30, మార్చి 2018, శుక్రవారం

చిప్పిల్లిన జ్ఞాపకాలు - నైజాలు - కవితలు

నా పెన్సిల్ చిత్రానికి కవితలల్లిన కవయిత్రులు శ్రీమతి జ్యోతి కంచి, అను శ్రీ




చిప్పిల్లిన జ్ఞాపకాలు
~~~~~~~~~~~
కంటతడి పెట్టిన సందర్భాలు వేళ్ళతో లెక్కించాలి
ఆహా!నాజీవితం ఇలాఉంటే ఎంతబాగుణ్ణు అనుకుంటాను
వర్షఋతువుకోసం ఎదురుచూపైన వేసవిలా ప్రతిక్షణం నాకనుభవమే,
చందమామ పదాలను చల్లని రాత్రినికలిపి ఒంటరిగా మాలలల్లుకున్న సందర్భాలూ నాకవగతమే,
కోవెలమెట్టుమీద జారవిడుచుకున్న నిట్టూర్పుమువ్వల సడికూడా నాకభిమానమే....,
జ్ఞాపకాలను అర్ధిస్తున్నా.. 
జీవితనీడలను కొలవద్దని,
నిన్నటి సాక్ష్యాలకు దయచేసి ఏరంగు వేయకండని!
జ్ఞాపకాలను అనునస్తున్నా..
శిలావేదికలపై మల్లెలు పరచినట్లు
మనసు మెత్తదనాన్ని మత్తుదనాన్ని మరచిపొమ్మని!
తాను విడువలేని గగనాన్ని కూడా కరిగినమేఘం విడిచినట్లే...జీవితాన్ని వదలేక వదిలేసాను
ఏదోనమ్మకం....నీటిచక్రంలా జీవితచక్రం ముందుకెళ్ళదాని?
చట్కున చిప్పిల్లే వానచుక్కలకు మల్లే ఆశలు
రంగురుచి లేనివి...
ఐనా చిరుచినుకులు ఓడిపోవు.....
చిరుమొలక పుట్టించి వటవృక్షంచేసే శక్తే వానికున్నపుడు
నేను సముద్రాన్ని కాదలచుకోలేదు
జీవచినుకై పోతాను
ఎందుకంటే జ్ఞాపకాలెపుడూ మొలకెత్తేవిత్తులే.....
- జ్యోతి కంచి
--------------------------------------------------------------------------------------------------------------------------------

అయిష్టమైన కొన్ని ఓదార్పులు
కష్టపెట్టే కల్తీమాటలు
కన్నీళ్లను రప్పించే విశ్వయత్నాలు
ఇవే కొందరి అసలు నైజాలు....
బేలగా మారితే పొడిచే కాకులెన్నో
తెగించి అడుగేస్తే విసిగించే సంకెళ్లెన్నో
అడుగడుగునా అడ్డుకునే ఆంక్షలింకెన్నో
ధైర్యాన్ని దోచుకుని ధైన్యాన్ని ఆపాదించే
వికృత తత్వాల విషభీజాలను
అంతమొందించె ఆయుధం కావాలి...
సమాజమనే సముద్రాన్ని ఈదాలంటే
బలమైన చేతుల చేతలుండాలి
ఆ చేతులు చర్యలు నీవే కావాలి
అక్కరకు రాని కబుర్ల కంటితుడుపులు
జాలితో రాల్చే నాలుగు కన్నీటి బొట్లు
ఏవీ కావు నీ గాయానికి మందులు
ఎవరి ఎదుటో మోకరిల్లి దయని అర్థించకు.
నీచమైన మనుషుల నీడ కూడా
దరికి రానివ్వని తెగువ కావాలి
స్వాభిమానం ఆత్మవిశ్వాసం
నీ చేతిలోని వెలుగు కాగడాలు చేసుకో
కటిక చీకట్లను చీల్చే
కాంతుల కరవాలం నీవై కదలాలిపో
యుధ్ధాన గెలిచేవరకూ పోరాడు
విజయాలతోనే సేద తీరు...
ఎందుకంటే నీవే నీకో నిజమైన ప్రపంచం
నీ పంచనే నీకు నిజమైన స్వాంతన...!
అనూశ్రీ

29, మార్చి 2018, గురువారం

ఎన్టీఆర్


కృష్ణుడిగా ఎన్టీఆర్‌ పనికిరాడన్నారు!

ఎన్టీఆర్ - ఆ మూడక్షరాల పేరే సినీ జగత్తులోనూ, రాజకీయాలలో కూడా ఓ సంచలనం. ఈ పేరు తెలియని తెలుగు గడప లేదంటే అతిశయోక్తి కాదు. పౌరాణిక పాత్రలకు ఆయన పెట్టింది పేరు. ఒకప్పుడు కృష్ణుడిగా ఎన్టీఆర్‌ పనికిరాడన్నారు! ఇప్పుడు వారి తనయుడు బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభించారు. చదవండి ఈనాటి ఈనాడు దినపత్రికలో ఆ మహనీయుని గురించి ఏమి రాసారో .. !


"తెలుగువారికి రాముడు, కృష్ణుడు అంటే టక్కున గుర్తొచ్చే పేరు నందమూరి తారక రామారావు. తెలుగుతెరపై ఎందరో ఆ పాత్రల్లో నటించినా, ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మాత్రం ఎన్టీఆర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కృష్ణుడిగా దాదాపు 33సార్లు తెరపై కనిపించి రికార్డు సృష్టించారు. అసలు కృష్ణుడంటే ఇలాగే ఉంటాడేమో అనిపించేలా ఆయన పలికించే హావభావాలు ఎవరూ మర్చిపోలేరు. మరి అంతటి పేరు తెచ్చిన ఆ పాత్రను ఎన్టీఆర్‌ వేస్తే తీవ్ర విమర్శలు పాలయ్యారు. అవి ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌ను ప్రారంభించిన తొలినాళ్లు. అప్పుడప్పుడే వరుస అవకాశాలను దక్కించుకుంటున్న రోజులవి. ఆ సమయంలో ‘సొంత ఊరు’ అనే సినిమాలో ఓ సన్నివేశంలో ఎన్టీఆర్‌ కృష్ణుడి పాత్రను వేశారు. అయితే ఆ పాత్రకు ఆయన సరిగా నప్పలేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. చూడడానికి ఆ వేషం బాగోలేదు. దీంతో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా పనికారాడన్నారు. దాన్ని ప్రేక్షకులు వ్యతిరేకించి తెరను చించెయ్యడానికి కూడా సిద్ధపడ్డారు. చిత్రం ఘోర పరాజయం పొందింది. ఆ అనుభవంతో ఎన్టీఆర్ కూడా శ్రీకృష్ణుడి పాత్రకు దూరంగా ఉంటూ వచ్చారు. బాల కృష్ణుడికి వాడే ఆహార్యం తనకి వాడటం వల్లే, ప్రేక్షకులకి అలాంటి భావన కలిగిందంటూ ఎన్టీఆర్ ఈ విషయంపై తర్వాత వివరణ ఇచ్చుకున్నారు.

సరిగ్గా ఈ సమయంలోనే ‘మాయాబజార్’ చిత్రంలో కృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్‌ను కె.వి.రెడ్డి ఎంచుకున్నారు. దాంతో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సినీ పరిశ్రమ నుంచి ప్రతిఘటన ఎదురైంది. కెవి రెడ్డి, చక్రపాణి తనను ఆ పాత్రకు ఎన్నుకున్నపుడు కూడా ఎన్టీఆర్‌ సందేహం వ్యక్తం చేసారు. ‘సొంత ఊరు’లో చిన్న పాత్రకే అంత అల్లరి చేసిన ప్రేక్షకులు, ఇందులో పూర్తి నిడివిగల కృష్ణుడి పాత్రను వ్యతిరేకిస్తారని చెప్పి చూశారు. అయినా దర్శక, నిర్మాతలు ససేమిరా ఒప్పుకోక అలంకరణ, ఆహార్యం విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎన్టీఆర్‌తో ఆ పాత్రని వేయించారు. అద్భుతంగా వచ్చింది. శ్రీకృష్ణుడి పాత్రకు ప్రజలు నీరాజనాలు పలికారు. అప్పటి నుంచి కృష్ణ పాత్ర వేయాలంటే ఎన్టీఆరే వెయ్యాలనడం మొదలైంది.


ఆహార్యం నుంచి అభినయం వరకూ కృష్ణుడికి ఒక శైలిని సృష్టించారు ఎన్టీఆర్‌. కృష్ణుడు వయ్యారంగా నడవడం, సమ్మోహనంగా నవ్వడం, కనులతోనే భావాలు పలికించడం, శాంత స్వభావంతో వ్యవహరించడం, గోపికల వద్ద శృంగారం ఒలకపోయడం వంటి హావాభావాలను అద్భుతంగా పండించడంతో విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. కృష్ణుడంటే ఎన్టీవోడు ,ఎన్టీవోడు అంటే కృష్ణుడే అనే భావన ప్రేక్షకులకు ఏర్పడింది. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’, ‘శ్రీకృష్ణ తులాభారం’, ‘శ్రీకృష్ణావతారం’, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘దానవీర శూరకర్ణ’, ‘శ్రీకృష్ణ సత్య’ తదితర చిత్రాల్లో కృష్ణుడిగా ఎన్టీఆర్ అలరించిన తీరు అపూర్వం."

నా మిత్రురాలు సింహాద్రి జ్యోతెర్మయి ఈ మహా నటుడు పోషించిన కొన్ని పౌరాణిక పాత్రలు, వాటిని పోషించిన తీరుని ప్రశంసిస్తూ ఓ సీస పద్యం కూడా రాసింది. చదవండి.

నేనూ ఆయన పౌరాణికాలకు పిచ్చ ఫాన్ ని.
అందుకే ఈ సీసం

రామయ్యలోనున్న కోమలత్వము జూప
రామరావుకు సరి రామరావె
శ్రీ కృష్ణు రూపులో చిద్విలాసము జూప
రామరావుకు సరి రామరావె
అభిమానధనునిలో ఆభిజాత్యము జూప
రామరావుకు సరి రామరావె
చేడియ కుల్కులన్ పేడియందున జూప
రామరావుకు సరి రామరావె

ఆ.వె.
దానకర్ణుడైన ,దశకంఠుడైననూ
భీమసేనుడైన, భీష్ముడైన
భక్తుడైన గాని, భగవంతుడే గాని
రామరావుకు సరి రామరావె.

సింహాద్రి జ్యోతిర్మయి
28.3.2017.

27, మార్చి 2018, మంగళవారం

చిత్తూరు నాగయ్య


మరపురాని మహా నటుడు
నాగయ్య
(నా పెన్సిల్ చిత్రం)
'
(నా పెన్సిల్ చిత్రం)

అది తిరువాన్కూరు మహారాజావారి దర్బార్ హాలు. మహాపండితులు, సంగీత, నాట్య, నటన కళాకోవిదులతో సభా భవనం క్రిక్కిరిసి పోయింది. మేళతాళాలతో సకర రాజ మర్యాదలతో రాజదర్బారు ప్రవేశించాడొక తెలుగు నటుడు. మహా రాజు గద్దెదిగి ఎదురేగి ఆ నటశ్రేష్టుని సాదరంగా కౌగలించు కొన్నాడు. తన గద్దె ప్రక్కను ఏర్పాటు చేసిన సమున్నతమైన ఆసనంపై కుర్చుండజేసి, వేదమంత్ర పఠనం మధ్య, నటునికి పాదపూజ చేసి అమూల్యమైన కానుకలను అందచేయటంతోపాటు ' అభినవ త్యాగరాజ ' బిరుదంతో సత్కరించాడు.
మైసురు సంస్థానాధీశ్వరుడు తన రాజ ప్రాసాదంలో ఆ నటరాజుకు సకల రాజ లాంఛనాలతో స్వాగతంపలికి పెద్ద వెండి పళ్ళెంలో 101 బంగారు కాసులు పోసి బహూకరించాడు.
ఇలా రాజాస్థానాలలో అపూర్వమైన సత్కారాలను అందుకొన్న తెలుగు నటశిరోమణి చిత్తూరు నాగయ్య.
భారతదేశంలో భక్తి రస ప్రధానమైన పాత్రలు ధరించి ఆయనవలె ప్రజల మన్నన లందుకున్న వారెవరూ లేరు.
నాగయ్య 1904 మార్చి 28 వ తేదీన గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించాడు. తండ్రి ఉప్పల ధడియం రామలింగేశ్వర శర్మ గారు అక్కడ రెవిన్యు శాఖలో ఉద్యోగిగా వుండేవారు. చిన్నప్పటినుండి భాగవత, భారతాల పట్ల అమితమైన ఆసక్తి నాగయ్యకు, తండ్రి చక్కని సంగీత విద్వాంసుడు, పండితుడు. తండ్రి సంగీత కళాభిజ్ఞత తనయుడుకని బాల్యంలోనే ఆకర్షించింది.
తండ్రి శిక్షణలో సంగీత సాధన ప్రారంభించాడు. పాఠశాలకు వెళ్ళడం కంటే సంగీత కచ్చేరీలకు వెళ్ళటం ఎంతో సరదాగా వుండేది బాల నాగయ్యకు. దూరంగా వున్న ఒక వూళ్ళో సంగీత కచ్చేరి జరుగనున్న విషయం విన్నాడు. ఇంట్లో మాట మాత్రం చెప్పక తన చెవి పోగుల్ని అమ్మి ఆ డబ్బుతో రైలు టిక్కెట్ కొని సంగీత కచ్చేరి విని ఇంటికి తిరిగి వచ్చాడు. కొడుకు సంగీతాభిరుచిని గుర్తించిన తండ్రి, కుమారుణ్ణి సంగీత విద్యాభ్యాసం కొరకు సంగీత విద్వాన్ చిత్తూరు పేరయ్య పిళ్ళె వద్దకు పంపాడు.
ఒకమారు మహా విద్వాంసులైన పుష్పవనం అయ్యర్, గోవిందస్వామి పిళ్ళె గార్ల సంగీత కచ్చేరీకి నాగయ్య హాజరయ్యాడు. కచ్చేరి పూర్తి అయ్యింది. శ్రోతలందరు వెళ్ళి పోయారు. నాగయ్య మాత్రం అలాగే నిల్చుని పుష్పవనం అయ్యర్ వంక అదే పనిగా చూడసాగాడు. అయ్యర్, " ఏం అబ్బాయ్, ఏం కావాలి? నీ పేరేమి?" అని ప్రశ్నించాడు. నా పేరు 'ప్రహ్లాదుడు' అని జవాబిచ్చాడు బాలుడు. 'సరే కాని, నీకేమైనా సంగీతం వచ్చా' అని అడిగాడు. 'ఓ-వినండి' అంటూ భాగవతంలోని ప్రహ్లాదుని పద్యాలను మధురంగా భావయుక్తంగా పాడాడు. గోవింద స్వామి పిళ్ళె ఆనందంగా వయోలిన్ వాయించాడు. రెండు గంటలసేపు పద్యాలు పాడాడు. అయ్యర్ ఆనంద పరవశుడై 'బాబు, నీవు గొప్ప కళాకారుడవుతావు' అని ఆశీర్వదించాడు. ఈ సంఘటనను పలుమార్లు మిత్రులకు చెప్పేవాడు నాగయ్య.
కంచిలో నయన పిళ్ళే వద్ద, కుంభ కోణంలో సంగీత కళానిధి మహారాజపురం విశ్వనాధ అయ్యర్ వద్ద సంగీత విద్యాభ్యాసం సాగించాడు నాగయ్య. చిత్తూరులో మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీలో అతని చదువు కొంతవరకు సాగింది. మనసంతా సంగీతంపై వున్నపుడు కాలేజీలో చదవటం ఎలా సాగుతుంది? కాలేజీ చదువు అర్ధంతరంగా ముగిసింది. విద్యార్థిగా నాటకాల్లో వేషాలు వేసి ప్రశంసలందుకొన్నాడు.
మద్రాసులో చదువుకు 'గుడ్ బై' చెప్పిన నాగయ్య చిత్తూరు జిల్లా బోర్డు ఆఫీసులో గుమస్తాగా చేరాడు. స్థానిక రామ విలాస సభ నాటక సంఘం వారితో పరిచయం లభించింది.
చిత్తూరులో రామ విలాస సభ, లక్ష్మీ విలాస సభ, మద్రాసులో సుగుణ విలాస సభ, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ మున్నగు నాటక సంస్థలు ప్రదర్శించిన నాటకాలలో, మొదట సావిత్రి, దమయంతి, చిత్రాంగి వేషాలు ధరించి ప్రశంసలందు కొన్నాడు.
నాటకరంగ ప్రవేశంతో మహానటులైన బళ్ళారి రాఘవ, పర్వతనేని రామచంద్రా రెడ్డి మొదలగు వారితో కలిసి పలు నాటకాలలో అభినయించాడు. రామదాసులో కబీరు వేషధారిగా కహో రామ్‌ నామ్‌ అంటూ పాడుతూ రంగ ప్రవేశం చేయటంతోనే ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో నాటక మందిరం మార్మోగింది. దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు గారు నాగయ్య నటనా కౌశలాన్ని మెచ్చుకొని బంగారు పతకంతో పాటు 'రంగ భూషణ' బిరుదంతో సత్కరించారు.
కర్ణాటక సంగీతంలోనే కాక, హిందుస్తానీ సంగీతంలో కూడా దిట్ట నాగయ్య. కాని జీవితంలో కష్టాలెదురైనాయి. తండ్రి మరణించాడు. మొదటి భార్య ప్రసవించిన తర్వాత తల్లి, బిడ్డ చనిపోయారు. రెండవ భార్య ఆయనకు దూరమైంది. మనశ్శాంతిలేని నాగయ్య రమణ మహర్షి ఆశ్రమంలో కొంతకాలం గడిపాడు. పుణ్యక్షేత్రాలు చూశాడు. 'నీ కార్యక్షేత్రం కళారంగం, వెళ్ళు మరళా కళాకారుడవై ఆత్మ శాంతిని సాధించు' అని అంతరాత్మ బోధించింది. మరలా చిత్తూరు చేరాడు.
1932 లో జాతీయ కాంగ్రెస్ లో స్వయం సేవకుడుగా చేరి మద్రాసు వెళ్ళాడు. ప్రకాశం పంతులు, సత్యమూర్తి, రాజాజీ మున్నగు నాయకుల పరిచయం కలిగింది. గుమస్తా ఉద్యోగానికి రాజీనామా యిచ్చాడు. లాఠీ చార్జీలు, లాకప్ లు చవిచూశాడు. వార్దాకు వెళ్ళి గాంధీజీని దర్శించాడు. తిరిగి మద్రాసు వచ్చాడు. రాజకీయరంగం వదలి మరలా కళారంగంలో అడుగు పెట్టాడు. ఫిల్ము కంపెనీలు పెడతామని కొందరు ప్రలోభపెట్టి నాగయ్యను వంచించారు.
చేత చిల్లిగవ్వలేక మద్రాసు వీధుల్లో తిరుగుతూ, ఆకలి బాధతో నుంగంబాకంలో క్రింద పడిపోయాడు. దారిన పోతున్న హచ్చిన్స్ కంపెనీ యజమాని, నాగయ్య పాత మిత్రుడు అయిన అచ్యుతనాయుడు నాగయ్యను గుర్తుపట్టి భోజన వసతులు కల్పించాడు.
నాయుడుగారి ప్రోత్సాహంతొ నాగయ్య ఎన్నో గ్రాంఫోను రికార్డులిచ్చాడు. "హిజ్ మాస్టర్స్ వాయిస్" కంపెనీ వారు నాగయ్య కంఠ మాధుర్యానికి ముగ్ధులై తమ కంపెనీలో మ్యూజిక్ డైరెక్టర్ గా నియమించుకొన్నారు. నాగయ్య పాడిన రికార్డులు విపరీతంగా అమ్ముడుపోయాయి.
1935 లో బి. ఎన్. రెడ్డి గారిని నాగయ్య కలుసుకొన్నాడు వెంటనే రెడ్డిగారు తమ మిత్రులైన హెచ్. ఎం. రెడ్డిగారికి నాగయ్య గారిని పరిచయం చేశారు. హెచ్. ఎం. రెడ్డి నాగయ్య కంఠ మాధుర్యానికి పరవశుడయ్యాడు. తాను తీసే "గృహలక్ష్మి" చిత్రంలో సంఘ సేవకుని పాత్ర యిచ్చాడు. ఆ వేషంలో నాగయ్య పాడిన, "కల్లు మానండోయ్ బాబూ, కళ్ళు తెరవండోయ్" అన్న పాట ఆంధ్రదేశమంతటా ప్రతిధ్వనించింది. అప్పట్లో మద్యపాన నిషేధం అమలులో వుండేది కాన ఆ పాటకు జనాదరణ అమితంగా లభించింది.
బి. యన్. రెడ్డిగారు మూలానారాయణ స్వామితో కలిసి వాహినీ పిక్చర్స్ అనే సంస్థను ప్రారంభించారు. వందేమాతరం, సుమంగళి, దేవత, మున్నగు చిత్రాల్లో నటించిన నాగయ్యకు అశేష పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.
"ఫిల్మ్‌ ఇండియా" సంపాదకుడు నాగయ్య నటనా వైదుష్యాన్ని వేనోళ్ళ కొనియాడుతూ, నాగయ్యను 'ఆంధ్రా పాల్‌ముని' గా కీర్తించాడు.
కె. వి. రెడ్డిగారు, 'భక్త పోతన' చిత్రంలో, పోతన పాత్ర ధారణకు నాగయ్యను ఎన్నుకొన్నారు. పోతనగా, నాగయ్య చూపిన హావభావాలు, భక్తుడుగా ఆయన అభినయం చిరస్మరణీయం. 'పావన గుణ రామా' అను పాట ఈనాటికీ చిత్రం చూచిన వారిని మైమరిపిస్తుంది. అసమాన నటుడుగా ప్రశంసలందుకొన్నాడు.

నాగయ్య స్వయంగా రేణుకా ఫిల్మ్స్ అనే సంస్థను ప్రారంభించి త్యాగయ్య చిత్రాన్ని నిర్మించి చరిత్ర సృష్టించాడు. ఆ చిత్రం ప్రారంభించుటకు ముందు తిరువాయార్ లోని త్యాగరాజుల వారి సమాధి వద్ద కొన్ని రోజులు ఉపవాస దీక్ష చేశాడు. 'త్యాగయ్య' చిత్రంలో నాయకుడుగా సంగీత దర్శకుడుగా అఖండ కీర్తినార్జించాడు. త్యాగయ్య చిత్రం యునెస్కో ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించబడి భారతదేశ కీర్తి పతాకను ఎగుర వేసింది.
తెలుగు చిత్రాలతోపాటు నాగయ్య తమిళ చిత్రాలలో కూడా నటించాడు. మోసాలు, తంత్రాలు తెలియని నాగయ్య 'భక్త రామదాసు' చిత్ర నిర్మాణంలో పెక్కు అడ్డంకులను ఎదుర్కొన్నాడు. 'రామదాసు' అనుభవించిన సంకటాలను అనుభవించాడు. చిత్రం ఎలాగో బయట పడింది. కాని నాగయ్య ఆశించిన రీతిలో రాలేదు. మరలా మనశ్శాంతిని కోల్పోయి పుట్టపర్తి సాయిబాబాను ఆశ్రయించాడు. బాబా ఆధ్వర్యంలో, మద్రాసులో నాగయ్య షష్టిపూర్తి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.
నాగయ్యకు జరిగిన సన్మానాలు మరే నటుడికి జరగలేదు. 1965 లో భారత ప్రభుత్వం అతనికి 'పద్మశ్రీ' నిచ్చి గౌరవించింది. దక్షిణ భారత సినిమారంగంలో 'పద్మశ్రీ' అందుకొన్న మొదటి నటుడు నాగయ్య.
నాలుగు దశాబ్దాల సినిమా జీవితంలో నాగయ్య 200 తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లోను, 160 తమిళ చిత్రాల్లోను నటించాడు.
నాగయ్య మహానటుడే కాదు, మహాదాత. ఎన్నో దాన ధర్మాలు చేశాడు. ఆంధ్రరాష్ట్ర అవతరణ సందర్భంలో, నాగయ్య 20 వేల రూపాయలు అప్పుగా తెచ్చి ఆంధ్రకేసరికి విరాళంగా సమర్పించాడు.
"నేను ఎన్నోసార్లు మోసపోతున్నాను. అందరి మాటా నమ్ముతాను. అందర్నీ విశ్వసిస్తాను! అదే నా అర్థిక పతనానికి కారణమైంది" అని తన ఆత్మకథలో వ్రాసుకొన్నాడాయన.
లక్షలార్జించిన నాగయ్య చివరిదశలో కఠిన దారిద్ర్యాన్ని అనుభవించాడు. చిన్న చిన్న వేషాలు వేయాల్సి వచ్చింది, డబ్బుకోసం!
పోతన, త్యాగయ్య, రామదాసు మున్నగు పాత్రలలో భక్తి రసామృతాన్ని పంచిపెట్టిన నాగయ్య నటించిన వేమన, పోతన చిత్రాలను చూచి ఒక బాలుడు యోగిగా మారి ముమ్మిడివరం 'బాలయోగి' అయ్యాడు.
ఒకమారు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మద్రాసు వచ్చారు. ఆయన దర్శనం కోసం నాగయ్య, గుమ్మడి మరో మిత్రుడు వారి దగ్గరకు వెళ్ళారు. నాగయ్య గారు వచ్చారని విన్న రాధాకృష్ణన్ స్వయంగా వచ్చి నాగయ్యను ఆహ్వానించారు. నాగయ్యతో పాటు వచ్చిన మూడోవ్యక్తి, రాధాకృష్ణన్ గారికి పాదాభివందనం చేస్తే "మావంటి వారికి పాదాభివందనం ఎందుకయ్యా? మీ ప్రక్కనే వున్న నాగయ్యగారికి చేస్తే మీకు పుణ్యం వస్తుంది అన్నారట" రాధాకృష్ణన్. ఆమాటకు నాగయ్య పులకించి పోయాడు.
నాగయ్య చివరిదశలో మూత్రసంబంధమైన వ్యాధికి గురై అడయార్ లోని వి.హెచ్.ఎస్. సెంటర్ లో చేర్చబడ్డాడు. మృత్యుదేవతతో పోరాడుతున్న నాగయ్య వద్దకు అతని మిత్రులు ముదిగొండ లింగమూర్తి, ఇంటూరి వెంకటేశ్వరరావు అతని శయ్యవద్ద నిల్చి "రఘుపతి రాజారాం" గీతం పాడుతుండగా వింటూ అపర పోతన నాగయ్య 1973 డిసెంబర్ 30వ తేదీన కన్నుమూశాడు. తెలుగు సినిమా నటీనటుల విరాళాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. డా. ఇంటూరి వెంకటేశ్వరరావు గారు, మిత్రులు అభిమానులు మున్నగు వారి సహకారంతో మద్రాసు త్యాగరాయ నగర్ లోని పానగల్ పార్కులో, ఈశాన్య భాగంలో 'నటయోగి నాగయ్య' కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టింపచేయగా రాష్ట్రపతి వి.వి.గిరి గారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏటేటా ఆ విగ్రహం వద్ద డిసెంబరు 30వ తేదీన నాగయ్య వర్ధంత్యుత్సవాలు జరుపుకుంటూ ఆ మహానటునికి జోహార్లు అర్పిస్తున్నారు.

(వివరాలు wikisource నుండి సేకరణ)

25, మార్చి 2018, ఆదివారం

శ్రీరామ నవమి - Sri Rama Navami

శ్రీరామ నవమి సందర్భంగా నా చిత్రాలు - వ్యాసాలు, విషయాలు ఈనాడు దినపత్రిక నుండి సేకరణ. చదవండి.


రాముడిలో ఏమంత గొప్పదనం ఉంది? 
మాయలు మంత్రాలు చూపించలేదు. 
విశ్వరూపం ప్రకటించలేదు. 
జీవితంలో ఎన్నో కష్టాలు... జరగరాని సంఘటనలు... 
చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు... 
పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు... 
తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు... 
కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు... 
అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షస       వధ చేశాడు... 
అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు. 
లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం విస్పష్టంగా  అహం దశరథాత్మజః - దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే’ అని ప్రకటించాడు. 
అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది? కారణం..
ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ.. ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు. లోకానికి ఒకేఒక్కడుగా నిలిచాడు.
- కప్పగంతు రామకృష్ణ
శాస్త్రధర్మం  

తండ్రి మాట కోసం వనవాసానికి సీత, లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు. అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించారు. మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామయ్య. పెద్దకుమారుడినైనా తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయానని బాధపడతాడు. అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు. ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది. తాను దశరథుడినని, పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది. కానీ, రాముడు ఇందుకు ఒప్పుకోడు. శాస్త్రప్రమాణాలు అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచుతాడు. నిజంగా నీవు దశరథుడవే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలు స్వీకరించు. నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. తండ్రి వియోగ దుఃఖంలో ఉన్నసమయంలో కూడా శాస్త్రధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి ఒక్కడే.

స్నేహధర్మం

  మాయలేడి కారణంగా సీతమ్మను వదలి, పర్ణశాలను దాటి చాలా దూరం వస్తారు రామలక్ష్మణులు. ఇదే అదనుగా భావించిన రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను అపహరిస్తాడు. ఇదంతా గమనించిన జటాయువు రావణుడిని అడ్డగిస్తాడు. విశాలమైన తన రెక్కలే ఆయుధంగా చేసుకుని, రావణుడిని ముప్పుతిప్పలు పెడతాడు. సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికివేస్తాడు. రెక్కలు తెగిన ఆ పక్షిరాజు  నేలకూలుతాడు. కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం పూర్తిగా చెప్పి, రాముడి చేతిలోనే ప్రాణం విడుస్తాడు. తనకు క్షేమం కలిగించటానికి ప్రాణాలకు తెగించిన జటాయువును ఆప్తమిత్రుడుగా స్వీకరించి, అతడికి ఉత్తరక్రియలు స్వయంగా నిర్వహిస్తాడు రామయ్య. తాను క్షత్రియుడు. చేస్తున్నది వనవాసం. మరణించింది పక్షి. అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా ఉత్తరక్రియలు చేసి, స్నేహధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించాడా మహనీయుడు.

యుద్ధధర్మం

వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. తమ్ముడి భార్య కోడలితో సమానం. మామగారు తండ్రితో సమానం. తండ్రిలాగా కాపాడాల్సిన తమ్ముడి భార్యను కామంతో వాలి కోరుకున్నాడు. అంతేకాదు.. వాలి వనచరుడు. క్రూరత్వం కలిగిన వనచరాలను వేటాడటం క్షత్రియధర్మం. అంతేకాదు, ఎదుటివారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంటుంది. దాన్ని ధరించిన సమయంలో వాలి ఎదుట ఎవరు నిలిచినా వారి శక్తి క్షీణిస్తుంది. కాబట్టే రాముడు చెట్టుచాటున దాగి, వాలిపై బాణాన్ని ప్రయోగించాడు. ఇది యుద్ధధర్మం. వాలి వధ ఘట్టంలో రాముడు క్షత్రియ, యుద్ధ ధర్మాలను పాటించాడు.

రావణ సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి, ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడుగుతాడు. అప్పుడు రామచంద్రుడు మరణాంతాని వైరాని నివృత్తం నః ప్రయోజనం క్రియతామద్య సంస్కారః మమాప్యేష యథా తవ ‘విభీషణా! శతృత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరకపోవడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది. మీ అన్నగారికి ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు. ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు. నాకూ అన్నగారే’ అంటాడు... ఇదీ రాముడి ధర్మవర్తన.
దయాధర్మం

సీతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి రాజ్యబహిష్కరణ శిక్ష వేస్తాడు రావణుడు. సముద్రతీరంలో అపారమైన వానరసేనతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశ్రయిస్తాడు విభీషణుడు. మరో ఆలోచన లేకుండా విభీషణుడికి అభయం ఇస్తాడు రామయ్య. అంతేకాదు, రావణుడిని చంపి విభీషణుడిని లంకా రాజ్యానికి రాజును చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. కానీ, సుగ్రీవుడు మొదలైన వారికి ఇదంతా ఇష్టం లేదు. ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్లి, విభీషణుడిని నమ్మవద్దని చెబుతారు. అతడు రావణాసురుడి దూత అంటూ హెచ్చరిస్తారు. అంతా విన్న రాముడు విభీషణుడే కాదు... చివరకు రావణుడే తనను ఆశ్రయించినా.. అతడికి కూడా అభయం ఇస్తానంటాడు. ఆశ్రయించిన ప్రాణులకు రక్షణ కల్పించటం క్షత్రియధర్మం. దయాధర్మం కూడా. వనవాసంలో ఉన్నా, చివరకు యుద్ధభూమిలో ఉన్నా దయాధర్మాన్ని రామయ్య విడిచిపెట్టలేదు. 

మనుష్యధర్మం  

రామరావణ సంగ్రామం ముగుస్తుంది. రావణుడు నేలకు ఒరుగుతాడు. ముల్లోకాలూ ఎంతో ఆనందిస్తాయి. వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవుతారు. రాముడిని సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపంగా స్తుతిస్తారు. ‘నీది విష్ణు అంశ. వాస్తవానికి నువ్వు నిరాకారుడివి. అయినా సాకారుడిగా ఉన్నావు. సృష్టి, స్థితి, లయలు నీవే నిర్వహిస్తావు...’ అంటూ రాముడికి దైవత్వాన్ని ఆపాదిస్తారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పినా రాముడు తాను దైవాన్నని చెప్పుకోలేదు. తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు. ‘ఆత్మానం మానుషం మన్యే... దశరథాత్మజః’ అంటూ తాను కేవలం దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే. సాధారణ వ్యక్తిని మాత్రమే’ అంటాడు. ఇదీ రామయ్య పాటించిన మనుష్యధర్మం. రామయ్య ఎక్కడా మాయలు, మంత్రాలు ప్రకటించలేదు. తాను దైవాన్నని చెప్పుకోలేదు. సాధారణ పౌరుడిలాగే రాజ్యభోగాలతో పాటు సుఖదుఃఖాలూ అనుభవించాడు. మనుష్యధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన అవతారమూర్తి శ్రీరాముడు.

సోదరధర్మం

రావణ వధ జరిగింది. లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావలసిందిగా విభీషణుడుకి వర్తమానం పంపించి, విశ్రాంతిగా కూర్చున్నాడు రామయ్య. దూరôగా ఓ స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ తన వైపే వస్తోంది. ఆమె ఎవరై ఉంటుంది? రాముడి ఆలోచన సాగుతుండగానే ఆమె  ఎదురుగా వచ్చి నిలుచుంది. అమ్మా! నీవెవరు? ఎందుకిలా వచ్చావు? రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే నీకు భయంగా అనిపించటం లేదా? నా వల్ల ఏదైనా సాయం కావాలా? అంటూ రామయ్య ఎంతో వినమ్రంగా ఆమెను అడిగాడు. అందుకామె సమాధానం ఇస్తూ, రామచంద్రమూర్తీ! నన్ను మండోదరి అంటారు. నీ చేతిలో మరణించిన రావణాసురుడి భార్యను. రామా! నీవు ధర్మమూర్తివనీ, ఏకపత్నీవ్రతుడవనీ,  సీతను తప్ప మరే ఇతర స్త్రీ పేరు కూడా తలచవనీ విన్నాను. నా భర్త అనేకమంది స్త్రీలను చెరపట్టాడు. నీవంటి ఉత్తమ గుణసంపన్నుడైన యోధుడిని చూడాలనే కుతూహలంతో వచ్చాను. పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే నీ ఔన్నత్యం అర్థమైంది. రామా! ధన్యురాలను. ఇక సెలవు. అంటూ నిష్క్రమించింది. ఇదీ.. పరస్త్రీల పై రామయ్య చూపించే సోదరధర్మం.

"పవిత్ర జీవితం కోసం, ముక్తి కోసం సాధన చేసే యోగులు రామునిలా జీవించాలని అనుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు. ఎలాగైనా ఉండొచ్చు. నిరీక్షించి.. కాలపరీక్షను ఎదుర్కోవడం వివేకవంతుల లక్షణం. రాముడూ అదే చేశాడు. ఎప్పుడూ ప్రణాళిక బద్ధంగానే జీవితం నడుస్తుందని భావించలేం. మన ప్రమేయం లేకుండా చికాకులు కలుగుతాయి. వాటికి కుంగిపోతే జీవితం గతి తప్పుతుంది. గుచ్చుకున్న ముల్లును నెమ్మదిగా తొలగించి ముందుకెళ్లాలి. అలా చేయగలిగితే అద్భుతమైన అనుభూతి మిగులుతుంది. ఏ విషయాన్నైనా సక్రమంగా నిర్వర్తించే సామర్ధ్యం పెరుగుతుంది. రాముడిని ఆదర్శంగా తీసుకోవడం అంటే ఆరాధన కోసం కాదు. మన జీవితాలను మనమే ఉద్ధరించుకోవాలన్నది అందులోని పరమార్థం. త్యాగం, ధర్మం, దయ, పరాక్రమం రామునిలోని గొప్ప లక్షణాలు. వీటిని పెంపొందించుకోవాలని చెప్పేదే రామాయణం. "
- సద్గురు జగ్గీ వాసుదేవ్‌

(సేకరణ : ఈనాడు దినపత్రిక నుండి)


22, మార్చి 2018, గురువారం

ప్రపంచ జల దినోత్సవం - World Water Day



ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నా చిత్రాలకు facebook మిత్రుల కవితా స్పందన.
దాహం... (వాణి వెంకట్ కవిత)

మండుటెండలో 
తడిఆరిన గొంతులు మావి
గుక్కనీటికై
మైళ్ళ దూరానికి పరుగులు పెట్టడడమే నిత్యవిధి
అడుగులు భారంగా కదలాల్సిందే
ఎండమావులతో చెలిమి చేయవలసిందే

తాగేనీరు కరువైనా
కొదవలేని చెమటచుక్కలు
తడవని నేలకు ఆదరువౌతూ
కన్నీటి చుక్కలు

నడకలు అలసిపోతున్నా
పదముల పరుగులాగవు
ఆకలిని సర్దుకొమ్మన్నా
దాహార్తికి ఉరకలు తప్పవు
మారుతున్న ప్రభుత్వాలెన్నో
మారని మామూలు మనుష్యుల జీవ చిత్రాలు
నిలబడిన భవానాల కింద
నలిగిపోయిన పచ్చదనాలు
కుచించుకు పోయిన అడవులు
కాంక్రీటుగా మారిన పల్లె అందాలు
కాలుష్య కోరలలో బందీ అయిన ప్రకృతి
సగటు అవసరాలకు సైతం
సతమతమౌతూ జీవ జగతి...!!

.                                                                                                ...వాణి,




!!! నీళ్ళు !!!

నీటికోసం పడుతున్న కష్టాలు
సౌకర్యాలనందుకునే స్తోమత లేక
నీళ్ళజాడ కనబడితే చాలు
బిందెలతో పరుగులు పెట్టిన
చిన్ననాటి జ్ణాపకం కదులుతోంది...
అన్ని అవసరాలకీ చేతిపంపు
దాన్ని కొట్టలేక అలసిపోయి
ఎండ భరించలేక-ఏడుపే తక్కువ
కానీ గడవదనే విషయం గుర్తొచ్చి
మళ్ళీ మొదలు-దానికీ పెద్ద లైను..
పెద్దవాళ్ళ కష్టం తలుస్తేనే భయమేస్తోంది...
నాన్నమ్మవాళ్ళ ఊర్లో మంచినీళ్ళ బావి
రోజూ సాయంత్రం అందరూ కలిసి
నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ
ఎక్కడో ఊరిచివర్న తాగేనీళ్ళకై ప్రత్యేకంగా ఉన్న మంచినీళ్ళ బావికెళ్ళితెచ్చుకునేవాళ్ళు
ఊరందరికీ ఒకటే బావి...
ఆ రెండు మూడు బిందెలు అప్పుడెలా
సరిపెట్టే వాళ్ళో అనిపిస్తుంది....
ఇప్పటికీ కొన్ని ఊర్లలో
నీళ్ళ బావులే ఆధారం........!!
ఎండాకాలం వచ్చిందంటే
ఈ తిప్పలు రెట్టింపవుతుంటాయి
చుట్టాలొచ్చినా రమ్మనాలన్నా
భయపడే పరిస్థితి....
నగరాల్లో సౌకర్యాలతో మనకంత
అవస్తలు లేవు అయినా ఆపసోపాలు
వాళ్ళు పగలంతా పనుల్లోకెళ్ళి రాత్రి
నీళ్ళ జాతరకి వెళ్ళాలి......
ఈ కరువు ఎప్పుటికి తీరుతుందో....!!
అనుశ్రీ....
15.3.2017

21, మార్చి 2018, బుధవారం

కవితా దినోత్సవం

అంతర్జాతీయ కవితా దినోత్సవం సందర్భంగా కొందరు మిత్రులు చక్కని కవితలు facebook లో పోస్ట్ చేసారు. వారికి నా కృతజ్ఞతలు. (sketches నా చిత్రీకరణ)


అందమైన పదాల పలకరింపులు
తీరైన భావాల కలబోతలు
వెన్నెల వెలుగులు వేకువ కాంతులు
హృదయ నివేదనలను
అక్షరాల విరిమాలలుగా చేసి
అలరిస్తూ స్తూర్తినింపుతున్న
కవులందరికీ పేరు పేరునా
కవితాదినోత్సవ శుభాకాంక్షలు...!!
(అనుశ్రీ)



నా పేరు....కవిత్వం
నా ఉనికి మనోజగత్తు
నాకు అక్షరాలు అనంతం
నా రూపాలు బహుముఖం
నా మూలాలు వేల యేళ్ళక్రితం
నాటుకున్నాయి
దార్శనికత నా లక్షణం
మార్మికత నా సౌందర్యం
భక్తి,రక్తి,విరక్తి
ఆగ్రహం, ఆవేశం,సందేశం
అలవోకగా పలికిస్తా
నవరసాలు తొణికిస్తా
కంటితో చూసిన దృశ్యం
ఊహలో తట్టిన భావం
బుద్ధితో పొందిన జ్ఞానం
నా కోసం
అక్షర శిల్పాలుగా
మూర్తీభవిస్తాయి
అంతరంగ సాగరాలు మధించి
ఆణిముత్యాల భావాలు వెలికితీసి
ముత్యాల సరాలల్లి
నాకు అలంకరిస్తారు
స్పందించే హృదయాలు
కుక్కపిల్ల ,సబ్బుబిళ్ళ ,అగ్గిపుల్లలో కూడా నన్ను దర్శించి
అభ్యుదయాన్ని నా కద్దుతారు
నేను వెన్నెల్లో ఆడుకునే
అందమైన ఆడపిల్లననీ
నేనొక తీరని దాహాన్ననీ
ఏవేవో అంటూ
నన్ను అనుభూతి చెందుతారు
భూతకాలాన్ని పాఠంగా
వర్తమానాన్ని దర్పణంగా
భవిష్యత్తును ఆశాకిరణంగా
నాలో నిక్షిప్తం చేస్టారు
సమాజ హితాన్ని కోరి
సరస హృదయాల సమ్మోదాన్ని నింపే
నా పేరు కవిత్వం
నా విలాసం మీ స్పందన
సింహాద్రి జ్యోతిర్మయి,
టీచర్
న.ర.సం.ఉపాధ్యక్షురాలు.
21.3.2018.

మదిభావం॥నేను అక్షరాన్ని॥
~~~~~~~~~~~~~~~~
మనసు స్పందిస్తే నాలుకైపోతాను
పదాల దాహంతో తపిస్తూ...
మనసు బరువెక్కితే కంటిచెమ్మైపోతాను
అక్షరాలను తడిపి మొలిపిస్తూ..
మనసు రగిలితే మంటై కదలిపోతాను
అక్షరాలకు కార్చిచ్చు అంటిస్తూ..
మనసు ద్రవిస్తే హిమవత్ అక్షరమౌతాను
నేను ఘనీపిస్తూ పదాలను కరిగిస్తూ ....
మనసు పులకిస్తే వరుణుని చినుకౌతాను
ఎడారి బ్రతుకులపై అక్షర విత్తులు నాటేస్తూ...
మనసు మందగిస్తే మసకేసిన జాబిలినౌతాను
మళ్ళీ విరిసే అక్షరవెన్నెల సంతకమౌతూ...
మనసుమురిస్తే ముద్దబంతిపువ్వౌతాను
అందమైన భావన అద్దిన కన్నెమోమునౌతూ....
మనసు విహరిస్తే .....
ఆహా...కవి చూపుసోకనిదెక్కడ??
ఆ చూపుకు అందని అక్షరమెక్కడ??
అందుకే ...నేను "అక్షరాన్ని"
కాలం గతించునే గాని!"కవి-కవిత్వం" గతించునా!!
జయహో కవిత్వమా!!
సాహో కవులరా-కవయిత్రులారా!!
ప్రపంచ కవితాదినోత్సవ శుభాకాంక్షలు 
JK21-3-18 (Jyothi Kanchi)

అంతర్జాతీయ కవితా దినోత్సవమంటగా..
అందుకే వదిలా... తట్టుకోండి..చూద్దాం..
కొన్నే..అక్షరాలు..
కోటి భావాలు..
అక్షరానికి అక్షరం చేరిస్తే పదం..
పదాలకు భావుకత జోడిస్తే కవిత్వం..
పదం పదం కూరిస్తే భావ రంజని..
భావాలు మౌనం వహిస్తే భాష్ప వర్షిణి..
భాష మూగబోయినా..
అక్షరం స్రవించకమానదు..
కన్ను చెమరిస్తే విరహంగా..
అధరం మురిస్తే ప్రణయంగా..
అక్షరాలకు చెప్పే భాష్యంగా...
కవిత్వమంటే రాతలేకావవి..
ఆరబెట్టిన అక్షరాలు కావవి..
పారబోసిన దోసెడు మాటలసలేకావవి..
గుండెల్లో కువకువలూ..
గుండెలవిసే రోదనలూ..
విరబూసి విరిసే సుమాలూ..
ఎగజిమ్మి దహించే అగ్నికణాలూ..
మనసు భావాలకు కవితా ధారలు..
కవితకాలంబన అక్షరాలు..
మనసున్నంతకాలం అక్షరాలు కరుగుతూనే ఉంటాయి..
మరుగుతూనే ఉంటాయి..
కవితలై జాలువారుతూనే ఉంటాయి..!! (శ్రీ వేమూరి మల్లిక్)

18, మార్చి 2018, ఆదివారం

ఒక అందం ఊగుతోంది - కవిత


(నా పెన్సిల్ చిత్రం)

ఒక అందం ఊగుతోంది ఆశల ఊయలపై
మదిలోని సందేహాలేవొ పలకరిస్తుంటే..
దాగనంటున్న ఆరాటాన్ని ఒలకబోస్తూ..
వేచిన మనసు కళ్లలోంచి తొంగి చూస్తోంది..

విచ్చుకోని పెదవుల దాగిన మందహాసాలు
మనోహరుని పిలుపుకై మారాము చేయగా
తలపుల విరివానలా దరిచేరిన చిరుగాలి
అంతరంగపు ఆలోచనను అనుసరిస్తోంది..
మదిలోని నెలరాజు అడుగుల సడికై
తనువంతా కనులై ఎదురుచూస్తోంటే
ఒంటరి ఊసుకు తోడొచ్చే సంతోషానికై
మౌనమైన మనసుతో సందేశాలిస్తోంది....
కలలన్నీ నిజమై కనికరించే వేళకై
కాలాన్ని సాగిపోమంటూ వేడుకుంటోంది
రాబోయే వసంతుడిని ఆహ్వానిస్తూ
మమతల గుడిలో మంత్రమై వేచిచూస్తోంది
అనూశ్రీ.... (Pvr Murty బాబాయిగారి చిత్రం...)

16, మార్చి 2018, శుక్రవారం

వాలుజడ

నా పెన్సిల్ చిత్రం. కవిత courtesy శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి.
జడతో నా బంధం.
నాకు ఊహ తెలిసినప్పటినుండీ
నా వాలుజడ
నాకో ప్రత్యేక గుర్తింపు
నల్లగా నిగనిగ లాడుతూ
నాగుపాములా నాట్యం చేస్తూ
నా అడుగులకు అందాన్నిస్తూ
బారెడు పొడవున్న నా జడను
మెచ్చుకోలుగా చూసే కళ్ళు
ఆశ్చర్యం తో చూసే కళ్ళు
అసూయతో చూసే కళ్ళు
ఆరాధనగా చూసే కళ్ళు
నా వీపుకి గుచ్చుకోవడం
నాకు‌తెలుస్తూనే ఉండేది
గర్వం చిరునవ్వుగా మారి
నా పెదవులపై చిందులాడేది
పూలజడకు నాకు
సవరం‌ అక్కరలేదని
ఇరుగూ పొరుగూ పొగుడుతుంటే
పిల్లకెంత దిష్టంటూ
కల్లు ఉప్పుతో దిగదుడిచే
బామ్మను చూసి నవ్వుకోవడం
బాగా గుర్తుంది నాకు
నన్ను నేను సత్యభామలా
భావించుకునేలా చేసిన నా జడ
పెళ్ళి చూపుల్లోనే మా వారిని
నన్ను కట్టుకునేలా
కట్టి పడేసింది.
పెళ్ళయిన కొత్తల్లో
నా ప్రేమ బంధంలో
చిక్కుకునేలా చేసింది.
ఏళ్ళు గడిచాయి
ఎన్నో మార్పులొచ్చాయి
సంసారం,సంతానం
బరువులు,బాధ్యతలు
అశ్రద్ధ,ఆందోళన
తమ ప్రభావాన్ని ముందుగా
నా జడపైనే చూపించాయి.
తలస్నానం‌ చేసినప్పుడల్లా
తలలో‌ దువ్వెన పెట్టినప్పుడల్లా
కుచ్చులు కుచ్చులుగా
ఊడిపోతున్న
కురులను చూస్తున్న కొద్దీ
కలవరం కంటి నిద్ర కాజేసింది
పలచబడుతున్న జుట్టుకి తోడుగా
తొంగిచూస్తున్న తెల్లవెంట్రుకలు
గోరుచుట్టుపై రోకటి పోటులా
నా దిగులును ద్విగుణం చేశాయి.
రంగువేసి వయసును దాచటానికి
రకరకాల నూనెలు,షాంపూలతో
ఊడే జుట్టును కాపాడడానికి
నేను విన్న‌ చిట్కా వైద్యాలన్నీ
పాటించి చేసిన ప్రయత్నాలన్నీ
బూడిదలో‌పోసిన పన్నీరయ్యాయి
పీలగా,పిలకలా మారిపోయిన
నా జడను చూసి
ఇప్పుడెవ్వరి కళ్ళల్లోనూ
ఆరాధనాభావం లేదు.
మా ఆయన కళ్ళల్లోనూ
తగ్గిందేమోనని
మనసులో చిన్న‌అనుమానం
ఇప్పుడు నా గర్వం కూడా మాయమయ్యింది
అయినా, నా మనసు
ఓటమిని ఒప్పుకోదు.
అందుకే,ఇప్పుడెక్కడనా
అందమైన వాలుజడ
కనపడగానే
అసూయతో నా కళ్ళు మండకుండా
నాకునేనే చెప్పుకుంటుంటాను
బుద్ధిమంతురాలి జుట్టు
భుజాలు దాటదని.....
సింహాద్రి
9.3.2017.

14, మార్చి 2018, బుధవారం

రఘుపతి వెంకయ్యనాయుడు

తెలుగు చలనచిత్ర సీమ పితామహుడు రఘుపతి వెంకయ్య వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ నా పెన్సిల్ చిత్రం.

Raghupathi Venkaiah Naidu (15 October 1887 – 15 March 1941), known widely as the father of Telugu cinema, was an Indian artiste and film maker.
తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారు. ఈయన ప్రసిద్ధ సంఘసంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడుగారి సోదరుడు.
రఘుపతి వెంకయ్య స్వస్థానం మచిలీపట్నం. 1886లో తన 17వ ఏట వెంకయ్య ఫొటోలు తీయడం మొదలుపెట్టాడు. 1910లో ఒక 'క్రోమో మెగాఫోను'ను, 4000 అడుగుల ఫిలిమ్‌ను విదేశాలనుండి తెప్పించుకొని వాటిని ప్రదర్శించడం ఆరంభించారు. ఒక టూరింగ్ టెంట్ ద్వారా ప్రదర్శనలిస్తూ ఆయన అప్పటి మూగసినిమాలకు సంగీతం వంటి ఆకర్షణలు జోడించేవాడు.
1912లో మద్రాసులో 'గెయిటీ' అనే సినిమా థియేటర్ (ప్రదర్శన శాలను) నిర్మించారు. తరువాత 'క్రౌన్', 'గ్లోబ్' సినిమాహాళ్ళను కూడా నిర్మించారు. తన కుమారుడు ఆర్.ఎస్.ప్రకాష్ను సినిమా నిర్మాణం నేర్చుకోవడానికి విదేశాలు పంపాడు. ప్రకాష్ జర్మనీ, ఇటలీ, అమెరికా దేశాలు పర్యటించాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శకుడు 'సిసిల్ బి డెమిల్లి' (Ceicil B.Demille) 'టెన్ కమాండ్‌మెంట్స్'(Ten Comamndments) చిత్రాన్ని నిర్మిస్తున్నపుడు ప్రకాష్ ఆయన క్రింద కొంతకాలం పనిచేశాడు.
ప్రకాష్ తిరిగి వచ్చిన తరువాత ఈయన దక్షిణభారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ 'Star of the East' ను స్థాపిచాడు. 1921లో భీష్మప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు (ఇది మూగచిత్రం గనుక "మొదటి తెలుగువాడి సినిమా" అనడం ఉచితం). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. 'డి కాస్టెల్లో'(De Castello)అనే ఆంగ్లయువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ఈ తండ్రీకొడుకులు మత్స్యావతార్, నందనార్, గజేంద్రమోక్షం వంటి మరికొన్ని మూగసినిమాలను తీశారు. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, వై.వి.రావులూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
తరువాత తమిళ సినిమా నిర్మాత ఎ.నారాయణన్‌తో కలిసి 'గ్యారంటీడ్ పిక్చర్స్ కార్పొరేషన్' , 'జనరల్ ఫిల్మ్ కార్పొరేషన్' స్థాపించారు. విశ్వామిత్ర, మాయామధుసూదన, పాండవ నిర్వహణ, రాజ్ ఆఫ్ రాజస్థాన్ వంటి మరికొన్ని మూగసినిమాలు తీశారు.
1941 లో తన 69వ ఏట రఘుపతి వెంకయ్య మరణించారు. అప్పులవారికి చాలామొత్తాలు చెల్లించవలసినందున ఆయన చివరికాలానికి ఏమీ ఆస్తి మిగలలేదు అంటారు.
Source : Wikipedia

అన్నమయ్య - అన్నమాచార్య

ఈరోజు అన్నమయ్య వర్ధంతి. అన్నమయ్య 'అన్నమాచార్యుడు" అయిన ఉదంతం.
ఘన విష్ణువు అనే వైష్ణవ యతి తిరుమలలో ఉండేవాడు.అతదు మహా భాగవతుడు. మాధవసేవ చేస్తూ సాటి మానవులకు విష్ణుతత్వాన్ని బోధించేవాడు. తన శెష జీవితాన్ని శేషాద్ర నిలయునికే అంకితం చేసాడు. ఆ దినం ద్వాదశి. రాత్రి వేంకటపతి ఆ యతికి కలలో కనిపించి "తాళ్ళపాక అన్నమయ్య అనే భక్తుడు రేపు నీదగ్గరకి వస్తాడు. వాడు నల్లగా అందంగా ఉంటాడు. ఎప్పుడూ నామీద పాటలు పాడుతూఉంటాడు. వాని చెవిలో మద్దికాయలు వేలాడూతూ ఉంటాయి. పట్టుకు కుచ్చులున్న దండె భుజంమీద మోపి మీటుకుంటూ ఉంటాడు. వానికి నీవు ముద్రాధారణం చెయ్యి. ఇవిగో నా ముద్రికలు" అని ఆదేశించాడు.
మర్నాడు ఉదయాన్నే స్నాన సంధ్యాదులు ముగించుకుని ఘన విష్ణువు స్వామి మందిరంలో యజ్ఞశాల వద్ద నిల్చున్నాడు. అతని చేతిలో స్వామి సమర్పించిన శంఖచక్రాల ముద్రలున్నాయి. అన్నమయ్య పొద్దున్నే లేచి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి ని దర్శించుకున్నాడు. హరినామ సంకీర్తన చేసుకుంటూ యజ్ఞశాలముందుకి వచ్చాడు. ఘనవవిష్ణువు వానిలో స్వామి చెప్పిన గుర్తులను చూసి మెల్లగా ఆ బాలుని సమీపించాడు. "నాయనా నీ పేరేమి?" అన్నమయ్య యతికి పాదాభివందనం చేసి "అన్నమయ్య" ప్రవర చెప్పాడు. యతి కళ్ళు ఆనందంతో మెరిసాయి. "నీకు ముద్రాధారణ చేస్తాను. సమ్మతమేనా..?" అని అడిగాడు. అన్నమయ్య యతి ముఖాన్ని చూసాడు. వేంకటేశ్వరుడే కనిపించాడు. "కృతార్ధుణ్ణి" అన్నాడు.
ఘన విష్ణువ వేదోక్తంగా అన్నమయ్యకు సంస్కారాలు నిర్వహించాడు. సాటి వైష్ణువులకు అన్ని విషయాలు తెలిపాడు. వాళ్ళు తృప్తిపడ్డారు. అప్పట్నించీ అన్నమయ్య అన్నమాచార్యుడయ్యాడు..

శ్రీమతి పొన్నాడ లక్ష్మి గారి facebook పోస్ట్ నుండి సేకరణ. చిత్రాలు నేను చిత్రించినవి.

13, మార్చి 2018, మంగళవారం

అన్నమయ్య

అన్నమయ్య వర్ధంతి సందర్భంగా .....
ఏ జన్మమున ఏమి తపముచేసి ఈ జన్మమున మన అన్నమయ్యగా ఆవిర్భవించాడో ఈ మహాత్ముడు. శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో బ్రాహ్మణులు , భరధ్వాజస గోత్రులు అయిన లక్కమాంబ, నారాయణసూరి పుణ్యదంపతులకు 1408 వ సంవత్సరము విశాఖ నక్షత్రం, వైశాఖపూర్ణిమనాడు కడపజిల్లా తాళ్ళపాక గ్రామంలో అన్నమయ్య జన్మించాడు. ఈయనతో మొదలుపెట్టి మూడు తరాలవరకూ అందరూ కవులే. గాయకులే. తెలుగులో మొదటి కవయిత్రి అయిన తాళ్ళపాక తిమ్మక్క అన్నమయ్య మొదటి భార్య'సుభద్రా కల్యాణం' కావ్యాన్ని మంజరీ ద్విపదలో రచించారు.
పదకవిత్వం కవిత్వం కాదని నిరసించే కాలంలో అన్నమయ్య వాటిని రచించి, పద కవితకు ఒక నిర్దిష్టతనీ, గౌరవాన్ని కల్పించారు. పైగా పండితులకంటే, ముఖ్యంగా పామరులను రంజింపజేసేందుకు జానపదుల భాషలో మేలుకొలుపు, ఉగ్గు, కూగూగు, ఏల, జోల, జాలి, ఉయ్యాల, కోలాట, సువ్వి, జాజర పదాలను, సామెతలనీ, జాతీయాలనీ పొందుపరుస్తూ, తేలిక భాషలో జనరంజకంగా రచించారు. పండితానురంజకంగా గ్రాంథిక, సంస్కృత భాషల్లో కూడా సంకీర్తనలను రచించారు. అందువల్లనే ఆరు శతాబ్ధాలు గడిచినా ఇప్పటికీ అన్నమయ్య కీర్తనలు పండిత పామరుల నందరినీ ఆకర్షిస్తున్నాయి. అంతేకాక వైరాగ్య మనస్తత్వాలకు ఆధ్యాత్మిక సంకీర్తనలనీ, శృంగార ప్రియులకు శృంగార కీర్తనలనీ, పిల్లలకనువయిన ఆటపాట కీర్తనలనీ, శ్రమజీవులకోసం జానపద గేయాలనీ రచించారు. అందుకే సమాజంలోని అన్నివర్గాల వారికీ అన్నమయ్య సంకీర్తనలు నేటికీ ఆనందదాయకాలే. మానవ జీవన ధర్మాలన్నీ తన రచనల్లో పొందుపరిచారు. అన్నమయ్య మొత్తం 32,000 వేల కీర్తనలను రచించారు. అందులో 14 వేల కీర్తనలు మాత్రమే మనకు లభ్యమయ్యాయి.అన్నమయ్య కీర్తనల్లో అమృతత్వాన్ని ఆస్వాదించడానికి ఎందరో ప్రజలు ఆయన అనుగ్రహం కోసం అర్రులు చాచేవారు. అన్నమయ్య మనుమడు చిన్నన్న గ్రంథస్థం చేసిన 'అన్నమాచార్య చరిత్ర'లో ఈ విషయాలన్నీ ఉన్నాయి. మన అన్నమయ్యకు ప్రపంచవాసన, సంసార లంపటము, దాంపత్య సౌఖ్యము, భార్యాపుత్రులయందు మమకారము, దొరలతో చెలిమి వగైరాదులు ఏమీ తక్కువగా లేవు. అసలే జోడు చేడెల మగడు. కడుపునిండిన సంతానము. దేనికీ లోటులేని సంపూర్ణ జీవితము మన అన్నమయ్యది.

'శ్రీహరి కీర్తన నానిన జిహ్వ, పరుల నుతించగ నోపదు జిహ్వ' అంటూ రాజాస్థానాన్ని తిరస్కరించిన ఆత్మాభిమాని అన్నమయ్య. తిరుమలలో నిత్యకల్యాణ సంప్రదాయాన్ని ప్రారంభించింది అన్నమయ్యే అంటారు. ఆ చనువుకొద్దీ శ్రీనివాసుడు స్వప్న సంభాషణల్లో అన్నమయ్యని 'మామా' అని సంబోధించేవాడని చెబుతారు. వేంకటపతి ప్రతీ సేవలోనూ అన్నమయ్య సంకీర్తన ఉండవలసిందే. అన్నమయ్య కీర్తనలను వింటూనే ఊరేగుతాడు వేంకటేశ్వరుడు.
నా నాలికపై నుండి నానా సంకీర్తనలు - పూని నాచే నిన్ను పొగిడించితివి
వేనామాల వెన్నుడా వినుతించనెంతవాడ - కానిమ్మని నాకీ పుణ్యము గట్టితి వింతే అయ్యా! అంటూ తన సంకీర్తనా ప్రతిభ స్వామి వరమే నని ప్రకటించాడు ఆచార్యుడు. 1503 దుందుభి నామ సంవత్సరం, ఫ్హాల్గుణ బహుళ ద్వాదశినాడు అన్నమయ్య అనంతకోటి బ్రహ్మాండ నాయకునిలో ఐక్యమయ్యాడు.
"హరి అవతారమీతడు అన్నమయ్య - అరయ మా గురుడీతడు అన్నమయ్యా.."
- పొన్నాడ లక్ష్మి

(వ్యాసం courtesy శ్రీమతి పొన్నాడ లక్ష్మి)

8, మార్చి 2018, గురువారం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం - నాణేనికి అటువేపు.




International Womens' Day - the other side of the coin
అంతర్జాతీయ మహిళా దినోత్సవం - నాణేనికి అటువేపు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చింది, వెళ్ళింది.
ఈ విషయంలో శ్రీమతి Velamuri Luxmi, శ్రీమతి Sasikala Volety, మా పెద్దమ్మాయి శ్రీమతి Vijaya Seshu గార్ల స్పందన ఆలోచించాల్సిన విషయాలు గా, చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వారి posts ని నా బొమ్మతో పాటుగా యధాతధంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను. 

Velamuri Luxmi గారు : " నా నేటి ఆలోచన .....
""""""""""""""""""
' కొంత మంది ఆడవాళ్ళకి , మొగవాళ్ళకీ ఈ పోస్ట్ నచ్చక పోవచ్చు .... కానీ నేను నా మనసులో వున్నది ఎవరేమనుకున్నా వ్రాసేస్తాను ...' అందుకేనేమో - యదార్థ వాది - లోక 
విరోధి ' అంటారు .... అలా నా మనస్సులో వున్నది , ( సత్యం ) చెప్పి నేను కొన్ని చోట్ల , వారి కోపాలకు , వారినుంచి దూరం కూడా అయిపోయాను . అలా అని , అన్నిటినీ , అన్ని 
వేళలా భరించలేము కదా ...ప్రత్యేకంగా కొన్ని ఇబ్బందికర , పది మందిలో మనల్ని వేలెత్తి 
చూపే విషయాలు ..సరే ..అది వొదిలి అసలు విషయానికి వస్తాను .....
" HAPPY WOMEN'S DAY ...." " HAPPY INTERNATIONAL WOMEN'S DAY " 
అని అందరూ తెగ (మనల్ని - అంటే ఆడవారిని ) ఈ రోజు మాత్రం , ఎక్కడ లేని వారు 
మనపై ప్రశంసా జల్లులు కురిపించి ," అహా ఓహో " అంటూ , తెగ వుబ్బించేసి , ఏ ఒక 
సంస్థ వారో , ' WOMAN OF THE YEAR ' OR ' MAHILAA AWARD ' అనో చెప్పేసి , 
మనకు మెడలో ఒక దండ వేయించేసి , ఒక ' మొమెంటో ' చేతి కిచ్చి , ఒక శాలువా కప్పేసి,
చేతులు దులిపేసుకుంటారు ..... 
నా దృష్టిలో ప్రత్యేకంగా ఉమన్స్ డే ఎందుకు ? మాకు , అంటే మా ఆడవారికి ప్రతి రోజూ 
ఉమన్స్ డే నే ! ప్రతి రోజూ ' దిన - ఉత్సవమే ' ....
వివరిస్తాను .....స్త్రీ జన్మయే గొప్ప జన్మ ! చిన్నప్పుడు అమ్మా నాన్నల, అన్నదమ్ముల , అక్క 
చెల్లెళ్ళ మధ్య , ఒక యుక్త వయసు వచ్చాక సమాజంలో .... ప్రతి రోజూ ఒక ' దినమే ' ....
మేము అక్క అవుతే , తమ్ముడు చెల్లెళ్ళ కోసం , చెల్లెలవుతే అన్న అక్కలకోసం సర్దుకు పోతూ వున్నా ....ఏదో ఒక దానికి ' దినం ' పెట్టించు కుంటూవుంటాం .... యుక్త వయసులో , ఎక్కువ మాటాడితే ఒక తప్పు ....మాటాడక పోతే ఒక తప్పు ....ఇలా రోజూ 
దినం పెట్టించు కుంటుంటాం .....నేను , ఈ కాల మాన పరిస్థితులనూ , మా వయసు వారి 
అనుభవాలతో వ్రాస్తున్నాను . ....
కొంతమంది నేను వ్రాస్తే , ' అలా లేదు లక్ష్మి గారూ కాలం మారింది .' అని వాదిస్తారు ...
కాలం మారలేదు , అలానే వుంది ...మనుష్యుల స్వభావాలూ మారలేదు ...అవే ఇరుకు 
ఆలోచనలు, అదే పురుషాధికార మనస్తత్వం ....ఎవరో కొంచం , తిరుగుబాటు చూపిస్తే , 
వారికి ఒక - " పొగరు , విరుగుబాటు , అతి ......." ఇలా ఇలా ఎన్నెన్నో బిరుదులు ....
చిన్నప్పుడు , ఆటపాటలతో , అపుడో ఇపుడో ,అమ్మ నాన్నల , అన్నదమ్ముల , అక్కచెల్లెళ్ళ తిట్లతో , కొద్దో , గొప్పో దెబ్బలతో , అవన్నీమరచిపోయి నిర్మలంగా ప్రతి రోజునీ 
" ఉత్సవం " లా గడిపేస్తాము ..... వయసుకొచ్చాక , కాలేజ్ లలో ,( కొంచెం ఫ్రీగా వుంటే )
' ఏవేవొ బిరుదులిచ్చి " దినాలు " పెట్టేస్తారు . బాగా చదువుకుని వుద్యోగాల్లో చేరి సంపాదిస్తున్నా , అమ్మానాన్నల అదుపులో వున్నా , ఏదో ఒక చిన్న విషయానికైనా , 
పని చేసే చోటనో ..ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కుంటూ ..'దినం 'పెట్టించేసుకుంటున్నాము . 
ఇక పెళ్ళయ్యాకా ....అక్కడ ప్రతిరోజూ ' దినమే ' ఎదుర్కోవాలి ....మంచిగా వుంటే " మంచి తనాన్ని - చేతగాని తనం " గా తీసుకుని , దినం పెట్టేస్తుంటారు ...ఇక కొంచెం 
' గడుసు ' గా వుంటే , " పొగరు మోతనీ , సంపాదిస్తున్నానని అహంకారమనీ , పెంపకం 
సరీగా లేదనీ , మొగుణ్ణి చెప్పుచేతల్లో వుంచుకుందనీ .....గడుసు అని బిరుదులు ఇచ్చి , ప్రతిరోజూ ' దినం ' పెట్టేస్తుంటారు ....పిల్లలు పుట్టాక , వాళ్ళ ఆలనా , పాలనా చూస్తూ , వాళ్ళని సక్రమంగా పెంచినా , ఏ చిన్న తప్పు వారిద్వారా అయితే నేమి , మనద్వారా అయితే నేమి , దానికి ' మమ్మల్నే ' బాధ్యుల్ని చేస్తూ , దినాలు పెట్టేస్తుంటారు ....వాళ్ళని 
జీవితంలో స్థిరపరిచి , పెళ్ళి పేరంటాలు చేసి ' అబ్బ ' అనుకునే లోపుగా , వారి పిల్లల 
బాధ్యతలు ....అంటే ...కూతురు , కోడలయినా ఉద్యోగాలు చేసే వారయితే ....వారికి చాకిరీ! 
అలా వారికీ ,వారి పిల్లలకు చేస్తూ ,చిన్న మాటకూడా అనకూడదు.అంటే వాళ్ళతో దినం.
ఒక వేళ కూతురో కొడుకో , ఏ కొడుకో విదేశాల్లో వుంటే , 60, 65 వయసుల్లో వాళ్ళకు 'అమ్మ' 
(అంటే , వాళ్ళకు 60,65 కాదు ...మాకు ....) గుర్తొస్తుంది . ఇద్దరూ వుద్యోగాలకెళ్తారు ...వారి 
పిల్లల్ని చూసుకోవడానికి , ఇంటికి ఒక కాపలా దారు కావాలి ....ఎవరినైనా పెట్టుకుంటే , 
వారికి దాదాపు , నెలకు ఏ డెబ్బయ్యో , ఎనభయ్యో వేలు మన డబ్బులో ఇవ్వాలి ....మన 
మొహాలకు ఒక్క మారు - పోనూ రానూ డెబ్భై ఎనభై వేలు పెట్టి టికెట్ కొని పిలిపించుకుంటే , ఏ ఆరునెలలో చచ్చినట్టు పడివుంటారు అని ....మేము , ఆ 'మమకారం'- అనే కారాన్ని అడ్డుపెట్టుకుని ..ఎగేసుకు పోతాం... ఆరునెలలవగానే 'ఇక ఈ 
జన్మలో ' రాకూడదు అని నిశ్చయించుకుని ....వస్తాం ..కానీ , మళ్ళీ అదే ' కారం ' అడ్డువచ్చి వెళ్ళాల్సి వస్తుంది ....పైగా అక్కడ జీవితం ' బంగారు పంజరం ' ...మన భాష 
వారికి అర్థం కాదు , వారి భాషను మనం అనుసరించలేము , బయటికి ఒంటరిగా వెళ్ళ 
లేము ....ఇంట్లో ఒంటరిగా వుండలేము .....ఇలా తిరిగి స్వదేశం చేరే వరకు , ' దినమే ' ! 
ఒక వేళ త్వరగా వెళ్తామంటే - కూతురయితే ," ఏంటమ్మా ! నీకంత కష్టంగా వుందా ? 
వెళ్తానంటున్నావు ? ఇక్కడ నాకష్టం నీకు అర్థం కాదా.. అవునులే ! అక్కడ బాగా ఇరుగు పొరుగులతో కబుర్లు , ఇక్కడయితే ..నీకు స్వతంత్రం వుండదుగా ...? " ....అంటూ దినం 
పెట్టేస్తారు ...కోడలయితే ...తను మంచి అవ్వాలనీ , ఎక్కడ కీ ఇవ్వాలో , అక్కడ ఇచ్చేసి , 
ఏమీ ఎరగనట్టు ...కొడుకుతో ...దినం పెట్టించేస్తారు ...." సరే , ఏదోలా ఆ ఆరు నెలలు 
కష్టంగా - ఇష్టంగా కాదు గడిపి ....రాగనే ..మళ్ళీ ఇక్కడి బాధ్యతలు ....దినాలు ....చూసే 
వారికేమో , ' మీకేమండీ ...హాయిగా , ( కూతురయితే కూతురని , కొడుకయితే కొడుకని ) 
రెఫర్ చేస్తూ ..., విదేశాలు చుట్టివచ్చారు ...అక్కడకు వెళ్ళలేని వారు ....అంటూ , అక్కడ 
మనం , ఐ మీన్ మేము పడ్డ ' దినాన్ని ' పదే , పదే జ్ఞాపకం చేస్తూ ....దినం పెట్టేస్తుంటారు ...... ఇక మాకెక్కడండీ ప్రత్యేక దినం ....ఎందుకు ప్రత్యేక దినం ...
పైగా , కొన్ని , కొంత మంది( మా ఆడవారి ) జీవితాలు ఎలా బుక్ అయిపోయివుంటాయో 
ఎలా మాటాడకుండా , దినాలు బ్రతికుండగానే పెట్టించుకుంటారో చెబుతాను ....
నాకొక స్నేహితురాలు వుంది ...నాకున్న కొంతమంది ముఖ్యులలో ఒకామె ...తనకు భర్త లేరు ..కావలసినంత డబ్బు ! కానీ ఆరోగ్యం బావుండదు ...కొడుకు దగ్గర వుంటారు.ఒక్కడే కొడుకు . ఆ కొడుకుకూ తెలుసు . అమ్మకు ఆరోగ్యం సరీగ్గా వుండదని ...ఒక్కసారి గుండె 
జబ్బుతో మంచాన పడ్డారు . అయినా తమ కొడుకు చదువుకోసం , ఆవిడని అక్కడికి 
పంపించారు . ' బయటి భోజనం పడదు వాడికి ' అని ....అంటే , వయసులో వున్నవాడికి 
పడదు ...ఏ అర్ధ రాత్రి ఆవిడకేమయినా అయితే , ఆ చిన్న కుర్రాడు , వూరు కాని వూరులో 
ఆమెను , డెబ్బ ఏళ్ళ వయసులో ఆమెను చూసుకో గలడా ఆ చిన్న కుర్రాడు ? ....అక్కడా 
వాడి చదువు అయ్యేవరకు , తనకు రోజూ ' దిన దిన గండమే ' ...ఇక మరో స్నేహితురాలు. 
తనకు ఒకమ్మాయి , అబ్బాయి ..ఇద్దరూ విదేశాల్లో వుద్యోగాలు చేసుకుంటూ ...స్థిర పడి 
పోయారు ...తను ఆయన వున్నంతవరకు , ఆయన అనారోగ్యంతో జీవితంతో పోరాడి , పోరాడి , ఆయన ఈ మధ్యనే పోయారు ...ఇప్పుడు తన అనారోగ్యంతో పోరాడుతూ , ఒంటరిగా , ' దినాలు ' లెక్కపెడుతోంది ....అక్కడికి వెళ్ళి ఆరునెలలకోసం ( భర్త పోయాక) 
మధ్యలోనే తిరిగి వచ్చేసింది .....' నీకేం కావాలో చెప్పమ్మా ! డబ్బు పంపిస్తాం ...' అంటారు. ....డబ్బుతో వస్తుందా , మనశ్శాంతి ? డబ్బుతో వస్తుందా ఆప్యాయత ? అది 
అర్థం చేసుకోరెందుకు ? .....ఇలా వ్రాస్తూ పోతే ....మా బాధలు , వేనకు వేలు , లక్షలకు లక్షలు .....ఈ మధ్య , ఈ " వృధ్ధాశ్రమాల " ఫీడ ఒకటి మనకంటుకుంది ....ఫ్రీ వృధ్ధాశ్రమాలు , పెయిడ్ వృధ్ధాశ్రమాలు , ఎన్నారై వృధ్ధాశ్రమాలు .....ఓహ్ !.. ఇవన్నీ స్త్రీకి 
సుఖాన్నిస్తాయా ....కన్న బిడ్డల మనస్సులో కాస్తంత ప్రేమ , ఆప్యాయత ....ఇవేవి ? అవే 
మాకు కరువు ....నేను నా గురించి వ్రాయటం లేదు ....ఎంతో మంది తల్లుల వ్యథని , బాధని చూసి , విని చెబుతున్నాను ....వ్రాస్తున్నాను ....
కాబట్టి , నా ప్రియతమ సోదరులారా , కొడుకులారా , కోడళ్ళారా , కూతుర్లారా ....మాకు 
కాస్తా ప్రశాంత జీవితాన్ని ఇవ్వండి ....మనశ్శాంతిని ఇవ్వండి ....కొంచెం ఆప్యాయతని 
పంచండి ....ఇప్పుడు బ్రతికినన్ని ఏళ్ళు మేము బ్రతకముగా .... వునన్ని నాళ్ళు మాకు , 
మీ ప్రేమను పంచండి ....ఎక్కడ సుఖంగా , ఎక్కడ సౌకర్యంగా వుండాలని అనుకుంటామో , అక్కడ ఉండనివ్వండి ...బ్రతికుండగానే మాకు " దినాలు " పెట్టకండి ..
ప్లీస్ .....మాకు ఏ ప్రత్యేక మహిళా దినోత్సవాలూ వద్దు ..మమ్మల్ని పిచ్చివాళ్ళని చేసి ,
ఓహో , ఆహా అంటూ ఆకాశానికి ఈ ఒక్కరోజూ ఎత్తేసి , మళ్ళీ రేపటినుంచి , పాతాళానికి 
త్రొక్కకండి ....నేను వెళ్ళి చూసి , మాటాడిన వృధ్ధాశ్రమాలలో , ఆతల్లి దండ్రుల బాధ ,
ఆప్యాయతలకు , వారి పిల్లలకోసం , వారు చూసే ఆ ఆర్ద్రత చూపులు , ఆ ఎదురుతెన్నులు 
నన్ను కలచి వేసి ....ఇవ్వాళ ఈ పోస్ట్ పెడుతున్నాను ....మాకు వృధ్ధాశ్రమాలూ వద్దు ,మీ 
మహిళా దినోత్సవాలూ వద్దు ....విదేశ యానాలూ వద్దు ...మా తో వుండండి ..మాకు మీ 
హృదయాల్లో కాస్త చోటు ఇవ్వండి పురుషపుంగవుల్లారా .... మా త్యాగాలు ,మీ హృదయాల్లో భద్ర పరచుకోండి ...సభలూ , సన్మానాలూ మాకొద్దు ....మమ్ము మమ్ముగా 
చూడండి ...చాలు ....
ఈ పోస్ట్ చాలా మందికి నచ్చక పోవచ్చు ....చాలామందికి నచ్చినా , నచ్చనట్టు నటించ 
వచ్చు ...నో వరీ ..నో ప్రాబ్లెం ....ఓ ! ఓపికతో జీవిస్తున్న , జీవఛ్చవ మహిళా ,మీకూ - నాకూ 
నా ఇదే జోహార్ ! ....." 

శ్రీమతి Sasikala Volety గారు

దయచేసి కొంచెం ఆగి చదవండి.
*****************
మహిళామణు లందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మహిళలు సాధించిన సాధికారతను, విజయాలను స్మరించుకుని, మహిళా సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించే రోజు. మహిళల హక్కులు, భద్రతా చట్టాలు,శాసన సభ్యత్వం ఇత్యాది గంభీరమయిన అంశాలు చర్చించుకునే దినం అని నేను అనుకుంటున్నా.
మళ్ళీ రేపటి నుండి మామూలే. ఎందుకో మనం కొంచెం ఎక్కువే ఆశిస్తున్నామేమో అనిపిస్తుంది. 30%మహిళలు comfort zone లోనే ఉన్నారు. వాళ్ళే ఈ మహిళా దినోత్సవాల privileges అన్నీ enjoy చేస్తారు. వంటకి సెలవు, friends తో outing, షాపుల వారిచ్చిన discounts ఉపయోగించి అక్ఖరలేని shopping………మధ్యలో ఆడవాళ్ళు-హక్కులు అంటూ గగ్గోలు. స్త్రీ జాతి పడుతున్న atrocities ని దుయ్య పట్టడం, మంచి star hotel లో lunch చేసి, housie, games ఆడుకుని, బహుమతులు గెలుచుకుని సాయంత్రానికి ఇంటికి రావడం. Mostly ఇదే మహిళాదినోత్సవ వేడుకలంటే.
ఆ రోజు మన పని అమ్మాయికి సెలవు ఉండదు. ఒక కొత్త చీర gift ఉండదు. మన అత్తగారు, ఆడపడుచుకి కమ్మగా పలకరించడం ఉండదు. మనకి పాఠాలు చెప్దిన ముసలి టీచరమ్మకు నాలుగు పళ్ళు ఒక horlicks సీసా కొని తీసుకెళ్ళేదుండదు. మన వీధులు తుడిచే అమ్మాయిని ఎలా ఉన్నావమ్మా అని పలకరించే తీరికుండదు. మన ఊరిలో దగా పడ్డ ఆడువారికై నడప బడుతున్న హోంలో ఉన్న ఆడపిల్లలని పలకరించి దన్ను ఇవ్వడం ఉండదు.
మనం రచయిత్రుల మయితే ఇంకా మజా. మొత్తం మొగుళ్ళని, మగాళ్ళని, మృగాళ్ళని ఒక్క తాటికి కట్టి, మొత్తం పాపభారం వాళ్ళకే అంటగట్టి, దుయ్యబట్టి, మనకి ఆధిక్యత లేదని వాపోవడం.
ఇంక మిగిలిన 70% కోసం మహిళలు కారు కదా దేవుడు కూడా దిగిరాడు రక్షించడానికి. చదువుకున్న పెళ్ళానికి, మంచి ఉపాధి చూపించి ప్రోత్సహించని మొగుళ్ళు, అలవాటులు, అప్పుల ఊబిలో కూరుకు పోయి, పెళ్ళాన్ని కుళ్ళబొడిచే వారు, స్త్రీలను ఆఫీసుల్లో, కాలేజీల్లో లైంగికంగా వేధించే మగవారు, పల్లె పడుచుల్ని పాశవికంగా చెరిచే కామాంధ కామందులు, ఆడవాళ్ళను తార్చే మగవాళ్ళు, తాగి, మైకంతో పసిమొగ్గల చిదిమేసే రాక్షసులు, అద్దె గర్భాలకు పెళ్ళాలని అరువిచ్చి, వారి కడుపులతో కడపు నింపుకునే కౄరులు, ఆడపిల్లలను పనిమనుషులుగా మార్చే వారు, తార్చే వారు,లవేశ్యాగృహాలకమ్మేవారు, షేకులకు కేకు లమ్మనట్టు అమ్మే అబ్బ లు………………వీరి నుంచి 70% ని ఎవరూ రక్షించ లేరు.
పైన చెప్పిన 30% లో మహిళలు 70% లోని విధివంచితలు రక్షణ కొరకు ఒస్తే ఎంత మంది మహిళ కదా అని ఆదుకుంటారో అనుమానమే. వాళ్ళు మీటింగుల్లో బిజీ. కిట్టీ పార్టీకెళ్ళి లలితా సహస్ర నామాలు చదివి, పాట్ లక్ భోజనం చెయ్యాలి. జోయ్ అలుక్కాస్ లో డైమండ్ సెట్ కొనుక్కోవాలి. సమయం ఉండదు ఇవన్నీ ఆలోచించడానికి.
ఇవన్నీ ఒకెత్తయితే, ఏ % కీ చెందని "ఆడు" వారు ఉన్నారు. వీరు ఇతరుల జీవితాలతో ఆడుకుంటారు. ఇతర స్త్రీల భర్తలను లాక్కుంటారు. వివాహేతర సంబంధాలతో భర్తలను, పిల్లలను, అవతలి స్త్రీలని వంచిస్తారు. అత్తగారు, ఆడపడుచుల రూపంలో కోడళ్ళని కాల్చుకు తింటారు. అలాగే కోడళ్ళ రూపంలో వృద్ధాప్యంలో అత్తమామల్ని ఈసడిఐచుకుంటారు. ప్రేమ పేరిట అమాయకపు కుర్రాళ్ళను ఆకర్షించి, greener pastures కనిపించగానే వీడికి తిలోదకాలిచ్చి , వాడు ఆత్మహత్య చేసుకుంటే పిరికి వెధవని ముద్ర వేసి ఒదిలించుకునే ఆడపిల్లలు, అర్ధనగ్న వస్త్ర ధారణ చేసి , రెచ్చగొట్టి, పిచ్చివాళ్ళను చేసి, పోలీసు కేసుల్లో ఇరికించే ఆడపిల్లలు, మదంతో సాటి ఆడవాళ్ళను నీచంగా చూసి జీవితాలు నాశనం చేసే స్త్రీలు, పసిపిల్లలని పనివాళ్ళగా మార్చి మాతృత్వానికి మచ్చ తెచ్చే ఆడవారు………………వీరు ఏ కోవకీ చెందరు. స్వయంగా తయారయిన కొత్తజాతి. మహోన్నత మయిన స్త్రీ జాతికి తలవొంపులు తెచ్చే జాతి.
అవును ఈ రోజు మహిళా దినోత్సవం. మొక్కుదాం. సృష్టించిన జగన్మాతకు మొక్కుదాం. నానా పుర్రాకులూ పడి కన్న అమ్మకు మొక్కుదాం. సంపాదించి , మనకు , మన పిల్లలకు సంవృద్ధి, సమాజ గౌరవం ఇచ్చిన మన భర్తలను కన్న మన అత్తగార్లకు మొక్కుదాం. ఆడి పాడిన అక్కచెల్లెలు, స్నేహితురాలికి మొక్కుదాం. టీచరమ్మకు మొక్కుదాం. డాక్టరమ్మకు మొక్కుదాం. సాధికారత సాధించి పోలీసుగ, జవానుగ, లాయరుగ, ఆఫీసుల్లో, సాఫ్ట వేర్ లో తమదయిన ముద్ర వేసిన నారీమణులకు , సంస్కర్తలకు మొక్కుదాం, మంచి మహిళకు మొక్కుదాం. మహిళా మణిపూసలకు, కళాకారులకు, అన్ని స్థాయిల్లో మనకై సేవలు చేస్తున్న స్త్రీ మూర్తులకు మొక్కుదాం. నిజంగా , అచ్చంగా మహిళను గౌరవిద్దాం

శ్రీమతి Vijaya Seshu

International Women's Day is celebrated every year on March 8 to salute women’s contribution to society, the theme of 2017 being “Be Bold For Change”. I don’t understand, from where and whom should the change come-whether from the society or women within. Despite many efforts by Government for women empowerment, we seldom find any respect & dignity towards women, can woman take a decision on her own, do they enjoy equal rights in society, are they working in secured working location, is a woman able to live her life with a sense of self worth, self respect and dignity. Why even after so much awareness in the society and said to be saluting her strength, she still is considered only second to men and treated like a second rate citizen ? When will the society realise she is a blessed creation and not created for somebody’s enjoyment. A Nirbhaya incident in 2012, a five year girl raped brutally in 2013, in 2015, a mentally challenged woman was raped until she fell unconscious, acid attacks, human trafficking from the age of 3yrs till death, domestic violence, dowry deaths, more importantly female infanticide and many such incidents un-reported-what do these incidents state. Is women’s day really a day or occasion to be celebrated amidst such incidents. I personally feel a real celebration of international women’s day can be had only when women are empowered with greater degree of self-confidence, understand their rights, increase capacity or power to resist gender based discrimination, must be in a position to realize their identity and face the challenges of life with greatest courage. Simply congratulating female achievers in the recent era, dining with eminent personalities, wishing one another or cutting a cake is not the way to celebrate. We must recognize that none can put us down without our permission.

6, మార్చి 2018, మంగళవారం

నటి కృష్ణకుమారి


ఈ రోజు తెలుగు చలనచిత్ర సీమ అగ్రనటీమణులయిన వారిలో ఒకరయిన కృష్ణకుమారి జయంతి. ఈమె నా అభిమాన నటి. నేనొక చిత్రకారుణ్ణి. ఆమె అందాలు చిత్రకారులను ఆకర్షిస్తాయంటే ఆశ్చర్యంలేదు. ఆమె చిత్రాలు రెండు నా పెన్సిల్ చిత్రీకరించింది. ఒకటి ఆమె సినిమాల్లో ప్రవేశించిన తొలినాళ్ళలొ చిత్రం. అప్పుడు make ups ఎక్కువగా ఉండేవి కావు. విగ్గులు కూడా ఎంతో అవసరమయితేకాని వాడేవారు కారు. మరొక చిత్రం 1960 లో వచ్చిన చిత్రాలలోది. రెంటికీ make ups లో కొంత వైవిధ్యం ఉంటుంది. 

తెలుగు ప్రేక్షకుడి హృదయంలో ఆమె ‘పగటిపూట చంద్రబింబం’.. ఆమె నవ్వితే నవరత్నాలే!  చిత్రాల్లో వన్నెతగ్గని రాకుమారి, తెలుగు సినిమా స్వర్ణయుగ రారాణిగా రాణించి ఓ వెలుగు వెలిగింది కృష్ణకుమారి. ఓ శిల్పి చెక్కిన అందాలు ఆమెవి. ఆమె నటనా సామర్ధ్యం కంటే ఆమె ముఖారవిందం, అవయవ సౌష్టవం ఆమెను అగ్రస్థానంలో నిలిపి అగ్ర తారామణులయిన సావిత్రి, జమున చెంత నిలబెట్టాయి అంటే అతిశయోక్తి కాదేమో!  

ప‌శ్చిమ బెంగాల్ లోని నైహ‌తిలో జ‌న్మించిన కృష్ణ‌కుమారి.. మ‌రో ప్ర‌ముఖ న‌టి షావుకారుజాన‌కికి చెల్లులు. చిన్న‌త‌నం నుంచి త‌న పెద్ద‌క్క జాన‌కిని విప‌రీతంగా అభిమానించే వారు. ఆమె ప్ర‌భావంతోనే సినిమాల్లోకి వ‌చ్చిన‌ట్లుగా చెబుతారు. కృష్ణ‌కుమారి తండ్రి ఉద్యోగ‌రీత్యా త‌ర‌చూ బ‌దిలీలు జ‌రుగుతుండేవి.

దీంతో ఆమె చ‌దువంతా రాజ‌మండ్రి.. చెన్నై.. అసోం (నాటి అస్సాం).. కోల్ క‌త్తా (నాటి క‌ల‌క‌త్తా) ప్రాంతాల్లో సాగింది. మెట్రిక్ అస్సాంలో చ‌దివిన త‌ర్వాత మ‌ద్రాసుకు వీరి కుటుంబం చేరింది. అక్క‌డే కృష్ణ‌కుమారికి సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయి.

ఆమెకు తొలిసారి సినిమా అవ‌కాశం సినిమాటిక్ గా వ‌చ్చింది. త‌ల్లితో స్వ‌ప్న సుంద‌రి సినిమా చూడ‌టానికి వెళ్లిన కృష్ణ‌కుమారిని.. నిర్మాత సౌంద‌ర రాజ‌న్ గారి అమ్మాయి భూమాదేవి చూశారు. సినిమాహాల్లో కృష్ణ‌కుమారిని చూసినంత‌నే.. తాము తీసే న‌వ్వితే న‌వ‌ర‌త్నాలు సినిమా కోసం ఎంపిక చేయాల‌నుకున్నారట‌. ఆ సినిమాలో అమాయ‌కంగా క‌నిపించే క‌థానాయికి పాత్ర‌కు కృష్ణ‌కుమారి అచ్చుగుద్దిన‌ట్లుగా స‌రిపోతార‌ని భావించారు. ఇంట్లో వారి అనుమ‌తి తీసుకొని ఆ సినిమాలో న‌టించిన ఆమె.. త‌క్కువ కాలంలోనే ప్ర‌ముఖ హీరోయిన్ల జాబితాలో చేరారు.  

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాలెన్నింటిలోనో నటించి ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న కృష్ణకుమారి తెలుగులో వందకు పైగా సినిమాల్లో నటించారు. 1951లో  మొదలైన ఆమె సినీ జీవితం మకుటాయమానంగా సాగింది. ఎన్‌టి రామారావు, అక్కినేని, కాంతారావు, జగ్గయ్య వంటి నాటి అగ్ర నటుల సరసన విభిన్నమైన భూమికలు పోషించి ప్రేక్షకలోకాన్ని మెప్పించారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కాంతారావులతో కృష్ణకుమారి నటించి జానపద చిత్రాలు ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్నే చేశాయి. అగ్గిపిడుగు, బందిపోటు, తిరుపతమ్మ కథ, భార్యభర్తలు, కులగోత్రాలు, డాక్టర్ చక్రవర్తి, గుడిగంటలు, జమీందార్, కానిస్టేబుల్ కూతురు, పెళ్లికానుక వంటి ఎన్నో చిత్రాల్లో కృష్ణకుమారి తనదైన ముద్రవేశారు. కన్నడంలో రాజ్‌కుమార్, తమిళంలో శివాజీగణేశన్ వంటి నటులతో కృష్ణకుమారి నటించిన చిత్రాలు ఘన విజయం సాధించాయి.

ఆమె ముఖంలో కనిపించే తెలుగుదనం, తీరువుగా ఉన్న శరీరాకృతి, వాలుజడ, సోయగాలు ఆమెపై చిత్రీకరించిన కొన్ని పాటలు తెలుగుతెరకు వన్నెతెచ్చాయి. ఉదాహరణకు 'తొలికోడి కూసింది' పాట చిత్రీకరణ లో ఆమె అందాలు ఈ వీడియో క్లిక్ చేసి చూడండి. ఓ ప్రభాతవేళ లో సన్నివేశానికి ఈ పాటలో  ఆమె ఆంగికం ఎంత చక్కగా అమిరిందో చూడండి.



సినిమాల్లో క‌థానాయికిగా రాణించిన ఆమె.. వ్య‌క్తిగ‌త జీవితంలో బెంగ‌ళూరుకు చెందిన అజ‌య్ మోహ‌న్ ను ప్రేమించి పెళ్లాడారు. వీరికి దీపిక అనే కుమార్తె ఉన్నారు. 

నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...