25, ఏప్రిల్ 2024, గురువారం

రాగ మాలిక - కథ


 మీ చిత్రం - నా కథ.


రాగమాలిక

రచన: మాలా కుమార్


మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడావిడిగా ఉంది.

వంటింట్లో నుంచి " మల్లీ ఇటురా తల్లీ" పిలిచింది పంకజం. తల్లి దగ్గరకు వెళ్ళి "ఏంటమ్మా ఇదంతా ?" అడిగింది మాలిక.


మాలిక ముంగురులు సద్దుతూ "మొన్న మనం వెళ్ళిన పెళ్ళిలో మీ నాన్నగారి స్నేహితుడి కొడుకు నిన్ను చూసి ఇష్టపడ్డాడట. ఈ రోజు మంచిదని, నిన్ను చూసేందుకు రావచ్చా? అని ఇందాక కబురు చేసారు. ఆరింటికి వస్తారు. ఇంకా సమయం ఉంది కదా కంగారేమీ లేదు. చిన్నగా తయారవ్వు" అంది.


"ఆ అబ్బాయి పేరు అనురాగ్. ఈ మధ్యనే యంటెక్  పాసయ్యాడు. నాగార్జున సాగర్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉద్యోగం లో చేరాడు. పిల్లవాడు బాగుంటాడు. బుద్దిమంతుడు. నేను చాలా సార్లు చూసాను. నువ్వు కూడా చూడు. నీకు నచ్చితేనే పెళ్ళి చేస్తాము. బలవంతం లేదు" అనునయంగా అన్నాడు అప్పుడే అటుగా వచ్చిన విశ్వనాథం.


పెళ్ళిచూపులల్లో అనురాగ్ ను చూసిన మాలికకి అభ్యంతరం ఏమీ కనిపించలేదు. తండ్రి చెప్పినట్లే అందంగా ఉన్నాడు. మర్యాదగా మాట్లాడాడు. అందరి ఆమోదంతో నెలలోపలే పెళ్ళి చేసుకొని మాలికని సాగర్ తీసుకెళ్ళాడు అనురాగ్.


"కొత్త పెళ్ళికుతురా రారా... నీ కుడికాలూ ముందు పెట్టిరారా" సరదాగా పాడుతూ భార్యను ఆహ్వానించాడు అనురాగ్.


భర్త ఆహ్వానికి మురిసిపోతూ, కొద్దిగా సిగ్గుపడుతూ లోపలికి అడుగుపెట్టింది. "సీతమ్మా వచ్చిందీ మొగుడింటికీ... సిగ్గంతా చేరిందీ కడకంటికీ..." మేలమాడాడు.


టూ బెడ్ రూంస్, కిచెన్, హాల్, చుట్టూ పూలమొక్కలున్న చిన్న తోట, లోపలంతా చక్కని ఫర్నీచర్, వంటగదిలో గాస్ స్టవ్, కొద్దిపాటి గిన్నెలు, సామానులు అన్నీ పొందికగా అమర్చి ఉన్న చిన్న క్వాటర్ ను ముచ్చటగా చూస్తున్న మాలికతో "ఇదే మన ప్రేమసౌధం. ఎలా ఉంది?" మార్ధవంగా అడిగాడు.


"చాలా బాగుంది.  అండీ... " ఏదో అనబోతున్న కస్తూరితో, "నో అండీ, బండీ. కాల్ మి రాగ్" అన్నాడు.


అమ్మో పేరు పెట్టి పిలవలా?  బామ్మ విన్నదంటే మొగుడిని పేరుపెట్టి పిలవటమేమిటే పిదపకాలం, పిదప బుద్దులు అని మొట్టికాయ వేస్తుంది అనుకుంటూ అప్రయత్నంగా తల తడుముకుంది మాలిక.


రాత్రి వంట చేసి డైనింగ్ టేబుల్ మీద సద్దుతున్న కస్తూరితో "ఇక్కడ కాదు. పద” కంచాలు, గ్లాస్ లు, కొన్ని గిన్నెలు ట్రే లో పెట్టి తీసుకుంటూ అన్నాడు. మిగిలినవి తను తీసుకొని ఎక్కడికబ్బా అంటూ రాగ్ ను అనుసరించింది. ఎప్పుడు అమర్చాడో డాబా మీద చాప వేసి ఉంది. ఇంకో వైపు తెల్లని పక్క పరచి ఉంది. మధ్యలో కొద్దిగా ఎత్తున్న చిన్న రౌండ్ టేబుల్ ఉంది. దాని మీద గిన్నెలు పెడుతూ కూర్చోమన్నట్లు చాప చూపించాడు. పౌర్ణమి రోజులేమో ఆకాశం లో చంద్రుడు తెల్లగా మెరిసిపోతున్నాడు. వెన్నెల కాంతిలో, డాబా మీదకు పరుచుకున్న సన్నజాజీ, చంబేలీ తీగల నిండుగా పూసిన పూవులు చుక్కలతో పోటీ పడుతూ, సువాసనలను వెదజల్లుతున్నాయి. పవనుడు చల్లగా, మృదువుగా మాలిక బుగ్గను తట్టాడు. ఒక్కసారిగా వళ్ళు జల్లుమంది మాలికకి.


"అండీ... ఎంత బాగుంది ఇక్కడ" పరవశంగా అంది.


వెన్నెలలో విందు పసందు అంటూ మాలిక వడిలో తలవాల్చి "తల నిండా పూదండ దాల్చిన నారాణి" అని పాడుతున్న అనురాగ్ జుట్టు నిమురుతూ, కొత్తకాపురం ఎంత మధురంగా మొదలయ్యింది అనుకుంది, చెప్పలేని, వర్ణించలేని భావనతో! వెన్నెల రోజులల్లో డాబా మీద కూర్చొని, సన్నజాజీ, చంబేలీల సువాసన ఆస్వాదిస్తూ, పాటలు పాడుకుంటూ, భోజనం చేయటం అందమైన అనుభవం మాలికకి. పెళ్ళవుతే జీవితం ఇంత బాగుంటుందా? చదివింది చాలులే ఇంక హాయిగా పెళ్ళి చేసుకోండి అని తన స్నేహితులకు చెప్పాలి అనుకుంది. అదే మాట రాగ్ తో అంది. ఆహా అంటూ పెద్దగా నవ్వేసాడు రాగ్. నవ్వుతున్న రాగ్ ను ప్రేమగా చూస్తూ, రాగ్ జుట్టును సుతారంగా కదిలించిన చిరుగాలితో "సడి చేయకో గాలి సడి చేయబోకే" అని హెచ్చరించింది. కాసేపు ఇద్దరూ ఓ మధురమైన భావనలో ఉండిపోయారు.


రాగ్ చాలా మృదుస్వభావి, భావకుడు. చక్కని గాయకుడు కూడా. పాటలంటే చాలా ఇష్టం. అందుకే అనురాగ్ ను రాగ్ చేసాడు. ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చాక "పదపద కృష్ణమ్మ ఇంకా నిన్ను చూపించలేదేమని కోపం చేస్తోంది పద" హడావిడి చేసాడు.


డాం దగర పరిసరాలు ఆహ్లాదంగా ఉన్నాయి. చిన్నగా నడుచుకుంటూ డాం దగ్గరగా వెళ్ళారు. తెరిచిన గేట్ ల నుండి పొగలు చిమ్ముతూ, గంతులు వేస్తూ దూకుతోంది కృష్ణమ్మ. గాలికి కదులుతున్న చీరను ఓ చేత్తో పట్టుకొని, వెంట్రుకలను మరో చేత్తో సవరించుకుంటూ కృష్ణమ్మ పరవళ్ళను చూస్తోంది మాలిక. చిరుజల్లులను అక్షింతల్లా చల్లుతూ నవవధువును ఆప్యాయంగా పలకరించింది కృష్ణమ్మ. చిన్నచిన్న గులాబీరంగుపూలున్న తెల్లచీర, వదులుగా వేసుకున్న పొడవాటి జడలో సన్నజాజులమాల, కృష్ణమ్మ చల్లిన అక్షింతలతో కొద్దిగా తడిసిన చీరలో ముగ్ధమనోహరంగా ఉన్న మాలికను పరవశంగా చూస్తూ...


"వీణ వేణువైన సరిగమ విన్నావా

ఓ, తీగ రాగమైన మధురిమ కన్నావా"


అని పాడుతున్న రాగ్ వైపు చిరుసిగ్గుతో నవ్వుతూ చూసింది మాలిక.


వడ్డున ఉన్న శివాలయంలో శివుని అర్ధభాగం లో ఉన్న గౌరి వారిని ముచ్చటగా చూస్తోంది. అది చూసిన గంగ "నీకేం తల్లీ హాయిగా విభుని ఆక్రమించుకొని ఎన్ని రాగాలైనా తీస్తావు" అంటూ కోపంగా కాస్త ధారను పెంచింది.


"నీకు మాత్రం ఏమయ్యింది? మొగుడి నెత్తినెక్కి తాండవమాడుతున్నావుగా!" అని తడిసిన కొంగును గంగ మీదకు దులపరించింది గౌరి చిరాగ్గా!


పెళ్ళాల గొడవకు తపోభంగమయి "హూం" అని హుంకరిస్తూ కళ్ళు తెరిచాడు శివయ్య. అంతే ఇద్దరూ గప్ చుప్...


సవతులపోరు తెలియని రాగమాలికలు పాటలపల్లకీ ఎక్కి కృష్ణమ్మ అనురాగంలో తడిసి ముద్ద అవుతున్నారు.


(నిన్ననే ఈ చిత్రం చూసాను. నేను కవితలు రాయలేను. నిన్న ఈ చిత్రం చూడగానే ఇలా అనిపించి ఈ మినీ కథ రాసాను. ఇది కథా? కథకు కళ్ళు లేవు, ముంతకు చెవులు లేవు అనకండి. ఇలా అనిపించింది, అలా రాసేసాను. ఇక చదివేవాళ్ళ కంటిసిరి :))

24, ఏప్రిల్ 2024, బుధవారం

బి. గోపాలం - సంగీత దర్శకుడు, , నటుడు




బి గోపాలం - సంగీత దర్శకుడు గాయకుడు నటుడు 

(my charcoal pencil sketch) 


Facebook మిత్రులు వీర నరసింహారాజు గారి వాల్ నుండి సేకరణ యధాతధంగా. వారికి నా ధన్యవాదాలు. 

గాయకుడు బి (బొడ్డు) గోపాలం గూర్చి కొందరికి అయినా తెలుసనుకుంటా!


"అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ" అని కె వి రెడ్డి గారి శ్రీకృష్ణార్జున యుద్ధములో అల్లు, సురభి బాల సరస్వతి మీద  తీసిన హాస్య గీతం గుర్తుందా?. ఆ గీతాన్ని పాడింది గోపాలం, స్వర్ణలతలు.


శ్రీరామాంజనేయ యుద్ధము 1974 లో అర్జా జనార్దన్ రావు గారికి పాటలు అయితే గాయక నటుడు రఘురామయ్య పాడారు గానీ పద్యాలు వచ్చేసరికి మరో గాయకుణ్ణి వెదుక్కోక తప్పలేదు. అవి అద్భుతంగా నాటక ఫక్కీలో బాలుతో పాడింది బి గోపాలమే. 


శాస్త్రీయ సంగీతము క్షుణ్ణంగా అభ్యసించి వాయులీనం కూడా నేర్చుకున్న  గోపాలం చిత్ర రంగానికి వచ్చి ఘంటసాల మాష్టారు వద్ద సహాయకునిగా ఉన్నారు తొలినాళ్లలో. 


తరువాత  కన్నడ నటుడు , దర్శక నిర్మాత  కెంపరాజ్  మన భానుమతి గారితో నటించాలన్న కోరికతో తీసిన నలదమయంతి 1957 చిత్రం ద్వారా పూర్తి సంగీతం చేసి, అందులో నారద పాత్ర వేసి మెప్పించినా ఆ చిత్ర పరాజయం తో మళ్లీ సంగీత సహాయకునిగా ఉండి పోయారు. 


1961లో రచయిత పాలగుమ్మి పద్మరాజు దర్శకుడు గా వచ్చిన బికారి రాముడు లో మళ్లీ తన అద్భుత ప్రతిభ చూపారు. అందులో శ్రీరంగం గోపాల రత్నం గారు పాడిన "నిదురమ్మా నిదురమ్మా కదలీ రావే మాయమ్మా" పెద్ద హిట్. ఆ చిత్రం సంగీతం వినగానే అప్పగింతలు 1962 అనే మరో చిత్రం వచ్చింది. రెండింటి సంగీతం బాగున్నా ఆ చిత్రాల పరాజయం తో మళ్లీ అవకాశాలు దొరక్క గాయకుడు గా కూడా అవతార మెత్తారు. అలా పెండ్యాల గారు ఆయన్ని పాడించారు. తర్వాత రాజేశ్వరరావు వద్ద సహాయకునిగా ఉన్నారు.


రేడియో గాయని రేణుక  బి గోపాలం భార్యయే.


ఎందుకో వాళ్ళ ప్రతిభ బాగున్నా పెద్దగా అవకాశాలు రాకపోవడం తో తిరిగి నాటకాలకు వెళ్లి పోదాం అని అనేకమార్లు వెళ్ళిపోయి తిరిగి అవకాశాలు రావడం తో చివరగా పెద్దలు మారాలి, కరుణామయుడు చిత్రాలకు సంగీతం చేశారు. 


అవి హిట్ అయినా ఆయనకు పేరు రాలేదు. చూడండి వింత . మంచి సంగీతం చేసినా చిత్రాలు విజయవంతం కాకపోవడం తో అవకాశాలు రాలేదు, చిత్రాలు హిట్ అయినా ఆ తర్వాత అవకాశం రాలేదు. పూర్తిగా ఇది దురదృష్టమే కదూ.  


శ్రీరంగం గోపాల రత్నం గారు శాస్త్రీయ సంగీతకారిణిగా బాగా పేరు వచ్చాక ఆయనతో అన్నమయ్య గీతాలు ఆల్బమ్ ఒకటి " అన్నమయ్య పద సౌందర్యము" చేయించి HMV కోసం పాడారు. ఆ రికార్డ్ కూడా పెద్దగా హిట్ అయింది. 


తర్వాత గోపాలం గారు స్వంత ఊరు గుంటూరు వెళ్ళిపోయి అక్కడే నివసిస్తూ 2004 లో  తనువు చాలించారు.

23, ఏప్రిల్ 2024, మంగళవారం

కళాప్రపూర్ణ ద్వారం భావనారాయణ రావు charcoal pencil sketch

ఈ చిత్రంలో వ్యక్తి కీర్తిశేషులు ద్వారం భావనారాయణ రావు.  ఇతడు ద్వారం వెంకటస్వామి, జగ్గయ్యమ్మ దంపతులకు 1924 జూన్ 15 తేదీన బాపట్లలో జన్మించారు. చెన్నైలో విద్యాభ్యాసం చేసిన తర్వాత తండ్రి వద్ద, ప్రొ.పి.సాంబమూర్తి వద్ద సంగీతంలో శిక్షణ పొందారు. 

ఇతడు విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ గా 1962 నుండి 1973 వరకు, తర్వాత విజయవాడ లోని ప్రభుత్వ సంగీత కళాశాలలోను పనిచేశాడు.

ఇతడు మాతంగముని రచించిన బృహద్దేశి, పండిత వెంకటమఖి రచించిన చతుర్దండి ప్రకాశిక, దత్తిలముని రచించిన దత్తిళమును  తెలుగులోకి అనువదించి ప్రచురించారు.

ఇతడు విశాఖపట్నంలో 2000 జూలై 24 తేదీన గుండెనొప్పితో అకస్మాత్తుగా పరమపదించాడు. ఈయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.


మార

  • ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ పురస్కారం.
  • ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సంగీత కళాప్రపూర్ణ.

22, ఏప్రిల్ 2024, సోమవారం

ఇందులోనే కానవద్దా యితడు దైవమని విందువలె నొంటిమెట్టవీరరఘరాముని - అన్నమయ్య కీర్తన



 

నిండు పున్నమి వెన్నెలలో పౌర్ణమి నాడు సంప్రదాయబద్ధంగా ఒంటిమిట్ట రామాలయంలో కోదండరాముని కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుందిట. ఈ సందర్భంగా ఒంటిమిట్ట రాములవారిని స్తుతిస్తూ అన్నమయ్య రచించిన ఓ కీర్తన.

ఇందులోనే కానవద్దా యితడు దైవమని విందువలె నొంటిమెట్టవీరరఘరాముని
యెందు చొచ్చె బ్రహ్మవర మిల రావణుతలలు కందువ రాఘవుడు ఖండించినాడు
ముందట జలధి యేమూల చొచ్చె గొండలచే గొందిబడ గట్టివేసి కోపగించేనాడు
యేడనుండె మహిమలు యిందరి కితడు వచ్చి వేడుకతో హరివిల్లు విఱిచేనాడు
వోడక యింద్రాదు లెందు నొదిగి రీతనిబంటు కూడబట్టి సంజీవికొండ దెచ్చేనాడు
జము డెక్కడికి బోయ సరయవులో మోక్ష మమర జీవుల కిచ్చె నల్లనాడు
తెమలి వానరులై యీదేవతలే బంట్లైరి తిమిరి శ్రీవేంకటపతికి నేడు నాడు



20, ఏప్రిల్ 2024, శనివారం

కొమ్మూరి పద్మావతీదేవి - రంగస్థల/సినీ నటి - charcoal pencil sketch




my charcoal pencil sketch


వికీపీడియా సౌజన్యంతో సేకరించిన వివరాలు ఈ క్రింద పొందుపరుస్తున్నాను.


కొమ్మూరి పద్మావతీదేవి - తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి.

పద్మావతీదేవి చెన్నై లో 1908 జూలై 7 న సంఘసంస్కర్తల కుటుంబంలో జన్మించింది. ఈమె తల్లితండ్రులు సంఘసంస్కరణోద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తూ సంస్కరణ వివాహాం చేసుకున్నారు. వారి వివాహన్ని స్వయంగా కందుకూరి వీరేశలింగం పంతులు నిర్వహించారు. తల్లితండ్రులు పద్మావతిదేవికి చదువుతో పాటూ సంగీతం కూడా నేర్పించారు. పద్మావతిదేవికి 14 యేళ్ల వయసులో గుడిపాటి వెంకట చలం తమ్ముడు కొమ్మూరి వెంకటరామయ్యతో వివాహం జరిగింది. ఈమె కూమార్తె ఉషారాణి భాటియా కూడా రచయిత్రి.

తెలుగు నాటకరంగంలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టిన బళ్ళారి రాఘవ రంగస్థలం పైకి సంసార స్త్రీలను ఆహ్వానించినప్పుడు ఈమె సంప్రదాయపు సంకెళ్ళను త్రెంచుకుని నాటకరంగం మీద కాలుపెట్టారు. ఈమె ప్రహ్లాద నాటకంలో లీలావతి పాత్ర పోషించేవారు. ఆమె రామదాసు , తప్పెవరిది, సరిపడని సంగతులు, చంద్రగుప్త, ఆ లోకం నుండి ఆహ్వానం మొదలైన నాటకాలలో రాఘవతో కలిసి సముచిత పాత్రలలో నటించారు. మహాత్మా గాంధీ డాక్యుమెంటరీ చిత్రంలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

సినిమాల ప్రవేశంతో ద్రౌపదీ మానసంరక్షణంరైతు బిడ్డసుమతిపెద్ద మనుషులు చిత్రాలలో నటించారు. వీరు స్త్రీల సమస్యల మీద ఎన్నో రేడియో ప్రసంగాలు చేశారు.


మరిన్ని వివరాలు ప్రతిలిపి ఈ క్రింది లింకు క్లిక్ చేసి చూడండి.

https://telugu.pratilipi.com/read/%E0%B0%95%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95%E0%B0%A8%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A4%E0%B1%86%E0%B0%B0%E0%B0%95%E0%B1%81-%E0%B0%95%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95%E0%B0%A8%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A4%E0%B1%86%E0%B0%B0%E0%B0%95%E0%B1%81-3oatbsvcqreh-0702z08qb514681 


ధన్యవాదాలు 

19, ఏప్రిల్ 2024, శుక్రవారం

"మహామహోపాధ్యాయ" తాతా సుబ్బరాయశాస్త్రి



తాతా సుబ్బరాయశాస్త్రి - charcoal pencil sketch 

ఈనాడు నా పెన్సిల్ తో చిత్రీకరించుకున్న చిత్రం. ఈ మహానీయుని గురించి వివరాలు క్రింది లింకు క్లిక్ చేసి చదవండి.


తాతా సుబ్బరాయశాస్త్రి (1867-1944) విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు. సంఘ సంస్కర్త. వితంతు పునర్వివాహాలను సమర్థించాడు. అంటరానితనాన్ని వ్యతిరేకించాడు. మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు. 

మరిన్ని వివరాలు ఈ క్రింది లింకు క్లిక్ చేసి చదవండి. ధన్యవాదాలు.

https://www.wikiwand.com/te/%E0%B0%A4%E0%B0%BE%E0%B0%A4%E0%B0%BE_%E0%B0%B8%E0%B1%81%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF

18, ఏప్రిల్ 2024, గురువారం

వావిలకొలను సుబ్బారావు - పండితకవులు - charcoal pencil sketch

పండితకవులు కీ. శే.    వావిలకొలను సుబ్బారావు -  నా charcoal పెన్సిల్ తో చిత్రీకరిణకుకున్న చిత్రం 


వికీపీడియా సౌజన్యంతో ఈ క్రింది వివరాలు సేకరించడమైనది.


ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు (జనవరి 231863 - ఆగష్టు 11936) ప్రముఖ రచయిత, గ్రాంథికవాది. కందుకూరి వీరేశలింగం పంతులు తర్వాత, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా 1904-1920 మధ్యకాలంలో పనిచేశారు. భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు. ధర్మసమాజాన్ని స్థాపించారు. రామ భక్తుడు. రామాయణము ఆంధ్రీకరించి "ఆంధ్ర వాల్మీకి" బిరుదు పోందారు. ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని పునరుద్ధరించడానికి ఒక కొబ్బరి చిప్పను బిక్షా పాత్రగా విరాళాలను పోగు చేశారు, టెంకాయ చిప్ప శతకాన్ని రచించారు.

ఆంధ్ర వాల్మీకి హస్తంబు నందు నిలిచి రూప్యములు
వేన వేలుగా ప్రోగు చేసి దమ్మిడైనను వాని లో
దాచుకొనక ధరణి జాపతి కర్పించి ధన్యవైతి
కర్మ గుణపణిముల కుప్ప ! టెంకాయ చిప్ప! "



మరిన్ని వివరాలు ఈ క్రింది లింకు క్లిక్ చేసి తెలుసుకొనగలరు.

https://te.wikisource.org/wiki/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF%E0%B0%95%E0%B1%8A%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81_%E0%B0%B8%E0%B1%81%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF


16, ఏప్రిల్ 2024, మంగళవారం

దార అప్పలనారాయణ - కుమ్మరి మాస్టారు - బుర్రకధ కళాకారుడు

 


charcoal pencil sketch (Facebook goup The Golden Heritage of Vizianagaram గ్రూపు లో లభించిన ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం)


వివరాలు వికీపీడియా నుండి సేకరణ 

కుమ్మరి మాస్టారు బుర్రకథ చెప్పడంలో ప్రసిద్ధిచెందిన కళాకారుడు. ఇతని అసలు పేరు దార అప్పలనారాయణ (జూలై 1, 1930 - మే 28, 1997)

జననం

ఈయన జూలై 11930 సంవత్సరంలో విజయనగరం జిల్లా, గజపతినగరం మండలం కోడిదేవుపల్లిలో అప్పలస్వామి, చంద్రమ్మ దంపతులకు జన్మించాడు.

ఈయన ఎనిమిదవ తరగతి వరకు స్వగ్రామంలోనే చదివాడు. 1947-49 మధ్యలో హయ్యర్ గ్రేడ్ ఉపాధ్యాయునిగా శిక్షణ పొంది, 1950-56 మధ్య అధ్యాపకునిగా ఉద్యోగం చేశాడు. ఉపాధ్యాయ శిక్షణ కాలంలో ప్రధానోపాధ్యాయులు గండికోట శ్రీరామమూర్తి ప్రోత్సాహంతో ముట్నూరి సూర్యనారాయణ దగ్గర బుర్రకథలో శిక్షణ పొందాడు. ఈయన తొలికథ 'స్వతంత్ర పోరాటం'. తొలికాలంలో నాటకాలలో పాత్రపోషణ చేస్తుండేవాడు. 'అభ్యుదయ కళామండలి'ని స్థాపించాడు. దీని ద్వారా అందించిన తొలి కానుక 'మల్లీశ్వరి'. ఈయన కథల ప్రత్యేత వంతగా స్త్రీ కళాకారిణిని పరిచయం చేయడం, హాస్యానికి పట్టం కట్టడం. కొన్ని సందర్భాల్లో గుమ్మెట, జముకు, డప్పుఢమరుకంకంజీరా, డికీరా లాంటి దేశవాళీ సంగీతవాద్యాలను వినియోగిస్తూ కథ నడిపేవాడు. ఎక్కువగా 'రామరాజ్యం', 'బాలనాగమ్మ', 'ఆంధ్రకేసరి', 'బొబ్బిలి యుద్ధం' వంటి కథాంశాలు ప్రదర్శించేవాడు.

1964 లో శృంగవరపు కోటలో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సమక్షాన 'చైనా భూతం' ప్రదర్శించాడు. 1975 లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా బుర్రకథను ప్రదర్శించాడు. 1984 లో మహానాడులో 'రామరాజ్యం' బుర్రకథను రక్తికట్టించి, అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు అభినందనలు అందుకున్నాడు. ఈయన కథాగానం గ్రామఫోన్ రికార్డులుగా కూడా విడుదలైంది. 'లాల్ బహదూర్ శాస్త్రి', 'కొళాయి-లడాయి', 'ఎన్నికలు కామిక్' వంటి కథలు ఈ రికార్డులో ఉన్నాయి.

1967 లో తెలుగు సినిమా రంగంలో కాలుపెట్టి, కాంభోజరాజు కథకన్యకా పరమేశ్వరి కథరైతుబిడ్డశభాష్ పాపన్న చిత్రాల్లో బుర్రకథ కళాకరునిగానే కనిపించి, వినిపించాడు. ఆకాశవాణిదూరదర్శన్ లలో వివిధసమయాలలో కథాగానం చేశాడు.

ఈయన 'హాస్య నటనాధురీణ' బిరుదాంకితుడు. 1966 లో భీమవరం త్యాగరాజు ఆరాధనోత్సవాలలో స్వర్ణ సింహతలాటాలు, కరకంకణాలు బహుమతిగా పొందాడు. 1988 జూన్ 27న ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఆధ్వర్యంలో 'కళాప్రపూర్ణ' గౌరవం అందుకున్నాడు.

ఈయన మే 281997 సంవత్సరంలో పరమపదించాడు.

14, ఏప్రిల్ 2024, ఆదివారం

మా తరం కా లేజీ అమ్మాయి




 సీ.


వాలుజడ నొకింత వదులుగాఁ నల్లియు

     సన్నజాజుల మాల జడను దాల్చి

ఒంటిపేట గొలుసు నొద్దికఁ నమరించి

      దిద్దియున్ తిలకంబుఁ దీరు గాను

శ్రోతస్సులందాల్చ జుమికీల నూపుచున్

      శిరము దిప్పుచు బల్కు జిత్రముగను

వస్త్రధారణ యందుఁ బరిణతిఁ దాజూపు

       చిరు దరహాసంబు చెదరనీక.


సీ.


క్షీరాశ గమనంబు కింకిర స్వనమున

           మంజులముగ బల్కు మంజుభాషి

లలితకళలటన్న రాణచూపు నువిద

           చదువు సంధ్యల యందు చదువులమ్మ

తల్లిదండ్రుల మాట తలదాల్చు తరుణియె

        ‌‌.  పిన్నపెద్దలయెడ పేర్మిజూపు

ఇంటిపనుల యందు నింతి కెంతయు శ్రద్ధ

           చెలిమి చేసిన జూపు స్నేహితమ్ము


తే.


ముగ్ధ మోహన రూపంబుఁ ముదముగూర్చ

కలికి నాటి యువకులకు కలలరాణి

కాంచ దుర్లభం బీచామఁ కలలనైన

నేత్ర పర్వమె యౌనె యీ నెలతఁ జూడ



12, ఏప్రిల్ 2024, శుక్రవారం

ఋష్యేంద్రమణి - నటి, గాయని - charcoal pencil sketch




ఋష్యేంద్రమణి ప్రముఖ తెలుగు రంగస్థల, సినిమా నటి (charcoal pencil sketch)

అలనాటి అద్భుత రంగస్థల, సినిమా  నటిని నా పెన్సిల్ తో చిత్రీకరించుకునే భాగ్యం ఈ రోజు కలిగింది. బహుశా నేను చూసి  చిత్రీకరించిన reference పిక్చర్ ఈమె కొత్తగా సినిమారంగానికి వచ్చినప్పటిది అని బావిస్తున్నాను. 

ఈమె గురించి వివరంగా తెలుసుకోవాలంటే దయచేసి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి. ధన్యవాదాలు 

https://te.wikipedia.org/wiki/%E0%B0%8B%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%A3%E0%B0%BF.. 


5, ఏప్రిల్ 2024, శుక్రవారం

అబ్బూరి కమలాదేవి



అబ్బూరి కమలాదేవి - పెన్సిల్ చిత్రం 

అబ్బూరి కమలాదేవి ప్రఖ్యాత రంగస్థల నటి. ఈమె శ్రీకృష్ణ, హరిశ్చంద్ర, దుర్యోధన వంటి పురుషపాత్రలను నటించడంద్వారా ప్రసిద్ధి చెందింది. ఈమె 1925నవంబరు 2వ తేదీన కృష్ణా జిల్లాపెడన గ్రామంలో తోట వెంకయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించింది.


మరిన్ని వివరాలు ఈ క్రింది లింకు క్లిక్ చేసి చూడగలరు.


https://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%95%E0%B0%AE%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%BF




పేరాల భరతశర్మ - సంస్కృతాంధ్ర పండితులు (పెన్సిల్ స్కెచ్)

పేరాల భరతశర్మ (my pencil sketch)
వికీపీడియా ఆధారంగా సేకరించిన వివరాలు టూకీగా :
సంస్కృతాంధ్ర పండితులు పేరాల భరతశర్మ 1933 ఫిబ్రవరి 2 వ తేదీన ప్రకాశం జిల్లా, చీరాల పట్టణంలో జన్మించారు.
ఇతడు 1953లో డిగ్రీ పూర్తి అయిన వెంటనే తను చదువుకున్న ఎస్.ఆర్.ఆర్., సి.వి.ఆర్ కాలేజిలోనే ట్యూటర్‌గా ఉద్యోగంలో చేరారు . తక్కువ సమయంలోనే ఉపన్యాసకునిగా పదోన్నతి పొంది 1960వరకు అక్కడ పనిచేశారు . తరువాత కాకినాడలోని పిఠాపురం రాజావారి కళాశాలలో 1960 నుండి 1985 వరకు ఉపన్యాసకుని గా పనిచేశారు,. 1985లో మరొకసారి పదోన్నతి పొంది విజయనగరం మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు . 1991లో వీరు అధ్యాపక వృత్తి నుండి పదవీవిరమణ చేశారు.
అనేక అవధానాలు, రచనలు, ఉపన్యాసాల ద్వారా ప్రజలను ఆకట్టుకున్న పేరాల భరతశర్మ 2002, డిసెంబరు 13 న విజయవాడలో మరణించారు.

 

3, ఏప్రిల్ 2024, బుధవారం

షణ్ముఖి ఆంజనేయరాజు - తెలుగు నాటక దిగ్గజం


 షణ్ముఖి ఆంజనేయ రాజు ప్రసిద్ధ రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక ప్రయోక్త. - charcoal pencil sketch


మరిన్ని వివరాలు వికీపీడియా వారి ఈ క్రింది లింకు క్లిక్ చేసి తెలుసుకోగలరు,

https://te.wikipedia.org/wiki/%E0%B0%B7%E0%B0%A3%E0%B1%8D%E0%B0%AE%E0%B1%81%E0%B0%96%E0%B0%BF_%E0%B0%86%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B1%87%E0%B0%AF_%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81


1, ఏప్రిల్ 2024, సోమవారం

ఇల్ల్లిందల సరస్వతీదేవి - రచయిత్రి


My charcoal pencil sketch


ఇల్లిందల సరస్వతీదేవి (1918-1998) తెలుగు కథారచయిత్రి. భారతీయ అత్యున్నత సాహిత్య పురస్కారంగా వాసికెక్కిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత్రి.

ఇల్లిందల సరస్వతీదేవి 1918 జూన్ 15 న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించారు. ఆమెకి చిన్నతనంలోనే వివాహం జరిగింది. ఆపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యవృత్తిలో కొనసాగుతున్న భర్త సహకారంతో ఆమె మెట్టినింట విద్యాభ్యాసాన్ని కొనసాగించారు.

ఇల్లిందల సరస్వతీదేవి 250 కథలను, 5 నవలలు రచించారు. 5 వ్యాససంపుటాలు, జీవితచరిత్రలు రచించారు. బాలసాహిత్యకారిణిగా నాటికలు, రేడియో నాటికలు రచన చేశారు. కృష్ణాపత్రికలో ఇయంగేహేలక్ష్మీఆంధ్రపత్రికలో వనితాలోకం శీర్షికలు నిర్వహించారు. వివిధ భాషల్లోంచి ఎన్నో పుస్తకాలను అనువాదాలు కూడా చేశారు. కథాసంకలనాలు వెలువరించారు.

సేకరణ : వికీపీడియా సౌజన్యంతో 

23, మార్చి 2024, శనివారం

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు


నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం)


యామిజాల పద్మనాభస్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు.

ఇతడు విజయనగరం  జిల్లా, గరుగుబిల్లి మండలం, శివరాంపురం గ్రామంలో 1915జూన్ 12వ తేదీన కామేశ్వరి, లక్ష్మీనరసింహశాస్త్రి దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి లక్ష్మీనరసింహశాస్త్రి నిరతాన్నదాతగా ఆ ప్రాంతంలో ప్రసిద్ధుడు. యామిజాల పద్మనాభస్వామి చాలా చిన్నవయసులోనే ఇంటివద్ద ఉండి దేవులపల్లి సీతారామశాస్త్రి వద్ద కాళిదాస త్రయం అభ్యసించాడు. తన స్వగ్రామానికి సమీపంలో ఉన్న జామిలో మోతికుర్తి సత్యనారాయణశాస్త్రి వద్ద కౌముది నేర్చుకున్నాడు. 1930లో కడియం  వెళ్లి చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి వద్ద రెండు సంవత్సరాలు శిష్యరికం చేసి కవిత్వ రహస్యాలు తెలుసుకున్నాడు. 1933లో విజయనగరం ప్ర్రాచ్యకళాశాలలో చేరి 1938వరకు అక్కడే చదివి ప్రాచ్యభాషా పట్టాను పొందాడు. ఆ సమయంలోనే   ఆదిభట్ల నారాయణదాసును   సేవించి జ్యోతిష శాస్త్ర పట్టులెన్నో గ్రహించాడు.  వారు  ఇతడిని కావ్యకంఠ గణపతిమునికి పరిచయం చేయగా అతనికి శుశ్రూష చేసి మంత్రశాస్త్రం నేర్చుకున్నాడు. 

గాంధీజీ ప్రభావం, తెన్నేటి విశ్వనాథం బాంధవ్యం ఇతడిని స్వాతంత్ర్యోద్యమం వైపుకు ఆకర్షించింది. స్వయంగా రచించిన దేశభక్తి గేయాలను, పద్యాలను పాడుతూ స్వైరవిహారం చేస్తున్న ఇతడిని ప్రాచ్యకళాశాలనుండి తొలగించారు. కానీ ప్రతిభావంతుడిని పోగొట్టుకోవడ ఇష్టం లేక తిరిగి విద్యార్థిగా చేర్చుకున్నారు. విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఇతనికి నెలనెలా విద్యార్థివేతనం ఇచ్చాడు. ఇతని కవితాశక్తి గురించి విన్న జయపురం మహారాజా ఇతడిని ఆహ్వానించి తన సంస్థానంలో ఆస్థానకవిగా నియమించాడు. అమరజీవి పొట్టి శ్రీరాములు  వెంట కొంతకాలం తిరిగి హరిజనసేవకు నిధులు సేకరించాడు. 1948లో  మద్రాసులోని  శ్రీరామకృష్ణ విద్యాసంస్థలలో ఆంధ్రోపాధ్యాయుడిగా ప్రవేశించి 1974లో పదవీ విరమణ చేశాడు. ఇతని సంపాదకత్వంలో మద్రాసు  నుండి అమృతవాణి అనే సాహిత్యమాసపత్రిక కొన్నాళ్లు వెలువడింది.


సౌజన్యం : వికీపీడియా 



13, మార్చి 2024, బుధవారం

నిరీక్షణ


"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చిత్రానికి మీకు గాని ఫేస్బుక్ అకౌంట్ ఉంటే ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చూడగలరు. ధన్యవాదాలు


https://www.facebook.com/share/p/H4oHt5pTzUYwDiA1/?mibextid=oFDknk

5, మార్చి 2024, మంగళవారం

మహాభాష్యం చిత్తరంజన్, రచయిత, సంగీత దర్శకుడు - charcoal pencil sketch


charcoal pencil sketch drawn by me.


చిత్రకారునిగా నేను ఈ రోజు చిత్రీకరించిన చిత్రం.


మహాభాష్యం చిత్తరంజన్ (1938 ఆగస్టు 25 - 2023 జూలై 21) ప్రముఖ లలిత గీతాల రచయిత , సంగీత దర్శకుడు. ఆయన ఆల్ ఇండియా రేడియో లో చాలాకాలం పనిచేశాడు. ఆకాశవాణిలో  ప్రసారమైన అనేక లలితగీతాలకు స్వరకల్పన చేశారు. నిజాం ప్రభుత్వ హయాంలోని దక్కన్‌ రేడియోలో పాడటం మొదలుపెట్టిన ఆయన ఆరు దశాబ్దాలకు పైగా లలిత సంగీతానికి సేవలందించారు . 1972లో ఆలిండియా రేడియోలో ‘ఏ’ గ్రేడ్‌ గాయకుడిగా గుర్తింపు పొందాడు. 2008లో ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక మండలి ఆయనను కళారత్న బిరుదుతో సత్కరించింది.


Credit : Wikipedia


మరిన్ని వివరాలు అంతర్జాలంలో చదివి తెలుసుకోగలరు. 


ధన్యవాదాలు 

-- పొన్నాడ మూర్తి 



3, మార్చి 2024, ఆదివారం

నీ హృదిపై వాలకనే...సేదతీరలేనులే - గజల్!


నా చిత్రానికి శ్రీ మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్యధాతధంగా. వారికి నా ధన్యవాదాలు


 @#పివిఆర్ మూర్తిగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్సుమాలతో వారి అపూర్వ చిత్రరాజమునకు స్పందనగా.. 🌹🙏🌹🌹🙏🌹😊😊👍💖🦜

5699..గజల్ 


నీ హృదిపై వాలకనే...సేదతీరలేనులే..! 

స్వర్గమేదొ ఇంకెచటో..అసలు వెతకలేనులే..! 


మాటలన్ని మూగబోయె..నిన్ను చేరినంతనే.. 

అక్షరాల ఈ హాయికి..స్వరము కూర్చలేనులే..! 


మీదపడే వయసువలన..పసితనమే వచ్చునో.. 

గుండెలోన దిగులుగూడు..కట్టి నిలుపలేనులే..! 


ఏలేసిన రసరాజ్యపు..సరిహద్దులు చెరుగునా.. 

జ్ఞాపకాల మధువనితో..చెలిమి వీడలేనులే..! 


నీవు తోడులేని వేళ..ఈ ఉనికియె మాయమో.. 

వలపువీణ రాగధునికి..సెలవు ఇవ్వలేనులే..! 


చిత్రమైన సంసారపు..మాయగాక గురువేది.. 

మరులవేణు రవములతో..రణము సల్పలేనులే..! 


మరిమాధవ హాసమదే..మనప్రేమకు జీవమోయ్.. 

పెదవులింటి అలజడులకు..సర్ది చెప్పలేనులే..!

2, మార్చి 2024, శనివారం

బెంగుళూరు నాగరత్నమ్మ

నా పెన్సిల్ చిత్రం 

బెంగుళూరు నాగరత్నమ్మ (నవంబరు 31878 - మే 191952) భరత నాట్యానికి, కర్ణాటక సంగీతమునకు, అంతరించిపోతున్న భారతదేశ కళ లకు ఎనలేని సేవ చేసి అజరామరమైన కీర్తి సాధించిన మహా వనిత. ఏటికి ఎదురీది, పట్టుదలతో తాదలచిన కార్యములు సాధించి తరువాయి తరముల మహిళలకు ఆదర్శప్రాయురాలైన గొప్ప విదుషీమణి. భోగినిగా జీవితము ఆరంభించి, తరువాత రాగిణిగా మారి, పిదప విరాగిణియై, చివరకు యోగినిగా తన బ్రతుకు ముగించింది.

మరిన్ని వివరాలు వికీపీడియా సౌజన్యంతో క్రింది లింకు క్లిక్ చేసి చదువగలరు. 


కె, విశ్వనాథ్ గారి "శంకరాభరణం " చిత్రానికి ప్రేరణ ఈమె జీవిత చరిత్రేనన్న కధనం   కూడా ఉంది. ఈ విషయం తెలిసాక నేను మరింత ఈమె గురించి శోధించాను. . 


నాగరత్నమ్మ ఫోటోలు చాలా తక్కువ. లభించిన ఫోటో ఆధారణంగా నా పెన్సిల్ సహాయంతో ఆమె చిత్రాన్ని చిత్రీకరించాను. కె, విశ్వనాథ్ గారి "శంకరాభరణం " చిత్రానికి ప్రేరణ ఈమె జీవిత చరిత్రేనన్న కధనం   కూడా ఉంది. ఈ విషయం తెలిసాక నేను మరింత ఈమె గురించి శోధించాను. . ఈ క్రింది లింకు తెరచి వీటికి సంబంధించిన విషయాలు మీరు కూడా తెలుసుకోవచ్చు. 

https://muchata.com/inspirational-story-of-sankarabharanam/

ధన్యవాదాలు 


 
 

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...