14, మార్చి 2018, బుధవారం

అన్నమయ్య - అన్నమాచార్య

ఈరోజు అన్నమయ్య వర్ధంతి. అన్నమయ్య 'అన్నమాచార్యుడు" అయిన ఉదంతం.
ఘన విష్ణువు అనే వైష్ణవ యతి తిరుమలలో ఉండేవాడు.అతదు మహా భాగవతుడు. మాధవసేవ చేస్తూ సాటి మానవులకు విష్ణుతత్వాన్ని బోధించేవాడు. తన శెష జీవితాన్ని శేషాద్ర నిలయునికే అంకితం చేసాడు. ఆ దినం ద్వాదశి. రాత్రి వేంకటపతి ఆ యతికి కలలో కనిపించి "తాళ్ళపాక అన్నమయ్య అనే భక్తుడు రేపు నీదగ్గరకి వస్తాడు. వాడు నల్లగా అందంగా ఉంటాడు. ఎప్పుడూ నామీద పాటలు పాడుతూఉంటాడు. వాని చెవిలో మద్దికాయలు వేలాడూతూ ఉంటాయి. పట్టుకు కుచ్చులున్న దండె భుజంమీద మోపి మీటుకుంటూ ఉంటాడు. వానికి నీవు ముద్రాధారణం చెయ్యి. ఇవిగో నా ముద్రికలు" అని ఆదేశించాడు.
మర్నాడు ఉదయాన్నే స్నాన సంధ్యాదులు ముగించుకుని ఘన విష్ణువు స్వామి మందిరంలో యజ్ఞశాల వద్ద నిల్చున్నాడు. అతని చేతిలో స్వామి సమర్పించిన శంఖచక్రాల ముద్రలున్నాయి. అన్నమయ్య పొద్దున్నే లేచి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి ని దర్శించుకున్నాడు. హరినామ సంకీర్తన చేసుకుంటూ యజ్ఞశాలముందుకి వచ్చాడు. ఘనవవిష్ణువు వానిలో స్వామి చెప్పిన గుర్తులను చూసి మెల్లగా ఆ బాలుని సమీపించాడు. "నాయనా నీ పేరేమి?" అన్నమయ్య యతికి పాదాభివందనం చేసి "అన్నమయ్య" ప్రవర చెప్పాడు. యతి కళ్ళు ఆనందంతో మెరిసాయి. "నీకు ముద్రాధారణ చేస్తాను. సమ్మతమేనా..?" అని అడిగాడు. అన్నమయ్య యతి ముఖాన్ని చూసాడు. వేంకటేశ్వరుడే కనిపించాడు. "కృతార్ధుణ్ణి" అన్నాడు.
ఘన విష్ణువ వేదోక్తంగా అన్నమయ్యకు సంస్కారాలు నిర్వహించాడు. సాటి వైష్ణువులకు అన్ని విషయాలు తెలిపాడు. వాళ్ళు తృప్తిపడ్డారు. అప్పట్నించీ అన్నమయ్య అన్నమాచార్యుడయ్యాడు..

శ్రీమతి పొన్నాడ లక్ష్మి గారి facebook పోస్ట్ నుండి సేకరణ. చిత్రాలు నేను చిత్రించినవి.

కామెంట్‌లు లేవు:

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...