18, ఆగస్టు 2018, శనివారం

సాలూరు రాజేశ్వరరావు - Saluru Rajeswara Rao

స్వరసారధి సాలూరు రాజేశ్వరరావు గారి గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలకి నా పెన్సిల్ చిత్రం జోడించి మీముందు ఉంచుతున్నాను. వీరు 11 October 1922 లో జన్మించారు.
"మెలొడీ” అనే మాట వినగానే సినీ సంగీతాభిమానులందరూ ఏకాభిప్రాయంతో తల్చుకునేది సాలూరు రాజేశ్వర రావు గారిని అంటే అని అంటే అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. ఈయన శాస్త్రీయ సంగీతంలో దిట్ట. ఆయన శాస్త్రీయ,లలిత సంగీతాల సమ్మేళనంగా ఆణిముత్యాల్లాంటి మధుర సినీ గీతాలను మనకి అందించారు. అనేక ప్రయోగాలను చేశారు. కొన్ని గీతాలను ఇంగ్లీష్ గీతాలనుంచి ప్రేరణ పొంది కొద్ది ఛాయలతో మాత్రమే వాటిని అచ్చ తెలుగు పాటలుగా మలిచారు. పాశ్చాత్య సంగీత పద్ధతులను తొలిసారిగా తెలుగు సినీ రంగంలో ప్రవేశపెట్టిన ఘనత ఆయనది. చంద్రలేఖ సినిమా ఇందుకు ఒక ఉదాహరణ.
ఆలిండియా రేడియోకి సోలో గానూ, రావు బాలసరస్వతి తోనూ కలిసి ఆయన పాడిన లలితగీతాలు 1940 ల్లో యువ హృదయాలను ఉర్రూతలూగించాయి. “పాట పాడుమా కృష్ణా పలుకు తేనెలొలుకునటుల" , ”చల్ల గాలిలో యమునా తటిలో” , “ఓ యాత్రికుడా” వంటి పాటలు ఈ నాటికీ ఆయన సంగీతాన్ని అభిమానించే వారికి గొప్ప ఆస్తి క్రిందే లెక్క! సన్నని స్వరంతో ఆయన పాడిన లలిత గీతాలు ఆలిండియా రేడియో పుణ్యమా అని సంగీతాభిమానుల దాహార్తి తీర్చాయి.
సినిమాల్లో ఆయన ప్రావీణ్యం కొత్తపుంతలు తొక్కి, మెలొడీకి పెద్దపీట వేయడమే కాక, కొన్ని సినిమాలను ఈ నాటికీ మ్యూజికల్ హిట్లుగా నిలబెట్టింది. తెలుగు సినిమా సంగీతాన్ని ఆరాధనీయమైన స్థాయికి తెచ్చింది రాజేశ్వర రావు గారేనన్నా అతిశయోక్తి కాదు.

ఇంక సాలూరి కిరీటంలో కలికితురాయి మల్లీశ్వరి (1951). సినిమా సంగీతంలోను, సినిమా తీసే పద్ధతిలోను గణనీయమైన మార్పులు చెందినా, డబ్భై సంవత్సరాలు దాటినా  నేటికీ గల గలా ప్రవహించే నదిలా వీనులవిందు గొలుపుతున్న సాహిత్య సంగీతాల మేళవింపు “మల్లీశ్వరి”. వి.ఎ.కె.రంగారావుగారి మాటల్లో చెప్పాలంటే “బి.ఎన్‌.రెడ్డి కార్యదక్షతతో, దేవులపల్లి మల్లెపూరేకు బరువుతో వ్రాసిన సాహిత్యంతో, పసుమర్తి కృష్ణమూర్తి నృత్య సారధ్యంతో, ఘంటసాల భానుమతిల గళ మధురిమతో యీ చిత్రంలోని సంగీతం తక్కిన అన్ని హంగుల మాదిరిగానే నభూతో నభవిష్యతి అన్న తీరుగా రూపొందింది.” “ఇదొక్కటి చాలు సాలూరి గొప్పతనం తెలియజెప్పడానికి” అనేవారు కొందరైతే, “దీనిని మించిన సంగీతభరితమైన చిత్రం ఇంతవరకు రాలేదు, ఇక ముందు కూడా రాబోదని” దృఢంగా విశ్వసించే వారూ చాలామంది ఉన్నారు.

“మల్లీశ్వరి” తరువాత ముఖ్యంగా చెప్పుకోవలసిన చిత్రం విప్రనారాయణ (1954). ఎవ్వాడే అతడెవ్వాడే అన్న అపూర్వమైన రాగమాలికనొక్కసారి (భైరవి, మోహన, కాపి, వసంత) జ్ఞప్తికి తెచ్చుకోండి! ఈ చిత్రంలోని ప్రతి పాటా గొప్పదే. పాలించర రంగా (హేమవతి), చూడుమదే చెలియా (హిందోళం), రారా నా సామి రారా (కల్యాణి), సావిరహే (యమునాకల్యాణి),మేలుకో శ్రీరంగ (బౌళి, మలయమారుతం), …
హిందోళం లో రాజేశ్వర రావు గారు చేసిన పగలే వెన్నెల(పూజాఫలం), ఆల్ టైం హిట్ గా నిలిచిన భావగీతం. ఇదే రాగంలో కూర్చిన శ్రీకర కరుణాలవాల (బొబ్బిలి యుద్ధం)పాటేమో భక్తి రసంతో పాటు వీర రసం కూడా ఉట్టిపడే గీతం.
రాగమాలిక(వివిధ రాగాలను వివిధ చరణాల్లో ఒకే పాటలో కూర్చడం) లో స్వరరచన చేయడం క్లిష్టమైన పని! మల్లీశ్వరి లోని "ఆకాశవీధిలో" ఎవరు మర్చిపోగలరు? జయదేవ చిత్రంలోని దశావతారాలను వర్ణించే అష్టపది “జయ జగదీశ హరే “, “పాడెద నీ నామమే”(అమాయకురాలు),రాధాకృష్ణ సినిమాలోని “నా పలుకే కీర్తనా” పాటలు ఆయన రాగమాలికలకు కొన్ని ఉదాహరణలు!
ఇక వీణ రాజేశ్వర రావుగారి వీణ పాటలంటే ప్రాణం ఇవ్వని అభిమానులెవరు? పాడవేల రాధికా,పాడమని నన్నడగవలెనా,మదిలో వీణలు మ్రోగే,పాడెద నీ నామమే…ఇవన్నీ ఆయన వీణా నాదాలే!
యమన్ కళ్యాణి రాగంలో రాజేశ్వర రావుగారు ఇచ్చిన హిట్లు అసంఖ్యాకం! ప్రతి తెలుగు గొంతులో ఎప్పుడో ఒకప్పుడు పలికే పాట “మనసున మల్లెల మాలలూగెనే” , "సావిరహే తవదీనా","రారా నా సామి రారా"(విప్రనారాయణ), చెలికాడు నిన్నే(కులగోత్రాలు),జగమే మారినది(దేశద్రోహులు),చిగురులు వేసిన కలలన్నీ(పూలరంగడు), కళ్లలో పెళ్ళి పందిరి(ఆత్మీయులు) ఎప్పటికీ మర్చిపోలేని ఆణిముత్యాలే!
అలాగే పాశ్చాత్య సంగీత ప్రేరణతో వాటిని మక్కీకి మక్కీ దించకుండా “ఎక్కడో విన్నట్టుంది” అన్నట్టుగా వాటిని “తెలుగు నేటివిటీకి దగ్గరగా కూర్చిన పాటల్లో కొన్ని..హలో హలో ఓ అమ్మాయి(ఇద్దరు మిత్రులు),స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు(ఆత్మీయులు), ఈ రేయి తీయనిది (చిట్టి చెల్లెలు).
రాజేశ్వర రావు గారు ఈ పాటలు కూర్చారనో, ఆయన ఇంతటి ప్రతిభాశాలి అనో,ఆయన పాటల్లో ఇవి మంచివి అనో చెప్పడం పెద్ద సాహసమే! అందుకే ఆయన్ని ర"సాలూరు" రాజేశ్వర రావు అన్నా, రాజే”స్వర”రావు అన్నా, అది ఆయనకే చెల్లు!

వీరు 25 October 200 సంవత్సరంలో స్వర్గస్తులాయ్యరు.

17, ఆగస్టు 2018, శుక్రవారం

అటల్ బిహారి వాజ్పాయీ - Atal Bihari Vajpayee

అటల్ బిహారి వాజ్పేయి - నా పెన్సిల్ చిత్రం.

సమున్నత విలువల శిఖరం

రాజకీయాల్ని ప్రజాహిత రంగంగా భావించి దశాబ్దాల పాటు అవిరామంగా సాగించిన మహా వాజపేయం ముగిసింది. పుష్కర కాలం వాజ్‌పేయీ అంటే- భావుకత మూర్తీభవించిన విగ్రహం; సంక్షుభిత స్థితిలోనూ సడలని నిగ్రహం! ‘మృత్యువుకైనా వెరవను, చెడ్డపేరంటే మాత్రం చాలా భయం’ అన్న వాజ్‌పేయీది సమున్నత విలువల పథంలో అలుపెరుగని ప్రస్థానం! అటల్‌ జీ విఖ్యాత జాతీయ నాయకుడు... విశిష్ట రాజకీయవేత్త... స్వార్థమెరుగని సంఘ సేవకుడు... మహా వక్త, సాహితీమూర్తి, చక్కని కవి, మంచి పాత్రికేయుడు- 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా సత్కరిస్తూ ఇచ్చిన ప్రశంసాపత్రంలోని ఈ విశేషణాలన్నీ ప్రజాజీవనంలో వాజ్‌పేయీ బహురూపాలు. అర్ధనిమీలిత నేత్రాలతో కవిత చదివినా, అనర్గళ వాగ్ధాటితో ప్రత్యర్థుల్ని చెండాడినా అది వాజ్‌పేయీకే చెల్లు! ‘అధికారంలో కొనసాగడానికి అవినీతిని ఆశ్రయించం, అనైతిక పద్ధతులూ అవలంబించం. మా ఆత్మల్ని అమ్ముకోవాలనో, తాకట్టు పెట్టాలనో మేము అనుకోవడం లేదు’- అంటూ 1996లో పదమూన్నాళ్ల ప్రధానిగా పార్లమెంటులో వాజ్‌పేయీ చేసిన చారిత్రక ప్రసంగం ఆయన నైతిక నిష్ఠాగరిమకు ఘనతర ప్రతీకగా నిలిచింది. దేశ రాజకీయాల్లో కొడిగట్టిపోతున్న కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా భాజపాను జాతి ముందు నిలబెట్టడంలో ఆ కర్మయోగి రాజనీతిజ్ఞత, దూరదృష్టి నిరుపమానమైనవి. తొలుత దేశం, పిమ్మట పార్టీ, ఆ తరవాతే నేను అనే ఆదర్శవాదాన్ని ఆచరణలో పెట్టి, భాజపాకు విలక్షణ సైద్ధాంతిక పునాదుల్ని నిర్మించి, సంకీర్ణ రాజకీయ నావకు తానే సహనశీల చుక్కానిగా మారిన దార్శనికుడు వాజ్‌పేయీ.‘బారీ బారీ అటల్‌ బిహారీ’ అనేంతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసిన వాజ్‌పేయీ- దేశమాత రుణం తీర్చుకొన్న ధన్యజీవి! 
నిక్కమైన భావుకత, నిఖార్సైన నిర్భీకత నిలువెల్లా నిండిన అపురూప వ్యక్తిత్వం అటల్‌జీది. ‘ప్రచండ వేగంతో సృష్టిని సాగిస్తూ ప్రళయాల్ని ధరిస్తా’నని, ‘కీర్తి మతాబుల్లో కొందరు కేరింతలు కొడుతుంటే చీకట్లను రహించే పనిలో నిమగ్నం అవుతా’నని కవితాత్మకంగా స్పందించిన వాజ్‌పేయీ- ఆరు దశాబ్దాల ప్రజాజీవనంలో త్రికరణశుద్ధిగా నిబద్ధమైనదే ఆ మహత్కార్యానికి! హిందీలో బ్రహ్మాండమైన వక్తగా తొలినాళ్లలోనే లోక్‌సభాపతి అనంతశయనం అయ్యంగార్‌ కితాబులందుకున్న వాజ్‌పేయీ- ఐక్యరాజ్య సమితిలో రాజ్యభాషలో ప్రసంగించి భారతావని వాణిని ప్రతిధ్వనింపజేసిన ఘనాపాటి. పండిత నెహ్రూను అమితంగా అభిమానించడమే కాదు, తరాల అంతరాలను చెరిపేసి ప్రజాతంత్ర విలువల ఔన్నత్యానికి తానే విశిష్ట వారధిలా ఎదిగిన మేటి! ‘వారసత్వ సమస్యల్ని ఎన్నింటిని పరిష్కరించాం... జాతి ప్రగతికి ఎంత పటిష్ఠ పునాది వేశాం’- ఈ రెండే ప్రతి తరం బాధ్యతాయుత వర్తనకు గీటురాళ్లు అన్నది వాజ్‌పేయీ చెప్పిన మాటే. పదిసార్లు లోక్‌సభకు, రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికైన మహానేత భిన్న హోదాల్లో జాతికి చేసిన సేవకూ తూకంరాళ్లు అవే! కశ్మీర్‌ వివాద పరిష్కారాన్ని లక్షించి చారిత్రక లాహోర్‌ బస్సు యాత్రతో పాకిస్థాన్‌కు స్నేహహస్తం సాచడంలో, కశ్మీరీలను అక్కున చేర్చుకొనేలా మానవీయ విధాన రూపకల్పనలో సౌభ్రాత్ర పరిమళాల్ని వెదజల్లిన వాజ్‌పేయీ- విశ్వాసఘాతుకంతో కార్గిల్‌ యుద్ధానికి కాలుదువ్విన ముషారఫ్‌ మూకల వెన్నువిరిచిన సాహసి. ఉద్రిక్తతలు పెంచిన అయోధ్య వివాదానికి న్యాయ ప్రక్రియ ద్వారా లేదా పరస్పర ఆమోదయోగ్యమైన చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలన్న ఆయన నిర్దేశం- జాతి సమగ్రతకే గొడుగుపట్టింది. పార్టీగత అతివాదులకు ముకుతాడు వేసి, పూర్తికాలం దేశాన్నేలిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా సంకీర్ణ నావను ఒడుపుగా ప్రగతి తీరాలకు చేర్చడంలో వాజ్‌పేయీ చాణక్యం సంస్తుతిపాత్రమైనది! 
‘పార్టీకి దేశానికి ఏది మంచిది అనే లక్ష్మణరేఖను ఎవరికి వారు గౌరవించి, క్రమశిక్షణకు కట్టుబడి ఉంటే, దీర్ఘకాలం బంధాలు నిలబడతాయి’ అంటూ లాల్‌కృష్ణ అడ్వాణీతో తన దశాబ్దాల సాన్నిహిత్య రహస్యాన్ని వాజ్‌పేయీ వెల్లడించారు. అణుశక్తి సంపన్న రాజ్యంగా ఇండియాను తీర్చిదిద్ది, అమెరికా సహా పలు దేశాలు విధించిన ఏకపక్ష ఆంక్షల్ని దీటుగా ఎదుర్కొని, అచిరకాలంలోనే అగ్రరాజ్యాలన్నింటితో భాగస్వామ్య బంధాల్ని బలీయంగా ముడివేసిన వాజ్‌పేయీ విదేశాంగ వ్యూహ విశారదుడు! బుడిబుడి అడుగుల దశలో ఉన్న ఆర్థిక సంస్కరణలకు ఒడుపును, వేగాన్ని అందించి ఎనిమిది శాతం వృద్ధిరేటును సాకారం చేసింది వాజ్‌పేయీ ప్రభుత్వం. సప్తవిధ అనుసంధాన ప్రక్రియల ద్వారా యావత్‌ జాతినీ ఏకతాటిపైకి, ప్రగతిబాటలోకి నడిపించిన ఆయన సారథ్యం చిరస్మరణీయం. నాలుగు మహానగరాల్ని అనుసంధానించే స్వర్ణచతుర్భుజి, దానితోపాటే గ్రామీణ రోడ్ల అనుసంధానం దేశార్థికాన్ని కొత్తపుంతలు తొక్కించాయి. రైలు, విమాన, జలరవాణా సేవలతో పాటు అంతర్జాల విస్తృతి, టెలికాం విప్లవాలు ఇండియా ముఖచిత్రాన్నే మార్చేశాయి. 1999లో వాజ్‌పేయీ తెచ్చిన కొత్త టెలికాం విధానం వల్లనే దేశీయంగా మొబైల్‌ విప్లవం అద్భుతాలు సృష్టిస్తోంది. ఆదేశిక సూత్రంగా, నామమాత్రంగా మిగిలిన నిర్బంధ ఉచిత విద్యాలక్ష్యాన్ని సర్వశిక్ష అభియాన్‌ ద్వారా పట్టాలకెక్కించి కోట్లాది నిరుపేద పిల్లలకు అక్షరాభ్యాసం చేసిన గురువరేణ్యుడు వాజ్‌పేయీ. ‘నా ఆరోగ్యంపై చింతలేదు... దేశ ఆరోగ్యం గురించే నా ఆందోళన అంతా’ అని ప్రకటించి, నూట ముప్ఫైకోట్ల జనావళి ఆలోచనలూ హృదయాల అనుసంధానంతో జాతికి సముజ్జ్వల భవితను స్వప్నించిన వాజ్‌పేయీ- రాజకీయ వినీలాకాశంలో ధ్రువతారగా వెలిగే రాజర్షి!

(సేకరణ : ఈనాడు సంపాదకీయం)

12, ఆగస్టు 2018, ఆదివారం

అరవైలో ఇరవై

whatsapp లో వచ్చిన ఓ చక్కని కవితకి నా పెన్సిల్ చిత్రం.
జీవితాన్ని అనుభవించు వయసే "అరవై"
వృద్ధాప్యాన్ని ఆస్వాదించు నీవే "దొర"వై..
హోంవర్కు దిగులు లేదు పసివాళ్ళలా..
వొత్తిడుల గుబులు లేదు పడుచువాళ్ళలా..
'నడికారు' లాగ లేదు కలవరం..
వొడిదొడుకులు లేకుండుటె ఒక వరం..
అసలు..
జీవితాన్ని అనుభవించు వయసే అరవై..
వృద్ధాప్యాన్ని ఆస్వాదించు నీవే దొరవై..
బడి కెళ్ళాలని లేదు గడబిడ..
హడావిడి పడుట లేదు పని కడ..
బస్సు కొరకు వెయిటింగు బెరుకు లేదు..
ఉస్సురుస్సురనే ట్రాఫిక్ ఉలుకు లేదు..
ఉదయం రాందేవ్ యోగా, ధ్యానం
మధ్యాహ్నం ఎండ తగులని విరామం..
సాయంకాలాలు సమవయస్కులతో
చర్చోపచర్చలు, చతుర సంభాషణలు..
అసలు..
జీవితాన్ని అనుభవించు వయసే అరవై..
వృద్ధాప్యాన్ని ఆస్వాదించు నీవే దొరవై..
అమ్మా నాన్నల పోరు లేదు..
ఆఫీసు, బాసు జోరు లేదు..
మనుమలు, మనుమరాళ్ళ ఆటపాటలు,
కొడుకులూ, కోడళ్ళు.. కూతుర్లూ అల్లుళ్ళ
హర్షాతిరేకాలు, ఆహ్లాదపూరితాలు..
ఆశీస్సులకై శిరసువంచే
ఆనందమయ సన్నివేశాలు..
అసలు..
జీవితాన్ని అనుభవించు వయసే అరవై..
వృద్ధాప్యాన్ని ఆస్వాదించు నీవే దొరవై..
పాఠశాల, క్రమశిక్షణ వంటివి లేవు..
పరిమితులు, అనుమతుల బాధలు లేవు..
పెద్దవారు అడ్డుకునే సందేహం,
ఎవరేమంటారోననే అనుమానం
మచ్చుకైన కానరావు,
మరియాదలు తప్పవు..
ఏదైనా అనొచ్చు.. ఏమైనా కనొచ్చు..
మనసుకు తోచిన రీతి
మాట్లాడడమే పద్ధతి..
అసలు..
జీవితాన్ని అనుభవించు వయసే అరవై. .
వృద్ధాప్యాన్ని ఆస్వాదించు నీవే దొరవై..
(ఒక హిందీ కవితకు స్వేచ్ఛానుకృతి)

నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...