29, జూన్ 2018, శుక్రవారం

పొగాకు - పగాకు



వ్యాసానికి నా బొమ్మలు
పొగాకు- పగాకు (అంతర్జాలం నుండి సేకరణ - ఎవరు రాశారో తెలియదు. వారికి నా ధన్యవాదాలు)
'చుట్ట కాల్చబట్టే కదా దొరలింత గొప్పవాళ్లయినారు. చుట్ట కాల్చని యింగ్లీషువాణ్ని చూశావూ? చుట్ట పంపిణీ మీదనే స్టీము యం త్రం వగయిరా తెల్లవాడు కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబణ్ణా?' అంటూ కన్యాశుల్కంలో గిరీశం సెలవిచాడు. 'మీవల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే' అని వెంకటేశం తక్కువ చేసి మాట్లాడేటప్పటికి 'చుట్టకాల్చడంలో మజా' ఏమిటో ధర్మసూక్ష్మం వివరించేందుకు బృహన్నారదీయం దాకా వెళ్లిపోతాడు గిరీశం. ఖగపతి అమృతం తెచ్చేటప్పుడు పొంగి ఓ చుక్క భూమ్మీద రాలితే దాన్నుంచి పొగచెట్టు పుట్టిందంటూ గిరీశం దాని హిస్టరీ వివరిస్తాడు. అందుకే శ్రీశ్రీ 'ఖగరాట్‌ కృషి ఫలితంగా/ పొగాకు భూలోకమందు పుట్టెను గానీ/పొగచుట్టలెన్నియైనను/ సిగరెట్టుకు సాటిరావు సిరిసిరిమువ్వా!' అని పద్యమే చెప్పారు. ఈ చుక్క భూమ్మీద పడిందన్నాడే తప్ప భారతదేశంలోనే పడిందని చెప్పలేదు. కాబట్టి పోర్చుగీసు వాళ్లు క్రీస్తుశకం 1508లో టొబాకోని మన దేశం తీసుకువచ్చారని మనం నమ్మవచ్చు. పొగవచ్చేది, పొగనిచ్చేది కాబట్టి దానికి మనవారు పొగాకు అని పేరుపెట్టుకున్నారు. పొగాకును పగాకుగా పిలిచినా.. దీనికెంతో పరిణామక్రమం ఉంది. ఇప్పుడు సిగరెట్టు వెలిగించి గుప్‌గుప్పుమంటూ పొగమేఘాలు సృష్టించే పొగరాయుళ్లకు కొదవలేదు. వేళ్ల చివరలు చురుక్కుమనేదాకా సిగరెట్లను ఉఫ్‌మంటూ ఊదేయడం దమ్ము పీల్పు గాళ్లకు కొట్టినపిండి! సమయం, సందర్భం, స్థలంతో పనిలేకుండా సిగరెట్లు వెలిగించే చైన్‌స్మోకింగ్‌లు మనలో చాలామంది ఉన్నారు. డిమాండును గుర్తిం చడంలో మన ప్రభుత్వాలకు మించినవేవీలేవు. ఏటా బడ్జెట్‌లో సిగరెట్లపై భారీ వడ్డనలతో ఖజానాకు పెద్దమొత్తం జమచేసుకొంటున్నాయి. తొలినాళ్లలో జరిగిన అచ్చు తప్పు ఇప్పుడు పాలకులకు వరంగా మారింది. సిగరొత్తులు అని ఉండాల్సిందిపోయి సిగరెట్లుగా పడింది.. పొగాకు రాకముందే మనకు పొగపీల్చే అలవాటు ఉందనే చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. అక్బర్‌ కాలంలోనే ధూమపా నంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పొగాకును ప్రమాదకరమైన కలుపుమొక్కగా జహంగీర్‌ పేర్కొన్నాడు. కొందరు మొగలాయి పాదుషాలు పొగాకు సేవనాన్ని నిషేధించి నట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి.


బ్రిటీష్‌వాళ్ల నుంచి మనవాళ్లు ముక్కుపొడుం పీల్చడం నేర్చుకున్నారు.. అదీ పండితప్రకాండులే లెండి. ఇంగ్లీషువాళ్లకు సంబంధించినదేదైనా గొప్పదేనని సురేంద్రనాథ్‌ బెనర్జీ అంతటి వాడు శ్లాఘించాడు ఏ నేషన్‌ ఇన్‌ ది మేకింగ్‌ పుస్తకంలో. అందుకే 'నస్యం పండిత లక్షణం' అన్నారు. వార్ని చూసి మధ్యతరగతి జీవులు కూడా పొడుండబ్బా తీసి ఓ పట్టుపట్టేవారు. అగ్నిహోత్రావధాన్లు పొడుం కోసం కొట్లో పొగాకు నిల్వ చేసేవాడు. కాలక్రమంలో ముక్కుపొడుంను సిగార్స్‌, చుట్టలు చుట్టచుట్టేశాయి. కోవెలలో చుట్టకాల్చడంలో ఉన్న మజా ఏమిటో కడుపునిండిపోయేటట్టు చెబుతాడు గిరీశం. చర్చిల్‌నో, చాసోనో గుర్తుకు తెచ్చుకొంటూ దర్జాగా చుట్టకాల్చే భూస్వాములు, పెత్తందారులు లేని ఊరుండేది కాదు. ఆ తర్వాత చుట్టల పరువు కూడా లుంగచుట్టుకుపోయి సిగరెట్లు వచ్చాయి. 'సరదా సరదా సిగరెట్టూ యిది దొరల్‌ తాగు భల్‌ సిగరెట్టు' అంటూ సినీకవి గానం చేశారు. ఈవేళ సిగరెట్టు ముట్టించని కుర్రోళ్లు చాలా అరుదుగానే కని పిస్తారు. కుర్రోళ్లే కాదు, పబ్బులు, క్లబులు తిరిగే అమ్మాయిలూ మాకు దమ్ములాగే దమ్ముందని పోటీపడుతున్నారు. అయితే ధూమపానం దురలవాటన్నారు మన పెద్దలు. మృత్యుమార్గం అంటున్నారు నేటి వైద్యనిపుణులు. అయినా సిగరెట్‌, బీడీ, చుట్టలకు గిరాకీ పెరుగుతుందే తప్ప తగ్గడంలేదు. 'పదపడి ధూమ పానమున బ్రాప్తములౌ పదమూడు చేటులన్‌' అంటూ పూర్వకవి సిగరెట్ల వల్ల వచ్చే పదమూడు ఆపదలను వివరించారు. యువతీయువకులకు సిగరెట్‌ ఓ వ్యసనంగా మారింది. దీన్ని వ్యసనంగా మన పూర్వీకులు ఎంచలేదు. 'వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రల్లదంబును దండంబు పరుసదనము' అంటూ వ్యసనాలను ఏడు రకాలుగా విభజించి సప్తవ్యసనాలు అన్నారు. ఇప్పుడు సప్త బదులు అష్ట వ్యసనాలు అని చెప్పడం బాగుంటుంది. అదీ ఎంతగా మారిందంటే..'సీమ దేశాన బుట్టి మా దేశ మొచ్చినావు, ఉత్తర భూములందు ఉదయమయినావు, దక్షిణ భూములకొచ్చి ధన్యుల మము చేసినావు, నీ మహిమ వర్ణింప నెవరితరమమ్మా' అంటూ పొగాకును వేనోళ్ల పొగిడేంతగా! సిగరెట్టు వ్యసనం ఎంతటి ప్రమాదకరమో ఓ చిన్న ఉదాహరణ చూడండి. జమ్మూ- కాశ్మీరు ఆరోగ్యశాఖ రిటైర్డు డైరెక్టర్‌జనరల్‌ డాక్టర్‌ అలీబక్ష్‌ 30 సిగరెట్లు కొనుక్కోవడానికి లక్షన్నర రూపాయలు తగలేశారు. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఆయన్ని కాశ్మీరు తీవ్రవాదులు కిడ్నాప్‌ చేసి రెండు రోజులు బందీ చేశారు. సిగరెట్‌ కాల్చకుండా నిమిషం బతకలేని అలీబక్ష్‌ తీవ్రవాదులతో ఓ బేరం కుదుర్చుకున్నారు. ఒక్కో సిగరెట్‌కు రూ.5000 చెల్లించి తీవ్రవాదుల నుంచి సిగరెట్లు పొందారు. ఆయన 30సిగరెట్లు కాల్చి లక్షాయాభైవేలు వదిలించు కున్నారట. మనవాళ్ల గొప్పలు ఇలా ఉన్నా.. సిగరెట్లు మాత్రం జనం ఆరోగ్యానికి పొగబెడుతున్నాయి. ముందు సరదాగా, తర్వాత వ్యసనంగా మారి ఇంటిని, వంటిని కాల్చేసుకుంటున్నవారి సంఖ్య దేశంలో నేడు కోట్లలోనే ఉంది.
ముళ్లపూడి 'తనను తాను చంపుకొంటూ, ఎదుటివాణ్నీ చంపడానికి మనిషి కనిపెట్టిన మారణాయుధం సిగరెట్‌' అని ఓ డైలాగ్‌ వదిలారు. ఖజానా నింపుకోడమే లక్ష్యంగా ఉన్న పాలకులు మాత్రం సిగరెట్‌ పెట్టేలపై 'సిగరెట్‌ కాల్చడం ఆరోగ్యానికి హానికరం' అని చట్టబద్ధ హెచ్చరికలతో సరిపెడు తున్నారు. మన దేశంలో సిగరెట్‌, బీడీ, చుట్ట, హుక్కా తాగినా.. గుట్కా, పాన్‌ పరాగ్‌, ఖైనీ, జర్దా వంటివి నమిలినా, మరేవైనా పొడిరూపంలో పీల్చినా.. వెరసి పొగబారిన పడి ప్రాణాలు కోల్పో తున్న వారిసంఖ్య ఏటేటా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం దేశంలో నమోదవుతున్న కేన్సర్‌ కేసుల్లో 66శాతానికి పొగాకే కారణం. గుండె సంబంధిత వ్యాధులతో చని పోయేవారిలో 85శాతం ధూమపానమే కారణమని వైద్యపరిశోధన మండలి తేల్చింది. నోటి కేన్సర్‌ మరణాల్లో 90శాతం పొగతాగడం, ఆ ఉత్పత్తులు నమలడమే కారణమని ప్రజారోగ్య పౌండేషన్‌ పేర్కొంది. పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా 60లక్షలమంది, మన దేశంలో పది లక్షలమంది విగతజీవులవుతున్నారు. పొగ పీల్చేటప్పుడు గుండె నిమిషానికి పదినుంచి20సార్లు ఎక్కువగా కొట్టుకుంటుంది. అంతేకాదు, ప్రతిసారీ 15నుంచి 20శాతం వరకు రక్తపోటు పెరుగుతుంది. పొగాకు ప్రమాదాన్ని గుర్తించిన ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని శిక్షార్హ నేరంగా ప్రకటించినా, అది అమలు కావడంలేదు. గుట్కాపై చాలా రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాయి. పొగాకు ఉత్పత్తుల విక్రయం, వినియోగంపై పంజాబ్‌, చండీగఢ్‌లో నిషేధించారు. దేశంలో మొట్టమొదటి పొగాకు రహిత జిల్లాగా కేరళలోని కొట్టాయం నిలిచింది. నాగాలాండ్‌ రాజధాని కోహిమా ప్రాంతంలోని గరిపెమా, హర్యానాలోని శంకరపుర గ్రామాల్లో కూడా పొగతాగడంపై ప్రజలే స్వచ్ఛందంగా నిషేధం విధించుకొన్నారు. పగ తగదంటూ 'భారతం'లో చెప్పిన పద్యాన్ని కొద్దిగా మార్చి 'పొగ అడగించుటెంతయు శుభంబు..' అని చెబితే ధూమపానప్రియులకు నచ్చడంలేదు.
( సేకరణ - విశాలాంధ్ర newspaper 2nd April 2016)

25, జూన్ 2018, సోమవారం

నేరెళ్ళ వేణుమాధవ్


నేరెళ్ళ వేణుమాధవ్, తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ - నా పెన్సిల్ చిత్రం

నేరెళ్ళ వేణుమాధవ్ ( డిసెంబరు 281932 - జూన్ 192018 ) తెలంగాణకు చెందిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు.

వేయి గొంతులు వీరి నోట వినిపించిన మహనీయుడు. ఈయన గళంలోంచి వినిపించని స్వరం లేదు. ద్వని అనుకరణ (మిమిక్రీ) కళకి జవం, జీవం పోసిన కళా పితామహుడు. ఈయన వ్రాసిన కళాంశాలు విశ్వవిద్యాలయలలో పాఠ్యాంశాలుగా వెలిశాయి. అరవై ఐదేళ్ళ పాటు మిమిక్రీ కళకు దన్నుగా నిలిచారు. ఈ విద్యే వారికి ఉపాది, జీవిత పరమావది ఐపోయింది. దాని ప్రాపకమే ఏకైక లక్షమైయ్యింది. 1947 లో మొదలైన ఈ సుధీర్ఘ ప్రవాహం నేటికి కొనసాగుతోంది. ఇలాటి అపూర్వ ఘనత సాధించిన తెలుగు తేజం, ‘ద్వని అనుకరణ సామ్రాట్’ పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు. 

న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి లో మిమిక్రీ ప్రదర్శన చేసి " స్టాండింగ్ ఒవేషన్ " అందుకున్న అద్బుత కళాకారుడు. ఈ ప్రాగణంలో ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయుడు. వీరి ప్రతిభను, కళకు చేసిన సేవలను గుర్తిస్తూ తిరుపతిలో గజారోహణం చేశారు. కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు బెజవాడలో తన రచనను వీరికి అంకితమిచ్చి గౌరవించారు. వేణుమాధవ్ గారిని అభివర్ణిస్తూ " హి ఈస్ సిలబస్ అండ్ కరికులం ఫర్ దిస్ ఆర్ట్ " అని ఓ మహానుభావుడు వ్యాఖ్యానించాడు.

వేణుమాధవ్ గారు " టెన్ కమేండ్ మెంట్స్ " మీద చేసిన మిమిక్రీ వీరికి ప్రపంచ ఖ్యాతి తెచ్చి పెట్టింది. కెన్నెడీ, సర్వేపల్లి రాధకృష్ణన్ గారి సంభాషణా ప్రక్రియ వీరి కళా ప్రతిభను అద్దం పడుతుంది. ఈయన మిమిక్రీ మీద " మిమిక్రీ కళ " అన్న పుస్తకం వ్రాశారు. ఈ పుస్తకం ఈ క్షేత్రాంశంలో విలువడ్డ ప్రప్రధమ గ్రంధం "మిమిక్రీ కళకు ఇది పెద్ద బాల శిక్ష " అని చెప్పవచ్చు. ఇది తెలుగు వారందరికీ గర్వ కారణం.

ఈయన గళంలోంచి వినిపించని స్వరం లేదు. హేమా హేమీలందరిని తనదైన శైలిలో చిత్రీకరించారు. అటు నేహ్రూ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభాయి పటేల్, వి వి గిరి, ఇందిరా గాంధి, ప్రముఖ నటులు నాగయ్య, కంచు కంఠం కొంగర జగ్గైయ్య, ఎన్ టి ఆర్, ఎస్ వి రంగా రావు, నటీమణి భానుమతి తదితరులు ఉన్నారు. 

ప్రముఖ హిందీ చలన చిత్ర నటుడు సౌరాభ్ మోడి నా గొంతుని అనుకరించడం చాలా కష్టం అన్నాడట వేణుమాధవ్ గారు తనదైన రీతిలో అనుకరించి ప్రత్యుత్తరం ఇచ్చారు. సినీ నటుడు రాజ్ కపూర్ కూడా ఆయన సంభాషణలు విని మురిసిపోయారు. 1972 లో రాష్ట్రపతి నిమంత్రణ మేరకు రాష్ట్రపతి భవన్లో జరిగిన సభలో ప్రముఖ కవి, కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి బాణిలో పద్యాలు వల్లె వేశారు. సరస్వతి గారినీ, అందరిని అబ్బుర పరిచారు. "మున్నూరు పదహారు" బహుమతిగా పొందారు. అంతే కాదు ఇంత ప్రతిభ కనపరిచిన వేణుమాధవ్ గారికి పద్మశ్రీ గానీ పద్మభూషణ్ గానీ ఇవ్వాలని ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు. 

హరీంద్రనాధ్ ఛటోపాధ్యాయ వద్ద ప్రదర్శన చేశారు, మన్ననలను అందుకున్నారు. హరీంద్రనాధ్ ఛటోపాధ్యాయ వేణుమాధవ్ గారి మీద పద్యం వ్రాశారు. 

అబ్బూరి, గగ్గయ్య, రఘురామయ్య గారి పద్యాలు, దేవా హనుమయ్య, సూరి భగవంతం, కాటూరి వెంకటేశ్వరరావు, ముల్క్రాజ్ ఆనంద్, సుభాష్ చంద్ర బోస్, ముక్కామల, ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్, రేలంగి, రమణా రెడ్డి, కృష్ణా మీనన్, సర్వేపల్లి, సౌరాబ్ మోడీ, ప్రిథ్విరాజ్ కపూర్, రాజ్ కపూర్, ఎం ఎస్ సుబ్బు లక్ష్మి, సూరి బాబు, కాకాని వెంకటరత్నం, గౌతు లచ్చన్న, హాషీం, జూపూడి, భవనం వెంకట్రాం, ఎం జి ఆర్, కరుణానిధి ఇలా మరెందరినో తనదైన బాణిలో సాక్షాత్కరింపజేశారు. 

"నా లాగా ఎవరైనా అనుకరిస్తే నేను సన్మానిస్తాను" అని అన్నారు ప్రముఖ నటి భానుమతి గారు. భానుమతి లా మాట్లాడ్డమే కాకుండా, "ఓహో హొహో పావురమా " పాట కూడ పాడేరు, గౌరవం దక్కించుకున్నారు. ఆర్టిస్టు కి ఆరోహణం, అవరోహణం తెలిసి ఉండాలి అని వ్యాఖ్యానించారు డాక్టర్ వేణుమాధవ్ గారు. ఇవి తెలిస్తే ఎవ్వరి గళాన్నైనా అనుకరించవచ్చు అని వివరించారు. 

ప్రముఖ నటుడు చిత్తూరు నాగయ్య గారు నేరెళ్ళ వేణుమాధవ్ గారికి స్పూర్తి. తొలి రోజుల నుండి నాగయ్య గారంటే వీరికి మిక్కిలి ప్రీతి. ఒక్క మాటలో చెప్పాలంటే చిత్తూరు నాగయ్య ఆయన్ని ఆవహించాడు. 

నిజాం కళాశాల ఆచార్యుడు శ్రీ బి పి రాం నర్స్ గారు (శ్రీ బి పి ఆర్ విట్ఠల్ గారి తండ్రి), అరవై రూపాయలు బర్సారి ఇచ్చి ఇంగ్లిషు సినిమాలు చూడ్డానికి ప్రోత్సాహించారు. ఇది వేణుమాధవ్ గారి సాధనకు బాగా తోడ్పడింది. " రాం నర్స్ గారు నన్ను కొడుకులా చూసుకున్నారు ", అని ఓ సందర్భంలో చెప్పుకున్నారు శ్రీ వేణుమాధవ్ గారు. రాం నర్స్ గారిని కలవడంతో నా జీవితానికి ఓ మలుపు వచ్చింది, ఓ దిశామార్గం చూపించింది. " నన్ను ఒక మనిషిగా తీర్చి దిద్దారు " అని వివరించారు డాక్టర్ వేణుమాధవ్ గారు. ఇది వారి వ్యక్తిత్వ, సంస్కార గుణాలని చాటుతోంది. ఈ ఉదాహరణ తెలుగు సాంప్రదాయ పద్ధతికి నిలువుటద్దం పడుతోంది. 

మీరు నా రోల్ మోడల్ (ఆదర్శం) అని రాధాకృష్ణన్ గారికి చెపితే నాగయ్య గారిని రోల్ మోడల్ చేసుకోండీ అని ప్రత్యుత్తరం ఇచ్చారట. అలా చెప్పి నాగయ్య గారి రెండు చేతుల్ని తీసుకుని కళ్ళకి అద్దుకున్నారట. గౌరవం, పరస్పర ప్రేమాభిమానానికి ఇది చక్కటి ఉదాహరణ. నాటి రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇంగ్లిషు విని విని విసిగిపోయాను. తెలుగులో మాట్లాడండి అని అన్నారట. తెలుగు అంటే వారికి అంత ప్రీతి. వేణుమాధవ్ గారి ద్వని అనుకరణ మాయాజాలాన్ని చూసి మంత్ర ముగ్దులైపోయారు.

మిమిక్రీ అన్న పదానికి నిర్వచనంగా నిలిచారు డాక్టర్ వేణుమాధవ్ గారు. ఆరు దశాబ్దాల పాటు భారత దేశాన్నే కాదు, ప్రపంచాన్నే అబ్బుర పరచిన అపూర్వ వ్యక్తి. ఇష్టులు వీరిని " ఎన్ వి " అని కూడా సంభోదిస్తూ ఉంటారు. 

కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనరాయణ గారు బెజవాడ సభలో "శివదర్పణం" నేరెళ్ళ వేణుమాధవ్ గారికి అంకితమిచ్చారు. అంతటి గౌరవం అందుకున్న ఘనత వీరిదే. 

వీరి విశిష్టత: 

వేణుమాధవ్ గారి ప్రత్యేకత ఏంటీ అంటే వీరు ఎవ్వరినీ యదాతథంగా అనుకరించరు. ఈ కళలో అఖండమైన ప్రావీణ్యం సంపాయించారు. అవతల వ్యక్తికాని, వస్తువుకు సంబందించిన విషయం కాని కూలంకషంగా అధ్యయనం చేసి, సమయ, సందర్భ, అనుభవ సారాన్ని తీసుకుని తనదైన బాణికట్టి వ్యక్త పరుస్తారు. అది ఎంతటి వారినైనా కదల్చి వేస్తుంది. " స్లాఘో " అనక మానరు. 

జాన్ కెన్నడి - డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సంబాషణ విని తీరాల్సిందే. ఎంతో ఆహ్లాందంగా ఉండడమే కాకుండా వేణుమాధవ్ గారి సమయ స్పూర్తి, వివరించే ధోరణి సుస్పష్టంగా కనిపిస్తాయి. దాదాపు అందరు హాలివుడ్ ఆర్టిస్ట్ లని అనుకరించారు. 

అమెరికాలో అడిగారు మిమిక్రీ ఎప్పుడు పుట్టింది? అని " మీ దేశం పుట్టక ముందు పుట్టింది మిమిక్రీ " అని చెప్పారు. 
రామాయణ కాలం నుండి ఉంది, అని వీరి ఉవాచ. 

రమణాచారి గారి కృషితో మిమిక్రీ అంశం తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రణాళికా బద్దమైన పాఠ్యాంశాలతో వెలసింది. తెలుగు విశ్వవిద్యాలయం మిమిక్రి లో డిప్లొమా బోధన మొదలు పెట్టి ఇప్పటికి తొమ్మిదేళ్ళు అయ్యింది. దాదాపు ఓ దశాబ్దం నుండి విద్యార్ధులకు శిక్షణ (డిప్లొమా) ఇస్తున్నారు. డాక్టర్ వేణుమాధవ్ గారు ద్వని అనుకరణ (మిమిక్రీ) మీద మిమిక్రీ కళ పుస్తకం వ్రాశారు. ఇది ఈ క్షేత్రాంశం మీద వెలువడ్డ ప్రప్రధం గ్రంధం. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇదే మాదిరిగా శిక్షణా తరగతులు ప్రవేశ పెట్టారు.

" మిమిక్రీ ఆర్టిస్ట్ జర్నలిస్ట్ కూడా అయి ఉండాలి " అని తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారు. విషయాన్ని యథాతథంగా అనుకరించడం కాదు, సమయం, సందర్భం, సన్నివేశం, హావ భావాలు, నిగూడ, నిషిప్తార్ధలు కూడా గ్రహించాలి. వాటిని ఆకళించుకుని తమ బాణిలో వ్యక్తం చేయాలి. అప్పుడే అది బాగా రాణిస్తుంది అని వారి ఉపవాచ. 

జననం, బాల్యం, చదువు:

డిసెంబరు 28, 1932 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వరంగల్ లో జన్మించారు. ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. ఆంగ్లం, తెలుగు, హిందీ భాషలలో అనర్ఘళంగా మాట్లాడ గలరు. వీరి తండ్రి ఆరు భాషలలో ప్రావీణ్యులు. ఆ రోజులలో ఆంగ్లంలో దొరలతోనే మాట్లాడిన ఉదంతాలు ఉన్నాయట. 

పదహారవ ఏట నుండి మిమిక్రీ చేయడం మొదలు పెట్టారు. ఈ విద్యే వారికి ఉపాది, జీవిత పరమావది ఐ పోయింది. 1947 లో మొదలైన ఈ కళ, నేటి దాకా కొనసాగుతూనే ఉంది; ఈ ప్రయాణంలో అది ఎంతో పరిణితి చెందింది. శబ్దాలు, ద్వనులు, మాటలు, గుర్రపు డెక్క శబ్దాలు, పశుపక్ష్యాదుల ధ్వనులు, బుడ బుక్కలవాడు, ఇలా ఒకటేమిటి, ఏది పడితే దాన్ని అనుకరిస్తూ, అభినయిస్తూ నిరంతరం అభ్యసిస్తూ, తన ఊహతో సన్నివేశాలని, సందర్భాలని ఆకళించుకుని వాటిని మరింత మెరుగుపరుస్తూ వ్యక్తపరుస్తూ తనదైన శైలిని అలవరచుకున్నారు." ఉత్తినే ఎవ్వరినైనా అనుకరిస్తే అది ఆనందమే ఇస్తుంది కాని, ప్రయోజనం ఉండదు అని సెలవిచ్చారు నేరెళ్ళ గారు. ఓ సూక్ష్మాన్ని ఇంత సునాయాసంగా చెప్పగలరు. 

బి ఏ ఉర్దూ మాధ్యమంలో పూర్తి చేసారు. దీనితో వేణుమాధవ్ గారికి హింది మీద బాగా పట్టు ఏర్పడింది. వేణుమాధవ్ గారికి నలుగురు పిల్లలు; కూతురు డాక్టర్ లక్ష్మి తులసి కూడా మంచి మిమిక్రీ ఆర్టిస్టు. 

నాగయ్య గారి " భక్త పోతన " (1947) చూసి బాగా ప్రభావితమైయ్యారు వేణుమాధవ్ గారు. " పద్యానికి ఒక నూతనత్వం తీసుకు వచ్చారు. నాగయ్య గారు " అని స్లాఘించారు వేణుమాధవ్ గారు. 

బి ఎన్ రెడ్డి గారు మీరు ఓ వేషం వెయ్యాలి అని పట్టు పట్టినప్పుడు సినిమాలో వేషం వేశారు. 10 - 12 సినిమాలలో అభినయించారు. నాటి ముఖ్యమంత్రి పీ వి నరసింహా రావు గారి అనుగ్రహంతో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. సినీ నటుడు బాల్రాజ్ సహాని వేణుమాధవ్ గారికి మంచి మిత్రులు. 

ఆర్టిస్ట్ కి అహంకారం ఉండకూడదు; అణుకువ ఉండాలి; అప్పుడే వారి జీవితం సాఫల్యమవుతుంది అని వారి మనోగతాన్ని చాటారు. 

అవార్డులు, గౌరవాలు, గుర్తింపులు:

2001 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అందుకున్నారు
శ్రీ రాజ లక్ష్మి ఫౌండేషన్ అవార్డు (1981)
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ గౌరవం అందుకున్నారు
కాకతీయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్
ఇందిరా గాంధి ( ఇగ్నౌ )విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్

ఐ వి చలపతిరావు గారు వేణుమాధవ్ గారి మీద ఓ పుస్తకం వ్రాశారు. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు విశ్వ విఖ్యాత మిమిక్రీ సామ్రాట్ వేణుమాధవ్ పుస్తకం వెలువడించారు.

వీరి ధోరణి, సభా మర్యాధలు నేటి తరం అలవరచుకోవాల్సిందే. సరుకుతో పాటు ఏ సందర్భంలో, ఏమి చెప్పాలి, ఎంత చెప్పాలి; ఎంత వరకు చెప్పాలి; వేణుమాధవ్ గారిని చూసి నేర్చుకోవాల్సిందే. అంత పరిణితి చెందిన వ్యక్తిత్వం వీరిది. . వీరి శిష్యులు మిమిక్రీ శ్రీనివాస్, హరికిషెన్, ఈ కళను మరింత ముందుకు తీసుకు పోతున్నారు. వీరి శిష్య ప్రశిష్యులు కూడా ఈ ప్రయత్నంలోనే ఉన్నారు. 
జూన్ 19, 2018 న వీరి గళం మూగబోయింది.  ధ్వన్యనుకరణ విద్యకి ఓ కొత్త ఒరవడి సృష్టించిన వేణుమాధవ్ గారు సదా స్మరణీయుడు. 


20, జూన్ 2018, బుధవారం

యద్దనపూడి సులోచనారాణి - Yaddanapudi Sulochanarani

 యద్దనపూడి సులోచనారాణి - నా పెన్సిల్ చిత్రం


యద్దనపూడి సులోచనారాణి తెలుగులో పాపులర్ నవలా ప్రపంచంలో ఓ కలికితురాయి. మధ్యతరగతి మహిళామణుల ఊహలను, వాస్తవ జీవితాలను తన నవలల్లో అద్భుతంగా చిత్రించారు. ఎక్కడా నేల విడిచి సాము చేయకుండానే తనదైన శైలితో అరుదైన రచనలు చేశారు. ముఖ్యంగా 1970వ దశకంలో ఆమె రచనలు సినీ ప్రపంచాన్ని కూడా ఓ ఊపు ఊపాయి. స్త్రీలు కాల్పనిక సాహిత్యంలో మేటిగా రాణిస్తున్న కాలంలో సులోచనా రాణి తనదైన సొంత మార్గంలో ఎన్నో నవలలు రాశారు.

యద్ధనపూడి సులోచనారాణి 1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు. తను పరిశీంచిన జీవితాలను వస్తువులుగా తీసుకొని మొదట రచనలు చేయడం ప్రారంభించారు. తర్వాత కాల్పనిక జగత్తుకు అనుగుణంగా, మారుతున్న ప్రజల జీవిన విధానాల్లో వచ్చిన మార్పులను బట్టి, వారి ఊహల్లోంచి, కలల్లోంచి వచ్చిన పాత్రలను సృష్టించారు. అయితే వాటిని సజీవపాత్రలకు దగ్గరగా ఉండే విధంగా మలిచారు. వీరి నవలల్లో, కథల్లో భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు, స్త్రీల విషయానికి వస్తే మధ్య తరగతి అమ్మాయిల వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం, హుందాతనం, మాటకారితనం కనిపిస్తాయి. ఎక్కువగా కోటీశ్వరుడైన నాయకుడు, కిందిస్థాయి నాయిక, విరిద్ధరి మధ్యా అంకురించే ప్రేమ. ఇదే వీరి నవలా సూత్రం. ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిజాతం, ఆశల శిఖరాలు, అమరహృదయం, మౌన తరంగాలు, దాంపత్యవనం, ప్రేమ, వెన్నెల్లో మల్లిక, కలల కౌగిలి, గిరిజా కళ్యాణం... ... ఇలా సుమారు 40 నవలల వరకూ రాశారు.

వర్ణనల విషయానికి వస్తే వీరి నవలల్లో ఇళ్లు, పరిసరాలు, ప్రకృతి, మానసిక వర్ణనలు సహజత్వాన్ని, సందర్భాన్ని, సన్నివేశాన్ని బట్టి సాగుతాయి. ఇవి ఎక్కువ ప్రచారం పొందడానికి కారణం- మెజారిటీ ప్రజల జీవన విధానాలను, అనుభూతులను పొందుపరచడమే. వీరి నవలా పాత్రలు విచిత్రమైన మానసిక సంఘర్షణకు లోనవుతాయి. కొద్ది సంతోషాన్ని పొందగానే వెంటనే దుఃఖానికి లోనవుతాయి. అందుకేనేమో బహుశా సాధారణ ప్రజల జీవితాలకు ఇవి దగ్గరయ్యాయి. ధైర్యం - అధైర్యం, ప్రేమ - కోపం, పేదరికం - సంపద, శాంతి - అశాంతి, ఆశ -  నిరాశ... ఇలాంటి సహజాతాల మధ్య వీరు సృష్టించే పాత్రలు తలమునకలవు తుంటాయి. చదివే పాఠకులకు ఆసక్తిని, ఉత్కంఠను కలిగిస్తుంటాయి.

యద్దనపూడి సులోచనారాణి తొలిసారిగా చదువుకున్న అమ్మాయిలు చిత్రం ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1965లో మనుషులు - మమతలు సినిమాకు కథను అందించారు. తర్వాత వీరు రాసిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, ఛండీప్రియ, ప్రేమలేఖలు, విచిత్రబంధం, బంగారుకలం లాంటి నవలలు చలనచిత్రాలుగా వచ్చాయి. అయితే సెక్రటరీ మాత్రం ఓ లెజండ్ గా మిగిలిపోయింది. ఆ రోజుల్లో ప్రతి యువకుడు ఓ రాజశేఖరంలా, ప్రతి యువతీ ఆత్మాభిమానం గల జయంతిలా ఉండాలనుకునే వారు. మీనా నవల పత్రికలో ధారావాహికగా వచ్చింది. పేరును పాఠకులే నిర్ణయించారు. చివరకు మీనా నవలను 1973లో విజయనిర్మల దర్శకత్వం వహించి సినిమాగా తీసింది.

సులోచనారాణి ఎక్కువ ప్రేమ కథలనే రాశారు. ఆత్మాభిమానం గల ఆడపిల్లలను తన నాయికలుగా ఎన్నుకున్నారు. ధనవంతుల యువకులను నాయకుడిగా చేశారు. వీరి రచనలు నేటికీ టీవీలలో ధారావాహికలుగా వస్తూనే ఉన్నాయి. ప్రముఖ ఛానల్లో వచ్చిన రాధ మధు సీరియల్ కథ వీరిదే. నేటికీ చాలామంది పాఠకుల హృదయాల్లో వీరి నవలలు నిక్షిప్తమయి ఉన్నాయి. చాలామంది పాఠకులు నేటికీ వీరి రచనలను విస్తృతంగా చదువుతున్నారు. 
సులోచనారాణి మే 21, 2018 సంవత్సరంలో కాలిఫోర్నియా, అమెరికాలో స్వర్గస్తులయ్యారు.

(సేకరణ - ఇక్కడా అక్కడా)


(సేకరణ - ఇక్కడా అక్కడా)



14, జూన్ 2018, గురువారం

దుఃఖ మేఘ మల్హరి


దుఃఖ మేఘ మల్హరి - కవిత courtesy శ్రీ పాపినేని శివశంకర్ (అంతర్జాలం నుండి సేకరణ) - ఈ కవితకి నా పెన్సిల్ చిత్రం బాగుంటుందని జోడించాను. 

అప్పుడప్పుడూ శరీరం అశ్రువైతే మంచిది
ఆవేదనా దగ్ధమైతే మంచిది
సుఖించడమే అందరూ నేర్పారు
అన్ని పరిశోధనలూ భూమ్మీద మనిషి సుఖ పడడానికే చేశారు
ఏడ్పు-దిగులు-వేదన-విషాదం- విలాపం-దుఃఖం
మొదలైన మాటలన్నీ అంటరానివిగా తేల్చారు
ఇల్లు, ఒళ్ళు, చదువు, ఉద్యోగం, కారు, భార్య – అన్నే సుఖం కోసమే
దుఃఖమూ ఒక సత్యమేనని అందరికీ తెలీదు
గుండెలకాన విలపించడమూ తెలీదు
అప్పుడప్పుడూ దుఃఖాన్ని దయగా నీ పెంపుడు కుక్క పిల్లల్లే
దగ్గరికి తియ్యడం మంచిది
పూడిక తీసిన బావిలో నీరూరినట్లు కంట్లో నీరూరితే మంచిది
దు:ఖమంటే జ్వలన జలం – జలజ్వలనం
దుఃఖించే టపుడు నీ కళ్ళ వెనకాల లీలగా
ఒక కఠిన పర్వతం బొట్లు బొట్లుగా కరిగిపోతుంది
దు:ఖాంతాన నీ కళ్ళు నిర్మలమవుతాయి
నీ లోపల పరిశుభ్రమవుతుంది
నువ్వు వెలిమబ్బారిన ఆకాశమవుతావు
దు:ఖించిన వాడికే జీవితం అర్థమవుతుంది
దుఃఖం లేని ప్రపంచం అసంపూర్ణమవుతుంది
రెండు కళ్ళు రెండు అపురూప కార్యాల కోసం వున్నాయి
ఒకటి నీ దుఃఖం కోసం
రెండోది పరాయి దుఃఖం కోసం

చిరునవ్వుకు చిరునామా


నా పెన్సిల్ చిత్రానికి అనూశ్రీ రాసిన చక్కని కవిత


మనసులో పెనుతుఫానులుంటేనేం
చిరునవ్వుకు చిరునామా తను..

ఎన్నో భావోద్వేగాలను పాడుకునే మధురమైన రాగం తను....!
అనుభవాల ఊతంతో
అనుభూతుల సాయంతో
అలవోకగా అవరోధాలను
దాటగల అసలు సిసలైన ధీమా తను...
నగవులే నగలుగా ఇంటికి కళగా
కలిమి లేములను సమంగా స్వీకరించి
చెరిగిపోని ఆత్మీయతను పంచుతూ
సాగిపోయే జీవన రహదారి తాను...!
ఒలికించే నవ్వుల చాటున
బాధ్యతల బెంగలన్నీ దాచేసి
తనువూ మనసూ దీవ్వెలా వెలిగించిన

నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...