30, ఏప్రిల్ 2018, సోమవారం

కొప్పు చూడు కొప్పందం చూడు - నా పెన్సిల్ చిత్రాలు



సిగ సింగారం కొప్పు బంగారం

జుట్టున్నమ్మ ఎంత కొప్పైనా వేస్తుంది.. ఇది నాటి మాట. కొప్పు ఉన్న‌మ్మ‌కి కోటి వయ్యారాలు ఇది సామెత‌..కానీ ఇది అక్ష‌రాల నిజం. ఎందుకంటారు. మంచి ఒతైన..పొడ‌వైన జుట్టు వారు ఏ జ‌డ అయినా వేసుకోవ‌డానికి వీలుంటుంది. జుట్టులేనమ్మ కూడా తాను కోరిన కొప్పు వేసుకోవచ్చు.. ఇది నేటి మాట. వనితల జుట్టు పలచగా, కురచగా ఉన్నా తాము కోరిన కొప్పును వేసుకునే సౌలభ్యం లభిస్తోంది. కొప్పులు చుట్టుకోవడంలో ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన వాణిశ్రీని మళ్లీ మగువలు ఫాలో అవుతున్నారు. కొత్త కొత్త వెరైటీలతో నగర వనితా లోకం ఇప్పుడు కొప్పు చూడు కొప్పందం చూడు అంటోంది.

కొప్పు ఉన్న‌మ్మ‌కి కోటి వయ్యారాలు ఇది సామెత‌..కానీ ఇది అక్ష‌రాల నిజం. ఎందుకంటారు. మంచి ఒతైన..పొడ‌వైన జుట్టు వారు ఏ జ‌డ అయినా వేసుకోవ‌డానికి వీలుంటుంది.

'మానవుడు దానవుడు' చిత్రంలో ఉషశ్రీ గారు కొప్పు గురించి ఎంత చక్కగా రాశారో చూడండి.

కొప్పు చూడు కొప్పందం చూడు.. కొప్పున వున్న పూలను చూడు
కొప్పు చూడు కొప్పందం చూడు.. కొప్పున వున్న పూలను చూడు
మగడా నే మునుపటి వలెనే లేనా?


అహా! అలాగా!
కొప్పులో పూలెక్కడివే?.. నీ కొప్పులో పూలెక్కడివే?
అవా?



కట్టెల కోసమెళితే.. నే కట్టెల కోసమెళితే
కొమ్మ తగిలి కొప్పు నిండింది మావా
కొమ్మతగిలి కొప్పు నిండింది మావా



మిత్రురాలు సింహాద్రి జ్యోతిర్మయి కవితా స్పందన ఎల ఉందో చూడండి.
నీలాల కురులు.

వచ్చీరాని కూకటులను
ఒద్దికగా సవరించి
నడినెత్తిపైకి తెచ్చి
చిన్ని‌పిలకను కట్టి
దోగాడుతుందొక బుజ్జి కృష్ణమ్మ

పుట్టు వెండ్రుకలిచ్చి
స్వామి మొక్కును తీర్చి
చలిమిడి ముద్దలా
చక్కనగు గుండుతో
పరిగెట్టు పసిపాప పసిడిబొమ్మ

ఆరుపాయలు తీసి
రెండు జడలుగ వేసి
ఆటపాటల గడిపి
చదువుసంధ్యల నెదుగు
పరువాల చిన్నారి కులుకుల కొమ్మ

బారు కురులను దువ్వి
వాలు జడగా అల్లి
నడుము ఒంపున నాగు
నాట్యమాడుతున్నట్లు
వయ్యార మొలికేను ముద్దుగుమ్మ

వెలుగు నీడలల్లె
తెలుపు నలుపుల తోటి
వయసుమీద పడెనను
వార్ధక్యమును చాటు
అందాల కురులను
అలవోకగా ముడిచి
పూలు సింగారించు
పుణ్యవతి బామ్మ

బుజ్జాయి,అమ్మాయి
అమ్మ, , బామ్మ
అన్ని వయసులవారికీ
అలకలే అందం
ఆ కురులే అందం.

సింహాద్రి జ్యోతిర్మయి
29.4.2018

24, ఏప్రిల్ 2018, మంగళవారం

ముక్కెర

ముక్కెర (Pencil sketch)
ముత్యంలా తళుకులీనె ముక్కెరవని భావించా ..
నిశలేవీ నాదాకా రాలేవని భావించా ...
నీ ఊర్పుకు వణికిపోయి మెరిసినదీ నాసికా
ముక్కెర నే తొడిగినదీ నీ కొరకే ప్రియతమా ...
(రోహిణీ ఉయాల గారి గజల్ - 'గజల్ సుమాలు' పుస్తకం నుండి సేకరణ)

మగని మనసుకే గురుతు
మగువ ముక్కు పుడక
ఆ సిరి ఉంటే బ్రతుకంతా
ఏడడుగుల నడక (Simhadri Jyothirmayi)

నీలాల కురులలో
నా కంటి పాపలో...మెరుపు

అద్దాల చెక్కిలిలో
అధరాల వంపులో...ఎరుపు

ఫాలమంటి నుదుటిపై
కొనదేలిన ముక్కుపై.....నునుపు

నీ వల్లనే వచ్చిందనుకొని
విర్రవీగకు ముక్కెరా!
అలంకారం లేకున్నా
నేను అందగత్తెనే సుమా!


-- (రచన : సింహాద్రి జ్యోతిర్మయి)
'ముక్కు చూడు ముక్కందం చూడు
ముక్కున ఉన్న ముక్కెర చూడు' అంటాడొక సినీ కవి.
ఇంకా అందం కోసం ముక్కుపుడకను ధరించే మహిళలు ఎక్కువ. భామాకలాపంలో ఒకసారి సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్ళమంటుంది. ఎన్ని లంచాలు ఇస్తానన్నా, ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్లనంటుంది. విసిగిన సత్య చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న ముక్కెర కావాలంటుంది. అది ఇవ్వగానే లంకెబెందెలు దొరికినంత సంతోషంతో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రాయబారం నడుపుతుంది. దేవతలందరికీ అందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది. బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు.
అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీ వస్తున్న సాంప్రదాయం. బయటి వాళ్ళెవరైనా ఇవ్వజూపితే అది చాలా తప్పు. తాళిబొట్టు మాదిరిగానే వివాహసమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం తీయరు కొందరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే దీన్ని సౌభాగ్యానికి సంకేతంగా చెబుతారు.
ముక్కెర మంగళసూత్రంకన్నా చాలా ముందుకాలం నాటిది. ముక్కుపుడక అడ్డకమ్మ నత్తు బాసర ముంగర బులాకీ బేసరి ముక్కెర... అంటూ పిలుచుకొనే నాసికాభరణం ఆడవారి అయిదోతనానికి గుర్తు. ఉత్తర దేశంలో పాపిట సిందూరం లాగే దక్షిణాదిన ముక్కెర, కాలిమెట్టెలు ఇల్లాలితనాన్ని సూచిస్తాయి. అందుకే తన తమ్ముడు నిగమశర్మ తన ముంగరను దొంగిలిస్తే ‘క్రొత్తగా చేయించుకొన్న ముక్కెరకునై అడలు దుర్వారయై ఆడబిడ్డ’ భోరున విలపించిందని పాండురంగ మాహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు వర్ణించాడు. విని నేర్చుకొనే చదువులు (వేద విద్యలు) చెవికెక్కడానికి దోహదం చేసే చెవిపోగులూ(బావగారివి) నిగమశర్మ ఎత్తుకెళ్లాడు. ‘జామాత వెతబొందు వ్యామోహియై నవగ్రహ కర్ణవేష్టన(నవరత్నాలు పొదిగిన) భ్రంశమునకు’ కారణమయ్యాడు.
(విషయ సేకరణ : వెబ్ దునియా.కామ్, ఈనాడు సంపాదకీయం, ఇంకా ఇక్కడా అక్కడా)

15, ఏప్రిల్ 2018, ఆదివారం

కందుకూరి వీరేశలింగం

కందుకూరి వీరేశలింగం -  నా పెన్సిల్ చిత్రం

నవయుగ వైతాళికుడు, సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి జయంతి సందర్భంగా నా నివాళి (నా పెన్సిల్ చిత్రం).

కందుకూరి వీరేశలింగం (ఏప్రిల్ 16, 1848 - మే 27, 1919) గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి. సాహితీ వ్యాసంగంలోను కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. వీరేశలింగం స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు.మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో బాటు, పుస్తకాలు, పలకా బలపాలు కొనిచ్చేవాడు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేయటమే కాకుండా ఎన్ని కష్టాలెదురైన ఆచరణలో పెట్టాడు.

ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగం తోనే మొదలయింది. సమాజ సేవకొరకు హితకారిణి (హితకారిణీ సమాజం 1905 లో) అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పనిచేసాడు. ఆయన 130 కి పైగా గ్రంథాలు వ్రాసాడు. ఆన్ని గ్రంథాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవలసత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు వ్రాసాడు. స్వీయ చరిత్ర వ్రాసాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు.



జీవిత విశేషాలు

వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16 న రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లా లోని కందుకూరుగ్రామం నుండి రాజమండ్రికి వలస వెళ్ళడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది.

వీరేశలింగానికి నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయాడు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగాడు. ఐదో యేట బడిలో చేరి, బాలరామాయణం, ఆంధ్ర నామ సంగ్రహంఅమరంరుక్మిణీ కళ్యాణంసుమతీ శతకంకృష్ణ శతకం మొదలైనవి నేర్చుకున్నాడు. పన్నెండో యేట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరాడు. చిన్నప్పటినుండి, అన్ని తరగతులలోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు. తన పదమూడో యేట బాపమ్మ (కందుకూరి రాజ్యలక్ష్మమ్మ) అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్యవివాహమయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసాడు.
చదువుకునే రోజుల్లో [ కేశుబ్ చంద్ర సేన్] రాసిన పుస్తకాలు చదివి ప్రభావితుడయ్యాడు. విగ్రహారాధనపూజలు మొదలైన వాటి మీద నమ్మకం తగ్గడమే కాక, దెయ్యాలు, భూతాలు లేవనే అభిప్రాయానికి వచ్చాడు. ప్రజలకు అది నిరూపించడానికి అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళేవాడు.
1867లో పెదనాన్న మరణంతో ప్రభుత్వోద్యోగంలో చేరాలని ప్రయత్నించాడు, కాని లంచం ఇవ్వనిదే రాదని తెలిసి, ప్రభుత్వోద్యోగం చెయ్యకూడదని నిశ్చయించుకున్నాడు. న్యాయవాద పరీక్ష వ్రాసి, న్యాయవాద వృత్తి చేపడదామని భావించినా, అందులోనూ అవినీతి ప్రబలంగా ఉందనీ, అబద్ధాలు ఆడటం వంటివి తప్పనిసరి అని గ్రహించి, అదీ మానుకున్నాడు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు.
ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలతో పాటు, సంఘ సంస్కరణ భావాలను బోధించాడు. సమాజంలోని దురాచారాలపై తన భావాలను వ్యాప్తి చెయ్యడానికి 1874 అక్టోబరులో వివేకవర్ధని అనే పత్రికను ప్రారంభించాడు. “సంఘం లోని అవకతవకలను ఎత్తి చూపడం, దురాచారాల నిర్మూలన, ప్రభుత్వ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని ఎత్తిచూపి, అవినీతిపరులను సంఘం ముందు పెట్టడం” వివేకవర్ధని లక్ష్యాలని ఆయన మొదటి సంచికలో తెలియజేసాడు. చెప్పడమే కాదు, అలాగే నడిపాడు కూడా. వివేకవర్ధని అవినీతిపరుల పాలిట సింహస్వప్నమయింది.
కందుకూరికి సమకాలిక ప్రముఖుడైన కొక్కొండ వెంకటరత్నం పంతులుతో స్పర్ధ ఉండేది. కందుకూరి వివేకవర్ధని స్థాపించిన తరువాత కొక్కొండ హాస్య వర్ధని అనే పత్రికను ప్రారంభించాడు. ఆ పత్రికకు పోటీగా కందుకూరి హాస్య సంజీవిని అనే హాస్య పత్రికను ప్రారంభించాడు. తెలుగులో మొదటి ప్రహసనం కందుకూరి ఈ పత్రికలోనే ప్రచురించాడు. ఎన్నో ప్రహసనాలు, వ్యంగ్య రూపకాలు ఈ పత్రికలో ప్రచురించాడు.
ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగం తోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి (హితకారిణీ సమాజం 1905 లో) అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పనిచేసాడు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తూచ తప్పకుండా పాటించిన వ్యక్తి ఆయన.
యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.
వీరేశలింగము పగలు సంస్కరణవిషయములలో, బనిచేసి రాత్రులు గ్రంధరచనము సాగించుచుండు నలవాటుకలవాడు. నీరసరోగ పీడితులగుట రాత్రులు వీరికి నిద్రపట్టెడిదికాదు."కాడ్లివరునూనె" యాహారప్రాయముగా నుపయోగించుకొనుచు గ్రంధరచన చేయుచుండేవాడు. ఈయన రచనలపై సాంప్రదాయుకులు అభియోగాలు మోపారు. చివరికాలమున నపనిందలకు లోనయ్యాడు. పరువు నష్టం కేసులో ఓడిపోయాడు. [1] ఆంధ్ర సమాజాన్ని సంస్కరణల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం 1919 మే 27 న మరణించాడు

సంఘ సంస్కరణ కార్యక్రమాలు

వీరేశలింగం హేతువాది . ఆయన జీవితం సంఘసంస్కరణ, సాహిత్య కృషులతో పెనవేసుకు పోయింది; ఒకదానినుండి మరో దానిని విడదీసి చూడలేము. ప్రభుత్వంలోని అవినీతిని ఏవగించుకుని ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని, అబద్ధాలు ఆడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్న వ్యక్తి అటువంటి దురాచారాలపై ధ్వజమెత్తి తన సంస్కరణాభిలాషను నిరూపించుకున్నాడు.
వివేకవర్ధని పత్రిక ద్వారా [[లంచం|అవినీతి]పరులపై యుద్ధం సాగించి వారిని హడలెత్తించాడు. సంఘంలోని ఇతర దురాచారాలపై ప్రజలను చైతన్యవంతులను చెయ్యడానికి పత్రికను ఆయుధంగా వాడుకున్నాడు. సంఘసంస్కరణకై ప్రవచనాలు మాత్రం చెప్పి ఊరుకోలేదు, స్వయంగా అందుకై నడుం కట్టి కార్యరంగంలోకి దూకాడు. ఆ రోజుల్లో స్త్రీలకు విద్య అవసరం లేదని భావించేవారు. వీరేశలింగం స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు. తానే స్వయంగా చదువు చెప్పేవాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో బాటు, పుస్తకాలు, పలకా బలపాలు కొనిచ్చేవాడు.
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, కుల నిర్మూలనకు ఆయన అకుంఠిత దీక్షతో పనిచేసాడు. వేశ్యా వ్యవస్థ పాతుకుపోయిన ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా వివేకవర్ధనిలో వ్యాసాలు రాసాడు.
ఆయన చేసిన ఇతర సంస్కరణ కార్యక్రమాలొక ఎత్తు, వితంతు పునర్వివాహాలొక ఎత్తు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేసాడు. 1881 డిసెంబరు 11న తమ ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం చేశాడు. తొమ్మిదేళ్ళ బాల వితంతువు గౌరమ్మ తిరువూరు తాలూకా రేపూడికి చెందిన పిల్ల. వరుడు గోగులపాటి శ్రీరాములు . ఈ పెళ్ళి పెద్ద ఆందోళనకు దారి తీసింది. పెళ్ళికి వెళ్ళినవాళ్ళందరినీ సమాజం నుండి వెలి వేశారు. సమాజం నుండి ఎంతో ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించాడు. పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, మరియు ఆయన విద్యార్థులు వీరేశలింగానికి అండగా నిలిచారు. ఆయన భార్య కందుకూరి రాజ్యలక్ష్మమ్మ (పెళ్ళయ్యాక బాపమ్మకు అత్తగారు రాజ్యలక్ష్మి అని తన తల్లి పేరు పెట్టుకున్నారు) భర్తకు బాసటగా ఉంది. వంటవాళ్ళు, నీళ్ళవాళ్ళు వారి ఇంటికి రావడానికి నిరాకరించినపుడు రాజ్యలక్ష్మమ్మ స్వయంగా గోదావరికి వెళ్ళి నీళ్ళు తెచ్చి, పెళ్ళివారికి వంట చేసిపెట్టింది. స్త్రీల కొరకు సతీహిత బోధిని అనే పత్రికను కూడా నడిపాడు.

ప్లవాత్మకమైన మార్పు

చిన్ననాటి నుండి అతనికి అలవడిన స్వాభావిక లక్షణములే కార్యదీక్ష, సాహసము, విజ్ఞాన తృష్ణలు. రామమోహనరాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ ల బోధనలు, రచనలు ఇతని ఆధ్యాత్మిక చింతనలో విప్లవాత్మకమైన మార్పును తెచ్చాడు. 1887 సంవత్సరంలో సంఘ సంస్కరణ సమాజము స్థాపించి, మతమనే ముసుగులో అధోగతిలో ఉన్న హైందవ సమాజములోని దురాచారములపై విప్లవం ప్రారంభించాడు. ఆయన మూఢ విశ్వాసములు, సనాతనాచారములపై జరిపిన పోరాటము చిరస్మరణీయమైనది.

సాహితీ వ్యాసంగం 

సంఘసేవలో వీరేశలింగం ఎంత కృషి చేసాడో, సాహిత్యంలోనూ అంతే కృషి జరిపాడు. చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. వివేకవర్ధనిలో సులభశైలిలో రచనలు చేసేవాడు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకడు. తెలుగుసంస్కృతంఇంగ్లీషు భాషల్లో అద్వితీయ ప్రతిభ కలవాడు కందుకూరి.
ఆయన 130 కి పైగా గ్రంథాలు వ్రాసాడు. ఆన్ని గ్రంథాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవలసత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు వ్రాసాడు. స్వీయ చరిత్ర వ్రాసాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు.
సంగ్రహ వ్యాకరణం వ్రాసాడు. నీతిచంద్రిక (తెలుగు పంచతంత్రం) లోని సంధివిగ్రహం భాగాలను చిన్నయసూరి వదిలివేయగా వీరేశలింగం పూర్తి చేసాడు.
(విషయ సేకరణ వికీపీడియా నుండి)


కవిత :
కం..చె గానున్న వైధవ్యపు సంకెళ్ళు తెంచి / దు..మారమే సృష్టించి విధవల పెళ్ళి జేసి / కూ..రుకు మేల్కొలుపు వేకువ విద్య యంచు / రి..వాజు తప్పించి స్త్రీ విద్య ప్రోత్సహించి / వీ..డ్కొలుప బాల్య వివాహములను / రే..బవలు శ్రమించి నవయుగ వైతాళికుడవై / శ..తాధిక గ్రంథ రచనల గద్యతిక్కనవై / లిం..గ వివక్షలను ఆనాడె ఎండగట్టి / గం..పకెత్తి దురాచారాల కసవు పారబోసి / పం..డుగ తెచ్చినావు పడతుల బ్రతుకులందు / తు..హిన కిరణమై తాకిన నీ చేతి చలువ చేత / లు..లితమైన స్త్రీ జాతి మొక్కుచుండె / గా..రవించి దైవమంచు నెంచి మదిని / రు..ద్ధ కంఠాన మీకు జోహారులనుచు. / లులితము...చలించినది /
- కవిత : శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి

11, ఏప్రిల్ 2018, బుధవారం

ఆటో కష్టాలు.


పూర్వకాలంలో పుష్పకవిమానాలుండేవట. ఎంతమంది ఎక్కినా వాటిలో ఇంకొకరికి స్థానం ఉండేది. ఈనాటి మన ఆటోలు కూడా అంతే. ఈ ఫోటో కి నా మిత్రురాలు శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి చక్కని పద్యాలు రాసింది.
ఆ.వె.
పూర్వకాలమందు పుష్పకమ్మను పేరనొక విమాన ముండె చకితమనుచుపలుకనేల?కనుడు ప్రత్యక్షముగ నిపుడా,కుబేరుడు మన కంపెనేమొ!
ఆ.వె.ఎంతమందియున్న నింకొక్కరికి యందుచోటు దొరకగలదు చోద్యమిదియెగగనవీధి వీడి నగరబాట నడచునేటి పుష్పకమ్ము ఆటొరిక్ష.
సింహాద్రి జ్యోతిర్మయి

10.4.2018.

facebook లో నేను పెట్టిన ఈ ఫోటో కి విశేష స్పందన వచ్చింది. మన దేశ జనజీవనంలో 'ఆటో' ఓ ప్రధాన భాగమయిపోయింది. నగరంలోనే కాకుండా గ్రామానికి గ్రామానికీ కూడా ఆటో సౌలభ్యం వచ్చేసింది. బస్సుల కోసం నిరీక్ష్జణ అవసరంలేదు. బస్సులు వాటికి ఉద్దేశించిన స్టాపుల్లోనే ఆగుతాయి. కాని ఆటోవాలాలు మనం ఎక్కడ ఆపమంటే అక్కడె ఆపుతాడు. నగరంలో మేము ఉంటున్న apartments దగ్గర బస్సులకి request stop ఒకటి ఉంది. కాని బస్సు ఎక్కినప్పుడు driver కి ముందుగానే చెప్పుకోవాలి ఫలానా చోట ఆపమని. కొందరు సానుకూలంగా స్పందిస్తారు. కొందరు మొహంలో విసుగు ప్రదర్శిస్తారు. ఆటోవాలా తో ఆ ఇబ్బంది లేదు. అంతవరకూ బాగానే ఉంది. కాని ఆటోతో ఉన్న సదుపాయాలతో పాటు ఇబ్బందులూ ఎక్కువే. మీదనున్న ఫోటో చూసారు కదా. ఇంచుమించుగా బారతదేశమంతటా ఆటోలు overload ఆటో ప్రయాణాలు ఇలాగే ఉంటాయి. విశాఖపట్నం  ఆటోల్లో ఒకవైపునుండే దిగాలి. ఒకవిధంగా అది మంచిదే. పక్కనుండి ఏ బైకో, కారో వచ్చిన వాటి క్రిందపడి ప్రాణానికి ముప్పు తెచ్చుకోనవస్రంలేదు..  హైదరాబాద్ లో ఆటోలకి రెండు వైపులా opening ఉంటాయి. 

ఇంక ఆటోల్లొ పెద్ద స్పీకర్స్ పెట్టి పాటలు వినిపిస్తుంటారు. ఈ శబ్దకాలుష్యం భరించలేనంతగా ఉంటుంది. ఆటో driver ని ఆపమన్నా ఆపడు. పోనీ ఆ పాటలైనా కాస్త మంచివి వినిపిస్తాడా అంటే అదీ లేదు. పాటలో ఒక్క ముక్క కూడా అర్ధం కాదు. 
ఈ ఆటోలకి లోడింగ్ సమస్యలేదు. ఎంతమందినైనా ఎక్కించుకుంటాడు. driver కి చెరువైపులా ఇద్దరు. ఇంక సీట్లలో ఇంచుమించుగా ఒకరి ఒళ్ళో ఇంకొకరు కూర్చున్నట్లే ఉంటుంది. దారిలో ఎవరైనా మనమీదనుండి మన కాళ్ళు తొక్కుతూ ఆటోల్లోకి ఎక్కుతారు. దిగినప్పుడు కూడా అడే అవస్థ.
ఇన్ని ఇబ్బందులున్నా ఆటోల్లో ప్రయాణాలు తప్పడంలేదు. అవసరం మనది. సర్దుకిపోవాల్సిందే మరి !!
-- పొన్నాడ మూర్తి.

చూపుల తూపులు


నా పై పెన్సిల్ చిత్రానికి facebook మిత్రుల కవితా స్పందన
చెక్కిలిపై చెయ్యిపెట్టి
కనుబొమల వింటి నెక్కుపెట్టి
చూపుల తూపులు సంధించి

మొలక నవ్వులతో బంధించి
ఏ హృదయ సామ్రాజ్యాన్ని
ఆక్రమించి
రాణివై ఏలావో!!

(సింహాద్రి జ్యోతిర్మయి)
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------

స్వర్గమెలా ఉంటుందో..చెప్పగలదు నీ చూపే..!
ఈ జన్మకు పరమార్థం..తెలుపగలదు నీ చూపే..!
నీ జతలో ప్రతిఅడుగు..ఎంతహాయి ఇస్తుందో..
వేదాంతపు గగనాలకు..నడుపగలదు నీ చూపే..!
మూయలేని మూతబడని..ఈ కన్నుల నీ రూపే..
మాయఅడవి దారులెల్ల..కాల్చగలదు నీ చూపే..!
ఇంద్రధనువు వర్ణాలకు..శ్వాసనింపు కళ ఏదో..
మౌనానికి ఒక అద్దం..పట్టగలదు నీ చూపే..!
చిరునవ్వుల దారాలకు..మెఱుపులేల పొదిగేవో..
కాంతిపూల సెలయేఱుగ..మారగలదు నీ చూపే..!
మాధవుడా జగాలనే..మరపించే గజల్ నీది..
వెన్నెలింటి మధువేదో..పంచగలదు నీ చూపే..!
(మాధవరావు కొరుప్రోలు గారి గజల్)

7, ఏప్రిల్ 2018, శనివారం

ఆనంద భైరవి

నేను వేసిన చిత్రాలతో "ఆనంద భైరవి" 

'అందమె ఆనందం, ఆనందమె జీవిత మకరందం' అంటాడు' సినీ కవి సముద్రాల.
"ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే----
అనురాగపు టంచులు చూస్తాం,
ఆనందపు లోతులు తీస్తాం. " అంటాడు శ్రీశ్రీ.
'ఒకరికి మోదం ఒకరికి ఖేదం, సకలము తెలిసిన నీకు వినోదం' అంటాడు భగవంతుణ్ణి ఉద్దేశిస్తూ సినీ కవి పింగళి.

"ఆనందంగా ఉండడానికి బయటి పరిస్థితుల మీద ఆధారపడకూడదు అని, అన్ని అనుభూతులు మనలోనే కలుగుతాయని, మీ జీవితానుభూతి అంతా పూర్తిగా నిర్ణయించేది మీరేనని" సద్గురు గుర్తుచేస్తున్నారు. 

నిజమే .. ! ఎందరో చిత్రకారుల చిత్రాలు చూడడం, బొమ్మలు వేసుకోవడం, అలనాటి హిందీ, తెలుగు చిత్రాలలో పాటలు వినడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఏదైనా కారణం వల్ల మనసు కలత చెందితే ఓ సారి ఆర్కె. లక్షణ్, బాపు గారి చిత్రాలు, కార్తూన్ల పుస్తకాలు తిరగేస్తే అన్నీ మరచిపోతాను. 

మరి ఈ విషయంలో ఈనాడు దినపత్రికవారేమంటున్నారో చదవండి.

"ఓ కవిగారు రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. మనసంతా దిగులుగా ఉంది. మనిషి దుఃఖపడుతున్నాడు. ‘సంతోషంలో ఉన్నప్పుడు పాటలు వినాలి, బాధలో ఉన్నప్పుడు వాటిని అర్థం చేసుకోవాలి’ అన్న సుభాషితం గుర్తొచ్చింది. ‘ఔను నిజం ఔను నిజం చేదు విషం జీవఫలం... జీవఫలం చేదు విషం’ అన్న శ్రీశ్రీ కవితను గురించి మనసులో విశ్లేషణ మొదలుపెట్టాడు. ఇంతలో ఒక పసిపాపడు ఆయన దృష్టిని ఆకర్షించాడు. ‘బొటవ్రేల ముల్లోకములు చూచి లోలోన ఆనందపడు నోరులేని యోగి’ అన్న జాషువా పద్యం ఆలోచనల్లోకి వచ్చింది. బోసి నవ్వులు చిందిస్తూ తనవైపు చిట్టిచేతులు ఊపుతూ కేరింతలు కొడుతున్న ఆ పసివాడు అంత హాయిగా నిశ్చింతగా ఎలా ఉండగలుగుతున్నాడన్న దిశగా ఆలోచన సాగింది. చాలాసేపు మథనపడ్డాక ‘ఆనంద మానంద మానందమే గాని అన్యభావము లేవి ఆత్మ చొరని యట్టి నిరంతర ఆనంద స్వరూపుడగుట చేసి’ అని కవి తీర్మానించుకున్నాడు. ‘అందరూ ఆనంద స్వరూపులే’ అంటుంది వేదాంతం. ‘కాదు పొమ్మంటుంది నిజ జీవితం’ అని నిట్టూర్చాడు. చటుక్కున గొప్ప సత్యం ఎరుకకు వచ్చింది. పిల్లవాడి ఆనందానికి మూలాలు వెతికే క్రమంలో- అప్పటివరకు దట్టంగా ఆవరించిన దిగులు, విచారం తన నుంచి దూరం అయ్యాయని ఆయన గమనించాడు. మనసు తేలిక పడినట్లు ఒంటరితనం తొలగిపోయినట్లు ఆయనకు అర్థమైంది. లోకానికి తనకు మధ్య తాను కట్టిన అడ్డుగోడలు కూల్చేసి, వంతెనలు నిర్మించగలిగితే పసివాడినుంచే కాదు- లోకంనుంచీ వసివాడని ఆనందం ప్రసారం అవుతుందని తెలిసింది. ‘కలత వొద్దు కొలత వొద్దు అలసట అలజడి వద్దు... కలసి కదిలే బతుకే లలిత లలిత లతాంతమాల’ అన్న తిలక్‌ కవిత తన గుండెల్లో ఏదో రహస్యం చెప్పినట్లనిపించింది. 
లోకంలో ప్రతి మనిషీ ఆనందంగా ఉండాలనే కోరుకుంటాడు. కొందరు నిజంగానే ఉంటారు. చాలామంది ఉన్నామనుకుంటారు. భక్తిలో రక్తిలో రతిలో విరక్తిలో ఆనందాన్ని అన్వేషించడం మనిషి సహజ స్వభావం. ‘ఎందే డెందము కందళించునో... ఎక్కడ మనసు రమిస్తుందో అదే ఆనంద స్థావరం’ అని వాదించింది మనుచరిత్రలో వరూధిని. సుఖసంతోషాలకు, ఆనందానుభూతికి మధ్య తేడా లేదంది. సుఖం- శారీరకం. సంతోషం- మానసికం. వీటికన్నా ఆనందం చాలా ఉన్నతమైనది. అది ఆత్మకు చెందిన విశిష్ట అనుభూతి. కాబట్టే ‘చెప్పకుము ఇట్టి తుచ్ఛ సుఖముల్‌ మీసాలపై తేనియల్‌’ అంటూ వరూధిని ప్రతిపాదనను ప్రవరాఖ్యుడు తిరస్కరించాడు. శారీరక సుఖాలు ఆత్మానంద ప్రాప్తికి కారణాలు కావన్నాడు. ‘సంతోషించితి చాలు చాలు రతిరాజ ద్వార సౌఖ్యంబులున్‌’ అంటూ ధూర్జటి నిరసించింది దాన్నే. ‘అంభోజాక్షీ చతురంతయాన తురగీ భూషాదులు ఆత్మవ్యధా బీజంబుల్‌... క్షోభకు కారణమవుతాయి’ అని తేల్చి చెప్పాడు. ఆత్మకు చెందిన ‘జ్ఞానలక్ష్మీ జాగ్రత్‌ పరిణామమిమ్ము దయతో’ అంటూ పరమశివుణ్ని ప్రాధేయపడ్డాడు. మనిషికి గొప్పదనాన్ని, మనసుకు సంతృప్తిని, ఆత్మకు ఆనందాన్నీ ఆపాదించేవి ఏవో భర్తృహరి చెప్పాడు. ‘కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, వర హృదయంబునన్‌ విశిద వర్తనము అంచిత విద్య వీనులన్‌...’ చేతికి దానం, నోటికి సత్యం, దోషంలేని నడవడి, చక్కని విద్యల వినికిడి- మనిషి వ్యక్తిత్వానికి శోభనిస్తాయన్నాడు. ఆ సమయాల్లో శరీరంలో వెలువడే ‘ఇంటర్‌ ఫెరాన్‌ గామా’ అందుకు కారణమని ఆధునిక వైద్యశాస్త్రాలు తేల్చాయి. దాన్ని ‘ఆనంద జన్యువు’గా చెప్పాయి. దాన్నే కవులు ‘అంతరంగమందు ఆనంద వార్నిధి’గా వర్ణిస్తారు. ‘ఆనందాన్ని ఇవ్వడం ద్వారా ఆనందాన్ని పొందడం’ ఒకానొక అద్భుతమైన అనుభూతి. 
‘ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము. నరుడు నరుడౌట ఎంతొ దుష్కరమ్ము సుమ్ము’ అన్నాడు గాలిబ్‌ మహాకవి. మరణించేలోగా మనిషి సాధించవలసింది దాన్నే! ‘చక్రవర్తిగా న్యాయమూర్తిగా బలవంతుడిగా... ఎలాగైనా జీవించవచ్చు, కానీ చివరకు మనిషిగా మారితేనే- అది పరిపూర్ణ జీవితం’ అన్నాడు ఒక తత్వవేత్త. ఇదే భారతీయ తత్వచింతన సారాంశం! ఆ పరిపూర్ణత సాధించడంలోనే అసలైన ఆనందం దాగి ఉంది. నిజానికి ఆ ప్రయాణమే ఒక కాంతియానం! మన కుటుంబ వ్యవస్థను ఆ లక్ష్యంతోనే పెద్దలు తీర్చిదిద్దారు. ‘పసితనమందె రామకథ భారతగాథ నవీన సత్కథల్‌ రసమయరీతి నేర్పి అనురాగముతో, క్రమశిక్షణమ్మునన్‌’ పిల్లలను తీర్చిదిద్ది ఈ దేశం గర్వించదగిన పౌరులుగా రూపొందించడం పెంపకంలో భాగం. ఆ తరహా ఎదుగుదలలో సంతోషం ఇమిడి ఉంది. కుటుంబ వ్యవస్థలోని ఆత్మీయులతో అనురాగాలతో మనిషి ఆనందం ముడివడి ఉంటుంది. నిర్మల హృదయం నిస్వార్థ జీవనం సేవాతత్పరతలు- మనిషి పరిపూర్ణతకు, సంతోషమయ జీవనానికి పునాదిరాళ్లు. ఆనందం మనిషికి అత్యవసర దినుసు. ఐరాస లెక్కల ప్రకారం సంతోషం వెల్లివిరిసే జనాభాలో ఇండియా 133వ స్థానానికి దిగజారింది. సామాజిక సామరస్యం, స్వేచ్ఛ, ఔదార్యం వంటి సామూహిక సహజీవనానికి సంబంధించిన అంశాల్లో భారత్‌ ప్రాభవం క్రమేపీ మసకబారుతోంది. ప్రజల జీవితాల్లోంచి ఆనందం ఆవిరవుతోంది. ‘వేదాంతము నిత్య జీవితమునందు అనుభూతికి తెచ్చుకొమ్మికన్‌’ అన్న హితోక్తులను ఒంటపట్టించుకొంటే గాని సంతోషం చిరునామా అంతు చిక్కదు. ‘చెట్టునైనా కాకపోయాను, ఏడాదికోసారైనా వసంతం వచ్చి పలకరించేది’ అని శేషేంద్రశర్మ వాపోయినట్లు, మనిషిగా మారితే తప్ప సంతోషం దక్కదు. ‘నీదైన చిత్తశుద్ధికి పాదాక్రాంతంబగును ప్రపంచంబెల్లన్‌’ అన్న సూక్తి తలకెక్కితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది". (courtesy : ఈనాడు సంపాదకీయం 1s April 2018)

6, ఏప్రిల్ 2018, శుక్రవారం

పంచభూతాల దాడి = కవిత


నా పెన్సిల్ చిత్రానికి మిత్రురాలు శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి గారి కవిత

పంచభూతాల దాడి
కన్నీటికుండలు
ఎన్ని కుమ్మరించినా
మనసు అగాథం లోని
బాధల బడబాగ్ని
చల్లారటం లేదు.
అపార్థాల భూకంపాలు
ప్రేమ పునాదుల్ని కదిల్చి
అనుబంధాల మేడల్ని
కుప్పకూలుస్తున్నాయి
కనురెప్పల వాకిళ్ళు
ఎంత గట్టిగా బిగించినా
తోసుకొచ్చే సుడిగాలిలా
అలజడి దొంగ
అంతరంగంలో జొరబడి
నిద్రను కాజేస్తున్నాడు
అనంతమనుకున్న
ప్రేమకాశం
శూన్యమని
నెత్తిన పిడుగుపడ్డాకే అర్థమయ్యింది
గుండెను మండిస్తున్న
నిజమనే నిప్పు
ఆత్మశాంతి వనాలను
దావానలంలా‌ దహిస్తోంది.
పంచభూతాలు
పంచప్రాణాలపై పగబట్టి
తమలో ఐక్యం చేసుకోవాలని
ఆరాటపడుతున్నాయి.
మరి
ఈ పోరాటంలో
విజయం
ప్రకృతికో!
ప్రాణాలకో!!

నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...