6, ఏప్రిల్ 2021, మంగళవారం

కస్తూరి శివరావు - తెలుగు సినిమా తొలి హాస్య నటుడు

 తెలుగు సినిమా తొలితరం ప్రఖ్యాత హాస్య నటుడు 'కస్తూరి శివరావు' (My pen sketch)

కస్తూరి శివరావు !
*1913లో మార్చి 6న కాకినాడలో జన్మించిన శివరావు నాటకాల్లో
హాస్యపాత్రలు ధరించాడు. పద్యాలూ, పాటలూ బాగా పాడేవాడు.
హాస్యం మార్కుతో వున్న పాటలు గ్రామ ఫోన్‌ రికార్డులుగా ఇచ్చాడు.
వరవిక్రయం (1939) సినిమాలో చిన్న వేషం వేసాడు శివరావు.
చూడామణి (1941) సినిమాలో అతడు వేసిన మంగలిశాస్త్రి అనే వేషం
జనం దృష్టిలో బాగాపడి, ‘శివరావు’ తెలిసాడు.
తర్వాత తర్వాత అక్కడా అక్కడా చిన్నా, చితకా వేషాలు వేసినా,
స్వర్గసీమ (1945) తో ఇంకా బాగా తెలిసాడు.
బాలరాజు (1948) తో ఇంకా బాగా తెలిసి పెద్ద నటుడైపోయి,
జనాన్ని వెంట పరిగెత్తించుకున్నాడు.
ఆ దశలోనే వచ్చిన గుణసుందరి కథ, లైలా మజ్ను, రక్షరేఖ, శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి ( అన్నీ 1949 విడుదలలే! ) మొదలైన చిత్రాలు పెద్ద హిట్లు కావడంతో శివరావును ప్రజలు అద్భుత హాస్య నటుడిగా కొనియాడారు. సినిమాలు, ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో తారలు అందరూ వెళ్ళితే, శివరావు వెంటా, దగ్గరా మాత్రం ఎక్కువమంది జనం గుమిగూడి కనిపించేవారు. గుణసుందరి కథలో శివరావుది ప్రధాన పాత్ర. ఆ చిత్రంలోని ఆయన గిడిగిడి అనే ఊతపదంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
1950 లో శివరావు సొంతంగా సినిమా కంపెనీ ఆరంభించి, పరమానందయ్య శిష్యుల కథ హాస్య నటులతో తీసాడు. నాగేశ్వరరావు హీరో కాగా, హీరోయిన్‌గా, గిరిజను పరిచయం చేశాడు. అతనే దర్శకత్వం వహించాడు.
ప్రతి నిర్మాతా తన చిత్రంలో శివరావు వుండాలనీ, అతని కోసం
పడిగాపులు పడేవారు. ఒక మహోన్నతమైన తారగా 
సినీవినీలాకాశంలో వెలిగిన శివరావు కాంతి - రాను రాను తగ్గసాగింది.
"హాస్యనటులకి ఎప్పుడూ వుండేదే ఇది. ఒక దశలో మాత్రం గొప్పగా
వెలిగిపోతారు" అని తెలిసినవాళ్లు అంటారు.
రేలంగి శకం వచ్చిన తర్వాత శివరావు జోరు తగ్గింది.
క్రమేణా సినిమాలూ తగ్గసాగాయి. ఐతే ఎవర్నీ వేషాలు ఇవ్వమని
అడిగేవాడు కాదు. "అంత బతుకు బతికిన వాడిని, ఇప్పుడు దేహీ
అనవలసిన అవసరం లేదు నాకు!" అని అతను మొండిపట్టుగా
కూర్చోవడం - సినిమా నిర్మాతలకి నచ్చలేదు.
దీనికి తోడు తాగుడు అలవాటు సినిమాలల్లో అవకాశాలను దెబ్బ తీసింది.
తారాపథంలో ఉన్నప్పుడు శివరావుకి ‘బ్యూక్‌’ కారు వుండేది.
అప్పటి పెద్ద స్టార్లందరూ బ్యూక్‌ కారునే వాడేవారు. మద్రాసు పాండీ
బజార్లో ఆ బ్యూక్‌ కనిపిస్తే చాలు - అభిమానులు కారు వెంట
పరిగెత్తేవారు. అలాంటి దశ రాను రాను తగ్గడంతో అతని ప్రభ కూడా
తగ్గింది. "మొదటి రోజుల్లో మద్రాసులో సైకిలు తొక్కుతూ తిరిగేవాడ్నీ.
తర్వాత కార్లమీద తిరిగాను. ఇప్పుడు మళ్ళీ సైకిలు మీదనే
తిరుగుతున్నాను.
ఒకప్పుడు మా ఇంటి పేరైన కస్తూరి వాసనే నిత్యం
గుప్పుమనేది. ఇప్పుడు ఇంటిపేరు కస్తూరి వారు - ఇంట్లో గబ్బిలాల
కంపు" అని తన మీద తనే చమత్కారబాణం వేసుకునేవాడు.
ఒకనాడు పెద్ద సైజు కారులోని వెనుక సీటులో దర్జాగా కూర్చుని తిరిగిన
శివరావు - అదే రోడ్ల మీద డొక్కు సైకిలు తొక్కుకుంటూ తిరిగాడు.
"తప్పులేదు, ఆకాశంలో వెలిగే నక్షత్రాల వయసు కొంతకాలమే !
అందుకే సినిమా నటీ నటుల్ని నక్షత్రాలతో పోల్చారు. నేనూ
ఆత్మాభిమానం వున్నవాడ్నే. ఐతేనేం - జీవితం మిట్ట పల్లాలతో
వున్నప్పుడు ఇలాంటివి సహజం" అని వేదాంతిలా మాట్లాడేవాడు
ఆయన. చివరి రోజుల్లో ఎవ్వరూ సినిమాల్లో అవకాశాలు కల్పించని
పరిస్థితిలో శివరావు గారి మీద అభిమానముతో ఎన్.టి.రామారావు
గారు పలు సినిమాలల్లో అవకాశాలు కల్పించారు. సినిమా
షూటింగులల్లో కూడా తాగి వస్తూండటంతో మరి అవకాశాలు రాలేదు
శివరావు చరమదశ మాత్రం దయనీయంగా గడిచింది.
అనారోగ్యంతో వుండి, శక్తి లేకపోయినా నాటకాల్లో వేషంవేస్తే గానీ పొట్ట గడిచేది కాదు.చివరిసారిగా 1966లో అతను ఒక నాటకంలో వేషం వెయ్యడానికి తెనాలి వెళ్ళి, అక్కడే రైల్వే స్టేషనులో మరణించాడు. కొన్ని గంటల
తరువాత ఎవరో ప్రయాణీకుడు శివరావు మృతదేహాన్ని గుర్తుపట్టాడు.
ఒకనాడు కారు సీటులో దర్జాగా కూచున్న శివరావు - నాలుగు కార్లు
మెంటైన్ చేసిన శివరావు చివరకు అద్దె కారు డిక్కీలో పడి మద్రాసు
చేరుకున్నాడు - మధ్యలో ఇబ్బందులు పడుతూ. వస్తూ వస్తూ ఎక్కడో
కారు ఆగిపోవడంతో, మూడు రోజులపాటు ప్రయాణం చేసి శివరావు
మృతదేహం ఇల్లు చేరుకుంది. సినిమా పరిశ్రమలోని అందరికీ అతని
మరణ వార్త తెలిసింది. స్టార్‌డంలో లేడనో, గ్లామర్‌ లేదనో మొత్తానికి
ఎరిగినవాళ్ళే చాలామంది ‘చివరిచూపు’ లకు రాలేదు. ఒకనాడు
వేలాదిమంది అభిమానుల్ని వెంట పరుగెత్తించుకున్న శివరావు -
నిర్మాతలను ఇంటి గుమ్మం ముందు గంటలు గంటలపాటు నిరీక్షీంప
చేసుకున్న శివరావు - చివరి పయనంలో ఎవరి తోడూ లేకుండా
దాదాపు ఒంటరిగానే వెళ్ళవలసి వచ్చింది.



 

5, ఏప్రిల్ 2021, సోమవారం

వృద్ధాప్యం - ఓ అనుభవాల పాఠం


అనుభవాల పాఠం వృద్ధాప్యం (ఆంధ్రభూమి నుండి సేకరణ) - 

వ్యాసానికి చిత్రం ః పొన్నాడ మూర్తి (charcoal pencil sketch)

మనిషి జన్మ చాలా చిత్రమైనది. శిశువు జన్మించినపుడు అందరికీ ఆనందాలు వెదజల్లుతాడు. అదేవిధంగా చనిపోయినప్పుడు అందరికీ కన్నీళ్ళు మిగిల్చి అనంతవాయువుల్లో కలిసిపోతాడు. శరీరం మాత్రం తన ఆకృతిని కోల్పోయి కాలిపోవడమో, భూగర్భంలో కలిసిపోవడమో జరుగుతుంది. ఇది సృష్టి ధర్మం. మనందరికీ తెలిసిన నగ్నసత్యం. ఉపనిషత్తులో కూడా మానవ జీవితాన్ని ఆసక్తికరంగా వర్ణించారు. బాల్యాన్ని ఉదయంతోను, మధ్యాహ్నం యవ్వనంతోను, సాయంకాలాన్ని వృద్ధాప్యంతోను, రాత్రిని మరణంతోను వర్ణించారు. బాల్యం ఎంత ఆనందంగా గడుస్తుందో, అంతే బాధాకరంగా వృద్ధాప్యం నడుస్తుంది.
వృద్ధాప్యం అనేది మనిషి జన్మలో అతి ముఖ్యమైంది.
ఆరు పదుల జీవితం కొందరికి వెలుగులు, మరికొందరికి చీకటి వెలుగులు పంచి పెడుతుంది. 60 సంవత్సరాల వయస్సువరకు మనిషి జన్మ విధంగా నడిస్తే ఆపై వచ్చే దశనే వృద్ధాప్యం అంటారు. హాయి హాయిగా గడిచే జీవితంలో అనూహ్య మార్పులు చోటుచేసుకొంటూ వచ్చి చివరికి మనిషిని మ్రగ్గిన పండులా మార్చి రాలిపోయేలా చేస్తుంది వృద్ధాప్యం.
అన్ని కష్టాలు 60 నుండే ఆరంభం అవుతాయి. ఆరోగ్య, మానసిక, సాంఘిక సమస్యలు ప్రతిమనిషిలోనూ తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితులు చాలా గొప్పగా వున్నా సమస్యలు మాత్రం అందరిలో వస్తాయి. ఎంతో అందంగా కాపాడుకొంటూ వచ్చిన మానవ దేహం రిపేరుకొచ్చేస్తుంది. శరీరంలోని ఒక్కో అంగం నిస్సత్తువ అవుతూ వస్తుంది. కొందరికి ముందుగా పంటి సమస్యలు, కంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కొందరిలో 60 సం.లనుండి ఆరంభం అయితే, మరికొందరికి 65 సం.లో ప్రారంభమవుతాయి. కొందరు వేగంగా వెళ్లిపోతారు. ఇంకొందరు కాస్త స్లోగా నడుస్తూ వెళ్లిపోతారు. అందరూ చేరే గమ్యం ఒక్కటే! కర్మ సిద్ధాంతాలతో మిగిలినవారు సరిపుచ్చుకుంటారు. ఇది జీవనతరంగం.
అనే్నళ్ళ ఆనందాలన్నీ ఆవిరైపోయి శేషజీవితం విషాదంతో ముగుస్తుంది. భగవంతుడు ఒక్కసారిగా మనిషికి వృద్ధాప్యంలో కష్టాల్ని ఆరంభిస్తాడు. ఎన్నో ఎనె్నన్నో సమస్యలు ఒకదానికొకటి తోడై బాధిస్తాయి. ఆలోచనలు పెరుగుతాయి. కానీ క్రమంగా ఆలోచించేశక్తి సన్నగిల్లుతుంది. ఎంత గింజుకున్నా కొన్ని గుర్తుకురావు. మనకు కావాల్సిన వ్యక్తుల్నే మనం గుర్తించలేము. ఒక్కోసారి ఆత్మీయుల పేర్లనుకూడా మరచిపోతాం. మందుబిళ్ళలు వేసుకొన్నా అవి మనకు పూర్వ శక్తిని తీసుకురాలేవు. కొందరికైతే శరీరంలో శక్తి పూర్తిగా నశిస్తుంది. నడుం నొప్పులు, కీళ్ళనొప్పులు ఇంకా ఇంకా ఎనె్నన్నో.. బాధలు అపరిమితం. ఒక్కోసారి అసహనం, కోపం కూడా వృద్ధాప్యాన్ని వెక్కిరిస్తాయి. చక్కెర వ్యాధిగ్రస్థుల బాధలైతే మరీ వర్ణనాతీతం. ఈదశలో కొందరికి సరైన ఆదరణ కన్పించదు. వాళ్ళ జీవితం మరీ దుర్భరం. ఒంటరి బ్రతుకు. సాంఘికంగా, ఆర్థికంగా మానసికంగా అన్నీ సమస్యలే. భార్యలు కోల్పోయిన భర్తలు, భర్తల్ని కోల్పోయిన భార్యల పరిస్థితి మరింత విచారకరం.
కొందరు వృద్ధాప్యంలో బాగా డిప్రెషన్కు గురవుతారు. ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. అందరిపై పెత్తనం చెలాయించాలని చూస్తారు. పిల్లల్ని తమ అదుపు ఆజ్ఞలో ఉంచాలనుకొంటారు. అన్ని విషయాల్లో తాము చెప్పిందే శాసనం కావాలనుకొంటారు. కొంతమంది వృద్ధాప్యంలో మంచానబడి కదలలేని స్థితిలో అచేతనంగా దుర్భర జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటివారిని చూసి రెండు కన్నీటిబొట్లు విడవడం తప్ప ఏం చేయలేం.
చాలామంది వృద్ధులు తమ ఇంటికే పరిమితమై జీవిస్తుంటారు. వీళ్లలో ఆత్మన్యూనతభావన ఎక్కువగా ఉంటుంది. ఎవరితో కలవాలనుకోరు. ముఖ్యంగా తమకన్నా చిన్న వయసున్న వారితో. కొందరిలో మతిమరుపు ఎక్కువకావడం చాలా అనర్థాలకు కారణవౌతాయి. రాను రాను చెవుడు కూడా తోడుకావడం మరింత బాధాకరం అన్పిస్తుంది. వయస్సులో కూడా కొందరిలో ఏదో చేయాలన్న తపన. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత.
కొంతమంది పిల్లలు వృద్ధుల్ని నిర్లక్ష్యంగా చూస్తారు. మానవ సంబంధాలకన్నా ఆర్థిక సంబంధాలే ప్రాధాన్యత సంతరించుకొన్న జన జీవనంలో వృద్ధుల్ని తమకు భారంగా కూడా భావిస్తారు. ఇలాంటివారికి సమాజంలోని కొందరైనా చేయూతనివ్వాలి.
వృద్ధుల్ని పిల్లల్లా చూసుకోవాలి. ఆఖరి దశలో వీరిలో పిల్లల ప్రవర్తనే ఎక్కువ చోటుచేసుకుంటుంది. తమని కూడా చిన్నపిల్లల్లా చూసుకోవాలనుకుంటారు. వాళ్ళ చిన్న చిన్న కోర్కెలు తీర్చాలి. క్రమం తప్పక చికిత్సలు అందజేయాలి. వీలైనన్ని సీనియర్ సిటిజన్స్ క్లబ్లు, వృద్ధాశ్రమాలు ప్రభుత్వమే నెలకొల్పాలి. ముఖ్యంగా వీరికి అన్ని మందులు ఉచితంగా అందజేయాలి. విధిగా ప్రతి ఆసుపత్రిలో వృద్ధులకు ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి సబ్సిడీపై చికిత్స జరిపించాలి. మానసికంగా కూడా వీళ్ళకు మనోధైర్యాన్ని నింపాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే దిశగా కొన్ని సదుపాయాలను కల్పించాయి. టాక్స్ బెనిఫిట్స్, డిపాజిట్లకు అదనపు వడ్డీతోపాటు విమాన, రైలు, బస్సు ప్రయాణ ఛార్జీల్లో రాయితీలిస్తున్నాయి. బ్యాంకుల్లో కొత్తగా 65 సం.లు దాటిన వృద్ధులకు ప్రత్యేక సహాయం ఏర్పాట్లు చేశారు.
వృద్ధులు కూడా జీవిత సత్యాన్ని గ్రహించి ఉన్నంతకాలం హాయిగా, ఆనందంగా ఎలాంటి దురాలోచనలు చేయకుండా బ్రతకడం నేర్చుకోవాలి. జననం తథ్యమని.. మరణం తప్పదని గుర్తెరగాలి. తొలి జీవితానే్న కడవరకూ కోరుకోవడం అత్యాశే. అందరికీ ఆదర్శంగా బ్రతకాలి.కనీసం ఇపుడైనా వయస్సు అహంకారంతో ఎవరినైనా బాధించి ఉంటే గుర్తు తెచ్చుకుని వీలైతే వారికి క్షమాపణలు చెప్పడం లేదా పశ్చాత్తాపం చెందడం లాంటివి కూడా చేస్తే మంచిది. దైవచింతన కూడా కొంతవరకు వీరికి మనశ్శాంతిని అందిస్తుంది. ఇంట్లోనే హాయిగా ఆత్మవిశ్వాసంతో, ఆనందంతో జీవించండి.. ప్రతి ఒక్కరూ కాబోయే వృద్ధులే!అనుభవాల పాఠం వృద్ధాప్యం (ఆంధ్రభూమి నుండి సేకరణ)



(ఆంధ్రభూమి దినపత్రిక సౌజన్యంతో)

 

2, ఏప్రిల్ 2021, శుక్రవారం

ఘండికోట బ్రహ్మాజీరావు - ప్రముఖ రచయిత


(my charcoal pencil drawing)

ఘండికోట బ్రహ్మాజీరావు (1922 డిసెంబర్ 23 - 2012్ అక్టోబర్ 12)  ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. ఆయన ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం భాషలలో యం.యే. పట్టభద్రులు. సాంకేతికరంగంలో "ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ "సభ్యులు. నివాసస్థలం విశాఖపట్నం. తెలుగు కథానిక మీద పరిశోధన చేసేరు. అనేక కథానికలు వివిధ పత్రికల్లో ప్రచురించబడినాయి.

సగటు మానవుని దైనందిన సమస్యలు పరిశీలించి తన రచనల్లో విలషించిన అక్షరశిల్పి ఘంటికోట. ఈయన రచనలన్నీ వాస్తవిక జీవితానికి దర్పణాలుగా నిలుస్తాయి. ఆయన ఖాదీకి పర్యాయ పదంగా ఉన్న పొందూరు భ్రాహ్మణ అగ్రహారం వీధిలో డిసెంబర్ 23, 1922 లో జన్మించారు. అక్కడే ప్రాధమిక విద్యను పూర్తిచేశారు. 16 యేళ్ళ వయస్సు నుంచే కలం ఝళిపించారు.  తెలుగు, ఆంగ్లం, సంస్కృతం భాషల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. పశిమ బెంగాల్ లో రైల్వే విభాగంలో ఇంజనీరుగా పనిచేశారు. 1980  లో పదవీ విరమణ చేసిన తరువాత హాల్డియా ఫోర్డ్ లో ప్రత్యేక అధికారిగా ఏడాదిపాటు పనిచేశారు. ఆయన 10కి పైగా నవలలు అతిపెద్ద కథా సంపుటిని, వివిధ గ్రంధాలకు అనువాదాలూ చేసి ప్రసిద్ధికెక్కారు. బ్రహ్మాజీ ఆంగ్ల సంక్షిప్త కథలపై పరిశోధనలు చేసి అనేక బహుమతులు పొందారు. రైల్వేలో అనేక హోదాల్లో పనిచేస్తూనే సాహిత్య సేవ చేశారు. ఉత్తరాంధ్ర, ప్రవాసాంధ్ర, బెంగాలీ జీవిత చిత్రాన్ని జమిలి ముద్రణలో అందించారు.

ఘండికోట పేరు చెప్పగానే శ్రామిక శకటం, విజయవాడ జంక్షన్ చప్పున స్ఫురిస్తాయి. రైల్వే రంగాన్ని ఇతివృత్తంగా తీసుకుని రచనలు చేసిన ప్రథమ కథా, నవలా రచయిత ఘండికోటే. ఆయన కలం నుండి దాదాపు 30 నవలలు, 150 కథలు, పెక్కు వ్యాసాలు వెలువడ్డాయి. ఆయన నవలల్లో పరుగులిడే చక్రాలు, ప్రవహించే జీవనవాహిని, నవ్వింది నాగావళి, శ్రామిక శకటం, విజయవాడ జంక్షన్, నల్లమబ్బుకో వెండి అంచు, ప్రేమమూర్తి, రాగలత, గులాబీముళ్ళు, డాక్టర్ భాయి వంటివి పాఠకుల అమితాదరణకు పాత్రమయ్యాయి. తొలికథ 1941లో ప్రజాబంధులో వచ్చిన ‘రాఘవయ్య’తో సాహితీ యాత్ర ఆరంభించారు. ‘ఒక దీపం వెలిగింది’ నవల సినీద్వయం బాపు-రమణల నేతృత్వంలో 'గోరంత దీపం' సినిమాగా వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ   ఆహ్వానం మేరకు  Arabian Nights వేయిన్నొక్క రాత్రులు పేరుతో, తెలుగులో అనువదించారు. ఆధ్యాత్మిక రచయితగా శ్రీమత్ సుందరకాండ-సౌందర్య దర్శనం (6 భాగాలు) వెలువరించారు.

ఘండికోట బ్రహ్మాజీరావు 2012 అక్టోబర్, శుక్రవారం నాడు కన్నుమూశారు. పశిమ బెంగాల్ బర్నపూర్‌లో ఉద్యోగార్థమై ఉన్న కుమారుడు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళిన బ్రహ్మాజీరావు అస్వస్థతతో అక్కడే కన్నుమూశారు.

 

అమ్మకే అమ్మ అమ్మమ్మ

 ​ అమ్మకే అమ్మ అమ్మమ్మ (pen sketch) ఆ గుండె చప్పుడు వింటూ ఒదిగిపోతా, నీ దీవెనల నీడలో పెరిగి పెద్దవుతా. తరాలు దాటిన మన ప్రేమానుబంధం, ఈ సృష్టి...