6, మే 2021, గురువారం

పిఠాపురం నాగేశ్వరరావు


 My pencil sketch of Pithapuram Nageswara Rao, an excellent singer of Telugu cinema


పుట్టిన ఊరు నే ఇంటి పేరుగా మార్చుకున్న పిఠాపురం (పాతర్లగడ్డ} నాగేశ్వరరావు జయంతి సందర్భంగా నా చిత్ర నివాళి.

తెలుగు సినిమా రంగంలో జంట గాయకులుగా పేరు తెచ్చుకున్న మాధవపెద్ది - పిఠాపురంను సంగీత ప్రియులు ఎప్పటికీ మరువలేరు. తెలుగు సినీ స్వర్ణ యుగంలో హాస్య పాత్రధారులకూ హాయిని గొల్పే పాటలను రచయితలు రాసేవారు, దర్శకులు చిత్రీకరించే వారు. మరి వారి హావభావాలకు తగ్గట్టుగా పాటలు పాడే గాయనీ గాయకులూ ఎంతోమంది అలనాడు చిత్రసీమలో ఉన్నారు. ఆ కోవలే హాస్య గీతాల గాయనీ గాయకులుగా మాధవపెద్ది - పిఠాపురం పేరు తెచ్చుకున్నారు. బాల్యంలోనే తండ్రి ప్రోత్సాహంతో నటన పట్ల ఆకర్షితులైనా, స్టేజ్ మీద పాడలేని వారికి నేపథ్యం గానం అందించే అలవాటు యుక్తవయసులోనే ఆయనకు అబ్బింది. అదే ఆ తర్వాత ఆయనకు జీవనోపాధిగా మారిపోయింది. 1946లో 'మంగళసూత్రం' సినిమాతో ఆయన నేపథ్య గాయకునిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. పదహారేళ్ళ ప్రాయంలోనే 'చంద్రలేఖ' చిత్రంలో పాట పాడే అవకాశం రావడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. వివిధ భాషలలో వేలాది పాటలను పిఠాపురం పాడారు. ఘంటసాలతో కలిసి 'అవేకళ్ళు' చిత్రంలో పాడిన 'మా ఊళ్ళో ఒక పడుచుకుంది', మాధవపెద్ది తో కలిసి 'కులగోత్రాలు' కోసం పాడిన 'అయ్యయ్యో... జేబులో డబ్బులు పోయెనే' ఇంకా 'వెంకటేశ్వర మహత్యం' చిత్రం లో 'పదవే పోదాము గౌరీ పరమేశ్వరుని చూడ..' వంటి పాటలు పిఠాపురానికి మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. వీరు మంచి రంగస్థల నటుడు కూడా. చివరగా 1978లో 'బొమ్మరిల్లు' సినిమాలో ఓ పాట పాడారు. పిఠాపురం నాగేశ్వరరావు 1996 మార్చి 5న కన్నుమూశారు. అయితే తెలుగు సినిమా పాట ఉన్నంత కాలం ఆయన సంగీత ప్రియుల గుండెల్లో చిరంజీవి! (సేకరణ : ఇక్కడా అక్కడా)

facebook లో ఈ పోస్ట్ చూసిన మిత్రులు శ్రీ సాయి గణేష్ పురాణం గారు నాకు తెలియని విషయాలు కొన్ని తెలియజేశారు. వారి నా పోస్ట్ కి ఇచ్చిన వ్యాఖ్య ని క్రిందన యథాతధంగా పొందుపరుస్తున్నాను. వారికి నా ధన్యవాదాలు:


"విజయనగరం పనిమీద వెళ్ళినప్పుడు తప్పకుండా సుశీలమ్మ నాన్నగార్ని కలిసేవారు పిఠాపురం. సుశీలమ్మ టాలెంట్ ను గమనించి పెండ్యాలకు చెప్పేరు. పెండ్యాల నాకు ఆ అమ్మాయి తెలుసు పాడిద్దాం అని చెప్పి సుశీలమ్మకు కన్నతల్లి సినిమాలో పాడించాడు. ఆ తరువాత జరిగింది చరిత్రే. అందుకే ఈరోజుకీ సుశీలమ్మ పిఠాపురం కుటుంబం అంటే ఎంతో ఆప్యాయంగా ఉంటుంది.
అలాగే ఉమాసుందరి సినిమాలో మాష్టారితో పాడిన పాట "నమ్మకురా ఇల్లాలు పిల్లలు" పాటకి మాష్టారు ముగ్ధులైపోయారు. ఎంతగానో పిఠాపురంను అభినందించారు."

4, మే 2021, మంగళవారం

అమ్మే తొలి దైవంగా కీర్తించే ఘనతమనది! - తెలుగు గజల్


 అమ్మే తొలి దైవంగా కీర్తించే ఘనతమనది!

అమ్మాఅని మొదటిపదం పలికించే ఘనతమనది!
అమ్ముంటే చాలుకదా అమ్మలేని డబ్బువృధా!
పరస్త్రీని తల్లివలే మన్నించే ఘనతమనది!
జగత్తునే కాపాడే మమతున్నది అమ్మలో
అమ్మతనం ఎచటున్నా పూజించే ఘనతమనది !
మాతృభూమి లో అమ్మను చూచుకునే హృదయాలివి
మాతుఝేసలామంటూ నినదించే ఘనతమనది !
అమ్మచేయి పట్టుకునే అడుగులేసి ఎదుగుతాము
గుండెల్లో అమ్మబొమ్మ చిత్రించే ఘనత మనది !
కానీ...... ...... .......
అమ్మకేది ఒక్కసెలవ ! పనిచేసే యంత్రమైంది.
కవితల్లో మాత్రమిలా రచియించే ఘనత మనది.
కడుపుబరువు మోసినట్లు కాడిమోయ గలదు వనిత
అది తెలిసీ వంటింటికి బంధించే ఘనత మనది !
నాగరికుల మంటూనే నారిని అణిచేస్తున్నాం
అమ్మపాత్ర నాటకాన తగ్గించే ఘనత మనది!
బొమ్మలు చెక్కే శిల్పిని శిల్పంగా మార్చేసాం
అమ్మలకై ఒకరోజును ప్రకటించే ఘనతమనది!
~~~~~~~~~~~~
గజల్ సౌజన్యం డా. ఉమాదేవి జంధ్యాల

2, మే 2021, ఆదివారం

పుస్తక పఠనం

 



మరుగునపడ్డ ఓ అలనాటి బాపు గారి నలుపు తెలుపుల రేఖా చిత్రాన్ని, నేను నా రేఖలు రంగుల్లో మళ్ళీ చిత్రీకరించాను. నా సేకరణలో శిధిలావస్థలో ఉన్న బాపు గారి కొన్ని చిత్రాల్ని పునరుధ్ధరించాలనే నా తపన కి మిత్రుల సహకారం, స్పందన నాకు కొండంత బలాన్ని ఇస్తుంది.


ఈ చిత్రానికి facebook లో వచ్చిన పద్య స్పందన ఇక్కడ పొందుపరుస్తున్నాను. ధన్యవాదాలు.


శ్రీమతి పద్మజ మంత్రాల గారి పద్యం

కందము

తీరైన వంపు సొంపులు

బారెడు జడ గలిగినట్టి భామ సొగసుగా...
చేరిచి చెంపకు కరమును
బోరగిలి పఠించుచుండె పొత్తము నౌరా!
(పొత్తము=పుస్తకము

-------------------------------------------------------------------------------------------

శ్రీ వేంకటేశ్వర రావు గారు రచించిన పద్యం:

ఆటవెలది -

చదువు కొనిన యువతి సంస్కారి యౌచును
చక్కదీర్చు నిల్లు నిక్కముగను
విలువ నెరిగి నిత్య విదార్ధి యై తాను
చదివి చదువు జెప్పు సంతతి కిని

-- సేకరణ : పొన్నాడ మూర్తి


1, మే 2021, శనివారం

అన్నమయ్య జననం




 (నా దగ్గర ఉన్న కొన్ని అరుదైన బాపు గారి చిత్రాల్ని రంగుల్లో చిత్రీకరించదలిచాను. అందులో భాగంగా అన్నమయ్య, అన్నమయ్య కీర్తనలకు సంబంధించిన చిత్రాలు వేయ సాహసిస్తున్నాను. మిత్రుల ప్రోత్సాహం నాకు కొండంత బలాన్ని ఇస్తుంది.)

సంతానంలేక తీవ్ర వ్యధకు గురైన భాగవతసేవా పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రణామం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాథ. కొండలయ్య తాను ధరించే "బిరుదు గజ్జియల ముప్పిడి కఠారాన్ని" వారికందజేశాడట. అలా పుట్టిన శిశువే అన్నమయ్య.

పుస్తకమా నీకు జోహార్లు


పుస్తకమా నీకు జోహారులు ! (రచన : సౌజన్యం : శ్రీ పొన్నాడ ఉమామహేశ్వరరావు)
చిత్రం నేను వేసినదే .. !

"తల్లీ నిన్ను దలంచి పుస్తకమున్ చేతన్ బట్టితిన్ " అని చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకున్న పద్యం. పుస్తకం చేత పట్టడమే చదువుల తల్లికి పూజా పుష్పం సమర్పించడంతో సమానం.

విషయ వస్తువు ఏదైనా సరే, పుస్తకం పట్టుకుంటే చాలు, మస్తకం పరుగులు తీస్తుంది. పుస్తకాలు నవ్విస్తాయి, కవ్విస్తాయి, ఏడిపిస్తాయి, ఓదారుస్తాయి. ఒకప్పుడు, అంటే. టీవీలు, ఇంటర్నెట్ అందుబాటులో లేని రోజుల్లో, పుస్తకాలే ప్రజలకి మిత్రులు. కాలక్షేప సాధనాలు. స్వంతంగా పుస్తకాలు కొనుక్కోలేని వారికి పుస్తకాలు అద్దెకి తెచ్చుకొని చదువుకొనే సౌలభ్యం ఆ రోజుల్లో ఉండేది. ఆ రోజుల్లో విరివిరిగా వచ్చిన కొమ్మూరి సాంబశివ రావు, టెంపోరావు, భగవాన్ మొదలైన వారి అపరాధ పరిశొధన నవలలు అద్దెకు తెచ్చుకొని కాలేజీ కుర్ర కారు విపరీతంగా చదివే వారు.

పుస్తక పఠనం పట్ల ప్రజలకి ఆసక్తి తగ్గిపోయింది అనడం నిజం కాదు. మాధ్యమం మారిందేమో గాని, పఠనాసక్తి గల చదువరుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కంప్యూటర్ తెరలు, ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు ఈ మ్యాగజైన్లు, ఈ బుక్స్, .. ఇలా ఈ నాటి తరం ఎదో రకంగా చదువుతూనే ఉన్నారు.

ఎన్నిప్రత్యామ్నాయాలు వచ్చినా పుస్తకం పుస్తకమే. హాయిగా వాలుకుర్చీలో కాళ్ళు జాపుకొని కూర్చునో, మంచంమీద వ్రాలో, పుస్తకం చదువుకోవడం ఎంత ఆనందదాయకం? చదువుతూ, చదువుతూ, పుస్తకాన్ని గుండెల మీద పెట్టుకొని ఓ చిన్న కునుకు కూడా తీయవచ్చు. ల్యాప్ టాప్లు, ట్యాబ్లెట్లతో ఈ సౌకర్యం చచ్చినా రాదు కదా?

ఇంటికి ఎవరైనా అతిధులు వస్తే, చదువుతున్న పుస్తకం మూసి పక్కన పెట్టి, వచ్చిన వాళ్ళు వెళ్ళి పోయాక తిరిగి చదువుకునే సౌకర్యం ఒక్క పుస్తకానికే ఉంది. అదే ఏ టీవీ చూస్తున్నప్పుడో అతిధులు వస్తే, చూస్తున్న టవీని కట్టెయ్యలేక, వచ్చిన వారిని పొమ్మనలేక ముళ్ళమీద కూర్చున్నట్టు కూర్చోవడం ఎంత ఇబ్బంది?

కొన్నిపుస్తకాలు తట్టి లేపుతాయి. కొన్ని జోకొట్టి నిద్రపుచ్చుతాయి! కొంతమందికి పుస్తకాలు అత్యంత విలువైన ఆస్తి. కొత్తగా కొన్న పుస్తకానికి అట్టవేసి, దాని మీద పేరు వ్రాసి, కొత్త పేళ్ళికూతురిలా ముస్తాబు చేసి మురిసి పోతారు కొందరు. పుస్తకం విలువ తెలియని వాళ్ళు పాత దిన పత్రికలు, చిత్తుకాగితాలతో పాటు పుస్తకాలని అమ్ముకుంటారు.

"చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కాని ఓ మంచి పుస్తకం కొనుక్కో " అని వీరేశ లింగం గారి ఉవాచ. "పుస్తకమే సమస్తమనే చాదస్తపు యువకులు" ఉంటారని సి.నా.రె గారు ఒక సినిమా పాటలో ప్రస్తావించారు.

ఎక్కువగా చదివే వారిని "పుస్తకాల పురుగు" అనడం నిందా స్తుతి!.
కొంత మంది అదే పనిగా పుస్తకాలు కొంటూనే ఉంటారు. చదివినా, చదవకా పోయినా, పుస్తకాలు కొని ఇంట్లో పెట్టుకోక పోతే వీరికి నిద్ర పట్టదు. కొంత మంది అదే పనిగా పుస్తకాలు చదువుతూనే ఉంటారు. రోజు ఏదో ఒక పుస్తకం చదవక పోతే ఉండలేరు. రోజూ రాత్రి పడుకొనే ముందు నాలుగైదు పేజీలు చదివితే గాని నిద్ర పోలేని వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారు.
మాటలు రాని పుస్తకాలకి భాష ఉంటుంది.. ఎన్ని కబురులో, ఎన్ని ఊసులో ఎంత విఙ్నానమో, ఎంత ఉల్లాసమో వాటి ద్వారా మనకి అందుతూనే ఉంటాయి. అందుకే దాశరధి గారు "మూగ పుస్తకాలలోని రాగాలని పాడుకో" అన్నారు ఒక పాటలో!

స్వర్గీయ గాడిచర్ల హరిసర్వోత్తమ రావు లాంటి మహాను భావులు మొదలు పెట్టిన గ్రంధాలయ ఉద్యమం ద్వారా తెలుగు నాట జిల్లా, తాలూకా స్థాయిలో అనేక గ్రంధాలయాలు వెలసి, తెలుగు వారిని పుస్తకాల ప్రియులను చేసాయి.. స్వంతంగా పుస్తకాలు కొనుక్కునే ఆర్థిక స్థోమత లేని వారికి ఈ గ్రంధాలయాలు చాలా ఉపయోగ పడేవి.

కొందరికి పుస్తకాలు చదవడం సత్కాలక్షేపం. మరి కొందరికి అది వ్యసనం. పుస్తకం పట్టుకుంటే ప్రపంచాన్ని మరచిపోయే వ్యక్తులు ఉంటారు. మా అమ్మమ్మ గారు ఒక సారి చారు కాచాలని తగరపు గిన్నెలో నీళ్ళు పోసి కుంపటి మీద పెట్టి ఓ పుస్తకం పట్టుకొని ప్రపంచాన్ని మరచి పోతే, గిన్నెలోని నీళ్ళన్నీ మరిగి ఇగిరిపోయి, చివరికి తగరపుగిన్నె కరిగి కుంపట్లో కలసిపోయినా ఆవిడకి తెలియలేదుట. పుస్తకం ఇచ్చే మత్తు అలాంటిది మరి!

మా చిన్నప్పుడు, జాషువా గారి ఖండ కావ్యాలు, కరుణశ్రీ, విశ్వనాధ వంటి మహనీయుల పుస్తకాలు రైల్వే స్టేషన్లలో హిగ్గిన్ బాదమ్స్ , ఏ.హెచ్ వీలర్ లాంటి బుక్ స్టాల్సులో దొరికేవి అంటే ఇప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది. అప్పటి ప్రజల అభిరుచి అలాంటిది.

ఈ రోజుల్లో ప్రతి వాడి చేతిలోనూ సెల్ ఫోనులు వచ్చాయి గాని, ఒకప్పుడు "పుస్తకమే హస్త భూషణం" గా ఉండేది. పుస్తకాలు యువతీ యువకులకి ప్రేమలేఖలని మోసుకెళ్ళే పల్లకీలుగా ఉపయోగ పడేవి. కొండొకచో ఆ ప్రయత్నాలు ఫలించి పెళ్ళీదాకా దారితీస్తే మరి కొన్ని సందర్భాలలో వికటించి విపరీత పరిణామాలకి దారి తీసేవి.

పుస్తకాలు సంబంధ బాంధవ్యాలని పెంచడమే కాదు, చెడగొడతాయి కూడా! అపురూపంగా కొనుక్కున పుస్తకం ఎవరైనా అడిగితే ఇచ్చారనుకోండి. దానిని తీసుకున్న వాళ్ళు , కావాలనో, మరిచిపోయో, తిరిగి ఇవ్వక పోతే, ఒక వేళ ఇచ్చినా, ఆ పుస్తకం నలిగిపోయో, చిరిగిపోయో వస్తే ఇక చూసుకోండి! బంధువులైనా, మిత్రులైనా వాళ్ళిద్దరూ మాటా మాటా అనుకొని, చెడా మడా తిట్టేసుకొని, మాట్లాడుకోవడం మానేసిన సందర్భాలు ఉంటాయి.

మహాకవి శ్రీశ్రీ కవితల సంపుటి "మూడు యాభైలు " మొదటి పేజీలో ఒకే ఒక వ్యాక్యం ఉంటుంది " "ఎవరు బ్రతికేరు మూడు యాభైలు" అని. పుస్తకం మూడు యాభైలు బ్రతుకుతుందని నర్మ గర్భంగా ఆ వాక్యం ద్వారా చెప్పేరు శ్రిశ్రి గారు. భాష, లిపి పుట్టిన ఎన్ని ఏళ్ళకి పుస్తకం పుట్టిందో తెలియదు గాని, తాళపత్రాల నుంచి అత్యంత ఆధునిక ముద్రణా రీతుల దాకా ఈ పుస్తకం ఎంత దూరం ప్రయాణించిందో! ఇంకా ఎంత దూరం ప్రయాణిస్తుందో!

కొస మెరుపు: ఇది నిజమో, కల్పితమో తెలియదు గాని, ఈ సంగతి ఎక్కడో చదివాను. ప్రముఖ రచయిత చలం గారి ఇంట్లో ఒకసారి దొంగలు పడ్డారుట. ఆ కబురు తెలిసిన మరో ప్రముఖ రచయిత, కవి, సంజీవ్ దేవ్ గారు చలం గారికి ఓ పోస్టు కార్డు మీద రెండు వాక్యాలు ఇలా వ్రాసారుట. "మీ ఇంట్లో దొంగలు పడ్డారని తెలిసి చాలా విచారించాను. ఇంతకీ పుస్తకాలేమీ పోలేదు కద?"
పుస్తకాలని సంపదగా భావించే మహానుభావులు ఎందరో? ఆందరికీ వందనాలు!

-పొన్నాడ ఉమామహేశ్వర రావు

29, ఏప్రిల్ 2021, గురువారం

ప్రముఖ చిత్రకారుడు, illustrator, cartoonist చంద్ర

Chandra, Artist - My pencil sketch



చంద్ర
 కుంచె పేరుతో ప్రఖ్యాతి గాంచిన చిత్రకారుడు, శిల్పి, కార్టూనిస్టు పూర్తిపేరు మైదం చంద్రశేఖర్. వీరు తెలంగాణలో వరంగల్ కి చెందిన వారు. Fine arts లో పట్టబధ్రుడు. వీరు కొన్ని వేల కధలకి చిత్రాలు వేశారు. ఎన్నో పుస్తకాలకు, పత్రికలకు ముఖచిత్రాలు వేశారు. వీరు మంచి వ్యంగ్య చిత్రకారులు కూడా.  వీరి మొదటి కార్టూన్ 1959 లో ఆంధ్రపత్రికలో ప్రచ్రించబడింది. వీరు కొన్ని సినిమాలకు, documentaries కి కళాదర్శకుడుగా పనిచేసారు. దర్శకత్వం కూడా వహించారు. 

1946,   ఆగస్టు 25 వ తేదీన వరంగల్ జిల్లా, నర్సింహుల పేట మండలం, పెదముప్పారం గ్రామంలొ జనించిన వీరు 2021 ఏప్రిల్ 29 న హైదరాబాద్ లో మృతి చెందారు.





చంద్ర గారు చిత్రించిన ఓ అద్భుత చిత్రం.  శ్రుంగార చిత్రాలు వెయ్యడంలో వీరిది అందెవేసిన చెయ్యి.


27, ఏప్రిల్ 2021, మంగళవారం

ఓ. పి. నయ్యర్ - అద్భుత సంగీత దర్శకుడు


 My pencil sketch of the legend

Living life on  one's own terms - అంటే ఎక్కడా రాజీపడకుండా తనకు నచ్చిన రీతిలో తాను నడుచుకుపోవడం అని నా భావం. ఆ కోవకు చెందినవాడే ఓపి నయ్యర్, ఓ అగ్రశ్రేణి సంగీత దర్శకుడు.


ఓపి నయ్యర సంగీతం అంటే నాకు చాలా చాలా ఇష్టం. వీరి గురించి ప్రఖ్యాత నటుడు, anchor,వ్యాఖ్యాత అను కపూర్ ద్వారా నాకు తెలిసిన విషయాలు తెలుసుకున్నాను. ఇటువంటి విషయాలు 'The Golden Era with Anu Kapoor' అనే కార్యక్రమం లో వీరు తెలియజేస్తుంటారు. ఈ కార్యక్రమం కొన్ని సంవత్సరాలుగా రాత్రి 9.00 గంటలకు 'మస్తీ' చానల్ లో ప్రసారమౌతొంది.


ఈ సూత్రానికి తగ్గట్టుగా తన జీవితాన్ని మలుచుకున్న వ్యక్తి ఓ.పి. నయ్యర్, ఎక్కడా రాజీ పడని ఓ అద్భుత సంగీత దర్శకుడు.


ఓ దశలో ఓపి నయ్యర్ సినీ సంగీతం యువ హృదయాలని ఉర్రూతలూగించింది.. దేశ వ్యాప్తంగా వీరి సినిమా సంగీతం అత్యంత ప్రజాదరణ పొందసాగింది. యువ హృదయాలను అంతలా ప్రభావితం చేస్తున్న సంగీతం, యువకులను తప్పుదోవ పట్టిస్తిందేమో అన్న భయంతో అప్పటి ఆకాశావాణి లో వీరు స్వరపరచిన పాటల్ని ban చేశారట. అయితే అవే పాటలు అప్పుడు అత్యంత ప్రజాదరణలో ఉన్న Radio Ceylone లో ప్రసారమయితే వాటికి సంగీతాభిమానులు నీరాజనం పట్టారు. ఇది తెలుసుకుని ఆకాశవాణి వారు తాము విధించిన ban ని ఉపసంహరించుకోవాల్సి వచ్చిందిట. That is OP Nayyar అనిపించుకున్నాడు.


అతని వ్యక్తిత్వాన్ని మరో సంఘటన. ఓసారి మధ్యప్రదేశ్ ప్రభుతం 'లతామంగేష్కర్ అవార్డ్'  ఇచ్చే పురస్కారానికి ఓపి నయ్యర్ ని ఎంపిక చేశారు. ఈ పురస్కారాన్ని ఓపి నయ్యర్ సున్నితంగా తిరస్కరించారు. కారణాలు   : ఒకటి - సంగీత దర్శకుడు ఎప్పుడూ గాయనీగాయకులకంటే ఓ మెట్టు పైనే ఉంటాడు. రెండు  - జీవించి ఉన్న వ్యక్తి పేరున పురస్కారం ఇవ్వడం సరైన పధ్ధతి కాదు, మూడు - తన సంగీత దర్శకత్వంలో లతా మంగేష్కర్ చేత ఎప్పుడూ పాడించలేదు.


వీరి సంగీతం అంటే ప్రఖ్యాత నటి, అందాలరాశి మధుబాల కి చాలా ఇష్టం. తను నటించే చిత్రాలకి ఓపి నయ్యర్ ని సంగీత దర్శకుడు గా పెట్టుకుంటే,  నటి గా తనకు రావల్సిన పారితోషకాన్ని కూడా తగ్గించుకుంటానని చెప్పేదట. 


Great OP Nayyar lived on his own terms అని చెప్పుకోవడానికి ఇంతకంటే ఏమి కావాలి?





నెల్లూరు నగరాజారావు - ప్రముఖ రంగస్థలం నటులు

  చిత్రీకరణ : పొన్నాడ మూర్తి ★★★★★★★★★★★★★★★  💥 తెలుగునాటకరంగ వైభవం💥          ★★★★★★★★★★★★★★★  ఈనాటి మన చిరస్మరణీయులు.. శ్రీ నెల్లూరు నగరా...