 

గుండెసడికి ఒకసాక్షిగ..మిగలకనే ఒరిగెనే..! 


నీకోసం పరితపించు..మేఘంలా ఈ మనసు.. 

తననుతాను ఒకసమిధగ..తలచకనే రగిలెనే..! 


ఎడారిలో పూవులేవొ..ఎవరికొరకొ ఈవేళ.. 

భావరాగ మధురిమలను..పంచకనే రాలెనే..! 


ఈ రెప్పల వాడలోని..జాతరెంత దివ్యమో.. 

నీ మౌనమె దీపాలుగ..పెట్టకనే వెలిగెనే..! 


చాలించగ కుదరని ఈ..వ్యవహారమె ఓ మాయ.. 

వెతుకులాట లోలోపల..జరగకనే ఆగెనే..! 


మరిమాధవ గజలింటికి..ఆహ్వానం ఎల్లరకు.. 

పాడుకునే హృదిహృదినే..మీటకనే పొంగెనే..!

1, జూన్ 2023, గురువారం

జె. వి. రమణమూర్తి - అభినయకళామూర్తి

  • My pencil sketch

అభినయకళామూర్తి జె.వి.రమణముార్తి  (whatsapp నుండి సేకరణ)

గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకాన్ని భుజానికెత్తుకొని, దేశవిదేశాల్లో కొన్ని పదుల ఏళ్ళు, కొన్ని వందల ప్రదర్శన లిచ్చిన ఘనత జె.వి. రమణమూర్తిదే. ఆయన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించినా, నడిచొచ్చిన దారిని మర్చిపోని  మధ్యతరగతి మనిషి. ‘శంకరాభరణం’ శంకరశాస్త్రి’ పాత్రతో తోడబుట్టిన అన్నయ్య తన కన్నా ముందుకు దూసుకుపోయినా, అన్న చాటు తమ్ముడిగా ఆనందించిన మమతానురాగాల మూర్తి.

 ఒక తరానికి ఆయన రంగస్థల నటుడు. బ్లాక్ అండ్ వైట్ సినిమా తరానికి ఆయన హీరో... సెకండ్ హీరో పాత్రల ఫేమ్. కలర్ సినిమాల యుగానికి వచ్చేసరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్. నిన్న మొన్నటి దాకా - టీవీ, రేడియో ఆర్టిస్ట్. అందుకే, జె.వి. రమణమూర్తిగా సుప్రసిద్ధుడైన అభినయమూర్తి జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి గురించి ఒక్క మాటలో, ఒక్క ముక్కలో చెప్పడం, నిర్వచించడం కష్టం. శ్రీకాకుళం జిల్లా లుకులామ్ అగ్రహారంలో మొదలై మద్రాస్ మీదుగా హైదరాబాద్ దాకా వివిధ ప్రాంతాల మీదుగా విభిన్న రంగాల్లో విస్తృత ప్రయాణం, కాలంతో పాటు మారుతూ బహుపాత్ర పోషణ చేయడం ఆయన ప్రత్యేకత. 

చిన్నప్పటి నుంచి... నాటకమే జీవితం

ఎక్సైజ్ ఇన్‌స్పెక్టరైన జె.వి. శివరామమూర్తి ఆరుగురు సంతానంలో రెండోవారు జె.వి. సోమయాజులైతే, నాలుగోవారు రమణమూర్తి. గమ్మత్తే మిటంటే, సోమయాజులు, రమణమూర్తి, రమణమూర్తి తరువాతి వాడైన జె.వి. శ్రీరామ్మూర్తి - ముగ్గురూ రంగస్థల నటులే. చిన్నప్పటి నుంచి రమణమూర్తికి నాటకాలంటే అభిమానం. విజయనగరంలో పెరగడం అందుకు దోహదం చేసింది. శ్మశానమైన గురాచారి తోటలో ప్రాక్టీస్ చేసి, మహారాజా వారి ఒకప్పటి ఏనుగులశాలైన ‘హస్తబల్ హాలు’లో తొలిసారి నాటకం వేయడంతో ఆయన అభినయ ప్రస్థానం మొదలైంది. పదిహేనో ఏట 1948లో ‘కవిరాజు మెమోరియల్ క్లబ్’ పెట్టి నాటకాలు వేశారు. ఆ సమాజం విజయనగరంలో ఇప్పటికీ నడుస్తుండడం విశేషం. 

అన్నయ్య సోమయాజులుతో కలసి ఆత్రేయ ‘ఎన్జీవో’, కవిరాజు ‘దొంగాటకం’, డి.వి. నరసరాజు ‘నాటకం’, ప్రఖ్య శ్రీరామ్మూర్తి ‘కాళరాత్రి’ లాంటివన్నీ ప్రదర్శించారు. బి.ఎస్సీ చదివిన రమణమూర్తి ఆ రోజుల్లోనే ప్రదర్శనకు కావాల్సినవన్నీ సమకూర్చి, అన్నీ అందరికీ చెబుతూ తెలియ కుండానే ‘డెరైక్టర్’ అయ్యారు. హైదరాబాద్‌లో 1955లో జరిగిన ‘ఆంధ్ర నాటక కళాపరిషత్’ పోటీల్లో ‘కాళరాత్రి’ ప్రదర్శనతో ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం అనుకోకుండా ఆయన సినీరంగానికి బాట వేసింది. 

హీరోగా 20 సినిమాలు...

ఆ ప్రదర్శన చూసిన రచయిత డి.వి. నరసరాజు, దర్శకుడు తాతినేని ప్రకాశరావుల పరిచయం రమణమూర్తి పేరును దర్శక - నిర్మాత ఎల్వీ ప్రసాద్ దాకా తీసుకెళ్ళింది. ఎల్వీ దగ్గర అవకాశం రావాల్సింది, చివరకు ఆయన మేనల్లుడు కె.బి. తిలక్ దర్శకత్వంలోని ‘ఎం.ఎల్.ఎ’ దగ్గర వచ్చింది. ఆ సినిమా హిట్టవడంతో వచ్చిన గుర్తింపు... ఆ తర్వాత ‘అత్తా ఒకింటి కోడలే’, ‘బావామర దళ్ళు’, ‘పెళ్ళి మీద పెళ్ళి’ ఇలా 20 సినిమాల్లో హీరో వేషాలొచ్చేలా చేసింది. 

ఎన్టీఆర్‌తో కలసి ‘మంచి మనసుకు మంచి రోజులు’, ‘శభాష్ రాముడు’ లాంటి చిత్రాల్లో నటించారు. ‘శభాష్ రాముడు’లో తమ్ముడి పాత్ర వేయడంతో ఆ తరువాత నుంచి ఎన్టీఆర్ తనను ఆప్యాయంగా ‘తమ్ముడూ’ అని పిలిచేవారని రమణమూర్తి గుర్తుచేసుకొనేవారు. అలాగే, ఏయన్నార్ సైతం అవకాశాలివ్వమంటూ అందరికీ చెప్పడమే కాక, ‘మాంగల్యబలం’, ‘అమాయకురాలు’ లాంటి చిత్రాల్లో మంచి వేషాలిచ్చారు. 

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ‘మరో చరిత్ర’:-

కుడికాలికి యాక్సిడెంటై కొన్నేళ్ళు మంచం మీద ఉండాల్సి రావడం ఆయన కెరీర్‌ను ఇబ్బంది పెట్టింది. ఆ తరువాత ‘అనురాగాలు’ చిత్రంతో క్యారెక్టర్ యాక్టర్‌గా రెండో దశ మొదలుపెట్టారు. కె.విశ్వనాథ్ ‘సిరిసిరి మువ్వ’ నుంచి మళ్ళీ ఒక ఊపందుకొని, ‘మన ఊరి పాండవులు’, ‘మరో చరిత్ర’, ‘ఆకలిరాజ్యం’, ‘గుప్పెడు మనసు’, ‘సిరివెన్నెల’, ‘వంశగౌరవం’, ‘శ్రీదత్తదర్శనం’ లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్నారు. 

1933 మే 20న జన్మించిన రమణమూర్తి, అన్నయ్య జె.వి. సోమ యాజులు కన్నా అయిదేళ్ళు చిన్న. రమణమూర్తి ముందుగా సినిమాల్లోకి వచ్చి, పేరు గడించినా, ఆలస్యంగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన అన్నయ్యకు ‘శంకరాభరణం’ సినిమా పుణ్యమా అని మరింత ఎక్కువ పాపులారిటీ వచ్చింది. ఆ క్రమంలో అన్నదమ్ములిద్దరూ రంగస్థలం మీద లానే సినిమాల్లోనూ ‘సప్తపది’ లాంటి పలు చిత్రాల్లో కలసి నటించారు. అప్పుడిక పాపులారిటీలో అన్న చాటు తమ్ముడిగానే తెరపై మిగిలిపోయినా, తన మార్కు అభినయంతో అలరిస్తూనే వచ్చారు. 

కన్యాశుల్కంతో చిరకీర్తి :-

ఎన్ని సినిమాలు, సీరి యల్స్‌లో చేసినా, ‘కన్యాశుల్కం’ నాటకాన్ని మూడు గంటలకు కుదించి, 1953 నుంచి 1995 దాకా 42 ఏళ్ళపాటు ‘నటరాజ కళాసమితి’గా ఏక ధాటిగా ప్రదర్శనలివ్వడం రమణమూర్తిని చిరస్మరణీయుణ్ణి చేసింది. సోమయాజులు రామప్ప పంతులైతే, రమణమూర్తి గిరిశం. టీవీకి తగ్గట్లు స్క్రీన్‌ప్లే రాసుకొని, 1990లలో దూరదర్శన్‌కు 19 భాగాల సీరియల్‌గా కూడా ‘కన్యాశుల్కా’న్ని అందించారు.

ఆఖరుదాకా రంగస్థలాన్ని ఊపిరిగా శ్వాసించి, ఒకానొక దశలో అన్నయ్యతోనే ఆ విషయంలో తేడా వచ్చినా అంకితభావం వీడని ఈ అభినయ కళామూర్తికి  నివాళి......


-------------------------------------------------------------------------------------------------------------------------


కన్యాశుల్కం సినిమాలో  NTR  గిరీశం పాత్ర పోషించి మెప్పించారు. అయినా "ఆ పాత్రకు మీకు మీరే సాటి. ఈ సినిమా  తీసినప్పటికి మీరు సినీరంగ ప్రవేశం చెయ్యలేదు. లేకపోతే ఆ పాత్ర మిమ్మల్నే వరించి ఉండేది  అని రమణమూర్తి ని ప్రశంచించారు.


బి. గోపాలం - సంగీత దర్శకుడు, , నటుడు

బి గోపాలం - సంగీత దర్శకుడు గాయకుడు నటుడు  (my charcoal pencil sketch)  Facebook మిత్రులు వీర నరసింహారాజు గారి వాల్ నుండి సేకరణ యధాతధంగా. వార...