6, ఏప్రిల్ 2021, మంగళవారం

కస్తూరి శివరావు - తెలుగు సినిమా తొలి హాస్య నటుడు

 తెలుగు సినిమా తొలితరం ప్రఖ్యాత హాస్య నటుడు 'కస్తూరి శివరావు' (My pen sketch)

కస్తూరి శివరావు !
*1913లో మార్చి 6న కాకినాడలో జన్మించిన శివరావు నాటకాల్లో
హాస్యపాత్రలు ధరించాడు. పద్యాలూ, పాటలూ బాగా పాడేవాడు.
హాస్యం మార్కుతో వున్న పాటలు గ్రామ ఫోన్‌ రికార్డులుగా ఇచ్చాడు.
వరవిక్రయం (1939) సినిమాలో చిన్న వేషం వేసాడు శివరావు.
చూడామణి (1941) సినిమాలో అతడు వేసిన మంగలిశాస్త్రి అనే వేషం
జనం దృష్టిలో బాగాపడి, ‘శివరావు’ తెలిసాడు.
తర్వాత తర్వాత అక్కడా అక్కడా చిన్నా, చితకా వేషాలు వేసినా,
స్వర్గసీమ (1945) తో ఇంకా బాగా తెలిసాడు.
బాలరాజు (1948) తో ఇంకా బాగా తెలిసి పెద్ద నటుడైపోయి,
జనాన్ని వెంట పరిగెత్తించుకున్నాడు.
ఆ దశలోనే వచ్చిన గుణసుందరి కథ, లైలా మజ్ను, రక్షరేఖ, శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి ( అన్నీ 1949 విడుదలలే! ) మొదలైన చిత్రాలు పెద్ద హిట్లు కావడంతో శివరావును ప్రజలు అద్భుత హాస్య నటుడిగా కొనియాడారు. సినిమాలు, ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో తారలు అందరూ వెళ్ళితే, శివరావు వెంటా, దగ్గరా మాత్రం ఎక్కువమంది జనం గుమిగూడి కనిపించేవారు. గుణసుందరి కథలో శివరావుది ప్రధాన పాత్ర. ఆ చిత్రంలోని ఆయన గిడిగిడి అనే ఊతపదంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
1950 లో శివరావు సొంతంగా సినిమా కంపెనీ ఆరంభించి, పరమానందయ్య శిష్యుల కథ హాస్య నటులతో తీసాడు. నాగేశ్వరరావు హీరో కాగా, హీరోయిన్‌గా, గిరిజను పరిచయం చేశాడు. అతనే దర్శకత్వం వహించాడు.
ప్రతి నిర్మాతా తన చిత్రంలో శివరావు వుండాలనీ, అతని కోసం
పడిగాపులు పడేవారు. ఒక మహోన్నతమైన తారగా 
సినీవినీలాకాశంలో వెలిగిన శివరావు కాంతి - రాను రాను తగ్గసాగింది.
"హాస్యనటులకి ఎప్పుడూ వుండేదే ఇది. ఒక దశలో మాత్రం గొప్పగా
వెలిగిపోతారు" అని తెలిసినవాళ్లు అంటారు.
రేలంగి శకం వచ్చిన తర్వాత శివరావు జోరు తగ్గింది.
క్రమేణా సినిమాలూ తగ్గసాగాయి. ఐతే ఎవర్నీ వేషాలు ఇవ్వమని
అడిగేవాడు కాదు. "అంత బతుకు బతికిన వాడిని, ఇప్పుడు దేహీ
అనవలసిన అవసరం లేదు నాకు!" అని అతను మొండిపట్టుగా
కూర్చోవడం - సినిమా నిర్మాతలకి నచ్చలేదు.
దీనికి తోడు తాగుడు అలవాటు సినిమాలల్లో అవకాశాలను దెబ్బ తీసింది.
తారాపథంలో ఉన్నప్పుడు శివరావుకి ‘బ్యూక్‌’ కారు వుండేది.
అప్పటి పెద్ద స్టార్లందరూ బ్యూక్‌ కారునే వాడేవారు. మద్రాసు పాండీ
బజార్లో ఆ బ్యూక్‌ కనిపిస్తే చాలు - అభిమానులు కారు వెంట
పరిగెత్తేవారు. అలాంటి దశ రాను రాను తగ్గడంతో అతని ప్రభ కూడా
తగ్గింది. "మొదటి రోజుల్లో మద్రాసులో సైకిలు తొక్కుతూ తిరిగేవాడ్నీ.
తర్వాత కార్లమీద తిరిగాను. ఇప్పుడు మళ్ళీ సైకిలు మీదనే
తిరుగుతున్నాను.
ఒకప్పుడు మా ఇంటి పేరైన కస్తూరి వాసనే నిత్యం
గుప్పుమనేది. ఇప్పుడు ఇంటిపేరు కస్తూరి వారు - ఇంట్లో గబ్బిలాల
కంపు" అని తన మీద తనే చమత్కారబాణం వేసుకునేవాడు.
ఒకనాడు పెద్ద సైజు కారులోని వెనుక సీటులో దర్జాగా కూర్చుని తిరిగిన
శివరావు - అదే రోడ్ల మీద డొక్కు సైకిలు తొక్కుకుంటూ తిరిగాడు.
"తప్పులేదు, ఆకాశంలో వెలిగే నక్షత్రాల వయసు కొంతకాలమే !
అందుకే సినిమా నటీ నటుల్ని నక్షత్రాలతో పోల్చారు. నేనూ
ఆత్మాభిమానం వున్నవాడ్నే. ఐతేనేం - జీవితం మిట్ట పల్లాలతో
వున్నప్పుడు ఇలాంటివి సహజం" అని వేదాంతిలా మాట్లాడేవాడు
ఆయన. చివరి రోజుల్లో ఎవ్వరూ సినిమాల్లో అవకాశాలు కల్పించని
పరిస్థితిలో శివరావు గారి మీద అభిమానముతో ఎన్.టి.రామారావు
గారు పలు సినిమాలల్లో అవకాశాలు కల్పించారు. సినిమా
షూటింగులల్లో కూడా తాగి వస్తూండటంతో మరి అవకాశాలు రాలేదు
శివరావు చరమదశ మాత్రం దయనీయంగా గడిచింది.
అనారోగ్యంతో వుండి, శక్తి లేకపోయినా నాటకాల్లో వేషంవేస్తే గానీ పొట్ట గడిచేది కాదు.చివరిసారిగా 1966లో అతను ఒక నాటకంలో వేషం వెయ్యడానికి తెనాలి వెళ్ళి, అక్కడే రైల్వే స్టేషనులో మరణించాడు. కొన్ని గంటల
తరువాత ఎవరో ప్రయాణీకుడు శివరావు మృతదేహాన్ని గుర్తుపట్టాడు.
ఒకనాడు కారు సీటులో దర్జాగా కూచున్న శివరావు - నాలుగు కార్లు
మెంటైన్ చేసిన శివరావు చివరకు అద్దె కారు డిక్కీలో పడి మద్రాసు
చేరుకున్నాడు - మధ్యలో ఇబ్బందులు పడుతూ. వస్తూ వస్తూ ఎక్కడో
కారు ఆగిపోవడంతో, మూడు రోజులపాటు ప్రయాణం చేసి శివరావు
మృతదేహం ఇల్లు చేరుకుంది. సినిమా పరిశ్రమలోని అందరికీ అతని
మరణ వార్త తెలిసింది. స్టార్‌డంలో లేడనో, గ్లామర్‌ లేదనో మొత్తానికి
ఎరిగినవాళ్ళే చాలామంది ‘చివరిచూపు’ లకు రాలేదు. ఒకనాడు
వేలాదిమంది అభిమానుల్ని వెంట పరుగెత్తించుకున్న శివరావు -
నిర్మాతలను ఇంటి గుమ్మం ముందు గంటలు గంటలపాటు నిరీక్షీంప
చేసుకున్న శివరావు - చివరి పయనంలో ఎవరి తోడూ లేకుండా
దాదాపు ఒంటరిగానే వెళ్ళవలసి వచ్చింది.



 

కామెంట్‌లు లేవు:

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...