29, జనవరి 2019, మంగళవారం

జార్జ్ ఫెర్నాండెజ్ - George Fernandez

నాకెంతో ఇష్టమైన నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్, పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టించిన నాయకుడు - నా pencil చిత్రం.
వారి గురించి ఈనాడు పత్రికలో వచ్చిన వార్త.

"కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన ఫెర్నాండెజ్‌ 88 ఏళ్ల వయసులో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హయాంలోని ఎన్డీయే ప్రభుత్వంలో రక్షణమంత్రిగా పనిచేశారు.

జార్జి ఫెర్నాండెజ్‌ స్వస్థలం మంగళూరు. క్యాథలిక్‌ కుటుంబంలో పుట్టిన ఫెర్నాండెజ్‌ చదువును మధ్యలోనే ఆపేసి మతాధికారిగా శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత ముంబయి(అప్పటి బొంబాయి)కి మకాం మార్చి సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు రైల్వే శాఖలో ఉద్యోగం చేశారు. ఆ సమయంలో అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు అధ్యక్షుడిగా ఉండి ఎన్నో బంద్‌లు, రాస్తారోకోలు చేపట్టారు.

అలా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1967 సార్వత్రిక ఎన్నికల్లో సంయుక్త సోషలిస్టు పార్టీ తరఫున దక్షిణ బాంబే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌ఏ పాటిల్‌పై విజయం సాధించి తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. అయితే ఈ ఎమర్జెన్సీని వ్యతిరేకించిన ఫెర్నాండెజ్‌ జైలుకు వెళ్లారు.

ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత 1977లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఆ సమయంలో జైలులో ఉన్న ఫెర్నాండెజ్‌ అక్కడి నుంచే పోటీ చేశారు. జనతా పార్టీలో చేరి బిహార్‌‌లోని ముజఫర్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1977 లోక్‌సభ ఎన్నికల్లో జనతా పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కాంగ్రెస్‌ను గద్దెదింపింది. మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఫెర్నాండెజ్‌కు పరిశ్రమల శాఖ బాధ్యతలు అప్పగించారు.

1988లో జనతా పార్టీ నుంచి జనతా దళ్‌ విడిపోయింది. అప్పుడు ఫెర్నాండెజ్‌ కూడా జనతా దళ్‌లో చేరి వీపీ సింగ్‌ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జనతాదళ్‌ నుంచి కూడా విడిపోయి సమతా పార్టీని స్థాపించారు. 1998-2004 మధ్య వాజ్‌పేయీ హయాంలో రక్షణమంత్రిగా వ్యవహరించారు. భారత్‌-పాక్‌ మధ్య కార్గిల్‌ యుద్ధం ఈయన రక్షణమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. 2004లో శవపేటికల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని రక్షణమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. చివరిసారిగా 2009-2010 మధ్య రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఫెర్నాండెజ్‌ ఆ తర్వాత అనారోగ్య కారణాల రీత్యా ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు".

కామెంట్‌లు లేవు:

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...