20, మే 2020, బుధవారం

సిరివెన్నెల సీతారామశాస్త్రి - Sirivennela Seetarama Sastry - pencil sketch




అద్భుత గీత రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నేను నాకు ఇష్టమైన పెన్శిల్ మాధ్యమం ద్వారా  చిత్రించిన వారి చిత్రం. వారి గురించి నేను సేకరించిన వివరాలు టూకీగా .. 

సిరివెన్నెల 1986 సంవత్సరంలో విడుదలైన శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న తెలుగు చలన చిత్రం., భారతీయుల సంగీత కళని వెండితెరపై ప్రతిబింబించే చిత్రాలని అందించిన కళాతపస్వి        కె. విశ్వనాథ్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ ఒక అంధుడైన వేణు విద్వాంసుడు హరిప్రసాద్, మూగదైన చిత్రకారిణి చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలోని పాటలన్నీ మంచి ప్రజాదరణ పొందాయి. ఈ సినిమాలో అన్ని పాటలు సీతారామ శాస్త్రి రాశాడు. ఈయనకు పాటల రచయితగా ఇదే మొదటి చిత్రం. ఈ సినిమాతో చేబ్రోలు సీతారామ శాస్త్రి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గా మారిపోయారు.

శాస్త్రి విద్యాభ్యాసం పదవ తరగతి వరకు అనకాపల్లిలో జరిగింది. తర్వాత కాకినాడకీ ఇంటర్ పూర్తిచేసారు. .ఆంధ్ర విశ్వకళా పరిషత్లో బి.ఎ పూర్తి చేసి ఎం.ఏ చేస్తుండగా ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్ "సిరివెన్నెల సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు. ఆ సినిమా పేరుతోనే 'సిరివెన్నెల' సీతారామశాస్త్రిగా ఆయన పేరు దర్శనమిచ్చింది. భారత దేశ పురస్కారం పద్మశ్రీ ఈయనను 2019 వరించింది

విధాత తలఁపున ప్రభవించినది... అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు స్థానం సంపాదించి పెట్టంది. భావగర్భితమైన ఈ పాట రాయడానికి తనకు వారంరోజులు పట్టినట్లు సిరివెన్నెల ఒక ఇంటర్‌వ్యూలో చెప్పాడు. ధన మాయను ఎంత చిన్న చిన్న పదాలలో పొదగగలరో దైవ మాయని కూడా అంతే సులువుగా విడమరచి చెప్పగల ప్రజ్ఞాశలి సిరివెన్నెల. సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఎప్పుడో ఏర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలో కూడా ఉపద్రష్ఠులు. అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగులో ప్రజనీకానీకి తెలిసిన/తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేసారు సిరివెన్నెల.



నా చిత్రానికి మిత్రులు, ప్రఖ్యాత గజల్ రచయిత శ్రీ మాధవరావు కొరుప్రోలు గారు రచించిన చక్కటి గజల్. వారికి నా బ్లాగు ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

మాటమాటు మౌనమేల..వెన్నెలగా కురిసిందో..!
"సిరివెన్నెల" భావనే..తేనియగా పంచిందో..!
సంప్రదాయ మాధురులకు..గజ్జెకట్టె దివ్యముగా..
మనసంస్కృతి విలువలెల్ల..సంపదగా కాచిందో..!
నాగరికత పోకడలకు..నవస్వరాలు పొదిగెనా..
ఒక విప్లవ శంఖధార..జ్వాలికగా ఎగసిందో..!
చిత్రసీమ గీతాలకు..మెఱుపులేల పొదిగెనో..
అక్షరాల గమకాలకు..ఏలికగా మిగిలిందో..!
ప్రేక్షక జన హృదయాలను..గెలుచుకున్న గేయమహో..
గాయాలకు విరహాలకు..ఊరటగా పొంగిందో..!
ఏకాకిగ మాధవుడా..జగమంత కుటుంబమాయె..
సీతారామ శాస్త్రి తపము..పాటగా నిలిచిందో..!




19, మే 2020, మంగళవారం

గిరీష్ కర్నాడ్ - Girish Karnad



గిరీష్ కర్నాడ్ - నివాళి (నా pencil sketch)
గిరీష్ కర్నాడ్ (మే 19, 1938 - జూన్ 10, 2019)[2] ఒక కన్నడ రచయిత, నటుడు. కర్నాటకకు ఏడవ జ్ఞానపీఠ పురస్కారం అందించి కన్నడ సాహిత్యనానికే వన్నెలద్దిన ప్రసిద్ధ నాటక సాహిత్యవేత్త. భారత దేశంలోనే నాటక సాహిత్యంలో విశిష్టమైన రచనలు కావించినందుకు జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నమొట్టమొదటి నాటకసాహిత్యవేత్త గౌరవం ఇతనికే దక్కింది. అంతేకాక జ్ఞానపీఠ పురస్కారంపొందిన ఇద్దరు కన్నడ కవుల కావ్యాలను చలనచిత్రాలుగా వెండితెరకెక్కించిన కీర్తి కూడా ఈయన స్వంతం. తనకు జ్ఞానపీఠ అవార్డు లభించినప్పుడు, అందరు అభినందించగా వారితో సౌమ్యంగా, వినయంగా -"ఈ పురస్కారంనాకన్న మరాఠి సహిత్యంలో నాకన్నముందు నాటకసాహిత్యంలో విశేషకృషి సల్పిన విజయ తండూల్కర్ గారికిచ్చిన మిక్కిలి సంతోషించివుండేవాడిని" అని చెప్పడంద్వారా తనకన్న పెద్దవారైన అనుభవంవున్న సమకాలీన సాహితివేత్తలమీద అతనికున్న గౌరవం, అణకువ, అభిమానం కొట్టవచ్చినట్లు కానవచ్చుచున్నది. కర్నాడ్ నాటక సాహిత్యసేవ కేవలం కన్నడభాషకే మాత్రం పరిమితం కాలేదు.ఇతరభాషల సాహిత్యాన్నికూడా గమనంలో పెట్టుకున్న సాంస్కృతికవక్తగా, నటునిగా, దర్శకుడిగా ఎదిగాడు.కర్నాడ్ మొదట నాటక నటుడిగా తన కళాజీవితాన్ని ప్రారంభించినప్పటికి తన అసమానప్రతిభతో ఒక్కొక్కమెట్టును అధికమిస్తూ ఒక ఉత్తమ భారతీయ నాటకసాహిత్యవేత్తగా అగ్రపీఠం అధిష్టించాడు. కర్నాడ్ తెలుగుజనాలకు పరిచితుడే. ఇతను తెలుగు చలనచిత్రాలలో విభిన్నపాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడయ్యాడు. నటుడు, చిత్ర దర్శకుడు, నాటక రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార విజేత గిరీష్ కర్నాడ్ 2019 జూన్ 10 (81 సంవత్సరాల వయస్సులో) మృతిచెందాడు.
(source : వికీపీడియా)

13, మే 2020, బుధవారం

కష్టాల కడలిని ఈదలేక మునిగిపోతుంటే

భావానికి బొమ్మ - నా pencil చిత్రం



కష్టాల కడలిని ఈదలేక మునిగిపోతుంటే
రక్షించే చేయి నీదే కావాలట
అందులో తోసింది నువ్వైనా సరే,
అదే చేయి పరాయిదైతే ఊరంతా
నాదే చర్చట...!!

(అమ్మాయి అనుశ్రీ రాసిన "నీతో నేను" కవితలో నాలుగు పంక్తులకు నా చిత్రం. ఆమెకు నా శుభాశీస్సులు)

12, మే 2020, మంగళవారం

నాదస్వర విద్వాన్ షేక్ చిన మౌలానా - Nadaswara legend Sheik China moulana

My pencil sketch of Sheik Chinna Moulana

ఈ గజల్ నాదబ్రహ్మ షేక్ చినమౌలానా గారి దివ్యస్మృతికి.. మాన్యశ్రీ Pvr Murty గారి చిత్రం సాక్షిగా అంకితం..
గజల్ 3785
సన్నాయికి పరవశములు..నింపినావు దివ్యముగా..!
స్వరములకే రెక్కలెన్నొ..తొడిగినావు దివ్యముగా..!
మౌలానా అనగానే..గాలికెంత పులకింతో..
కళ్యాణీ వసంతాలు..ఒలికినావె దివ్యముగా..!
"కళై మామణీ" బిరుదాంచిత నాదస్వరార్ణవా..
మన భారత 'పద్మశ్రీ'గ..వెలిగినావు..దివ్యముగా..!
సంగీత విద్వన్మణి..గాంధర్వ కళానిధీ..రాగాంబుధీ..
గానకళా ప్రపూర్ణుడవై..నిలచినావు దివ్యముగా..!
జనరంజక మధురామృత..స్వరబ్రహ్మవే నీవు..
స్వర్గంగా వాహినినే దింపినావు దివ్యముగా..!
ఘనయశమ్ము నందిన 'చినమౌలానా' ధన్యుడవో..
మాధవునే పరవశింప..జేసినావు దివ్యముగా..!

నివాళి - నాదస్వరం పేరెత్తగానే ఆంధ్రులందరికీ నాదస్వర విద్వాన్ షేక్ చినమౌలానా గుర్తుకొస్తాడు. ఈ రోజు వారి జయంతి సందర్భంగా నా pencil sketch.
చినమౌలాని 1976 సంవత్సరంలో కళై మామణి అనే బిరుదంతో తమిళనాడు ప్రభుత్వం సత్కరించింది.1977 లో భారతప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదంతో గౌరవించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1977 లోనే అవార్డునిచ్చి తరించింది.ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ 1980 లో ‘గానకళా ప్రపూర్న’ బిరుదు ...1981 లో రాజమండ్రి సంగీత రసికులు ‘గాంధర్వ కళానిధి’ అని బిరుదు.1984 లో మచిలీపట్నం ‘సరస్వతి కళాసమితి’ వారు ’నాద స్వర కళానిథి’ బిరుదు.ఆంధ్ర విశ్వవిద్యాలయం 1985 లో ‘గౌరవ డాక్టరేట్’ పట్టము.1987 లో తెలుగు విశ్వవిద్యాలయ సత్కారం.1988 లో విజయవాడ త్యాగరాజ సంగీత కళా సమితి ‘ సంగీత విద్వన్మణి’ బిరుదు.ఇవేకాకుండా అమెరికా, సోవియట్ యూనియన్, హాంకింగ్..లాంటి దేశాల్లో నాదస్వర కచేరీ! రాముణ్ణి, అల్లాని.. కృష్ణున్ని, త్యాగయ్యనీ...నాదస్వరంతో పూజించే ఒక మహా విద్వాంసుడు, ఒక సత్పురుషుడు, ఒక తత్త్వవేత్త....అన్నిటినీ మించి ఒక మానవతా వాది శ్రీ షేక్ చినమౌలా!
(సేకరణ : వికీపీడియా)

వీరి గురించి మరిన్ని వివరాలు అందించిన మిత్రులు, సంగీత విద్వాంసులు శ్రీ సుధాకర్ మోదుమూడి గారికి నా ధన్యవాదాలు.  


"కర్ణాటక సంగీతంలోని గమకాలను, యథాతథంగా పలికించగల వాద్యాల్లో అగ్రతాంబూలం నాదస్వరానిదే!..పురాతనమైన ఆ వాద్యం ఎంతో మంగళప్రదమైనది కూడా! అందుకే శుభకార్యాలలో ఆ వాద్య శ్రవణం చేయడం అనాదిగా ఆచారంగా వస్తోంది.

మన తెలుగునాట,ఆ వాద్యంలో నిష్ణాతులైన విద్వాంసులు అరుదనే చెప్పాలి.తమిళనాట,ప్రసిద్ధ ఆలయాలు అధికంగా ఉండటం,నిత్యం ఆ ఆలయాలలో జరిగే సేవలలో విధిగా నాదస్వర వాద్యాన్ని వినియోగించడంచేత, ఎక్కువమంది నాదస్వర కళాకారులు అక్కడ ఆదరించబడ్డారు.ఎక్కడ ఆదరణ ఉంటుందో,అక్కడ ఆ విద్య పరిఢవిల్లుతుంది.

మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కరవది గ్రామం, నాదస్వర కళాకారులకు పుట్టినిల్లు.అక్కడ,వేణుగోపాలస్వామి ఆలయంలో మూడు వందల ఏళ్ళకు పైగా నాదస్వర ఆస్థాన విద్వాంసులుగా ఉన్న వంశంలో, 1924లో జన్మించారు షేక్ చిన మౌలానాగారు.వీరి వంశానికి మూలపురుషులైన విద్వాన్ ఆదంసాహెబ్,దేవగాంధారి రాగం వాయించడంలో గణుతికెక్కినవారు.విశేషమేమంటే,వీరి వంశంలో నాదస్వర విద్వాంసులే కాక, అమరకోశం, వాల్మీకి రామాయణం వంటి గ్రంథాలను అవపోసన పట్టిన సంస్కృత పండితులూ ఉన్నారు!
పసితనంలో పాలపీక బదులు సన్నాయిపీకతో పెరిగారేమో...చినమౌలానాగారు, తన తొమ్మిదవఏటనే కరవది ఆలయంలో తొలి నాదస్వర కచేరీ చేశారు! ఆయన పేరు తెలుగునాట మారుమోగిపోయింది.

పుట్టింది ముస్లిం కుటుంబంలో అయినా,వారి ఇల్లు వైదిక సాంప్రదాయాలకు నిలయంగా దర్శనమిచ్చేది! పట్టుబట్టలు కట్టుకొని,కుంకుమబొట్టు పెట్టుకొని, పెరుమాళ్ళను అర్చించే,చినమౌలానాగారు నిత్య నాదోపాసకునిగా దర్శనమిచ్చేవారు!

ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించి,అక్కడి దేవతామూర్తుల్ని తన నాదస్వరగంగతో అభిషేకించి, అక్కడి స్థానికులచే 'తమ ప్రాంతంలోనే నివాసం ఉండమని' అభ్యర్థనలనందుకొన్న భాగ్యశాలి ఆయన!నాదస్వరంలో మేరుపర్వతం వంటి రాజరత్నం పిళ్ళేగారి శైలిని అమితంగా ఇష్టపడే చిన మౌలానా, ఆయననే తన మానసిక గురువుగా ఆరాధించి,ఆ బాణీని స్వంతం చేసుకున్నారు.
తమిళనాట,కావేరీ తీరాన, శ్రీరంగంలో కొలువైన రంగనాథస్వామి సన్నిధిని తన స్థిర నివాసం చేసుకొన్నారాయన.దక్షిణాదిన,ఆయన నాదస్వరంతో ప్రతిధ్వనించని దేవాలయం లేదు.ఆయన అందుకోని సత్కారం లేదు. భారత ప్రభుత్వంచే 'పద్మశ్రీ', కేంద్ర సంగీత,నాటక అకాడెమీ పురస్కారాలు, తమిళనాడు ప్రభుత్వం నుండి 'కలైమామణి',ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడెమీవారి 'గానకళా ప్రపూర్ణ' బిరుదు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు...అందులో కొన్ని.1973 లో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద భారత స్వాతంత్ర్య రజతోత్సవాలలో కేంద్రప్రభుత్వం ఆహ్వానంపై కచేరీ చేశారాయన! విదేశాలెన్నో పర్యటించి, తన సంగీతంతో విశ్వమానవుల నీరాజనాలందుకున్నారు! అమెరికాలో 'నాదస్వర ఆచార్య' అనే బిరుదుతో సత్కారం పొందారు! అసంఖ్యాకంగా వారి నాదస్వర ఆడియో రికార్డులు విడుదలయ్యాయి.
చినమౌలానా గారి నాదస్వర కచేరీని 1980వ సంవత్సరం, మచిలీపట్నం సరస్వతి కళాసమితిలో మొట్టమొదటిసారిగా నేను వినడం జరిగింది. సుమారు మూడున్నర గంటలపాటు సాగిన ఆనాటి కచేరీ, శ్రోతలపై పన్నీటి జల్లులు కురిపించింది.'వాతాపి గణపతిం భజే' కృతిలో ఆయన ఎంత సుదీర్ఘంగా స్వర ప్రస్థారం చేశారో,శ్రోతలూ అంతే సుదీర్ఘంగా హర్షధ్వానాలిచ్చారు.

విశేషమేమంటే...కచేరీకి వెళ్ళే ముందు, ఆయన వెంట ఒక శిష్యుడు,శ్రుతిపెట్టెను మెడలో ధరించి, శ్రుతిని నిరంతరాయంగా వినిపిస్తుంటే,ఆయన అది వింటూ, తన పనులన్నీ పూర్తిచేసుకుని,కచేరీకి సిద్ధమయ్యారు.
చినమౌలాగారు, పెద్దలయెడ అపార గౌరవం కలవారు.తెలుగునాట లబ్ధప్రతిష్టులైన నాదస్వర విద్వాంసులు దాలిపర్తి పిచ్చిహరిగారు(పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి ప్రియ శిష్యులు) నివసించిన ఇల్లు ఎక్కడో వాకబుచేసి, మచిలీపట్నంలోని ఆ ఇంటికి తనబృందంతో వెళ్ళి, ముమ్మార్లు ప్రదక్షిణచేసి,వారి స్మృతికి నమస్కరించి,అక్కడి ధూళిని నుదుట భూతిగా రాసుకున్న వినయశీలి.
శ్రీరంగంలో 'శారదా నాదస్వర సంగీత ఆశ్రమ్' ను స్థాపించి,నాదస్వర వాద్యంలో ఎంతో మందిని నిష్ణాతుల్ని చేశారాయన.

మన తెలుగునాట,టిటిడి వారి ఆధ్వర్యంలోని తిరుపతి ఎస్వీ సంగీత కళాశాలలో తప్ప,ఎక్కువగా నాదస్వర,డోలు వాద్యాలలో శిక్షణ జరగటంలేదు.
ఇప్పటికైనా,ప్రభుత్వాలు చొరవ తీసుకుని,సంగీత కళాశాలలలో నాదస్వరం,డోలు,వేణువు,క్లారినెట్ మొదలైన వాద్యాలలో శిక్షణ తరగతులు ప్రారంభిస్తే,ఆ విద్య పదికాలాల పాటు నిలుస్తుంది., ఎంతోమందికి విద్యార్థులకు,గురువులకు భుక్తి కల్గుతుంది.

- సుధాకర్ మోదుమూడి"

--------------------------------------------------------------------------------------------------------------------------------------------

మిత్రులు, ప్రఖ్యాత గజల్ రచయిత  శ్రీ మాధవరావు కొరుప్రోలు గారు నా చిత్రానికి రచించిన గజల్ :

"ఈ గజల్ నాదబ్రహ్మ షేక్ చినమౌలానా గారి దివ్యస్మృతికి.. మాన్యశ్రీ పి. వి. ఆర్ మూర్తి గారి చిత్రం సాక్షిగా అంకితం..
గజల్ 3785
సన్నాయికి పరవశములు..నింపినావు దివ్యముగా..!
స్వరములకే రెక్కలెన్నొ..తొడిగినావు దివ్యముగా..!
మౌలానా అనగానే..గాలికెంత పులకింతో..
కళ్యాణీ వసంతాలు..ఒలికినావె దివ్యముగా..!
"కళై మామణీ" బిరుదాంచిత నాదస్వరార్ణవా..
మన భారత 'పద్మశ్రీ'గ..వెలిగినావు..దివ్యముగా..!
సంగీత విద్వన్మణి..గాంధర్వ కళానిధీ..రాగాంబుధీ..
గానకళా ప్రపూర్ణుడవై..నిలచినావు దివ్యముగా..!
జనరంజక మధురామృత..స్వరబ్రహ్మవే నీవు..
స్వర్గంగా వాహినినే దింపినావు దివ్యముగా..!
ఘనయశమ్ము నందిన 'చినమౌలానా' ధన్యుడవో..
మాధవునే పరవశింప..జేసినావు దివ్యముగా..!"

అమ్మకు వందనాలు - కంద పద్యాలు


అమ్మకు కందాలలో వందనాలు (రచన : శ్రీమతి ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల)

అమ్మనుమించినయాప్తుల
నిమ్మహి గానంగవశమె యెవ్వరికైనన్
అమ్మిచ్చినయీజన్మను
వమ్మునుగానీకమనముఁబయనింపవలెన్ !

అమ్మా యెటుబోయితివో
అమ్మా యనిబాధతోటియరిచిన రావే
కమ్మగ ముద్దలుబెట్టిన
యమ్మామరియొక్కసారియగపడరాదా !

అమ్మకు ప్రాణము నైతిని
అమ్మై ప్రాణంబునిచ్చియాలించితిగా
నమ్మలకునేనుమ్రొక్కెద
నమ్మేయిలదైవమనుచునర్మిలితోడన్!

అమ్మా నీయొడి బడిగా
నమ్మా నేర్చితినినేను నడకను ,నడతన్
అమ్మా చెట్టంతయితిని.
యమ్మకునీడివ్వదలపనమ్మేలేదే !

అమ్మనుజూచినపగిదిని
యిమ్ముగనద్దంబుముందు నిలబడతోచున్
నెమ్మది గుణమును పొందక
నమ్మకు ప్రతిరూపమనుచుననుకొనగలనా ?

ఉమాదేవి జంధ్యాల
( చిత్రం - శ్రీపొన్నాడ మూర్తిగారు 

మనసా ఓ నాలుగు మాటలు పుట్టించవే!! - కవిత





నా చిత్రానికి శ్రీమతి పద్మజ చెంగల్వల గారి కవిత.

మనసా ఓ నాలుగు మాటలు పుట్టించవే!!
మూగబోయావేమిలా.!!
నిసృహ ఆవరించేలా..
సుదీర్ఘ ఏకాంతం తొలుస్తోంది ఎదగదిని..!!
మిణుకుమనే ఆశల నక్షత్రాలతోవ...
తోరణాలు కట్టి
తోడున్నామంటున్నాయి..!!
ఎందుకో మరి సందేహం..?
కొత్త ద్వారాలట...
తప్త గీతాన్ని ఆలపిస్తోది హృదయం.
ఏదో గాఢత గుండెని చుట్టుముట్టి కుదుపుతోంది.
లాలన కోరుకునే మనసు అల్లుతోంది...ఖాళీతనం?
ఏదో ఇరుకుతనం...నిలబెట్టి అడుగుతోంది..
వెతుకులాటలో వెలితంటూ
ఎవరికోసమింకా ..??
పెనవేసే సంకెళ్ళ కౌగిలి తెంచుకుని..స్వాప్నిక స్థితిలో
నాకు నేనే...
ఉద్విగ్నమా...ఉత్తేజమా...!!
పరిమళాలు వెదజల్లిన రాత్రి ...
కనుమరుగవుతు..ఓదార్చింది...
నువ్వెపటికి ఒంటరివని...!!
ఖాళీతనం నింపే ఓ అవసరమని..!!
అందమైన కల ఓ మలుపు తిరిగింది...
నిదురపోని రాత్రిని నిశిరాత్రి చేస్తూ..!!
...
....
దూరంగా ఆలాపన...
క్షణాన్ని‌,కణాన్ని కదిలిస్తూ
అదిలిస్తూ..!!
వానచినుకు ఏదో రాస్తోంది...నిరంతర సత్యం

1, మే 2020, శుక్రవారం

పుచ్చలపల్లి సుందరయ్య

Puchchalapalli Sundarayya - My pencil sketch



జోహారు కామ్రేడ్ సుందరయ్యా ..పుచ్చలపల్లి సుందరయ్య జయంతి
ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన సుందరయ్య తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు. కులవ్యవస్థను నిరసించిన ఇతను అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి లోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడు. ఇతను నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపాడు. స్వాతంత్ర సమరంలోని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. తెలంగాణ ప్రజల పోరాటం - దాని పాఠాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు, నివేదికలు రాశాడు. పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘ కాలం పనిచేశాడు, ఆ సమయంలో పార్లమెంటుకు కూడా సైకిల్ మీద వెళ్ళేవాడు.
(సుందరయ్య మరణవార్త తెలియగానే స్పందించి
ప్రముఖ కవి ఆరుద్ర రచించిన కవిత)
జోహరు కామ్రేడు సుందరయ్య
జోహరు కామ్రేడు సుందరయ్య
నీలాంటి త్యాగజీవు లెందరయ్యా
అగ్రగామిగా నీవే ఉందువయ్యా
అంధ్రలోన పార్టీకి తండ్రివయ్యా
ప్రజారాజ్య స్థాపన నీ ధ్యేయమయ్యా
జగతి శక్తికి నీవు స్నేహమయ్యా
శ్రమజీవులు నిన్నెప్పుడూ మరువరయ్యా
సామ్యవాద సిద్ధాంతము విడువమయ్యా
నింగిలోన మన జెండా ఎగురునయ్యా
నేలమీద సమవృక్షం పెరుగునయ్యా
కలకాలం నీ బోధనలు తలతుమయ్యా
కన్నీటి వీడ్కోలు అందవయ్యా
(సేకరణ : ఇక్కడా అక్కడా)

అమ్మకే అమ్మ అమ్మమ్మ

 ​ అమ్మకే అమ్మ అమ్మమ్మ (pen sketch) ఆ గుండె చప్పుడు వింటూ ఒదిగిపోతా, నీ దీవెనల నీడలో పెరిగి పెద్దవుతా. తరాలు దాటిన మన ప్రేమానుబంధం, ఈ సృష్టి...