13, జనవరి 2021, బుధవారం

అంజలీ దేవి - Telugu actress 'Anjali Devi' (pencil sketch)


 ఆంజలీ దేవి (నా pencil sketch)

మిత్రులు డా. ప్రసాద్ కెవియస్ గారు నటీ నటుల గురించి సమగ్ర వివరాలు అందిస్తుంటారు. చాలామందికి తెలియని విషయాలు తెలియజేస్తుంటారు. ఆనాటి ప్రముఖ నటి అంజలీ దేవి గారి గురించి వారేం చెప్పారో చూద్దాం.


ఓ ప్రఖ్యాత నటుడు...అన్నమాట ఇది.

100 మార్కులు......నటన పరంగా పంచవలసివస్తే.....మహానటి సావిత్రి కి ఎన్ని ఇస్తారు?.....అంజలీదేవి గారికి...ఎన్ని ఇస్తారు?.....
అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు బదులుగా....
ఆ నటుడు అన్న మాట ఇది.
సావిత్రి గారికి 49 అండి.....అంజలీదేవి గారికి 51 అండి....అన్నాడాయన.
అదేమిటండి? అందరూ సావిత్రి ని మహానటి అని ఆకాశానికెత్తేస్తుంటే...మీరు అంజలీదేవి గారిని...ఓ మెట్టు పైనుంచారే! ఆశ్చర్యంగ ఉంది!....
అన్న ఆ యాంకర్ ప్రశ్నకు....
అవునండి...నటనలో చూస్తే సావిత్రి గారిదే పై చేయి అనవచ్చు. కానీ ఒక్కసారి...ఇద్దరి కెరీర్ పరికిస్తే....అంజలీదేవి గారి వర్సటైలిటీ అర్థం అవుతుంది.
చిత్రసీమలో వ్యాంప్ వేషాలతో ప్రవేశించి.....సాత్విక వేషాలకు...సతీమతల్లి పాత్రలకు ప్రాణం పోసి...తెలుగింటి సీతమ్మ అనిపించుకుని....నీరాజనాలందుకుని....
తిరిగి...తన ప్రక్కన హీరో వేషాలేసిన అక్కినేని, ఎన్.టి.ఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్....లాంటి హీరోలకు...వదిన, అక్క,....
చివరికి తల్లి పాత్రలు కూడా వేసి మెప్పించిన గొప్ప నటీ మణి.
మరొకరికి ఈ క్రెడిట్ ఉంటుందని అనుకోను.ఏదో ఒకటి రెండు మూవీస్ కాదు....సెకండ్ ఇన్నింగ్స్ అంటూ లేకుండా...
ఓ జీవనది లా సాగిపోయిందావిడ గారి నట జీవితం.
పైగా....ఎన్ని అవస్థలు పడ్డా నిర్మాత గా కూడా సక్సెస్ అయ్యారు అంజలీదేవి.
అందుకే....అంజలీదేవి గారికి 51 ఇచ్చాను. సావిత్రి గారికి 49...అన్నారాయన!
**********
వాంప్ వేషాలేసేవాళ్ళే...హీరోయిన్ వేషాలూ వేసేయగలరా!? అని డౌటనుమానమొచ్చేసింది!
ఏదీ....జయమాలిని నో....జ్యోతిలక్ష్మినో పెట్టి....సతీ సుమతో...సతీ సక్కుబాయో....తీసుండొచ్చుకదా! అయినా...ఏ వేషం వేసే వాళ్ళు...ఆ వేషం....అని బ్రాండ్ వేసేస్తారు!
రజనీకాంత్....రాఘవేంద్ర స్వామి వేషమేస్తే....ఎవరు చూశారు?!
అలాంటి బ్రాండింగ్ నుండి...తప్పించుకుని...
ఆల్ రౌండర్ అనిపించుకున్న ఘనాపాటి మన తెలుగింటి సీతమ్మ...కీ.శే. అంజలీ దేవి గారు.
***********
ఏం...ఎందుకని?....ఈ సిగ్గెందుకని!...
ఆలుమగల మధ్య నున్నది ఎవరికి తెలియదని!.......
సృష్టిలో ప్రతి జీవికి....ప్రకృతే నేర్పిస్తుంది. మనిషి ఒక్కడిని చూస్తేనే భలే వింతగా ఉంటుంది!
నాలుగు గోడల మధ్య ఏం జరుగుతుందో....అని......తలనెరిసిన ముసలివాడు కూడా...చూడాలనుకుంటాడు!
ఇక స్త్రీ ఒంపుసొంపుల ప్రదర్శన ఈ నాటిది కాదు!
కానీ ఈ మధ్య సినిమా మరీ వింత పోకడలు పోతోంది!
నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ & ప్రైం మూవీస్...లో స్ట్రీం అవుతున్న వెబ్ సీరీస్ & బాలీవుడ్ మూవీస్ కొన్ని చూస్తే....ఆ తరం వాళ్ళే కాదు! ఇప్పుడు కూడా కుటుంబ సభ్యులందరూ కలిసి చూడలేం!
న్యూడిటీ...ఊపులతో సహా చూపితే తప్ప పాపులారిటీ రాదనుకుంటే ఎలా?
ఈగలకు, దోమలకు, పక్షులకు & జంతువులకు కూడా తెలుసు....ఆడ - మగ మధ్య ఏం జరుగుతుందో అని!
మనిషికి మాత్రమే ఉన్న బలహీనత ఇది! అన్నీ తెలిసీ..... అదేదో....అపురూపంగా....అద్భుతంగా....ఆరాటంగా చూడటం!
************
1947 లో తెలుగు చిత్రసీమలో ఓ అందాలభామ తెరమీద....
తన హావభావ విన్యాసాలతో....మత్తుగొలిపే వలపు చూపులతో ప్రేక్షకులను సమ్మోహితురాలిని చేసింది...మోహిని వేషంలో.
చిత్రదర్శకులు...సి.పుల్లయ్య గారు...ఆ కాలంలోనే తొలి ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించారు.
అసలే క్రొత్తమ్మాయి! కంగారుపడిపోతున్న తనకు...ధైర్యం చెప్పి....
ముద్దు సన్నివేశాన్ని....ఏ యాంగిల్ లో చిత్రీకరిస్తారో వివరంగా చెప్పి...ఒప్పించారు. సీన్ అద్భుతంగా పండింది.
చిత్రం కూడా విజయ ఢంకా మ్రోగించింది. అదే 1947లో రిలీజ్ అయిన గొల్లభామ మూవీ.
అలా కేవలం గ్లామర్ డాల్ వేషాలకు....వ్యాంపిష్ వేషాలకు మాత్రమే పనికొస్తుందనుకున్నారు ఆవిడను!
అందుకే... బాలరాజు & మదాలస లలో అలాంటి పాత్రలనే పోషించారావిడ.
ఆవిడ గారే....అంజలీదేవి గా ప్రసిధ్ధి చెందిన అంజనీ కుమారి.
ఆ తరువాత 1949 లో కీలుగుర్రం లో అలాంటి వ్యాంపిష్ పాత్ర....మూవీకి కీలకమైన భువనసుందరి(భూతం పాత్ర) పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిందావిడ.
దాంతో ముద్ర వేసేశారు....వ్యాంప్ గా!
************
మొదట షూటింగ్ లో చూసినప్పుడు అక్కడ ఉన్నవారావిడను చూసి ఆశ్చర్యపోయారు!
వెతికి వెతికి...ఇంత పొట్టి అమ్మాయిని ఎక్కడ నుండి పట్టుకొచ్చాడురా మన పెద్దాయన. పైగా మోహిని వేషానికి!?..
ఇవి ఆవిడ మొట్ట మొదటి మూవీ..గొల్లభామ షూటింగ్ లో చుట్టుప్రక్కల జనం అనుకున్న మాటలు.
ఆ పెద్దాయన చిత్తజల్లు పుల్లయ్య గారు.సినిమా పులి...నాన్న గారు..ఇలా ఎన్నో బిరుదులుండేవి వారికి.
ఆ అన్న వాళ్ళకేం తెలుసు ఆవిడ అప్పటికే...కాకినాడ యంగ్ మెన్స్ హాపీ క్లబ్ మెంబరని...
థియేటర్లో ఎన్నో నాటకాలు...ఎస్.వి.ఆర్, రేలంగి, సూర్యకాంతం ఇత్యాది నటులతో కలిసి నటించారని!
ఆ క్లబ్ లోనే పరిచయమైన ఆదినారాయణరావు గారిని పెళ్ళాడి.. బిడ్డ ను కని..పెంచుతున్న తల్లి అని!
ఆదినారాయణ రావు గారికి అప్పటికే పెళ్ళై పిల్లలున్నా....
అంజలీదేవి ఆయన్నే....వివాహం చేసుకున్నారు!
ఇలా నటీ మణులు....రెండవ పెళ్ళి వారినే ఎక్కువగా చేసుకుంటారెందుకని!
బాలీవుడ్ యాక్టర్ శత్రుఘన్ ను అడిగితే....ఏముంది!....ఏ ఉద్యోగానికైనా పూర్వానుభవం అడుగుతారు కదా! ఇదీ అంతే....అని చమత్కరించాడు.
వారి భవిష్యత్తు కు భరోసా ఉంటే....ఎవరినైనా పెళ్ళాడుతారు.
దేనికైనా కావలసింది నమ్మకం. అంతే!
*************
చిన్న చిన్న విషయాలకే డిప్రెషన్ కు లోనవుతుంటారు....ఈ తరం తారలు కొందరు.
కానీ 1949 లోనే....ఇక అంజలీదేవి పని అయిపోయింది. ఆమె తెర జీవితం ముగిసినట్లే....అని అనుకున్నారు అందరూ.
దానికి కారణం ఓ అగ్ని ప్రమాదం.
1949 లో గొల్లభామ నే తమిళం లో మంగయార్ కరసి అని తీస్తూ....మోహిని రోల్ మళ్ళీ అంజలీదేవి కే ఇచ్చారు.
ఓ సన్నివేశంలో అగ్ని కీలలు దహిస్తున్నట్లు చూపాల్సొచ్చింది.
వెలుగుతున్న కాగడాల మీద....నోటిలో పుక్కిట పట్టి....కిరోసిన్ ను జూనియర్ ఆర్టిస్టులు కొందరు....వాటిపై వేగంగా విరజిమ్ముతారు నోటినుండి.
టైమింగ్ సరిగా లేక....అంజలీదేవి సీన్లో కాగడాకు....అతి దగ్గరగా ఉండగానే....ముఖం మీదకు మంటలు ఎగిసేలా రావడం తో....ముఖం కాలి....స్పృహ తప్పి పడి పోయారు.
హాస్పిటల్ లో 3 నెలలున్నాక.....కోలుకుని మళ్ళీ నటించడం....కేవలం దైవకృపగా చెప్పేవారు ఆవిడ!
************
1950లో వచ్చింది బ్రేక్...శ్రీలక్ష్మమ్మ కథ రూపంలో.
శోభనాచలా వారితో పోటీగా ప్రతిభా ఘంటసాల బలరామయ్య గారు అదే కథ తో నిర్మించారు.
అబ్బే...వాంప్ వేషాలేసుకునే ఆవిడకు పతివ్రత వేషమా!..ఆడినట్లే! అనుకున్నారు.
కృష్ణవేణి గారి లక్ష్మమ్మ కు లాభాలొచ్చాయి.
శ్రీ లక్ష్మమ్మ కథ తో తెలుగుతెరకు క్రొత్త నాయిక దొరికింది అంజలీ దేవి రూపంలో.
పల్లెటూరిపిల్ల, స్వప్నసుందరి, మాయారంభ, నిర్దోషి, సర్వాధికారి, మాయలమారి, స్త్రీ సాహసం (1951)...
టాప్ పొజిషన్ నాయిక గా మారిపోయింది.
నాట్యం పెద్దగా రాదు.అని కొందరి ఆక్షేపణ.
అయితే ఏం...ఆ ముఖారవిందం లో పలికే హావ భావాలు....నటన అద్భుతం అనేవారు మరికొందరు.
ఎవరేమన్నా....1953 వచ్చేటప్పటికి హిందీ రంగంలో లడ్కీ అనే మూవీ కూడా చేసింది.
***********
అప్పట్లో కన్నాంబ, కృష్ణవేణి, భానుమతి,ఎస్. వరలక్ష్మి, షావుకారు జానకి వంటి నటీమణలే కాక....
ఆ తరువాత వచ్చిన....సావిత్రి, కృష్ణ కుమారి, జమున...లాంటి తారలు మరో ప్రక్క దూసుకొస్తున్నా....
తనకంటూ....ఓ ప్రత్యేకబాణీని...పరిపూర్ణ శైలిని సంతరించుకుని....తన స్థానం సుస్థిరం చేసుకున్న ఉత్తమ నటీమణి శ్రీమతి. అంజలీదేవి.
ప్రాథాన్యత ఉంటే చాలు. ప్రక్కన హీరో ఎవరు?....అనికూడా ఆలోచించేవారు కారు!
నిర్ధోషి(1951) లో ముక్కామలకు....ప్రక్కింటి అమ్మాయి(1953) లో రేలంగి కి జోడీగా నటించి.....విజయం సాధించారు.
అన్ని భాషలలో కలిపి షుమారు 450 పైచిలుకు సినిమాలలో నటించారు.
నిర్మాతగా....భర్త ఆదినారాయణరావు గారి సహకారంతో...అన్ని భాషలలో కలిపి 27 సినిమాలు నిర్మించారు.
************
మైలురాయి గా నిలిచిన పాత్ర లవకుశ లోని సీతాదేవి. తెలుగు వారి సీతమ్మ గా అంజలీదేవి పేరు మారుమ్రోగిపోయింది.
ఎక్కడకెళ్ళినా...ఎంతో ఆరాధనతో...సీతమ్మవారిలాగే భావించేవారు ప్రజలు.
ఆస్తి పన్ను వ్యవహారంలో చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారు!
తనను తాను మలచుకుని......
తనతో హీరోలుగా నటించిన ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్ లకు కూడా తల్లి, వదిన లాంటి పాత్రలు ధరించి మెప్పించిన ఘనత అంజలీదేవిది!
వారు నటించిన చివరి చిత్రం పోలీసు అల్లుడు(1994).
*************
కరుణా మూర్తిగా ఎన్నో పాత్రలను అద్భుతంగా పోషించిన అంజలీదేవి గారు....నిజ జీవితంలో కూడా...అందరితో ఎంతో ఆప్యాయతతో ఉండేవారు.
చిత్ర రంగంలో పతనమైపోతున్న విలువల గురించి...ఆవేదన వ్యక్తం చేసేవారట.
నిర్మాత కె.మురారి గారు....తన ఆత్మకథలో వ్రాసుకున్న సంఘటన ఒకటి ఇక్కడ చెప్పాలి.
అవి... కళ్యాణ మంటపం...షూటింగ్ జరుగుతున్న రోజులు. కె.మురారి గారప్పుడు....విక్టరీ. మధుసూధనరావు గారికి అసిస్టెంట్ డైరెక్టర్.
సెట్లో పైనుండి....ఓ పెద్ద లైట్ క్రింద నుంచున్న మురారి గారిమీద పడింది. రక్తం కారుతుంటే....
సీన్లో నటిస్తున్న అంజలీదేవి గారు...పరుగున వచ్చి...మేకప్ బాక్స్ లోని ఐస్ ముక్క తీసి....చీర చెరగులో పెట్టి...తల మీద తగిలిన గాయం మీద అద్దుతూ....
అబ్బా ఎంత పెద్ద తగిలింది నాయనా....అంటూ....బాధ పడుతుంటే....దర్శకుడు మధుసూధనరావు గారు...ఉన్న చోటే ఉండి....
అబ్బా...చీరచెరగంతా తడిచి పోయింది. కంటిన్యుటీ దెబ్బతింటుందే!......అంటూ విసుక్కున్నారట!
ఎవరి బాధ వారిది! కొన్ని సంఘటనలు....వ్యక్తుల నిజరూపాలను బహిర్గతం చేస్తాయి. అంతే.
************
అవార్డుల విషయానికోస్తే....4 ఫిల్మ్ అవార్డులు(అనార్కలి, సువర్ణసుందరి, చెంచులక్ష్మి & జయభేరి),...
రఘుపతి వెంకయ్య అవార్డ్- 1994,
నాగార్జున యూనివర్సిటీ - డాక్టరేట్
&
ఎ.ఎన్.ఆర్. నేషనల్ అవార్డ్- 2008....ముఖ్యమైనవి.
వ్యక్తిగతమే అయినా పేర్కొనాలి....పుట్టపర్తి సత్యసాయి బాబా వారికి...షిర్దీ సాయిబాబా గారికి...భక్తురాలు కావడమేకాదు!
కోట్ల ఖరీదు చేసే ఎకరాల స్థలాన్ని...సాయిబాబా మందిరానికి విరాళం గా ఇచ్చారావిడ చెన్నై లో.
షిర్దీ సాయి - పర్తిసాయి - దివ్యకథ.....అనే... టెలీ ఫిల్మ్ నిర్మించి...
ఇద్దరు బాబాలకు తల్లి పాత్ర పోషించారు అంజలీదేవి.
ఇది ప్రపంచంలో ఎన్నో భాషలలో అనువదింపబడింది. బాబా భక్తిలో ఓ అనిర్వచనీయమైన ఆనందం...మనశ్శాంతి పొందేవారని....ఆవిడ గారే చెప్పేవారు.
నటీమణి గా..నిర్మాత గా...ఇల్లాలు గా...తల్లిగా...పరిపూర్ణ జీవితం గడిపిన అంజలీ దేవి 13 జనవరి 2014లో స్వర్గస్తులయ్యారు.

కామెంట్‌లు లేవు:

బి. గోపాలం - సంగీత దర్శకుడు, , నటుడు

బి గోపాలం - సంగీత దర్శకుడు గాయకుడు నటుడు  (my charcoal pencil sketch)  Facebook మిత్రులు వీర నరసింహారాజు గారి వాల్ నుండి సేకరణ యధాతధంగా. వార...