10, జనవరి 2021, ఆదివారం

సంగీత సష్ట కే.జే. ఏసుదాసు


 ఆకాశదేశాన ఆషాఢమాసాన
మెరిసేటి ఓ మేఘమా ...
విరహమో దాహమో విడలేని మోహమో 
వినిపించు నా చెలికి మేఘసందేశం..... 

ప్రముఖ గాయకుడు పద్మవిభూషణ్ శ్రీ కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్ గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేద్దాం ....

కే .జె. యేసుదాసు 1940 జనవరి 10న కేరళ లోని కొచ్చిలో ఓ క్యాథలిక్ కుటుంబానికి చెందిన అగస్టీన్ జోసెఫ్, ఎలిజిబెత్ జోసెఫ్ దంపతులకు జన్మించాడు. అతని తండ్రి మలయాళ శాస్త్రీయ సంగీత గాయకుడు, రంగస్థన నటుడు. అతనికి నటునిగా, భాగవతార్ గా ఆయనకు మంచి పేరుండేది. ఆయనకు మంచి ప్రతిభ ఉన్నా ఆర్థికంగా మాత్రం వెనుకబడి ఉండేవారు. యేసుదాసు తన ఐదుగురు పిల్లలలో పెద్దవాడు, అతని తరువాత ముగ్గురు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉన్నారు. తండ్రి ప్రభావంతో ఏసుదాసు కూడా చిన్నప్పటి నుంచి పాటలు పాడేవాడు. పదిహేడేళ్ళ వయసులో కర్ణాటక గాత్ర సంగీతంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచాడు. కొడుకులోని ప్రతిభను సానబెట్టడం కోసం తండ్రి అతన్ని తిరుపుణిత్తుర లోని ఆర్.ఎల్.వి. సంగీత కళాశాలలో చేర్చాడు. మొదట్లో ఒక క్రైస్తవుడు కర్ణాటక సంగీతం ఏమి నేర్చుకుంటాడని అతన్ని సహ విద్యార్థులు గేలి చేసేవారు. తర్వాత పట్టుదలగా చదివిన ఏసుదాసు ఆ కళాశాలలోనే ప్రథముడిగా నిలిచాడు. తరువాత అతను తిరువనంతపురంలోని స్వాతి తిరునాళ్ సంగీత కళాశాలలో ప్రముఖ సంగీత విద్వాంసులైన కె.ఆర్.కుమారస్వామి, సెమ్మంగుడు శ్రీనివాస అయ్యర్ ల వద్ద విద్యనభ్యసించాడు. కానీ ఆర్థిక పరిమితుల కారణంగా తన అధ్యయనాలను పూర్తి చేయలేకపోయాడు. అదే సమయంలో తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. తండ్రికి వైద్యం చేయించడం కోసం చిన్న చిన్న పనులు చేసేవాడు. కొద్ది కాలానికి ఆయన ఆసుపత్రిలోనే మరణించడంతో వీరి కుటుంబం మరింత కష్టాలపాలైంది.

కొంత కాలంపాటు అతను వేల్చూరి హరిహర సుబ్రహ్మణ్య అయ్యర్ వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. తరువాత చెంబాయ్ వైద్యనాథ భాగవతార్ వద్ద కూడా విద్యనభ్యసించాడు. అతను కొచ్చిన్ లోణి త్రిపురితురలో గల ఆర్.ఎల్.వి. సంగీత అకాడమీ వద్ద గానభూషణం కోర్సును పూర్తి చేసాడు. అతను శ్రీస్వాతితిరునాల్ మ్యూజిక్ అకాడమీలో కె.ఆర్.కుమారస్వామి అయ్యర్ వద్ద కూడా విద్యనభ్యసించాడు.

2011లో అతను నేపథ్యగాయకునిగా 50 సంవత్సరాలు పూర్తి చేసాడు. దర్శకుడు సేతు ఇయాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న "పార్త విళి పార్తబడి" చిత్రంలో అతను రెండు భిన్నమైన స్వరాలతో పాట పాడాడు. అతను, తనయుడు విజయ్‌ యేసుదాసు, మనవరాలు అమేయా ముగ్గురూ కలిసి ఒక పాట పాడారు.

1960లలో తల్లి, స్నేహితుల సలహా మేరకు సంగీతంలోనే ఆదాయం వెతుక్కోవడం కోసం చెన్నై వచ్చాడు. కాలినడకన తిరుగుతూ అవకాశాల కోసం ఎంతోమంది సంగీత దర్శకులను సంప్రదించాడు. ఆయన గొంతు సినిమా పాటలకు పనికిరాదని చాలామంది తిరస్కరించారు. కానీ ఆయన మాత్రం వేదికల మీద, కార్యక్రమాల్లో పాటలు పాడుతూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడు. 1961 నవంబరు 14 న కేరళ చిత్ర దర్శకుడు ఎ. కె. ఆంథోనీ ఆయనకు మొట్టమొదటిగా అవకాశం ఇచ్చాడు. యేసుదాసు పాటలలో మొదటి ప్రసిద్ధ పాట "జాతి భేదం మత ద్వేషం" (సంగీతం:ఎం.బి.శ్రీసివాసన్) 1961 నవంబరు 14న రికార్డు కాబడింది. అయినప్పటికీ అతని మొదటి పాట "అటెన్షన్ పెన్నె అటెన్షన్"ను మలయాళ సినిమాలో పాడాడు. అతను తన సినిమా నేపథ్యగాయకునిగా మలయాళ చిత్రం "కాలపదుకై" (1962) తో ప్రారంభించి, తమిళ, తెలుగు, కన్నడ మొదలైన చిత్రాలలో పాడాడు.

తర్వాత అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. మలయాళంలోనే కాక తెలుగులో కూడా అవకాశాలు వచ్చాయి. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి (అంతులేని కథ), చుక్కల్లే తోచావే (నిరీక్షణ), సృష్టికర్త ఒక బ్రహ్మ (అమ్మ రాజీనామా), ఆకాశ దేశాన (మేఘసందేశం) లాంటి అనేక విజయవంతమైన పాటలు పాడాడు.

కథానాయకుడు మోహన్ బాబు ఆయన సినిమాల్లో ఏసుదాసు చేత కనీసం ఒక్క పాటైనా పాడించుకునే వాడు. ఏసుదాసు పాడిన అయ్యప్ప పాటలు కూడా ఎంతో పేరు గాంచాయి. అయ్యప్పు పవళింపు కోసం ఆయన పాడిన హరివరాసనం పాట శబరిమలలో ఇప్పటికీ వినిపిస్తారు. మొదట్లో హిందూ భజనలు పాడుతున్నాడని కేరళకు చెందిన ఓ చర్చి వారు అతన్ని వెలివేసినా మళ్ళీ తమలో చేర్చుకున్నారు. ఈయన నటుడిగా కూడా నాలుగు సినిమాల్లో కనిపించాడు.

అతనికి సోవియట్ యూనియన్ లోని వివిధ నగరాలలో సంగీత కచేరీలు చేయడానికి సోవియట్ యూనియన్ ప్రభుత్వం నుండి ఆహ్వానం అందింది. అతను రష్యన్ పాటను రేడియో కజఖస్థాన్లో పాడాడు.

సలిల్, యేసుదాస్, ప్రేమ్‌ నాజిర్ ల త్రయం మలయాళ సినిమా పరిశ్రమలో 1970లలో ప్రవేశించారు.

1970లో అతను కేరళ సంగీత నాటక అకాడమీకి అతి పిన్న వయస్కునిగా నామినేట్ చేయబడ్డాడు.

దక్షిణ భారత సినిమాల్లో ఒక దశాబ్దం పాడిన తరువాత, 1970 ల ప్రారంభంలో యేసుదాస్‌కు బాలీవుడ్‌లో విరామం లభించింది. అతను పాడిన మొదటి హిందీ పాట "జై జవాన్ జై కిసాన్" (1971) చిత్రం కోసం, అయితే మొదటి విడుదలైన సినిమా "చోటీ సి బాత్", దీని ఫలితంగా అతను "జనేమాన్ జనేమాన్" వంటి పాటలకు ప్రాచుర్యం పొందాడు. అమితాబ్ బచ్చన్, అమోల్ పాలేకర్, జీతేంద్రతో సహా హిందీ సినిమాలోని పలువురు ప్రముఖ నటుల కోసం హిందీ పాటలు పాడాడు. రవీంద్ర జైన్, బప్పిలహరి, ఖయ్యాం, రాజ్‌కమల్, సలీల్ చౌదరితో సహా అనేకమంది సంగీత దర్శకుల కోసం మంచి హిందీ పాటలను పాడాడు.

యేసుదాస్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన హిందీ పాటలు రవీంద్రజైన్ సంగీతంతో 1976 చిత్రం "చిచ్చోర్"లో ఉన్నాయి.

1999 నవంబరు 14 న, పారిస్లో జరిగిన "మ్యూజిక్ ఫర్ పీస్" కార్యక్రమంలో "సంగీతం , శాంతిలో అత్యుత్తమ విజయాలు" కోసం యునెస్కో గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేసింది. కొత్త సహస్రాబ్ది ఉదయానికి గుర్తుగా నిర్వహించిన కచేరీలో హాజరైన వారిలో లియోనెల్ రిచీ, రే చార్లెస్, మోంట్సెరాట్ కాబల్లే, జుబిన్ మెహతా వంటి కళాకారులు ఉన్నారు.

2001 లో అతను సంస్కృత, లాటిన్, ఇంగ్లీష్ భాషలలో అహింసా ఆల్బమ్ కోసం పాటలను న్యూఏజ్, కర్ణాటక సంగీత శైలుల మిశ్రమంలో పాడాడు. మధ్యప్రాచ్యంలో తన సంగీత కచేరీలలో అతను కర్ణాటక శైలిలో అరబిక్ పాటలు పాడాడు. భారతీయ సంగీతాన్ని ప్రోత్సహిస్తూ విదేశాలలో తన ప్రదర్శనల ద్వారా భారతదేశానికి సాంస్కృతిక రాయబారిగా తరచూ పనిచేస్తున్నాడు.

2009 లో యేసుదాస్ 'మ్యూజిక్ ఫర్ పీస్' అనే నినాదంతో తిరువనంతపురంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సంగీత ప్రచారాన్ని ప్రారంభించాడు. 'శాంతి సంగీత యాత్ర' ప్రారంభించిన సందర్భంగా హేమంత్ కర్కరే భార్య కవిత కర్కరే, యేసుదాస్‌కు టార్చ్ అందజేశారు. సూర్య కృష్ణమూర్తి నిర్వహించిన 36 ఏళ్ల సూర్య సంగీత ఉత్సవంలో యేసుదాస్ 36 సార్లు ప్రదర్శన ఇచ్చాడు.

యేసుదాస్ పథనమిథిట్ట జిల్లాలోని మలపిళ్ళైకు చెందిన ఎం.కె.అబ్రహం చిన్న కుమార్తె అయిన ప్రభను వివాహం చేసుకున్నాడు. వారి వివాహం 1970 ఫిబ్రవరి 1న కొచ్చి లోని సంతా క్రూజ్ బసిల్లికా వద్ద జరిగింది. వారికి ముగ్గురు కుమారులు. వారు వినోద్, విజయ్, విశాల్. వారి రెండవ కుమారుడు విజయ్ యేసుదాస్ కూడా సంగీతకారుడు. అతను 2007, 2013 లలో కేరళ రాష్ట్ర ఫిలిం ఫేర్ పురస్కారాన్ని ఉత్తమ నేపథ్యగాయకునిగా పొందాడు. వీరు చెన్నై, కేరళలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఇతనికి అమెరికాలోని ఫ్లోరిడా, ఫ్లవర్ మౌండ్ లలోనూ ఎస్టేట్‌లు ఉన్నాయి. వ్యాపార లావాదేవీలకొరకు తరచూ అమెరికా సందర్శిస్తుంటాడు.

నారాయణ గురు ప్రతిపాదించిన ఒకే మతం, ఒకే కులం, ఒకే దేవుడు అన్న సిద్ధాంతాన్ని ఆయన గాఢంగా విశ్వసిస్తాడు. ఆయన చిన్నప్పటి నుంచీ తోటి వారితో అలాగే మెలిగే వాడు. సంగీతకారులలో కూడా అతను తన స్వంత కథానాయకులను కలిగి ఉన్నాడు. మహ్మద్ రఫీ, చెంబై వైద్యనాథ భగవతార్, బాలమురళి కృష్ణ లను అతను ఎక్కువగా ఆరాధిస్తాడు. జ్ఞానం, సంగీతం, కళల దేవత అయిన సరస్వతి దేవి కీర్తనలను పాడటానికి యేసుదాస్ తన పుట్టినరోజున కర్ణాటకలోని కొల్లూరు మూకాంబికా ఆలయాన్ని సందర్శిస్తుంటాడు. 2000 లో అతని 60 వ పుట్టినరోజున సంగీత ఉత్సవం ప్రారంభమైంది. ప్రతి జనవరిలో కొల్లూరు మూకాంబికా ఆలయంలో తొమ్మిది రోజుల సంగీత ఉత్సవం ప్రారంభమవుతుంది. 2010 జనవరి 10 ఆదివారం, కొల్లూరు శ్రీ మూకాంబికా ఆలయంలో తన 70 వ పుట్టినరోజు (సప్తతి) ను 'సంగీతార్థన' (శాస్త్రీయ భక్తి పాటలు) తో పాటు, 70 మంది గాయకులతో పాటు మూకాంబికా దేవత ముందు జరుపుకున్నాడు. సంగీతార్థనలో త్యాగరాజు కవితలలో "పంచరత్న గాయన" ఉన్నాయి. విద్యారంభ కార్యక్రమంలో కూడా అతను పాల్గొన్నాడు. ఆల్ ఇండియా రేడియో ప్రత్యేక సంగీతార్థనను కేరళ అంతటా ప్రసారం చేసింది. "హరివరాసనం" అనే హిట్ సాంగ్ తో సహా అయ్యప్పకు అంకితం చేసిన అనేక పాటలు యేసుదాస్ పాడాడు. 2002 లో, మరాద్ ఊచకోత సమయంలో, ప్రముఖ కవి సుగతకుమారితో కలిసి ఈ స్థలాన్ని సందర్శించి, హింసకు వ్యతిరేకంగా తరగతులు నిర్వహించాడు. జి. దేవరాజన్ స్వరపరచిన భక్తి పాటల సంగీత శైలి "హరివరాసనం"ను యేసుదాస్ పాడాడు. ఈ పాటను శబరిమల వద్ద ఆలయాన్ని మూసివేయడానికి ముందు పాడుతారు. అనేకమంది ప్రఖ్యాత గాయకులు ఈ పాటను విభిన్న పద్ధతులలో పాడినప్పటికీ, శబరిమల ప్రతిరోజూ హరివారణానం కోసం యేసుదాస్ స్వరాన్ని అధికారికంగా ఉపయోగిస్తున్నారు.

సంగీత సంస్థ 
1980 లో యేసుదాస్ త్రివేండ్రం వద్ద తరంగణి స్టూడియోను స్థాపించాడు. 1992 లో కార్యాలయం, స్టూడియోను తమిళనాడు రాజధాని చెన్నెకు తరలించాడు. ఈ సంస్థ 1998 లో యుఎస్‌లో విలీనం చేయబడింది. తరంగణీ స్టూడియో, తరంగణి రికార్డ్స్ కేరళలో రికార్డింగ్ కేంద్రంగా మారాయి. ఇది మొదటిసారిగా మలయాళ చలనచిత్ర పాటల ఆడియో స్టీరియోలో క్యాసెట్లను తెచ్చింది. చెన్నైలోని స్టూడియో 27 లో రికార్డ్ కంపెనీకి వాయిస్ మిక్సింగ్ స్టూడియో కూడా ఉంది. స్టూడియో ప్రపంచవ్యాప్తంగా యేసుదాసు చలనచిత్ర, భారతీయ శాస్త్రీయ సంగీత కచేరీలను ప్రదర్శిస్తుంది.

వివాదాలు 
గాంధీ జయంతి సందర్భంగా తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళలు జీన్స్ ధరించడం మన సంస్కృతి కాదని అన్నాడు. యేసుదాసు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తాయి.
"హరివరాసనం విశ్వమోహనం" పాటను మార్చేస్తామని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అంటున్నది. పాట మూలప్రతిలో ఉన్న కొన్ని పదాలు.. ముఖ్యంగా ప్రతి పాదంలో ఉండాల్సిన స్వామి అనే పదం జేసుదాసు పాడిన రికార్డులో లేవని బోర్డు నూతన అధ్యక్షుడు టీ పద్మకుమార్ తెలిపారు. హరివరాసనం అనే పదాన్ని జేసుదాసు సరిగా ఉచ్చరించలేదని చెప్పారు. కాబట్టి విస్మరించిన పదాలను చేర్చి అదే పాటను మళ్లీ జేసుదాసుతోనే పాడించి కొత్తగా రికార్డు చేయిస్తామని ఆయన ఇటీవల పేర్కొన్నారు.

పురస్కారాలు, బిరుదులు 
పద్మవిభూషణ్ :2017
పద్మభూషణ్  : 2002.
పద్మశ్రీ  : 1973.
అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు, 1989
కేరళ ప్రభుత్వ ఆస్థాన గాయకుడు
సంగీత నాటక అకాడమీ అవార్డు in 1992.
ఆస్థాన విద్వాన్ ఉడుపి, శృంగేరి,, రాఘవేంద్ర మఠాలు.
సంగీత సాగరము 1989.
సంగీత చక్రవర్తి 1988 పల్లవి నరసింహాచారి.
సంగీత రాజా 1974.
సంగీత రత్న పాండిచ్చేరి గవర్నర్ ఎం. ఎం. లఖేరా
స్వాతి రత్నము
సప్తగిరి సంగీత విద్వన్మణి (2002)
భక్తి సంగీత శిరోమణి (2002)
గాన గంధర్వ.
గీతాంజలి పురస్కారం నీలం సంజీవరెడ్డి చేతులమీదుగా.
కలైమామణి పురస్కారం తమిళనాడు రాష్ట్రప్రభుత్వం.
నేషనల్ సిటిజెన్ అవార్డు 1994.
కేరళ రత్న 2008 లో జైహింద్ టివి నుంచి
2000 లో డాక్టర్ పిన్నమనేని సీతాదేవి ఫౌండేషన్ పురస్కారం.
యునెస్కో వారి నుంచి అవుట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ మ్యూజిక్ అండ్ పీస్ పురస్కారం 1999.
భారత ప్రభుత్వం నుంచి ఏడు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడి పురస్కారం
కేరళ ప్రభుత్వం తరపున 24 సార్లు ఉత్తమ గాయకుడి పురస్కారం
కర్ణాటక ప్రభుత్వం నుంచి ఐదు సార్లు ఉత్తమ గాయకుడి పురస్కారం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆరు సార్లు ఉత్తమ గాయకుడి పురస్కారం
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి ఒకసారి ఉత్తమ గాయకుడి పురస్కారం

జాతీయ పురస్కారాలు 
ఏసుదాసు ఏడు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. ఇది ఇప్పటికీ ఓ రికార్డు.

సం ..చిత్రం.. భాష.. పాట
1972 అచనుమ్ బప్పయుమ్ మలయాళం మనుష్యన్ మాతంగలే
1973 గాయత్రి మలయాళం పద్మతీర్థమూ ఒనరు
1976 చిత్‌చోర్ హిందీ "గోరి తెరా గాఁవ్ బడా ప్యారా మైఁతో గయా మారా ఆకే యహాఁ రే"
1982 మేఘసందేశం తెలుగు "ఆకాశ దేశానా ఆషాఢ మాసానా మెరిసేటి ఓ మేఘమా"
1987 ఉన్నికలే ఒరు కథా పరయం మలయాళం ఉన్నికలే ఒరు కథా పరయం
1991 భారతం మలయాళం రామ కథా గాన లయం
1993 సోపానం మలయాళం సోపానం

నంది ఉత్తమ నేపథ్య గాయకుడు 
సం ..చిత్రం.. పాట
2006 గంగ "వెళ్ళిపోతున్నావా"
1990 అల్లుడుగారు (సినిమా) "ముద్దబంతి నవ్వులో"
1988 జీవన జ్యోతి 
1982 మేఘసందేశం "సిగలో" (వివరాలు courtesy శ్రీ మూర్తి మాచిరాజు Facebook లో)

కామెంట్‌లు లేవు:

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...