7, అక్టోబర్ 2021, గురువారం

Peketi Sivaram - పేకేటి శివరామ్ - బహుముఖ ప్రజ్ఞాశాలి


 
పేకేటి శివరాం -  My pencil sketch

ఈయన అక్టోబరు 8, 1918 తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పేకేరు గ్రామంలో జన్మించాడు. 1937లో మద్రాస్ వెళ్లి కొంతకాలం కెమెరా డిపార్ట్‌మెంటులో, 1945లో హెచ్‌ఎంవి గ్రామ్‌ఫోన్ రికార్డు సంస్థలో ఇన్‌ఛార్జిగా పనిచేశాడు. ఆ సమయంలో ఘంటసాలతో లలిత గీతాలు పాడించి ప్రైవేట్ రికార్డు చేశాడు. శ్రమజీవి అనే పత్రికకు కొంతకాలం ఆపద్ధర్మ సంపాదకుడిగా పనిచేశాడు. చిత్ర అనే సినిమా పత్రిక భాద్యతలు నిర్వహించాడు. బెంగళూరు నుండి వెలువడే సినిమా ఫ్లేమ్‌ అనే పత్రికకు మద్రాసు ప్రతినిధిగా పనిచేశాడు. భగవాన్ పేరుతో పద్దెనిమిది డిటెక్టివ్ నవలలు వ్రాశాడు. 


ప్రతిభా, వినోద నిర్మాణ సంస్థల్లో ప్రొడక్షన్ వ్యవహారాలు నిర్వహించే రోజుల్లో ‘శాంతి’ (1952) చిత్రంలో నటి సావిత్రి సరసన హాస్య నటుడిగా చిత్రరంగంలో ప్రవేశించి, 1953లో దేవదాసులో భగవాన్ పాత్రతో ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అప్పటినుంచి తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో హాస్య నటునిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 100కు పైగా చిత్రాల్లో నటించాడు. మద్రాసులో ఒకవిందులో మిత్రునితో సాగించిన సినీరంగం, నిర్మాణ కార్యక్రమాల విశే్లషణ వీరిని కన్నడ చిత్ర రంగానికి దర్శకునిగా, ‘చక్రతీర్థ’ కన్నడ నవల చిత్రరూపానికి సారథిని చేసింది. ఆ చిత్రానికి కేంద్ర ప్రభుత్వ అవార్డులు లభించాయి. తరువాత ఇతడు 1971 కన్నడంలో రూపొందించిన ‘కుల గౌరవం’ చిత్రం (రాజ్‌కుమార్, భారతి, జయంతిలతో), దాన్ని తెలుగులో యన్‌టిఆర్‌తో 1972లో నిర్మించిన కులగౌరవం చిత్రానికి ఇతడే దర్శకుడు కావటం విశేషం. శ్రీదేవి కంబైన్స్ 1968లో నిర్మించిన చుట్టరికాలు తరువాత, 1969లో అదే సంస్థ నిర్మించిన ‘భలే అబ్బాయిలు’కు దర్శకత్వం వహించాడు

ఇతనికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. కళా దర్శకుడు పేకేటి రంగా వీరి కుమారుడే. తమిళ నటుడు ప్రశాంత్ ఇతని మనుమడు.


డిసెంబర్ 30, 2006 న పేకేటి స్వరస్తులయ్యారు.


(సౌజన్యం : వికీపీడియా)



అమరగాయకుడు ఘంటసాలని తెలుగు పరిచయం చేసిన ఘనత పేకేటి శివరాం గారిదే. వివరాలు ఇవిగో చదవండి.

బెంగుళూరు సినీ పత్రికకు పనిచేస్తున్నప్పుడే పేకేటికి ‘హిస్ మాస్టర్స్ వాయిస్’ (హెచ్.ఎం.వి) గ్రామఫోను సంస్థలో తెలుగు విభాగం ఆర్కెస్ట్రా ఇన్ చార్జి గా ఉద్యోగం వచ్చింది. కష్టించే తత్వంగలవాడు కావడంతో పేకేటికి అందులో మంచి ఆదరణ లభించింది. అప్పట్లో అమరగాయకుడు ఘంటసాల సినిమాలలో పాటలు పాడేందుకు మద్రాసు వచ్చి ప్రయత్నాలు మొదలుపెట్టారు. సినిమా పాటల రికార్డింగు కోసం ఆరోజుల్లో హెచ్.ఎం.వి వారే తమ ఆర్కెస్ట్రా బృందాలను పంపుతుండేవారు. 1944లో ఘంటసాల సినిమాలో పాటలు పాడాలని మద్రాసు వచ్చి ప్రతిభా పిక్చర్స్ సంస్థ అధిపతి ఘంటసాల బలరామయ్య వద్ద చేరి ‘సీతారామజననం’ చిత్రంలో వేషాలు వేసేందుకు నెలజీతం మీద కుదురుకొని హెచ్.ఎం.వి లో రికార్డులు పాడాలని ప్రయత్నాలు సాగించారు. కానీ, లంకా కామేశ్వరరావు అనే అధికారి అతనికి ఆడిషన్ చేసి గొంతు మైకుకు పనికిరాదని పంపేయడం జరిగింది. కానీ ఆ కంఠం పేకేటికి నచ్చింది. ఘంటసాల కంఠాన్ని తిరస్కరించిన కామేశ్వరరావు సెలవులో వున్నప్పుడు పేకేటి ఘంటసాలను పిలిపించి “నగుమోమునకు నిశానాథ బింబము” అనే చాటు పద్యాన్ని, రతన్ రావు రచించిన “గాలిలో నాబ్రతుకు తేలిపోయినదోయి” అనే పాటను పాడించి రికార్డు చేసి విడుదల చేశారు. శివరాం అంచనాను నిజంచేస్తూ ఆ రికార్డు బాగా అమ్ముడుపోయింది. తన ప్రతిభను గుర్తించిన పేకేటికి ఘంటసాల ఎప్పుడూ కృతఙ్ఞతలు తెలియజేస్తూ వుండేవారు. పేకేటి మద్రాసు వదలి కొంతకాలం ఢిల్లీ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ లో కూడా పనిచేశారు. పండిత జవహర్లాల్ నెహ్రూ పాల్గొన్న రాజకీయ ప్రసంగాలను చిత్రీకరించే అవకాశం పేకేటికి దొరకడం ఆయన చేసుకున్న అదృష్టం!

వీరి గురించి మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్  క్లిక్ చేసి చదవగలరు.

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...