27, మార్చి 2022, ఆదివారం

దాచుకో నీ పాదాలకు - దగ నే జేసినపూజలివి - అన్నమయ్య కీర్తన

 



దాచుకో నీపాదాలకు - దగ నే జేసినపూజ లివి

పూచి నీకీరీతిరూప - పుష్పము లివి యయ్యా
..
వొక్కసంకీర్తనే చాలు - వొద్దికైమమ్ము రక్షించగ
తక్కినవి భాండారాన - దాచి వుండనీ
వెక్కసమగునీ నామము - వెలసులభము ఫల మధికము
దిక్కై నన్నేలితి విక నవి తీరనినాధనమయ్యా
..
నానాలికపైనుండి - నానాసంకీర్తనలు
పూని నాచే నిన్ను -బొగడించితివి
వేనామాలవెన్నుడా -వినుతించ నెంతవాడ
కానిమ్మని నా కీపుణ్యము -గట్టితి వింతేయయ్యా
..
యీమాట గర్వము గాదు - నీ మహిమే కొనియాడితిగాని
చేముంచి నాస్వాతంత్ర్యము - చెప్పినవాడగాను
నేమాన బాడేవాడను - నేరము లెంచకుమీ
శ్రీమధవ నే నీదాసుడ - శ్రీవేంకటేశుడవయ్యా 

సాహిత్య శిరోమణి సముద్రాల లక్ష్మణయ్య  ఈ కీర్తన విశేషాంశములు ఇలా తెలియబరిచారు.

భగవన్నామ సంకీర్తన రూపములైన తన సంకీర్తనలను అన్నమయ్య భగవంతునికి  తాను కావించిన పూజలుగా పేర్కొన్నాడు. ఇందుచే ఆయన భగవత్ కైంకర్యపరత్వమెట్టిదో తెలుస్తోంది. భగవంతుని కీర్తి రూపపుష్పములుగా ఈ కీర్తనలను రూపించుటచే ఈ కీర్తనలో ఆ దేవుని యశస్సును ప్రకటించుటకే రచించబడిన పూజా కుసుమాలుగా గ్రహించుకోవచ్చు.

అన్నమయ్య వేలకొలది సంకీర్తనలు రచించాడు. వాటిలో ఒక్క సంకీర్తన తమ్ము రక్షించుటకు చాలునని చెప్పుకుంటున్నాడు. తన ప్రతి కీర్తన సంసారతరుణోపాయ మగుటలో ఆయనకు గల ఆత్మవిశ్వాసమెంత దృఢమైనదో దీనినిబట్టి వెల్లడగుచున్నది.

తపోధ్యానాదులతో పోల్చినచో నామ సంకీర్తనము పేలవముగ కనపడవచ్చును. అందలి శ్రమ ఇందు లేదు గదా ! అయినను దీని మహిమ వాటికె లేదనుటకే ఫలమధికము అని చెప్పబడినది.

"పలికించెడు వాడు రామభద్రుండు" అని పోతన చెప్పినట్టే "నా నాలిక పై నుండి నాచే నిన్ను బొగడించితివి" అని అన్నమయ్య చెప్పాడు. ఇందుచే ఆయన వినయాతిశయము ప్రకటమగుతోంది. "ఇది గర్వపుమాట గాదు. నా స్వాతంత్ర్యము  నేను చెప్పుకొనలేదు. నీ మహిమనే ఇట్లు కొనియాడితిని" అన్న ఆ పదకవితా పితామహుని భక్తి  తాత్పర్యము నిరుపమానము గదా!








20, మార్చి 2022, ఆదివారం

జాణతనాలాడేవేలే జంపు గొల్లెతా, వోరి ఆణిముత్యముల చల్లలవి నీకు కొల్లలా - అన్నమయ్య కీర్తన


 

వారం వారం అన్నమయ్య
ఈ వారం అన్నమయ్య కీర్తన - జాణతనాలాడేవేలే జంపు గొల్లెతా, వోరి
ఆణిముత్యముల చల్లలవి నీకు కొల్లలా
విశ్లేషణ : డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల
చిత్రం : Pvr Murty
సహకారం : శ్రీమతి పొన్నాడ లక్ష్మి
~~~~~~🔹🔹~~~~~~~
🌻ఒక ప్రార్థన పద్యం..( భాగవతము)
కం॥
నీ నగవులు నీ చూడ్కులు
నీ నానావిహరణములు నీ ధ్యానంబుల్
నీ నర్మాలాపంబులు
మానసముల నాటి నేడు మగుడవు కృష్ణా!
******************
🔹అన్నమయ్య కీర్తన👇🏿
జాణతనాలాడేవేలే జంపు గొల్లెతా, వోరి
ఆణిముత్యముల చల్లలవి నీకు కొల్లలా
పోయవే కొసరుచల్ల బొంకుగొల్లెతా , వోరి
మాయింటి చల్లేల నీకు మనసయ్యీరా
మూయకువే చల్ల చాడిముచ్చు గొల్లెతా, వోరి
పోయవో పోవొ మాచల్ల పులు సేల నీకునుII
చిలుకవే గోరంజల్ల జిడ్డు గొల్లెతా ,
వోరి..పలచిని చల్ల నీకు బాతి గాదురా
కలచవే లోనిచల్ల గబ్బి గొల్లెతా ,
వోరి..తొలగరా మా చల్లేల దొరవైతి నీకు II
అమ్మకువే చల్లలు వయ్యారి గొల్లెతా
వోరి.. క్రమ్మర మాతోడనిట్టె గయ్యా
ళించేవు
సొమ్మెలం బోయేవేలె సొంపు గొల్లెతా, వోరి
దిమ్మరి కోనేటిరాయ తిరమైతి నీకును II
~~~~~~~~~~~~~~~~
💥నాకు తెలిసినంతలో వివరణ👇🏿
అదుగో వ్రేపల్లె!
రోజూలాగే గొల్లభామ చల్లలమ్ముకోడానికి బయలుదేరింది.
గోపాలకృష్ణుడు దారికి అడ్డంగా రానే వచ్చాడు.
వచ్చినడుంమీద చెయ్యి పెట్టుకొని నిలబడి “భామా! ఎక్కడికి వెళుతున్నావు? ఆ కుండలో ఏముంది?” అన్నాడు కొంటెగా?
“నన్ను పోనివ్వు కన్నయ్యా! పనుంది” అని తప్పించుకొని వెళ్ళబోయి ఉంటుంది.
అప్పడు …. ఆగోపికాకృష్ణుల మధ్య జరిగిన సంభాషణ అన్నమయ్య చేతిలో అందమైన కీర్తనగా రూపుదిద్దుకుంది.
“ ఇదుగో గొల్లపిల్లా! చాలించు నీ జాణతనం ! ఊకదంపుడు మాటలు
మాట్లాడి తప్పించుకోవాలనుకుంటున్నావా?”అన్నాడు కృష్ణుడు చిలిపిగా నవ్వుతూ!
“ఈ కుండలో ఉన్నవి… మీయింట్లో కొల్లలుగా ఉండే చల్లలేనయ్యా కృష్ణమూర్తీ!ఆణిముత్యాలు కాదు” అంది మూతి విరుస్తూ!
“ ఏయ్ అపద్ధాలకోరూ! అవినిజంగా చల్లలైతే ఏదీ కాసినిటు పొయ్యి…” అన్నాడు దోసిలిపట్టి.
“మాయింటి చల్లమీద మనసైందా నీకు!… అంటూ చల్లకుండ పైకి ఎత్తుకో బోయింది।
“ఆఁ… ఆఁ… ముూత పెట్టవాకు.
నువ్వెంత చాడీల మారివో నాకు తెలుసులే… ముచ్చు మొఖమా!” అన్నాడు ఆటపట్టిస్తూ.
ఆ గొల్లభామకూ ఈ అల్లరి గోవిందుడికి సరిపోయింది. ఎలా మాటకు మాట విసురుకుంటున్నారో చూడండి।
“పో పోవోయ్! మా పుల్లమజ్జిగ నీకు కావల్సి వచ్చిందా! “
“ఏదీ గోటితో కాస్త గీకు…బాగానే జిడ్డుందే.”
“అబ్బే… చాలా పలచగా ఉంది. నీకు ఇది నచ్చదు. ఇలాంటి మజ్జిగ నీకు పొయ్యడం న్యాయమూ కాదు. నన్ను పోనీ.”
“ ఏది … కలబెట్టొకసారి”
“ తప్పుకో ... తప్పుకో ..మీరు పెద్దింటోళ్ళు..దొరలు! మా నీళ్ళ మజ్జిగ నీకెందుకు?”
“అయినా… ఇంటి పాడి ఇట్లా అమ్ముకోవచ్చా?”
“ పోయేటప్పుడూ వచ్చేటప్పుడూ నీ గోలేవిటయ్యా గోపాలా!”
“ ఎంత డబ్బు సంపాయించినా పోయేదేనే పిల్లా!”
“ ఓరోరీ … ఎక్కడ పడితే అక్కడే కనబడతావు . దిమ్మరివినీవు. నీ మాటల మాయకు మేం కట్టుబడి పోయామయ్యా కోనేటిరాయా! నువ్వు కనిపిస్తే కదల్లేక పోతున్నాం” అంది నిట్టూరుస్తూ!
ఇక్కడ గొల్లెత అన్నమయ్యే!గోపాలుడు ఆ శ్రీనివాసుడే!
🌺కృష్ణుడు గోపిక వెంటబడటం, ఆమె ఆ కొంటె బాలుడిని విసుక్కోవడం పైకి కనిపించే విషయం. మరి అంతరార్థమేమైనా ఉందా ఈ పాటలో… చూద్దాం.
హరి అవతారాలన్నింటిలో ఒక కృష్ణుడినే కృష్ణపరమాత్మ అంటాం. అందరికన్నా ఉన్నతుడైన పరమాత్మ దిగివచ్చేది మనల్ని ఉద్ధరించడానికే కదా! ఎక్కడెక్కడి భక్తులకూ ఎదురుపడతాడు. అంతటా తిరిగే దిమ్మరి!
వ్యాసుడు భాగవత ప్రారంభంలోనే కృష్ణపరమాత్మను స్తుతిస్తూ….
“ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే।
తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయమ్॥”అన్నాడు.
కృష్ణుడు గోపికకు అడ్డుపడటం వెనక చెప్పదలచింది ఏమిటంటే …
“సంసారం, పాలూ పెరుగు అమ్ముకోవడం వంటి వాటికంటే నీ ఆరాధన పరిపక్వతకు నన్ను తెలుసుకో …. నీదగ్గర ఉన్నది దాచవద్దు.
భగవదర్పణం చేయడానికి సంశయించకు. నేను పలచన అనే న్యూనతా భావం విడిచి పెట్టు. నీలో నీకే తెలియని భక్తి సాంద్రత ( మజ్జిగపై జిడ్డు) ఉంది” అని. కర్మబంధములనుంచి బయట పడితేనే కృష్ణతత్వం అర్థమౌతుంది. కృష్ణ తత్వం అర్థమైతేనే కర్మబంధాలు తొలుగుతాయి. తొలగ వలసినది కృష్ణుడుకాడు. గోపికలోని అజ్ఞానం. కలపని, కదపని మజ్జిగలో చిక్కదనమంతా అడుగుకు పోయినట్లు, మనసులోని భక్తి, సంసార బాధ్యతల వలన పైకి రాలేక పోతోంది. ఒక్కసారి మనస్సనే మజ్జిగకుండను కదిపి చూడండి. పరమాత్మ దొరే. ఆయనకు మనదగ్గర ఉన్నదేదీ అక్కరలేదు. అన్నీ కొల్లలు గానే ఉన్నాయి. అమ్మకు అక్కరలేకపోయినా “ఏదీ నాక్కొంచెం పెట్టవా! అని బిడ్డను అడిగినట్లు… పరమాత్మ మనకు అర్పణబుద్ధి ఉందా .. లేదా అని పరీక్షిస్తుంటాడు.
భగవంతుడికి దుష్టశిక్షణ ఎంత బాధ్యతో, తననే ఆరాధించే భక్తులకు దారిచూపి ఉద్ధరించడమూ అంతే బాధ్యత.
ఎందుకు గోపికలకు అడ్డం పడుతున్నాడనడానికి భాగవతంలోని ఈ పద్యమే జవాబు చెబుతుంది.
॥తరలము॥
హరినెఱుంగక యింటిలో బహుహాయ
నంబులు మత్తుఁడై
పొరలుచుండెడి వెఱ్ఱి ముక్తికిఁ బోవ
నేర్చునె? వాఁడు సం
సరణముం బెడఁబాయఁ డెన్నఁడు; సత్య మా హరినామ సం
స్మరణ మొక్క ముహూర్తమాత్రము చాలు ముక్తిదమౌ నృపా!
స్వస్తి 🙏
~~~~~~~~~~~~~~~~
డా. ఉమాదేవి జంధ్యాల
కీర్తనకు మనోహరమైన చిత్రాన్ని వేసినవారు శ్రీ Pvr Murty గారు 🙏
(అంతరార్థానికి ఆకునందించిన అన్నగారు శ్రీమాన్ Tirumala Pallerlamudi Raghavachari.గారు.🙏
Ref -బ్రహ్మశ్రీ షణ్ముఖశర్మగారి ప్రవచనాలు)🙏

14, మార్చి 2022, సోమవారం

అంచిత పుణ్యులకైతే హరి దైవమవుగాక | పంచమహాపాతకులభ్రమవాపవశమా ॥ - అన్నమయ్య కీర్తన


 వారం వారం అన్నమయ్య - ఈ వారం కీర్తన : అంచిత పుణ్యులకైతే హరి దైవమవుగాక |

పంచమహాపాతకులభ్రమవాపవశమా ॥

విశ్లేషణ : డా. Umadevi Prasadarao Jandhyala
చిత్రం : Pvr Murty
సహకారం : శ్రీమతి Ponnada Lakshmi

కీర్తన
*****
అంచిత పుణ్యులకైతే హరి దైవమవుగాక |
పంచమహాపాతకులభ్రమవాపవశమా ॥
కాననియజ్ఞానులకు కర్మమే దైవము |
ఆనినబద్ధులకు దేహమే దైవము |
మాననికాముకులకు,మగువలే దైవము।
పానిపట్టి వారివారిభ్రమ మాన్పవశమా ||
యేమీ నెఱుగనివారికింద్రియములు దైవము|
దోమటిసంసారి కూరదొర దైవము |
తామసులకెల్లాను ధనమే దైవము |
పామరుల బట్టినట్టిభ్రమ బాపవశమా ||
ధన నహంకరులకు తాదానే దైవము |
దరిద్రుడైనవానికి దాత దైవము |
యిరవై మాకు శ్రీవేంకటేశుడే దైవము |
పరులముంచినయట్టి భ్రమ బాపవశమా ||
********************
🔹నాకు తెలిసినంత వరకు వివరణ🔹
——————-
పుణ్యకార్యాలవలన, దైవ భక్తివలన, నిర్మోహత్వం వలన, ఆత్మజ్ఞానులు కొందరు హరియే దైవమని గ్రహిస్తారు. కానీ కొందరు పంచ మహాపాతకాలవలన వలన అజ్ఞానులై, అనేక భ్రమలకు లోనై
భగవంతుని తెలుసుకొనలేరు.
ఎవరెవరు దైవాన్ని తెలుసుకొనలేక దారితప్పుతున్నారో ఈ కీర్తనలో అన్నమయ్య విడమరిచి చెప్పాడు.
*దైవం అంటే ఏమిటో, దైవం ఉనికి ఏమిటో కానని వాడు తాను చేసే కర్మలే దైవమనుకుంటాడు. తానేంచేస్తే అది పుణ్యప్రదమని భావిస్తాడు. ఎవరి తప్పులు వాళ్ళకు కనబడవు. తమకు తెలిసినదే సత్యమనే భ్రమ. తానున్న బావి జగత్తనుకుంటుంది కప్ప.అటువంటి అజ్ఞానం వీరిది.
*బంధాలకే అంటుకు పోయిన వాళ్ళకు
దేహమే దైవం. దేహచింతన తప్ప దైవ చింతన ఉండదు వీళ్ళకు. కర్మబంధాలను వీడలేరు. దేవుడిని తెలుసుకోలేరు. ఈ దేహంతో అనుభవాలే శాశ్వతమనుకునే సంసార లంపటులైన ఇటువంటి వారు వర్తమానంలోని జన్మకు అతీతంగా ఆలోచించరు. వీరికి లౌకిక చింతనే తప్ప అలౌకిక జ్ఞానం కలగదు.
*కొందరికి కామవాంఛ తప్ప మరొక ఆలోచన ఉండదు.
ఇంద్రియలోలత్వంతో లైంగిక సుఖమే దైవమనుకుంటారు. ఆ కామాన్ని తీర్చుకోడానికి ఎంతకైనా తెగిస్తారు.’మగువతో పొందే వీరికి బ్రహ్మానందం !’ఇటువంటి వారొక కోవ! పనిగట్టుకొని ఈ భ్రమలను మానిపించటం సాధ్యమా!
——
* పరమాత్మ, ఆత్మ వంటి ఆలోచనలు లేని సామాన్యులకు ఇంద్రియాలే దైవం. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నందుకు పొందే సుఖమే దైవం. చూడటం, వినడం, తాకడం, వాసన చూడటం, మాట్లాడటం వారికి నచ్చినట్లు జరిగితే చాలు. ఇదీ భౌతికమైన లంపటమునకే పరిమితం. ఇంద్రియాలనుఆడించే బుద్ధికూడా శబ్ద స్పర్శ రూప రస గంధములకే పరిమితమైపోతుంది.
* మాయలోబడిన సంసారికి తన ఊరిదొరే దైవం. ఆ దొరకు మొక్కితే చాలనుకుంటాడు.
*తామసులు( అజ్ఞానాంధకారంలో ఉన్న తమోగుణ ప్రథానులు) డబ్బేదైవం. వాళ్ళ దృష్టంతా డబ్బు సంపాదించడం, దాచడం మీదే.
ఇటువంటి అవివేకులకు చెప్పడం, మార్చడం ఎవరితరం!
———
*ధనం సంపాదించగానే అహంకారం పెరుగుతుంది. ధనమదం గలవాళ్ళు నేనే దేవుడిననుకుంటారు. అంతా తననే దేవుడని పూజించాలనుకుంటారు.
*ఇక డబ్బులేని పేదవాళ్ళు తమకు ఎవరు ధన సహాయం చేస్తే ( దాత)వాళ్ళను దేవుడనుకుంటారు.
(తమ స్వార్థం కోసం, పేరుకోసం డబ్బు పంచేవాళ్ళూ, ఇళ్ళు కట్టించడం వంటి కపట సేవలు చేసేవాళ్ళూ, వీళ్ళకు దేవుళ్ళుగా కనిపిస్తారు.వీరు నిజమైన దాతలు కాదు.)
*స్థిరమై భువిన కొలువైన ఆ వేంకటేశ్వరుడే దైవమనుకునే మేము పరుల భ్రమలను పోగొట్ట గలమా!
~~~~~~~
💐కీర్తనకు అద్భుతమైన చిత్రం వేసిన సోదరులు శ్రీ పొన్నాడ మూర్తి గారికి ధన్యవాదములు.🙏
~~~~~~~~~~~

👇🏿కీర్తనకు నా పద్యములతో స్పందన
కం॥
ఒక్కడవే రావలెగద
ఒక్కడవే పోవగవలె నుడిగెడి వేళన్
దక్కగ నుత్తమ గతులను
ఎక్కడివక్కడ మరచుట నెరుగగ వలెరా!
కొలువకుమీ,యూరిదొరల
తలపకు మెన్నడు ధనమును దైవంబనుచున్
గెలువుముకామప్రవృత్తిని
నిలుపుము నీమదిని హరిని నిరతము నరుడా!
***************
డా.ఉమాదేవి జంధ్యాల
చిత్రం-శ్రీ Pvr Murtyగారు . వారికి కృతజ్ఞతలు

10, మార్చి 2022, గురువారం

అంగర సూర్యారావు - రచయిత , విశాఖపట్నం


Pencil sketch

కీశే శ్రీ అంగర సూర్యారావు. గారు.(జూలై 4, 1927 - జనవరి 13, 2017)

ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. ఆయన రాసిన "చంద్రసేన" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందినది. 'సమగ్ర విశాఖ నగర చరిత్ర' రచయితగా ఆయన ఈ తరానికి పరిచయం. ఆయన సామాజిక పరిస్థితుల ఆధారంగా రాసిన రచయిత.
1927 జూలై 4వ తేదీన తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జన్మించారు.


విద్యాభ్యాసం మండపేట, రామచంద్రపురంలలో జరిగింది.


1949లో విశాఖపట్నంలో విద్యాశాఖలో గుమాస్తాగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన సూర్యారావు విశాఖనగరంపై ప్రేమను పెంచుకొని, బదిలీలు ఇష్టపడక పదోన్నతులను వదులుకొని రిటైర్ అయ్యేవరకూ గుమాస్తాగానే వుండిపోయారు.

రచనలుః

తొలి రచన 1945లో ' కృష్ణా పత్రిక' లో వచ్చింది. ( వ్యాసం)
మొదటి కథ ' వినోదిని ' మాస పత్రికలో ప్రచురితమయింది.
' చిత్రగుప్త', ' చిత్రాంగి', ' ఆనందవాణి', ' సమీక్ష', వంటి ఆనాటి పత్రికలలో కథలు, నాటికలు వచ్చాయి.
1948 నుండి 1958 వరకు ' తెలుగు స్వతంత్ర' లో కథలు, స్కెచ్ లు వచ్చాయి.
' ఆంధ్ర సచిత్ర వార పత్రిక', ' భారతి సాహిత్య మాస పత్రిక', 'ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక'లలో వచ్చిన నాటికలు, నాటకాలలో కొన్ని రచనలు సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. పలు నాటికలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి.

పుస్తకాలు

కళోద్ధారకులు ( నాటికలు - 1956)
శ్రీమతులు - శ్రీయుతులు ( నాటికలు - 1959 )
నీలి తెరలు ( నాటకం - 1959)
పాపిష్టి డబ్బు ( నాటికలు - 1960 )
ఇది దారి కాదు ( నాటకం - 1967)
ఎనిమిది నాటికలు ( 1976 )
చంద్రసేన ( నాటకం - 1976 )
రెండు శతాబ్దాల విశాఖ నగర చరిత్ర ( 2006 )
సమగ్ర విశాఖ నగర చరిత్ర - మొదటి భాగం ( 2012)
సమగ్ర విశాఖ నగర చరిత్ర - రెండవ భాగం ( 2014)
60 ఏళ్ళ ఆంధ్ర సాహిత్య చరిత్రలో పురిపండా ( అముద్రితం)
ఉత్తరాంధ్ర సమగ్ర సాహిత్య చరిత్ర ( అముద్రితం)
రచన శైలి
సూర్యారావు గారు కథల కంటే నాటక రచనకే ప్రాధాన్యత ఇచ్చారు.నాటక రచనకు వీలుకాని ఇతివృత్తాలు తట్టినప్పుడు కథలుగా రాశారు. 1976 తరువాత రాసిన కథల సంఖ్య తక్కువ. 1996లో ప్రచురింపబడిన ఏడడుగుల వ్యాపార బంధం ఆయన చివరి కథ.
నిశితమైన వ్యంగ్యం వుపయోగించి ఎదుటి వాడిని చకిత పరచడమూ, సున్నితమైన హాస్యంతో నవ్వినచడమూ, తప్పు చేసి తప్పుకొనే మనిషిని నిలువునా నిలదీయడమూ వీరి నాటికలు, నాటకాలలోని ప్రత్యేకత.
వీరి రచనలలోని పాత్రలు సమాజంలో మన చుట్టూ తిరుగుతుండేవే. అందుకనే వారి రచనలు సజీవమైనవి...సత్య దూరం కానివి. వీరి నాటికలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ నాలు మూలాల రంగస్థలాలకెక్కాయి.
రచనలో మాత్రమే కాక నాటక ప్రయోగంలో సూర్యారావు గారికి మంచి అనుభవమూ, అభినివేశమూ ఉంది. రంగశాల అనే సంస్థను స్థాపించి, దానికి అధ్యక్షులుగా వుండి ప్రయోగాత్మక కృషి చేసారు.
వీరి చరిత్ర రచన అన్ని తరాల వారికీ ఆసక్తిదాయకంగా వుండే విధంగా సాహిత్య ఆధారాలు, జీవిత చరిత్రలు, నాటి పత్రికల వార్తలు, ప్రభుత్వ గెజిట్ల ఆధారంగా సాగుతుంది.సబ్ హెడ్డింగ్స్ తో సంక్షిప్తంగా చదివించే శైలిలో సాగే వీరి' సమగ్ర విశాఖ నగర చరిత్ర' రచనా శైలి అనేకమందికి చరిత్ర రచనకు స్ఫూర్తిని ఇచ్చింది.

సాహిత్య సేవ:

1949లో ప్రారంభించిన ' విశాఖ రచయితల సంఘం' వ్యవస్థాపక సభ్యులలో ఒకరు.
1965 - 1978 సంవత్సరాల మధ్య ' కవితా సమితి ' సెక్రటరీ గానూ,
1974 నుండి 1978 వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగానూ ఉన్నారు.
పురస్కారాలు, గౌరవాలు, బిరుదులు
ఆయన రాసిన "చంద్రసేన" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు పొందినది (1978).
1979లో ఎనిమిది నాటికలు సంపుటిని హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు M.A. పాఠ్యగ్రంధాలలో ఒకటిగా ఎంపిక చేసారు.
2015లో ' జాలాది ఆత్మీయ పురస్కారం' ను అందుకున్నారు.
2015 లోనే ' బలివాడ కాంతారావు స్మారక అవార్డు' ను అందుకున్నారు.
మరణం
వీరు తమ 90వయేట విశాఖపట్నంలోని తమ స్వగృహంలో జనవరి 13, 2017న మరణించారు.

(విశాఖపట్నం మహనీయులు చిత్రీకరణలో భాగంగా నేను నా పెన్శిల్ తో చిత్రీకరించిన కీ. శే. అంగర సూర్యారావు గారి చిత్రం - విషయ సేకరణ ఇక్కడా అక్కడా)

7, మార్చి 2022, సోమవారం

తందనాన అహి తందనాన, భళా తందనాన బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే.. అన్నమయ్య కీర్తన

 



వారం వారం అన్నమయ్య...
కీర్తన : తందనాన అహి తందనాన, భళా తందనాన
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..
విశ్లేషణ : డా. Umadevi Prasadarao Jandhyala
చిత్రం: పొన్నాడ మూర్తి
సహకారం : Ponnada Lakshmi

ఓం నమోవేంకటేశాయ 🙏
ప్రార్థన పద్యం ( పోతన గారిది)

సీ॥
భవము దోషంబు రూపంబుఁ గర్మంబు నా-
హ్వయమును గుణము లెవ్వనికి లేక
జగములఁ గలిగించు సమయించు కొఱకునై
నిజమాయ నెవ్వఁ డిన్నియునుఁ దాల్చు
నా పరేశునకు, ననంతశక్తికి, బ్రహ్మ
కిద్ధరూపికి, రూపహీనునకునుఁ,
జిత్రచారునికి, సాక్షికి, నాత్మరుచికినిఁ-బరమాత్మునకుఁ, బరబ్రహ్మమునకు
ఆ.వె
మాటలను నెఱుకల మనములఁ జేరంగఁ
గాని శుచికి, సత్త్వగమ్యుఁ డగుచు
నిపుణుఁ డైనవాని నిష్కర్మతకు మెచ్చు
వాని కే నొనర్తు వందనములు.
*********************
🔹ఈ వారం అన్నమయ్య కీర్తన 🔹
••••••••••••••••••••••👇🏿
తందనాన అహి, తందనాన పురె తందనాన భళా,తందనాన ‖
బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే ‖
కందువగు హీనాధికము లిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ |
ఇందులో జంతుకుల మంతా ఒకటే అందరికీ శ్రీహరే అంతరాత్మ ‖
నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర – అదియు నొకటే |
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే చండాలుడుండేటి సరిభూమి యొకటే ‖
అనుగు దేవతలకును అల కామ సుఖ మొకటే ఘన కీట పశువులకు కామ సుఖ మొకటే |
దిన మహోరాత్రములు – తెగి ధనాఢ్యున కొకటే వొనర నిరుపేదకును ఒక్కటే అవియు ‖
కొరలి శిష్టాన్నములు తును నాక లొకటే తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే |
పరగ దుర్గంధములపై వాయు వొకటే వరస పరిమళముపై వాయు వొకటే ‖
కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి శునకము మీద బొలయు నెండొకటే |
కడు పుణ్యులను – పాప కర్ములను సరి గావ జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే ‖

🌻నాకు తెలిసినంతలో వివరణ🌻
*************************
ఉపనిషత్ సారాన్ని, భగవద్గీత సారాన్ని
కీర్తన రూపంలో అన్నమయ్య సులభ గ్రాహ్యంగా అందించాడు ఈ కీర్తనలో.
ఈ ఆత్మానాత్మ వివేచన చేయాలంటే, పరమాత్మ తత్వం గ్రహించాలంటే యోగిపుంగవులకే సాధ్యం।కానీ చిన్న మాటలలో అన్నమయ్య చిందేస్తూ ‘తందనానా బలే తందనానా’అంటూ
పాటక జనానికి కూడా అర్థమయ్యే విధంగా తానూ వారిలో ఒకడై పోయి పాడిన పదమిది.
ప్రాణులన్నీ ఒకటే . అన్నిటిలో ఉన్నది ఆ పరమాత్మే. మరిక కులాలలో అధికమేమిటి? హీనమేమిటి?
పరమాత్మ ఎప్పటి నుంచీ ఉన్నాడు? ఎక్కడున్నాడు?
ఏదీ లేనప్పుడు మొదట ఉన్నవాడు పరమాత్మ.ఆ పరమాత్మే ఈ చరాచర సృష్టి చేసి తానే అన్నింటిలో ప్రవేశించడం జరిగింది.
ఆకాశం అంటే ఖాళీగా ఉన్న ప్రదేశం. కుండలో కాళీ కూడ ఆకాశమే. ఎక్కడ కాళీ ఉంటే అదంతా ఆకాశమే. కానీ మనం మనకు పైన కనిపించేదే ఆకాశ మనుకుంటాం. పరమాత్మకూడా అంతే. రూపం, గుణం, తనకంటూ ఒక చోటు లేనిదే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ శక్తి అనేక రూపాలలో చేరింది.
పరబ్రహ్మ సనాతనుడు.సర్వాంతర్యామి.
ఉన్నది బ్రహ్మమొక్కటే! మిగిలినదంతా లీలావిలాసం!

ఆత్మవత్ సర్వభూతాని,
ఏకమేవాద్వితీయం బ్రహ్మ,
ఏకో విశ్వస్య భువనస్య రాజా,
ప్రజ్ఞానం బ్రహ్మ,తత్త్వమసి,
అహం బ్రహ్మా௨స్మి,
ఆయమాత్మాబ్రహ్మ - —

ఇత్యాది ఉపనిషద్వాక్యాలు పరమాత్మ, జీవాత్మ వేరుకాదని చెబుతున్నాయి.ఎక్కడినుంచి ఏర్పడ్డామో, ఎవరివలన ఈ నేలమీదకు వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళి ద్వయాన్ని మరిచి అద్వైత సిద్ధిని పొందడమే జీవి కర్తవ్యం. అందుకు ఎన్ని జన్మలు పడతాయో , ఎన్నిసార్లు జారిపడి పైకి లేవాలో అదంతా మనకర్మల మీద ఆధారపడి ఉంటుంది.నేను వేరు , పరమాత్మ వేరు అనుకుంటే ఈ సిద్ధి కలగదు. ఆ మెట్టు దాటి అందరిలోనూ, నీలోనూ కూడ పరమాత్మను చూడు.అంటూ అన్నమయ్య ఈ కీర్తనలో అన్యాపదేశంగా చెబుతున్నాడు.
మనిషి బుద్ధి వక్రత వలన తేడాలను, హెచ్చుతగ్గులను చూడటమే పనిగా పెట్టుకొని పతనమై పోతున్నాడు.
అన్నమయయ్య ఈ కీర్తనలో అడుగు తున్నాడు… ఏమని?….
‘ఎందుకు వేరుగా చూస్తున్నావు! పైపై వేషాలు, బీద గొప్ప తేడాలు వేరు కావచ్చు. కానీ హృదయం పొందే అనుభూతికి తేడా ఉందా?
రాజు హంసతూలికా తల్పం మీద పడుకున్నా, ఆయవ సేవకుడు కటిక నేలమీద పడుకున్నా నిద్ర ఒకటే. అదిచ్చే
హాయిలో తేడా ఉందా?
పంచభక్ష్య పరమాన్నాలు తినేవాడికీ, పూటకు గతిలేని వాడికీ ఆకలి ఒకటే కదా!
ఈ ప్రపంచంలో అల్పజీవి నుంచి మహారాజులవరకూ కామసుఖం ఒకటేగదా!
ఎండ ఏనుగు మీదా పడుతుంది. కుక్క మీదా పడుతుంది. ఎండకు అంతా ఒకటే!
రాత్రీ పగలూఅనేవి ధవికుల కైనా పేదలకైనా ఒకేసారి వచ్చిపోతాయి కదా!
గాలి సువాసనగలపూవులమీద, మురికి కుప్పమీద కూడా వీస్తుందే. గాలికీ అంతా ఒకటే!
ఇక ఉన్నవాడేంటి లేనివాడేమిటి.. ఈ భూమిమీద పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదే. ఏకులం వాడైనా ఉండేది నేలమీదే… చేరేది ఆ మట్టిలోకేగా.
మృత్యువుకూ అంతా ఒకటే!
ఇంక మూణ్ణాళ్ళ బ్రతుకులో ఇన్ని తేడాలెందుకు?
ఎలాగైతే పంచభూతాలకు ప్రాణికోటి పట్ల భేదం లేదో అలాగే జీవకోటి పట్ల భగవంతుడికీ భేదం లేదు. భక్తి, విశ్వాసము, నడతే ఆయనకు ముఖ్యం!
ఆ పరబ్రహ్మ తానుసృషించిన జగతి నిర్వహణలో భాగంగా బహురూపాలను ధరించాడు. తన శక్తిని సృష్టి, స్థితి, లయములకు అనుగుణంగా మలుచుకున్నాడు.
కులమత భేదాలు చాలవన్నట్లు భగవంతుని రూపాలన్నిటికీ మూలం పరబ్రహ్మే అది మనలోనే ఉన్నదని గ్రహింపక ఈర్ష్య తో ఒకరూపాన్ని ఆరాధించేవారు మరొక రూపాన్ని ద్వేషిస్తూ మసలుకుంటున్నాం.
మన కర్మ పరిపక్వత కలిగించగలిగేది ఆ వేంకటేశ్వరుని నామం ఒక్కటే !
పుణ్యం చేసినవాళ్ళనూ, పాపంచేసిన వాళ్ళనూ కావగలది ‘ఆ గోవిందా’అనే నామమే.
‘అద్వేష్టా సర్వభూతానాం మైత్ర: కరుణ ఏవ చ |
నిర్మమో నిరహంకార: సమదుఃఖసుఖ: క్షమీ ||’
ఏ భక్తులు సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా ఉంటారో, స్నేహపూరితముగా, కారుణ్యముతో ఉంటారో, వారు నాకు చాలా ప్రియమైన వారు. వాళ్ళకు ధనము మీద మమకారం ఉండదు. అహంకారం చూపరు. సుఖ-దుఃఖాలలో ఒకే విధంగా ఉంటారు. క్షమించే మనస్సుకలిగి తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై, ఆత్మనిగ్రహంతో, ధృడ సంకల్పంతో మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు.( భగవద్గీత 12)
అన్నమయ్య తన కీర్తనలో లోకానికి చెప్పదలచినది ఇదే!
తే.గీ
విజ్ఞులగువారు చూపరు వేఱడంబు
హెచ్చుతగ్గులనెంచునే యెండ, వాన!
ఎడము బెట్టక,లోనున్న యెదను జూడు
ప్రాణు లన్నిటఁబరమాత్మ ప్రతివసించు
స్వస్తి🙏
~~~~~~~~~~~~
డా. ఉమాదేవి జంధ్యాల
చిత్రం- శ్రీ Pvr Murtyగారు


   

నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...