30, ఏప్రిల్ 2016, శనివారం

మహాకవి శ్రీ శ్రీ


మహాకవి శ్రీశ్రీ


నేడు మహాకవి శ్రీశ్రీ జయంతి. నా పెన్సిల్ చిత్రం ద్వారా ఆ మహాకవి కి నా నివాళి. బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన  గారి కవిత ' ఓ మహాత్మా ఓ మహర్షీ' ఈ క్రింది లింక్ క్లిక్ చేసి విందాం.



నేను వేసిన శ్రీశ్రీ గారి బొమ్మకి మిత్రులు ప్రసాద్ కట్టుపల్లి గారు వ్రాసిన పద్యాలు. వారికి నా ధన్యవాదాలు.

ఆ.వె
పేద ప్రజల కొరకు పేర్మితో వ్రాసెను
కమ్మ నైన మంచి కవిత లెన్నో
అరస విరస ములకు నాధ్యుడై నిలచెను
కూలి నాలి జనుల గోడు దెలిపె
ఆ.వె
సింహగర్జనలతొ సింహనాదముజేసె
శ్రామికులకు దెలిపె శాసనములు
రైతు కూలి జనుల రైతాంగ యిడుములు
వచన కవిత లోన బలికె తాను
ఆ,వె
తాజ మహలు యంచు తరతరములనెంచి
చదువు జెప్పు మీరు జక్కగాను
రాళ్ళు మోసె నేమి రాజులు నెపుడైన
కట్టె నెవరు యమున గట్టు ననెను
ఆ,వె
పాప మెవ్వరిదని ప్రశ్నించె ఘాటుగా
ముక్కకొరుకు కొనెడి కుక్క జూపె
ఎర్రని కాంతి నెగయనిలమహాప్రస్థాన
మెంతొ చెడును మనకు మెత్తి జూపె
ఆ.వె
అంతు లేని హృదయ, ఆవేదన బడసె
పేద జనుల నెపుడు వీడ కీవు
పోరుబాట నడిపె పోరాట యోధుడా
అందు కొనుము నాదు వందనములు

27, ఏప్రిల్ 2016, బుధవారం

పిచుకలు - తెలుగు గజల్


ఈ వారం 'బొమ్మలు చెప్పిన గజల్లు' శీర్షికలో శ్రీమతి Umadevi Prasadarao Jandhyala గారి 'పిచుకలు' గజల్ కి బొమ్మలు.
వీడక తిరిగే పిచ్చుక జంటల అనురాగమునే చూడముచ్చట!
గూడునుకట్టగ పోచలు తెచ్చే సహనగుణమునే చూడముచ్చట !
బుడిబుడి అడుగుల మెతుకులకోసం నడిచేతీరే నవ్వొస్తుంది
ఈఇల్లంతా నాదేఅనుకొను తులిపి తనమునే చూడ ముచ్చట !
ఏదో చాలా పనిఉన్నట్లుగ ఒక్కచోటఒక క్షణంనిలవవు
కిటికీగుండా రివ్వునదూరే సామర్ధ్యమునే చూడముచ్చట !
వానకుతడిసిన పిచ్చుక చూసిన మాపాపాయికి ఎంతటి జాలి!
తుడుచుకోమంటు తుండును తెచ్చిన ఔదార్యమునే చూడముచ్చట!
ఇంకోపిచ్చుక వచ్చిందనుకొని అద్దంముందర తగవుదానికి
పిల్లలందరికి మళ్ళీమళ్ళీ ఆదృశ్యమునే చూడముచ్చట !
వాలుకుర్చీల వార్ధక్యాలకు పలకరింపులీ కిచకిచేగద!
తగవులు ఎరుగని జోడుపిచ్చుకల దాంపత్యమునే చూడముచ్చట!
ఎటుపోతుందో ఏంతెస్తుందో పెంపకమంతా మగపిచ్చుకది
గుడ్లను పొదిగీ పిల్లలగాచే ఆలితనమునే చూడముచ్చట !
కాపురాలలో కాపురముండే ఈచుట్టాలకు చోటుంచాలి
కనుమరగయ్యే పిచ్చుక సంతతి ఉద్ధరణమునే చూడముచ్చట!

24, ఏప్రిల్ 2016, ఆదివారం

తిరుపతి వేంకట కవులు - మీసాలు

ఒకసారి తిరుపతి వేంకటకవులైన ..దివాకర్ల తిరుపతి శాస్త్రిగారిని, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారిని చూసి .. పద్యాలు రాసుకునే మీకు మీసాలెందుకయ్యా అని అంటే..
వాళ్ళిద్దరూ కలిపి అప్పటికప్పుడు ఇలా పద్యం చెప్పారు ..
"దోసమటం బెరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ,
మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా
రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ
మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే"
అంటే తెలుగులోనూ,సంస్కృతం లోనూ మాలా పద్యాలు రాసి చెప్పగలిగేవారిని చూపించండీ మా మీసాలు తీసి మీకాళ్ళకు మొక్కుతాం అని.

ఈ విషయం గురించి ఇంతకు ముందు ఎక్కడో చదివాను. ఈరోజు వైదేహి మూర్తి గారు facebook లో ఓ సందర్భంలో పెట్టిన టపా చదివాక  మరోసారి గుర్తుకొచ్చింది.

నాన్న - నా చిత్రానికి కవిత


నాన్న ఎప్పుడూ ఒంటరివాడే,
అమ్మా,పిల్లలూ ఒక్కటౌతుంటారు సృష్టిలో.
నాన్న ఎప్పుడూ తుంటరివాడే,
అమ్మమాత్రమే తరుచూ మంచిది అవుతూ ఉంటుంది, పిల్లల దృష్టిలో.
కని,పెంచటం అమ్మేఅన్నట్లు కనిపిస్తుంది,
నాన్నబాధ్యత ఏమీ లేనట్టు అనిపిస్తుంది.
కనటం అమ్మేఅయినా కలలుకనటం నాన్న పనేనని
ఎంతమంది పిల్లలకు అర్ధమౌతుంది?
పెంచటం అమ్మే అయినా బాధ్యతెరిగి పెరగటం నాన్నవల్లేనని,
కొంతమంది పిల్లలకే బోధపడుతుంది.
సేవచేయటం అమ్మవంతు,
సరిచేయటం నాన్నతంతు.
అమ్మకు ఎప్పుడూ పిల్లలలోని గుణాలే కనబడుతాయి,
నాన్నకు మాత్రం పిల్లలలోని గుణాలతోపాటు 
దోషాలుకూడా కనబడుతాయి.
ప్రేమించటం అమ్మవంతు అయితే,
దీవించటం నాన్నవంతు.
ఆకలితీర్చటం అమ్మవంతు అయితే,
ఆశలుతీర్చటం నాన్నవంతు.
అమ్మప్రేమ అనుక్షణం బహిర్గతమౌతుంటుంది,
నాన్నదీవెన ప్రతిక్షణం అంతర్గతంగానే ఉంటుంది.
అమ్మగుండెలో పిల్లల సుఖానికి 
సంబంధించిన ఆలోచనే ఉంటుంది.
నాన్నగుండెలో పిల్లల క్షేమానికి 
అనుబంధించిన ఆవేదనే ఉంటుంది.
అమ్మఆరాటాన్ని కన్నీళ్లు చెపుతాయి,
నాన్నఆత్రుతని కళ్ళు మాత్రమె చెపుతాయి.
కనిపించే ఆరాటం అమ్మది,
కనిపించని పోరాటం నాన్నది.
అమ్మకి లైకులెక్కువ,
నాన్నకి షాకులెక్కువ.
అమ్మ ఏడవటం కనిపిస్తుంది,
నాన్నఎద చెరువవటం కనిపించదు.
గుర్తింపు తెచ్చుకున్న దేవత అమ్మ,
గుర్తింపు పొందలేని దేవుడు నాన్న.
పిల్లల జీవితానికి అమ్మ ఒకకళ అయితే, 
నాన్న తళతళ.
కనిపించే దేవత అమ్మ అయితే,
కనపడని దేవుడు నాన్న.
పిల్లల ఓట్లే అమ్మకు ఆస్తి,
నాన్నకు మాత్రం అన్నీ నాస్తి.

( నాన్న ).
(Courtesy : శ్రీ సాంబశివరావు నూలు)

22, ఏప్రిల్ 2016, శుక్రవారం

సీతా స్వయంవరం

Facebook లో సుధాకర్ యడవల్లి గారి టపా. నాకు చాలా ఆశక్తి కలిగి నా ఈ బ్లాగులో పొందుపరుచుకుంటున్నాను. పండితులు, జానపదులు సీతా స్వయంవర ఘట్టం గురించి తమతమ శైలిలో ఎలా స్పందిస్తారో చాలా బాగా వివరించారు.
సీతా రామ కల్యాణం :
1) కనక లతాభ వధూమణి
చనెనంత వసుంధరాత్మ జాత నయముగా
తన హృదయేశుని జేరగ
ఘన భుజు నాశ్రితుల పాలి కల్ప మహీజున్ !
2) శ్రీ రంజిల్లెడు స్వర్ణ భూషణములన్ జెన్నొందగా దాల్చి, సీ
తా రామామణి, మంద హాస ముఖి చేత: పంకజాతమ్ము సొం
పారన్ కాంచన హారమొండు గొని యాహ్లాదముతో వచ్చి శో
భారాముంగని వేసె వాని గళమందా హారమున్ ప్రేమతో.
అని శ్రీ ఆత్మ స్వరూప (శ్రీ నేమాని రామ జోగి సన్యాసిరావు, (గొల్లాది అగ్రహారం, వయా బొబ్బిలి, విజయనగరం జిల్లా) గారు తన స్వీయ పద్య కావ్య రచన “ శ్రీ మదధ్యాత్మ రామాయణం” లో సీత స్వయంవరం ఘట్టాన్ని వర్ణిస్తే -
జనపదులు మాత్రం స్వయంవర ఘట్టాన్ని తమదైన శైలి లో ముచ్చటగా, తాదాత్మ్యం జెందుతూ, పరమానందంగా, అతి సున్నితమైన, అర్ధమైన శైలిలో పాడుకుంటూ ఉంటారు. ఆ స్వయంవర వర్ణన ఎలాగుంటుందో దాని “భావం” మాత్రం చూడండి. “ఫెళ్ళున విల్లు విరిగింది. నీలమేఘ శ్యాముడు, అరవింద దళాయతాక్షుడు, ఆజానుబాహుడు, ఆ దివ్య మంగళ రూపుడ్ని ఓరకంటతో చూసినదై, జనకశ్యపుత్రి, వరమాల వేసేందుకు నాలుగు అడుగులు ముందుకు వేసింది. మహాలక్ష్మీ తేజంతో, భూమిసుతగా అవతరించిన జనకశ్యపుత్రి, సిగ్గుతో, తలమునకలవుతూ, వరమాలను రెండు చేతులతో పైకెత్తింది. రవి వంశ సోముని శిరసు అందితేగా..నవవధువు పారాణి పాదాలు ముని వేళ్ళ పై నిలిచి అ ఆజానుబాహుని మెడలో వేయ బోవ ..అంత..అలవోకగా అందేనా? ఇదంతా గమనిస్తున్న లక్ష్మణ స్వామి కి సీతమ్మ సమస్య అర్ధమయింది. అప్పటి దాకా 5000 మంది బలశాలులు మోసుకు వచ్చిన శివధనస్సు ను ఫెళ్ళున విరిచిన అన్న గారి పరాక్రమాని తలుచుకుంటూ, మైమరిచి ఉన్న ఆతనికి, వరమాల వేడుక -సీతమ్మ ప్రయత్నమూ చూసి, కించిత్ తెలివిగా, వేడుక మధ్యకు వచ్చి-అన్న గారి పాద పద్మములకు వంగి నమస్కరించాడట. అన్న రామయ్య తటాలున వంగి ఆపేక్షగా తమ్ముడ్ని లేపబోయాడు- అదే అదనుగా సీతాదేవి వరమాలను శ్రీ రాముని మెడలో అలంకరింపజేసినదంటూ, ఆ దృశ్యాన్ని చూస్తూ సభ కరతాళధ్వనులు చేస్తూ ముచ్చట పడిందంటూ, సీతమ్మ, తన చల్లని చూపులతో లక్ష్మణుని దీవించిందంటూ, జనపదులు ఇలా కథలెన్నిటినో సందర్భొచితంగా అల్లుకుంటూ, కడు రమ్యంగా పాడుకుంటూ, మురిసిపోతూ ఉంటారు. జానపద సాహిత్యంలో గమనిస్తే ఇలాంటివి ఎన్నో చోటు చేసుకున్నాయి.
అలాగే, సీతదేవి పెళ్ళి అలంకారం లో కూడా వర్ణన గమనించండి:
అమ్మా! ముద్దులగుమ్మా - సక్కాని పసిడి బొమ్మా
ఆదివిష్ణుకు నీవు - ఇల్లాలు వైతివి
సక్కాని పసిడి బొమ్మా - సక్కాని బంగారు బొమ్మా
అమ్మా రావమ్మా - రాగిడి చంద్రొంక
రంగైన నగలు - గీర్వాణి జటపాలి
చామంతి పూవులు - దరియించుదూవు ... అమ్మ రావమ్మా..
తమ్మిట్లు జుమకాలు - ఆ పాంజోబీలు (2)
వజ్రేల కాసూల - యాముల్ల పట్టి
పొందూగ వజ్రేల (3) - కాసూలు దట్టి
దరియించు దూవు - రమ్మ రావమ్మ!
యా దండ గడియాలు - బాజా బందూలు
మురిడీలు గొలుసూలు - ముద్దూటుంగ్రాలు
దరియించు దూవు - రమ్మ రావమ్మ!
నడుము దొడ్డాణంబు యా నాగ బందంబు
మువ్వ లొడ్డాణంబు - సొగసైన గంటాలు
దరియించు దూవు - రమ్మ రావమ్మ!
అందెలు కడియాలు - అమరంగా పట్టీలు
మట్టెలు బొందూలు - దరియించు దూవు - రామ్మ!
(నాగుల రాములమ్మ సాలూరు పాడిన పాట)
జనపదుల నోట ఊటగా, సిరుల మూటగా
మనకు మిగిలి వున్న వెలలేని తులలేని
మాణిక్యాలుగా నేటికీ మనకు లభ్యమవుతున్నది.
సంక్రాంతి, ఉగాది, శ్రీ రామ నవమి లాంటి మన పర్వదినాలలో
వారి బృందాలని ఆహ్వానించీ వారిచే కార్యక్రమాలను జరిపించీ జానపద వాఙ్మయ సముద్ధరణ ద్వారా ప్రాచీనాంధ్ర సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించ వలసిన అవసరం ఎంతైన ఉందనీ నా భావన.

21, ఏప్రిల్ 2016, గురువారం

భండారు (కొమ్మరాజు) అచ్చమాంబ


భండారు అచ్చమాంబ (1874 - 1905) తొలి తెలుగు కథా రచయిత్రి. ఈమె ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కూర్చిన కొమర్రాజు వేంకటలక్ష్మణరావుకు అక్క.

జీవిత విశేషాలు 

అచ్చమాంబ గురజాడ అప్పారావు కన్నా పదేళ్ళ ముందే 1902 నవంబరు నెలలో రాసిన కథ ‘ధన త్రయోదశి’ ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు. ప్రధమ స్త్రీవాద చరిత్ర కారణి. అయితే ఈ కథ గ్రాంధిక భాషలో వుంది. అచ్చమాంబ 1874 వ సంవత్సరంలో కృష్ణా జిల్లా నందిగామ దగ్గర పెనుగంచిప్రోలు లో పుట్టింది. ఈమెకు ఆరేళ్ళ వయసపుడే తండ్రి చనిపోయాడు. 10వ ఏటనే ఈమెకు పెళ్ళయ్యింది. పెళ్ళయ్యే నాటికి అచ్చమాంబ ఏమి చదువుకోలేదు. ఆమె తల్లి, తమ్ముడు కూడా ఆమెతో పాటే ఉండేవారు. ఆమె తమ్ముడికి చదువు చెప్పించారు కానీ ఈమెను ఎవరూ ప్రోత్సహించలేదు. ఎమ్. ఏ చదివిన తమ్ముడితో పాటు కూర్చుని తానే చదువుకుంటూ తెలుగు, హిందీ నేర్చుకొన్నది. 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి మచిలీపట్నంలో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎన్నో స్త్రీల సంఘాలు ఏర్పరచింది. చిన్న వయసులో కుమారుడు, కుమార్తె మరణించడం ఆమెకు తీవ్రమైన దు:ఖాన్ని కల్గించింది. అనాధ పిల్లల్ని చేరదీసి చదువు చెప్పించేది. ఆమె ఇంట్లో ఎపుడు ఐదారుగురు పిల్లలుండి చదువుకుంటూ వుండేవారు. 1905 జనవరి 18వ తేదీన ముఫ్ఫై ఏళ్ళకే మరణించింది. వివిధ భాషలలో స్త్రీ సాహిత్యం వ్రాసిన రచయిత్రుల గురించి భండారు అచ్చమాంబ రచనల ద్వారా మనకు తెలుస్తుంది.
కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, ఆయన అక్క భండారు అచ్చమాంబల పరస్పరానురాగం అందరినీ ఆకర్షించేది. ఆమె తమ్ముని విద్యాభివృద్ధికి పాటుపడింది. అక్కగారి సాహిత్యకృషికి, విజ్ఞానానికి తమ్ముడు చేయూతనిచ్చేవాడు. తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ అబలా సచ్చరిత్రమాల అనే గ్రంధాన్ని రచించింది. ఇందులో షుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంధాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ చింతామణి ముద్రణాలయంలో ప్రచురించాడు.

అచ్చమాంబ భావాలు

  1. స్త్రీల బుద్ధి పురుష బుద్ధి కన్న మందమనియు, స్త్రీల మెదడు మస్తిష్కము, పురుషుల మస్తిష్కము మెదడు కన్న బలహీనమగుటచే దక్కువ తూగుననియు వ్రాయు వ్రాత బక్షపాతము కలదనుట నిర్వివాదమే- స్త్రీలు నైసర్గిక మూఢురాండ్రనుటకంటె బాల్యము నుండియు వారికి విద్యాగంధమే సోకనియ్యనందున మూఢురాండ్రుగా నున్నారనుట మంచిది- చిన్నతనమున బాలురు బాలికలు సమబుద్ది కలవారుగా నున్నను శాస్త్ర విషయముల బ్రవేశ పెట్టనందున బురుషులు జ్ఞానాధికులును ఎట్టి తెలివిగలదైనను కన్న తల్లిదండ్రులే యామెను పైకి రానీయక మూల మూలల నణగదొక్కుటచే బాలిక మూర్ఖురాలును అగుచున్నవారు. స్త్రీ యభివృద్ధి లేకుండుటకిట్లు మగవారి పక్షపాతమే మూలం కాని మరొకటి కాదు. పురుషులా పక్షపాతమును విడిచిరేని స్త్రీలు విద్యావతులయి భర్తలకర్ధాంగులన్న నామును సార్దకము జేతురు.
  2. స్త్రీలు అబలలనియు, బుద్ధి హీనులనియు వివేకశూన్యులనియు, సకల దుర్గుణములకు -నివాస స్థలమనియు గొందరు నిందింతురు. స్త్రీలపయిన మోపబడిన ఈ దోషారోపణములన్నియు నబద్ధములనియు స్త్రీలలో నత్యంత శౌర్యధైర్యవతులును, అసామాన్య విద్యావిభూషితులునూ… బూర్యముండిరనియు, నిపుడున్నారు.
  3. స్త్రీలకు విద్య నేర్పిన యెడలను, వారికి స్వాతంత్రమొసగిన యెడలను, వారు చెడిపోవుదురనియు, బతుల నవమానించెదరనియు, గుటుంబ సౌఖ్యమును నాశనము చేసేదరనియు గొందరు మహానుభావులు వక్కాణించెదరు. ఈ యారోపణములన్నియు నిరర్థకములనియు, స్త్రీవిద్య దురాచార ప్రతీకారానుకూలమగునే కాని దురాచార ప్రవృత్త్యనుకూలము గానేరదనియు స్త్రీ విద్యా స్వాతంత్య్రముల వలన దేశమునకు లాభమే గాని నష్టముంగలుగనేరదనియు, స్త్రీ విద్య యత్యంతావశ్యకం.
  4. బాలుడు చిన్నతనమునందెంత మందబుద్దియైనను వానికైదేండ్లు రాగానే తల్లి దండ్రులు విద్య నేర్పి వానికిగల మాంద్యమును వదిలించి జ్ఞానాభివృద్ధికొరకనేక శాస్త్రములను జదివింతురు…చిన్ననాడు వానికంటే విశేష ప్రజ్ఞ గల వాని యక్క మాత్రము విద్యాగంధమేమియు లేనందున మహా మూర్ఖశిరోమణియై యుండును. ఇట్లు తల్లిదండ్రులు పక్షపాతముచే బురుష సంతతిలోను స్త్రీ సంతతిలోను జ్ఞానమును గురించి మహదంతరము పడినదే గాని స్త్రీల స్వాభావిక మౌర్ఖ్యము వలన కాదు
  5. మానవ దేహమున కలంకారమయిన విద్యభూషణము వారికి లేకుండ చేసి లోహపు నగలను మాత్రము పెట్టి తమ వేడుక నిమిత్తమయి వారిని తోలుబొమ్మల వలె జేయుచున్నారు. వారిని గృహ యజమానురాండ్రుగా జూడక తమ యుపచారము నిమిత్తమయి దాసులనుగా జేయుచున్నారు. పురుషులు స్త్రీల విషయమున జేసినయిట్టి యన్యాయము వలన స్త్రీలను మూఢురాండ్రనుగా జేసి చెడగొట్టుటయే కాక తామును వారికి తోడిపాటుగా మూర్ఖ శిరోమణులయి జెడిపోవుచున్నారు. ఈ స్థితి యంతయు పురుషుల లోపమువలనను, స్వప్రయోజనపరత్వం వలనను గలుచు చున్నదే కాని స్త్రీల దోషము వలనను మాత్రము గాదు.

విశేషాలు]

  • 'భండారు అచ్చమాంబ తొలి తెలుగు కథా రచయిత్రి
  • ఈమె ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కూర్చిన కొమర్రాజు వేంకటలక్ష్మణరావుకు అక్క.
  • అచ్చమాంబ గురజాడ అప్పారావు కన్నా పదేళ్ళ ముందే 1902 నవంబరు నెలలో రాసిన కథ ‘ధన త్రయోదశి’ ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు.
  • ప్రధమ స్త్రీవాద చరిత్ర కారణి.అయితే ఈ కథ గ్రాంధిక భాషలో వుంది మహిళాభ్యుదయానికి తొలి విదూషీణి
  • అచ్చమాంబ 1874 వ సంవత్సరంలో కృష్ణా జిల్లా నందిగామ దగ్గర పెనుగంచిప్రోలు లో కొమర్రాజు వెంకటప్పయ్య,గంగమ్మ దంపతులకు పుట్టింది
  • 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి మచిలీపట్నంలో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది.
  • 1905 జనవరి 18వ తేదీన మధ్యప్రదేశ్ బిలాస్పూర్ లో ముఫ్ఫై ఏళ్ళకే మరణించింది
  • తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ అబలా సచ్చరిత్ర రత్నమాల అనే గ్రంధాన్ని రచించింది.
  • ఇందులో షుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంధాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ చింతామణి ముద్రణాలయంలో ప్రచురించాడు.

రచనలు 

కథలు
  • గుణవతియగు స్త్రీ (తెలుగుజనానా, 1901 మే)
  • లలితా శారదులు
  • జానకమ్మ (తెలుగు జనానా, 1902 మే)
  • దంపతుల ప్రథమ కలహము (హిందూసుందరి, 1902 జూన్)
  • సత్పాత్ర దానము (హిందూసుందరి, 1902)
  • స్త్రీవిద్య (హిందూసుందరి, 1902)
  • భార్యా భర్తల సంవాదము (హిందూసుందరి, 1903 జులై)
  • అద్దమును సత్యవతియును (హిందూసుందరి, 1903)
  • బీద కుటుంబము (సావిత్రి, 1904)
  • ప్రేమ పరీక్షణము (1898 - అలభ్యం)
  • ఎరువుసొమ్ము పరువు చేటు (1898 - అలభ్యం) ఇంతదాకా అలభ్యంగా వుండిన 'ప్రేమా పరీక్షణము', 'ఎఱువుల సొమ్ము బఱువుల చేటు' అనే రెండు కథలు సంగిశెట్టి శ్రీనివాస్ కు లభించాయి.[3]
ఇతర పుస్తకాలు
  • అబలా సచ్చరిత్ర రత్నమాల (రెండు భాగాలు)(చారిత్రక మహిళల జీవితాలు మృధుమధుర శైలిలో వర్ణితాలు ఇందులో ఉన్నయి.)[4]
  • క్రోషో అల్లిక మీద పుస్తకం (అలభ్యం)
  • ఊలు అల్లిక మీద పుస్తకం (అలభ్యం)
  • ఒక శతకం కూడా రాసారని అంటారు (అలభ్యం)
ఇతర పుస్తకాలు
  • అబలా సచ్చరిత్ర రత్నమాల (రెండు భాగాలు)
  • క్రోషో అల్లిక మీద పుస్తకం (అలభ్యం)
  • ఊలు అల్లిక మీద పుస్తకం (అలభ్యం)
  • ఒక శతకం కూడా రాసారని అంటారు (అలభ్యం)
(సేకరణ ః వికీపీడియా నుండి)


20, ఏప్రిల్ 2016, బుధవారం

గాజులు - తెలుగు గజల్


సత్యనీలహంస (నిడిమామిడి వీరమూర్తి) గారి గజల్ కి నా బొమ్మ
(గజల్ సుమాలు పుస్తకం నుండి సేకరణ)

ఎదురుచూపులో మౌనంగా అలుగుతాయి ఈ గాజులు
ఎదురైతేచాలు పలకరింపుతో వెలుగుతాయి నీ గాజులు

ఆకాశమంత మంచిమనసు చేసుకున్న చేతులకై
హరివిల్లు లోని రంగులని పొందుతాయి నీ గాజులు

బుంగమూతి మోముతో నీవలిగిన వేళలో 
పలుకలేక మూగ సైగలు చేస్తాయి నీ గాజులు

చాటులో నిచ్చాటులో చీకట్లలోనూ చిలిపిగా
సవ్వడితో సంగతులెన్నో చెబుతాయి నీ గాజులు

పనులుచేస్తూ పలుకరించే పరామరికల ప్రేమతో
నీ రాక సందేశాన్ని చేరవేస్తాయి నీ గాజులు

ప్రేమతో నీ చేతులపై ముద్దాడిన వేళలో
పరవశం తో చప్పట్లని చరుస్తాయి నీ గాజులు

16, ఏప్రిల్ 2016, శనివారం

ఆశ నిరాశల వదనం - పెన్సిల్ చిత్రం


అమృతవాహిని - నవల

నేను వేసిన ముఖచిత్రం తో విడుదలయిన శ్రీమత్ సుజల గంటి గారి నవల "అమృతవాహిని". మంచి నవల. చదవండి. ఈ పుస్తకం ఈ  ONLINE లో kINIGE లో లభ్యం.

'ఇండియా'లో జరిగిన కథ మన ఇంటి వాతావరణాన్ని కళ్లకు కట్టిస్తే, అమెరికాలో జరిగిన కథ మనని అమెరికా తిప్పి చూపిస్తుంది.
అమృతవాహిని
ఒక పురుషుడి దృష్టిలో లోకం వేరు. స్త్రీ దృష్టిలో వేరు. ఆ స్త్రీ సంపూర్ణ స్త్రీత్వం గలిగిన 'అమ్మ' అయినప్పుడు ఆమె దృష్టిలోని లోకం ఎలా ఉంటుందో యీ 'అమృతవాహిని' నవల మనకి కళ్లకి కట్టినట్టు చెబుతుంది. ఇందులో పచ్చి స్వార్థపరుల విన్యాసాలున్నాయి. స్నేహహస్తం జాచే స్వచ్ఛమానవుల అడుగుజాడలున్నాయి. ఊరుగాని ఊళ్లో, దేశంగాని దేశంలో 'నేనున్నాను' అని ధైర్యం చెప్పే అమృతహస్తాలూ ఉన్నాయి. 'ఇండియా'లో జరిగిన కథ మన ఇంటి వాతావరణాన్ని కళ్లకు కట్టిస్తే, అమెరికాలో జరిగిన కథ మనని అమెరికా తిప్పి చూపిస్తుంది.
అంతేకాదు... అక్కడి మన తెలుగువారి కష్టాలూ, కన్నీళ్లు, స్వార్థాలూ, స్నేహాలూ, అహంకారాలూ, మమకారాలూ అన్నీ చిరుగాలుల తెరల్లా మన మనసుని తాకుతూ మరో లోకానికి తీసుకుపోతాయి. నాకొకటి అనిపించింది... రచయిత్రి యొక్క సంస్కారము, పుట్టి పెరిగిన విధానమే పాత్రలను మలుస్తుందని. 'అమృతవాహిని'లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. వ్యక్తుల కోపాన్నీ, ద్వేషాన్నీ కూడా ఓ పరిధిలోనే ఉంచారు గానీ, 'రాత'లో అసహనాన్ని ఎక్కడ చూపలేదు.
                                                          - భువనచంద్ర, సినీ గేయ రచయిత

కందుకూరి వీరేశలింగం


ఈ రోజు తెలుగుజాతి గర్వించదగ్గ మహావ్యక్తి వీరేశలింగం గారి జయంతి. ఆ మేరు శిఖరానికి నా ఘన నివాళి.

14, ఏప్రిల్ 2016, గురువారం

ఈతడువో రాముడు ఏకాంగవీరుడు - అన్నమయ్య కీర్తన


మిత్రులకు, శ్రేయోభిలాషులకు హార్దిక శ్రీరామనవమి శుభాకాంక్షలు


ఈతడువో రాముడు ఏకాంగవీరుడు

ఏతలజూచినా తానె ఇరవుకొన్నవాడు



చిరుత ప్రాయమునాడు శివునివిల్లువిరచి
మెరసి సీతను పెండ్లాడి మించినవాడు
తరి పదునాలుగు వేల దానవుల నిమిషాన
జరసి తానొక్కడే చదిపిన వాడు



ఓడకవిల్లెక్కుపెట్టి ఊరకే ఒక్కమ్మున
ఏడు తాళ్ళు ధరను కూలవేసినవాడు
జాడాగా కొండలచేత జలనిధిఁ గట్టించి
వేడుకతో లంకమీద విడిసిన వాడు



రావణ కుంభకర్ణాది రాకాసుల పరిమార్చి
ఈవల అయోధ్యాపట్నమేలిన వాడు
శ్రీవేంకటాద్రిమీదఁ జేరి మాల్యవంతమున
వేవేలు చందములను వెలసినవాడు

నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...