30, అక్టోబర్ 2021, శనివారం

ఈ పాదమే కదా యిల యెల్లఁ గొలిచినది - అన్నమయ్య


 


అన్నమయ్య  కీర్తన : ఈ పాదమే కదా యిల యెల్లఁ గొలిచినది
చిత్రం : పొన్నాడ మూర్తి, 
విశ్లేషణ : డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల

పల్లవి:

ఈ పాదమే కదా యిల యెల్లఁ గొలిచినది
యీ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది
చరణములు:
ఈ పాదమే కదా యిందఱును మ్రొక్కెడిది
యీ పాదమే కదా యీ గగనగంగ పుట్టినది
యీ పాదమే కదా యెలమిఁ బెంపొందినది
యీ పాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది
ఈ పాదమే కదా యిభరాజు దలఁచినది
యీ పాదమే కదా యింద్రాదు లెల్ల వెదకినది
యీ పాదమే కదా యీ బ్రహ్మ గడిగినది
యీ పాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది
ఈ పాదమే కదా యిహపరము లొసగెడిది
యీ పాదమే కదా యిల నహల్యకుఁ గోరికైనది
యీ పాదమే కదా యీక్షింప దుర్లభము
యీ పాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది

ఓం నమో వేంకటేశాయ !

ప్రార్ధన ( భాగవతం)
మ॥
ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై
పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై
సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై
వరుసన్ నీఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణా!

శ్రీమన్నారాయణుని చరణారవిందాల ఘనతను వర్ణించిన ……

‘ఈ పాదమేకదా యిల యెల్లగొలిచినది |ఈ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది ||’ అనే
అన్నమయ్య కీర్తనను గురించి మనం ఈ వారం తెలుసుకుందాం.

దానికన్నాముందు పాదాల ప్రాముఖ్యత
గురించి నాలుగు మాటలు!
పెద్దవాళ్ళ పాదాలకు నమస్కరించడం భారతీయ సంప్రదాయం.
వినయ విధేయతలకు గుర్తు!
పాదాలకు నమస్కరించడం వెనక అంతరార్థం ఏవిటి?
మనలోని అహంకారం తగ్గించుకుంటేనే వంగి మరొకరి కాళ్ళకు నమస్కరించ గలుగుతాం.
కాబట్టి అహంకార రాహిత్యానికి అది నిదర్శనం.
మనపాదాలు ఇతరులకు తగలకుండా చూసుకోవడం మర్యాద!
ఎవరికైనా మనపాదాలు తగిలితే మన్నించమంటాం.
శరీరంలో అవయవాలన్నిటికన్నా అడుగున ఉన్నందుకేమో పాదానికి అడుగు అనే పేరుంది. కానీ ఆ అడుగులు తడబడితే పడతాం.
అవి సరిగా పడితే ముందుకు వెళతాం।
అడుగున ఉన్నా మనశరీరాన్నంతా మోసేవి పాదాలే!
వాటి విలువను మనం గ్రహించక పెద్దగా వాటిని పట్టించుకోం.
కానీ అవిశుభ్రంగా ఉంటే సగం ఆరోగ్యం ఉన్నట్లే. పెద్దల అడుగుజాడలు అంటాం. అంటే వాళ్ళ పద్ధతులు అని అర్థం!
పాదాలకు కూడ సాముద్రికముంది. పాదాల వ్రేళ్ళను బట్టికూడ మనస్తత్వంచెబుతారు.
కావ్యనాయికల వర్ణనలలో పాదాల వర్ణన కనబడుతుంది. వాటిని పద్మాలతో, చివురాకులతో పోల్చడం, మువ్వల పట్టీలున్న, పారాణి పెట్టుకున్న పాదాల అందాలు వర్ణించడం వంటివి ఎన్నో ఉన్నాయి.
ఎవరినైనా పూర్తిగా వర్ణిస్తే
ఆపాద మస్తకం వర్ణించారంటాం. దేవాలయంలో అర్చామూర్తిని దర్శించేటప్పుడు మనచూపులు పాదాలనుంచి క్రమంగా పైకి జరగాలి.
ఇలాంటివి అనేక విశేషాలు చెప్పుకోవచ్చు.

*జగన్నాథుని పాదాలఅందచందాలు
‘శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే’ మకుటం గాగల శ్రీ వేంకటేశ్వర ప్రపత్తిలో
ఏవిధంగా కీర్తించారో మనందరికీ విదితమే. ఒక్క వర్ణనను ఆస్వాదించి
తరవాత అన్నమయ్య కీర్తన చూద్దాం.

తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ
బాహ్మై ర్మహోభి రభిభూత మహేంద్రనీలౌ
ఉద్య న్నఖాంశుభి రుదస్త శశాంకభాసౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ॥

భావం-
ఆ చరణముల అరుణ ద్యుతి పద్మరాగమునే గెలవగలిగినది. ఆ మీగాలి ( పాదంపై భాగం) కాంతి ముందు ఇంద్రనీలమణి ప్రభలు ఎందుకూ కొరగావు. ఇక గోళ్ళు చంద్రకాంతిని తలదన్నగలవి. అటువంటి స్వామి వారి పాదాలను శరణుగోరుతున్నాము .

ఇటువంటి శ్రీపతి పాదాలను
నిరంతరం ధ్యానించే అన్నమయ్య తన కీర్తనలో శ్రీ హరి పాద మహిమను ప్రస్తుతిస్తున్నాడు.

*కీర్తన భావ సౌరభం
~~~~~~~~~~~
ఈ పాదమే కదా వామనావతారంలో భూమండలమంతా కొలిచింది!ఈ పాదం నుండే గంగ పుట్టి విష్ణు పాదోద్భవ అయింది. ఆ గంగను బ్రహ్మ తన కమండలంలో పట్టుకున్నాడట. వామనావతారంలో శ్రీ హరి తన రెండవ అడుగుగా ఆకాశాన్ని కొలిచినప్పుడు బ్రహ్మ తన దగ్గరున్న గంగతో ఆయన పాదం కడగడం వలన బ్రహ్మకడిగిన పాద మైంది.
ఈ పాదం అనంతమైనది. ఇంద్రాది దేవతల కు ఆ అడుగే ఇడుములు పోగొట్టగలది.
కరిరాజును బ్రోచిన పాదం ,లోకాలకు మేలు చేసే పాదం ఆ హరిపాదమే! భక్తితో మొర పెడితే పరుగున వచ్చిన కథలెన్ని!!
ఈ పాదానికి మించిన అందం ఎక్కడుంది?
ఈ పాదమే కదా రామావతారంలో అహల్యకు శాపవిమోచనం కలిగించింది !
(కృష్ణావతారంలోని ఈ పాదమహిమ మరో కీర్తనలో అన్నమయ్య కీర్తించాడు. అక్కడి విశేషాలలో కాళీయ మర్దనం ముఖ్యమైనది.)
అంతటి మహిమ గలవి, అందమైనవీ, సుకుమారమైనవీ అయిన పాదాలు ఎందరి భక్తుల కోసం పరుగులు తీసి అలిసిపోయాయో అని లక్ష్మీ దేవి ప్రేమతో పాదాలొత్తుతుంది ! భాగ్యదేవతఅయిన లక్ష్మీదేవి అది తన భాగ్యమనుకుంటుంది.

ఈ కీర్తన భావానికి నాహృదయ స్పందన జోడించి సీసపద్యంగా వ్రాసాను . చిత్తగించండి.
సీ॥
ఏచరణకమలమ్మిల గొల్చినట్టిది
యద్దాని దాల్తునా యౌదలందు!

ఏపాద పద్మమ్ము నిభరాజు శరణనె
నద్దాని నెదపైన హత్తుకొందు!

ఏయంఘ్రిఁదామర నిందిర సేవించు
నదినన్ను బ్రోవగ నాశ పడుదు!

ఏపదకంజమ్ము నింద్రుడుమ్రొక్కునో
నయ్యది చూపదే యసలు ద్రోవ!

తే.గీ
ఆయడుగె తీర్చుఁగష్టములమరతటికి !
అదియె మోక్షమార్గమనిరి యఖిల మునులు!
అదియనగనేది మరియేది హరిపదంబు!
అనుచు కీర్తించె నన్నమయ్యార్తితోడ

ఆ హరి చరణాలను సేవించి తరిద్దాం.

నీపాద కమల సేవయు
నీపాదార్చకులతోడి నెయ్యము నితాం
తాపార భూతదయయును
తాపస మందార నాకు దయసేయ గదే!

22, అక్టోబర్ 2021, శుక్రవారం

ముద్దు గారీ జూడరమ్మ మోహన మురారి వీడె మద్దులు విరిచిన మా మాధవుడు - అన్నమయ్య కీర్తన

 





భావం సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala
చిత్రాలు : Pvr Murty
సహకారం : శ్రీమతి Ponnada Lakshmi

ముద్దు గారీ జూడరమ్మ మోహన మురారి వీడె
మద్దులు విరిచిన మా మాధవుడు
చల్ల లమ్మ నేరిచినజాణ గొల్లెతల కెల్ల
వల్లెతాడు మా చిన్న వాసుదేవుడు
మొల్లపు గోపికల మోవిపండులకు నెల్ల
కొల్లకాడు గదమ్మ మా గోల గోవిందుడు
మందడిసానుల కమ్మని మోముదమ్ములకు
చెందినతుమ్మిదవో మా శ్రీకృష్ణుడు
చంద మైన దొడ్డీవారి సతులవయసులకు
విందువంటివా డమ్మ మా విఠ్ఠలుడు
హత్తిన రేపల్లెలోని అంగనామణుల కెల్ల
పొత్తుల సూత్రము మా బుద్ధుల హరి
మత్తిలి వ్రేతెల నిండుమనసుల కెల్లాను
చిత్తజునివంటి వాడు శ్రీ వేంకటేశుడు

ప్రార్థన

శా. శ్రీలక్ష్మీధవ! వాసుదేవ!వరరాజీవాక్ష! పద్మాసన!
వ్యాళాధీశ్వర!శర్వషణ్ముఖ శుకాద్యస్తోత్రసత్పాత్ర! గో
పాలానీకముఖాబ్జభాస్కర!కృపాపాథోది! నన్ గావు, మూ
ర్ధాలంకార మయూరపించధర!కృష్ణా! దేవకీనందనా!
ఓం నమో వేంకటేశాయ 🙏
ఈ వారం మనం విశ్లేషించుకో బోయే అన్నమయ్య కీర్తన ……
“ముద్దు గారీ చూడరమ్మా మోహన మురారి వీడే” ఈ కీర్తన చూడటానికి చాలా సులభమైన పదాలతో ఉన్నట్లే కనబడుతుంది. చాలా పదాలు వాడుకలో లేనివి, చాలా అంతరార్థం కలవీ. నాకు తెలిసినంత వరకూ ప్రయత్నిస్తాను।

🔹పల్లవి

‘ముద్దు గారీ జూడరమ్మ మోహనా మురారి వీడె
మద్దులు విరిచిన మా మాధవుడు’
‘ముద్దుకారిపోయే ఆ మోహన మురారిని చూడండమ్మా!
ముద్దులొలికే పసి బాలుడు ఆ రోలు నెట్లా లాగాడు? ఆ మద్దిచెట్ల నెట్లా విరిచాడు మా మాధవుడు?… అంటూ మాధవుడని తనకు సొంతం చేసుకొని గర్వపడిపోతూ చెబుతున్నాడు.

🔹ఇక మొదటి చరణంలో ….
‘చల్ల లమ్మ నేరిచినజాణ గొల్లెతల కెల్ల
వల్లెతాడు మా చిన్న వాసుదేవుడు
మొల్లపు గోపికల మోవిపండులకు నెల్ల
కొల్లకాడు గదమ్మ మా గోల గోవిందుడు’ అంటాడు!

*చల్లలమ్మ నేర్చిన జాణలట గోపెమ్మలు. చల్ల అమ్ముడు పోవాలంటే ఎంత మాటకారితనం ఉండాలి … అందులోనూ పాడి పుష్కలంగా ఉన్న ఆ కాలంలో మజ్జిగమ్మడమంటే మాటలా!
ఆ మాటలు నేర్చిన జాణలకు ప్రేమ పాశం వేసినవాడు ఈ చిన్న వాసుదేవుడు। ఎలా వేసాడు పాశం? తన మోహన రూపంతో , తన చిలిపి పనులతో …।
వాళ్ళంతా (మొల్లపు)అతిశయం గల గోపికలు! అయితేనేం దొండ పళ్ళవంటి వాళ్ళ పెదవుల మధువులను కొల్లగొట్టిన వాడు. ఈ మాట చెబుతూ గోల గోవిందుడు అంటూ బాగా సరిపోయే విశేషణం తగిలించాడు అన్నమయ్య!

🔹మందడిసానుల కమ్మని మోముదమ్ములకు
చెందినతుమ్మిదవో మా శ్రీకృష్ణుడు
చంద మైన దొడ్డీవారి సతులవయసులకు
విందువంటివా డమ్మ మా విఠ్ఠలుడు
*మందడి సానులంటే గొల్లభామలు. వాళ్ళ ముఖాలు పద్మాలలాగా ఉన్నాయి। ఆ ముఖపద్మాల మీద వాలే తుమ్మెద శ్రీకృష్ణుడు । వాళ్ళంతా పద్దతిగల గోపాలకుల భార్యలు। అంటే అందమైన పసి పిల్లలను ముద్దాడే వయసేగదా! ముద్దులొలికే కన్నయ్య వాళ్ళ కళ్ళకు విందు! ఇక్కడా అంతే మా విఠలుడు అంటాడు. భక్తుడిగా భగవంతునితో చనువు సంపాదించుకున్న అన్నమయ్య కనబడతాడీ కీర్తనలో!
🔹హత్తిన రేపల్లెలోని అంగనామణుల కెల్ల
పొత్తుల సూత్రము మా బుద్ధుల హరి
మత్తిలి వ్రేతెల నిండుమనసుల కెల్లాను
చిత్తజునివంటి వాడు శ్రీ వేంకటేశుడు
*ఆ మోహనాకారుని హత్తుకున్న గోపకాంతలకు చెలిమి బంధం( friend ship band) అదే పొత్తుల సూత్రం ఎవరంటే మా కొంటెబుద్ధుల హరే!
ఆ ముగ్ధమనోహర సౌందర్యాన్ని త్రాగిన గోపికలు మత్తిల్లి ఉన్నారు. భక్తి పారవశ్యమూ మత్తేగదా! అది నిండు మనసు గలవారికే సాధ్యం! అటువంటి మనసుగల వారికందరికీ మన్మధుని వంటి వాడు శ్రీ వేంకటేశుడు! కామమంటే కోరిక! కాముడు భగవంతుని భక్తుని ఏకం చేయగల వాడు. కోరిక ఏదైనా చిత్తమునందే పుడుతుంది. అందుకే తనవైపు ఆకర్షించుకునే చిత్తజుడే నాటి గోవిందుడు ….. నేటి వేంకట పతి 🙏

*పదాలకు అర్థాలు
~~~~~~~~~
వల్లెత్రాడు- పాశము
మొల్లపు -అతిశయముగల
కొల్లకాడు- కొల్లగొట్టు వాడు
మందడి సానులు- గొల్లభామలు
మోము దమ్ములు- వదనారవిందములు
దొడ్డివారి- గొల్లవారి
పొత్తుల సూత్రము- స్నేహ బంధం
వ్రేతెలు- గోపికలు
చిత్తజుడు- మన్మధుడు
~~~~~~
చివరగా కీర్తన సారం నాకందపద్యాలలో ……
కం॥
ముద్దులొలుకు పసితనమున
మద్దులనేగూల్చి నట్టి మాధవుడతడే
ముద్దియల మోము దమ్ములఁ
దద్దయు భ్రమరంబువోలెఁదమితో వ్రాలున్!
కం॥
ఎంతటి పుణ్యము వారిది
అంతటి శ్రీకాంతునట్లు హత్తుకుపోరే!
కంతుండైమది దోచెను
వింతల గోవిందుడతడు వ్రేతల మధ్యన్ !
స్వస్తి 🙏

సంగీత దర్శకుడు "ఎస్. ఎన్. త్రిపాఠి" - Composer S. N. Tripathi


 అద్భుత సంగీత దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్. ఎన్. త్రిపాఠి

(1913-1988) (pencil sketch)

బ్రిటిష్ పరిపాలన అనంతంరం మొట్టమొదటి సారిగా "జై హింద్" అంటూ తొలిసారిగా ఓ పాట స్వరపరిచిన ఘనత స్వంతం చేసుకున్న ప్రఖ్యాత సంగీత దర్శకుడు S. N. Tripathi. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి.

వీరి స్వీయ దర్శకత్వం, సంగీత దర్శకత్వం కూడా వహించి నిర్మించిన చిత్రం "రాణీ రూప్మతి" అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రంలో వీరు స్వరపరచిన 'ఆ లౌట్ కె ఆజా మెరే మీత్' ఓ సంచలన హిట్. ఇప్పటికీ ఈ పాట వివిధభారతి వంటి రేడియో కార్యక్రమాల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాట ముకేష్, లతా మంగేష్కర్ వేరువేరుగా పాడినా ముకేష్ పాడిన పాట ఎక్కువ ప్రజాదరణ పొందింది. వీరు ఎక్కువగా పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలకు సంగీతం సమకూర్చారు.

S. N. Tripathi also known as Shri Nath Tripathi (14 March 1913 – 28 March 1988) was an Indian composer, whose active years were from the 1930s to the 1980s. Tripathi's multi-faceted work range included being a composer, writer, actor, and director of films. His debut film as an independent composer was Chandan (1942). He was the first composer to make use of the slogan "Jai Hind (Victory to India) in a song in films, during the end of the British Raj.

19, అక్టోబర్ 2021, మంగళవారం

"సుందరదాసు' ఎమ్. ఎస్. రామారావు - MS Ramarao (Pencil sketch)


 
ఎమ్. ఎస్. రామారావు (Pencil sketch)
వీరు పేరు చెప్పుకోగానే గుర్తుకొచ్చేవి వీరు అద్భుతంగా గానం చేసిన, తెలుగునాట విశేషంగా ప్రాచుర్యం చెందిన 'హనుమాన్ చాలీసా', 'సుందరకాండ".
ఎమ్మెస్ రామారావు 1921 మార్చి 7 న గుంటూరు జిల్లా అమృతలూరు మండలానికి చెందిన మోపర్రు గ్రామంలో జన్మించారు.
అడవి బాపిరాజు గారి ప్రోత్సాహంతో చలన చిత్ర రంగంలో ప్రవేశించి 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తహసీల్దార్ చిత్రంలో మొదటి సారిగా ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా అనే ఎంకి పాట పాడించారు. ఆ చిత్రంలో నాయక పాత్ర ధరించిన సి.హెచ్. నారాయణరావుకు ఇది గాత్రదానం. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇది మొట్ట మొదటి నేపథ్య గానం గా చెప్పుకుంటుంటారు. తరువాత ఈయన దీక్ష, ద్రోహి, మొదటిరాత్రి, పాండురంగ మహత్యం, నా యిల్లు, సీతారామ కల్యాణము, శ్రీరామాంజనేయ యుద్ధము మొదలైన సినిమాలలో పాడారు.
ప్రఖ్యాత హిందీ చిత్ర సంగీత దర్శకులు ఓ.పీ.నయ్యర్ సంగీత సారధ్యంలో 'నీరాజనం' చిత్రంలో "ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధములో నిదురించు జహాపనా" పాట అద్భుతంగా పాడారు.
1963 సంవత్సరాంతంలో కొన్ని కారణాల వల్ల మద్రాసు వదిలి రాజమండ్రి చేరుకుని 1974వరకు అక్కడే నివసించారు. అక్కడ నవభారతి గురుకులంలో పది సంవత్సరాలు ఉద్యోగం చేసారు. 1970 లో పెద్ద కుమారుడు బాబూరావు భారతీయ వాయుసేన ఇండియన్ ఏర్ ఫోర్స్(IAF)లో పైలట్ ఆఫీసరుగా నియమితుడైనారు. 1971లో పాకిస్థానుతో జరిగిన యుద్ధ కాలంలో అతని ఆచూకీ తెలియ లేదు. తల్లి తండ్రులిద్దరూ భయం చెంది కుమారుని క్షేమం కోసం వాయు కుమారుడైన హనుమంతుని ఆరాధించడం మొదలు పెట్టారు. తర్వాత కొంత కాలానికి అబ్బాయి క్షేమంగా ఇల్లు చేరడంతో శ్రీ హనుమానుడే వారి ఇష్ట దైవమైనాడు. ఆయన హనుమాన్ చాలీసా, సుందరకాండ వ్రాయడానికి అదే ప్రేరణ.

వీరు ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రఖ్యాత పాత్రికేయుడు శ్రీ గుడుపూడి శ్రీహరి వీరిని అనేకరకాలుగా ఆదుకోవడమే కాకుండా వీరి 'హనుమాన్ చాలీసా' 'సుందరకాండ' ప్రాచుర్యానికి చాలా సహకారం అందించారట. ఈ విషయం శ్రీహరి గారు ఓ టీవీ interview లో చెప్పారు. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి ఆ విషయాలు తెలుసుకోగలరు.


1972 నుండి 74 వరకు తులసీదాసు హనుమాన్ చాలీసాను హిందీ నుంచి తెలుగులోనికి అనువదించారు, తన పేరుతో అవినాభావ సంబంధమేర్పడ్డ సుందరకాండ గేయరచన చేశాడు. 1975 నుంచి హైదరాబాదులోని చిక్కడపల్లిలో నివసించారు. రామారావుకు 1977 సంవత్సరంలో సుందరదాసు అనే బిరుదాన్ని ఇచ్చారు. ఈయన ఏప్రిల్ 20, 1992న హైదరాబాదులో సహజ కారణాల వల్ల మరణించారు.

September-October 'తెలుగుతల్లి కెనడా' పత్రికలో 'మూర్తిమంతమాయె' శీర్షికలో నేను చిత్రీకరించిన ఈ ఎమ్.ఎస్. రామారావు గారి చిత్రాన్ని ప్రచురించిన పత్రిక యాజమాన్యానికి నా ధన్యవాదాలు.



15, అక్టోబర్ 2021, శుక్రవారం

"పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు"- అన్నమయ్య కీర్తన


 

"పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు"- అన్నమయ్య కీర్తన

కీర్తన విశ్లేషణ సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala
చిత్రాలు : Pvr Murty (పొన్నాడ మూర్తి)
సహకారం : Ponnada Lakshmi

ప|| పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు | ధరమము విచారించ తగునీకు అమ్మ ||
చ|| కమలజుగన్న తల్లివి కామునిగన్న తల్లి |
అమరులగన్న తల్లి ఆదిమ లక్ష్మి |
విమలపు నీపతికి విన్నపము జేసి మమ్ము |
నెమకి ఏలితి దయ నీకే తగునమ్మ ||
చ|| కామధేను తోబుట్టుగ కల్పకము తోబుట్టుగ |
దోమటి చల్లిన చంద్రు తోబుట్టుగ |
నీమగని పంపునను నిజసిరులిచ్చితివి |
నేమపు వితరణము నీకే తగునమ్మ ||
చ|| పాలజలధి కన్యవు పద్మాసినివి నీవు |
పాలపండే శ్రీవేంకటపతి దేవివి |
ఏలిన యితని బంట్లకు యిహపరాలిచ్చి మా |
పాల గలిగితివి సంబంధము మేలమ్మ ||
ప్రార్థన :

ఉ॥రాముని చేయిబట్టియిల రక్షణ సేసెడి తల్లిజానకీ
నీమము తోడగొల్చెదము నీపదయుగ్మము భక్తిమీరగన్
తామసు డైనరావణు మదంబును గూల్చిన మీరునేడిలన్
క్షేమము గూర్చి సజ్జనుల చింతలు బాపగ గొల్తుమమ్మరో!

🔹విజయదశమిని శ్రీరామచంద్రుడు రావణాసురునిపై సాధించిన విజయం గా జరుపుకుంటారు. లక్ష్మీ దేవే భూమిజ అయిన జానకిగా జన్మించి రావణ సంహారంలో తన పతికి తోడుగా నిలిచింది. అందు వలన లక్ష్మీ దేవిని వేంకటపతిగా కలియుగమున వెలసిన హరికి తన మొరవినిపించమని వేడుకునే అన్నమయ్య కీర్తన ఈ రోజు గుర్తు చేసుకుందాం.
*కీర్తన సారాంశం
అయ్యవారు ఆలకించకపోతే అమ్మవారితో “ననుబ్రోవమనీ చెప్పవే సీతమ్మతల్లీ”అని రామదాసు మొరలిడినట్లే ఇక్కడ అన్నమయ్య కూడా “అమ్మా నీపతితో కాస్త మాగురించి చెప్పవమ్మా” అంటున్నాడు ఈకీర్తనలో.
మనకు ఇళ్ళలో కూడా పిల్లలు తమకు కావల్సినవి అమ్మకు చెప్పి “నాన్నకు నువ్వు చెప్పమ్మా”అనడం మామూలే.
“అమ్మా ఆ పరమాత్మకు ప్రియసతివి. పైగా పట్టపురాణివి. ( మిగిలిన సతులకన్నా పట్టపురాణికి భర్త కు చెప్పే చనువు , ధైర్యం ఎక్కువ). మేం అడిగేది న్యాయమైనదేననీ, ధర్మవిరుద్ధం కాదనీ నీకూ తెలుసు.”అంటూ ఆమె ధర్మనిరతిని ప్రస్తావించి కొంచెం దగ్గరగా జరిగాడు పిల్లాడిలా అన్నమయ్య!
అమ్మైతే మాత్రం పొగడ్తలకు పొంగిపోదా ఏమిటి? చూడండి ఎలా తల్లిని తన మాటలతో మెప్పిస్తున్నాడో…
“ సృష్టికర్త బ్రహ్మకు, సృష్టికార్యానికి నడుంబిగించే మన్మధుడికీ కన్నతల్లివి! ఆదిలక్ష్మివి. ఆ దేవతలే నిన్ను తల్లివని మ్రొక్కుతుంటారు. నా విన్నపం నీ పతికి చేరవేయవమ్మా! ఆయన నిర్మలమైన మనస్సు కలవాడు। కోపిష్టి కాడు. నీ మాటలు వింటాడు. మా విన్నపాలు చెప్పి మమ్మల్ని ఏలగల దయ నీకే ఉన్నది. నీవన్నీ పరిశీలించగల ప్రజ్ఞామతివి!”
ఏ స్త్రీ అయినా ఆమె తోడబుట్టిన వాళ్ళను పొగిడితే , పుట్టింటిని మెచ్చుకుంటే సులభంగా ప్రసన్నమై పోతుంది. ఈ కిటుకు తెలిసిన అన్నమయ్య ఇలా అంటున్నాడు-“కోరిన కోరికలు తీర్చే కామధేనువూ, కల్పవృక్షమూ తోబుట్టువులుగాగల నీలో కూడా కోరికలు తీర్చే గుణం ఉంటుంది. మీరంతా సహజన్ములుకదా తల్లీ ।
తల్లీ నీవు పాలకడలిలో పుట్టావు. పద్మంలో ఆసీను రాలవైనావు…”
(ఇలా అనడంలో చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావం మనగుణగణాల మీద ఉంటుంది గనక నీ మనసూ పాలవలె స్వచ్ఛమైనది,పూవువలె సుకుమారమైనది గా ఉంటుందని సూచన.)
నీ పతిదేవుడు పవళించేదీ పాలపైననే కదా. ఆ పాలకడలిలోనే ఉండే మీదంపతులు మా పాలిట వరప్రదాతలు! ఇహ పరాలను మీ సేవచేసుకునే భక్తులకు ప్రసాదించే మీతో మా సంబంధం విడదీయలేనిది”.
మరో పద్య కుసుమం ఆ జగన్మాతకు అర్పించి స్వస్తి పలుకుదాం.
ఉ॥
కౌస్తుభ హారియైన హరికౌగిలి జేరి ముదంబునొందుచున్
నిస్తుల పాలనన్ జరుపు నేర్పును గల్గిన నిత్యపూజితా
స్వస్తుల మౌదుమమ్మతవ సంస్తుతి సేయగ భక్తియుక్తులన్
కస్తిని బెట్టగా వలదు కామిత దాయిని నిన్ను వేడెదన్
~~~~~
డా. ఉమాదేవి జంధ్యాల

నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...