25, ఆగస్టు 2019, ఆదివారం

శ్రావ్య సంగీతభూషణుడు 'ఖయ్యామ్:

శ్రధ్ధాంజలి

ఈ నెల 19వ తేదీన  భువినుండి దివికేగిన  శ్రావ్య సంగీత భూషణుడు 'పద్మభూషణ్' ఖయ్యాం కి శ్రధ్ధాంజలి.

‘కభీ కభీ మేరే దిల్‌ మే...’ ఈ  పాట తెలియని సంగీత ప్రేమికులుండరు అంటే అతిశయోక్తి కాదేమో.  ఈ పాట 'కభీ కభీ'  సినిమాలోకి రావడం వెనుక కూడా మరో కథ ఉంది. నిజానికి అది సాహిర్‌ లూథియాన్వీ కవిత. చేతన్‌ ఆనంద్‌ సినిమా కోసం అదివరకే ఆ పాటను ఖయ్యామ్‌ రికార్డింగ్‌ చేశారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దాంతో, చేతన్‌ ఆనంద్‌ అనుమతితో ఆ పాటను ఈ ‘కభీ కభీ’లో వాడారు. సంగీతంగానే కాక, వాణిజ్యపరంగా కూడా ఆ చిత్రం పెద్ద హిట్‌. దాంతో, తన కెరీర్‌లో మొదటి సిల్వర్‌ జూబ్లీ హిట్‌ యశ్‌ చోప్రా ఇచ్చారని ఖయ్యామ్‌ అనేక సందర్భాలలో గొప్పగా చెప్పేవారు. ఆ తరువాత యశ్‌ చోప్రా రూపొందించిన వరుస చిత్రాలు ‘త్రిశూల్‌’ (1978), ‘నూరి’ (1979)కు కూడా ఖయ్యామే సంగీతం. అవీ సిల్వర్‌ జూబ్లీ హిట్లే. ఖయ్యామ్‌ స్వరసారథ్యంలో మరో ఆణిముత్యం... 1981లో లక్నో నేపథ్యంలో ముజఫర్‌ అలీ నిర్మించగా, రేఖ నటించిన ‘ఉమ్రావ్‌ జాన్‌’. అంతదాకా చాలావరకు పాటలు లతా మంగేష్కర్‌తో పాడించిన ఖయ్యామ్‌ ఆ చిత్రంలో రేఖకు ఆశాభోంస్లేతో నేపథ్యగానం ఇప్పించారు. ఆశాకు తొలిసారి ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డు వచ్చింది ఆ ‘ఉమ్రావ్‌ జాన్‌’తోనే! ఖయ్యామ్‌ సాబ్‌కు కూడా సంగీత దర్శకుడిగా తొలి జాతీయ అవార్డు దక్కిందీ ఆ చిత్రంతోనే! ‘కభీ కభీ’, ‘ఉమ్రావ్‌ జాన్‌’ ఆయనకు ఫిల్మ్‌ఫేర్‌లను అందించాయి.

'మొహబ్బత్ ఇస్కో కెహెతే హైం' చిత్రం కోసం వీరు స్వరపరచిన  'ఠెహరియే హోష్ మెం లావూం' పాట అంటే నాకు మహా మహా ఇష్టం. మహమ్మద్ రఫీ, సుమన్ కళ్యాన్పూర్ పాడిన ఈ పాట శశి కపూర్, నందా ల మీద చిత్రీకరించారు.

24, ఆగస్టు 2019, శనివారం

ఇలాగడిస్తే( నడిస్తే) చాలు

॥ఇలాగడిస్తే( నడిస్తే) చాలు ॥(కథ)
🔹〰️〰️〰️〰️〰️🔹〰️〰️〰️〰️🔹

       🔹సిమెంట్ కలర్ కు లీఫ్ గ్రీన్ బార్డరున్న లెనిన్ శారీ కట్టుకొని, రబ్బర్ బేండ్ మరోసారి పోనీకి బిగించుకొని బుజానికి గ్రేకలర్ హేండ్ బాగ్ తగిలించుకుంది రుక్మిణి. ఫైనల్ గా ఒకసారి గదుల్లో ఫాన్లు ...వంటింట్లో స్టౌ ఆపిందో లేదో చెక్ చేసి గోడ వారగా పెట్టిన పెద్ద బిగ్ షాపర్ తీసుకొని వాకిట్లోకి వెళ్ళి తాళం వేసింది.

ఎర్రకీచెయిన్ కున్న తాళం చెవిని చేమంతులున్న తొట్టిలో చాటుగా పెట్టి గేటుబయట సిద్దంగా వున్న కాశీం ఆటో ఎక్కింది. రైల్వే స్టేషన్ వైపుకు ఆటో మేటిక్ గా కాశీం ఆటో నడుపుతున్నాడు. అతనికి చెప్పనక్కరలేదు. నాలుగేళ్ళనించీ రోజూ కాశీం రైలు స్టేషన్ కు వాడుకగా ఆమెను తీసుకెళతాడు. రుక్మిణి మంచితనమో అదృష్టమోగానీ ఏ పనికి ఎవరిని కుదుర్చుకున్నా, వాళ్ళూ నిలకడగానే నిలబడుతుంటారు. ఆటోలో కూర్చోగానే రుక్మిణి మనసు ఆలోచనలో పడిపోయింది ఆరోజెందుకో !

        తనకు చిన్నప్పటినుంచీ రైలెక్కడమంటే మహా సరదా. ఆ సరదా తనజీవితంలో  ఒకభాగమైపోతుందని ఎప్పుడూ అనుకోలేదుతను. కావలి రైల్వేలో భర్త శ్రీహరి కి ఉద్యోగం. తనకు నెల్లూరు మండలాఫీసులో ఉద్యోగం. అత్తగారూ మావగారూ విజయవాడ  వదిలిరారు. బంధువర్గమంతా అక్కడక్కడే ఉంది. ఎక్కడుండాలనేది తేల్చుకోడానికి ఏడాది తిప్పలు పడ్డాక నెల్లూరికి డైలీ ట్రావెల్ కు నిర్ణయించుకుంది. ఈరోజు తనపుట్టినరోజు .42 వెళ్ళి 43 వస్తోంది. కృష్ణాష్టమికి ముందు ఆడపిల్ల పుట్టిందని తనకు రుక్మిణి అనిపేరు పెట్టారు. ఇప్పుడిలాంటి పేర్లెక్కడా వినబడటమేలేదు. తనకూ శ్రీహరికి నాలుగేళ్ళు తేడా. ఇద్దరు పిల్లలూ బాగానే చదువుకుంటారు. రాహుల్  ఇంటర్ మీడియట్ సెకండ్ యియర్ , రస్మి టెన్త్ . ఇద్దరూ ట్యూషన్ కు వెళ్ళారు.తను లేకపోయినా హరి డ్యూటీలో ఉన్నా వాళ్ళే తలుపులు తీసుకొని  బాగానే మేనేజ్ చేసుకుంటారు. “ఇలా జరిగి పోతే చాలు స్వామీ “ అనుకుంది.

    “అమ్మా వచ్చేసాం “ అనే కాశీమ్ మాటతో ఈలోకంలోకి వచ్చింది రుక్మిణి. బిగ్ షాపర్ లోంచి ఒక పేకెట్ తీసి అందులోని రెండు లడ్లు కాశీమ్ చేతిలో పెట్టింది. నా పుట్టినరోజు కాశీమ్ అంటూ ,ఒక టీ షర్ట్ మరో పేకెట్ లోంచి తీసిస్తూ అంది. “ అల్లా చల్లగా చూడాలమ్మా. సదా ఖుషీరఖో బేటీ “ అంటూ ఆనందంతో చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకున్నాడు. సింహపురిలో తను రోజూ అలవాటుగా ఎక్కే బోగీ లోకి వెళ్ళింది.వద్దంటున్నా కాశీమ్ సంచీ మోసుకొచ్చి ఆమె సీటు పక్కన పెట్టి దిగిపోయాడు.

ట్రెయిన్ కదిలింది. ఈ రోజు తనతో పాటు ఇదేబోగీ ఎక్కే నీరజ రాలేదెందుకో  అనుకుంటూ చుట్టూచూసింది. ఎదురుగా ఒక మూడేళ్ళ బాబుతో ఒకజంట కూర్చొని ఉన్నారు. కాసేపు మొబైల్ లో వచ్చిన బర్త్ డే విషెస్ చూసి ,బుక్ చదువుకుంటూ కూర్చుంది. పుస్తకం తెరిచిందే గానీ మనస్సు అమ్మనాన్న తమ్ముడి  గురించే ఆలోచిస్తోంది.

కిందటేడు కూడా ఇద్దరూ వచ్చి దీవించి వెళ్ళారు. నాలుగు నెలలుగా నాన్నకు ఒంట్లో బాగుండటం లేదు. షుగర్ కంట్రోలు కావడం లేదు. కిడ్నీ ప్రాబ్లం ఈ మధ్యే బయటపడింది. తమ్ముడు ఆస్ట్రేలియా లో దాదాపు సెటిలైనట్లే. వాడిది లవ్ మేరేజీ . మరదలు బెంగాలీ . వాళ్ళ సపోర్ట్ అమ్మానాన్నలకు గగనకుసుమమే. అమ్మానాన్న వస్తామంటే తనే రావద్దనీ ఫోనులో ఆశీస్సులిస్తే చాలనీ ఆపేసింది. రెండ్రోజులు సెలవు పెట్టి వెళ్ళిరావాలి. బొత్తిగా సంసారంలో కూరుకు పోయింది.

‘ ఏడూ కొండలా సామీ ఎక్కడున్నావయ్యా - ఎన్నీ మెట్లెక్కినా ఖానారావేమయ్యా’ —-ఏళ్లతరబడి పరిచయమైన సింహాద్రి పాటతో ఉలిక్కిపడి చూసింది రుక్మిణి.  టకటక మని లయబద్ధంగా చెక్కలు తడుతూ సింహాద్రి , రాజమ్మా వస్తున్నారు . పలకరింపుగా నవ్వింది రుక్మిణి. సింహాద్రికి రెండుకళ్ళూ తెల్లపూలు. కనబడవు. రాజమ్మ బుజం మీద చెయ్యేసి పాట పాడుతూ వస్తాడు. ప్రతిరోజూ చూడటం వల్లనేమో వాళ్ళేమిటో తనకు దగ్గరైనట్లనిపిస్తుంది రుక్మిణికి.

ఇంట్లో పాతబట్టలు తెచ్చి అప్పుడప్పుడిస్తుంది. వారానికో సారైనా ఒకపదిరూపాయలిస్తుంది. రాజమ్మ దగ్గరికి రాగానే రెడీగా పెట్టుకున్న లడ్లు ఒక చీర టీషర్టు ఉన్న కవరు చేతికిచ్చింది. రాజమ్మ కళ్ళు మెరిసాయి.

“ఏందిది బంగారు తల్లా”..అంది .
“నా పుట్టినరోజు రాజమ్మా తీసుకో “...అంది రుక్మిణి. 
“ఏంది రాజమ్మా మేడంగారి బర్త్ డేనా ?”అన్నాడు సింహాద్రి...మరికాస్త మెడెత్తి శూన్యంలోకి చూస్తూ నవ్వుముఖంతో.
“అవున్రా ఇదుగో “అని లడ్డు నోట్లో పెట్టింది రాజమ్మ.
“యాపీ బర్త్ డేమేడం . ఏడుకొండల సామి రచ్చించాల మిమ్మల్ని.”
“థాంక్యూ సింహాద్రీ “ అంది రుక్మిణి.
“ఈడీ మధ్య ఇంగ్లీసు మాట్లాడతండాడు మేడం!
పైగా,  నేనుత్త పూలునంట .” పకపకా నవ్వుతూ రాజమ్మ వాడినెత్తిన మొట్టి ముందుకు సాగింది.
ముందు ఎదురుగా ఉన్న పిల్లవాడికి స్వీటిద్దా మనుకొని మళ్ళీ తనేమయినా మత్తుగలిపానంటారేమోనని సందేహించింది. కాసేపు వాళ్ళతో మాట గలిపి వాళ్లకూ రెండు పాలకోవా బిళ్ళలుపెట్టింది బాక్సులోవి.
అంతలో బిట్రగుంటలో జామకాయల కొండమ్మ , అటుకుల మసాలా బాబ్జీ  కూడ లోపలికొచ్చారు . కొండమ్మ చీర స్వీటు తీసుకొని చేటంతముఖం చేసుకొని ఆప్యాయంగా మాయమ్మే ...మాయమ్మే అంటూ తనకణతలకు మెటికలిరుచుకుంది. బాబ్జీ టీషర్ట్ తీసుకోని అటుకుల పొట్లం తిరిగి చేతిలో పెట్టాడు.
     నెల్లూరొచ్చేసింది. బయిటికొస్తూ టిసి రమేష్ కు విష్ చేసి అతనికొక స్వీట్స్ పేకెట్ ఇచ్చి “అల్లూరయ్య మైసూర్ పాక్ రమేష్ . మావారు తెప్పించారు.
మీకిమ్మన్నారు.” అనియిచ్చి అతని విషెస్ కు థాంక్స్ చెప్పి  సంచీలోకి  చూసింది .
రెండు టీషర్ట్లు ఒక చీర ఇంకా రెండు స్వీట్స్ పేకెట్లు ఉన్నాయి. వాచ్మెన్ సుబ్బరావయ్య , ఆఫీస్ బాయ్ కుమార్ , స్వీపర్ కాంతమ్మ లకివ్వాలి వీటిని అనుకుంది. ఒకపేకెట్ తనకొలీగ్స్ కు మరొకటి వీళ్ళకు పంచేసింది. రుక్మిణి కి ఈ పుట్టినరోజు చాల స్పెషల్ గా అనిపించింది. ఉన్నవాళ్ళకే పిలిచి పిలిచి చేసే మర్యాదలకన్నా , వాళ్ళు పెదవులపైనించి చెప్పే విషెస్ కన్నా రైలులో తనతో రోజూ ప్రయాణించే ఆ నలుగురైదురి కళ్ళలో కనిపించిన  సంతోషం,
నిండుమనసుతో ఇచ్చిన దీవెనలే తనకూ తనకుటుంబానికీ శ్రీరామరక్ష అనుకుంది రుక్మిణి సీటులో కూర్చుంటూ.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
ఉమాదేవి జంధ్యాల

చిత్రకారులుశ్రీ పొన్నాడ మూర్తిగారికి కృతజ్ఞతలతో

13, ఆగస్టు 2019, మంగళవారం

యుగాలుగా యుద్ధమేగ.. జరుగుతోంది ప్రేమతో.

మాన్యశ్రీ Pvr Murty గారి చిత్రానికి కృతజ్ఞతలతో ✍️🍒🙏🍒💚

గజల్ 3142.

యుగాలుగా యుద్ధమేగ.. జరుగుతోంది ప్రేమతో..!
ఒక తియ్యని విరహమేగ..మిగులుతోంది ప్రేమతో..!

నీ వెనుకే నీ చుట్టూ..ఈ తలపుల మెఱుపులే..
ఈ మనసు చకోరమేగ..ఎగురుతోంది ప్రేమతో..!

కనుజారని బిందువులో..ఎన్నివేల సుడులోయి..
గోర్వెచ్చని స్నేహమేగ..కోరుతోంది ప్రేమతో..!

కనురెప్పల మాటు పక్షి..సాక్షిలాగ నిలచెనే..
నాదన్నది నరకమేగ..చూపుతోంది ప్రేమతో..!

సంఘర్షణ మానమంటె..ఉలికిపాటు దేనికో..
నాదికాని దేహమేగ..అలుగుతోంది ప్రేమతో..!

మాధవునకు కానుకగా..ఇచ్చేదా భావనం..
పాడరాని మౌనమేగ..వెలుగుతోంది ప్రేమతో..!  - మాధవరావు కొరుప్రోలు

మాట పెగలకుంది మౌనమే బాగుంది

నా చిత్రానికి శ్రీమతి పద్మజ చెంగల్వల గారి పద్యం
ఆ.వె:

మాట పెగలకుంది మౌనమే బాగుంది
చినుకు చిత్తడేను కనుల కింక
పలకరింపు మరచె భావసమీరమె
మానసంబు వడలె మనిషి మిగిలె


నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...