30, మే 2018, బుధవారం

తెలుగు తేజం - NTR



తెలుగు తేజం - NTR
 నా పెన్సిల్ చిత్రాలు



విషయాలు సేకరణ whatsapp నుండి.

అటు సినీవినీలాకాశంలో పోలీసు కాన్సెబుల్ వేషం నుండి రారాజుగా ఎదిగి భారతీయ సినీ చరిత్రలో ఓ చక్రవర్తిగా గుర్తింపబడిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడతడు.

ఇటు రాజకీయరంగంలో ప్రపంచం అబ్బురపడేంత ప్రణతిగాంచి చరిత్ర నెలకొల్పిన ఘనుడతడు.

1981లో ఊటీలో సర్దార్‌ పాపారాయుడు చిత్రం షూటింగు విరామసమయంలో ఒక విలేఖరి, మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా? ఆని అడిగారట.
దానికి జవాబుగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టిన రోజునుంచి నా వంతుగా ప్రతీనెలలో 15రోజులు తెలుగుప్రజల సేవకోసం కేటాయిస్తాను అని బదులు చెప్పారట. అదే ఆయన చేసిన రాజకీయ ప్రవేశ ప్రసహనానికి మొదటి సంకేతం.

అయితే అప్పటికి మూడేళ్ల క్రితం 1978 నుండీ ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారానికి వచ్చిన కాంగ్రేసు పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలయ్యింది. అధిష్టానం అధికారం వికటించింది. తరచూ ముఖ్యమంత్రులు మారుస్తూ ఉండేవారు. ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి, రాష్ట్రంలో శాసనసభ్యులచేత నామకార్థం ఎన్నిక చేయించేవారు.
ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అభాసు పాలయింది.

మన మంత్రులపైన కేంద్రం చులకనభావం చూపడం మన ఆత్మగౌరవాన్ని కించపరచడం ప్రజలకి బాధకల్గించింది. రాజీవ్ గాంధీ హైదరాబాద్ ఏయిర్ పోర్ట్ లో మన అంజయ్యగారితో ప్రవర్తించిన తీరు ప్రజలలో తీవ్ర ఆగ్రహం కలిగించింది. దానికి ఆజ్యంపోసినట్టు ఎమర్జన్సీ పాలనలో ప్రభుత్వ దుందుడుకు వైఖరి. మీడియా మీద ఆంక్షలు, ఇదేమని ప్రశ్నించిన ప్రతీవారినీ జైలుపాలు చేయడం... రోడ్డుమీద నలుగురు కలసి నడవలేని నిరంకుశ నిబంధనల మధ్య ఊపిరి తీసుకోలేక విలవిలలాడిపోయారు ప్రజలు.

ఆ పరిస్ధితుల ప్రభావంతో రామారావుగారు రాజకీయాలలోకి రంగప్రవేశం చేయాలనుకోవడం... అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వరత్వరగా పూర్తి చేసుకుని తన సినీ సామ్రాజ్య వైభవ సింహాసనం విడనాడి తన అష్టైశ్వర్యాల మహలులను వీడి, తన మందీమార్బలాలను వదలి ప్రజలకోసం ప్రజల ఆత్మగౌరవం పెంపొందించే నిమిత్తం తన కుటుంబాన్ని కులాశాలనీ దూరంపెట్టి 1982 మార్చి 21 న హైదరాబాదు వచ్చినప్పుడు అభిమానులు ఆయనకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు.

1982 మార్చి 29 సాయంత్రము 2:30లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పారు.
ఆసమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి, ప్రకటించారు.
పార్టీ ప్రచారానికై తన వ్యానును  ఒక కదిలే వేదికగా తయారు చేయించి, దానిపై నుండే ఆయన తన ప్రసంగాలు చేసేవారు.దానిని ఆయన "చైతన్యరథం" అని అన్నారు.
ఆ రథంపై "తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!" అనే నినాదం రాయించారు.
ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్యరథమే స్ఫూర్తి.

ఒక శ్రామికుడివలె ఖాకీ దుస్తులు ధరించి, నిరంతరం ప్రయాణిస్తూ, ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నాడు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసాడు. కాంగ్రెసు అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించివేసిన ప్రచార ప్రభంజనమది.

ఎన్టీఆర్ ప్రసంగాలు ఉద్వేగభరితంగా, ఉద్రేకపూరితంగా ఉండి, ప్రజలను ఎంతో ఆకట్టుకునేవి. ముఖ్యమంత్రులను తరచూ మార్చడం.., అదీ ఢిల్లీ పెద్దల నిర్ణయం ప్రకారమే తప్ప, శాసనసభ్యుల మాటకు విలువ లేకపోవడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని తన ప్రసంగాలను మలచుకున్నాడు. కాంగ్రెసు నాయకులు కుక్కమూతి పిందెలనీ, కొజ్జాలనీ, దగాకోరులనీ, దగుల్బాజీలని, అధిష్టానం చేతిలో కీలుబొమ్మలనీ తీవ్రపదజాలంతో విమర్శించాడు. కాంగ్రెసు పార్టీ కారణంగా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదనీ, దాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారనీ విమర్శిస్తూ, ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పాడు. కాంగ్రెసు నిర్వాకానికి అప్పటికే విసుగు చెందిన, ప్రజలు ఆయన నినాదం పట్ల ఆకర్షితులయ్యారు.
కుల -మత -ప్రాంతీయ -భాష-పార్టీలకు అతీతంగా ప్రజలు అతనివెంట నడిచారు. అది స్వతంత్ర భారతీయ చరిత్రలోన అబ్బురపడే సంఘటన. చరిత్ర సృష్టించారు.

1983 జనవరి 7 న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం 199, కాంగ్రెసు 60, సిపిఐ 4, సిపిఎం 5, బిజెపి 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఎళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది. ఆయన విజయానికి అప్పటి దినపత్రికలు - ఎంతో తోడ్పడ్డాయి.

అటు నటనారంగంలో జేజేలు అందుకుని,
ఇటు రాజకీయరంగంలోతన  కీర్తి ప్రజ్వలించిన కధానాయకుడికి ఘన నివాళి !!!

21, మే 2018, సోమవారం

లాలమ్మ లాలనుచు -- ఉంగాల కబుర్లు చెప్పరా తండ్రీ



నా చిత్రానికి మిత్రుల కవితా స్పందన

॥చిట్టితండ్రి ॥ "ఉంగాల కబురులే చెప్పరా తండ్రీ"
నా pencil చిత్రానికి Umadevi Prasadarao Jandhyala గారి తెలుగు గజల్.
ఉంగాల కబురులే చెప్పరా తండ్రీ!

వాటిలో అర్థాలు విప్పరా తండ్రీ!

పూలరేకులవంటి పాదాలు ఊపీ
అందాలు యిల్లంత చల్లరా తండ్రీ!

ఊయలూపేవేళ జోలల్లు వింటూ
మైమరచి నిదురపో కమ్మగా తండ్రీ!

వెండి వెన్నెల్లోన బువ్వపెడుతుంటే
మారాము మానుకొని పట్టరా తండ్రీ!

కృష్ణకృష్ణాఅంటు భజనవినగానే
లేలేత చప్పట్లు కొట్టరా తండ్రీ !

అమ్మకొంగునదాగి దోబూచులాడీ
ఆటలో ఎప్పుడూ నెగ్గరా తండ్రీ !
—————————
ఉమాదేవి జంధ్యాల



ఈ చిత్రానికి మిత్రురాలు సింహాద్రి జ్యోతిర్మయి రాసిన పాట :

లాలమ్మ లాలనుచు జోల పాడాలి

జోల విని పాపాయి నిదురపోవాలి
ఆటపాటల చాల అలిసేవు గాని
చాలించి కాసేపు కునుకుతీయాలి : 

కొసల్య ఒడిలోన శ్రీరామ లాలీ
నందగోపుని ఇంట కన్నయ్య లాలీ
రామయ్య సుగుణాలు
కృష్ణయ్య లీలలు
చూపించి బుజ్జాయి తాను ఎదగాలి

లాలమ్మ లాలి ఇది అమ్మమ్మ లాలీ
నీ ముద్దుమురిపాలు నే చూసి మురవాలి

కరిరాజ ముఖునికి గిరితనయ లాలీ
దాశరథి ‌పుత్రులకు ధరణిసుత లాలీ
ఆదిపూజితునిలా అమ్మ కనువెలుగులా
నిలిచి చిన్నారి మా పేరు నిలపాలి

లాలమ్మ‌లాలి ఇది నాన్నమ్మ లాలీ
మా వంశ దీపమై
నీవు వర్థిల్లాలీ

వేంకటాచలపతికి వకుళమ్మ లాలీ
మువ్వురయ్యలకును మునిపత్ని లాలీ
ఉయ్యాల పాపడే ఊళ్ళేలి‌పదుగురూ
మెచ్చి దీవించేటి మేటి కావాలీ

లాలమ్మ లాలి ఇది మీ అమ్మ లాలీ
శతమానమై సకల‌ శుభములందాలీ
--------------------------------------------------------
సింహాద్రి జ్యోతిర్మయి
21.5.2018

లాలనుచు నూచేరు లలనలిరుగడలా
పాట ట్యూన్ లాగా పాడుకోవచ్చు
శ్రీమతి ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారి కవిత కి  శ్రీమతి పొన్నాడ లక్ష్మి గారు పాడిన పాట ఈ క్రింది లింకు క్లిక్ చేసి వినండి.

ముసిముసి నవ్వుల మోముగని ..


pencil చిత్రం

ఈ చిత్రానికి కవిత రాసిన శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి కి ధన్యవాదాలు.


పసితనపు అమాయకత్వమో
పరువపు కొంటెతనమో
సాధించిన విజయోత్సాహమో
హృదయాన్ని అలముకొన్నప్పుడు మాత్రమే
కళ్ళు వెలుగు దివిటీలు గా మారి
పెదవి అంచుల తెరచాటు తీసి
నవ్వు పువ్వుల రాణిని
నలుగురికీ పరిచయం చేస్తాయి.
కళ్ళల్లో కాంతి నిండితే
అది గురజాడ వారి మధురవాణి నవ్వు
కళ్ళల్లో కలలు చెదిరితే
అది గురజాడవారి
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ నవ్వు

నవ్వు వెనక కథలెన్నో!
నవ్వ గలుగు కనులెన్నో!

సింహాద్రి జ్యోతిర్మయి

18.5.2018


18, మే 2018, శుక్రవారం

గోదావరి - కాటన్ దొర


Whatsapp నుండి సేకరణ

వైజాగ్ నించి హైదరాబాద్ వెళ్ళడానికి ట్రైనెక్కుతాం.. తుని దాటిందగ్గర్నుంచి పచ్చకార్పెట్ కప్పినట్టున్న పొలాల మధ్యలోంచి అన్నవరం, పిఠాపురం, సామర్లకోట లాంటి స్టేషన్లు దాటుకుంటా  4 గంటల జర్నీ తర్వాత రాజమండ్రి స్టేషనొస్తుంది..

"అప్పుడే రాజమండ్రి వొచ్చేశామా " అంటారెవరో అటుపక్క సీట్లో కూర్చున్న పెద్దాయన.. "ఆ.. అవునండీ" అని సమాధానమిస్తాడు పూతరేకులు అమ్ముకోడానికి వచ్చిన బక్కపలచని కుర్రాడు..

అప్పుడు మొదలవ్వుద్ది అందరిలో ఒకలాంటి హడావిడి..

అయిదు నిముషాలాగి తిరిగి ట్రైన్ స్టార్ట్అవ్వగానే..

రిజర్వేషన్ దొరక్క గుమ్మం దగ్గర మెట్ల దగ్గర కూర్చునోళ్లు ఎందుకైనా మంచిదని లోపలికొచ్చేస్తారు..
కుర్రోల్లాంటివాళ్ళు చేసుకుంటున్న చాటింగులాపేసి మెల్లగా గుమ్మం దగ్గర జేరతారు.. పెద్దోళ్ళులాంటివళ్ళూ వాళ్ళ వెనకాల నిలబడతారు..
అప్పటిదాకా ఒక సౌండుతో ఊగుతూ వచ్చిన రైలు అప్పట్నుంచి మరో సౌండుతో దడదడలాడుతూ లోపల కూర్చున్నవాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది..

ట్రైనంతా నిశ్శబ్దమైపోతుంది.

అన్ని తలలు కిటికీలవైపు తిరుగుతాయి...

సీట్లో కూర్చున్న స్త్రీలు నిద్రపోతున్న పిల్లల్ని లేపి మరీ కిటికీలోంచి చూపిస్తారు. అదే.. ..

"అదిగో చూడు.. గోదావరి.. గోదావరి.. బ్రిడ్జదిగో.. ఎంత పెద్దదో చూడు.. ఇదిగో, విండోలోంచి డబ్బులెయ్యి.." అని కనుచూపు మేరంతా నిండుకుండలా ప్రవహిస్తున్న గోదావరి నదిని కంపార్ట్మెంట్ కిటికీలోంచే సర్దుకుని చూపిస్తూ తనివితీరా మురిసిపోతారు...

ట్రైను బ్రిడ్జి మీద నడిచిన ఆ అయిదు నిముషాలు గుమ్మం దగ్గర నిల్చున్నవాళ్ళలో రకరకాల ఆలోచనలు..

కోట్లాదిమంది కడుపు నింపుతున్న గోదావరి మాతని కళ్లారా ఆస్వాదించి, కడుపు నిండా గోదారి గాలి పీల్చి, వీలైనన్ని సెల్ఫీలు తీస్కుని, ఘనంగా వెనక్కొచ్చి సీట్లలో కూర్చుని, కుర్రాళ్ళు డీపీలు మార్చుకున్నాక తృప్తిగా డిన్నర్ పార్సెల్ విప్పుతారు... @గోదావరి రివర్ అని...

రాజమండ్రికి ట్రైన్లో వచ్చే అందరికీ ఎదురయ్యే అనుభవమే ఇది.. ఫ్లయిట్లో వచ్చినా, ట్రైనెక్కి వచ్చినా, బస్సెక్కి వచ్చినా గోదావరినదిని, దాని చుట్టూ పులుముకున్న పచ్చదనాన్ని ఆస్వాదించకుండా ఉండటం కష్టం.. ఆ పచ్చదనం చూసినవాళ్ళు "గోదారోళ్ళెంత అదృష్టవంతుల్రా" అని కుళ్ళుకుంటారు.. చరిత్ర తెల్సినోళ్లు మాత్రం మనసులో కాటన్ దొరకి దణ్ణమెట్టుకుంటారు.. ఇవేమి తెలీని కుర్రోళ్ళు మాత్రం సెల్ఫీలు తీసుకుంటారు..

అలాంటి అపురూపాన్ని అందంగా అందించిన మహానుభావుడు ఎవరనుకున్నారు .. .. ఆయనే సర్ ఆర్ధర్ కాటన్ గారు..

ఇప్పుడు ఆంధ్రుల ధాన్యాగారంగా పేరున్న గోదావరి జిల్లాల్లో ఒకప్పుడు కరువొస్తే ఆకలిచావులతోను, వర్షాలొస్తే పోటెత్తే వరదలతోనూ అపార ప్రాణనష్టం మిగులుస్తూ ఆఖరికి పసిపిల్లల్ని కూడా అమ్ముకునే స్థాయిలో కరువు తాండవించేదంట.. ఎందుకంటే, ఎక్కడో నాసిక్లో పుట్టి అందర్నీ పలకరిస్తా, ఎవరెవరి భారాల్నో బాధ్యతగా మోసుకుంటా 1600 కిమీ పాటు ప్రవహించొచ్చిన గోదారమ్మ పాపికొండల మధ్యలో రెండు తాడి చెట్లంత లోతుండే ఉగ్రగోదావరిగా రూపాంతరం చెంది, అదే స్పీడ్తో  అంతర్వేది దగ్గర ఆవేశంగా సముద్రంతో మమేకమయ్యేది తప్పించి ఏ రకంగానూ ఆ వృధాజలాలు ఉపయోగపడేవి కావంట..

అలాంటి ప్రాంతానికి, విధినిర్వహణలో భాగంగా ఇంగ్లాండునించి వచ్చి, నరమానవుడు నడవటానికి కూడా ఆలోచించలేని ఏరియాల్లో గుర్రమేసుకుని కలతిరుగుతా, ఆనకట్ట కట్టాల్సిన అవసరం గురించి రిపోర్ట్ తయారుచేసేయడమే కాకుండా ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఎన్నో అష్టకష్టాలు పడ్డాడంట ఈ పుణ్యాత్ముడు..

"ఒక్కరోజు సముద్రంలో కలుస్తున్న గోదావరి ప్రవాహం, సంవత్సరమంతా మన లండన్లో ప్రవహిస్తున్న థేమ్స్ నదితో సమానం" అని అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంతో పోట్లాడి ఒప్పించిన మహాత్ముడు..

ఎన్నోసార్లు ఎన్నో కమీషన్ల ముందు నించుని, పెర్ఫెక్ట్ ఇర్రిగేషన్ ప్లానింగుతో, సరిగ్గా నాలుగేళ్లలో, మూడున్నర కిలోమీటర్ల పొడవుతో, 175 గేట్లతో ధవళేశ్వరం బేరేజ్ అనే అన్నపూర్ణని ఆరోగ్యం పాడుజేసుకుని మరీ నిర్మించి "నా పేరు జెప్పుకోకుండానే కడుపు నింపుకుని పండగ జేసుకొండోరేయ్" అని అక్షయపాత్రలా దానమిచ్చేసేడు.. ఈ డీటెయిల్స్ అన్ని ధవళేశ్వరంలో ఉన్న కాటన్ మ్యూజియంకి వెళ్తే చూడొచ్చు..  ఆరోజుల్లో ఆయన ప్లానింగు, వాడిన టెక్నాలజీ చూసి ఆశ్చర్యపోతాం..

ఇదంతా జరిగి అక్షరాలా నూట అరవై అయిదు సంవత్సరాలు పైనే అవుతోంది. కానీ, ఇప్పటికీ మీరెవరైనా మా గోదారి సైడొస్తే ఈయన గురించి చెప్తూ "కాటన్ దొరగారు" అంటాం తప్పించి "కాటన్" అని ఏకవచనం కూడా వాడమండీ..  బ్రాహ్మణులు రోజూ అర్ఘ్యం వదిలేటప్పుడే కాదు.. గోదావరికి పుష్కరాలొచ్చినప్పుడు కొంతమందైతే  కాటన్ దొరగారికి తర్పణాలు కూడా వొదుల్తారు.. అదీ.. ఆయనగారంటే మావాళ్ళకున్న అభిమానం..

కాటన్ గార్ని తలచుకోగానే కళ్ళముందు మెదిలేది గుర్రం మీద ఠీవిగా కూర్చున్న ఆయన  నిండైన విగ్రహం.. ఆయన పేరుకు ముందు ఉండాల్సిన "అపరభగీరధుడు" అన్న బిరుదు.. అయితే దీని గురించే నాదొక కంప్లైంట్ ఉంది..

పితృదేవతలకు సద్గతులు కల్పించడానికి గంగమ్మ తల్లిని భూమ్మీదకి రప్పించిన భగీరధుడుతో పోల్చడం కంటే, తన జటాజూటాల్లో బంధించి పవిత్ర గంగాజలాలు ఎటు పడితే అటు ప్రవహించకుండా సరైన తీరులో కిందకి వొదిలిపెట్టి భూమాతకి, గంగామాతకి కూడా ఉపశమనం కలిగించిన పరమశివుడితో పోల్చడం కరెక్టని నా అభిప్రాయం..

అఖండ గోదావరి మాతకి ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టి గౌతమి, విశిష్ట అనే రెండు అందమైన కన్య గోదావరులుగా మార్చి తూర్పుగోదావరికొకటి, పశ్చిమగోదావరికోటి ఇచ్చి పెళ్లిళ్లు చేసి, పచ్చని భూములతో పాటు సిరిసంపదల పుట్టుకకు కారణమైనోడు దేవుడు కాక ఇంకేమవుతాడు??

ఏదైనా పని పూర్తి చెయ్యడానికి "మీ బాధ్యతంటే మీ బాధ్యతని" దెబ్బలాడుకుంటున్న మనమే ఎన్నుకున్న ప్రభుత్వాలకంటే..  రెండొందల ఏళ్ళ ముందే మనతో ఏం సంబంధం లేకపోయినా వృధాగా పోతున్న గోదావరిని డెల్టాలుగా, తెలుగు రాష్ట్రాలకి ధాన్యాగారాలుగా మార్చి, ఎన్నో కడుపులు నిండటానికి కారణమైన  దేవుడిని పరమశివుడితో పోల్చడంలో తప్పేంలేదని నా అభిప్రాయం..

కాటన్ దొరగారికి నమస్సులు

13, మే 2018, ఆదివారం

మాతృదేవోభవ



మాతృదేవోభవ - నా కలర్ pencil చిత్రం

శ్రి P.S. Narayana గారి ప్రశంస - " మూర్తి గారు మీరు మాకు ఎన్నో అద్భుతమైన చిత్రాలు సందర్భానుసారంగా అందజేస్తున్నారు మీకు ధన్యవాదములు. కానీ మాతృ దినోత్సవం సందర్బంగా మీరు గీసిన చిత్రం అత్యంత అద్భుతమైన చిత్రం. గుక్క పెట్టి ఏడుస్తున్న చిన్నారి ఓదారుస్తూ తను పడుతున్న వేదనలో కూడా అమ్మ ప్రేమ, వాత్సల్యం కనిపిస్తున్నాయి.మీరు ఎంత అనుభవించి ఈ చిత్రాన్ని గీశారో... మీరు ధన్యులు "

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------





నా చిత్రానికి శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి స్పందన :
మాతృదేవత
అమ్మ ఇంటి వేలుపురా
ఆలయాన దేవతరా
ఎన్ని చేసినా నీవు
కన్న ఋణము‌ తీర్చలేవు
తాళి మెడను పడగానే
తల్లికాగ తపిస్తుంది
కడుపున నువు పడినవేళ
వికారాలు సహిస్తుంది
తనువు భారమౌతున్నా
తనకు ముప్పు పొంచి ఉన్నా
నిండు నెలలు మోస్తుంది
నీకు పురుడు పోస్తుంది ". "
పేగు తెంచి ప్రాణమిచ్చి
ప్రేమకవచమేస్తుంది
అమ్మపాల అమృతాన
ఆయువునే పోస్తుంది
నిద్రసుఖములెరుగక
కంటిపాప తీరుగా
కాచుకుని పెంచుతుంది
కడుపుతీపి పంచుతుంది‌ ". "
ఉయ్యాలగ ఒడిని చేసి
ఊసులన్ని నేర్పుతుంది
అనుభవాలు పాఠంగా
ప్రపంచాన్ని చూపుతుంది
కష్టమంత తనదిగా
సుఖమంతా నీదిగా
కడుపులోన దాస్తుంది
భవిత బాట వేస్తుంది
చదువులతో పదవులతో
నీవెదిగితె పొంగుతుంది
పెళ్ళి చేసి తోడునిచ్చి
బాధ్యత నెరవేరుస్తుంది
నీ పిల్లలనెత్తి మురిసి
నీ చల్లని బ్రతుకు చూసి
తనివిచెంది తరిస్తుంది
తన తనువును విడుస్తుంది ". "
మాతృదినోత్సవ శుభాకాంక్షలతో అమ్మ కు అంకితం.
సింహాద్రి జ్యోతిర్మయి
టీచర్ @ OPS
13.5.2018


------------------------------------------------------------------------------------------




అమ్మకు వందనం అంటూ శ్రీ బూర దేవానండాం, సిరిసిల్లా నుండి ఇలా స్పందించారు
అమ్మ గర్భగుడిలో
నవమాసాలు పూజచేసి పొందాను ఈ రూపం
ఈ భువిపై కనులు తెరిచి
తొలినే చూశాను ఆ దేవత రూపం
అమ్మ అనే పదంలో అమృతముంది


అమ్మ చేతి స్పర్శలో స్వర్గముంది


అమ్మ ప్రేమానురాగాల ఒడి


ఆ దేవుడికైనా సేదతీర్చే చల్లని గుడి






అమ్మ అనే మాట


మనం పలికే తొలిమాట


అమ్మ పాడిన జోలపాట


మనం వినే తొలిపాట






ప్రతి గృహం దేవాలయం అయితే


అందులో కనిపించే దైవం అమ్మ


ప్రతీ మనిషి పూజించే


తొలి దైవం అమ్మ






అమ్మంటే ఆప్యాయత


అమ్మంటే ఆత్మీయత


అమ్మంటే ఆర్ధ్రత


అమ్మంటే ఆది దేవత






అమ్మ కరుణామయి


అమ్మ ప్రేమమయి


అమ్మ త్యాగమయి


అమ్మ అమృతమయి






పూరిగుడిసె లోని అమ్తైనా


అద్దాలమేడ లోని అమ్తైనా


తన బిడ్డపై చూపే


ప్రేమానురాగాలు ఒకే లాగుంటాయి






బాహ్యంగా అలంకరణలో


ఆస్తులలో అంతస్తులలో


తేడా కనబడవచ్చునేమోగాని


ప్రతి అమ్మ తనబిడ్డపై చూపే ప్రేమలో తేడా ఉండదు






అమ్మ చూపే ప్రేమను


ఆస్తులు అంతస్తులతో


తూచేది చూసేది కాదు


అమ్మను మించినది


అమ్మ కన్నా గొప్పనిది


ఈ ప్రపంచంలోనే లేదు


------------------------------------------------------------------------------------------------



మిత్రులు పుష్యమి గారు whatsapp లో ఇలా స్పందించారు





ఆడపిల్ల ఒక అమ్మ


-------------------------------


అమ్మ...!


అది ఓ కమ్మనిపదం!


సురక్షితమైన..సుందరమైన..


జీవనపయనానికి


ఆలంబనగానిలిచే


అందమైన రధం!


జగన్మాత ఆయిన అమ్మేకదా ఈశృష్టికిమూలం!


ఆ అమ్మ లేనిదే ఈ లోకమే లేదుకదా!


ఒక్క విషయం గుర్తుంచుకో...


ఓ అమ్మలేనిదే...


మరో అమ్మరాదు.


అయితే...


ఈ కలికాలంలో-


సృష్టిప్రదాత అయిన


ఆ అమ్మకు అన్నీ అవరోధాలే.


అన్నీ అవమానాలే.


ఆడబిడ్డ-అనగానే


ఆవదం తిగినట్టు ముఖం...


మొదట తానెక్కణ్ణిచి


వచ్చానని ఆ లోచించలేని మూర్ఖత్వం..


అమ్మ లేకపోతే తానేలేననే సత్యాన్ని


తెలుసుకోని తెలివితక్కువతనం..


ఆవరించిఉన్నంతకాలం


అమ్మా ఒక ఆడదేనని


గ్రహించనంతకాలం...


ఇలా...


ఆడబిడ్డ అనగానే


కడుపులోనే తుంచేసే


దౌర్భాగ్యపు పరిస్థితికి


మంగళగీతం పాడలేం!


ఆలోచించాలి...


ఆడబిడ్డను ఈలోకానికి


ఆహ్వానించాలి!


ఆడబిడ్డను ఆదరించాలి!


ఆడపిల్లను గౌరవించాలి!


ఈ సృష్టి ఇలాగే కొనసాగాలంటే...


భ్రూణహత్యలు ఆపాలి.


స్త్రీజాతి ఎక్కడ గౌరవం


అందుకుంటుందో...


అక్కడ సౌభాగ్యం


వెల్లివిరుస్తుంది!






ఆడపిల్ల తల్లికి సాయం


తండ్రికి సౌభాగ్యం!


ఇంటికి కళతెచ్చేది...


చుట్టూ వెలుగులు నింపేది...


ఆడపిల్ల!


అంటే...


ఓ అమ్మ!


చేయకు...


ఆడపిల్లను చులకన!


అండగా..


నిలబడు ఆమెవెనుకన!




----------- పుష్యమి---




------------------------------------------------------------------------------------------------------------------------





సీ)


నిన్న రేపనికాదు
నేడు మాపనిగాదు౹
తీయనిబంధంబు
దినము దినము
*వయసు శైశవమేమి!
వార్ధక్యమదియేమి!
ఘనమైన కూరిమి
క్షణముక్షణము
*అన్నపానములిచ్చు
ఆరోగ్యమందించు౹
అమితానురాగంబు
అనవరతము
*చదువుసంధ్యలెగాదు
సంస్కారమున్ మప్పు౹
ఆజన్మవాత్సల్య
మపరిమితము
భారతీయసంస్కార
మప్రతిహతంబు
జననిపైజూపు మమతకు
"దినము" ఏమి!
వలదు పాశ్చాత్యవైఖరీ
వ్యసనగతులు
ప్రాణవాయువుగదతల్లి!
పాలవెల్లి!
తొమ్మిదినెలలుమోసి
నెత్తురునుపంచి
ప్రసవవేదనపిమ్మట
బయటపెట్టి
*మురిసి దీవించు
దేవతామూర్తి, నాదు
*నెమ్మదిని కమ్మనిది
అమృతమ్మదమ్మ!


------------------------------------------------------------------------------






మిత్రులు రాజేంద్ర గణపురం స్పందన









అమ్మ

. ......

..


సీ॥కన్నీటి కోర్చింది । కష్టాలు సైచింది




కన్న బిడ్డ కొరకే । కలలు కంది


పొట్టను కోసిన । పురుడోసు కున్నది


అమ్మగ నినుచూచి । హత్తు కుంది


నిదురకు నోర్చింది । నీవంటె ముర్సింది


ముక్కును కడిగింది । మోము గాను


చనుబాల నిచ్చింది । చక్కగఁ బెంచింది


కంటితో కాపల । కాచు కుంది


ఆ॥వృద్ధు రా,లనిపుడు । వృద్ధాశ్రమాలకు


పంపు సుతుఁడు యెంత । పాత కుండు


నర్సపురనివాస । నటరాజ ఘనమోక్ష


విశ్వకర్మ రక్ష । వినుర దీక్ష


.


.


. పద్య రచన


. రాజేందర్ గణపురం


. 13/ 05/ 2018


అందరకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు...!


చిత్ర దాత..Pvr Murty..గారు


--------------------------------------------------------------------------------------






శ్రీమతి వైదేహి కస్తూరి గారు whatsapp లో మాతృ దినోత్సవం గురించి కొన్ని వివరాలు తెలియజేసారు. చదవండి.



తల్లుల దినోత్సవః వెనుక సుదీర్ఘ చరిత్ర, నేపథ్యం ఉంది. గ్రీస్‌లో ‘రియా’ అనే దేవతను ‘మదర్‌ ఆఫ్‌ గాడ్స్‌’గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా ‘మదరింగ్‌ సండే’ పేరిట ఉత్సవాన్ని జరిపేవారు.


‘జూలియవర్డ్‌ హోవే’ అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతికోసం మదర్స్‌డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అన్న మేరీ జర్విస్‌ అనే మహిళ ‘మదర్స్‌ ఫ్రెండ్‌షిప్‌ డే’ జరిపించేందుకు ఎంతో కృషిచేసింది. ఆమె 1905 మే 9న మృతిచెందగా, ఆమె కుమార్తె మిస్‌ జెర్విస్‌ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృదినోత్సవం జరుపడం మొదలైంది.


1914నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమె రికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ నిర్ణయించారు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించింది. అప్పటినుంచి ఏటా మే రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. మమతకు ఆకారం అమ్మ.. త్యాగానికి నిదర్శనం అమ్మ.. కమ్మనైన పిలుపు అమ్మ.. అమ్మలగన్న పిల్లలారా.. తల్లులు తాకిన బిడ్డల్లారా.. వృద్దాప్యం మరో పసితనం. అమ్మను పిల్లలుగా చూసుకోవడం మాతృరుణం తీర్చుకునే అవకాశం. అమ్మను అక్కున చేర్చుకోవడం మనందరి కర్తవ్యం. వారిపై ఆత్మీయతను కురిపిద్దాం.. అమ్మలను మురిపిద్దాం.. మళ్ళీ మళ్ళీ మనల్నే కనాలని పరితపిద్దాం. తాను పస్తులుండైనా బిడ్డ కడుపు నింపే నిస్వార్థ ప్రేమ అమ్మకు తప్ప ఎవరికి సాధ్యమవుతుంది. వైకల్యం ఉన్న పిల్లలకు ఒంట్లో జీవం ఉన్నంత వరకు సేవలు చేస్తూ.. తన కష్టాన్ని అమృతంగా అందించే గొప్ప మనసు ఎవరికుంటుంది. బిడ్డ సంతోషం కోసం ఎంతటి కష్టానైనా ఎదుర్కొనేది.. ఎంతటి అవమానాన్నైనా భరించేది అమ్మ మాత్రమే. ప్రతి ఏడాది మే నెలలో వచ్చే రెండో ఆదివారం రోజున ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే జరుపుకుంటారు.

లోకంలో అందరికంటే మిన్న అమ్మ.. బిడ్డ కడుపులో పడడంతోనే తల్లిలో మాతృత్వం పొంగుకొస్తుంది. ఇక బిడ్డ భూమ్మీద పడింది. కుడి ఎడమ చేయి అన్న బేధం లేకుండా పిల్లల సేవలో నిమగ్నమై ఉంటుంది అమ్మ. ఆ ప్రేమను చాకిరీ అంటే పొరపాటే. ఆ సేవే తల్లికి సంతృప్తినిచ్చేది. జీవితం ధన్యమైనట్లు భావించేది అమ్మ. పాపాయిని కంటికి రెప్పలా కాపాడుకునేది అమ్మ. రాత్రిళ్ళు కూడా కలతనిద్రలో కనిపెట్టుకొని ఉంటుంది అమ్మ. కన్ననాటి నుంచి కడతేరే దాకా నిరంతరం ప్రేమను పంచుతుంది అమ్మ. ఆ అమ్మకు అంతకంటే ఎక్కువ ప్రేమను పంచాల్సిన బాధ్యత మనపై ఉంది. అమ్మను ప్రేమిద్దాం.. ప్రేమ పంచుదాం.

భగవంతుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని అంటారు. నడకే కాదు నాగరికతనూ నేర్పిస్తుంది అమ్మ.. అంతులేని ప్రేమానుగారాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. కానీ, నేటి అమ్మ ఆధునికతకు నిదర్శనంగా నిలుస్తోంది.

కొందరు అమ్మతనంలోని కమ్మదనాన్ని దూరం చేసుకుంటున్నారు. ‘నేడు మాతృదినోత్సవం’ సందర్భంగా తల్లులంతా ఒకసారి తమ బాధ్యతలు గుర్తుంచుకోవాలి. పిల్లల్ని కడుపులో పెట్టుకు చూసే నాటి అమ్మలను ఆదర్శంగా తీసుకోవాలి.

‘‘అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. తన త్యాగపు పునాదులపై మన బతుకు సౌదాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.. కదిలే దేవతకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలం...’’

అన్ని బంధాలకు వారధి కుటుంబ వ్వవస్థకు సారథిగా ఉంటూ తన పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. ఎన్ని బాధ్యతలు ఉన్న తప్పున చేసిన పిల్లలను మొదట్లో దండిస్తూ సన్మార్గంలో నడిపిస్తూ కుటుంబ వారథిగా, సారథి తల్లి నిలుస్తుంది.

ఒకప్పుడు వంటగదికి మాత్రమే పరిమితమైన అమ్మ బాధ్యతలు నేడు బహుళంగా పెరిగాయి. భార్యగా, తల్లిగా, ఉద్యోగిగా, సమాజంలో అసమనతలు ఎండగడుతూ ఆరోగ్య సమాజ నిర్మాణానికి అనేక బాధ్యతలు చేపడుతుంది. బిడ్డల బాగుకోరుతూ, తను కష్టాలు పడుతూ వారిని కంటిరెప్పలగా కాపాడుకుంటూ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటున్నపిల్లల బాధ్యత తండ్రి కంటే తల్లికే అధికంగా ఉంటుంది. అటు ఇల్లును చక్కబెడుతూనే... ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ...ఇటు చిన్నారుల విషయంలో కూడా శ్రద్ధ్ద తీసుకోవడంలో అమ్మదే ప్రధాన పాత్ర. పిల్లల విషయంలో ఆత్మసైర్థ్యం కలిగించాల్సిన పెను బాధ్యత కూడా ఆమెపైనే ఉంటుంది. పిల్లలు ప్రాణాపాయస్థితిలో ఉన్న సమయంలో తను ప్రాణాలను అర్పించైనా పిల్లలను కాపాడేందుకు సహించేది సృష్టిలో అమ్మ ఒక్కటే. తాను పస్తులుండైనా సరే పిల్లల కడుపు నింపుతుంది.

అమ్మను మించిన దైవం మరోకటి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లలు ఎంత పెద్ద తప్పు చేసినా...చివరికి ఆమెను పట్టించుకోకపోయినా... క్షమించే గుణం అమ్మకు మాత్రమే ఉంది. తుదిశ్వాస విడిచే వరకు పిల్లల క్షేమం కోరుకునేది అమ్మ మాత్రమే.

ఇంతటి అపూరూపమైన అమ్మ కోసం మదర్స్ డేనుజరుపుకుందాం.సంవత్సరానికీ ఒకసారికాదు ప్రతీ రోజు జరుపుకొని మాతృమూర్తులను సంతోషంగా ఉంచుదాం."

----------------------------------------------------------------------------------------------------------------------------------------




Mother's Day అని ప్రపంచంలో పలుదేశాల్లొ జరుపుకుంటుంటారు. మన దేశంలో ఈ అంశంపై భిన్న వాదాలు ఉన్నాయి. ఎవరి అభిప్రాయాలు వారివి. ఈ విషయంలో whatsapp లో ఓ మిత్రుని స్పందన చూడండి ః

సంవత్సరానికి ఒక సారి మాతృదినోత్సవం అని జరుపుకోవడం ద్వారా ఆ ఒక్క రోజూ వృద్ధాశ్రమానికి వెళ్ళి అమ్మని పలకరించి వచ్చేవారు కొంతమంది, ఇంట్లో ఉన్న అమ్మకు ఏదో ఒకటి కొనేసి సరి పెట్టే వారు ఇంకొంత మంది.


ఏదో ఒక రోజని కాకుండా రోజూ మాతృ దినోత్సవం జరుపుకోవడం మన భారతీయ సాంప్రదాయం.

వేరే ఏ మతంలోనూ చెప్పని విధంగా సనాతనధర్మంలో తల్లి గురించి చాలా గొప్పగా చెప్పారు. వినాయక వ్రతకల్పంలో విఘ్నాధిపత్య వృత్తాంతంలో విఘ్వాధిపత్యం ఎవరికి ఇవ్వాలని శివపార్వతులు ఆలోచిస్తూ, ముల్లోకాల్లోనూ ఉన్న అన్ని తీర్థాల్లోనూ ఎవరు మొదట స్నానం చేసి వస్తారో వారికిస్తామని అంటారు. నెమలి వాహనం పైన ఎంతో వేగంగా వెళ్ళగలననే గర్వంతో కుమారస్వామి బయల్దేరతాడు. భారీ కాయం మరియు ఎలుక వాహనం మీద వేగంగా ఎలా వెళ్ళగలనని వినాయకుడు చింతిస్తూ కూర్చుంటాడు. అప్పుడు నారద మహర్షి వచ్చి తల్లితండ్రులను మించిన తీర్థాలు ఏముంటాయని చెప్తూ తల్లి తండ్రులకు మూడు ప్రదక్షిణలు చేయమని సూచిస్తాడు. వినాయకుడు అలా చేయడంతో కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా అంతకు ముందే వినాయకుడు స్నానం చేస్తూ కనిపిస్తాడు. దాంతో ఆ ఆధిపత్యం వినాయకునికే అప్పగిస్తారు.

ఇక్కడ మనకు తల్లితండ్రుల గొప్పదనం ఏమిటో ఒక్క వృత్తాంతంలో తెలియ జేసారు.

తైత్తిరీయోపనిషత్తులో మాతృదేవోభవ అని అన్నారు. తల్లే దైవం అని దాని అర్థం.

గీతలో పరమాత్మ న మాతుః పరదైవతమ్ అని అన్నాడు. అంటే తల్లిని మించిన దైవం లేదని భావం.

తల్లి కాళ్ళకు నమస్కారం చేయడం కోటి యజ్ఞాల ఫలం. సనాతనధర్మంలో తల్లికున్న విలువ ఎనలేనిది. కానీ ఇతర దేశాల్లో ఈ విలువను తక్కువ చేసారు. కొన్ని మతాల్లో తల్లికి నమస్కరించడం నేరం. ఇంకొక మతంలో నాకంటే ఎక్కువ తల్లిని ప్రేమించరాదని దేవుడే అంటాడు.

భక్త పుండరీకుని అనుగ్రహించడానికి సాక్షాత్ పాండురంగడు వచ్చినపుడు నేను తల్లితండ్రులకు సేవ చేస్తున్నానని, అదయ్యే వరకూ వేచి యుండమని కృష్ణుని కోరతాడు పుండరీకుడు.

శ్రవణ కుమారుడు నడవలేని స్థితిలో ఉన్న తన తల్లి తండ్రులను తానే మోసాడు.

జగన్నాథుడైన కృష్ణుడు తన తల్లి యశోద యొక్క మాతృప్రేమను పొందాడు.

ఛత్రపతి శివాజీని వీరుని తీర్చిదిద్దింది తన తల్లి జిజియాబాయి.

సన్యాసం స్వీకరించిన యతీశ్వరులకు అన్ని మానవ సంబంధాలూ తెగిపోతాయి. ఒక్క మాతృసంబంధం తప్ప. అందుకే పీఠాధిపతులందరూ తమ తల్లులకు విధిగా నమస్కరించవలసినదేనని శాస్త్రం చెబుతోంది.

ఇలా చెప్పుకుంటూ పోతే భారతీయ సంస్కృతిలో తల్లి గొప్పదనానికి ఒక అంతం లేదు.

విదేశీయుల మాయలో పడకుండా, మన సంస్కృతి చెప్పిన విధంగా మన తల్లులను జీవించినంత కాలం, అలా జీవన అనంతంరం కూడా బాగా చూసుకుందాం. ఆ తల్లి రుణాన్ని తీర్చడానికి ప్రయత్నిద్దాం…..జై మాతా…….

ఇక్కడున్న మన వారిని గుర్తు చేసుకుని మన తల్లులను మనం గౌరవిద్దాం….ఈ ఒక్కరోజే కాదు…. ప్రతిరోజూ…

11, మే 2018, శుక్రవారం

జిడ్డు కృష్ణమూర్తి - Jiddu Krishnamoorthi


జిడ్డు కృష్ణమూర్తి (నా pencil చిత్రం)
జిడ్డు కృష్ణమూర్తి మే 12, 1895ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లెలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తరువాత వారి కుటుంబమంతా మద్రాసులో నివాసం పెట్టారు . మద్రాసు లోని "అడయారు" దివ్యజ్ఞాన సమాజంకి అంతర్జాతీయ కేంద్రంగా ఉండేది. అనీ బిసెంట్ దానికి అధ్యక్షురాలు. కృష్ణమూర్తి, ఆయన తమ్ముడు నిత్యానంద కలసి అడయారు నది సముద్రంలో కలిసే చోట నిత్యమూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఆయన ఓ ప్రముఖ తత్వవేత్త. 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు.

ఆయన స్పృశించిన ముఖ్యాంశాలు - మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు.

అడయారు గ్రంథాలయాధికారి ఈ సోదరులిద్దరినీ చూసి ఆకర్షింపబడ్డాడు. ఈ విషయం డాక్టర్ అనిబిసెంట్ కి తెలియజేసి, ఆ ఇద్దరినీ ఆమె వద్దకు రప్పించాడు. ఆ సొదరులిద్దరినీ చూసి అనిబిసెంట్ కూడా చాలా ప్రభావితురాలైంది. అంతటితో వారిద్దరినీ విద్యార్జన నిమిత్తం ఇంగ్లాండ్ పంపించింది. పారిస్ లోని సారబాన్ విశ్వ విద్యాలయంలో కృష్ణమూర్తి సంస్కృతమూ, ఫ్రెంచి భాషలను అధ్యయనం చేయసాగాడు. తన కొడుకులను తనకు తిరిగి ఇప్పించమని కృష్ణమూర్తి తండ్రి కోర్టులో దావా వేశాడు. చివరికి అనిబిసెంట్ కు ఆ దావా వ్యతిరేకమైంది. అయినప్పటికీ ఏదో విధంగా ఆ సోదరులిద్దరూ తన వద్దే ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నది. జిడ్డు కృష్ణమూర్తి కాబోయే జగద్గురువని ఆమె విశ్వాసం. ఆ మేరకు ప్రపంచమంతా చాటింది. అప్పటికి కృష్ణమూర్తి తాను జగద్గురువును అవునని కాని, కాదని కాని ఏమీ వెల్లడించలేదు. ఇంతలో తన తమ్మునికి జబ్బు చేసినందున తన తమ్ముని తీసుకుని ఆయన అమెరికా లోని కాలిఫోర్నియాకు వెళ్ళిపోయాడు. అక్కడి వాతావరణం తమ్ముని ఆరోగ్యాన్ని ఏమైనా బాగు చేస్తుందేమో అని 1922 లో కాలిఫోర్నియా కొండల్లో ఒక ఇంటిలో సోదరులిద్దరూ నివాసం ఏర్పరుచుకున్నారు. 1925 లో తమ్ముడు నిత్యానంద మరణించాడు. తమ్ముని మరణం కృష్ణమూర్తిని శోకంలో ముంచింది. ఆ దుఃఖావేశంలో తనకు కనిపించే బాటసారులందరినీ తన తమ్ముడెక్కడైనా కనిపించాడా అని అడిగేవాడు. నిత్యానంద మరణం కృష్ణమూర్తిలో విపరీతమైన మార్పును తెచ్చింది. చిన్నప్పట్నుంచీ ఆయన ఏవిషయాన్ని పూర్తిగా నమ్మక, ప్రతీ విషయాన్నీ శంకించేవాడు. తనకు ప్రత్యక్ష ప్రమాణం దొరికినప్పుడు మాత్రమే దాన్ని నమ్మేవాడు. కరడు కట్టిన సాంప్రదాయ వాసనలతో బూజు పట్టిపోతున్న మతాలమీద ఆయనకు నమ్మకముండేది కాదు. థియోసాఫికల్ సొసైటీవారు నమ్మే గుప్తవిద్య (Occultism) మీద కూడా ఆయనకు నమ్మకముండేది కాదు. తనను జగద్గురువని ప్రచారం చేసిన దానిలోనూ ఆయనకు నమ్మకముండేది కాదు. తమ్ముని మరణంతో ఆయన దృక్పథం మరింత బలీయమైంది.

కృష్ణమూర్తిని జగద్గురువుగా భావించిన డాక్టర్ అనిబిసెంట్ "ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్" అనే ఒక అంతర్జాతీయ సంఘాన్ని స్థాపించి, కృష్ణమూర్తిని దానికి ప్రధానిని చేసింది. కొంతకాలం వరకూ కృష్ణమూర్తి అందుకు అభ్యంతరం ఏమీ చెప్పలేదు. అంతవరకూ తాను కృష్ణమూర్తినా లేక జగద్గురువునా అనే విషయంలో ఏ నిర్ణయానికీ రాలేకపోయాడు. సోదరుని మరణం ఆయనలో తెచ్చిన దుఃఖం కొంతకాలానికి ఆయనలో ప్రతిక్రియను తెచ్చింది. దుఃఖం సమసిపోయి ఒక విధమైన ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని తీసుకువచ్చింది ఆయనలోకి. ఆయనలో జీవం ప్రవేశించింది. తాను జగద్గురువు అని అనిబిసెంట్ చేసిన ప్రచారాన్ని కాదనలేదు. ప్రపంచంలో ఎక్కడలేని గౌరవాలు ఆయనకు జరగసాగేయి. ఆయన నడచేదారిలో గులాబిపూలు పోసేవారుకూడా. హాలెండ్ లో ఒకరు బ్రహ్మాండమైన సౌధాన్నీ, అయిదువేల ఎకరాలు భూమిని సమర్పిస్తామంటే వద్దని నిరాకరించాడు. ఇటువంటి అద్భుతమైన గౌరవాలు జరుగుతున్నప్పటికీ కృష్ణమూర్తి ఆ గౌరవాలకు విలువ ఇవ్వక, తన ఎప్పటి సాదా జీవితాన్నే గడపసాగేడు. చివరకు అధికారపూర్వకంగా జగద్గురు పీఠాన్ని స్వీకరించమనే ఒత్తిడి ఎక్కువైంది. అది తనకు ఇష్టంలేదు. తనకు బయట జరుగుతున్న దానికి అంతకూ వ్యతిరేకం కాజొచ్చాడు. తన విశ్వాసానికి విరుద్ధంగా ప్రాపంచిక కీర్తి నిమిత్తమో, పెద్దలకు ఆశాభంగం చేయకుండా ఉండే నిమిత్తమో, భౌతిక లాభాల నిమిత్తమో, ఆయన ప్రవర్తించదలచక చివరకు 1929 లో హాలెండ్ లోని ఆమెన్ లో తాను జగద్గురువును కాదని ప్రకటించి "ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్ "ను రద్దుపరచాడు.

ఈ మహాత్యాగానికి జగత్తంతా విస్తుపోయింది. డాక్టర్ అనిబిసెంట్ లాంటి పెద్దలంతా నిరాశతో బాధపడ్డారు. అభిప్రాయాన్ని మార్చుకోమని ఒత్తిడి తేబడింది. కాని లాభం లేకపోయింది. తాను జిడ్డు కృష్ణమూర్తినే కాని జగద్గురువును కానని చాటసాగేడు. చివరకు లాభం లేకపోయింది. ఎక్కడివారక్కడ అసంతృప్త హృదయాలతో మౌనం దాల్చారు. అప్పటినుంచీ కృష్ణముర్తి స్వతంత్రమానవుడు, స్వేచ్ఛాచింతకుడు, నవమానవతావాది, ఎవరి అభిమానాలనూ ఆశించక, ఎవరి సహాయాలనూ కాంక్షించక, ఎవరి నిందలనూ లెక్కచేయక, జీవన సంగ్రామపు వాస్తవాన్ని గుర్తించి, గొప్ప జీవన శిల్పిగా రూపొందాడు.

జిడ్డు క్రిష్ణమూర్తి ఫిబ్రవరి 17 1986 సంవత్సరంలో ఓజై, కాలిపోర్నియా లో మృతిచెందారు.

నా pencil చిత్రానికి పుచ్చా గాయత్రీదేవి గారి కవితా స్పందన :దివ్యజ్ఞానపు నీడలో ఎదిగి ఆత్మ జ్ఞానిగా మారిన ఓ చైతన్యమా !
గతమునుండి విడుదల కమ్మని పలికిన ఓ సత్యమా !
నమ్మిన నీ సిద్దాంతము కొరకు నక్షత్ర వైభవాలని తోసి,వదలి వైచిన
నీవు మరో బుద్ధునిగా మారిన నవ ప్రకాసమా !
పరిశీలనా పధములోనే అసలు ప్రజ్ఞ కలదని.
అసలైన విప్లవం హృదయపు లోతుల లోనే అని
సమూలమైన పరివర్తనే శాంతికి దారి అని భోదించిన ఓ యోధ !
కణ కణమున స్పందన శీలుడవై.
శోధన పధములోనే నీ తత్వము బోధించిన .
నిజమైన మతమంటే నీర్హేతుక మైన ప్రేమ కలిగి ఉండడమని
నిజమైన ప్రేమంటే ఏది ఆశించదని.
నమ్మకానికి దాసుడవు కావద్దని హెచ్చరించిన నియంత !
విముక్త మనస్సుతోనే విహంగము కమ్మని.
మంచి అని నేడు చలామణి అవుతున్నది చెడుమాత్రమే నని.
మంచితనానికి వ్యతిరేకత ఏది లేదని నమ్మిన కర్మ యోగి !
నిజమైన సమ సమాజము కావాలంటే ప్రేమ ద్వారా మాత్రమే సాధ్యమని,
అశాంతి, కార్పణ్యము కావసలని నినదించిన శిశు మానసి !
ఆలోచన అంటేనే గతము నుండి పుట్టినదని
దానివలన సత్యాన్ని గ్రహించలేమని.
నిజాన్ని దర్శించినప్పుడు మాత్రమె సత్య ఆవిష్కారం దర్సనమని
సూత్రీకరించిన సిద్దాంతి !
బాధలు సుఖాల కలయిక జీవితమైనప్పుడు
మనము నవ్వుతు ఆకువలె ఎందుకు రాలిపోలేము అని
సందేహపడిన విద్యార్ధి !
ప్రేమ ఉండి పేరాస లేని చోట సుఖము తనంతట తానె
పీట వేసుకుని ఉంటుందని నమ్మిన ఓ చాందస వాది.
నీ తత్వ వివేచనా ముందుతరాలకు ఆశా దీపం కావాలి.
ఎవరికి వారే జ్ఞాన దీప జ్యోతులై ప్రకాసించాలి.
-- పి. గాయత్రిదేవి.

 

6, మే 2018, ఆదివారం

రవీంద్రనాథ్ ఠాగూర్

రవీంద్రనాథ్ ఠాగూర్ (నా pen and ink  చిత్రాలు) - వివరాలు వికీపీడియా సౌజన్యంతో
భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ ఠాగూర్ (Ravindranath Tagore) (మే 7, 1861 - ఆగస్టు 7, 1941). ఠాగూర్ గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి.వంగదేశంలో 1861 మే 7 వ తేదీన దేవేంద్రనాథ ఠాగూర్, శారదాదేవీలకు పద్నాలుగవ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించాడు. ఇతని బాల్యం చాలా చోద్యంగా గడిచింది. ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునికిపాట్లు పడుతూ చదివేవాడు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి ప్రకృతి సౌందర్యాన్ని చూచి ఆనందించేవాడు. కథలంటే చెవి కోసుకొనేవాడు. సామాన్య దుస్తులతో, నిరాడంబరంగా పెరిగాడు. బాల్యంలో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండవలసి రావటంతో ఆయనకు బయటి ప్రపంచం అద్భుతంగా తోచేది. ప్రపంచమొక రహస్యమనీ, ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనీ కుతూహలపడేవాడు.


రవీంద్రుడు పాఠశాలలో చదవడానికి ఇష్టపడక ఇంటివద్దనే క్రమశిక్షణతో ప్రతి ఉదయం వ్యాయామం చేసి, లెక్కలు చేసి, చరిత్ర, భూగోళ పాఠాలను, సాయంత్రం చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీషు అభ్యసించేవాడు. ఆదివారాలలో సంగీత పాఠాలు, భౌతిక శాస్త్రం ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం నేర్చుకొనేవాడు. బొమ్మలున్న ఆంగ్లనవలలను స్వయంగా చదివేవాడు. కాళిదాసు, షేక్స్‌పియర్ రచనలు చదివాడు. భాషను క్షుణ్ణంగా అభ్యసించి మాతృభాష పట్ల అభిమానం పెంచుకొన్నాడు.



రవీంద్రుడు ఇంగ్లాండులో ఒక పబ్లిక్ స్కూలులో చేరి, ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు విని ఆంగ్ల సాహిత్యంపై అభిరుచి పొంచుకొన్నాడు. సాహితీపరుల ప్రసంగాలు విని వారితో సంభాషించి నాటకాలకు, సంగీత కచేరీలకు వెళ్లి, ఆంగ్ల సంస్కృతీ సంప్రదాయాలు బాగా ఆకళించుకొన్నాడు. తన అనుభవాలను భారతికి లేఖలుగా వ్రాసేవాడు. రవీంద్రుడు ఇంగ్లండులో వుండగానే భగ్న హృదయం అనే కావ్యాన్ని రచించాడు. అయితే ఇంగ్లండులో పద్దెనిమిది మాసాలు వుండి ఏ డిగ్రీనీ సంపాదించకుండానే స్వదేశానికి తిరిగి వచ్చాడు.ఆ తర్వాత 1883 డిసెంబరు 9 న మృ ణాలిని దేవీని వివాహమాడెను.

== సాహితీవ్యాసంగం రవీంద్రుడు బాల్యంలోనే అనేక పద్యాలు, వ్యాసాలు, విమర్శలు ప్రచురించాడు. ఆయన రచించిన సంధ్యాగీత్ కావ్యాన్ని కవులందరూ మెచ్చుకొనేవారు. వందేమాతరం గీతాన్ని రచించిన బంకించంద్ర ఛటర్జీకూడా రవీంద్రుని ప్రశంసించాడు. రవీంద్రుడు రచించిన భక్తిగీతాలను తండ్రి విని, వాటి ప్రచురణ కవసరమయిన డబ్బు ఇచ్చేవాడు. ఆ తరువాత రవీంద్రుడు విర్గరేర్ స్వప్న భంగ, 'sangeetha prabhata అనే కావ్యాలను రచించాడు.Rabindranath Tagore....

గీతాంజలి

Gitanjali title page Rabindranath Tagore.jpg

రవీంద్రుని రచనలలో గీతాంజలి చాల గొప్పది. రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తిగీతాలను కొన్నింటిని ఆంగ్లంలోనికి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టాడు. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది. ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. 1913 వ సంవత్సరంలో సాహిత్యానికి సంబంధించి రవీంద్రుని గీతాంజలికే నోబెల్ బహుమతి లభించింది. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది. ఆసియా ఖండంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి. గీతాంజలి వెలువడిన తరువాత

అన్ని దేశాలవారు రవీంద్రుని గ్రంథాలను చదవడం ఆరంభించారు

గీతాంజలి రవీంద్రునికి కవిగా ప్రపంచఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ కావ్యంలోని ఈ కింది గీతం మహాత్మాగాంధీకి మిక్కిలి అభిమాన పాత్రమైంది.




ఈ మంత్రములు జపమాలలు విడిచిపెట్టు
తలుపులన్నింటినీ బంధించి,
ఈ చీకటిగదిలో ఎవరిని పూజిస్తున్నావు?
కళ్ళు తెరచి చూడు.
నీవు ఆరాధించే దేవుడు
నీ ఎదుట లేడు!
ఎచ్చట రైతు నేలను దున్నుతున్నాడో,
ఎచ్చట శ్రామికుడు రాళ్ళు పగులగొట్టుతున్నాడో,
అక్కడ ఆ పరమాత్ముడున్నాడు.
వారితో ఎండలో, వానలో ధూళి ధూపరితములైన వస్త్రములలో ఉన్నాడు.
నీవు కూడా నీ పట్టు పీతాంబరములు ఆవల పెట్టి
ఆనేల మీదికి పదా.....విస్తృతంగా జనప్రియమైన మరొక రచన. ఇది చాలా పాఠ్యపుస్తకాలలో ఒక పాఠంగా చేర్చబడుతుంది.

శాంతి నికేతన్

రవీంద్రుడు కేవలం రచయితగానే ఉండిపోక, బాలల హృదయాలను వికసింపచేయటానికై ప్రాచీన మునుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అది అయిదుగురు విద్యార్థులతో మొదలై, క్రమంగా విస్తరించింది. చిన్న పిల్లలు ఉపాధ్యాయుల ఇళ్ళల్లో భోజనం చేసేవారు. ప్రాతఃకాలానే నిద్ర లేవడం, కాలకృత్యాలు తీర్చుకొని, తమ గదులను తామే శుభ్రపరచుకొని స్నానం చేయడం, ప్రార్థన చేయటం, నియమిత వేళలలో నిద్ర పోవటం వారి దినచర్య. ఆరోగ్యం కాపాడుకోవటం, పరిశుభ్రత, సత్యాన్నే పలుకుట, కాలినడక, పెద్దలను, గురువులను గౌరవించటం వారికి నేర్పేవారు. 1919 లొ కళా భవన్ ను ఆయన స్తాపించారు. ఇక్కడ విద్యార్ఢులు విభిన్న కళాలను నెర్చుకునెవారు

నవల,నాటకాలు 

గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని రవీంద్రుడు భావించాడు. అందుకై శ్రీ నికేతాన్ని నెలకొల్పి, గ్రామ పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేసేవాడు. రవీంద్రుడు మొదట వాల్మీకి ప్రతిభ అనే నాటకాన్ని రచించాడు. ఆ తరువాత అమల్ అనే పిల్లవాణ్ణి గురించి పోస్టాఫీసు అనే నాటకం వ్రాశాడు. రవీంద్రుడు రచించిన చిత్రాంగద నాటకం ఆయనకు మంచిపేరు తెచ్చింది. ప్రకృతి - ప్రతీక అనే నాటకంలో ప్రపంచాన్ని విడిచి పెట్టిన సన్యాసి కథను వర్ణించాడు. రవీంద్రుడు కచదేవయాని, విసర్జన, శరదోత్సవ్, ముక్తధార, నటిర్‌పూజ మొదలగు అనేక శ్రేష్టమయిన నాటకాలు రచించాడు. మతాలు వేరైనా పరస్పర స్నేహంతో కలసి మెలసి ఉండాలి అనే సాంఘిక ప్రయోజనం, ఉత్తమ సందేశం మిళితమైన 'గోరా' నవల రవీంద్రునికెంతో పేరు తెచ్చింది.

చిత్రకళ, సంగీతం 



రవీంద్రనాధ టాగోరు డెబ్భై ఏళ్ళ ప్రాయంలో చిత్రకళా సాధనను ప్రారంభించాడు. ఆయన వేసిన చిత్రాలు లండను, ప్యారిస్, న్యూయార్కు మొదలగు నగరాలలో ప్రదర్శించబడ్డాయి. ఆయన దాదాపు రెండు వేల చిత్రాలను గీశాడు.

రవీంద్రుడికి సంగీతమంటే మిక్కిలి ప్రీతి. ఆయన బెంగాల్ జానపద గీతాలను, బాపుల్ కీర్తనలను విని ముగ్ధుడయ్యేవాడు. ఆయన స్వయంగా గాయకుడు. భారతీయ సంగీతంలో రవీంద్ర సంగీతం అనే ప్రత్యేక శాఖను ఏర్పరచిన వాడు రవీంద్రుడు.

స్వాతంత్ర్య సాధన,జనగణమణ 

రవీంద్రుడు మొదటి నుండి జాతీయ భావాలున్నవాడు. హిందూ మేళాలో దేశభక్తి గీతాలను పాడాడు. పృథ్వీరాజు పరాజయం గురించి ప్రబోధాత్మక పద్యనాటకాన్ని రచించాడు. బ్రిటీష్ ప్రభుత్వం తిలక్‌ను నిర్భంధించినపుడు రవీంద్రుడు తీవ్రంగా విమర్శించాడు. బెంగాల్ విభజన ప్రతిఘటనోద్యమంలో రవీంద్రుడు ప్రముఖపాత్ర వహించాడు. జాతీయ నిధికి విరాళాలు వసూలు చేశాడు. రవీంద్రనాథ టాగోర్ 1896లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో మొట్టమొదటిగా బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరాన్ని ఆలపించాడు. రవీంద్రుడు వ్రాసిన ' జనగణమణ 'ను జాతీయ గీతంగా ప్రకటించేముందు "వందేమాతరం", "జనగణమన" లపై దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని సుదీర్ఘ చర్చ, తర్జన భర్జనలు జరిగాయి. అంతిమంగా రవీంద్రుడి 'జనగణమన' దే పైచేయి అయింది. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న జనగణమనను జాతీయ గీతంగా వందేమాతరంను జాతీయ గేయంగా ప్రకటించాడు. అదే సమయంలో రెండూ సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పష్టం చేసాడు

(source : wikipedia)



4, మే 2018, శుక్రవారం

దాసరి నారాయణ రావు


దాసరి నారాయణరావు (నా పెన్సిల్ చిత్రం)


డా. దాసరి నారాయణరావు ( మే 4, 1942 - మే 30, 2017) ఆంధ్రప్రదేశ్ కు చెందిన సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత మరియు రాజకీయనాయకుడు. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు.

కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది.

దాసరి సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మరియు మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి. దాసరి తిసిన బొబ్బిలి పులి మరియు సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి.

మామగారు, సూరిగాడు మరియు ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు.

(వికీపీడియా నుండి సేకరణ)




నా 'దాసరి' చిత్రానికి facebook లో మిత్రురాలు సింహాద్రి జ్యోతిర్మయి స్పందన :

అతడే ( దా ) సరి

రంగుల‌ సినీ ప్రపంచం
అదొక *అద్దాలమేడ*
కొందరినది *ఏడంతస్తుల మేడ** లు ఎక్కిస్తుంది
మరికొందరికదే *బలిపీఠం*

*పాలు నీళ్ళు* ఏకమైనట్లుగా
*స్వర్గం నరకం* ఇక్కడ కలిసే ఉంటాయి

* మనుషులంతా ఒక్కటే* అని
పైకి అంటుంటారు
వీరు మాత్రం *ఎవరికి వారే యమునా తీరే* అన్నట్లు ఉంటారు.
*మామగారు* *నాన్నగారు * అని వరసలు కలుపుకుని అందరిలో ఉన్నప్పుడు ఆప్యాయతలు ఒలకబోస్తూ మాట్లాడుకుంటారు
మనసుల్లో మాత్రం *తూర్పు పడమర * లు గా భావిస్తారు
*ఇదెక్కడి న్యాయం* అని మనం
ఇక్కడ ఎవ్వరినీ అడగలేం
ఆ *దేవుడే దిగివస్తే*
ఈ వింత ప్రపంచాన్ని చూసి
విస్తుపోక తప్పదు.

అలాంటి మన సినీ జగత్తుకి
*ఆత్మబంధువు* అయ్యాడతడు.
ఉత్త *బోళాశంకరుడు*
అతడీ సినీ *భారతంలో ఒక అమ్మాయి* అయిన *రాధమ్మ పెళ్ళి* ని *బుచ్చిబాబు* తో
జరిపించి ఆమెకొక * నీడ * కల్పించాలనుకున్నాడు
సినీ ప్రపంచం మొత్తాన్ని
ఒకే వేదికపై చూడాలన్న
తన చిరకాల వాంఛను
ఈ వంకతో తీర్చుకోవాలనుకున్నాడు
చక్కని *ప్రేమ మందిరం*నిర్మించాడు
తను జరిపించే *ప్రేమాభిషేకం* చూసేందుకు
తప్పక
రావలసినదని
*ఆది దంపతులు* అనదగ్గ
*సీతారాముల* కు
*మేఘ సందేశం* పంపించాడు
పొరపాటున సీతకోసం
*లంకేశ్వరుడు * వస్తాడేమోనని
*రంగూన్ రౌడీ* ని కాపలా పెట్టాడు. *బ్రహ్మ ముడి* వేసుకుని *ఏడడుగుల బంధం* తో ఏకమవుతున్న జంటను
*కళ్యాణ ప్రాప్తిరస్తు * అని దీవించమని పేరు పేరునా అందర్నీ ఆహ్వానించాడు.
అతనికి *చిన్నిల్లు పెద్దిల్లు * అని తేడాలు లేవు
*సూరిగాడు* , * మేస్త్రీ*
మనం చిన్నచూపు చూసి పిలిచే
*ఒరేయ్ రిక్షా* ,*ఒసేయ్ రాములమ్మ* అందరూ అతనికి ఆత్మీయులే.
*స్వప్న* సంతోషం గా వచ్చి అందరికీ *గోరింటాకు* దిద్దింది
*శివరంజని* వచ్చి వధువును
*శ్రీవారి ముచ్చట్లు* అడిగింది

*అమ్మ రాజీనామా * పత్రం చింపేసి మరీ వచ్చి
*దీపారాధన* చేసింది
ఒకే పేరు కలిగిన *తాతా మనవడు* మాట్లాడుకుని
*బొబ్బిలి పులి * లాంటి తాత
*సర్దార్ పాపారాయుడు* తన మనవడిని ఆ కళ్యాణానికి పంపించాడు.
ఆ వేడుక చూడాలనే కుతూహలం తో
*దేవదాసు మళ్ళీ పుట్టాడు*
ఆ దర్శక రత్న సారధ్యంలో
ఏకమైన
చలన చిత్ర పరిశ్రమ
*బంగారు కుటుంబం* లా భాసించి ప్రేక్షకులను అలరించింది.

ఓ దర్శక రత్న దాసరీ!
నీకెవ్వరూ లేరు సరి.

దాసరి జయంతి సందర్భంగా
నా కవితా నివాళి
.
సింహాద్రి జ్యోతిర్మయి
4.5.2018.

3, మే 2018, గురువారం

బాలాంత్రపు రజనీకాంతరావు

బాలాంత్రపు రజనీకాంతరావు (జననం జనవరి 29, 1920 - మరణం ఏప్రిల్ 22, 2018) - నా పెన్సిల్ చిత్రం.

వివరాలు సేకరణ  courtesy  : సిలికానాంధ్ర - సుజనరంజని, శిరాకదంబం పత్రికలు.
  తెలుగు తేజోమూర్తులు




కవి, సంగీతజ్ఞుడు, కళాప్రపూర్ణ బాలాంత్రపు రజనీకాంత రావు
సంగీత సాహిత్యాలలో దిట్ట. ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో) లో నాలుగు దశాబ్దాల పాటు వినూత్న ప్రయోగాలు చేస్తూ సరికొత్త కార్యక్రమాలను శ్రీకృతం చేశారు. ఆయన ఆరంభించిన "భక్తిరంజని" కార్యక్రమం విశిష్ట ఆధరణ పొంది చాలా కాలం సాగింది. ఈయన రచించిన ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర ఈ శతాబ్దపు మేటి రచనలలో ఒకటిగా నిలిచింది. అంతే కాదు అనేక అపూర్వ సంగీత రూపకాలను నిర్మించారు. ఇలా తెలుగు కళామాతకు సేవలు అందించిన వారు అరుదు. సంగీతకారుడిగా, రచయితగా, కవిగా, రూపక కర్తగా, ఆకాశవాణి సంచాలకుడిగా తెలుగు సంగీత సాహిత్య రంగాలలో తనదైన ముద్రవేశారు కళాప్రపూర్ణ శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు గారు.

జననం, చదువు, ఉద్యోగం:
జనవరి 29, 1920 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గోదావరి జిల్లాలోని నిడదవోలులో జన్మించారు. వీరి తండ్రి కవి రాజహంశ బాలాంత్రపు వెంకట రావు గారు (వెంకట పార్వతీశ కవులలో ఒకరు). ఇలా పండిత వంశంలో పుట్టి చక్కటి విద్యాభ్యాసానికి ఉపక్రమించారు రజని గారు. తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో చదువుకున్నారు. తరువాత కాకినాడ పీ ఆర్ కాలేజి నుండి ఉత్తీర్ణులయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి ఏ పట్టా అందుకున్నారు. అప్పటి ఉప కులపతి కట్టమంచి రామలింగారెడ్డి గారు రజనీకాంత రావు గారితో కలసి పాడేరట. మనలో మాట రామలింగా రెడ్డి గారికి తెలుగు భాష మీద అవ్యాజమైన ప్రేమ!.

1941 ఆల్ ఇండియా రేడియో మద్రాసులో తన ఉద్యోగ పర్వం మొదలుపెట్టారు. స్వతంత్ర భారత దేశంలో తెలుగులో వ్రాసి, ఆలాపించిన ప్రప్రధ పాట మాది స్వాతంత్ర దేశం రజనీకాంత రావు గారు రాసరట. ఆల్ ఇండియా రేడియో విజయవాడలో ఉన్నపుడు భక్తి రంజని కార్యక్రమం రూపొందించారు. ఇది చాలా కాలం నడిచింది. పిన్నా పెద్దా అందరూ ఈ కార్యక్రమాన్ని విని ఆస్వాదించేవారు.

ఆల్ ఇండియా రేడియో అహ్మదాబాద్, ఆల్ ఇండియా రేడియో విజయవాడ (1956-1960), ఆల్ ఇండియా రేడియో బెంగళూరు (స్టేషన్ డైరెక్టర్ గా) పనిచేసి, ముప్పై ఆరేళ్ళ సుగీర్ఘ కాలం తరువాత విశ్రాంత వాసి అయ్యారు బాలంత్రపు రజనీకాంత రావు గారు.

సేవలు:
ధర్మసందేహాలు అన్న కార్యక్రమానికి రూపకర్త కూడా రజనీ గారే. నిత్యం అన్నమాచార్య కీర్తనలని ప్రసారం చేయించారు.

రజనీ గారు తన ఇరవై ఒకటవ ఏట నుండి పాటలు వ్రాయడం మొదలుపెట్టారు. కొంత కాలం నళిణి, తారానాథ్ కలం పేర్లతో రచనలు చేశారు. స్వర్గశీమ, గ్రుహాప్రవేశం తదితర చలనచిత్రాలకి పాటలు రాశారు. ఆయన రచించిన కూచిపూడి, యక్షగానాలలో శ్రీకృష్ణ శరణం మమ , మేనకా విశ్వామిత్ర, విప్రనారాయణ, చండిదాశ, మేఘ సందేశం, కళ్యాణ శ్రీనివాసం ఇత్యాది రూపకాలు ఉన్నాయి.

వీరు రచించిన ఆంధ్ర వాగ్గేయకార చరిత్ర బాగా మన్నన అందుకుంది. ఈ గ్రంధంలో ప్రముఖ వాగ్గేయకారుల చరిత్ర, వారి విశిష్ట పాటలను ఇందులో పొందుపరిచారు. 1961 లో కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం అందుకున్నారు. 1980 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. కొంత కాలం తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ ఆచార్యుడిగా వ్యవహరించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వేంకటేశ్వర కళాపీఠం స్పెషల్ ఆఫీసర్ గా నాలుగేళ్ళ పాటు పనిచేశారు. క్షేత్రయ్య పాటలు, గీత గోవిందం, గాంధార గ్రామ రాగాలు ఇత్యాది అంశాల మీద పరిశోధనా పత్రాలు వెలువడించారు రజనీకాంత రావు గారు. తన జీవితానుభవాలని క్రొడీకరించి రజని భావ తరంగాలుగా, ఆంధ్ర ప్రభ పత్రికలో ప్రకటించారు. వీరు రూపొందించిన రూపకాలలో వెంపటి చిన సత్యం, శోభా నాయుడు తదితరులు నృత్యం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ గౌరవం అందుకున్నారు.

వీరి రచనలలో కొన్ని ముఖ్యమైనవి:
సూర్య స్తుతి
ఆంధ్ర వాగ్గేయకార చరిత్రం
విశ్వవీణ
శతపత్ర సుందరి
క్షేత్రయ్య
రామదాసు
జేజిమామయ్య పాటలు
త్యాగరాజు
ఏటికి ఎదురీత
మువ్వగోపాల పదావళి
చతుర్భాణీ
ఏటికి ఎదురీత
శతపత్ర సుందరి (రజని గేయాలు)
ఉత్తమ గేయరచయితలలో రజనీకాంతరావు ఒకరు. ఈయన ఉత్తమశ్రేణికి చెందిన గేయ కవి. శాస్త్రీయమైన రాగ తాళ జ్ఞానంతో స్వయముగా పాడి కూర్చిన గానకళా నిపుణులు; వాగ్గేయకారుడు, విశేష ప్రజ్ఞాశాలి అని ప్రముఖ సాహిత్యకారుడు శ్రీ పింగళి లక్ష్మీకాంతం గారు అభివర్ణించారు.

యాబై తెలుగు చలన చిత్ర పాటలు వ్రాశారు. వందకు పైగా లలిత గీతాలను తన కలం ద్వారా విలువడించారు రజనీకాంత రావు గారు. ఇటీవలే రజని గారి ఆత్మకధా విభావరి, విశాఖపట్నంలో విడుదల చేశారు.

అందుకున్న గౌరవ పురస్కారాలలో ముఖ్యమైనవి:

2011 ఠాగూర్ అకాడమి రత్న (సంగీత నాటక అకాడమి)
1980 లో కళాప్రపూర్ణ (ఆంధ్ర విశ్వవిద్యాలయం)
కళా రత్న పురస్కారం (ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం)
కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం (1961)
2001 లో, అప్పాజ్యోసుల విష్ణుభొట్ల ఫౌండేషన్ నుండి ప్రతిభా మూర్తి జీవిత పురస్కారం

పైవాళ్ళకి పేరు వచ్చినా తన వంతు కృషి చేస్తూ కార్యక్రమాలని చక్కగా నిర్మించారు. తృప్తి పొందారు. ఒక సాధనగా అలవరచుకున్నారు. ఈ అనుభవాలు వీరిని బాగా సాన పట్టాయి. దక్షతతో ఉన్న వారితో కలసి పనిచేశారు. ఇవన్నీ వీరి రచనా కౌసలానికి దోహదపడ్డాయి.

సితాపతి గారి సంసారం ధారావాహిక నాటకం రూపొందించారు. మునిమాణిక్యం, స్తానం నరసిం హా రావు, దేవులపల్లి వంటి మేటి సాహిత్య, కళాకారులతో పనిచేసి, ఆణి ముత్యాలాంటి కార్యక్రమాలు అందించారు బాలంత్రపు రజనీకాంత రావు గారు.

సజీవ సాహిత్యవేత్త గురించి ఎంత మాట్లాడించవచ్చు, ఎంత పొగడవచ్చో నిర్ధారించి కార్యక్రమాలు సవ్యంగా నిర్వహించారు. బి కే రావు గారి అనుమతితో తిరువన్నమలైలో ఉన్న గుడిపాటి వెంకట చలం గారిని కలసుకుని " చలం - కలం వెలుగులు " కార్యక్రమం నిర్వహించారు. అలానే కృష్ణ శాస్త్రి గురించి పని చేశారు. అలాగే విశ్వనాధ సత్యనారాయణ గురించి విశ్వనాధ కవితా సరస్వతి నిర్వర్తించారు. నేను కర్తని కాను; నిమ్మిత్త మాత్రుడిని విజయవాడ కేంద్రం కర్త అని సౌమ్యంగా చెప్పుకున్నారు;

1974 లో అబ్బూరి రామకృష్ణా రావు గారిని ఇంటర్వ్యూ చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, సి ఆర్ రెడ్డి, టంగుటూరి ప్రకాశం తదితరుల కార్యక్రమాలు నిర్వహించారు.

హేమా హేమిలందరూ ఈయన రాసిన చలన చిత్ర పాటలు పాడారు. వీరిలో జిక్కి, భానుమతి, ఎం ఎస్ రామా రావు, ఘంటశాల, పీ సుశీల, బాలసరస్వతి దేవి ఉన్నారు.

తండ్రికి తగ్గ తనయుడు. సంగీతకారుడిగా, రచయితగా, కవిగా, రూపక కర్తగా, ఆకాశవాణి సంచాలకుడిగా తెలుగు సంగీత సాహిత్య రంగాలలో తనదైన ముద్రవేశారు. భక్తిరంజనితో లక్షల మనసులను రంజింప జేశారు మన రజని గారు. తెలుగు కళామ తల్లి ముద్దుమిడ్డ మన రజనీకాంత రావు గారు.
వీరి సేవా నిరతి, చేసిన కృషి, సాధించిన ఘనత యువతకు ఆదర్శం. రజని గారి ఆత్మ కధా విభావరి చదవండి. అది చీకటి, వెలుగుల రంగేళి.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రజనీకాంతరావు 2018, ఏప్రిల్ 22, ఆదివారం రోజున అంతిమ శ్వాస విడిచారు.

(సిలికానాంధ్ర - సుజనరంజని లో శ్రీ ఈరంకి వెంకట కామేశ్వర్ గారి వ్యాసం నుండి కొన్ని విషయాలు సేకరించాను. , వారికి నా ధన్యవాదాలు)
'శిరాకదంబం' పత్రికలో వారి గురించి పలువురు వ్యక్తపరచిన అభిప్రాయాలు క్రింది లింకు క్లిక్ చేసి చదవమని మనవి.
https://sirakadambam.com/07_014/sangeetha-sahitya-samalakrutulu/

'ఓ విభావరి' పాట గురించి వివరణ ఇచ్చిన రజనీకాంతరావు గారు - ఈ క్రింది వీడియో లింక్ క్లిక్ చేసి వినండి.

 విభావరి ఓహో విభావరినీహార  తీర  నీలాంబరి ధారిణి మనో హారిణి  విభావరి ఓహో విభావరినీ చెంచల చేలాంచల  నిభృత  స్వప్నసీమలలోఎలా భయ ఛాయ జాల మేలా సౌఖ్య రో చీర్నీల  ఓ విభావరి ఓహో విభావరిసంతత శాంత తరంగిణి మదభరయువ కురంగిణిఎలా అలస్గమనముు ఎలా నవ విలస్నముు   విభావరి ఓహో విభావరిధరణీ తలా  చంద్రశిలా తరళ  మంటపమున నిలచియుగములుగ పరీబ్రమింతు  గమ్యుడవ్ ఎవని వలచి  విభావరి ఓహో విభావరి

నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...