25, డిసెంబర్ 2018, మంగళవారం

అద్దమెంత అల్లరిదో..పలుకరించు పదేపదే..!


నా చిత్రానికి మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రాసిన కవిత. వారికి నా ధన్యవాదాలు.


అద్దమెంత అల్లరిదో..పలుకరించు పదేపదే..!
మెచ్చనీదు అందాలను..ధిక్కరించు పదేపదే..!
ఎంత దిద్దుకోవాలో..ఎఱుకపరచు పలుకకనే..
ముచ్చటాడు సందడినే..సంస్కరించు పదేపదే..!
అర్థమవని భావాలకు..నిఘంటువే తానవునే..
నేను మాటు చిత్రాలను..ఆదరించు పదేపదే..!
విరహాగ్నిని ఊరడించు..నెచ్చెలిగా మిగిలియుండు..
చిరునవ్వుల వేదాలను..చిలకరించు పదేపదే..!
ప్రతిబింబపు మూలాలను..అందించే కోమలిరో..
నిత్యసత్య మౌనసుధను..వెలువరించు పదేపదే..!
నా కలలకు ప్రతిరూపం..ఈ జగమే మాధవుడా..
నీ గజల్ పరిమళములె..కలవరించు పదేపదే..!

8, డిసెంబర్ 2018, శనివారం

నిరీక్షణ - pen sketch



నా pen sketch కి శ్రీమతి పద్మజ చెంగల్వల గారి కవితా స్పందన

నీ కోసమే నిరీక్షణ...
క్షణమొక యుగమాయే..
కలనైనా కానరావాయై..
కనుమరుగైనావే..!!
మనసు తనివి తీరేదెలా.!!
తలపుకి తాళమేసినా...!!
తడుముతునే వుంటుంది.
ముడివడి వీడని గురుతులు
కనురెప్ప చాటున దాగివుండి..
రాలేక ఆగలేక నిలిచిన వైనం
సతమతమై గడిపిన రాత్రులెన్నో..
పెనవేయని బంధం బందీ చేసిందెప్పటికి..
ఎంత విచిత్రం..ఏనాటిదో...!!!
విధి విచిత్రం
చూస్తే ఆగలేక..
తడబడే తపన
నాకెందుకో..
ఎన్నాళ్ళు...!!!



19, నవంబర్ 2018, సోమవారం

నిరీక్షణ

నా పెన్సిల్ చిత్రానికి చక్కని కవిత రాసిన అనుశ్రీ కి శుభాశీస్సులు.

~~నిరీక్షణ~~
నిరీక్షణలో నిముషాలు దొర్లుతున్నా
ఎదురుచూపులో ఏకాగ్రత తప్పక
గడపను విడువక రెప్పలు తడపక
నీ రాకకై దారులన్నీ తడుముతున్నా....!!
చినుకుకై వేచిన చిగురాకుకు
చిరుగాలి సందేశమిచ్చినట్లు
విరిసే పూలకై ఉదయాలు
పరుగున వచ్చి పలకరించినట్టు
వాకిట వాలిన నీ చూపు కిరణాలతో
నా పెదవి రేకులు విచ్చుకుని
చిరునవ్వుల పూలు విరియాలని..
పసుపు గడపకు
పచ్చని తోరణపు పలకరింపువై
అలిగినమోమున కళను నింపుతావని
నా ఆకాంక్షలన్నీ అక్షింతలై
మెరిసే నక్షత్రాల సాక్షిగా
నిజమై నిలకడై నా చెంతచేరి
జీవితాన పండుగలై మురవాలని
కాలాన్ని వేడుతున్నా మౌనంగా
నీ అడుగుల సవ్వడి నను చేరేదెపుడని...!!
అనూశ్రీ.....

26, సెప్టెంబర్ 2018, బుధవారం

చిలకమర్తి లక్ష్మీనరసింహం



చిలకమర్తి లక్ష్మీనరసింహం - నా పెన్సిల్ చిత్రం

నివాళి - నేడు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి జయంతి. ఈరోజు ఈ మహనీయుని చిత్రం గీసే అదృష్టం కలిగింది.
భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చు చుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియ బట్టి
చిలకమర్తి లక్ష్మీనరసింహం (1867 - 1946) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. అప్పటి ఆంధ్రదేశ జనాభా ఎంత? అంత తక్కువ జనాభాలో అన్ని కాపీలు అమ్ముడుపోవడం ఈనాటికీ ఓ వింత అని అభిప్రాయపడుతుంటారు కొందరు సాహెతీవేత్తలు.
చిలకమర్తి లక్ష్మీనరసింహం దాదాపు వందేళ్ల పూర్వం రాసిన నవల గణపతి. సాధారణంగా తెలుగులో చక్కటి హాస్య నవలలే అరుదైన పరిస్థితి ఉంది. అందులో అధిక్షేపాత్మక నవలల సంఖ్య మరీ స్వల్పం. ఈ నేపథ్యంలో హాస్య రసాన్ని పోషిస్తూ అధిక్షేపాత్మకంగా సాగిన గణపతి నవల సాహిత్యంలో ఎంతో ప్రఖ్యాతి పొందింది. (సేకరణ : ఇక్కడా అక్కడా)

19, సెప్టెంబర్ 2018, బుధవారం

కడలి మదిలో కలవరం - కవిత





నా చిత్రాలకి చక్కని కవితలు రాస్తుంటుంది నన్ను 'బాబాయ్' అంటూ అభిమానంగా పలకరించే అనుశ్రీ. ఈసారి నేనే ఓ బొమ్మనిచ్చి కవిత రాయమన్నాను. బొమ్మకి అతికినట్లుగా రాసి పంపించింది కవిత. మీరూ చదవండి. ధన్యవాదాలు.

కడలి మదిలో కలవరం
అతివ మదిలలోని కల్లోలంలా
అలజడుల నిత్య ఆలింగనంతో..
సముద్రమంత సహనాన్ని
మదిలో నింపుకున్నా
జీవన సమరాన గెలిచే దారి లేక
కలల కలువలన్నీ నిరాశలై జారి
కన్నీట మునిగి రాలిపోతుంటే...
సాయానికి దూరమై
గాయాలకు మూలమై
స్వార్థం ముసుగులో ప్రేమని
విషపు మాటల వెలివేతలతో
అహం తలకెక్కిన వాదనతో
విసిగి వేసారిన హృదయం
తలపోస్తోంది ప్రతిక్షణం
ఓటమి గూటిలో తానిక ఇమడలేనని..
కెరటాల వలలో మృత్యువై
ప్రపంచాన్ని శాశ్వంతంగా వెలేసి సుడిగుండాల ఒడిలో హాయిగా ఒదిగిపోతోంది..
తనదైన మనసుకై అన్వేషణ ఇక ముగిసిందని......!!

అనూశ్రీ....

12, సెప్టెంబర్ 2018, బుధవారం

చిత్రకారుడు వడ్డాది పాపయ్య

చిత్రకారుడు కీ.శే. వడ్డాది పాపయ్య - పెన్సిల్ చిత్రం

భారతదేశానికి గర్వకారణమైన చిత్రకారుడు వడ్డాది పాపయ్య (సెప్టెంబరు 10, 1921 - అక్టోబరు 30, 1992). ప్రాచీన సాహిత్యాన్ని అకళింపు చేసుకొని తన కుంచెకు సాహితీ సౌరభాన్ని పులిమి చిత్రాలను చిత్రించిన ప్రత్యేక చిత్రకారుడు వడ్డాది పాపయ్య.గీతకు అర్థం ఉంటుంది. రూపానికి ఆహ్లాదం ఉంటుంది. కొన్ని స్ట్రోక్స్ కలసి రూపం అవుతుంది. దానిలో గీతలు రూపంలోని ఆనందానుభూతిగా వెల్లివిరుస్తుంది. ఈయన బొమ్మలు కేవలం రసాత్మకంగానే ముగిసిపోక రస జగత్తును అధిగమించాయి. లాలిత్యం కంటే గాంభీర్యం, అనుభూతి కంటే ఆలోచన ఎక్కువ పాళ్ళలో ఉండి సౌందర్యాన్ని మించిన శక్తిని కన్పింపజేసిన వడ్డాది పాపయ్య శ్రీకాకుళం పట్టణంలో జన్మించారు.

అతి సామాన్యమైన రంగుల్లోంచి అత్యద్భుతమైన బొమ్మలను , ఇంద్రధనుస్సులో కూడా కానరాని రంగుల కలయికనూ చూపగలిగిన వడ్డాది పాపయ్య కళాజీవితం ఎంతటి ఉన్నతమో, వ్యక్తిగత జీవితం అంతకంటే గొప్పది. పల్లె పడతుల అంద చందాలను, స్నిగ్ద మనోహర వలపు తలపులను చిత్ర కళాకారులు ఏనాటి నుంచో చిత్రీకరించినా వ.పా శైలి మాత్రం అజరామరంగా నిలిచి పోతుంది. మత్స్య గ్రంధి, ఊర్మిలనిద్ర, పంచతంత్రం కథలలోని జంతు ప్రపంచం ఈయన కుంచె కదలికలతో జనజీవాలు నింపుకొని కళాభిరుచి గూర్చి తెలియని పాఠకుల్ని సైతం కళాభిమానులుగా తీర్చిదిద్దాయి. తెలుగు నాట చిత్రకళలో ఈయన శైలికి, బొమ్మలలోని సంతకానికి అందినంత గుర్తింపు గౌరవ ప్రతిష్టలు మరెవరికీ అందలేదనే చెప్పాలి. అయితె ఈయన ప్రతిభ యావత్తూ పరిమిత వర్గంలోనే అవగాహనకు అందింది. చరమ దశలో ఒక పత్రిక యాజమాన్యం ఈయన చిత్ర కళను గుత్తకు తీసుకొని వాణిజ్య పరంగా రాణించింది.
ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య పవిత్ర నాగావళి నదీ తీరాన శ్రీకాకుళం పట్టణంలో రామమూర్తి, మహాలక్ష్మి దంపతులకు సెప్టెంబరు 10, 1921 న జన్మించారు. తండ్రి చిత్రకళా ఉపాధ్యాయుడు కావడంతో ఓనమాలు తండ్రి వద్దనే నేర్చి . తండ్రి బొమ్మలు గీచే పద్ధతిని చాలా శ్రద్ధతో పరిశీలించేవారు. క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నారు. పట్టుదలతో సాధన చేశారు.రంగులు కలపడం, వాటిని ఉపయోగించే పద్ధతిని తండ్రి వద్దనే నేర్చుకున్నారు. తండ్రి బొమ్మలు వేస్తున్నంతసేపూ ఆయనకంటే దీక్షగా పరిశీలించుతూ కచ్చితమైన పెర్‌ఫెక్టివ్‌నెస్ జాడలను తెలుసుకొనేవారు. రంగులు కలపడం, బ్రష్ లు ఎప్పటి కప్పుడు శుభ్రం చేయడం వంటి పనులన్నీ వినయ విధేయలతో నెరవేరుస్తూ తండ్రి వద్ద శిష్యుడి పాత్రను అద్వితీయంగా నిర్వహించారు. ఐదు సంవత్సరాల పిన్న వయసులోనే తన ఇంటిలో ఉన్న రవివర్మ చిత్రం "కోదండ రామ"ను ప్రేరణగా తీసుకుని హనుమంతుని చిత్రాన్ని గీసారు. పాపయ్య చిన్న తనంలో తండ్రి భారత, భాగవతాలను వినిపిస్తుండేవారు. ఆ ప్రభావం వలన పాపయ్య ఆధునికత కంటే ప్రాచీనత మీద, ముఖ్యంగా భారతీయ శిల్ప, చిత్ర కళల మీద మక్కువ పెంచుకొన్నాడు.
ఒకానొక చిత్రకారునిగా 1938 లో తనను తాను గుర్తింపజేసుకున్నాడు. 17 వయేట ప్రారంభించిన ఈ తపస్సు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లకు గురయినా రాణించే వరకు ఆగలేదు. కళాసృష్టి హృదయం నుంచి వెల్లుబుకుతుంది. మేధస్సు నుంచి పుట్టిన హేతువాదానికి ఈ అంశం అందదు. ఆస్తికత్వ, నాస్తికత్వాల ప్రసక్తికి దూరంగా ఉన్నా ఎగురుతున్న హనుమంతుడు, గోపికాకృష్ణుల రాసలీల దృశ్యం మొదలైన ఎన్నెన్నో అతిరమణీయ చిత్రాలతో పాటు, పార్వతి, శకుంతల, లక్ష్మి, ధనలక్ష్మి, శివపార్వతులు, గంగావతరణం మొదలైన పౌరాణిక ఊహాత్మక బొమ్మలను గీచారు. అయితే లౌకిక ప్రపంచానికి తామంత తాముగా దూరమైపోయారు. రేరాణి, అభిసారిక, భారతి పత్రికలలో ప్రచురితమైన బొమ్మలలో ఒక సంచలన చిత్రకారుడుగా పత్రికా ప్రపంచానికి చేరువయ్యారు. తత్ఫలితంగా తెలుగు సినీ ప్రముఖుడు చక్రపాణి తమ సంస్థ ప్రచురణలైన చందమామ, యువ పత్రికలలో బొమ్మలు వేసే ఉద్యోగం ఇచ్చారు. ఒక్క "చందమామ" పత్రికలోనే దాదాపు మూడు దశాబ్దాల పర్యంతం తన సహజ శైలిలో బొమ్మలు చిత్రిస్తూ, ఒకే పత్రికలో కొనసాగటం తెలుగు పత్రికా రంగంలో ఒక పెద్ద రికార్డు! అభిసారికకు 1949-59 మధ్య కాలంలో గీసిన అపురూప ముఖచిత్రాలను, వాటికి శోభ చేకూర్చిన 'కరుణశ్రీ' జంధ్యాల పాపయ్య శాస్త్రి పద్యాలను చూసి తీరవలసిందే.
చిత్రకళ నేర్చుకొంటున్న తొలినాళ్ళలో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు పాపయ్య చిత్రాలు పత్రికలలో ప్రచురించి ప్రోత్సహించాడు. ఆ తరువాత వ.పా రేరాణి, మంజూష, అభిసారిక, ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్రజ్యోతి తదితర పత్రికలలో చిత్రాలు గీయటం ప్రారంబించాడు.

కొంతకాలం తరువాత చందమామ సంపాదకులు చక్రపాణి పరిచయంతో దాదాపు అర్ధ శతాబ్దం పాటు చందమామను తన కుంచెతో తీర్చి దిద్దాడు. అప్పటిలో చందమామ ఎనిమిది భాషలలో వెలువడుతుండటంతో పాపయ్య చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రచారం పొందాయి. యువ మాసపత్రికలో చిత్రకారులు ఒక చిత్రం గీసే అవకాశం అరుదుగా వచ్చే రోజులలో నెలకు నాలుగు ఐదు చిత్రాలు గీసేవాడు పాపయ్య. చందమామ, యువ తర్వాత స్వాతి వార, మాస పత్రికలలో దశాబ్ధకాలం పైగా ఈయన చిత్రాలు ప్రచురించబడ్డాయి.

వడ్డాది పాపయ్యగారు గీసిన చిత్రాల క్రింద 'వ.పా.' అనే పొడి అక్షారాల సంతకం వారి ప్రత్యేకత. వీరి బొమ్మలకు గల మరొక కుంచె గుర్తు '0|0' అని వుండడం. ఇందు గురించి ఆయన చెప్పిన భాష్యం - "గతం శూన్యం, వర్తమానం శూన్యం, భవిష్యత్తులో నిలుచున్నానని".

వ.పా. కేవలం చిత్రకారుడే కాదు. రచయిత కూడా. చందమామలో కొడవటిగంటి కుటుంబరావు మొదలు పెట్టిన 'దేవీభాగవతం' కథలను పూర్తి చేసింది ఆయనే. 'విష్ణుకథ' పౌరాణిక సీరియల్ కూడా ఆయన వ్రాసిందే.
1947 లో నూకరాజమ్మను, 1984 లో లక్ష్మి మంగమ్మను వివాహమాడారు. అయనకు ముగ్గురు కుమారులు మరియు ఒక కుమార్తె. కూతురు అనూరాధ మీద మమకారంతో కశింకోటలో 'పావన కుటీరం' నిర్మించుకొని స్థిరనివాసులయ్యారు.
సాధారణంగా చిత్రకారులు మోడల్స్ యొక్క నమూనాలనో లేదా వారినే చూస్తూనో చిత్రాలు గీస్తుంటారు. కాని పాపయ్యగారు మాత్రం ఏనాడూ ఆవైపు పోలేదు. తన ఆలోచనల రూపాలనే చిత్రాలుగా చిత్రించేవారు.
పాపయ్యగారి చిత్రాలలో తెలుగు సంస్కృతి, తెలుగుదనం, ఆచార వ్యవహారాలు, అలంకరణలు, పండుగలు ప్రధాన చిత్ర వస్తువుగా ఉంటాయి.
వ.పాకు తన గురించిన ప్రచారం అంటే ఇష్టం ఉండేది కాదు. తన గురించి లఘుచిత్రం తీయాలన్న దూరదర్శన్ ప్రతిపాదనను తిరస్కరించాడు. కళాకారునిగా తనను అభిమానించవద్దని, తన కళనే అభిమానించమని, అభిమానులను వ.పా. కోరేవాడు. కేవలం మిత్రుల వత్తిడి కారణంగా ఖరగ్‌పూర్, శ్రీకాకుళం లలో తన చిత్రాలను ప్రదర్శనకు ఉంచాడు.
రూప కళను అమితంగా ఇష్టపడే వ.పా. నైరూప్య (Abstract Art) చిత్రకళ పట్ల తీవ్ర అసహనాన్ని ప్రదర్శించేవాడు.
లోకానికి తెలియకుండా తనను తాను ఏకాంతంలో బంధించుకొని మరెవరూ దర్శించలేని దివ్య దేవతారూపాలను చిత్రించే పాపయ్య 1992 - డిసెంబర్ 30 న దివ్యలోకాలకు పయనమై వెళ్ళిపోయాడు.

Source : వికీపీడియా

10, సెప్టెంబర్ 2018, సోమవారం

కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ


కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ  (నా పెన్సిల్ చిత్రం)


విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబర్ 10, 1895 - అక్టోబరు 18, 1976) "కవి సమ్రాట్" బిరుదాంకితుడు. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.

20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు - కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింపబడిన సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన వ్రాసిన రచనలన్నీ కలిపితే లక్ష పుటలు ఉండవచ్చును

విశ్వనాథ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించారు. జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పారు - "ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాథ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాథ కృతిలో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్షణ్యం వెల్లివిరుస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం - ఈ వ్యక్తిత్వం." (source : Wikipedia)

7, సెప్టెంబర్ 2018, శుక్రవారం

గజల్ .."చాలునులే"



నా పెన్సిల్ చిత్రానికి శ్రీమతి గుడుపూడి రాధికారాణి గారి గజల్

గజల్ .."చాలునులే".
---------------
చెలిమోమున చిగురించే నవ్వొక్కటి చాలునులే
వనిశోభను వెలిగించే పువ్వొక్కటి చాలునులే
సంగీతపు సరిగమలే మురిపించవు మూర్ఖులను
ఆ మనసును కరిగించే పాటొక్కటి చాలునులే
జామకాయలమ్ము తాత జాలిచూపు చూసెనేల?
ఆ కనులను మెరిపించే పిలుపొక్కటి చాలునులే
బీడుభూమి పోలెనులే అన్నదాత పొడిపెదవులు
పైరులన్ని పరిమళించు వానొక్కటి చాలునులే
యుద్దభూమికేగినట్టి భర్తజాడ తెలియరాదు
ఆమె గుండెగుబులు తీరు కబురొక్కటి చాలునులే
మబ్బుకమ్ము నింగివోలె నీలవేణి నేత్రములు
కలలురాని కలతలేని నిదురొక్కటి చాలునులే
ఊహలలో ఊసులలో హృదిని కుదుపు భావఝరులు
రాధికకే రచనలలో గెలుపొక్కటి చాలునులే
----------------------------------------
గుడిపూడి రాధికారాణి.

18, ఆగస్టు 2018, శనివారం

సాలూరు రాజేశ్వరరావు - Saluru Rajeswara Rao

స్వరసారధి సాలూరు రాజేశ్వరరావు గారి గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలకి నా పెన్సిల్ చిత్రం జోడించి మీముందు ఉంచుతున్నాను. వీరు 11 October 1922 లో జన్మించారు.
"మెలొడీ” అనే మాట వినగానే సినీ సంగీతాభిమానులందరూ ఏకాభిప్రాయంతో తల్చుకునేది సాలూరు రాజేశ్వర రావు గారిని అంటే అని అంటే అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. ఈయన శాస్త్రీయ సంగీతంలో దిట్ట. ఆయన శాస్త్రీయ,లలిత సంగీతాల సమ్మేళనంగా ఆణిముత్యాల్లాంటి మధుర సినీ గీతాలను మనకి అందించారు. అనేక ప్రయోగాలను చేశారు. కొన్ని గీతాలను ఇంగ్లీష్ గీతాలనుంచి ప్రేరణ పొంది కొద్ది ఛాయలతో మాత్రమే వాటిని అచ్చ తెలుగు పాటలుగా మలిచారు. పాశ్చాత్య సంగీత పద్ధతులను తొలిసారిగా తెలుగు సినీ రంగంలో ప్రవేశపెట్టిన ఘనత ఆయనది. చంద్రలేఖ సినిమా ఇందుకు ఒక ఉదాహరణ.
ఆలిండియా రేడియోకి సోలో గానూ, రావు బాలసరస్వతి తోనూ కలిసి ఆయన పాడిన లలితగీతాలు 1940 ల్లో యువ హృదయాలను ఉర్రూతలూగించాయి. “పాట పాడుమా కృష్ణా పలుకు తేనెలొలుకునటుల" , ”చల్ల గాలిలో యమునా తటిలో” , “ఓ యాత్రికుడా” వంటి పాటలు ఈ నాటికీ ఆయన సంగీతాన్ని అభిమానించే వారికి గొప్ప ఆస్తి క్రిందే లెక్క! సన్నని స్వరంతో ఆయన పాడిన లలిత గీతాలు ఆలిండియా రేడియో పుణ్యమా అని సంగీతాభిమానుల దాహార్తి తీర్చాయి.
సినిమాల్లో ఆయన ప్రావీణ్యం కొత్తపుంతలు తొక్కి, మెలొడీకి పెద్దపీట వేయడమే కాక, కొన్ని సినిమాలను ఈ నాటికీ మ్యూజికల్ హిట్లుగా నిలబెట్టింది. తెలుగు సినిమా సంగీతాన్ని ఆరాధనీయమైన స్థాయికి తెచ్చింది రాజేశ్వర రావు గారేనన్నా అతిశయోక్తి కాదు.

ఇంక సాలూరి కిరీటంలో కలికితురాయి మల్లీశ్వరి (1951). సినిమా సంగీతంలోను, సినిమా తీసే పద్ధతిలోను గణనీయమైన మార్పులు చెందినా, డబ్భై సంవత్సరాలు దాటినా  నేటికీ గల గలా ప్రవహించే నదిలా వీనులవిందు గొలుపుతున్న సాహిత్య సంగీతాల మేళవింపు “మల్లీశ్వరి”. వి.ఎ.కె.రంగారావుగారి మాటల్లో చెప్పాలంటే “బి.ఎన్‌.రెడ్డి కార్యదక్షతతో, దేవులపల్లి మల్లెపూరేకు బరువుతో వ్రాసిన సాహిత్యంతో, పసుమర్తి కృష్ణమూర్తి నృత్య సారధ్యంతో, ఘంటసాల భానుమతిల గళ మధురిమతో యీ చిత్రంలోని సంగీతం తక్కిన అన్ని హంగుల మాదిరిగానే నభూతో నభవిష్యతి అన్న తీరుగా రూపొందింది.” “ఇదొక్కటి చాలు సాలూరి గొప్పతనం తెలియజెప్పడానికి” అనేవారు కొందరైతే, “దీనిని మించిన సంగీతభరితమైన చిత్రం ఇంతవరకు రాలేదు, ఇక ముందు కూడా రాబోదని” దృఢంగా విశ్వసించే వారూ చాలామంది ఉన్నారు.

“మల్లీశ్వరి” తరువాత ముఖ్యంగా చెప్పుకోవలసిన చిత్రం విప్రనారాయణ (1954). ఎవ్వాడే అతడెవ్వాడే అన్న అపూర్వమైన రాగమాలికనొక్కసారి (భైరవి, మోహన, కాపి, వసంత) జ్ఞప్తికి తెచ్చుకోండి! ఈ చిత్రంలోని ప్రతి పాటా గొప్పదే. పాలించర రంగా (హేమవతి), చూడుమదే చెలియా (హిందోళం), రారా నా సామి రారా (కల్యాణి), సావిరహే (యమునాకల్యాణి),మేలుకో శ్రీరంగ (బౌళి, మలయమారుతం), …
హిందోళం లో రాజేశ్వర రావు గారు చేసిన పగలే వెన్నెల(పూజాఫలం), ఆల్ టైం హిట్ గా నిలిచిన భావగీతం. ఇదే రాగంలో కూర్చిన శ్రీకర కరుణాలవాల (బొబ్బిలి యుద్ధం)పాటేమో భక్తి రసంతో పాటు వీర రసం కూడా ఉట్టిపడే గీతం.
రాగమాలిక(వివిధ రాగాలను వివిధ చరణాల్లో ఒకే పాటలో కూర్చడం) లో స్వరరచన చేయడం క్లిష్టమైన పని! మల్లీశ్వరి లోని "ఆకాశవీధిలో" ఎవరు మర్చిపోగలరు? జయదేవ చిత్రంలోని దశావతారాలను వర్ణించే అష్టపది “జయ జగదీశ హరే “, “పాడెద నీ నామమే”(అమాయకురాలు),రాధాకృష్ణ సినిమాలోని “నా పలుకే కీర్తనా” పాటలు ఆయన రాగమాలికలకు కొన్ని ఉదాహరణలు!
ఇక వీణ రాజేశ్వర రావుగారి వీణ పాటలంటే ప్రాణం ఇవ్వని అభిమానులెవరు? పాడవేల రాధికా,పాడమని నన్నడగవలెనా,మదిలో వీణలు మ్రోగే,పాడెద నీ నామమే…ఇవన్నీ ఆయన వీణా నాదాలే!
యమన్ కళ్యాణి రాగంలో రాజేశ్వర రావుగారు ఇచ్చిన హిట్లు అసంఖ్యాకం! ప్రతి తెలుగు గొంతులో ఎప్పుడో ఒకప్పుడు పలికే పాట “మనసున మల్లెల మాలలూగెనే” , "సావిరహే తవదీనా","రారా నా సామి రారా"(విప్రనారాయణ), చెలికాడు నిన్నే(కులగోత్రాలు),జగమే మారినది(దేశద్రోహులు),చిగురులు వేసిన కలలన్నీ(పూలరంగడు), కళ్లలో పెళ్ళి పందిరి(ఆత్మీయులు) ఎప్పటికీ మర్చిపోలేని ఆణిముత్యాలే!
అలాగే పాశ్చాత్య సంగీత ప్రేరణతో వాటిని మక్కీకి మక్కీ దించకుండా “ఎక్కడో విన్నట్టుంది” అన్నట్టుగా వాటిని “తెలుగు నేటివిటీకి దగ్గరగా కూర్చిన పాటల్లో కొన్ని..హలో హలో ఓ అమ్మాయి(ఇద్దరు మిత్రులు),స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు(ఆత్మీయులు), ఈ రేయి తీయనిది (చిట్టి చెల్లెలు).
రాజేశ్వర రావు గారు ఈ పాటలు కూర్చారనో, ఆయన ఇంతటి ప్రతిభాశాలి అనో,ఆయన పాటల్లో ఇవి మంచివి అనో చెప్పడం పెద్ద సాహసమే! అందుకే ఆయన్ని ర"సాలూరు" రాజేశ్వర రావు అన్నా, రాజే”స్వర”రావు అన్నా, అది ఆయనకే చెల్లు!

వీరు 25 October 200 సంవత్సరంలో స్వర్గస్తులాయ్యరు.

17, ఆగస్టు 2018, శుక్రవారం

అటల్ బిహారి వాజ్పాయీ - Atal Bihari Vajpayee

అటల్ బిహారి వాజ్పేయి - నా పెన్సిల్ చిత్రం.

సమున్నత విలువల శిఖరం

రాజకీయాల్ని ప్రజాహిత రంగంగా భావించి దశాబ్దాల పాటు అవిరామంగా సాగించిన మహా వాజపేయం ముగిసింది. పుష్కర కాలం వాజ్‌పేయీ అంటే- భావుకత మూర్తీభవించిన విగ్రహం; సంక్షుభిత స్థితిలోనూ సడలని నిగ్రహం! ‘మృత్యువుకైనా వెరవను, చెడ్డపేరంటే మాత్రం చాలా భయం’ అన్న వాజ్‌పేయీది సమున్నత విలువల పథంలో అలుపెరుగని ప్రస్థానం! అటల్‌ జీ విఖ్యాత జాతీయ నాయకుడు... విశిష్ట రాజకీయవేత్త... స్వార్థమెరుగని సంఘ సేవకుడు... మహా వక్త, సాహితీమూర్తి, చక్కని కవి, మంచి పాత్రికేయుడు- 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా సత్కరిస్తూ ఇచ్చిన ప్రశంసాపత్రంలోని ఈ విశేషణాలన్నీ ప్రజాజీవనంలో వాజ్‌పేయీ బహురూపాలు. అర్ధనిమీలిత నేత్రాలతో కవిత చదివినా, అనర్గళ వాగ్ధాటితో ప్రత్యర్థుల్ని చెండాడినా అది వాజ్‌పేయీకే చెల్లు! ‘అధికారంలో కొనసాగడానికి అవినీతిని ఆశ్రయించం, అనైతిక పద్ధతులూ అవలంబించం. మా ఆత్మల్ని అమ్ముకోవాలనో, తాకట్టు పెట్టాలనో మేము అనుకోవడం లేదు’- అంటూ 1996లో పదమూన్నాళ్ల ప్రధానిగా పార్లమెంటులో వాజ్‌పేయీ చేసిన చారిత్రక ప్రసంగం ఆయన నైతిక నిష్ఠాగరిమకు ఘనతర ప్రతీకగా నిలిచింది. దేశ రాజకీయాల్లో కొడిగట్టిపోతున్న కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా భాజపాను జాతి ముందు నిలబెట్టడంలో ఆ కర్మయోగి రాజనీతిజ్ఞత, దూరదృష్టి నిరుపమానమైనవి. తొలుత దేశం, పిమ్మట పార్టీ, ఆ తరవాతే నేను అనే ఆదర్శవాదాన్ని ఆచరణలో పెట్టి, భాజపాకు విలక్షణ సైద్ధాంతిక పునాదుల్ని నిర్మించి, సంకీర్ణ రాజకీయ నావకు తానే సహనశీల చుక్కానిగా మారిన దార్శనికుడు వాజ్‌పేయీ.‘బారీ బారీ అటల్‌ బిహారీ’ అనేంతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసిన వాజ్‌పేయీ- దేశమాత రుణం తీర్చుకొన్న ధన్యజీవి! 
నిక్కమైన భావుకత, నిఖార్సైన నిర్భీకత నిలువెల్లా నిండిన అపురూప వ్యక్తిత్వం అటల్‌జీది. ‘ప్రచండ వేగంతో సృష్టిని సాగిస్తూ ప్రళయాల్ని ధరిస్తా’నని, ‘కీర్తి మతాబుల్లో కొందరు కేరింతలు కొడుతుంటే చీకట్లను రహించే పనిలో నిమగ్నం అవుతా’నని కవితాత్మకంగా స్పందించిన వాజ్‌పేయీ- ఆరు దశాబ్దాల ప్రజాజీవనంలో త్రికరణశుద్ధిగా నిబద్ధమైనదే ఆ మహత్కార్యానికి! హిందీలో బ్రహ్మాండమైన వక్తగా తొలినాళ్లలోనే లోక్‌సభాపతి అనంతశయనం అయ్యంగార్‌ కితాబులందుకున్న వాజ్‌పేయీ- ఐక్యరాజ్య సమితిలో రాజ్యభాషలో ప్రసంగించి భారతావని వాణిని ప్రతిధ్వనింపజేసిన ఘనాపాటి. పండిత నెహ్రూను అమితంగా అభిమానించడమే కాదు, తరాల అంతరాలను చెరిపేసి ప్రజాతంత్ర విలువల ఔన్నత్యానికి తానే విశిష్ట వారధిలా ఎదిగిన మేటి! ‘వారసత్వ సమస్యల్ని ఎన్నింటిని పరిష్కరించాం... జాతి ప్రగతికి ఎంత పటిష్ఠ పునాది వేశాం’- ఈ రెండే ప్రతి తరం బాధ్యతాయుత వర్తనకు గీటురాళ్లు అన్నది వాజ్‌పేయీ చెప్పిన మాటే. పదిసార్లు లోక్‌సభకు, రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికైన మహానేత భిన్న హోదాల్లో జాతికి చేసిన సేవకూ తూకంరాళ్లు అవే! కశ్మీర్‌ వివాద పరిష్కారాన్ని లక్షించి చారిత్రక లాహోర్‌ బస్సు యాత్రతో పాకిస్థాన్‌కు స్నేహహస్తం సాచడంలో, కశ్మీరీలను అక్కున చేర్చుకొనేలా మానవీయ విధాన రూపకల్పనలో సౌభ్రాత్ర పరిమళాల్ని వెదజల్లిన వాజ్‌పేయీ- విశ్వాసఘాతుకంతో కార్గిల్‌ యుద్ధానికి కాలుదువ్విన ముషారఫ్‌ మూకల వెన్నువిరిచిన సాహసి. ఉద్రిక్తతలు పెంచిన అయోధ్య వివాదానికి న్యాయ ప్రక్రియ ద్వారా లేదా పరస్పర ఆమోదయోగ్యమైన చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలన్న ఆయన నిర్దేశం- జాతి సమగ్రతకే గొడుగుపట్టింది. పార్టీగత అతివాదులకు ముకుతాడు వేసి, పూర్తికాలం దేశాన్నేలిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా సంకీర్ణ నావను ఒడుపుగా ప్రగతి తీరాలకు చేర్చడంలో వాజ్‌పేయీ చాణక్యం సంస్తుతిపాత్రమైనది! 
‘పార్టీకి దేశానికి ఏది మంచిది అనే లక్ష్మణరేఖను ఎవరికి వారు గౌరవించి, క్రమశిక్షణకు కట్టుబడి ఉంటే, దీర్ఘకాలం బంధాలు నిలబడతాయి’ అంటూ లాల్‌కృష్ణ అడ్వాణీతో తన దశాబ్దాల సాన్నిహిత్య రహస్యాన్ని వాజ్‌పేయీ వెల్లడించారు. అణుశక్తి సంపన్న రాజ్యంగా ఇండియాను తీర్చిదిద్ది, అమెరికా సహా పలు దేశాలు విధించిన ఏకపక్ష ఆంక్షల్ని దీటుగా ఎదుర్కొని, అచిరకాలంలోనే అగ్రరాజ్యాలన్నింటితో భాగస్వామ్య బంధాల్ని బలీయంగా ముడివేసిన వాజ్‌పేయీ విదేశాంగ వ్యూహ విశారదుడు! బుడిబుడి అడుగుల దశలో ఉన్న ఆర్థిక సంస్కరణలకు ఒడుపును, వేగాన్ని అందించి ఎనిమిది శాతం వృద్ధిరేటును సాకారం చేసింది వాజ్‌పేయీ ప్రభుత్వం. సప్తవిధ అనుసంధాన ప్రక్రియల ద్వారా యావత్‌ జాతినీ ఏకతాటిపైకి, ప్రగతిబాటలోకి నడిపించిన ఆయన సారథ్యం చిరస్మరణీయం. నాలుగు మహానగరాల్ని అనుసంధానించే స్వర్ణచతుర్భుజి, దానితోపాటే గ్రామీణ రోడ్ల అనుసంధానం దేశార్థికాన్ని కొత్తపుంతలు తొక్కించాయి. రైలు, విమాన, జలరవాణా సేవలతో పాటు అంతర్జాల విస్తృతి, టెలికాం విప్లవాలు ఇండియా ముఖచిత్రాన్నే మార్చేశాయి. 1999లో వాజ్‌పేయీ తెచ్చిన కొత్త టెలికాం విధానం వల్లనే దేశీయంగా మొబైల్‌ విప్లవం అద్భుతాలు సృష్టిస్తోంది. ఆదేశిక సూత్రంగా, నామమాత్రంగా మిగిలిన నిర్బంధ ఉచిత విద్యాలక్ష్యాన్ని సర్వశిక్ష అభియాన్‌ ద్వారా పట్టాలకెక్కించి కోట్లాది నిరుపేద పిల్లలకు అక్షరాభ్యాసం చేసిన గురువరేణ్యుడు వాజ్‌పేయీ. ‘నా ఆరోగ్యంపై చింతలేదు... దేశ ఆరోగ్యం గురించే నా ఆందోళన అంతా’ అని ప్రకటించి, నూట ముప్ఫైకోట్ల జనావళి ఆలోచనలూ హృదయాల అనుసంధానంతో జాతికి సముజ్జ్వల భవితను స్వప్నించిన వాజ్‌పేయీ- రాజకీయ వినీలాకాశంలో ధ్రువతారగా వెలిగే రాజర్షి!

(సేకరణ : ఈనాడు సంపాదకీయం)

12, ఆగస్టు 2018, ఆదివారం

అరవైలో ఇరవై

whatsapp లో వచ్చిన ఓ చక్కని కవితకి నా పెన్సిల్ చిత్రం.
జీవితాన్ని అనుభవించు వయసే "అరవై"
వృద్ధాప్యాన్ని ఆస్వాదించు నీవే "దొర"వై..
హోంవర్కు దిగులు లేదు పసివాళ్ళలా..
వొత్తిడుల గుబులు లేదు పడుచువాళ్ళలా..
'నడికారు' లాగ లేదు కలవరం..
వొడిదొడుకులు లేకుండుటె ఒక వరం..
అసలు..
జీవితాన్ని అనుభవించు వయసే అరవై..
వృద్ధాప్యాన్ని ఆస్వాదించు నీవే దొరవై..
బడి కెళ్ళాలని లేదు గడబిడ..
హడావిడి పడుట లేదు పని కడ..
బస్సు కొరకు వెయిటింగు బెరుకు లేదు..
ఉస్సురుస్సురనే ట్రాఫిక్ ఉలుకు లేదు..
ఉదయం రాందేవ్ యోగా, ధ్యానం
మధ్యాహ్నం ఎండ తగులని విరామం..
సాయంకాలాలు సమవయస్కులతో
చర్చోపచర్చలు, చతుర సంభాషణలు..
అసలు..
జీవితాన్ని అనుభవించు వయసే అరవై..
వృద్ధాప్యాన్ని ఆస్వాదించు నీవే దొరవై..
అమ్మా నాన్నల పోరు లేదు..
ఆఫీసు, బాసు జోరు లేదు..
మనుమలు, మనుమరాళ్ళ ఆటపాటలు,
కొడుకులూ, కోడళ్ళు.. కూతుర్లూ అల్లుళ్ళ
హర్షాతిరేకాలు, ఆహ్లాదపూరితాలు..
ఆశీస్సులకై శిరసువంచే
ఆనందమయ సన్నివేశాలు..
అసలు..
జీవితాన్ని అనుభవించు వయసే అరవై..
వృద్ధాప్యాన్ని ఆస్వాదించు నీవే దొరవై..
పాఠశాల, క్రమశిక్షణ వంటివి లేవు..
పరిమితులు, అనుమతుల బాధలు లేవు..
పెద్దవారు అడ్డుకునే సందేహం,
ఎవరేమంటారోననే అనుమానం
మచ్చుకైన కానరావు,
మరియాదలు తప్పవు..
ఏదైనా అనొచ్చు.. ఏమైనా కనొచ్చు..
మనసుకు తోచిన రీతి
మాట్లాడడమే పద్ధతి..
అసలు..
జీవితాన్ని అనుభవించు వయసే అరవై. .
వృద్ధాప్యాన్ని ఆస్వాదించు నీవే దొరవై..
(ఒక హిందీ కవితకు స్వేచ్ఛానుకృతి)

31, జులై 2018, మంగళవారం

కనులు



నేను చిత్రించిన ఈ 'కనులు' చిత్రానికి faceook లో  తమ కవితలతో స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు.


వినీలాకాశంలో ఇంద్రధనుస్సుని చూస్తూ అచ్చెరువొందిన కనులు
కొండలనడుమ ఉదయిస్తున్న బాలభాస్కరునిని దర్శించి తరించిన కనులు
ఎగసిపడే కెరటాల విన్యాసాలాకి పులకరించిన కనులు
అరవిరసిన పూబాలల వింతవింత సోయగాలకి మైమరచిన కనులు 
ఆలయంలో పరమాత్ముని దివ్యమంగళ దర్శనంతో అరమోడ్పులైన కనులు
పసిపిల్లల ముగ్ధత్వానికి పరవశించిన కనులు
కొండలలో, కోనలలో, ఏరులలో సెలయేరులలో ప్రకృతికాంత
అందాలకి దివ్యానుభూతి చెందిన కనులు ..
కంటిచూపు కరవై ఈ ఆనందానుభూతులకి దూరమైన కబోది ని చూసి
దుఃఖాశ్రువులతో నిండెను నా కనులు ..
అప్పుడు .. అప్పుడనిపించింది నాకు .. నా కనులతో ఆ అభాగ్యుడు
ఈ ప్రపంచాన్ని చూడగలిగితే చాలని!
ఆ రోజుకోసం ఎదురుచూస్తున్నాయి నా కనులు. 


చెలి! కనురెప్పలు
. ‌.... ..............---- పొన్నాడ లక్ష్మి
.
సీ॥కొనగోట కాటుకఁ । కొసరి కొసరి యింతి
కనురెప్పలకు దిద్ది । కాంతు లద్ది
దోరనవ్వును నవ్వి । నోరచూపును రువ్వి
మూసి కందెఱలతో । బాస లాడు
చెలికాని స్వరములై । తొలి సంధ్య వెలుగులై
మధుర తోరణమయి । యెదురు చూచు
ఇరుల పూ దోటలో । వరుని చే దోటలో
అరమోడ్పు నయనాల । అరువు లిచ్చు
ఆ॥చెలియల కనురెప్ప । తొలి రాయబారమై
వచ్చి పలుక రించి । ముచ్చ టించు
నర్సపురని వాస । నటరాజ ఘనమోక్ష
విశ్వ కర్మ రక్ష । వినుర దీక్ష
.
.
. పద్య రచన
. రాజేందర్ గణపురం
. 30/ 07/ 2018
కందెఱ = కనురెప్ప
..Pvt Murthy.. గారు స్వహస్తాలతో.. గీసిన చిత్రం చూసి నే వ్రాసిన పద్యం..!

29, జులై 2018, ఆదివారం

ఆంధ్రావని - అందాల గని




ఆంధ్రావని - అందాలగని - 

ఆస్వాదించే గుణం ఉంటే

ప్రతి సుమం సుగంధ భరితం
ప్రతి జీవితం ఆనందమకరందం


ప్రకృతి పులకరిస్తే చైత్రం

ప్రకృతి ప్రకోపిస్తే శిశిరం
ఆమని వస్తే ఆనందం
శిశిరం వస్తే దుఃఖం
సమదృష్టి లేకుంటే
ఆమని యైనా ఈమరి నే


చిత్తడియైనా చింతనే

సమదృష్టి ఉంటే
ఈమురి లో మురిపాలు.....
శిశిరంలో మనోరంజకాలు....
ఇదే జీవితం
ప్రతి క్షణం... ఆనందహేల
మరుపొక దివ్యౌషధలీల
ఆహ్వానం పలకమని రాయంచలను పిలిచినా
స్వాగత తోరణం కట్టమని కపోతాలను పిలిచినా
నీవు అడుగులదారిలో నా మనసునే తివాచీగా పరిచినా
నీ ఆస్వాదనతోనే అవి గుబాళిస్తాయ మిత్రమా!
- కావ్యాంజలి, కవిత Courtesy -  Andhrabhoomi

నిజమే .. చక్కని పంటపొలాలు, తలలూగించే కొబ్బరి చెట్ల అందాలు, పంట కాలవల అందాలు చెప్పేదేముంది. 
ప్రకృతితో సహజీవనం చేస్తే జీవితం నిజంగా ఆనందమయమే .. అదే భావాన్ని వెలిబుచ్చారు 'ఈనాడు'సంపాదకీయంలో.



"దట్టమైన ముసురులో చలిగాలి రివ్వున తాకుతుంటే- ‘మొయి వలిగొని(ఒంటికి చలేసి) ధాత్రీ పురంధ్రి(భూదేవి) వలిపచ్చని కంబళి కవిచికొన్న విధమున పొలుపుగ చిప్పరువు(చిప్పగడ్డి) గవిసె భూతలమెల్లన్‌’ అన్నాడు కుమార సంభవంలో! భగవంతుడి సృజన వైభవాన్ని ప్రత్యక్షంగా పరికించాలంటే- ప్రకృతిని అనునిత్యం పరిశీలిస్తూ ఉండాలి. నిండుగా కళకళలాడే మహారణ్యాలు, జీవకళ ఉట్టిపడుతూ గలగల పారే నదులు, ఎగసి దూకే సెలయేళ్లు, ఆహ్లాదకరమైన పంటపొలాలు, వాటిపై పున్నమి వెన్నెల సంతకాలు, నిలువెత్తుగా పెరిగి నింగినే ముద్దాడే గిరి వృక్షాలు, పక్షుల కువకువలు, నిడుపైన కొండలు, లోతైన లోయలు, విశాల సాగర తీరాలు... ఈ సమస్త ప్రకృతి సంరంభాన్ని, రాశీభూత దివ్య సౌందర్య విభవాన్ని విద్యారణ్య మహర్షి ‘ఈశ్వర కల్పిత మహాజగత్తు’గా అభివర్ణించారు. ఆ అందాలను ఆస్వాదించాలంటే మనసుకు రుచిమొగ్గలు మొలవాలి. ‘కమలేందీ వరషండ మండిత లసత్‌ కాసార సేవారతిన్‌ గమికర్మీకృతనైకనీవృతుడనై కంటిన్‌...’ అని శ్రీనాథుడు చెప్పినట్లు ప్రత్యేక చిత్తవృత్తితో ప్రకృతిని పరికించగల అభిరుచి విశేషం మనసును ఆవరించాలి. అది వరించిననాడు అల్లసాని పెద్దనకే కాదు, ‘ముహుర్ముహుర్లుఠ దభంగ తరంగ మృదంగ’ లయ గతి మన చెవులనూ సోకుతుంది. ‘విజయుం చేరెడి వన్నెకాడు... మది నావేశించు నెల్లప్పుడున్‌’ అని పోతనతోపాటు మనకూ అనిపిస్తుంది. ప్రకృతితో, దాని సృష్టికర్తతో తాదాత్మ్యస్థితి కలుగుతుంది. ‘ఎటులయినా ఇచటనే ఆగిపోనా’ అని భావకవులు తహతహలాడింది ఆ చిరునామా కోసమే! 

ప్రకృతితో కలిసి నడిచిన రోజులే మనిషికి జీవించిన రోజులు. ఎదుటివారిని మెప్పించడానికో ఒప్పించడానికో వెచ్చించినవన్నీ గడిచిపోతున్న దినాలు. ప్రకృతి సజీవ చైతన్యాన్ని గమనించడం కవులకు ఓ పండుగ. ‘విరివై వెన్నెలవై వికాసపథివై విద్వాణివై వీణవై సిరివై సింజినివై సితాంబుజమవై సీమంతవై సీతవై...’ కనిపించిన గోదావరిని చూసి మురిసిపోయారు మరింగంటివారు. సీతావియోగ దుఃఖంలో రాముడికి అడవి సీతమ్మవారిలా తోచిందన్నారు కొండేపూడి కవి. ‘కమ్ర హసితాస్యమున తిలకమ్ము దిద్ది, శిరమునందున పూవులు తురుముకొనిన జనకజనుబోలు కానన తటమ్ము’ అన్నారాయన. ప్రకృతి దర్శనంతో తమకు కలిగిన సజీవ చైతన్య దివ్యానుభూతిని పాఠకులకూ ప్రసారం చేయడంలో కవులు సిద్ధహస్తులు. ఆముక్తమాల్యదలో ‘తారుణ్యాతిగ చూతనూత్న ఫలయుక్‌ తైలాభిగార స్వనత్‌ ధారా...’ ఇత్యాది గ్రీష్మరుతు వర్ణన పద్యాలు చదివితే- మనకు గొంతెండిపోయి దాహం వేస్తుంది. నన్నయ ‘శారద రాత్రులు’ పద్యం ఆస్వాదిస్తుంటే- ‘సుధాంశు వికీర్యమాణ కర్పూర పరాగ పాండు రుచిపూరములు’ ఎదను హత్తుకొంటాయి. వాల్మీకి వర్షరుతు వర్ణన వింటుంటే- కనురెప్పలు శ్రావణమేఘాలై రాముడి సీతావియోగ దుఃఖాన్ని మన కళ్లలోంచి వర్షిస్తాయి. జీవించే క్షణాలంటే అవే! ‘క్రొందమ్మి రేకులో కురిసిన నునుమంచు అద్దమ్ముపైన అరుణాంశు రేఖ’ను గమనించడం మనసుకు ఆహ్లాదకరమైన అనుభవం. ‘పరువంపు వరిపైరు పనలపై ప్రోవులై మిసమిసల్‌ వోయెడి పసిడి పంటల’ను తిలకించడం కళ్లకు సంక్రాంతి పండుగ. దురదృష్టవశాత్తు ప్రకృతికి, మనిషికి మధ్య దూరం బాగా పెరిగింది. ఎంతగా అంటే- మనుచరిత్ర వర్ణించిన ‘చంపక కురవక పనస నెమ్మి నిచుల దాడిమీ విచికిల ఆమ్ర పాటలీ పూగ కేసర...’ వంటి ఎన్నో జాతుల్లో ఒకటి రెండు మినహా గుర్తించలేనంత! విద్యుద్దీపాలన్నీ ఆరిపోతేగాని వెన్నెల ఉనికి తోచనంత దూరం జరిగాం మనం ప్రకృతికి! 
మనిషిని అనునిత్యం ప్రకృతితో కలిపి ఉంచాలన్నది కవుల తాపత్రయం. మనిషి కేంద్రంగా అల్లుకున్న ప్రతి ప్రబంధంలోను ప్రకృతి వర్ణనలకు తప్పనిసరిగా వారు చోటు కల్పించారు. కణ్వుడి ఆశ్రమంలోకి ప్రవేశించే దుష్యంతుడు ‘సహకారములన్‌(మామిడి చెట్లు) కదళీ తతులన్ ‌(అరటితోటలు) చూచుచు, శుక కోకిల సుస్వరముల్‌ వీనులకు ఇంపెసగన్‌ వినుచున్‌’ సంతోషపడ్డాడు. ఆదికవి మొదలు ఆధునిక కవుల వరకు ఇదే పంథా అనుసరించారు. ‘నిను వీక్షించుచు కూరుచుండుటది అంతే చాలునో తల్లి! బంధు నికాయంబులు చూడ వచ్చినటు, మిత్రుల్‌ చేరి ఆత్మీయ భాషణముల్‌ చేసినయట్లు, సత్కవుల వాచా మాధురుల్‌ విన్నయట్లు...’ గోదావరి ఒడ్డున రికామీగా కూర్చొన్నా చాలు, అది బ్రహ్మానందమే అంటారు బేతవోలు కవి. నిజమే అంటున్నారు బ్రిటన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు. అనారోగ్యం అనిపించినప్పుడు వెంటనే మాత్రలు మింగేయడం కాకుండా, కాసేపు ఆరుబయట పచ్చిగాలి, మట్టి వాసన, పచ్చని పరిసరాలు... ఏదోదాన్ని ఆశ్రయించండి, వెంటనే ఉపశమనం కలుగుతుంది అంటున్నారు ఏండీ జోన్స్‌ అనే ఆ బృంద నాయకుడు. ‘పడిసంబో, తలనెప్పియో, జ్వరమో సంప్రాప్తించుచో వైద్యులన్‌ తడవన్‌ లాభము కల్గినన్‌ కలుగు, దుర్దాంత వ్యధాభారముల్ ‌(తీవ్ర వేదనలు) దాపగుచో... నీ అడుగులు పట్టుటయే రుజాపనయనోపాయంబు’ అన్నారు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి తమ ‘ఆరోగ్య కామేశ్వరి’ శతకంలో! వైద్యశాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందినా రోగం వస్తే మనిషి భగవంతుడిపై భారం వేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో సాధారణ రోగాలకు సైతం మాత్రలు మింగడం, తిరిగి వాటి దుష్ప్రభావాల నుంచి ఉపశమనం కోసం మరో విడత ఔషధ సేవనం మానేసి పచ్చని ప్రకృతితో చెలిమి చేయడం ద్వారా సహజసిద్ధమైన స్వస్థత సాధించడం నిజానికి మంచి ఆలోచనే మరి!" (courtesy ఈనాడు సంపాదకీయం)






18, జులై 2018, బుధవారం

సముద్రాల రాఘవాచార్య

సముద్రాల రాఘవాచార్య - నా పెన్సిల్ చిత్రం.

సముద్రాల రాఘవాచార్య - నా పెన్సిల్ చిత్రం
ఈ రోజు సముద్రాల వారి జయంతి.

రామకథను వినరయ్యా
ఇహపర సుఖముల నొసగే
సీతారామకథను వినరయ్యా

పాట వినపడగానే మనకు తెలియకుండానే భక్తిభావంలో మునిగిపోతుంటాం. ఈ పాట1963 నాటి లవకుశ
చిత్రంలోనిది. అయినా అలాంటి సాహిత్యం మళ్లీ రాలేదంటే అతిశయోక్తికాదు. అంతటి గొప్పపాటను రాసింది
సముద్రాల రాఘవాచార్య. సినిమా రంగంలో సీనియర్ సముద్రాలగా అయన అందరికీ సుపరిచితులు. రామాయణం మొత్తాన్ని కేవలం నాలుగు పాటల్లో చెప్పి తన సాహితీ ఘనకీర్తిని చాటుకున్న గొప్ప రచయిత
సముద్రాల.
సముద్రాల రాఘవాచార్య గుంటూరు జిల్లా రేపల్లెకు సమీపంలోని పెదపులివర్రు గ్రామంలో1902 జూలై 19న లక్ష్మీ తాయారు దంపతులకు జన్మించారు. పండితవంశంలో జన్మించడం వల్ల ఆయనకు బాల్యం నుంచి సాహిత్యంపట్ల ఆసక్తి ఏర్పడింది. దీంతో తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలోనే కవిత్వం రాయడం, చెప్పడం చేసేవాడు. ప్రాచీన ఆధునిక సాహిత్యాలను విస్తృతంగా చదివి 1925లో భాషాప్రవీణ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు.
పి.వి.దాసు నిర్మించిన శశిరేఖా పరిణయం సినిమాకు కొన్ని సన్నివేశాలు రాయడంతో సినీరంగప్రవేశం చేశారు. స్క్రిప్టులు, పాటలు రాయడంతో పాటు సినిమా నిర్మాతగా, దర్శకునిగా, నేపథ్యగాయకుడిగానూ తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. సముద్రాల పూర్తిస్థాయిలో పనిచేసిన తొలి సినిమా కనకతార. చందాల కేశవదాసు రాసిన నాటకాన్ని సరస్వతీ టాకీస్ వారు 1937లో సినిమాగా నిర్మించారు. ఈ సినిమాలో మొత్తం 12 పాటలుంటే ఏడు పాటలు రాఘవాచార్యనే రాశారు. అజ్ఞానంబున ఆశలు బాసీ, ఈ వసంత శోభా కాంచిన నామది పొంగిపోవుగా, ఏల ఈ పగిది తాలిమి మాలీ, కానరా మానరా హింస మానరా, దయారహితమీ దుర్విధి జీవా, దేవుని మహిమ తెలియగ వశమా, వారే చరితార్థులు భూమిన్ పాటలు ఆయన రాసినవే. ఈ సినిమాకు పాటలతోపాటు సంభాషణలు కూడా రాశారు. ఈ సినిమా సమయంలోనే బి.ఎన్.రెడ్డి, హెచ్.ఎం.రెడ్డిలు రోహిణీ పిక్సర్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి గృహలక్ష్మి సినిమాకు రచయితగా పెట్టుకున్నారు. ఆ తరువాత బి.యన్.రెడ్డి రోహిణి నుండి బయటకు వచ్చి వాహినీ సంస్థను స్థాపించారు. అలా వాహిని సినిమాలకు సముద్రాల ఆస్థాన రచయితగా మారిపోయారు. దాదాపు 80 సినిమాలకు వెయ్యి వరకు పాటలు రాసి తన ఖ్యాతిని ఇనుమడింపజేసుకున్నారు.

సానిసదనీపద మపదప మాపదని
మంచి సమయము రారా
ఇది మంచి సమయము రారా
చలమేల జేసేవౌరా
సముద్రాల రాసిన ఈ పాట తెలుగు చలనచిత్ర రంగ చరిత్రలో ఒక మహిళ ఇతరులకు పాడిన తొలి నేపథ్యగీతంగా కీర్తికెక్కింది. పోతన (1942) సినిమా కోసం ఈ పాటను రాశారు. నిజానికి ఈ పాట పల్లవిలో కొంచెం మార్పు చేశారు. మూలంలో రారా సామి నీకు మ్రొక్కేరా అని ఉంటుంది. కానీ చలమేరా ఇంటికి రారా అన్న పంక్తిని చలమేల జేసేవౌరా అని మార్చారు.

తెరతీయగరాదా దేవా
తెరతీయగరాదా దేవా
తన వారూ పరవారలనీ
తరతమ భావములు మానీ
1947లో విడుదలైన పల్నాటి యుద్ధం చిత్రంలోని ఈ పాట చివరిగీతం. రణరంగంలో రక్తపాతాన్ని చూసిన బ్రహ్మనాయుడు, నాగమ్మ పరివర్తన హృదయాలతో రక్తసిక్తమైన చేతులు జోడించి గుడిలో పశ్చాత్తాపంతో చెన్నకేశవుని వేడుకొంటారు. తెరతీయరా అన్న అన్నమయ్య ధోరణిలో గీతాన్ని రాశారు సముద్రాల.
గృహలక్ష్మి సినిమాలోని కల్లుమానండోయ్ బాబూ, కళ్లు తెరవండోయ్ అన్న గీతం రాఘవచార్యకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ పాట ఆతర్వాత కాలంలో వచ్చిన సారా వ్యతిరేక ఉద్యమాల్లో ప్రచార గీతంగా పనికివచ్చింది.

జగమే మాయ బ్రతుకే మాయ

వేదాలలో సారమింతేనయా ఈ వింతే నయా 1953లో విడుదలైన దేవదాసు సినిమా కోసం సముద్రాల రచించిన పాట. భగ్నప్రేమికులైన దేవదాసు పార్వతిల ప్రేమ విఫలమై జీవితం మీద వైరాగ్యంతో తత్వాల్ని జీవిత సత్యాల్ని రంగరించి విషాదంగా ఆలపిస్తాడు. ఈ సినిమా ఆనాడు ఒక సంచలనం. ఇందులోని ప్రతిపాటా నేటికీ అందరి నోళ్లలో నానుతూనే ఉంది.
అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా, అందం చూడవయా ఆనందించవయా, ఓ దేవదా చదువు ఇదేనా, చెలియలేదు చెలిమి లేదు వెలుతురే లేదు ఉన్నదంత చీకటైతే, పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో ఇలా విజయవంతమైన పాటలన్నీ ఆయన కలం నుంచి జాలువారినవే.
కేవలం సంభాషణలు, పాటలు రాయడమే కాకుండా సముద్రాల వినాయకచవితి (1957), భక్త రఘునాథ్ (1960), బభృవాహన (1964) సినిమాలకు దర్శకునిగా, దేవదాసు (1953), శాంతి (1952), స్త్రీ సాహసం (1951) చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. భక్త రఘునాథ్ చిత్రానికి పాటలు కూడా పాడారు. రాఘవాచార్యులను సీనియర్ సముద్రాల అంటే ఆయన కుమారుడు సముద్రాల రామానుజాచార్యులను సముద్రాల జూనియర్‌గా పిలిచేవారు. ఆయన కూడా పలు సినిమాలకు పాటలు రాశారు. ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం నిర్మించిన శ్రీరామకథ సినిమాకు చివరి పాటను రచించిన సముద్రాల రాఘవాచార్య మరుసటి రోజు 1968 మార్చి 16న మరణించాడు.

జననీ శివకామిని జయశుభకారిణి
విజయరూపిణి
అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్నా అమ్మవు నీవే
నీచరణములే నమ్మితినమ్మ
శరణము కోరితినమ్మా భవాని నర్తనశాల (1963) సినిమా కోసం సముద్రాల రాసిన భక్తిగీతం. నేటికి దేవాలయాల్లో విరివిగా వినవచ్చే గీతం.

వందేమాతరం (మాటలు, పాటలు)
సుమంగళి (మాటలు, పాటలు)
దేవత (మాటలు పాటలు)
భక్త పోతన (కథ, మాటలు, పాటలు)
జీవన్ముక్తి (పాటలు)
గరుడ గర్వభంగం (మాటలు )
భాగ్యలక్ష్మి (మాటలు పాటలు)
పంతులమ్మ (మాటలు పాటలు)
స్వర్గసీమ (మాటలు పాటలు)
త్యాగయ్య (మాటలు పాటలు)
యోగి వేమన (మాటలు పాటలు)
రత్నమాల (మాటలు పాటలు)
లైలామజ్ను (మాటలు పాటలు)
కృష్ణావతారం (మాటలు పాటలు)
శ్రీరామకథ (చివరగా రచించిన సినిమా)
తారాశశాంకం (మాటలు,కొన్ని పాటలు)
(చివరగా విడుదలైన సినిమా)

మదన మనోహర సుందర నారి
మధుర ధరస్మిత నయనచకోరి
మందగమన జిత రాజమరాళి
నాట్యమయూరి అనార్కలి
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
ఒక సంగీతభరిత గీతం. ఇది అనార్కలి చిత్రం (1955) కోసం సముద్రాల
రచించింది. మొఘల్ రాజు అక్బర్ దర్బారులో నర్తకి అనార్కలి అద్భుతంగా నాట్యం చేస్తుంది. ఆశ్చర్యచకితుడైన యువరాజు సలీం ఆమెను ప్రేమిస్తాడు. అనార్కలి సినిమాకు చాలా కీలకమైన పాటకోసం ఖవ్వాలి బాణిలో ఉత్తర హిందుస్తానీ తరహా కథక్ నాట్యంతో దీన్ని చిత్రీకరించారు. అద్భుత ప్రేమ దృశ్యకావ్యంగా ఈ సినిమా నిలిచిపోయింది.

జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకుల సోముడు ఆ రాముడే
లవకుశులు.. వాల్మీకి రచించిన రామాయణాన్ని గానం చేస్తూ ఆయోధ్య చేరి రాజవీధిలో గానం చేసే సందర్భంలోనిదీ గీతం.
లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలో
తల్లి దీవెన తాతయ కరుణ వెన్ను కాయగా వెరువగనేలా
హయమును విడువుముగా
రాముడి అశ్వమేథ యాగానికి చెందిన అశ్వాన్ని బంధించి రాముని సోదరులు సైన్యంతో గానం చేసే సందర్భంలోనిది.
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా
ఈ పాటలన్నీ కూడా లవకుశ(1963) సినిమా కోసం సముద్రాల రాసిన పాటలు. రామయణాన్ని ఈ నాలుగు పాటల్లో వివరించారాయన.


(వ్యాసం : courtesy 'నమస్తే తెలంగాణ' పత్రిక)

నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...